సాంస్కృతిక హింసపై సమరం ఇది!

ద్రావిడ భాషలు అంటే కేవలం మైదాన ప్రాంతాలలో మెజార్టీ ప్రజలు మాట్లాడుతున్న తెలుగు, కన్నడం, తమిళం, మలయాలమే కాదు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలోని గిరిజనుల భాష, సంస్కృతులు కూడా ద్రావిడ సాహిత్యంలోనివే కదా. విలువైన ఖనిజ వనరులను ఆయా ప్రాంతాలనుండి తవ్వుకోవడానికి మల్టీ నేషన్ కంపనీలు, స్వదేశీ పెత్తందార్లు ప్రయత్నాలు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం

     ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కర్నూలులో ఫిబ్రవరి 7,8 తేదీలలో నిర్వహించబోయే “ద్రావిడ సమాజ సాహిత్యాలు” అనే రెండు రోజుల సదస్సు ద్రావిడ బాషల విషయంలో ఒక ముఖ్యమైన మేధోపరమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. ద్రావిడ భాషలు, సంస్కృతి, సాహిత్యాల మధ్య ఉన్న చారిత్రక సారూప్యతలను గుర్తించడం ద్వారా వర్తమానంలో ఐక్యతకు అవకాశాలు అన్వేషించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. అలాగే ప్రభుత్వ భాషా విధానాలు బహుళజాతి భాషల స్వయం ప్రతిపత్తిపై కలిగిస్తున్న ప్రభావాన్ని విశ్లేషించి, ప్రతిఘటన మార్గాలపై చర్చకు తావివ్వడం కూడా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా ప్ర.ర.వే పేర్కొంది.

వర్తమాన భారతదేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ద్రావిడ భాషల మనుగడకు సంబందించిన చర్యలు ఏవైనా అవి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంటాయి. ద్రావిడ భాషలు అంటే కేవలం మైదాన ప్రాంతాలలో మెజార్టీ ప్రజలు మాట్లాడుతున్న తెలుగు, కన్నడం, తమిళం, మలయాలమే కాదు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలోని గిరిజనుల భాష, సంస్కృతులు కూడా ద్రావిడ సాహిత్యంలోనివే కదా. విలువైన ఖనిజ వనరులను ఆయా ప్రాంతాలనుండి తవ్వుకోవడానికి మల్టీ నేషన్ కంపనీలు, స్వదేశీ పెత్తందార్లు ప్రయత్నాలు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రాంతాలలోని గిరిజనులను అక్కడనుండి తరిమి వేయడం వలన అక్కడి బౌగోళిక విషయాలతో అంతర్భాగంగా ఉన్న వాళ్ళ బాష, సంస్కృతి ఈ రోజు సంక్షోబంలో పడబోయే పరిస్థితి మనముందు వుంది. ఈ సందర్భంలో ద్రావిడ బాషల అస్తిత్వానికి సంబందించిన ఈ చర్యలు అన్నీ కూడా సమాజానికి మేలు చేసేవిగానే ఉంటాయి.

ద్రావిడ భాషా కుటుంబం అనగానే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి కొద్ది భాషలకే పరిమితం చేయడం సాధారణంగా జరుగుతోంది. కానీ వాస్తవానికి ద్రావిడ భాషల సమూహంలో సుమారు 70 భాషలు ఉన్నాయని భాషా శాస్త్రం చెబుతోంది. వీటిలో దక్షిణ, దక్షిణ మధ్య, మధ్య భారత, ఉత్తర ద్రావిడ శాఖలుగా విభజన కనిపిస్తుంది. ప్రస్తుతం కనీసం 18 భాషలు జీవంతంగా వాడుకలో ఉన్నప్పటికీ, మిగతావి నిర్లక్ష్యానికి గురవుతూ లుప్తమయ్యే ప్రమాదంలో ఉన్నాయి.

ప్రోటో-ద్రావిడ భాష సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితమే ఉనికిలోకి వచ్చిందని, సింధు లోయ నాగరికతతో దానికి బలమైన సంబంధం ఉందని అనేక మంది పండితులు అభిప్రాయపడుతున్నారు. భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాకుండా, ఒక సమాజపు సంస్కృతి, తత్వం, చరిత్రను మోసుకెళ్లే జీవంత వ్యవస్థ. ఆధిపత్య భాషలు, సంస్కృతుల ఒత్తిడివల్ల ఆటవిక మరియు చిన్న భాషలు నశించడం అనేది నాగరికత పేరుతో జరుగుతున్న సాంస్కృతిక హింసగా చూడాలి.

ఒక భాష అంతరించిపోవడం అంటే ఆ సమాజం తన చారిత్రక మూలాలనుంచి విడిపోయినట్టే. కాబట్టి ద్రావిడ సమాజ సాహిత్యాలపై జరుగుతున్న ఈ సదస్సు భవిష్యత్ సాంస్కృతిక రక్షణకు కూడా కీలకంగా మారాల్సిన అవసరం ఉంది.

 *

 

మారుతి పౌరోహితం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు