సమాజ చీకటి కోణాల పై సీరియస్ రచనలు చేసిన అరుణ్ సాగర్ అంతర్లీనంగా హాస్యప్రియుడు. అందుకే అతడి కవితల్లో ఎంతటి ఆలోచింపజేసే విషయం ఉన్నా దాన్ని ప్రకటించిన విధానం పెదాలపై చిరునవ్వును రప్పిస్తుంది. కవితల్లో సినిమా పాటలు రాసినా, వాణిజ్య ప్రకటనలు వినిపించే విధంగా తన వాక్యాలను చదువుకోవాలని చెప్పినా ఒక వెక్కిరింత చదువరులను నవ్విస్తుంది.
సమాజం నడిచే తీరుపై తనలో ఉన్న అసహనాన్ని ప్రకటించే తీరులో అరుణ్ సాగర్ వొక వైవిధ్య కెరటం. ఎప్పుడూ కవిత్వమేనా…కథలు రాయొచ్చు కదా..అంటే చాలా ఏళ్ళ క్రితం తాను రాసుకున్న ఒక పెద్ద కథో ..చిన్న నవలో..కామెడీ సినిమా నో చెప్పలేని ఒక “లస్కుటపా” ను నాకు పంపించారు. నేను తన అభిమాని అయినా…పదే పదే నేను చదివానో లేదో అడిగేవారు. ఇంకా చదవలేదని చెబితే తొందరగా చదివి అభిప్రాయం చెప్పమన్నారు. నా సహజమైన లేజీనెస్ నన్ను ఇప్పటిదాకా చదవనీయలేదు.
నిజం చెప్పాలంటే ఆయన సహజ శైలికి పూర్తి భిన్నంగా ఈ కథ ఉండటం…నన్ను చదవనీయలేదు. అరుణ్ సాగర్ లేరన్న షాక్ లో కన్నీళ్ళతో అర్దాంతరంగా ఆపిన ఈ హాస్య రచన చదవడం పూర్తి చేశాను.
నైంటీన్ నైంటీఫోర్ …ఎ లవ్ స్టోరీ .
సూరీ.. కిట్కీ గళ్ భాగీల ప్రేమ కథ.
పదిహేడు రీళ్ళుగా రాసిన ఈ కథ సూరి చందుల స్నేహంతో ప్రారంభమవుతుంది. ఇద్దరు స్నేహితులే కాబట్టి స్నేహనౌక కాస్తా స్నేహ డింగీ గా మారి హుస్సేన్సాగర్ లో సాగిపోతోంది. వాళ్ళిద్దరూ అమ్మాయిల విషయంలో ఎంత ఉద్దండులంటే డాక్టర్ ఆఫ్ బీట్, సైటు రత్న అవార్డులు అందుకునేంత. అలాంటి స్నేహితులు విధి ఆడిన వింత నాటకంలో విడిపోయారు. సూరి నాన్నకు ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్రికా లాంటి వూరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రేకుల షెడ్డులతో, విరిగిపోయిన బల్లలతో పశువుల కొట్టంలా సీతకోకచిలుకల్లాంటి స్టూడెంట్స్ తో అలరారే కాలేజ్ నుంచి సూరి టిసి తీసుకున్నాడు.
తన స్నేహం గురించి ఆలోచిస్తూ ఆటోలో కూర్చుని తను వదిలిన నిట్టూర్పు విని స్కూటర్లో వెళ్తున్న వ్యక్తి హారన్ అనుకుని ఆటో డ్రయివర్ తో గొడవ పడటం , ఆగిపోయిన ట్రాఫిక్ మీద దయతలిచి తన బాధను రాత్రికి ఫోన్లో వివరిస్తానని సూరి చెప్పడం కథలో పెద్ద ట్విస్టు.
చేసిన ప్రామిస్ ను నిలుపుకోవడానికి ఆ రాత్రి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి స్కూటరిస్టుకు ఫోన్ చేసి 48 గంటల తన స్నేహ వియోగాన్ని చెప్పడం, ఆ ఇంట్లోనుంచి తన కథకు కోరస్లో వెక్కిళ్ళు వినిపించడంతో సూరి మనసు కుదుటపడినా అతిపెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. బూత్ లోంచి బయటకు రాగానే సమయానికి తన గర్ల్ ప్రెండ్ కి ఫోన్ చెయ్యలేక బ్రేకప్ అయిన ఆనంద్, పక్కింటి కిట్కీ గాళ్ ఫ్రెండ్ భాగీ ప్రేమను తట్టుకోలేక గట్టిగా గెంతిన గెంతుకు ఫ్యాన్ ఊడి పడి సంసారానికి పనికి రాకుండా పోయిన ఇంటి వోనర్ రాఘవేందర్ సూరిపై పగబట్టడమే ఆ అతి పెద్ద ప్రమాదం.
ఆంధ్రా యూనివర్సిటే లో ఆంథ్రోపాలజీ చదువుతున్న రోజుల్లో ల్యాబ్ నుంచి ఆస్ట్రలోపితికస్ పుర్రెను కొట్టేసి కోట్లు సంపాదించి విలన్ గా అవతారమెత్తిన రాఘవేందర్ క్లాస్మేట్ జబ్బల్ భాయ్ ను పగతీర్చుకోవడం కోసం పిలిపించడం తో క్లైమాక్స్ ప్రారంభమవుతుంది. ఇదే సమయానికి అన్నిరోజుల విరహం తట్టుకోలేని చందూ , సూరి దగ్గరకు రావడం.. ఇద్దరూ కలిసి జబ్బల్ భాయ్ కిడ్నాప్ చేసిన భాగీ ను విడిపించడం, భాగీ నాన్న తనకు మేనమామే అని తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది.
నా మేనమామే నా మామా! అని సూరి ఆశ్చర్యపోవడం నవ్విస్తుంది.
క్యుములోనింబస్ మేఘాలను గన్ తో కాల్చి విలన్ వెళ్ళే సెకండ్ హ్యాండ్ హెలీకేప్టర్ లోకి నీళ్ళు రప్పించడం క్లైమాక్స్ హాస్యం.
ఈ రచన ప్రారంభం నుంచీ మనల్ని విపరీతంగా నవ్విస్తుంది. అరుణ్ సాగర్ రచనల్లో సాధారణంగా కనిపించే సీరియస్ నెస్ ఇందులో వెదికినా కనిపించదు. ప్రతి పదంలో కామెడీ నర్తిస్తుంది. ఆంత్రోపాలజీ సబ్జెక్ట్ పై తనకున్న మొహం మాత్రం అన్ని రచనల్లో కనిపించినట్టే ఇందులో కూడా విలన్ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించేటప్పుడు కాస్త కనిపిస్తుంది. కళ్ళనిండుగా నీళ్ళను…కడుపులో నొప్పిని తెప్పించే ఈ రచన అరుణ్ సాగర్ మరణం తరువాత కన్నీళ్ళతో పూర్తిచేయడం, ఆయన రాసిన ప్రతి అక్షరాన్ని ప్రేమించే అభిమానిగా మనసునిండుగా ఈ కథలో నవ్వుతూ కనిపించే అరుణ్ సాగర్ ను మీకు కొత్త కోణంలో పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.
“తప్పు తనది కాదు నీది.. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదని తెలిసీ…నువ్వే అపరాధి”…వీడ్కోలు మిత్రమా!
*
నవల ఇక్కడ అరుణ్ సాగర్ నవల చదవండి!








Add comment