ఆ వైరస్ పేరు పుకారు!

వాట్సాప్ యూనివర్శిటీ గురించి తెలుసా మీకు? ఇదో వర్చువల్ యూనివర్శిటీ.

సాధారణ వైరస్ లా గాలిలో పుట్టదు కానీ మనిషి బుర్రలో పుట్టి, మొబైల్ టవర్లని వాటేసుకుంటూ రేడియేషన్ తరంగాలతో సంగమించి చొక్కా జేబులోని ఆధునిక కృత్రిమ గుండె ఐన మొబైల్లో దూరి చొక్కా వెనకాలున్న మెత్తటి గుండెల్ని కలుషితం చేస్తుంది.
****

చైనాలో కరోనా వైరస్ గురించి అందరికీ ఎంతో తెలుసు.  దాని మీద మనం బోలెడన్ని జోకులేసుకొని మరీ ఆనందించాం కదా!  కానీ అంతకు మించిన వైరస్ భారత్ ని బలంగా పట్టి పీడిస్తున్నది గత కొన్నేళ్లుగా.  దాని వల్ల జ్వరాలు రావు, కళ్లు మండవు, జలుబు రాదు, అనారోగ్యంతో శరీరం కృశించిపోదు.  కానీ ఆ వైరస్ మనిషి మెదళ్లోకి దూరిందంటే ఇంక మెదడు కుళ్లిపోవటానికి, ఆలోచించే శక్తి పుచ్చిపోవటానికి, వివేచన చచ్చిపోవటానికి ఎక్కువకాలం పట్టదు.  హఠత్తుగా సాటి మనుషుల పట్ల ద్వేషం పెరుగుతుంది. అనుమానాల్ని పెంచుతుంది.  రెచ్చగొడుతుంది.  ఒకరి పట్ల ఒకరికి ప్రమాదకర దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఆ వైరస్ కలగచేసే ప్రధాన లక్షణం నిజానికి అబద్ధానికి మధ్య సతమతమవుతూ చివరికి అబద్ధం వైపు వెళితే తప్ప భద్రంగా బతకలేమేమో అని మనిషి భావించే స్థితికి రావటం.   మనిషి నుండి మనిషికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందటం కాదు అసలు ఒకేసారి కోట్లాది మెదళ్ల కుదుళ్లను పట్టి పీకి పీడించగల సమర్ధత ఆ వైరస్ కి వుంది.  ఇంతకి ఏమిటా వైరస్?
****

ఆ వైరస్ పేరు పుకారు.  అది నిజానికి కొత్తదేమీ కాదు.  పుకారంటే అవాస్తవాన్ని నిజమని ప్రచారం చేయటం లేదా నిజాల్ని అబద్ధాలని చెప్పటం, అసలు సంభావ్యత లేని విషయాల్ని కూడా నిజాలుగా భ్రమింపచేయటం! దుర్మార్గ చర్యలకి మెజారిటీ ప్రజల మద్దతు కావాలనుకున్నప్పుడల్లా పాలక పక్షాలు ఉపయోగించే ఆయుధమే అది.  వాళ్లే ప్రజల్ని భయపెట్టే, తప్పుదారి పట్టించే, ప్రజల మధ్య చిచ్చు పెట్టే, తాము చేయని గొప్ప పనులకి క్రెడిట్స్ కొట్టేసే….ఇలా ఎన్నో రకాల వార్తల్ని పుట్టిస్తుంటారు.  ఈ వ్యూహాన్ని హిట్లర్ కాలంలో విపరీతంగా ఉపయోగించారు.  అనేక రకాల అబద్ధపు వార్తల ద్వారా జర్మన్ ప్రజల్లో మెజారిటేరియనిజాన్ని రెచ్చగొట్టారు.  తామేదో ఘనకీర్తి గల జాతి అని ప్రజలూ నమ్మేసారు.  ప్రపంచం మొత్తం మీద తమకేదో పెత్తనం చేసే అధికారాన్ని దేవుడు, ప్రకృతి తమకి రాసిచ్చినేసినట్లు భావించారు.  హిట్లర్ దుర్మార్గాల పట్ల నోరు మెదపలేదు.  పైగా సమర్ధించారు కూడా.  పసి బిడ్డల నుండి పండు ముదుసలుల వరకు లక్షలాది మంది అన్యాయంగా హతమయ్యారు.  హింసకి గురయ్యారు.  గ్యాస్ చాంబర్లలో, సజీవ సమాధుల్లో, సామూహిక హత్యాకాండల్లో దేశ విదేశీయులు జాతిపరంగా హననమయ్యారు.  ఒక అవాస్తవాన్ని పదిసార్లు నొక్కి వక్కాణిస్తే అది నిజమైపోయే దుర్మార్గ వ్యూహాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు.  ఈ వ్యూహానికి నాయకత్వం వహించిన పాల్ జోసెఫ్ గోబెల్స్ పేరు మీద గోబెల్స్ ప్రచారం వాడుకలోకి వచ్చింది.
****

గ్లోబలైజేషన్ పెరుగుతున్న కొద్దీ గోబెల్సిజానికి ప్రాధాన్యత పెరుగుతున్నది.  దీనికి ఒక కారనముంది.  ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయిందని అనుకుంటున్నాం కానీ నిజానికి ప్రపంచం మొత్తం అగ్రరాజ్యాల షాపింగ్ మాల్ లా తయారైంది.  సమాచార పంపిణి, వినిమయం  వాణిజ్య లక్ష్యాలకే కాదు స్థానిక దేశీయ రాజకీయ వ్యూహాలకి కూడా బ్రహ్మాండంగా పనికొస్తున్నది.  సమాచారం చేర్చే సాధనంగా మాత్రమే కాక మొబైల్ ఫోన్లు గేమింగ్ నుండి పోర్న్ వరకు ఆకర్షణీయంగా తయారు చేయబడింది.  ఎందుకంటే మొబైల్స్ వాడకం ఎంత ఎక్కువైతే ప్రజల్ని అంత ఎక్కువగా ప్రభావితం చేయొచ్చుగా.  మొబైల్ రంగంలో దండుకుంటున్న కార్పొరేట్ వర్గాలకి, అధికార కాంక్షతో ఏదో విధంగా పాలన చేయాలనే రాజకీయ వర్గాలకి గొప్ప “నెక్సస్” ఏర్పడుతుంది సహజంగానే.  ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక అపవిత్ర కూటమిగా ఏర్పడుతారు.  కార్పొరేట్లకి కావలసిందంతా పాలకులిచ్చేస్తారు.  అందుకు ప్రతిగా “ఇన్ ఫర్మేషన్ పంపింగ్” కి కావలసినంత స్పేస్ ని వీళ్లు ఏర్పాటు చేస్తారు.  ఇంక ఇక్కడి నుండి పుకార్ల సామ్రాజ్యానికి తెర లేస్తుంది.  ఇందులో సోషల్ మీడియానే ప్రధాన పాత్ర వహిస్తుంది.

టెక్నాలజీని మంచికైనా, చెడుకైనా వాడుకోవచ్చు.  విద్య, వైద్య, వైజ్ఞానిక అంశాలను వ్యాప్తి చేయటానికే అయితే సోషల్ మీడియాని గొప్ప సాధనంగా చెప్పుకోవచ్చు. కానీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మెజారిటేరియనిజాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని చూసే వర్గాలు ఉపయోగించుకున్నట్లుగా టెక్నాలజీని మంచికి వాడుకోవాలనుకునే వారు ఉపయోగించుకోలేక పోతున్నారు.  నిజమే నా కులం, నా మతం, ఇది నాది అనుకునే దానిలో వుండే స్వార్ధపర ఉద్రేకం మానవీయ విలువల్లో, సమాజానికి ఉపయోగించే శాస్త్ర సాంకేతిక విషయాల్లో వుండదు.  అందుకే చెడు వ్యాప్తి చెందినంత వేగంగా, బలంగా మంచి వ్యాప్తి చెందలేదు.  అంటే పుకారు వ్యాపించినంత వేగంగా, బలంగా మంచి విలువలు వ్యాప్తి చెందవు.  ఇక్కడే జ్ఞానవంతమైన వాట్సాప్ మెసేజికి, పుకార్లతో కూడిన “వాట్సాప్ యూనివర్శిటీ” మెసేజికి తేడా వుంటుంది.
****

వాట్సాప్ యూనివర్శిటీ గురించి తెలుసా మీకు?  ఇదో వర్చువల్ యూనివర్శిటీ.  అంటే భౌతికంగా వుండదు.  కానీ దాని ప్రభావం భౌతికమైనది.  వాట్సాప్ యూనివర్శిటీ అధికారికం కాదు.  అందులో క్లాసులుండవు.  పాఠాలుండవు. అసలు విద్యార్ధులే ఉండరు. నియోగించబడిన ప్రొఫెసర్లుండరు. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లుండరు.  పరిశోధనలుండవు. కానీ అందులో ప్రతి సత్యమూ అసత్యంగా పునర్నిర్వచించబడుతుంది.  నిజాలు గబ్బిలాల్లా తల్లకిందులుగా వేలాడుతూ దర్శనమిస్తుంటాయి.   ఆ  యూనివర్శిటీలో మనకు తెలిసిన విషయాలే కొత్త రూపంలో తయారై సోషల్ మీడియా ద్వారా మనకే చేరతాయి.    నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలియనివ్వని రచనాశైలి వుంటుంది.  అంతా దిగ్భ్రాంతికరంగా వుంటుంది.  అక్కడ వార్తలు తయారవుతాయి.  చరిత్ర కొత్తగా రాయబడుతుంది.  అక్కడేది పుట్టినా దానికి ఆధారాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికీ లేదు.  అలా పుడుతుంటాయి.  సర్క్యులేట్ అవుతుంటాయంతే.  వాటి లక్ష్యం కేవలం సర్క్యులేషనే.  ఒక్క మాటలో చెప్పాలంటే అవి పుకార్లు మాత్రమే.  మరి ఆ పుకార్ల లక్ష్యం ఏమిటి?
****

కుల దుర్మార్గాలు, వివక్ష కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ నేలమీద భిన్న మతాలతో, భాషలతో, సంస్కృతులతో జాతులతో కొన్ని ఘర్షణలతో అయినా సహజీవనం ఏదో మేరకు కొనసాగుతున్నది.  ఈ ఫాబ్రిక్ ని ధ్వంసం చేస్తే తప్ప అధికారంలోకి రాలేని, వచ్చినా స్థిరపరుచుకోలేని యాంటీ-సెక్యులర్ పన్నాగంలో భాగమే వాట్సాప్ యూనివర్శిటీ.  “కాల్ ఇట్ మాడ్ బిఫోర్ యూ కిల్ ఇట్” అని ఒక ఆంగ్ల సామెత వాట్సాప్ యూనివర్శిటీ “ప్రొఫెసర్స్”కి భగవద్గీత వంటిది.  ముందుగా ఒక ప్రజాసమూహాన్ని లక్ష్యం చేసుకుంటారు.  మెజారిటీ హిందువులు కాబట్టి మైనారిటీల  మీద దృష్టి పెడతారు.  ప్రపంచంలో ప్రతి ఇస్లామిక్ టెర్రరిజానికి సంబంధించిన ప్రతి సంఘటననీ భారతీయ ముస్లీములకి ఆపాదించగలరు.  ఒకటికి వందసార్లు “పాకిస్తాన్ కి పోండి” అనే ప్రచారం చేయగలరు.  అక్కడికి పాకిస్తాన్ ఒక్కటే ముస్లీముల దేశమైనట్లు భారతదేశం కానట్లు.  అలా ప్రచారం చేయటంలో వున్న ప్రధాన ఉద్దేశ్యం ఈ దేశం ఇక్కడి ముస్లీములది కాదని, హిందువులదని, ఇక్కడ బతకాలంటే అణీగిమణిగి బతకాలనీ లేదంటే వెళ్లిపోవాలని అటు హిందువుల్లోనూ, ముస్లీముల్లోనూ బలంగా నాటుకోవటమే!  ఎక్కడో ఏ ఒవైసీనో నోరు పారేసుకుంటే దానిని విపరీతంగా బ్లో అప్ చేయటం కూడా వాట్సాప్ యూనివర్శిటీ బాధ్యతే.  (ముస్లీం నాయకులు కూడా సాధారణ దగాకోరు రాజకీయ నాయకులే.  వారేం ముస్లీం ప్రజానీకానికి చాంపియన్లు కాదు)  మైనారిటీల్ని విపరీత ట్రోలింగ్ కి గురి చేయటం ద్వారా మెజారిటీ వర్గాలకు ఒక ఆనందాన్ని కలగచేయటం, అదేవిధంగా వారిని జాతికి, దేశానికి ప్రమాదకరంగా ప్రొజెక్ట్ చేయటం ద్వారా మెజారిటీల విశ్వసనీయతని గెలుచుకొని మెజారిటీనేదో పెద్ద ప్రమాదాన్నుండి బైటపడేసే చాంపియన్లా ముందుకు రావటం కూడా ఒక రాజకీయ లక్ష్యమే.  ఇది వాట్సాప్ యూనివర్శిటీ చాలా తేలికగా నిర్వహిస్తున్న రాజకీయ లక్ష్యం.

వాట్సాప్ యూనివర్శిటీ ఎలా పనిచేస్తుంది? ఒక రాజకీయ పార్టీ అనధికార ఐటీ వింగే ఈ వాట్సాప్ యూనివర్శిటీ అని కూడా అంటారు.  ఈ విభాగంలో దేశంలో క్షేత్రస్థాయి నుండి పైదాకా అనధికార సిబ్బంది “వర్క్ ఫ్రం హోం”లో బిజీగా పనిచేస్తారు.  వీళ్ల పని ఏమిటంటే తమ రాజకీయ శతృవుల మీద నిజమేమో అనిపించే కొన్ని ఆధారాలున్నట్లుగా (సంవత్సరాలు, తారీఖులు, పేర్లు, ప్రాంతాల్ని ఉటంకించటం ద్వారా) వార్తల్ని పుట్టించటం,  వాటిని అన్ని రకాల సోషల్ మీడియా ద్వారా ప్రతి చేతికీ ఆ సమాచారం అందేలా చూడటం!  వాట్సాప్ యూనివర్శిటీలో తయారైన కొన్ని ప్రచారాలు చూడండి.

1. అసలు నెహ్రూ హిందువే కాదు.  ఆయన తల్లి స్వరూపరాణి నెహ్రు ఒక ముస్లీం.  ఆవిడ ఒక ముస్లీం ని పెళ్లి చేసుకున్నది.  (అతని పేరేదో చదివాను.  నాకు గుర్తు రావటంలేదు)  ఆయన మరణం తరువాత ఆవిడ మోతీలాల్ నెహ్రూని పెళ్లి చేసుకున్నది. ఇలాంటిదే ఏదో కట్టు కథ ప్రచారంలోకి వచ్చింది.  ఇది ఎవరు పుట్టించారు, వాళ్లు చూపించిన ఆధారాలేమిటి అన్నది ఎవరికీ పట్టదు.  ఇప్పటికే ముస్లీంస్ మీద ఏర్పరిచిన చెడ్డ అభిప్రాయాలకి అనుగుణంగా నెహ్రూ కుటుంబం మీద కూడా చెడ్ద అభిప్రాయం ఏర్పడాలి. అన్నట్లు మమత బెనర్జీ కూడా ముస్లీమేనట.  ఆవిడ ముస్లీం అని నమ్మితే ఆవిడకి వోటెయ్యక్కర్లేదన్న మాట.

2.  ఆవు గురించి వచ్చినన్ని పుకార్లు బహుశః మరే ఇతర అంశం మీద వచ్చి వుండవు.  గోవు ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్నే వదులుతుందంట.  ఇంక గోమూత్రం, పేడలో వున్నన్ని విపరీత ఔషధ లక్షణాలు ఇంకెక్కడా దొరకవట.  చివరాఖరికి ఆవులకి అదేదో మునిసిపాలిటీలో స్వెట్టర్లు, రగ్గులు కప్పే స్థాయికి ఈ పిచ్చి చేరింది.  మరో వింత కథ ఏమిటంటే ఆవు యజమానిని నాకటం ద్వారా ఆయన దేహంలో వున్న ఔషధ, ఆహార లోపాల్ని కనుగొని, వాటిని “సప్లిమెంట్” చేసే ఆకులు, అలములు తిని, వాటిని పాలల్లో యజమానికి అందచేసి ఆయన ఆరోగ్యానికి పూచీ పడుతుందంట.  పదేపదే ఆవుని గుర్తు చేయటం ద్వారా హిందుత్వని నమ్ముకున్న రాజకీయాలకి అవసరం కదా మరి!

3. 2017లో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారన్న వార్తలు వాట్సప్లో విపరీతంగా ప్రచారమయ్యాయి.  అన్నీ వొట్టి పుకార్లే.   ఆ దుండగుల్ని పట్టుకున్నారని, వాళ్లవి హిందుయేతర పేర్లని ప్రచారాలు జరిగాయి.  ఇది ప్రజల్లోని మూక మనస్తత్వాన్ని విపరీతంగా పెంచేలా చేసింది.  అభద్రతతో ప్రజలు మొత్తం 31 మందిని కొట్టి చంపారు.  (ఆ తరువాతే వాట్సాప్ కంపెనీ ఒకసారి మెసేజింగ్లో కేవలం ఐదుగురికే అనుమతిస్తున్నది.)

4. హైదరాబాద్ లో ఫలాన రెస్టారెంట్లో బిర్యానిలో కుక్క మాసం అమ్ముతున్నారని ప్రచారం!  ఇలా అనేక హోటళ్లు దెబ్బతిన్నాయి.

5.  ఆవు మాంసం గురించి జరిగిన అల్లర్లు అన్నీ ఇన్ని కావు.  ఆవుల్ని తరలింప చేస్తున్నారని దాడులు చేసారు.  ఆవు చర్మాలు వొలిచారన్న ఆరోపణలతో దళితుల్ని కార్లకి కట్టేసి కొట్టారు.  ఢిల్లీలో ఒక ముస్లీం (అఖ్లాక్) ఇంట్లోని ఫ్రిజ్లో ఆవు మాసం వుందని దాడి చేసి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.  ఇంతకీ ఆయనింట్లో వున్నది ఆవు మాంసం కాదని తేలింది.  గోరక్షక్స్ చేసే దుష్కార్యాలు వాట్సాప్ యూనివర్శిటీ ప్రభావితం వల్ల జరిగినవే.

6.  ఇంక భాష విషయంలో కూడా విడ్డూరమైన వార్త్లని సర్క్యులేట్ చేసారు సాంప్రధాయ భాషా ప్రేమికులు.  తెలుగుని ఉఛ్ఛరిస్తే ఏవో ఎన్నో వందల కండరాలు పనిచేస్తాయట.  భాష ప్రధానంగా శబ్ద ప్రధానం కదా మరి ఒక భాషని ఉఛ్ఛరిస్తే ప్రత్యేకంగా కండరాలు భరతనాట్యం చేసే ఏర్పాటు మానవదేహంలో వున్నదా అని ఏ భాషాభక్తుడు అడగడు.  ఆస్తికత్వం, దేశభక్తి, మతము, వాస్తు, భాష, జ్యోతిష్యం వంటి మూఢనమ్మకాల్ని కలిపి కొట్టేసి కాక్ టెయిల్ చేసి ఆలోచించే బాపతు కదా మనది మరి!

7. మరి చెప్పాలంటే అరుంధతీ రాయ్ కి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్  ఉత్తరం రాసాడట. ఒక టెర్రరిస్ట్ గురించి రాస్తూ మీరు ఈయన్ని పెంచుకుంటారా అని అడిగాట్ట!  ఆయన రాసినట్లుగా చెప్పిన ఉత్తరం చదివితే అరుంధతి రాయ్ టెర్రరిస్టుల్ని పెంచుకుంటుందేమో అనుకోవాలన్న మాట.

8.  చైనా కరోన వైరస్ గురించైతే చెప్పే పని లేదు.  మొత్తం మీద అందరూ చైనీయులు గబ్బిలాల్ని తినటం వల్లనే కరోన వైరస్ వచ్చిందని వాట్సాప్ యూనివర్శిటీ తేల్చేసింది.  మరి చైనీయులు వేలాది సంవత్సరాలుగా ఇవే తిన్నారుగా, మనదేశంలోనూ రకరకాల ఆహారపు అలవాట్లున్నాయి కదా అంటే సమాధానముండదు.

ఇంకా లెక్కలేనన్ని ఉదాహరణలు చెప్పొచ్చు వాట్సాప్ యూనివర్శిటి వార్తలల గురించి.  ఈ పరిశోధనలకి జవాబుదారీతనం వుండదు.  ఆ వార్తలు మన మెదళ్లలోకి దూరటానికే పుడతాయి.  మనం జాగ్రత్తగా వుండకపోతే మన ఉనికిని ఆ మహమ్మారి మింగేయగలదు.  కరోనా వైరస్కి వాక్సిన్ దొరుకుతుందేమో కానీ పుకారు అనేది మందులేని వైరస్!  పుకార్లకి విరుగుడు ఆరోగ్యకరమైన ఆలోచనలు, హేతుబద్ధ రాజకీయ దృక్పథమే దీనికి వాక్సిన్ అని చరిత్ర ఘోషిస్తున్నది.
****

వాట్సాప్ యూనివర్శిటీ వున్నది జాగ్రత్త!!!

*

అరణ్య కృష్ణ

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పై వాటితో పాటు ఇంకో పుకారు , 1990 లలో , కాశ్మీర్ లో అకస్మాత్తుగా , టెర్రరిజం ఎక్కువైనప్పుడు , నాయకులు ఏమో అదంతా పేదరికం వల్ల జనం టెర్రరిస్టులు అయిపోతున్నారని ప్రచారం చేసేవారు . అదంతా నిజం కాదని తరువాత తెలిసింది .

    • నేను కూడా ఒకటి చేరుస్తాను. ‘కష్మీరీ పండిట్లు అప్పటి గవర్నర్ జగ్ మోహన్ చెబితేనే విడతలు విడతలుగా రెండు, మూడు లక్షల మంది కష్మీర్ నుండి వెళ్లిపోయారు. అంతేగాని, అసలక్కడ ఏ రేపులు, హత్యలు, మసీదుల నుండి ప్రకటనలు, (మీరు మతం మారకపోతే చంపేస్తాం అనేవి) జరగలేదు. ఏ మారణహోమం జరగలేదు, అందుకే మేం ముప్ఫై ఏళ్ల నుండి గుడారాలలో వున్నవారిని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదు‘. అనేది. ఈ మానవతా యూనివర్శిిటీ ప్రధాన ఆచార్యులలో ఒకరైన కె. శ్రీనివాస్ ఒకసారి ఆంధ్రజ్యోతిలో తన సంపాదకీయం ( గురువారం) వచ్చేదానిలో దీనిని ప్రస్తావించారు.

  • Me too had some more gossip:
    ఆర్యులు బయటినుంచి వచ్చారని నిరూపించటం కోసం ఆ వలస దాడిని గురించి చెప్తున్న కధనంలోనే అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచినట్టు చూపించడం కోసం అల్లిన కధనంలో ఉన్న తెలివితక్కువతనమే కనబడుతుంది! వాళ్ళు ఆర్యులు అనే జాతి Europe or Middle Asia నుంచి ఇక్కడికి వచ్చారని చెబుతున్న కాలం 1500 and 1000 BCE – ఎందుకు ఈ కాలాన్ని మాత్రమే ఎంచుకున్నారు, కొంచెం ముందుకో వెనక్కో జరిపితే వాళ్ళ సొమ్మేం పోయిందీ!ముందుకి, అనగా ఇవతలికి జరిపితే వాళ్ళ ధియరీని పుట్టించడమే అనవసరం అయిపోతుంది!పోనీ వెనక్కి, అనగా అవతలికి జరిపితే Mitanni texts అనే పుస్తకం వల్ల భారతదేశంలో ప్రాచుర్యం పొందిన సంస్కృతం ఆ రెండు ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిన భాష కన్న వెనుకటిది అనే వాస్తవం తెలిసినవాడు ఎవడూ వీళ్ళ వాదనని ఒప్పుకోడు.

    ఇప్పటికీ ఆర్యుల వలస అనేది ఎట్లా వండివార్చారో కూడా తెలియకుండా సమర్ధించే హిందూద్వేషులకీ తెలియనిది ఏమిటంటే, ఈ సిద్ధాంతం భౌతికపరమైన చారిత్రక సాక్ష్యాలను బట్టి గాక Europian Linguistలు భాషా కుటుంబాలకు చేసుకున్న వాళ్ళ సొంత సూత్రీకరణల్నే పునాది చేసుకుని నిర్మించిన అత్యంత నీచమైన ఎత్తుగడ – శాత్రీయమైన సిద్ధాంతం అని చెప్పడానికి ఒక్క అర్హత కూడా లేదు దీనికి.

    ఈ సిద్ధాంతం రూపు దిద్దుకుంటున్న సమయానికే దీన్ని పూర్వపక్షం చేసే భౌతికపరమైన సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఏదో ఒక అడ్డదారిలోనైనా సరే హిందువులలో కొందరినన్నా నమ్మించడానికి పనికొస్తుందనే వీళ్ళ అతితెలివికి వాటికన్న భాషా కుటుంబాల పోలిక పనికొచ్చింది.

    అసలు వీళ్ళ నీచత్వం చూశారా?వీళ్ళు మాట్లాడే ఏ ఒక్కదానికీ సాక్ష్యం చూపించరు గానీ మనం వాళ్ళని సాక్ష్యం అడిగితే ఖోపం వచ్చేస్తుంది – నోటికొచ్చిన చెత్త మాట్లాడేసి “నేను మాట్లాడింది చెత్త ఆని నిరూపించే దమ్ము నీకుందా!” అని చాలెంజిలు విసరటం గొప్ప తెలివని అనుకుంటున్నారు వీళ్ళు.

    “పేరు ఆర్యులు కాకపోవచ్చు..కానీ ముమ్మాటికీ అలాంటి ఒక సమూహం ఈ దేశంపైన పడి అధికారం చలాయించింది…DNA test lu చేస్తే తెలుస్తుంది ఎవరు పరయివారో…ఎవరు మూలవాసులో.” అంటున్న గాడిదకి DNA test lu చేస్తే వాడి గూబే గుయ్యి మనే నిజాలు బయటపడతాయని తెలియట్లేదు.అసలు భాషల మధ్యన పోలికల్ని బట్టి కూర్చిన/పేనిన సిద్ధాంతం యొక్క నిజానిజాలు తేల్చడానికి DNA test lu అడుగుతున్నాడంటే తను ఏ ధియరీని పట్టుకుని ఇక్కడ చిందులు తొక్కుతున్నారో ఆ ధియరీని గురించి కూడా వీళ్ళకి ప్రత్యక్ష జ్ఞానం లేదని నాకు అర్ధం అయ్యింది.

    హిందూమతం గురించి అంటే తమకి అసహ్యం కాబట్టి తెలుసుకోలేదని సరిపెట్టుకోవచ్చు,కానీ తమకి ఇష్టమై, తాము వాదనలో సాక్ష్యానికి వాడుకుంటున్న సిద్ధాంతం గురించి కూడా సొంతంగా చదివి తెలుసుకునే శ్రద్ధ లేదు ఏ ఒక్క అడ్డ గాడిదకీ.ఈ సిద్ధాంతానికి సంబంధించి బలమైనదీ నిజమైనదీ హిందువుల్ని నిరుత్తరుల్ని చెయ్యగలిగినదీ అని వీళ్ళు చూపించే భౌతికపరమైన సాక్ష్యం తొలినాటి వేద వాజ్మయంలో చెప్పిన “Horse, wheel and chariot” అనేవి ఇక్కడ లేకపోవటం అట!కానీ Rajasthanలోని Bagor దగ్గిర 3500 BCE నాటివని చెప్తున్న Equus caballus అవశేషాలు దొరికాయి.

    “నువ్వు ఆర్యులని మాకు సెప్తున్నోళ్ళు ఆళ్ళ గురిచ్చి ఏం జెప్పుకున్నరో నువ్వు ఎరుగుదువా?సెప్పుమీ కుసింత సెవులొగ్గి ఇంటము – “మేము ఆర్యులం, మా భాష సంస్కృతం, మేము వేదర్షులం – మాది సనాతన ధర్మం” అని అనబట్టిన్రా?” అని నేను యాసలో అడిగిన దాని అర్ధం ఇది:మన మతాన్ని మతం అన్నా ధర్మం అన్నా తనకి ఫరక్ పదదంటున్న అడివి మెకాన్నే నిలదీసి అడుగుతున్నాను.ఆర్య – ద్రవిడ సిద్ధాంతం భాషని గురించే కదా పట్టించుకున్నది.నేను గంభీరమైన భాషా శాస్త్ర నియమాల కోసం కూడా పట్టు పట్టను.జస్ట్ కామన్ సెన్సుతో ఆలోచించి చెప్పు.ఇక్కడి వాళ్ళకి హిందువులు అని పేరు పెట్టింది బయటినుంచి ఇక్కడికి వచ్చినవాళ్ళు.వాళ్ళు రాకముందు నుంచీ ఇక్కడ ఉన్న మావాళ్ళు తమ సంస్కృతి గురించి చెప్పుకున్న “సనాతన ధర్మం” పేరును కూడా ఒప్పుకోకుండా వాళ్ళు పెట్టిన పేరునే మాకు పెట్టేశావు.మేము నెత్తీ నోరూ మొట్టుకుని అది మా అసలు పేరు కాదని చెప్తుంటే నాకు ఫరక పడదని కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నావు.మరి, వాళ్ళని నువ్వు ఆర్యులని ఎట్లా అంటున్నావు?ఇక్కడి మావాళ్ళు ఆర్యులని మావాళ్ళలో కొందరిని గురంచి చెప్పుకున్న మాటని తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి తగిలించావు తప్పిస్తే ఆ వచ్చినవాళ్ళు ఇక్కడికి రాకముందు అక్కడ గానీ వచ్చేటప్పుడు గానీ వచ్చాక గానీ తమని గురించి తాము ఆర్యులమని చెప్పుకున్నారా!

    “యాడినుంచో ఈడకొచ్చినోళ్ళు ఆర్యులని నువ్వంటే ఈడకి రాకముందరి కాలంలో ఆడ ఆర్య సంస్కృతీ ఆర్య భాషా అవుపడాలి గందా!” అంటే ఏమిటి?ఇక్కడి స్థానికులైన ద్రవిడుల్ని అణిచేసిన ఆర్య సంస్కృతి ఇక్కడికి రాకముందరి అక్కడివాళ్ళలో ఎందుకు కనపడటం లేదు అని కదా, ఈ ఒక్క ప్రశ్నకి జవాబు తెలుసుకోవటం ఎందుకు అంత కష్టం అయిందో మరి “ఇరానియన్స్ యే ఆర్యులు అనేదానికి ఇంకా నాకు నిర్ధారణ లేదు. రిఫరెన్స్ ఏమైనా ఉంటే దయచేసి ఇన్ బాక్స్ లో పెట్టండి. ” అని వేరేవాళ్ళని అడుగుతున్నారు!

    “యాడినుంచో ఈడకొచ్చిన ఆర్యుడివీ గాదు,ఆర్యుడితోని హిందువని పేరు పెట్టిచ్చుకున్న మూలవాసీవీ కాదు – ఇప్పుడు చెప్పు, ఎవడివిరా నువ్వు?” అనేది సమస్త హిందూద్వేషులకీ కూసాలు కదిలిపోయే ప్రశ్న.సనాతన ధర్మాన్ని పాటించే మనకి వేరేవాళ్ళు పెట్టిన పేరుని ఖాయం చేసిన వీళ్ళు మనవాళ్ళు కాదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, అవునా?మనం మనలోని కొందర్ని పిలుచుకున్న పేరుని వీళ్ళు ఎవరికి తగిలించారో వాళ్ళు కూడా వీళ్ళు తమవాళ్ళని ఒప్పుకోరు,అవునా?మరి, వీళ్ళెవరు?వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు?వీళ్ళ పూర్వీకులు హిందువులు అని బయటించి వచ్చినవాళ్ళ చేత ఆ పేరు పెట్టించుకున్న సనాతనులు కాదంటే ఎక్కడి వాళ్ళు – చెప్పండి!

  • Some gossip spread by this author also:అరణ్యకృష్ణ సంస్కారం ఎలా వుంది?”1.హైందవం మతం అయినా ధర్మం అయినా ఫరక్ పడదు. 2.అన్ని మతాలకున్నట్లు హిందూ మతానికి ప్రపోనెంట్స్ లేరు, కేవలం ప్రమోటర్సే వున్నారు. 3.ఒకరు చెప్పింది మరొకరికి పడక ఇది మతం కాదు, ధర్మం అని సర్దుబాటు చేసుకున్నారు. 4.కానీ హైందవం ఖచ్చితంగా మత లక్షణాలు కలిగివున్నదే. 5.ఆర్యుల ప్రమేయం లేకుండా హైందవం పుట్టలేదు కానీ ఇస్లాం, క్రైస్తవాల్లా ఎక్కడో ప్రాక్టీస్ లో వున్న మతం ఇక్కడ దిగుమతి కాలేదు. 6.అసలు ఇక్కడ మతాలు, రాజ్యాలుగా కాకుండా గణాలుగా వున్న సింధూ నాగరీకతా సమయంలో వచ్చిన ఆర్యులు స్థానిక విశ్వాసాల్ని దెబ్బకొడుతూ రూపొందించిన మతమే హిందూమతం. 7.పశుపతి (శివుడు), అమ్మతల్లి (పార్వతి/శక్తి) వంటి స్థానిక దేవతలకి గౌరవం కల్పిస్తూనే వ్యవస్థలో క్రమంగా రాజకీయంగా ఆధిపత్యం చెలాయించే విలువల్ని హిందూ పురాణాల రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. 8.ఏ పురాణాల్లోనూ హిందూ మతం అని కనబడక పోవటం పెద్ద విశేషం కాదు. 9.పేరు ఎప్పుడైనా ఇచ్చుండొచ్చు లేదా వచ్చుండొచ్చు. 10.విలువలు, ఆచరణ ఏమిటనేదే ముఖ్యం. 11,హైందవ పురాణాలైన మహాభారతం, రామాయణాల్లో వుండేవి హైందవ మనువాదమే. 12.ఆ మాటకొస్తే బుద్ధుడు, జైనుడు (మొదటి తీర్థంకరుడు) కూడా తమ మతాలకు పేర్లు పెట్టలేదు. 13.క్రైస్తవం, ఇస్లాంలలో కూడా ఆయా మతాల పేర్లుంటాయనుకోను. 14.ఏమైనా కరెక్షన్స్ వుంటే వెల్కం!” అనే ఈ చిన్న కామెంటులో ఒక్క వాక్యం కూడా తిన్ననైనది లేదు.మనం పాటించేది మతం అయినా ధరమ యినా ఫరక్ పడదా?ఎవడికి ఫరక్ పడదు?మన మతం గురించి ఫరక్ పడాల్సిందీ ఫరక్ పడనక్కరలేనిదీ మనకా ఇతర్లకా! కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేసుకునే వినయం ఈ ఫరక్ అనే మాటని వాడటంలో కనిపిస్తున్నదా?

    “5.ఆర్యుల ప్రమేయం లేకుండా హైందవం పుట్టలేదు కానీ ఇస్లాం, క్రైస్తవాల్లా ఎక్కడో ప్రాక్టీస్ లో వున్న మతం ఇక్కడ దిగుమతి కాలేదు.” అనేది మెంటల్ వెధవ తప్ప మైండు సరిగ్గా పనిచేస్తున్నవాడు అనగలిగిన మాటయేనా?”ఆర్యుల ప్రమేయం లేకుండా హైందవం పుట్టలేదు” అంటే అది యూరేషియన్ వలసదారుల సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నటే కదా, మళ్ళీ “ఇస్లాం, క్రైస్తవాల్లా ఎక్కడో ప్రాక్టీస్ లో వున్న మతం ఇక్కడ దిగుమతి కాలేదు” అనటం ఏంటి?

    పోనీ ఇతను ఆర్యులు ఇక్కడివారే అని అంటున్నాడని అర్ధం చెసుకోవడానికీ కుదరదు.ఎందుకంటే, ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని సమర్ధించేవారు తప్ప బుద్ధీ జ్ఞానం ఉన్న ఏ చరిత్రకారుడూ ఈ దేశం లోపల కూడా “ఆర్య జాతి” అనేది ఉన్నదని వొప్పుకోవటం లేదు, ఆర్య అనేది పెద్దలను సంబోధించటానికి వాడుతున్న ఒక పదం మాత్రమే!

  • 1. ఈ సత్యశోధన యూనివర్శిటీ చెప్పిన పుకార్లను ఒక్కటొక్కటిగా చూద్దాం. ఈ నెహ్రూ ముస్లిం అని మొట్టమొదట చెప్పిందెవరు? ఈ విషయాన్ని వ్యాప్తి చేసిందెవరు? వాళ్ల లక్ష్యం ఏమిటి?

    భారత్ పై వేయేళ్ల యుద్ధం చేసైనా ఆక్రమించుకుంటాం అన్న సిక్యులర్ల డార్లింగ్ దేశం పాకిస్తాన్ రక్షణ శాఖ.

    పాకిస్తాన్ చేసే ప్రతి ప్రకటనా అత్యంత విశ్వసనీయమైనదని వాటి ఆధారంగా ఇక్కడి ప్రభుత్వాన్ని గురించి, తమ రాజకీయ ప్రత్యర్థులని గురించి నీచంగా మాట్లాడే సిక్యులర్, లిబ్‌టార్డ్, ప్రెస్టిట్యూట్, సోల్డ్ మీడియో మేధావులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం ఇది.

    ఇది మొదట ప్రచారం మొదలుపెట్టింది, పాకిస్తాన్ రక్షణశాఖ వెబ్ సైట్. వికీ సేన్ అనే మారుపేరుతో, హిట్లర్ బొమ్మ పెట్టుకున్న ఓ సభ్యుడు 2014 జనవరిలో మొట్టమొదట ఈ పోస్టు పెట్టాడు… ఫోటోలు,. మ్యాపులతో సహా.

    అది ఇక్కడ చదువుకోవచ్చు…

    Truth about Nehru Gandhi Family
    Discussion in ‘Central & South Asia’ started by vicky sen, Jan 30, 2014…..

    The Nehru family starts with the Mughal man named Ghiyasuddin Ghazi. He was the City Kotwal i.e. police officer of Delhi prior to the uprising of 1857, under the Mughal rule. After capturing Delhi in 1857, in the year of the mutiny, the British were slaughtering all Mughals everywhere. The British made a thorough search and killed every Mughal so that there were no future claimant to the throne of Delhi. So, the man Ghiyasuddin Ghazi (the word means kafir-killer) adopted a Hindu name Gangadhar Nehru and thus saved his life by the subterfuge. Ghiyasuddin Ghazi apparently used to reside on the bank of a canal (or Nehr) near the Red Fort. Thus, he adopted the name ‘Nehru’ as the family name. The 13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh states it elaborately. The Government of India have been hiding this fact.

    https://defence.pk/pdf/threads/truth-about-nehru-gandhi-family.297827/

    మరి, వాట్సాప్ యూనివర్శిటీ ఎవరిది? పాకిస్తాన్‌దా? భారత్‌దా?

  • 2. గోమూత్రం గురించిన శాస్రీయ పరిశోధన పత్రాలు, పేటెంట్లు

    Cow urine has been granted US Patents (No. 6,896,907 and 6,410,059) for its medicinal properties, particularly as a bioenhancer and as an antibiotic, antifungal and anticancer agent.

    Cow urine distillate as bioenhancer
    https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3117312/

    భారతదేశానికి గోమూత్రంపై 15 పేటెంట్లున్నాయి. యూఎస్. ఫ్రాన్స్,
    దక్షిణ కొరియా వీటిని గుర్తించాయి.

  • ‘గో విగ్యాన్ అనుసంధాన్ కేంద్ర’ అనేది నాగపూర్ జిల్లాలో దియోలాపూర్ లో వున్న ప్రైవేటు పరిశోధనా కేంద్రం. అది ISCR ని, మిగతా ప్రభుత్వ సంస్థలని సిగ్గుపడేలా ఎలా చేసిందంటే, 20 ఏళ్ల క్రితమే స్థాపించబడినా ఇంతవరకూ 6 పేటెంట్లను గోమూత్రం, గోమయం, గోక్షీరంపైన యూ.ఎస్. (5), చైనా (1) ల నుండి పొందింది.

    That goal may be a long way off but the Kendra has already made its mark with five patents, all for products derived from gomutra or cow’s urine. One of the patents granted in the US in 2005 is for the “use of bioactive fraction from cow urine distillate as a bio-enhancer of anti-infective, anti-cancer agents and nutrients”. The invention, it says, relates to a novel pharmaceutical composition comprising an effective amount of bio-active fraction from cow urine distillate as a bioavailability facilitator and pharmaceutically acceptable additives selected from anti-cancer compounds, antibiotics, drugs, therapeutic and nutraceutic agents. Although the Kendra would have us believe that it is a cure for cancer, what the patent description boils down to is that it can enhance the effects of modern cancer drugs.

    Curiously, while the Kendra claims the six patents as its own, a perusal of the patent abstracts reveals that all the patents have been assigned to csir. The key to understanding this partnership is R A Mashelkar, one of India’s top scientists who headed csir for 11 years from 1995, and was closely involved with Govigyan Kendra. That period was largely co-terminus with the first Bharatiya Janata Party (BJP)-led government and led to some shady research on gomutra by CSIR labs in collaboration with the Kendra. There was quite a bit of speculation on what India’s leading boffin was up to. That partnership is much stronger now. In April 2014, Mashelkar steered a major initiative of the Kendra for examining the scope of researching panchagavya Ayurvedic medicines for “a better system of health”. Panchagavya literally means five products of the cow: milk, curd, ghee, dung and urine.

    https://www.downtoearth.org.in/news/science-technology/holy-cow-so-many-patents-58157

  • ఇంకో పధ్నాలుగు పేటెంట్లు భారతీయులవి.

    The cow-urine patent was applied by 14 Indians in the USA and have secured it. It is not that USA has secured patents.

    If you go to Patent US6410059 – Pharmaceutical composition containing cow urine distillate and an antibiotic, you can see that only Indians probably living in the USA have got it.

  • 3. దాద్రి దాడికేసులో అఖ్లాక్ ఇంట్లో దొరికింది ఆవుమాంసమే. మథుర లోని ఫోరెన్సిక్ లాబ్ యిచ్చిన రిపోర్ట్ ఇది… https://www.thehindu.com/news/national/other-states/Dadri-meat-was-beef-claims-fresh-forensic-report/article14378277.ece

    (దీనికి హత్యా దర్యాప్తుకీ సంబంధంలేదు, హత్య హత్యే. దానికి శిక్ష పడాల్సిందే. ఐతే, గోమాంసం వుంది కాబట్టి హత్యచేసారన్నది అప్పటి అఖిలేష్ ప్రభుత్వం రాజకీయ విషక్రీడ…. ఆ కేసు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుభోద్ కుమార్ సింగ్ ఒక శూలశోధన వెబ్ సైట్ కోబ్రాపోస్టుకు యిచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ ప్రభుత్వం ఎలా ఆవుమాంసాన్ని దున్నపోతు మాంసంగా మార్చమని ఒత్తిడి చేసిందో చెప్పాడు)

  • పుకారుకన్నా బలమైన జబ్బు ఏమిటంటే, మనభావజాలాన్ని సమర్ధించే పుకారుని త్వరగా నమ్మేసే జబ్బు.

    వాట్సాప్ యూనివర్సిటీ / Social media లో అజ్ఞానులు ఒక భావజాలానికి బందీలు కాదు. వామపక్షవాదులూ, రామపక్షవాదులూ, ఆర్యదండయాత్ర సిద్ధాంత మద్దతుదారులూ, వ్యతిరేకులూ అందరూ ఉన్నారు.

    ఆవు ఆక్సిజన్ ఇవ్వదు. కానీ ఆవుని కోసుకుతినటాన్ని ఆహారపు అలవాటు గా కాక, అది ఆత్మగౌరవానికి కొలమానంగా రెచ్చగొట్టటం కూడా సమాజానికి ఆరోగ్యం కాదు.

    సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి, సిరియాలో తీసిన ఫోటోని ఐక్యరాజ్యసమితికి కాశ్మీరు అని సమర్పించి, దొరికిపోయి అబాసుపాలైన దేశం పాకిస్తాన్.

  • 9. ‘కరోనా వైరస్ గురించిన ఓ హాస్యాస్పద వాదన, వందల ఏళ్లుగా గబ్బిలాలనే తింటున్నా ఎందుకు వాళ్లందరికీ కరోనా వైరస్ రాలేదు?‘, అని.

    కొన్ని సీజన్లలో కోళ్లకి వచ్చే వ్యాధుల వలన ఆ కాలమంతా కోడిమాంసం తినడం ఆపమని ఎన్నివేలసార్లు ఆరోగ్య అధికారులు చెప్పివుంటారు?

    గతంలో చైనాలోనే వచ్చిన ‘సార్స్’ మహమ్మారి పునుగుపిల్లి నుండి సంక్రమించిందని శాస్త్రజ్ఞులు తేల్చారు. మరి, వారికి ఈమాత్రం ఇంగితజ్ఞానం లేదా?

    (దానివలన పునుగుపిల్లుల సామూహిక హత్యాకాండ సాగించారు. నిజానిక సమస్య పునుగుపిల్లలది కాదు, మనం వాటితో సాగించే సాన్నిహిత్యం, వాడుకోవడం)

    అలాగే, గబ్బిలాల నుండి దక్షిణ చైనా ప్రాంతవాసులకు కరోనావైరస్ ఎలా సోకిందో ఈ పరిశోధనా పత్రం…. ఇది 2019 అక్టోబర్ లోనే ప్రచురించబడింది.

    Human-animal interactions and bat coronavirus spillover potential among rural residents in Southern China

    https://www.sciencedirect.com/science/article/pii/S2590053619300308

  • DNA ప్రసక్తి వచ్చింది కనుక నా పాత ఫేసుబుక్కు కామెంటుని మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.

    ఈ కామెంటుని నాస్తిక హేతువాద ఉద్యమకారుడు, my Facebook friend, షేక్‌బాబు గారు, Inkollu, Prakasam district (Facebook ID Shaik Babu), నాపేరుతోనే తన వాల్ మీద రాసారు కూడా.

    అరణ్యకృష్ణ గారూ, హరిబాబు గారూ కూడా దీన్ని నిర్మొహమాటంగా విశ్లేషించగలరు.

    _______________________

    డీఎన్‌యే చూసుకొని మనుషులు కలవగలితే అసలు మతకలహాలు వచ్చేవే కావు. మతకలహాలు ఎప్పుడూ ఒకే ముత్తాత పిల్లల్లో ఒకరు మతం మారిన మరో ఒకటీ రెండూ తరాలతర్వాత జరిగినవి.

    చరిత్రలో ఒకే మతంలో ఉండే అన్నదమ్ములే కొట్టుకున్నారు.
    అశోకుడు నూరుమంది సోదరులను చంపి రాజు ఐనట్టు కొన్ని రాతలు ఉన్నాయి.
    శ్రీకృష్ణదేవరాయలూ, ఔరంగజేబు కూడా తమ సోదరులనో రక్త్సంబంధీకులనో చంపి/ బంధించి సింహాసనం ఎక్కినవారే.

    ప్రస్తుతం దేశాల సరిహద్దులను నిర్ణయించే రాజకీయ ఒప్పందాలు 1947/1971 అనేవి ప్రామాణిక సంవత్సరాలుగా తీసుకోవాలి. ఇంకా వెనక్కి వెళితే చీకట్లో నల్లపిల్లిని వెతకటమే.

    ఆర్యులు మూడువేళక్రితం వలస వచ్చారో దండేత్తి వచ్చారో గానీ, ఈరోజు భారతదేశంలో దాదాపు ఎనబై శాతం జనాబా (అన్ని మతాలవారూ) లో ఆర్య-ద్రవిడ మిశ్రమ డీఎన్ఏ మాత్రమే ఉంటుంది.
    బయటప్రపంచంతో ఏ సంబంధాలూ నెరపని తమిళనాడు తోడా జాతివారిలో పూర్తి ద్రవిడ డీఎన్ఏ దొరుకుతుంది. అలాగే, హిమాచల్ మారుమూల పూర్తి ఆర్య డీఎన్‌యే దొరకొచ్చు.
    మిగతా దేశం అంతా 10:90 నుండీ 90:10 వరకూ ఏ నిష్పత్తిలోనైనా మిశ్రమ డీఎన్‌యే తప్ప మరోటి దొరకదు.

    కొన్ని ఉదాహరణలు.

    కాశ్మీరులో మెహబూబా ముఫ్తీ డీఎన్ఏ అక్కడి హిందువులతో కలుస్తుంది గానీ, కేరళా ముస్లిములతో కలవదు. ఎందుకంటే ఆమే స్వయంగా మూడు తరాలక్రితం ఇస్లాం ను స్వీకరించినట్టు వెల్లడీంచారు.

    అలాగే వాయనాడ్ ముస్లిముల డీఎన్‌యే వారి జిల్లా హిందువులతో కలుస్తుంది గానీ, బంగ్లాదేశీయులతో కలవదు.

    అద్వానీ డీఎన్ఏ కి దగ్గరాగా ఉన్న డీఎన్‌యే కరాచీలో దొరుకుతుంది గానీ కర్నాటకలో దొరకదు (అద్వానీది సింధ్ ప్రాంతం).

    బెనజీర్ బుట్టో డీఎన్ఏకి మూలాలు గుజరాత్ రాష్ట్రం జునాగడ్‌లో ఉంటాయి (ఎందుకంటే జుల్ఫీకర్ ఆలీ బుట్టో తండ్రి జునాగడ్ నవాబుకి ప్రధానమంత్రి). ఆయన భారతదేశంలో కొనసాగి ఉంటే జుల్ఫీకర్ ఆలీబుట్టో తప్పనిసర్గా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేయటంతో పాటు మిలిటరీ చేతిలో ఉరిశిక్షకి బలి అవకుండా ఉండేవారు.

    13 వ శతాబ్దపు చెంఘీజ్‌ఖాన్ డీఎన్ఏ, దండయాత్రలవల్ల దేశదేశాలు వ్యాపించి, ఇప్పుడు వెతికితే, మనకి తైవాన్ నుండీ యూరోపు వరకూ కనీసం, పదివేలకిలోమీటర్ల పొడవు వెయ్యికిలోమీటర్ల వెడల్పుతో యాబై దేశాలలో (భారతదేశాంతో సహా) దొరుకుతుంది. ఇందులో ఆ డీఎన్‌యే రావటంలో వారి ప్రమేయం లేదు. వారిలో ఆ డి్ఎన్ఏ ఉన్నట్టే వారికి తెలీదు. ఆ డిఎన్ఏ తో జీవిస్తున్న వారిలొ లక్షలమందికి చెంఘీజ్‌ఖాన్ పేరే తెళిదు. తెలిసినవారిలో లక్షలమంది చెంగీజ్‌ఖాన్ ను ద్వేషిస్తూ ఉండొచ్చు. వీరంతా కనీసం నాలుగు మతాల్లో (బౌద్ధం, షామానిజం, ఇస్లాం, క్రైస్తవం) వ్యాపించి ఉన్నారు. చెంఘిజ్‌ఖన్ చనిపోయేవరకూ షామానిజం పాటీంచాడు. అతడీ వారసులు ఏదేశాన్ని జయిస్తే ఆ దేశ మతం స్వీకరించారు. మొఘలులూ వారి వంశపరంపరలో వారే.

    ఇజ్రెయిల్ యూధులదీ, పాలెస్తీనా ముస్లిములదీ, ఒకటే డీఎన్ఏ.
    సిరియా క్రైస్తవులదీ ముస్లిములదీ కూడా ఒకటే డీఎన్‌యే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు