ముస్లింవాద సాహిత్య లక్ష్యం ఇప్పుడేమిటి ?

ముస్లింవాద సాహిత్య గమనం- గమ్యం గురించి ఈ చర్చ ముందుకు కొనసాగించండి. మీ అభిప్రాయాలకు మా ఆహ్వానం!

ఖాదర్ మొహియుద్దీన్ గారు ఇటీవల ఒక మాటన్నారు – ‘పుట్టుమచ్చ ‘ లక్ష్యం రాజ్యం కాదు, మెజారిటీ సమాజమని. ఐడెంటిటీ ఉద్యమాల అంతిమ లక్ష్యం అత్యంత శక్తివంతంగా సమస్యను ఎజెండా మీదికి తీసుకు రావటమనీ, ఆ కర్తవ్యాన్ని ఐడెంటిటీ ఉద్యమాలు అతి శక్తివంతంగా నిర్వర్తించాయనీ చెప్పారు.

ఐడెంటిటీ ఉద్యమాలు శక్తివంతంగా సమస్యని ఎజండా పైకి తెచ్చాయనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడో ప్రశ్న తలెత్తుతుంది. మైనారిటీవాద సాహిత్యం మెజారిటీ సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే సరిపోతుందా? మెజారిటీ వాదం రాజ్యాన్ని అంటిపెట్టుకున్నప్పుడు ముస్లింవాద సాహిత్యం వంటి అస్తిత్వవాద ఉద్యమాలు రాజ్యాన్ని లక్ష్యం చేసుకోనవసరం లేదా?

‘ పుట్టుమచ్చ ‘ కాలానికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. త్వరిత గతిలో ఇంకా వస్తూనే వున్నాయి. ఉదాహరణకు ఖాదర్ మొహియుద్దీన్ గారు అలా చెప్పాక అంతలోకే భారతదేశంలో జెన్-జీ ఉద్యమం తలెత్తింది. శ్రీలంక, నేపాల్ జెన్-జీ ఉద్యమాలకు, భారతదేశంలో జెన్-జీ ఉద్యమానికి సూక్ష్మమైన తేడా వుంది. భారతదేశంలో బొద్దింకలు హిందూ – ముస్లిం రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గత ముప్ఫై యేళ్ళ కాలంలో రాజ్యం పనిగట్టుకుని ఇక్కడ చేస్తున్న ఘనకార్యం అదే కాబట్టి ఆ హెచ్చరికకు ఉలిక్కిపడ్డంలో ఆశ్చర్యం లేదు. ఇది అస్తిత్వవాద ఉద్యమాల ప్రభావమే.

రాజ్యాధికారం గురించి అస్తిత్వవాద ఉద్యమాలు మాట్లాడతాయి. రాజ్యానికి నిరసన తెలిపే విధానం గురించి కూడా ఇప్పుడు ముస్లింవాదం లాంటి అస్తిత్వవాద ఉద్యమాలు యోచన చేయవలసి వుంది. ‘ పుట్టుమచ్చ ‘తో ముస్లింవాద ఉద్యమం తలెత్తిన ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాజ్యం జాతీయంగా, అంతర్జాతీయంగా వైషమ్యాలు పెంచుతూనే పోతోంది. పాలస్తీనాలో మానవహననంతో అది పరాకాష్టకు చేరుకుంది. దానికి ఇప్పటిదాకా మనం అనుకుంటూ వున్న కారణాల్ని పునర్మూల్యాంకనం చేసుకోవాల్సి వుంది.

ఇప్పటిదాకా ఏమనుకుంటూ వచ్చామంటే జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ సంభవించిన కొన్ని స్వప్నభంగాలు, ముఖ్యంగా సోషలిస్టు స్వప్నభంగం నేపథ్యం నుంచి అస్తిత్వవాద ఉద్యమాలు తలెత్తాయని. ఖాదర్ మొహియుద్దీన్ గారు అదే చెప్పారు. అయితే ప్రపంచంలోని బడా పెట్టుబడిదారీ దేశాలు చాలా తెలివిగా మనల్ని అలా నమ్మించాయని ఇటీవల జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్ మీద ఏక పక్షంగా జరిగిన దాడి, తరచుగా పెద్ద దేశాలు చిన్న దేశాల మీద దాడి చేయడం వంటివి ప్రపంచ ఆర్థిక విధానాన్ని సంపన్న దేశాలు గుప్పిట్లో వుంచుకోవడానికేనని అర్థమవుతుంది. విభజించి పాలించు సూత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ జరగలేదనేది స్పష్టం. అదే సూత్రం భిన్న సామాజిక వర్గాల మధ్య సృష్టించి రాజ్యం ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని అర్థం చేసుకోనిదే ముస్లింవాద సాహిత్యం మరింత బలంగా సమస్యను ఎజెండా పైకి తీసుకురాలేదు.

ముస్లింవాద సాహిత్యం బాగా వేళ్ళూనుకొని బలపడింది. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఇప్పుడిప్పుడిప్పుడే ఎదుగుతోంది. అందుకే దర్వేష్ మహమూద్‌నీ, మౌమితా ఆలంనీ కలుపుకొనిపోగలుగుతోంది. స్వతస్సిద్ధంగా కూడా ఆ స్థాయికి ముస్లింవాద సాహిత్యం చేరుకోవలసి వుంది.

*

దాదా హయాత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.