మహారణ్యాలు దాటిన ఆ రెండు కాళ్ళు!

నవంబర్ 24 కాళ్ళ మన మధ్య నుంచి వెళ్ళిపోయిన రోజు..

కాళ్ళ అని ఇష్టంగా పిలుచుకునే కాళ్ళ సత్యనారాయణ గారు నాకు డా.హరీష్ ద్వారా పరిచయం. ఖమ్మం పాత సిపిఎం ఆఫీస్ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్ లో ఆయన స్టూడియో. అంటే ఏదో హంగులు పొంగులతో ఉంటాది అనే బ్రమలు వద్దు. ఒక్కటే గది అందులో చిన్న స్క్రీన్ ప్రింటింగ్ మిషన్, ఒక చిన్న టేబుల్, కుర్చీ నిరంతరం రంగుల మాయాజాలం లో కాళ్ళ. వంటి మీద ఏమాత్రం శ్రద్ద ఉండదు . చింపిరి గడ్డం,అపసవ్యంగా ఉండే జుట్టు.అన్యమనస్కంగా కాళ్ళ. మొదటి సారి చూసినప్పుడు కాళ్ళ ఒక పట్టాన అర్ధం కాడు. కాస్త దగ్గర అయితే ఆ ప్రేమ లోతు కొలవడానికి యంత్రాలు సరిపోవు.

మనిషి నలుపు కానీ మనసు రంగుల సింగిడి. నిత్యం ఆయన రంగులతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.ఆయన బొమ్మలు నున్నగా, కళ్ళకు హృద్యంగా ఉండవు. పెచ్చులు ఊడిన గోడల మీద ఆదిమానవుడు చెక్కిన పురా జ్ఞాపకాలలా ఉంటాయి. నేను చూసిన చానా బొమ్మల్లో బ్రైట్ గా నైరూప్య చిత్రాలు. ఆయన మాటల్లో క్లుప్తత, సూటి తనం, తక్కువ మాట్లాడడం. విస్తారమైన అధ్యయనం. సాహిత్య, సాంస్కృతిక, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల మీద సునిశితమైన ద్రుష్టి. ఇతిమిద్దంగా ఆయన రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కావు. ఆ పాడు బడ్డ లోగిలి ముందు తచ్చాడే కవులు, కళాకారుల, మేధావుల లిస్టు చూస్తే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.శివసాగర్ కవిత్వం సంకలనం సేకరణ ప్రచురణ క్రమం లో పుస్తకానికి ఆయన మూడు బొమ్మలు గీసాడు. ఒకటి నరుడో భాస్కరుడా కవితలో ఒక మొరటు మనిషి లాఘవంగా గురి చూసి విసిరే గండ్ర గొడ్డలి, మరొకటి రక్త నది అందులో మొలిచిన కాలువలు నెలవంక,ఎగిరే పావురాలు, శివసాగర్ యాభై ఏళ్ళ కవితా ప్రస్తానం ఒక బొమ్మలో ఇమిడి పోయింది. మొత్తానికి మూడు నాలుగు నెలలు పట్టింది కవర్ పేజీ పూర్తి అవడానికి. పుస్తకం వచ్చాక కాళ్ళ కు నేను బాగా దగ్గర అయ్యా. ఆ స్నేహం ఐదారు ఏళ్ళు గడిచింది. పరిశోధన కోసం నేను ఇఫ్లూ కి మారాక ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. మా అయ్య కాలం చేసినప్పుడు ఇంటికి వచ్చాడు. ఒకరి రెండు సార్లు ఇఫ్లూ కి వచ్చాడు. మధ్యలో తన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఇఫ్లూ లో సతీష్ పోడ్వాల్, మధుమిత కలిస్తే కాళ్ళ శ్రీనివాస ప్రసాద్, హిందూ సురేంద్ర గారు ముచ్చట్లు.

ఎక్కడో విజయ నగరం లో పుట్టిన కాళ్ళకు మా ఖమ్మానికి ఏమిటి సంబంధం? ఖాదర్ మొహియుద్దీన్ వాళ్ళ పెద్దన్న రహమాన్ గారు ఖమ్మం లో ఉండేవాడు. ఆయన,కౌముది, హరీష్ గారు ముగ్గురూ కలిసి “సరిత” అనే సాహిత్య పత్రిక తీసుకొని రావాలి అనుకొనే సమయంలో ఒక ఆర్టిస్ట్ కోసం వెతికే క్రమం లో ఖాదర్ అన్న నాటికి విజయవాడ లో ఉంటున్న కాళ్ళను ఖమ్మం వైపు నడిపాడు. మొదట్లో రెహమాన్, కౌముది గారు హరీష్ సహచరి మాధురి గారి పేరుమీద ఒక ‘మాధురి ప్రెస్’ నడిపారు అని విన్నా. కొంత కాలం నడిచిన ఆ ప్రెస్ మూత పడ్డాది. ఆ పత్రిక మొదలు కాలేదు, ఖమ్మం వచ్చిన కాళ్ళ మళ్ళీ వెనక్కు పోలేదు1948 April 10న ఉత్తరాంధ్ర విజయనగరం లో పైడమ్మ, సన్యాసి కడుపున పుట్టిన కాళ్ళ, కుటుంబం బ్రతుకు దేరువులో బాగంగా మొదట ఏలూరు ఆ తర్వాత బెజవాడ అంతిమంగా ఖమ్మం దిశగా సాగింది.ఆయనది ఒక్క మజిలీ కాదు. ఆయన స్నేహాలో రాజకీయాలో వ్రుత్తి ప్రవ్రుత్తి వ్యాపకాలో ఆయనను ఒక్క దగ్గర ఉండేలా చేయలేదు. అంతిమంగా ఆయన ప్రయాణం ఖమ్మం లోనే ముగిసి పోయింది. 40 ఏండ్ల క్రితం రంగుల కుంచెను బుజాన వేసుకుని ఖమ్మం చేరుకున్న ఆయన బాల్య యవ్వనాలు ఉమ్మడి కమ్యూనిస్ట్ ఆచరణలో సాగాయి. పార్టీ విడిపోయాక ఆయన ఏ నిర్మాణాలలోనూ ఇమడక పోయినా ఆయన గీసిన బొమ్మలు నిర్మాణాల కన్నా ఎక్కువనే పనిచేశాయి. డెబ్బై ఏళ్ళ జీవితం లో బ్రతుకు కోసం అగ్గిపెట్ట లాంటి ఆయన స్టూడియో లో పెళ్లి,వి జిటింగ్ కార్డులు ముద్రించాడు. ఎవరయినా అడిగితే లోగో లు ఇచ్చేవాడు. తనకు కనీసం బువ్వ పెట్టని రంగుల లోకం లో విహరించాడు. ఎవరన్నా ఆయనను చూస్తే అన్నం మానేసి కనీసం ఏళ్ళు అయినా అయి ఉండొచ్చు అనే భావన కలగొచ్చు. ఎంత నవ్వినా తొనకడు బెనకడు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా బ్రతికాడో తెలియదు.

ఖమ్మం శివారు పాండురంగాపురం పొలాల మధ్య ఒంటరి చుక్కలాగా ఆయన ఇల్లు. చుట్టూ ప్రహరీ లేదు పంట పోలాలకి ఆసరాగా పాతిన కంప చెట్లే ఆయననూ పొలాలనూ కాపాడాయి. ఆయన సహచరి కోటమ్మ ఇద్దరికీ కలిపి నలుగురు అమ్మాయిలు, ముగ్గురు కొడుకులు శ్రీను, రాజు ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నారు. ఇటీవలే మరణించిన కోటమ్మ గారు. కాళ్ళ కొడుకులు చిన్న పాటి కొలువులు యేవో చేసుకుంటున్నారు. కాళ్ళ గుర్తుకు వస్తే నాకు ప్రపంచ ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు ‘ఫ్రాన్సిస్ కో గోయ’ యాదికి వస్తాడు. ప్రపంచ చిత్రకారుల్లో ఆయన చిట్ట చివరి ప్రాచీనుడు మొట్ట మొదటి ఆధునికుడు. పద్దెనిమిదో శతాబ్ద మధ్య బాగం పందొమ్మిదో శతాబ్ద ప్రధమార్ధం అంటే ప్రాచీన ఆధునిక సంధి దశలో లో పుట్టిన ఆయన శైలి నేను కాళ్ళ బొమ్మల్లో చూసా. ఆయన కూడా చిట్ట చివరి సనాతనులా తొట్ట తొలి ఆధునికుడిగా రంగులతో ప్రయోగాలు చేసాడా అనిపించింది. ఎందుకో ఆయన బొమ్మలు సవ్యంగా ఉండవు. గోయ బ్రతుకు ‘రాజాస్థానాల’లో గడిచింది. కాళ్ళ బ్రతుకు ప్రజల కష్టాల కన్నీళ్ళ మధ్య గడిచింది. డా.హరీష్ గారు అన్నట్టు “కాళ్ళ ఒక గీత, శ్రుతి అపశ్రుతుల సంగీతం, మనిషి మాత్రం పిట్టంత, అతని నీడ చెట్టంత, అతను నల్లగా, మెత్తగా, నిజాయితీగా, పచ్చిగా, మనిషి వాసన కొట్టే నీడ” అన్నాడు.ఈ ప్రపంచానికి కాళ్ళ మీద హరీష్ గారికి మాత్రమె సాధికారత ఉంది. ఇప్పుడు ఆయన చరిత్ర, నిబద్దత,బొమ్మల తాత్విక లోతు చెప్పడానికి హరీష్ లేడు వినడానికి కాళ్ళ లేడు.

ఆయన గీతల్లో వికారమైన తలలేని మొండాలు, సాగిన చేతి వెళ్ళు,మనల్ని వెంటాడే నీడలు, చుట్టూ ఆవరించి ఉన్న సమస్త వైకల్యాలు, స్త్రీల వేదనలు, డంకేల్ దుర్మార్గాలు, లాతూర్ విషాదాలు, కాస్ట్రో, అలెండీ వీరోచిత గాధలూ, చిద్రమైన అద్దాలు, గడ్డ కట్టిన కన్నీళ్లు, ఏకాంత మృత్యువు, తెగిన దారాలు, మాతృ బంగం, దూది పింజలు ఆయన కాన్వాస్ మీద యుద్ధం చేస్తాయి. కాళ్ళ బొమ్మలు ఏ ఒక్క అంశాన్నో తడమలేదు, గడిచిన ఐదు దశాబ్దాల సాహిత్యాన్ని పలవరించి కలవరించిన అలసట లేని ప్రయాణం ఆయనది. ఆయన కుంచెకు శాశ్వత విరామం దొరికినా మనల్ని వెంటాడే వెన్నాడె బొమ్మలు ఎన్నో ఈ వ్యవస్థ మీద సందించి వెళ్ళాడు. అవి కేవలం బొమ్మలు మాత్రమె కాదు. నాగరిక జీవనం మీద మొలిచిన గాయపు మరకలు.
పుట్టింది ఉత్తరాంధ్ర, పెరిగింది ఏలూరు బెజవాడ అయినా ఆయన బ్రతుకంతా తెలంగాణ గడ్డమీదనే గడిచింది. ఆయనను ఏమి నడిపించిందో ఎందుకు నడిపించిందో గానీ ఖమ్మం ఆయనను కడుపులో పెట్టుకొని సాకింది. ఖమ్మం అంటే ముఖ్యంగా డా.హరీష్ గారు ఆయన వెనక ఉన్న చోదక శక్తి. ఆయన చోదక శక్తి కనుక హరీష్ ఏమి చెబితే అది చేసే మనిషి కాదు. నిత్యం పనుల మధ్య సతమతం అయ్యే డాక్టర్ గారు అలా కాళ్ళ స్టూడియో కి వచ్చి ఒక కాఫీ తాగి కాళ్ళ బొమ్మలో ఒక సారి తల దూర్చి ఇద్దరూ రంగుల విన్యాసాల మీద కుస్తీ పట్టేవారు. అలా సినిమాలు,రంగులు, బొమ్మలు, పుస్తకాలు, డంకేల్, దండకారణ్యం, గోద్రా మీదుగా నడిచి మళ్ళీ ఇంకో కాఫీలోకి మారేవారు. డాక్టర్ గారు వచ్చారు కనుక వొద్దిక గా చేతులు కట్టుకుని నిల్చునే మనిషి కాడు ఆయన బొమ్మల లోకం లో ఆయన ఉండేవాడు. నాలాంటి పిపీలకాల కు వాళ్ళ రంగుల లోకం అర్ధం అయ్యి చచ్చేది కాదు.నాకు ఇప్పటికీ కాళ్ళ బొమ్మ అర్ధం అయి చావదు. ఇదేంటి కాళ్ళ అంటే అలా అంటే ఏం చెప్పాలి బాబూ అనేవాడు. అర్ధం చేసుకుంటే శక్తి ఉంటె ఆయన బొమ్మల్లో ఆదిమ కాలాన గుహలలో బ్రతికిన యాది గుర్తులు చూడొచ్చు. క్రూరజంతువులు దాడి చేసినప్పుడు గోడలమీద చిందిన రక్తపు చారికలూ చూడొచ్చు.

మధ్య యుగాల నుండి ఆధునిక యాంత్రిక లోకం దాకా మనిషి నడిచొచ్చిన సమస్త నాగరిక గుర్తులూ ఆయన గీతల్లో చూడొచ్చు. అబాగ్యుని ఆకలి కేకలు, ఆకలి గొన్న పశువులా అబలమీద దాడి చేస్తే ఆ కళ్ళల్లో ఒలికే భయాన్నీ చూడొచ్చు. ఎగిరే ఎర్రజెండాలో అమరుని విస్వాశాన్ని చూడొచ్చు. ఒక దారం సుడి తిరిగి తనను తాను ఉరేసుకునే కార్మికుని సంక్షుభిత ముగింపు చూడొచ్చు. పెత్తందారీ పెద్దన్న ఒంటి కన్ను రాక్షసుడిగా ఈ సమాజాన్ని కబళించే డాలర్ విక్రుతాన్ని చూడొచ్చు. శిలువ మోస్తున్న రైతన్న వ్యధను, గ్రహం స్టెయిన్ చెదిరిన చెదిరిన కలనూ, పిండాలకు గుచ్చిన త్రిశూలాలు, తెగిన తలలూ, విరిగిన విగ్రహాలూ, తొంబయ్యో దశకం లో ఆధునిక కవితా చోదక శక్తులు అయిన రక్తస్పర్శ కవుల ద్వేషం లో, బ్రతికిన క్షణాల వలపోతల్లో, పునరపి లో, నరుడో భాస్కరుడు విసిరిన గండ్రగొడ్డలి ఒడుపులో, గులాంగిరి అట్టమీద దైన్యంగా కూర్చున్న శ్రామికుడి నుదిటి స్వేదంలో, కాల కూట విషంలా మానవత్వం మీద దాడిచేసిన గోద్రా గుజరాత్ గాయపు కన్నీటి చారికల్లో,దళిత రాజకీయాల్లో,భామ కరుకు,సంగతి లో, కేశవరెడ్డి నవలల అట్ట మీద బొమ్మల్లో, ఒకటా రెండా వేలాది బొమ్మల్లో ఆయన మార్క్ గీత అర్ధం కావాలి అంటే ముందు కాస్త రంగు అర్ధం కావాల. వర్తమాన వాద వివాదాల లోతు తేలియాల,ముఖ్యంగా రవివర్మ బొమ్మల్లో సుకుమారం, ఆహ్లాదం వెతికే బాపతు గాళ్ళకు కాళ్ళ బొమ్మలు నప్పవు. ఆరించుల కంప్యూటర్ మీద టెక్నాలజీ చేసే విన్యాసపు తంత్రీ వెలుగులకు అలవాటు పడ్డ వాళ్ళకు కూడా కాళ్ళ బొమ్మలు అర్ధం కావు. అవి అర్ధం కావాలి అంటే పాలరాతి గదులు తూడ్చి శుచి శుభ్రాన్ని ప్రసాదించిన కూలి తల్లి చేతికి అంటిన మరక తెలియాలి, అరచేతిలో అరిగిపోయి అదృశ్యం అయిన గీతల ఆనవాళ్ళు తెలియాలి. అగొ అప్పుడు కాళ్ళ సత్యనారాయణ సాక్షాత్కారం నీకు లభించుద్ది. ఖమ్మం మేడినోవా డా హరీష్ గారి ఛాంబర్ లో గోడమీద పెద్ద మ్యూరల్ పెయింటింగ్ చూడొచ్చు. దానిపేరు కాలం. స్థల కాలాల మధ్య మనిషి ప్రస్తానం వలయాలు వలయాలుగా నైరూప్య కుడ్య చిత్రం అది. ఆయన వేసిన బొమ్మల్లో బాగా పేరు సంపాదించు కున్నది. ఉండడానికి ఎక్కడో మారుమూల డంజన్ లో ఉన్నా ఆయన ద్రుష్టి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చిత్రకళ లో వచ్చిన ధోరణులు,కళలు సాహిత్య గమనాలు, ఆధునిక ఆత్యాదునిక ధోరణులు, సాల్విడార్ డాలీ, ఇంకా నాకు నోరు తిరగని ప్రాచ్యాత్య చిత్రకారుల నడవడికతో పోటీ పడతాడు కాళ్ళ. తెలుగు సమాజాన ఆకలితో, అవమానాలతో బ్రతికే బడుగు జీవుల ఆర్తనాదాలు, పికాసో గుయర్నికా విద్వంసాన్ని నేను మొదటి సారి కాళ్ళ బొమ్మల్లోనే దర్శించాను.

గోయా, పికాసో బొమ్మల్లో బీభత్సాన్ని తెలుగునాట వర్తమాన కన్నీళ్లు ఆయన కాన్వాసును తడిపాయి.ఆయనకు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత చేయూత ఇచ్చినా జీవితాంతం లేమిలోనే బ్రతికాడు.ఆయన ఎప్పుడూ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథల గురించి ఎక్కువగా చెప్పేవాడు.పతంజలి,చలం, ప్రేమ్ చంద్, కో.కు అన్నా ప్రేమ. బొమ్మలూ, సినిమాలూ,సాహిత్యం ఆయనకు ఇష్టమైన వ్యాపకం.మొత్తం పుస్తకం చదివితే తప్ప బొమ్మ వేసేవాడు కాదు. తొందర పెడితే అసలే వేయడు.ఆయన బొమ్మలను నేను అమ్ముకోను అవి నా బిడ్డలు అనేవాడు. ఒక సారి కాళ్ళ గురించి తెలిసిన నాటి ఖమ్మం కలెక్టర్ అరవింద కుమార్ ఆఫీసు ల్లో బొమ్మలు వేయండి కాసిన్ని డబ్బులు ఇస్తాం అంటే “ఆ పనికి చానా మంది ఉన్నారు నేను చేయను అని సున్నితం గా తిరస్కరించాడు.ఈ బొమ్మలు బువ్వ పెట్టకుంటే నా రిక్షా నాకు ఉంది అనే తెగింపు. ఆయన ఆకలిని ఎక్కువగా ప్రేమించి ఉంటాడు.ఆయన కన్నీళ్ళు,పేగులు ఎప్పుడో ఎండిపోయి ఉండొచ్చు. ఆయన సహచరి కోటమ్మ గారు, ఇష్ట సఖి డా. హరీష్ గారు పోయాక మరీ ఒంటరివాడు అయ్యాడు. ఒక రకంగా ఆయనకు ఆ రెండు మరణాలు కోలుకోలేని దెబ్బ తీసాయి.అందుకే చావుకూడా నిర్దయగా ఆయనను దొంగ దెబ్బ తీసింది.

కాళ్ళ ఆయన పూర్వీకుల నుండి పొందిన ఆస్తులూ అంతస్తులూ జ్ఞానమూ ఏమీ లేదు.తండ్రి ఒక సాధారణ రిక్షా కార్మికుడు. కాళ్ళ కూడా బ్రతుకు దెరువు కోసం రిక్షా తొక్కాడు. ఖమ్మం లో రెండు గదుల ఇల్లు తప్ప ఆయనకు మిగిలింది ఏమీ లేదు.ఇప్పుడు ఇవ్వడానికి ఆయన వారసులకూ ఏమీ మిగల్చలేదు.తన తండ్రి మిగిల్చు కున్న నిజాయితీ మినహా అది కాళ్ళ కడుపు నింపలేదు ఆయన వారసుల కడుపూ నింపదు. తాను బ్రతికి నంతకాలం కీర్తికీ, ప్రచారానికీ, ఆడంబరాలకీ దూరంగా తాను ఈ లోకం లోకి ఎంత నిరాడంబరంగా వచ్చాడో అంతే నిదానంగా నిష్క్రమించాడు. ఆయనకు మరణం తర్వాత జరిగే తంతు మీద ఎటువంటి విశ్వాసం లేదు. స్థానిక మెడికల్ కళాశాలకు ఆయన దేహాన్ని ఇచ్చారు. అటువంటి కాళ్ళ మరణం తర్వాత మనిషి తలపోతలను బొమ్మల రూపం లో ఉంచాడు.పుట్టుక నుండి ఆయన బొమ్మలకి విలువ కట్టే సాహసం మనం చేయలేము.మన మధ్యే బ్రతికిన ఒక మహా చిత్రకారుడి అమూల్యమైన సంపద ఎలుకలకూ పంది కొక్కులకూ బలికావడమే ఈ కాలపు విషాదం. ఇది ఒక కాళ్ళకు జరిగిన నష్టం కాదు. ఒక మహా చిత్రకారుడు నిష్క్రమణ ఈ లోకానికి తెలియకుండా పోవడం వెనక మనందరి సామూహిక వైఫల్యం ఉంది. ఆయన బొమ్మలు ముందు తరాలకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అదే కాళ్ళకు మనం ఇచ్చే నివాళి.

జోహార్ కాళ్ళ! జోహార్ !! జోహార్.!!!

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కాళ్ళ గారు సీతారాం గారి పుస్తకం అట్ట మీద బొమ్మ వేయగా పరిచయం….ఆయన జీవిత యాత్ర వివరంగా, మనసుకు అత్తుకునేటట్టు చెప్పారు…మీకు ఋణపడి ఉంటానండీ….ఎంత నిబద్ధత! ఇది కదా అనుసరణీయం….కళ్ళు చెమర్చాయి…ధన్యవాదాలు అండీ

    • థాంక్స్ శైలజ గారూ
      ఆ వ్యాసం నేను అప్పటికి అప్పుడు రాసింది
      ఎవరో అడిగితే రాసా నాకన్నా ఆయనను దశాబ్దాలుగా ఎరిగిన మోహన్,ప్రకాష్, సురేంద్ర,శ్రీనివాస ప్రసాద్,అఫ్సర్,ఇక్బాల్ చాంద్,సీతారాం లాంటి వాళ్లు రాస్తే అసలు కాళ్ళ చరిత్ర బయటకు వచ్చేది

  • ” చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్ ప్రింటర్, తన లోకపు నవ్వుల వేదాంతి కాళ్ళ సత్యనారాయణ నవంబరు 24, 2018 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి నిష్క్రమించారు.

    బ్రతికి నంతకాలం కీర్తికీ, ప్రచారానికీ, ఆడంబరాలకీ దూరంగా తాను ఈ లోకం లోకి ఎంత నిరాడంబరంగా వచ్చాడో అంతే నిదానంగా నిష్క్రమించారు.

    కాళ్ళ సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ణి అలాగే పట్టించుకోలేదు.

    అతని కవిత నిరూపం , ఆయన గానం ఏకాంతం , కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్ పై జారిన చెమట చుక్క నిశ్శబ్దం.

    జోహార్ కాళ్ళ! జోహార్ !! జోహార్.!!! ”

    “ అడవిలో కురిసిన రంగుల వాన “ అంటూ కాళ్లకు నివాళి అంజలి ఘటించి…. ఒక మహా చిత్రకారుడు నిష్క్రమణ ఈ లోకానికి తెలియకుండా పోవడం వెనక మనందరి సామూహిక వైఫల్యం ఉంది. ఆయన బొమ్మలు ముందు తరాలకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది అంటున్న డా. గుర్రం సీతారాములు కి కృతజ్నతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు