“ఏ మాటర్ ఆఫ్ లాట్ ఆఫ్  డిఫరెన్స్”

న్నపూర్ణమ్మ చెరువుకు వస్తుంటే ఊరు ఊరంతా ఒక పారవశ్యానికి లోనవుతుంది పచ్చటి మేలిమి బంగారు ఛాయ ఐదున్నర అడుగుల ఎత్తుతో , కళ్ళు పెద్దవి కానీ స్వేచ్ఛగా నవ్వ గలిగితే చిన్నవవుతాయి .. దానితో మొఖమంతా  ఒక  అందం అలుముకుంటుంది “ఏంటా విరగ బాటు” అంటూ ఎనిమిదో ఏడు నుంచి ఆ నవ్వు కత్తిరించబడి పూర్తిగా కనుమరుగైపోయింది దానిని భర్తీ చేస్తూ పసుపు మెత్తటంతో, ఎర్రని కుంకుమతో పెద్ద బొట్టు మొఖాన చేరడంతో, 

ఒక పవిత్రతతో కూడిన అందం చూపరులకు భక్తి తో కూడిన పారవశ్యం కలిగిస్తుంది  అన్నపూర్ణమ్మ సూర్యోదయంతో పాటు లేస్తుంది రాగి బిందెతో పాటు చెరువు వైపుకి నడుస్తుంది చింతపండుతో  దానిని తోముతుంది.. నాలుగు మునకలు వేస్తుంది తడి వస్రాలతో నిండు కుండ భుజాన ఎత్తుకుని, మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది . చేలకి కాపలా కాసి ఇళ్ళకి వచ్చేవాళ్ళు, పొలాలకు పోయేవాళ్ళు, చెంబట్టుకుని కాలవొడ్డుకి పోయేవాళ్ళు, ఆవిడకి ఎదురయ్యేవారు వాళ్లందరికీ అన్నపూర్ణమ్మ  దేవతలా కనిపించేది. 

      ఆ రోజు కూడా ఆమె తడిసిన చీరతో, కాసిపోసిన కట్టుతో, పెరటి వైపు సింహద్వారం తలుపు తోసుకుని వాకిలి లోకి అడుగు పెట్టింది విశాలమైన ఆ వాకిలిలో రెండు బళ్లు, గొడ్ల సావిడి ఒక వైపు ఉన్నాయి  మరో వైపు మావిడి చెట్టొకటి ఉంది  గాదె, గడ్డి కుప్పా ఆ వైపున్నాయి మందార చెట్టు మొదట్లో నాలుగు నీళ్లు చిలకరించింది   మెట్ల మీదుగా బిందెతో ఎత్తుగా ఉన్న అరుగు మీదికి ఎక్కుతోంది ఇంతలో ఎదో అలికిడి వినిపించి వెనక్కి తిరిగింది ఏ సోబు అని అందరూ పిలిచే పెద్ద పాలికాపు ఏసుపాదం వాకిట్లో నిలబడి ఉన్నాడు 

                        ఏసోబు చూపుల్లో అన్నపూర్ణమ్మ పైన ఇష్టం ఉంది . ఇది మామూలే అన్నపూర్ణమ్మకి ., ఆరడుగుల విగ్రహం ఏసోబుది . వెండి మొలతాడుతో వొంటి మీద ఒక్క గోచితో మాత్రవే బలిష్ట మైన కండలు, విశాలమైన ఛాతీతో నందీశ్వరుడిలా  ఉన్నాడు. ఆమె హృదయంలో ఎప్పటిలాగే ఒక చిన్న అలజడి .,   తనను నిత్యం వెంటాడే ఏసుపాదం చూపుల్లో ఆరాధన, ప్రేమ తన విఫల దాంపత్య జీవితం పట్ల ఒకింత జాలి కనిపించి తనలో కలిగే ఒకింత కలవరం, అతగాడి జాలి చూపులకు ఉడుకుమొత్తనంతో కూడిన అభిమానం దుఃఖం , కోపం అన్నీ కలిసి పొంగిన  నిస్సహాయత..  తప్పు కాదూ ఇలా పరాయి పురుషుడిపై ఇష్టమో, మోహవో కలగడం ., తప్పా ..తప్పేలా అవుతుంది? తననే మాత్రవూ ప్రేమించని  భర్త రోజుకో ఆడదాని దగ్గరకు వెళ్తుంటే., ఉప్పూ కారం తినే దేహం తనకీ ఉంటాయిగా కోరికలు  తనేవన్నా వయసై పోయిన ముసలిదా  యావన్నానా? మీదనుంచి ఈ ఏసోబు వొహడు.. కనిపించినంత మేరా  అంతలా ప్రేమగా  చూస్తుంటే, వేసవిలో మావి చివురు చూసి కోయిల పాడుతున్నట్లే  తన హృదయం కూడా పరవశించి ఊగుతుందీ, పాడుతుంది  మరి. పిట్టకే అట్టా అనిపిస్తే  నిండు  మనిషాయే తను  ., అయినా ఆడ బతుక్కి నీతీ నియమం , కట్టు ముట్టు ఉండి  సచ్చాయిగా వాటిని పాటించధ్ధు మరి ?  ఆ గీత దాటితే యావన్నా వుందీ.. అటూ, ఇటూ ఉన్న ఏడు తరాలూ తనను కోసి కారం పెట్టరూ? తప్పేగా..మరి  తప్పేగా.. తప్పే సుమీ .. తప్పేవిటీ పాపం ..మహా పాపం ..పంచ మహా పాతకాలూ చుట్టుకోవూ? తన మొగుడు బురదలో పొర్లుతున్నాడని తానూ అదే చేస్తుందేవిటి ? కనీసం బుద్ధి చెప్పడానికైనా ఆ పని చేయచ్చునా తను.. తప్పు కాదూ ?  వెంటనే తననేమాత్రవూ ప్రేమించని మొగుడు సుబ్బారావు పంతులు మీదా, తనలో ఆశలు రేపుతున్న ఏసోబు  మీదా ఒకేసారి  నిస్సహాయతతో కూడిన ఆగ్రహం వరదలా కమ్ముకోచ్చేసింది అన్నపూర్ణమ్మలో  “నువ్విక్కడినుంచి పోరా అనవసరంగా ఎందుకు నిలబడ్డావు పో పోయి పని చూసుకో” అన్నది   ఎర్ర బడ్డ కళ్ళని,   కన్నీటి తెరల్ని  కనపడకుండా ముఖం అసుంట పక్కకి తిప్పేస్తూ. మరోపక్క దేవుడింట్లో తప్ప మరెక్కడా దించని బిందె బరువు ఆమె నడుముని సలుపుతుంటే, తిన్నగా నిలవలేక కాళ్ళను అటు ఇటు కదుపుతూ బిందెని నడుము మీదే కొంచెం నొప్పిలేని వైపు జరుపుకుంటూ లోపలికి  నడవబోయింది. ఏసోబు మొఖం చిన్నపోయింది ఒక్కసారిగా గాలి వీచి ఆరిపోయిన దీపంలా అతని మనసులో చీకటి కమ్మినట్లైంది. అతనికి ఖరారుగా తెలుసు అన్నపూర్ణమ్మకి తనంటే ఇష్టమని లేదా తనకు ఆమె పట్ల ఉన్న ఇష్టం పైన గ్రహింపూ,  ఒకింత ఆమోదవూ ఉన్నాయనీను “మరండీ..బెమ్మంగోరు రాజమండ్రి నుంచి దిగడ్డారండి ..బాబయ్యగోరు పది గంటల  కారుకి యర్రారంలో దిగుతారటండీ, బండి తోలుకు రమ్మని కవురేట్టారంటండి” అన్నాడు ఏసోబు తల దించుకుని మెల్లిగా.  వింటూన్న అన్నపూర్ణమ్మకి ప్రాణం ఉసూరుమన్నది.. ఐదు అడుగుల ఎత్తుతో పీలగా ఉండే ఆ మనిషికి అంత పిచ్చెంటీ.. ఆ రోగాలేంటి అనుకుంది .

                                           “ నీకూ, నీ బాబు గారికి మధ్య నా బోడి పెత్తనం ఏంట్రా .. పెట్టిబండి ఉంది , లాగడానికి మైసూరు గిత్తలున్నాయి, తోలటానికి నమ్మిన బంటువి నువ్వుండనే ఉన్నావు  బండి తీసుకెళ్లి అయ్యగారిని తీసుకురా పో” అని ఏసోబు వైపుకి చూడకుండా ఉండడానికి తనని తాను అతి కష్టం మీద నిగ్రహించుకుని నిర్లక్ష్యం నటిస్తూ లోపలికి నడిచింది అన్నపూర్ణమ్మ .. ఏసోబు గొంతులోకి  తను కసిరినందుకు వచ్చి చేరిన బాధ నిండిన  ధ్వనిని మనసులోనే వింటూ దిగులుగా . 

                                                 +++++++++++++++++++

   పన్నెండు దాటింది సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు ఎండ పేల్చేస్తోంది. బండితో పాటు చెప్పులు లేకుండా నడుస్తున్న ఏసోబు చెమటలు కక్కుతుంటే , ఒక్కుదుటన ఆగిన బండి నుంచి  సుబ్బారావు పంతులు జాపోస్తూ దిగాడు అతగాడి విధవ చెల్లెలు  పాపాయమ్మ గుమ్మం లోపలే నుంచుని విసనకఱ్ఱతో విసురుకుంటోంది.  భుజాన తుండు గుడ్డతో, గోలెం దగ్గర నిలబడి కాళ్ళకు  నీళ్ళిచేందుకు చెంబు పట్టుకు నిలబడింది అన్నపూర్ణమ్మ 

                               స్నానం చేసి మధ్యాహ్న విధులు పూర్తి చేసుకొని వచ్చి భోజనానికి కూర్చున్నాడు పంతులు వెండి పొన్నులు వేసిన పీట మీద కూర్చుంటే, నెయ్యి  వడ్డిస్తూ “ఎలా ఉందన్నయ్యా” అంది పాపాయమ్మ . అన్న రోగంలో  ఉన్న రహస్యం కనుక్కోవాలని ఆమె ప్రయత్నం బండి దిగిన దగ్గర్నుంచీ వదిలి పెట్టకుండా చుట్టు తచ్చాడుతున్నది. మఠం వేసుకుని కూర్చోడానికి నానా అవస్థలు పడుతున్న భర్తను చూసి ఓ వేపు నవ్వు, మరో వేపు బాధ, అసహ్యం  తన్నుకొస్తున్నాయి  అన్నపూర్ణమ్మకి.  మొగుడు, చెల్లి  పలకరింపులకి జవాబు చెప్పకుండా తనని ఉరిమినట్లు చూడడంతో “ వదినగారూ, మీరు వెళ్లి ఆ ఏసోబుగాడి వడ్డన సంగతి చూడండి” అంటూ పాపయమ్మకి  పని పురమాయించింది అన్నపూర్ణమ్మ .

రాజమండ్రిలో కొట్టుకి బెల్లం వేస్తాడు పంతులు. రాజమండ్రి మెరక వీధిలోనూ, కాకినాడ బుడంపేటలోనూ  బాగా పేరున్న వాడు. అంతకు ముందు నాటకాలు , ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమాలకు మహారాజ పోషకుడు. తెల్లటి మల్లు చొక్కా , చేతుల మడతలోంచి పది రూపాయలు కనపడేలా కడతాడు. కొత్త రూపాయి నోటులా తళ తళ లాడుతుండే సుబ్బారావు పంతులు, ఆ రోజు సత్తు  రూపాయిలా కళా కాంతి లేకుండా ఉన్నాడు  మెతుకులు గతుకుతున్నాడు గానీ ఎప్పటిలా ఉషారుగా ముధ్ధలు చేసుకుని గబా గబా తినడం లేదు . నడకలోనూ తేడా ఇట్టే తెలిసిపోతున్నది గజ్జల్లో బిళ్లల వాపు ఎక్కువగా ఉన్నట్లున్నది.. అడావుడిగా రాజమండ్రి పరిగెత్తాడు మూడు రోజుల క్రితం .

 

                          “చెవుతోందిగా  వెళ్లి ఆ పని చూడు” అంటూ కసిరాడు చెల్లిని సుబ్బారావు . నెత్తిమీద గుడ్డని సవరించుకుంటూ విసుగ్గా, విసురుగా నడిచింది పాపాయమ్మ . 

                            “ ఏవిటయ్యిందేవిటి మరీ అంతలా బాధపడుతున్నారు డాక్టరుగారేవన్నారేవిటీ..” అంటూ అడగబోయింది అన్నపూర్ణమ్మ..  మొగుడు గుడ్లురుముతూ చూసేసరికి మాట ఆపేసి  కూర వడ్డించి, విసన కర్ర అందుకుంది 

         “సవాయిట..”, అని మంచి నీళ్లు తాగి, “తగ్గుతుందిట” అన్నాడు

         విసరటం ఆపి,  నోటి మీద చెయ్యి వేసుకుని  అలా ఉండి పోయింది అన్నపూర్ణమ్మ 

గాలి తగలక పోవటంతో  చటుక్కున ఆమె వైపు చూసాడు వెంటనే గతుక్కు మన్నాడు.. ఆమె చూపులకే శక్తి ఉంటె ఎర్రబడ్డ ఆ కళ్ళ దావానలంలో మండి, మాడిపోయేవాడే .. వెంటనే ఆ చూపుల్ని తప్పించుకుంటూ, పక్కకంటా చూస్తూ  “మొగుడు చచ్చినట్లు ఆ చూపేంటే ముండా ! చచ్చాక చూడొచ్చులే” అన్నాడు.. అంటూనే కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు.  ఎర్రబడ్డ కళ్ళతో ఆగ్రహంగా చిగురుటాకులా వణుకుతూ .. అతగాడి వైపు చూస్తూ స్థాణువులా నిలబడిపోయిన ఆమె భుజం మీద ఉన్న తుండు గుడ్డ తీసుకుని, చేతులు వొత్తుకుని, దాన్ని ఆమె మీదకి విసిరేసి గదిలోకి నడిచాడు. చెరువు గాలి వచ్చేలా కిటికీనీ, దానికి జవాబుగా గుమ్మాన్నీ ఎదురెదురుగా కట్టిన ఆ గదిలో మంచం మీద నడుము వాల్చాడు.  ఇచ్చిన మందులకు  కాస్తంత నొప్పులైతే తగ్గాయి కానీ, జబ్బ మీద ఇచ్చిన ఇండీషనుకి కదుము కట్టింది. చెయ్యి నొప్పిగా ఉంది.. పట్నం డాక్టరుకు ఎటకారాలకి తక్కువేమీలేదు.. నొప్పి గురించి చెవితే ఓ బూతు సామెత చెప్పి పళ్ళికిలించాడు ఏమనలేక ఓ వెర్రి నవ్వు దానిలో కలిపాడు సుబ్బారావు. 

                                        

సుబ్బారావు తనమీద విసిరి కొట్టిన  తుండు గుడ్డ స్పర్శ, వాసనా   అసహ్యంగా అనిపించింది  అన్నపూర్ణమ్మ ముఖానికి. అతగాడు వదిలి వెళ్లిన ఎంగిలి కంచం వైపు చూసింది చివరాఖరుగా తిన్న పెరుగు లోని వెన్నా, కూరల్లోని  ఎర్ర రంగు నూనె కలిసి తేలుతూ.. ఎంతో  రోతగా అనిపించింది .. ఇన్నాళ్ళూ ఇన్ని సుఖ రోగాలున్న మనిషి ఎంగిలి కంచంలో ఎలా తిన్నాననుకుంది  తల్చుకుంటేనే.. విరక్తిగా దుఃఖంగా అనిపించింది అన్నపూర్ణమ్మకి. శేషభుక్త సంప్రదాయం పక్కన పెట్టి వేరే కంచంలో వడ్డించుకున్నా ముద్ద గొంతు దిగటం లేదు ,. “సవాయిట.. తగ్గుతుందిట” అన్న మొగుడి మాటలే చెవుల్లో చిమ్మ చీకట్లో తీతువు పిట్ట ధ్వని లాగు వినిపిస్తూనే ఉంది. ఎంత మావూలు మాటలాగా అన్నాడు, చెట్టుకు కాయ కాసింది అన్నంత సునాయాసంగా.. ఇంత సిగ్గు, లజ్జా ఏమాత్రవూ లేకండా. ఈ లోగా పాపాయమ్మ వస్తూ “ఆకు నిండా కుంభం పెట్టి వచ్చాను ఆయనగారికి” అంది . అన్నపూర్ణమ్మ కళ్ళు వత్తుకుంటూడడంతో, “ఏమైందొదినా” అంటూ తనూ ఒక కంచం పెట్టుకుని పక్కన కూర్చుంది. అన్నపూర్ణమ్మ కంచంలో చెయ్యి కడుక్కునేసరికి విస్తుబోయి చూస్తూ “అదేవిటి వదినా ఎప్పుడూ లేనిది” అంది 

                                    ++++++++++++++++++++++++++++++

                  రాత్రి ఎనిమిదవుతోంది. ఇంట్లో ప్రతి గదిలోనూ గోడకి తగిలించిన బుడ్డీ దీపాలు వెలుగుతున్నాయి. చెరువు గట్టు వారని ఉన్న రావి చెట్టు ఆకులు గల గల మంటున్నాయి. గాలి కదలబారింది. దూరంగా చెక్క భజన వినిపిస్తోంది చెరువుగట్టు మీద చెట్ల కింద వెన్నెల నీడలో ఆడుకుంటున్న పిల్లల సవ్వడి .

                                             సుబ్బారావు గదిలో హరికేన్ లాంతరు వెలుగుతోంది. అన్నపూర్ణమ్మ గదిలోకి వచ్చింది, వత్తి తగ్గించింది భార్య వచ్చిందని అర్థం అయ్యి సుబ్బారావు “కాళ్ళు నొక్కి తగలడు” అన్నాడు . ఆ కాళ్ళు నొక్కి తగలడ్డం అనే పని ఏమాత్రమూ ఇష్టం లేని అన్నపూర్ణమ్మ ఆ మసక చీకట్లో అలా నిలబడి ఉండిపోయింది. భార్య తన దగ్గరకు వస్తున్న అలికిడి వినిపించని సుబ్బారావు  వెనక్కి తిరిగి మసక చీకటిలో నీడలాగ నిలబడిపోయిన అన్నపూర్ణమ్మను చూస్తూ  “అక్కడ చచ్చావేంటే  వచ్చి కాళ్ళు వత్తమన్నానా.. ఇట్టా వచ్చి తగలడు” అంటూ పళ్ళ బిగువున కోపాన్ని అణుచుకుంటూ  అన్నాడు. బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్న అన్నపూర్ణమ్మ ఇక తప్పదన్నట్లు పడుకున్న భర్త దగ్గరికి వచ్చింది. కాళ్ళు పడుతూ పాదాలు వత్తడం మొదలు పెట్టింది ఆడపిల్ల పాదాల్లా చిన్నగా ఉన్నాయి  గుండెలో రేగిన సలపరాన్ని పైకి కనపడకుండా మింగేసింది . ఎక్కడికో వెళ్లి, ఆడాళ్లతో పడుకొని, రోగాలు అంటించుకొని వొళ్ళు నొప్పులంటూ వచ్చి, తనతో దబాయించి మరీ కాళ్ళు పట్టించుకుంటున్న మొగుడి దాష్టీకానికి అన్నపూర్ణమ్మకు చీదర పుట్టేసింది. వేళ్ళు లాగుతుంటే అందాక బిగుసుకున్న మనిషి కాస్తంత వదులైనట్లు గ్రహించింది.  

                                      

             “సవాయి తగ్గటానికి ఓ చిట్కా ఉందిట” సుబ్బారావు మెల్లిగా అన్నా  స్పష్టంగానే అన్నాడు. కాళ్ళు వత్తుతున్న అన్నపూర్ణమ్మ నిరాశక్తతో విన్నది. ఆమె చేతులు ఒక్క క్షణం ఆగిపోవడం గమనించి, పడుతున్న కాలిని వదిలించుకుని  ఓ మారు జాడించాడు సుబ్బారావు. భార్య తన మాట విన్నదని  గ్రహించాడు, ఆనక  “విన్నావా” అన్నాడు దబాయించినట్లుగా, . విని తీరాల్సిందే .. మరి ఎందుకు వినలేదన్నట్లుగా  ధ్వనించింది అతని గొంతు . మనసులో ఉన్నది చెప్పకుండా బిగబట్టాడు కొంతసేపు “విన్నావా..చెప్పనా” అన్నాడు.. వినటానికి అన్నపూర్ణమ్మ ఏదో మహా తహ తహ లాడిపోతున్నట్లు ..”ఏంటది” అన్నది అన్నపూర్ణమ్మ ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా .. అదేదో అతగాడు కక్కేస్తే ఆ గదిలోంచి పారిపోవచ్చన్నట్లుగా. “ఈడేరని పిల్లతో పడుకోవాలిట” అన్నాడు అన్నపూర్ణమ్మ మొఖంలోకి పట్టి, పట్టి చూస్తూ ., ఆ చీకటిలో దీని మొఖంలో ఏవీ కనపట్టంలా  అనుకుంటూ. కానీ అన్నపూర్ణమ్మకు సుబ్బారావు ఆ చీకటిలో కూడా కనిపించాడు .. చీకట్లో మంచం మధ్యలో కూర్చున్న సుబ్బారావు నీడ, చిన్నప్పుడు బామ్మ చెప్పిన కథలో అర్ధ రాత్రి అడవిలో, చీకట్లో చిన్నారి  రాజకుమారిని ఎత్తుకుపోవడానికి రాజమందిరం వైపు  బయలుదేరిన ఒంటికంటి రాక్షసుడి లా కనపడ్డాడు . భర్త నీడ వైపు మళ్ళీ చూసింది .. ఏం చేయబోతున్నాడు ఇతగాడిప్పుడు? అన్నపూర్ణమ్మ మనసు వొణికింది సన్నగా.  అన్నపూర్ణమ్మ కళ్ళకి సుబ్బారావు మొఖంలో నీడలు వికృతంగా కదులుతూ ఇంకా నల్లగా కనపడ్డది . అప్పటిదాకా యుగాలుగా ఈడ్చుకుపోయిన  రోగిష్టిలాగా,  చీపురు పుల్లల్లాగా మంచం మధ్యలో పడివున్న సుబ్బారావు చటుక్కున లేచి.. మంచం మధ్యలో కూర్చుని పంచె సవరించుకున్నాడు ., ఆనక  ఉషారుగా “విను.. నేను విన్నాను కూడాను , మా శంకరం మావయ్యకు అలాగే నయమయిందట” అని జోడించాడు 

శంకరం  మావయ్య అంటే , ఆ రామవరం బాబయ్య  .. రోగాలతో తీసుకునే ఆ శంకరం అనే పెద్దమనిషి  చెల్లెమ్మా అని పిలుస్తూనే.. తనని తినేసేలా చూడడం , వెకిలి మాటలు మాట్లాడ్డం గుర్తుకు వచ్చి వళ్ళు చీదర అనిపించింది ఆమెకి . భర్తనీ  అంతే చీదర గా  చూసింది అన్నపూర్ణమ్మ . “ఏదీ ఆ రామవరం బాబయ్యేనా”?  కోపంగా అడిగింది అన్నపూర్ణమ్మ . ఆమె గొంతులో కోపాన్ని పట్టించుకోకండా..”మరే..అసలు వాడికి సవాయి ఎలా వచ్చిందో .. అదో  కథ.

సన్నగా ఉండేవాడు పక్షి రోగం అనేవారు బియ్యం తినడం అలవాటోహటి. వాడికి ఎవరో చెప్పారుట..సవాయున్న దాని దగ్గరికి పోతే లావవుతావని ..పోయాడు. నిజంగానే వొళ్ళు చేసాడు తరువాత. పెళ్లయింది, పిల్ల కూడా పుట్టింది . పాపం సవాయి తిరగబెట్టింది . ఎవరో ఈ మాటా చెప్పారు.. అదే,  ఈడేరని పిల్లతో పడుకుంటే సవాయి పోతుందని,. ఏ పిల్లా దొరకనట్లున్నది పోయాడు” అంటూ ముగించాడు ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది.  చేతులు తిప్పుతూ  అభినయం చేస్తూ వింత చీకటి పశువులా   తన మావయ్య వికారాన్ని బోలెడంత సానుభూతితో అదో కథ అంటూ, ఏదో.. దేశం కోసం త్యాగం చేస్తున్న వీరుడి కథలా గొప్ప పారవశ్యంతో  చెబుతున్న  సుబ్బరావుని చూస్తుంటే ఈ చీకటిలోనే వీడు ఇట్ఠాగే అదృశ్యమైపోనూ అనుకుంది అన్నపూర్ణమ్మ. ఆ పసి పిల్ల ఎవరో కానీ వాడికి  బలి కాలేదు అదృష్టవంతురాలు అని కూడా, అనుకుంది అలా అనుకున్నప్పుడు, తన  మనసులో కొద్దిగా  మజ్జిగ చిలికినప్పుడు వచ్చే  వెన్న అలా మెల్లిగా కదిలి  మెలిగినట్లు ఆనందం  కలగడమూ గమనించింది అన్నపూర్ణమ్మ . ఆమె భర్తను పరీక్షగా చూసింది .. పెళ్ళాంతో మాట్లాడితేనే లోకువ అయిపోతాం అన్నట్లుంటారు ఆ ఇంట్లో వాళ్ళు. సుబ్బారావు తల్లీ దండ్రీ గోదావరి పుష్కరాలలో కొట్టుకుపోయారు. అప్పటివరకూ పగలు భార్యా భర్తల్ని చూస్కోడానికి కూడా వదిలేవారు కాదు అట్లాంటి సుబ్బారావు తనతో అంత సేపు మాట్లాడ్డం చూసి , కొత్త మనిషిని చూసినట్లు చూసింది అన్నపూర్ణమ్మ . ఇతగాడికి తనతో ఏదో అత్యవసరమైన పనేదో పడ్డట్టున్నది కొద్దిసేపట్లో అడగబోతాడు కామోసు అనుకుంది. అన్నపూర్ణమ్మకి   భర్త చెబుతున్న తనవీ, రామవరం బాబయ్యవీ వొళ్ళు బలిసి తెచ్చుకున్న సుఖ రోగాల కబుర్లు పరమ చెత్తగా ఖంపు కొడుతున్నాయి.

                      ఇంతలో సుబ్బారావు కొంచెం భార్య వైపుకి ఒంగుతూ “ఇదుగో ఇట్టా రా ఒక మాట చెవుతా ..విను” అంటూ “మన ఏసోబుగాడి కూతురుంది చూసావూ..” అన్నాడు గుస గుసగా తన పక్కనే ఇంకెవరో ఉండి  వాళ్లకు వినపడిపోతున్నట్లుగా.. వినపడకూడదన్నట్లుగా, ఏమీ లేని వైపుకి ఏదో ఉన్నట్లుగా చూస్తూ. అంత చీకట్లో కూడా అన్నపూర్ణమ్మ కళ్ళు విశాలం అయిపోవడం, ఆ విశాలమైపోయిన కళ్లల్లో నుంచి భయం ఉప్పెనలా పొంగిపోవడం  కాసింత వెన్నెల కిటికీ లోంచి ఆ రాత్రి వేళ   లోపలికి  దూరిందేమో కనిపించింది  సుబ్బారావుకి . అతగాడు మనిషే అయితే.. ఆ క్షణాల్లో భార్య కళ్ళల్లో కనబడ్డ భావం చదవగలిగేవాడు. బహుశా సుబ్బరావుకి కూడా తను మనిషే కాడని అర్థం అయ్యే ఉంటుంది  ఒక వేళ ఆ భావాల్ని చదివినా మగవాడు కదా ఆ భావం పెద్ద ప్రభావం కలిగించి ఉండదు ఆడ ముండల్ని అర్థం చేస్కోటం కూడానా.. సుబ్బారావు ఆ మాటలు అంటూ అన్నపూర్ణమ్మను చాలా మాములుగా చూసాడు.. ఏ భావమూ కనపడకుండా చూసాడు,. ఆమె మొఖంలో కనపడ్డ భావం గమనించనట్లుగా కూడా చూసాడు ..అసలు తను ఏ అనర్థమూ  అననట్లుగా అమాయకంగా కూడా చూసాడు.  ఇంత దానికే ఇంత వెర్రెక్కి పోతున్నట్లుగా ఆ చూపేంటి అని అన్నపూర్ణమ్మను దబాయిస్తున్నట్లుగా కూడా చూసాడు   అసలు అన్నపూర్ణమ్మ ఆ మాటలు విన్న వెంటనే సుబ్బారావును ఎలా చూసిందంటే, చిన్నప్పుడు బామ్మ చెప్పిన కథలోని రాక్షసుడు తన ముందు ప్రత్యక్షమైనట్లే చూసింది . సుబ్బారావు మళ్ళీ తానే ఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు కొద్దిగా తగ్గించి.. “పోయి, పోయి ఆ అంటారానిదాని దగ్గరికి పోవడమా ..అంత గడుక్కిపోయి ఏవీ లేననుకో ..అనీ అనిపిస్తుంది కానీ .. తప్పదు సవాయి తగ్గాలంటే.. ఏం చేస్తాం.. గాయత్రి చదివేసి, జంధ్యవు సచేల స్థానం చేస్తాలేవే  ఆ మాల   పిల్ల మైల పోటానికి ఏం? నేను కూడా మా మావయ్య లాగు సవాయితో తీసుకుని, తీసుకుని చావకండా ఉండాలంటే నువ్వో పని చెయ్యాలి సుమా .. కొద్దిగా ఆ ఏసోబుగాడి మతి చెడిన కూతురు ఆ పుల్లి ఉంది చూశావూ  దాన్ని నా కోసం కుదిర్చి పెడతావూ ”.. రాక్షసుడికి ఆకలేస్తే మేకపిల్లలు  ఆహారమైపోవటం చాలా మామూలు, జరూరు విషయంలాగా .. ఈ పూటకి మజ్జిగ పులుసు వద్దు కానీ, మంచి ఆవ పెట్టి అరటిపువ్వు కూర వండు గుమాయింపుగా.. అని చాలా మావూలు విషయం చెపుతున్నట్లుగా వాగుతూ  పోతున్న సుబ్బరావుని, పరమ అసహ్యంగా చూసింది అన్నపూర్ణమ్మ. “వీడి ఆటలు అస్సలు సాగనివ్వను  సవాయితో తీసుకుని చావనైనా చావనీ.. నేను విధవ ముండనైనా సరే”, అని మనసులో గట్టిగ అనుకుంది అన్నపూర్ణమ్మ. మళ్లా వీడు చేయబోయే దుర్మార్గానికి మాలది, అంటరానిదీ పనికిరాదుట వీడు వెళ్లే  ఆ పెద్దాపురం కొంపల్లో నానా కులాలవాళ్లు ఉంటున్నారు. ఇప్పుడు ఆ విషయం తెలియకనా  ?  “ఆ పెద్దాపురం కొంపలు పోరాదుటండీ మహారాజులూ, పండితులూ ఎక్కి దిగిన గుమ్మాలవి అని గతంలో చాలాసార్లు అన్నారుగా.. పసిది పుల్లి ఎందుకు ” అంది అన్నపూర్ణమ్మ కసిగా . “అవునుననుకో వెళ్లచ్చును ఎవడికి తెలిసి చస్తుంది.. తెలియని కళ్లన ఏం జరిగినా పాపంలోకి రాదే అయినా అక్కడికి పోతే వయసు వాళ్ళే ఉంటారు కానీ ఇట్టా పుల్లి  లాగా ఈడేరని పిల్లలు దొరుకుతారేవిటీ”..అంటున్నాడు వెంటనే అన్నపూర్ణమ్మకు  మాల         గుమ్మన్న గుర్తుకు వచ్చి, తన శ్వాసలో కాలుతున్న మనిషి చర్మపు కమురువాసన వచ్చినట్లై , ఒక క్షణం ఊపిరి ఆడనట్టయి గుండె భారమైంది. పదేళ్ల క్రితం జరిగిందా సంఘటన.. సుబ్బరావుకి కోపం వచ్చి గుమ్మన్న అనే మాల కులస్థుడ్ని చెరుకులు దొంగలించాడని కొట్టాడు ఆ తోపులాటలో గుమ్మన్న మరుగుతున్న  బెల్లం పెనంలో పడ్డాడు ఊరు కలిసొచ్చింది . అయినా  ఎవడో లిటిగెంటు పోలీస్ స్టేషనులో ఊదేశాడు తెల్లోళ్ల పాలన కదా ..కేసులూ, గీసులూ.. అధికారులు కలిసొచ్చారు , రెండెకరాల హారతి కర్పూరం చేసి, కేసు అవకుండా బయట పడ్డాడు కాదూ? పైగా గుమ్మన్న చంపినందుకు ఆ పాపవు తనకు తగలకుండా ఉంటానికి “సచేల స్నానం చేసి, జంధ్యం మార్చుకుని, సహస్ర గాయత్రి చేసాను “  అని చెప్పలా? చెట్టంత  మనిషిని కిరాతకంగా చంపేసి ,  అంత పెద్ద పాపం చేసేసి, గాయత్రి చదివేసి, జంధ్యం మార్చుకుంటే చాలు అనుకుంటున్నట్టున్నాడు అప్పుడూ, ఇప్పుడూనూ . ఏవంటావో చెప్పు అన్నట్లు ఆత్రంగా, ఆశగా  తన వైపు మిడిగుడ్లేసుకుని చూస్తున్న భర్తని చీదరగా చూస్తూ ..“ఇదిగో చూడండి మీరెటైనా  వెళ్ళండి .. ఎప్పటి లాగే నాకు అడ్డమైన రోగాలు అంటించండి, నోరు మూసుకొని పడి ఉన్నాను కదా ఇన్నేళ్లునూ..  కానీ ఆ మతి లేని పసిదాని జోలికి మాత్రవు రాబాకండి.. పిల్లలు లేని నాకు బిడ్డయింది అది, నన్ను అమ్మను చేసింది. ఈ చేతులతో పెంచాను  దాన్ని యావనుకున్నారో” గొంతు దుఃఖంతో మొరటు బారుతూ, ఆగ్రహంతో దేహం మొత్తం వణికి పోతుంటే , చూపుడు వేలు భర్త మీదికి ఆడిస్తూ అరిచినట్లే చెప్పింది అన్నపూర్ణమ్మ  

. సుబ్బారావు ఎడమ కాలుకి దగ్గరగా  ఉంది అన్నపూర్ణమ్మ.. ఒక్క తాపు తన్నాడు..అంతే  మంచం మీద నుంచి దబ్బున కింద పడింది నడుము కలుక్కుమంది . “పేనుకి పెత్తనమిస్తే ఇదుగో ఇలాగే అవుతుంది.. మా బాబయ్యా , అమ్మా చెప్పనే చెప్పారు .. ఆడముండలకి మాటాడే వీలివ్వకూడదని, వందమందితో తిరుగుతాను ఏ రోగాలైనా అంటించుకుంటా నోరుమూసుకుని పుల్లిని కుదిర్చి పెట్టు చాతకాపోతే ఎట్టా ఆ పని కానిచ్చుకోవాలో నాకు తెలుసు మాట్టాడకుండా పడుకో”’ అంటున్నాడు సుబ్బారావు . “అది కాదండి చిన్న పిల్లలతో ఉంటె సవాయి రోగం తగ్గుతుంది అన్నది నిజవు కాదేవో నండి, అన్యాయంగా  పసి పిల్లలు బలైపోతారండి, పుల్లి జీవితం నాశనం చేయబాకండి మీ కాళ్ళట్టుకుంటాను” అన్నపూర్ణమ్మ వల, వల ఏడుస్తూ సుబ్బారావు కాళ్ళ మీద పడిపోయింది . సుబ్బారావు ఆమెని ఒక్క తాపుతో విదిల్చుకున్నాడు 

భర్త పొట్టలో తన్నిన తాపుకు అన్నపూర్ణమ్మ నొప్పితో విల విల్లాడుతూ లుంగ చుట్టుకుని పోయింది.. కొద్ది సేపు అలాగే ఉండిపోయింది నొప్పి భరిస్తూ. తరువాత మెల్లిగా లేచి వెళ్లి మధ్య గదిలో  కొంగు పరుచుకొని నేలమీదే పడుకొంది పట్టరాని దుఃఖం ఆవహించింది “చిన్న నాటను  తల్లి దండ్రుల వద్ద పొందిన సుఖము కన్న వేరు సుఖము ఎరుగనన్నా “., అంటూ మామ్మ పాడే పాట గుర్తుకు వచ్చింది  ఆ నిశ్శబ్ద రేయిలో. చూపులతోనే  సాంత్వన నిస్తూ సేద దీర్చె మనిషి పశువుల పాకలో ఉన్నాడు. అన్నపూర్ణమ్మకు ఒక్కసారిగా వెళ్లి ఏసోబు గుండెలమీద వాలి తనువు తీరా ఏడవాలని చాలా అనిపించింది ఎంతంటే .. వొళ్ళు కాలి, మంటకి తట్టుకోలేని మనిషి వెంటనే మంటల బాధ చల్లార్చుకోడానికి చెరువు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి, దాంట్లో దుంకేంత.. వెల్దామని కొంచెం లేచే ప్రయత్నం చేసింది కూడా.. కానీ  నిగ్రహించుని నేల మీదే మళ్ళీ వాలిపోయింది అలుసవకూడదు సుమీ  అనుకుంటూ ,. ఇంకో పక్క పెరటి వరండాలో పాపాయమ్మ పాము చెవులేసుకొని ఇంకా నిద్రపోలేదల్లే ఉంది,  మరోపక్క భర్త  తనవైపు ఏ క్షణమైనా వచ్చేట్లున్నాడు మళ్ళీ పుల్లి గురించి అడగడానికో లేదా తన్నడానికో. ఇంకొంచెం సేపయ్యాక పాపాయమ్మా, సుబ్బారావు ఇద్దరూ గుర్లు కొట్టసాగారు . అన్నపూర్ణమ్మ శబ్దం లేకుండా తనివి తీరా ఏడ్చుకుంది . పధ్ధాటాక ఏసోబు గూడెంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టేసింది అన్నపూర్ణమ్మకి. 

         ఆమె అనుకున్నట్లే మూడో జాముకు సుబ్బారావు లేపాడు.  రానని గింజుకుంటున్న అన్నపూర్ణమ్మని ఆమె దండె గట్టిగా గిచ్చుతున్నట్లే పట్టుకుని మెల్లిగా గదిలోపలికి తీసుకెళ్లాడు. పక్కనే కూర్చోబెట్టుకున్నాడు  ఇక  అడిగాడు “చూడూ .. పుల్లిని ఒకసారి కలిపించావనుకో, ఇక జీవితాంతవూ ఆ పెద్దాపురం కొంపల్లోకి వెళ్ళను , నీతోనే ఉంటాను నీ మాటే వింటాను నన్ను నమ్ము, నన్ను బతికించుకోవే  నేను చస్తే నీకు సుఖవా చెప్పు.. అనవసరంగా ముండమోయటం ఎందుకు చెప్పు?”  బతిమిలాడుతున్న  ధోరణిలో అడిగాడు. మాట్టాడకుండా  శిలలా ఉండిపోయిన అన్నపూర్ణమ్మని కోపంగా చూస్తూ “బదులు చెప్పవేమే చెప్పు.. అంతా నీ చేతుల్లోనే ఉంది” అన్నాడు భుజాలు వత్తి పట్టి నొప్పెట్టెలా  కదుపుతూ..చెప్పి తీరాల్సిందే అన్నట్లు తన చూపుల్ని  అన్నపూర్ణమ్మ కళ్ళల్లోకి గుచ్చేస్తూ .. ఇందాక నేనే పుల్లి సంగతి చూసుకుంటాను అన్న మనిషేనా ఇతను? “ఉహు… నాకు చాత కాదు ఈ పాపం నేను చేయలేను , నన్ను వదిలేయండి” చావ గొడతాడని తెలుసు అయినా  ధైర్యంగా అనేసింది. ఇప్పట్నించా.. ఏళ్ల తరబడి, ఇట్టా బయట ఆడాళ్లతో తిరగొధ్ధు, నాకు రోగాలంటించేస్తున్నావు, పిల్లలందుకే పుట్టటంలా  అన్న ప్రతీ సారీ చావు దెబ్బలు తింటూనే ఉంది. ఒళ్ళంతా అతను  అంటించిన రోగాలు , కొట్టిన దెబ్బలు కుదుములు కట్టాయి ఎక్కడికక్కడ.  అన్నపూర్ణమ్మ అంత స్థిరంగా చేయను  అంటుంటే సుబ్బారావు తట్టుకోలేక పోయాడు . అంతే అన్నపూర్ణమ్మ చెంపలు పేలి పోయాయి .. కింద పడేసి ఎట్లా అంటే అట్లా కొట్టాడు. కింద పడేసి, గోడకేసి తోసి, డొక్కల్లో, వీపుల్లో  ముఖం మీద.. కాళ్లని, చేతులని  ఎడా పెడా అర్ధ గంటదాక అన్నపూర్ణమ్మ దేహం మీద ఆడిస్తూనే ఉన్నాడు..నోటిని కూడా ఆపలేదు  పఛ్చి  బూతులు తిడుతూనే ఉన్నాడు కొడుతున్నంతసేపూ. చివరలో జుట్టు పట్టుకుని నుదురుని గోడకేసి కొడుతూ “చేయవూ ..చేయవటే నేను చస్తే నువ్వే కారణం అవుతావు .. చేయవూ చెప్పు” అని రెట్టించి అడుగుతూ చివరాఖరుకు అతనే అలిసిపోయి ధూ..అని ఖాండ్రించి ఉమ్మేసి కండువాతో నుదురుకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ గది బయటకు వచ్చాడు.  మధ్య గది బయట దిగులూ, భయమూ నిండిన మొఖంతో  తచ్చాడుతున్న పాపాయమ్మను చూసి హు .. అని కళ్ళతో బెదిరిస్తూ వాకిటి బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే పాపాయమ్మ పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చింది నొప్పులతో లుంగలు చుట్టుకుపోతూ మూల్గుతున్న అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్లి ఆమె పక్కన కూలబడిపోయి, ఆమె తల తన వొళ్ళో పెట్టుకుంటూ, “అయ్యో వదినా ఎంతలా చావ గొట్టేసాడు దుర్మార్గుడు , అయినా..అన్నయ్య అడిగేదెదో చేసేయకూడదూ వదినా .. వచ్చినప్పటి నుంచీ చూస్తున్నా చావ గొట్టేస్తున్నాడు , ఆ పని  చేసేధ్ధు నీ కాపురం నిలబడుతుంది ఎంతకాలం ఈ బాధలు పడతావు చెప్పు ? అయినా అట్టా ఈడేరని పిల్లతో పడుకుంటే సవాయి రోగం తగ్గుతుందిట వదినా మా అత్తారింట్లో మాట్టాడుకుంటుంటే విన్నాను మా మరిది కూడా అట్టాగే చేసాట్ట, తప్పే ..పాపవే అనుకో” అంటూ చెంపలు టప , టపా వాయించుకుంటూ మళ్ళీ  “ కానీ వదినా .. ” అంది దుఃఖంతో వెక్కిళ్ళు పడుతూ మరింక మాట రాక ఆగిపోతూ .. రక్తం కారుతున్న అన్నపూర్ణమ్మ నుదుటిమీద తన తెల్లటి కొంగుని అదిమిపడుతూ.  నొప్పికి విల విల్లాడుతున్న అన్నపూర్ణమ్మ ఒక్కసారిగా తలెత్తి పాపాయమ్మ కళ్ళల్లోకి పాముని చూసినట్లు చూసింది .. గుండు మీదనుంచి తెల్లని కొంగు జారిపోయిందేవో .. ఆ చీకట్లో పాపాయమ్మ రాతి శిలలాంటి గుండు, కన్నీటి తడితో  మెరుస్తున్న కళ్ళు, పైన ఉన్న గుండు చర్మమే కింద గడ్డం దాకా దిగినట్లు అనిపించి, ఆమె మొఖం వింతగా కనిపించి, ఇంకా భయం వేసింది . కానీ, పాపాయమ్మ కళ్లనుంచి తన కోసం కారుతున్న కన్నీళ్లు చూసి మెల్లిగా కళ్ళు మూసుకుంది .. పసితనం లోనే రోగిష్టి భర్త చనిపోయి విధవ అయిన పాపాయమ్మ ఆ క్షణంలో  ఎనిమిదేళ్ల పుల్లి లాగా కనపడ్డది.. మరి తను .. తను కాదేంటి పుల్లి? తను కూడా పుల్లి వయసులోనే ఈ ఇంటికి రాలేదూ కాపురానికి? వెన్నులోంచి వణుకొచ్చి.. ఏదో అర్థమయ్యి భరించలేనట్లుగా, ఆ బాధ  మనసుదో, దేహానిదో అర్థం కానంతగా మూలిగింది అన్నపూర్ణమ్మ. ఈ స్థితికి అతను, తన మొగుడు కాదూ కర్త? ఇదంతా చేసిందెవరు..తన మామేం చేసాడు ,.? తాను పెద్దమనిషి కావటం ఆలస్యమైందని, తనమీద మాచకమ్మ అని  నింద  వేసాడు. తన అమ్మనీ, బాబునీ తిట్టాడు.   “కాపురానికి పంపుతారా .. తెగ తెంపులు చేసుకుంటారా”? అని రంకెలు వేసాడు. అమ్మ , నాన్నలు ఏం చేశారేం చేశారు ? పీడా విరగడవుతుందని ఈడేరకుండానే కాపురానికి పంపేశారు .పంపాక మరి  తన అత్తగారేం చేసిందీ …చిన్న పిల్లనని చూడకుండా గదిలోకి పంపి తాళం వేసింది .. రక్తం కొల్లయిపోయి నొప్పితో అరుస్తుంటే, అరిచేవంటే నోట్లో పొడుస్తానంది . ఇదిట్లా ఉందా… తన ఈ పేరుగాంచిన ఘనమైన మొగుడేవి చేసాడు..? బెల్లం అచ్చులు అమ్మేసి పెద్దాపురం దోవ పట్టాడు.  ఎక్కడ లేని రోగాలూ తగిలించుకున్నాడు. అతన్ని కట్టడి చేయాలని అత్తా, మామా తన్ని అతనకి అప్పగించితే .. కనికరవు లేకండా గొడ్డుని నాడినట్లు బాది,  అన్ని రోగాలూ తనకి తగిలించాడు . తన అదృష్టవో .. దురదృష్టవో  అత్తా, మామలు ఇద్దరూ   పుష్కరాలకు వెళ్లి గోదాట్లో కొట్టుకు పోయాక , తన మొగుడికి ఆ కాస్త పాటి అడ్డు లేకండా పోయింది. తన వల్ల కాదూ.. తనకి  కడుపు నిలబడక పోవడం ? అన్నపూర్ణమ్మకి మొగుడిమీద పట్టరానంత ఆగ్రహం కలిగి.. నీరసంగా కళ్ళు మూసుకుని మరింత ముడుక్కుంది .  

 

         ఆ తర్వాత, తర్వాతర్వాత .. ఆ తర్వాతర్వాతకి ఎన్నో తర్వాతల తర్వాత  .. దెబ్బల రాత్రుళ్ళు,  రాత్రుళ్ళు దెబ్బలు, దెబ్బలతో నిండిన చీకటి రాత్రుళ్ళు అన్నపూర్ణమ్మకు ఎక్కువైపోయాయి వొంటినిండా దెబ్బలతో అయిన మచ్చలు, కుదుములతో ఆమె బయటకు వెళ్లడమే మానేసింది అన్నపూర్ణమ్మ ఊళ్లోని  చెరువుకట్టుకి ఎందుకు రావట్లేదని కూడా వూర్లో అనుకోసాగారు.  ఏసోబుతో మందులు తెప్పించి వదినకి వేయసాగింది పాపాయమ్మ . ఆమె బాధని చూడలేని ఏసోబు నరకయాతన పడసాగాడు.. సుబ్బారావు పంతుల్ని నరికి పడే య్యాలన్నంత కోపంతో రగిలి పోసాగాడు పంతులు ఎటు పోతాడో, ఎలా వస్తాడో,  ఏం మందులు ఎందుకు మింగుతాడో , ఇంట్లో అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటాడో ఏసోబుకి బాగా తెలుసు అన్నింటికీ మించి తమ కులపోడిని సుబ్బారావు ఎట్టా కాగుతున్న బెల్లం పెనం లోకి తోసి చంపేసాడో .. చంపేసాక డబ్బులు చల్లి ఎట్లా తప్పించుకున్నాడో కథలు, కథలుగా ఊర్లో చెప్పుకుంటారు. తనప్పుడు చిన్నోడు.. చచ్చిన గుమ్మన్న తమ బంధువే అని  తెలుసు .. ఏసోబుకి అన్నీ తెలుసు సుబ్బారావు పంతులికి ఏ పురుగ్గుట్టి ఇట్లా చేస్తున్నాడో అదీ తెలుసు ఏసోబుకి .  అంత చక్కటి అన్నపూర్ణమ్మని గొడ్డుని బాదినట్లు బాదుతుంటే మనిషి నిలువెల్లా నొప్పితో మెలితిరిగి పోతున్నాడు . అన్నపూర్ణమ్మను కొడుతున్న పంతులు చేతిలోని కర్రను గుంజేసి, తన చేతిలో ఉన్న  ముళ్ల వెదురు కర్రతో చావ చితక కొట్టాలని ఉంటుంది . కానీ ఏమీ చేయలేని నిస్సహాయత ఏసోబుది. 

                                                   

                     +++++++++++++++++++++++++++++++++++++++++++++++

            “ఈ వారం ముహూర్తం పెట్టాలనుకుంటున్నా ..పుల్లి కోసం” కూర కలిపిన అన్నం ముద్ద గుటుక్కున మింగుతూ  చాలా  మామూలుగా “ఈ రోజు బెల్లం కొట్టుకి వెళ్లాలనుకుంటున్నా” అని చెప్తున్నట్లు చెప్తున్న సుబ్బారావు వైపు వెర్రిగా చూసింది అన్నపూర్ణమ్మ .. భర్త కంచంలో ఒంపుతున్న పప్పు చారు గంటితో సహా ఆమె చెయ్యి జారి  అతగాడి కంచంలో పడిపోయింది. “ఎటు చూస్తున్నావే కళ్ళు కనపట్టంలా.. చూసి చావు” అంటూ రహస్యం చెబుతున్నట్లు కాస్త ముందుకు వంగి అటూ, ఇటూ పక్కల కంటా దొంగతనంగా పాలు తాగేముందరి బావురుపిల్లిలా  చూపులు చూస్తూ, “చెల్లిని వాళ్ళ అత్తారింట్లో ఒక వారం దింపి వస్తాను ఈ లోపల ఏర్పాట్లు చూడు, ఏసోబు గాడి మంచం ఉందిగా పశువుల కొట్టంలో అక్కడ చెయ్యి ఏర్పాట్లు, ఆ మంచం అదీ కనపడకండా మినప బొత్తి అడ్డం వెయ్యి, కొంచెం తెలివిడితో పని చేసి తగలడు, ఏసోబుగాడికి, వాడి పెళ్ళానికి అనుమానం రానియ్యమాకు, నేను వూరు నుంచి వచ్చేలోగా పని కానియ్యాలి. నువ్వు ఎంత మోకాలడ్డం వేసినా ఈ  కార్యం ఆగదు  గాక ఆగదు అర్థం అయ్యిందీ…ఏంటా వెర్రి చూపు ఇన్ని మజ్జిగ నీళ్లు నా మొహాన్న పోసి తగలడు”  అంటూ కసురుకున్నాడు సుబ్బారావు 

 

                      అంతా అనుకున్నట్లే నడిచింది సుబ్బరావుకి . “నేనేం గతిగడుక్కుపోయి లేను. దిక్కూ , దిబాణం లేని దాన్ని కాను. మా మరుదులూ, తోటి కోడళ్లు నెత్తిమీద పెట్టుకుంటారు. ఎవరికేం అవసరాలున్నాయో, ఎవరి పాపాలకు నేనడ్డమయ్యానో..” అంటూ తిడుతూనే ఉంది పాపాయమ్మ. అన్నగారు ఎదుట పడేసరికి కుక్కిన పేను అయిపోయి వద్దు, వెళ్లకు అని సైగలు చేస్తున్న అన్నపూర్ణమ్మ వైపు దీనంగా చూస్తూ బండెక్కింది పాపాయమ్మ . సుబ్బారావు కూడా వెళ్ళాడు తోడుగా.  వెళ్తూ వెళ్తూ.. బండెక్కబోయి ఆగి, వెనక్కి  అన్నపూర్ణమ్మ వైపుకి వచ్చి, ఆమెకి చాలా దగ్గరగా నుంచొని, “నే వచ్చేప్పటికి పుల్లిని కుదిర్చి పెట్టలేదనుకో.. మన కులవులో ఈడేరని పిల్లలకి లోటనుకున్నావా ఏవిటి  .. చెల్లి అత్తారింట్లో దైద్రం ఓడుతూ ఉంటుంది ప్రతీ వాళ్ళకీ కుచేలుడు సంతానం .. ఎక్కడ చూసినా  పిల్లలే.. ఆవిడని మంచి మాటాడితే ఎవరో ఒకర్ని ఏర్పాటు చేస్తుంది” అన్నాడు రహస్యమాడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లూను .. ఆ గొంతునీ..బెదిరిస్తున్నప్పటి ఆ కళ్లనీ ఆ క్షణవు భరించలేకపోయింది అన్నపూర్ణమ్మ .. భయంతో గుండె దడ, దడ లాడింది ఇతగాడిట్టాగే వెళ్ళిపోయి, ఇక వెనక్కి రాక పోతే బాగుండు ,. వాళ్ళమ్మా , బాబుల్లా  ఇతగాడూ  పుష్కరాల్లో కొట్టుకు పోతే అన్నా బాగుండి పోను అనుకుంది. మళ్ళీ ఇతగాడేదో వాడుతున్నాడు అనుకుంటూ .. వెంటనే భర్త పక్కనుంచి దూసుకుపోయి పాపాయమ్మని చేరుకొని “జాగర్త .. వదినగారూ జాగర్త మీరూ.. పిల్లలూ” అంటూనే వుంది “తప్పుకో.. తప్పుకో జాగర్తగానే వెళతావులే , నువ్వు జాగర్త” అంటూ ఖంగారుగా  అన్నపూర్ణమ్మను పక్కకి తోసేసి, బండెక్కి  ఏసోబుని “పోనియ్యరా” అంటూ అరిచాడు … 

                      ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                            

                                         అన్నపూర్ణమ్మకు నిద్ర పట్టక దొర్లుతున్నది ..ఆమెకి భర్త పుల్లి విషయం చెప్పినప్పటినించీ రాత్రుళ్ళు కంటికి నిద్రా,  గుండెకు శాంతీ కరువైపోయాయి. కళ్ళ ముందు మతిస్థిమితం లేని పిచ్చి చూపుల చిన్నారి పుల్లి కనపడుతున్నది, అనుక్షణం వెంటాడుతున్నది . భర్త ఖరారుగా ఆ పని చేసేట్టు గానే        కనపడుతున్నాడు.. అడ్డమొస్తే తనని చంపైనా ఆ నీచ కార్యం కానిచ్చేట్లున్నాడు, ఏం చేయాలి .. ఎలా ఆపాలి రోజూ అన్నపూర్ణమ్మ దేవుళ్ళకు మొక్కుతూనే ఉన్నది. భర్త వూరినుంచి వచ్చే రోజులు దగ్గరపడేకొద్దీ భయమూ, దిగులూ, గుండెదడా పెరిగిపోతూ  ఆమెలో గుండెల్లో దుఃఖం వూరిపోతున్నది, తెలియకుండానే  నిండి, కళ్ళు  ఊరి చెరువు  పొంగినట్లు పొంగుతున్నాయి. పుల్లి తో పాటు  ఏసోబు , పోలమ్మ  కూడా కళ్ళ ముందుకు వస్తున్నారు ఏసోబు కనిపిస్తేనే అంతకు ముందు మనసుకి చల్లగా అనిపించేది కానీ  ఇప్పుడో ..తప్పు చేస్తున్న భావనతో భయం వొచ్చేసి వెన్నులోంచి వొళ్ళంతా పాములా జర, జరా పాకి పోతున్నది వాడి కళ్ళల్లోకి చూడలేక పోతున్నది . ఇద్దరికి తనంటే బోలెడంత ప్రేమా , నమ్మకమూనూ.. ఇప్పుడా నమ్మకం ఏమి కానుందో…పోలమ్మ రోజూ పొద్దుటే వచ్చి, వాకిళ్ళు వూ డుస్తుంది , కళ్ళాపి చల్లి, పశువుల దగ్గర కాసువు తీసి పెంట గోతిలో వేస్తుంది, ఆ పెంట ఎరువు కోసం తోలతారు. పేడకళ్ళు తీసి పిడకలు  చరుస్తుంది.. ఆమెతో పాటు కూతురు పుల్లి కూడా వెంట వస్తుంది  మరీ దారుణంగా ఆ  చంటి దానికి మూడవ  ఏటనే పెళ్లయింది . మెడలో తాళి, నోట్లో వేలు మానం మీద సిగ్గు బిళ్ళతో బోసిగా తిరిగేది. అది చూడలేక, తను  దానికి గవున్లు కుట్టించింది, పుల్లి ఉంచుకునేది కాదు తీసి పడేసేది.  పోలమ్మ బాదిందో రోజు అట్టా చేస్తే, అన్నపూర్ణమ్మ కసిరింది “నెమ్మదిగా అలవాటు చేయాలి గానీ అట్టా కొడతావా” అని కసిరేది పిల్ల చేతిలో బెల్లం ముక్క పెట్టి ఉరుకోబెట్టేది ఇప్పుడా పిల్ల ఏపుగా ఎదిగింది కానీ తింగరిది . ఇంకా  నోట్లో ఆ  వేలేంటే   అంటే, తీసి నవ్వేస్తుంది ఎవరో కారం పూసిన గుడ్డ వేలికి చుట్టమన్నారు పోలమ్మ ఆ పని చేసింది. పుల్లి  ఓ మారు ఏడ్చి, మరో వేలు నోట్లో పెట్టుకుందిట ..పోలమ్మ పడీ పడీ నవ్వుతూ ఆ తతంగం అంతా చెప్పింది. ఏసోబు అక్కడే ఉండే వాడు,  పశువుల పాకలో ఏసోబు కోసం అన్నట్లుగా అమర్చిన పాత మంచం కింద పుల్లికి లక్క పిడతలు, బొమ్మలు పెట్టించింది అన్నపూర్ణమ్మ . పుల్లి  వాటితో ఆడుకుంటూ, అక్కడే పడుకునేది. అట్టాగే అలవాటైపోయింది దానికి. పోలమ్మ పనికి వెళ్లిపోయేది . “తల్తల్లీ అటూ ఇటూ పోకండా చూసుకొమ్మా” అనేది పొలమ్మ  “నా పిల్లని కూడా మీ సొంతం చేస్కుంటారేంటమ్మగోరూ” అనేది గొంతులో ఒకింత వెటకారవు నింపుకొని, ఏసోబు వైపు కోపంగా చూస్తూ.. తనులిక్కి పడేది.. తమ సంగతి పోలమ్మకి తెలిసిపోయిందని తెలుసు దాని కళ్ళల్లోకి సూటిగా ఎప్పుడు చూడ గలిగిందని.. ఏసోబు కూడా చూపులు తప్పించుకునేవాడు . లోలోపల తప్పు చేస్తున్నానన్న ఆలోచన దహించి వేస్తుంటే,   ప్రేమని ఎట్టా దాచుకోగలదు .. ఎంత ప్రేమనీ ఏసోబుకి కూడా తన మీద..సుబ్బరావు  తనని గొడ్డుని బాదినట్లు బాదటం, పచ్చి బూతులు తిట్టడం తప్ప ఏనాడు ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడనీ, మాట్టాడాడని..  పైగా వొంటి నిండా పెద్దాపురం ఆడాళ్లతో అంటించుకున్న రోగాలతో .. పీలగా, బక్కగా అడుక్కుపోయిన  రోగిష్టి వొళ్ళు,   తనకి  ఇష్టం లేదు భర్త ముట్టుకుంటేనే చీదర అనిపిస్తుంది. పైగా  ఆ రోగాలతో అసలు మగాళ్ళకి పిల్లలే పుట్టరుట.. ప్రేమించలేని పెనిమిటి, దాంతో పాటు   పిల్లలు కావటం లేదనేగా ఇదంతానూ అని తనని తాను సరిపుచ్చుకునేది . తననంతగా ప్రేమించే ఏసోబు పసిబిడ్డను ఈ రోగిష్టి భర్తకు బలివ్వాలా తను ..అసలే పసిబిడ్డనైనా ఎందుకట్టా నాసినం చేయాలి ఎంత మహా పాతకవని? తన వల్ల కాదంతే ఏసోబు ఎదురు పడ్డప్పుడల్లా మొహం తిప్పేసుకుంటుంది , పుల్లి గుర్తొచ్చి . మొన్నోసారి చావిడీ స్తంభాన్ని ఆనుకుని తనకు పట్టిన ఈ దౌర్భాగ్యాన్ని  తలచుకుని, తల్చుకుని కుమిలి పోతుంటే .. అటొచ్చిన ఏసోబు “ఏటయిందమ్మగోరూ..దేనికంత దిగులడిపోతన్నారు..ఏటైనాది నాకు చెప్పరేంటి” అంటే ..ఏసోబు మొఖంలోకి అలా చూస్తుండిపోయింది.. పుల్లి కనపడింది ఏసోబు మొఖంలో .. “అమ్మగోరూ మాటాడరేంటండి ..అట్టా చూస్తారేటమ్మగోరు మాటాడండి” ఏసోబు గొంతు బాధతో గీర బోయింది., తానులిక్కిపడింది “పుల్లి జాగర్తరా .. దాన్ని  ఒంటరిగా వదలకు , పోలమ్మకీ చెప్పు” అంది వణుకుతున్న గొంతుతో ‘‘అమ్మగోరు ఎందుకట్టా అంటున్నారు ఇప్పుడు పుల్లికేటైందని’’ అంటున్నాడు ఏసోబు విచిత్రంగా తన్ను చూస్తూ “ఏమీ లేదురా.. ఈడేరని పిల్ల కదరా” బాధ,దుఃఖంతో గొంతు  పూడుకుపోతుంటే   దిగ్గున లేచి లోనకెళ్లిపోయింది తను., ఏసోబు మొఖంలో కనపడ్డ భయాన్ని తప్పించుకుంటూ . 

                                                  ++++++++++++++++++++++++++++++++++

 

                                                  పెరట్లో, వాకిట్లో,  వంటిట్లో ఎక్కడ ఉన్నా పరధ్యాసతో , పిచ్చి చూపులు చూస్తూ ..ఉండీ, ఉండీ కళ్ళు తుడుచుకుంటున్న అన్నపూర్ణమ్మను దిగులుగా చూస్తున్నాడు ఏసోబు. ఏం చేసి ఆమె దిగులు, నొప్పి పోగొట్టాలో, మళ్ళీ ఆమె మొఖం లోకి సంతోషాన్ని, నవ్వునీ ఎలా తేవాలో అర్థం కావట్లేదు తిరుగుబోతైన సుబ్బరావు పెట్టే బాధల్ని చిరునవ్వుతో భరిస్తూ రోజూ చెరువు గట్టుకి వెళ్లి, ఆ నీళ్ళల్లో అన్ని బాధల్ని ముంచేసి, దాచుకున్న కన్నీళ్లూ చెరువు నీళ్ళల్లో కలిపేసి, తానూ మునిగి, లేచి  బిందె నిండా నీళ్లు నింపుకొని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఇల్లు చేరేది కాదూ.. ఆమె అలా  నవ్వుతూ ఇంటి వైపుకి వస్తూ ఉంటె హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయేది  చల్లని ఆ నవ్వు చూసాకే తను ఏ పనైనా అందుకునేది. తన మనసు గ్రహించినట్లే ఇంట్లోకి వెళ్లేముందు తననో సారి కూసింత చూసీ చూడనట్లు కళ్ళ చివర్లనుంచి  చూస్తూ చిన్న నవ్వు నవ్వేది, ఎంత తత్తర, బిత్తర, ఖంగారూ ఉండేవో ఆ చూపుల్లో..ఎప్పుడూ దుఃఖపు తడి కనిపించే ఆ కళ్ళల్లో తనని చూస్తున్నప్పుడు మాత్రం ఎన్నెలంటి సల్లదనం నిండిపోయేది అది సాలదూ తనకి? తనేదో కావల్సుకొని ఆమెని ఆపి మట్టాడాలని, ఆమెను కొంచెం సేపు  కళ్ళ నిండుకీ చూస్కోవాలని..  ఏదో పని ఉన్నట్లు మాట కలిపితే ..నీ సంగతి తెలియకనా అన్నట్లు నవ్వుతూ చిరు కోపం ప్రదర్శించేది ., తను  సిగ్గడిపోయేవాడు …ఎన్ని రాత్రుళ్ళు, ఇంకెన్ని పగళ్లు ఆమె భర్త పెట్టే హింస భరించలేక.. పెళ్లై ఇన్నేళ్లయినా కడుపు పండలేదని  పెరట్లో కూర్చుని ఏడ్చేది  మాట్టాడానికి, పంచుకోవడానికి ఎవరూ లేక,. తానే ఇంటి పెద్ద పాలికాపు అవటాన ఎక్కువసేపు అన్నపూర్ణమ్మ ఇంటిని పట్టుకొని ఉండాల్సొచ్చేది . పోలమ్మ అప్పుడప్పుడు వచ్చేది . ఆవిడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే కంగారు పడి తానే అడిగేవోడు “ఏమైంది అమ్మగోరూ ..అట్టా ఏడవబాకండి, నేను చూడలేనండి” అని ఓదారిస్తే తనని  మల్లె తీగలాగా అల్లుకుపోయింది.. తప్పు, తప్పనుకుంటూనే ఇద్దరూ ఒక్కటైపోయాము కాదూ… ఏసోబుకి అన్నపూర్ణమ్మని ఎప్పటిలాగే హృదయానికి హత్తుకొని ఓదార్చాలనిపించింది . 

                                              +++++++++++++++++++++++++++

 

                                            “ ఒసే పోలీ.. అమ్మ గారెంటే పుల్లి జాగర్త అని చెప్పేరు ఎందుకంటావు” ఆ రోజు రాత్రి నిద్ర పట్టని ఏసోబు అడిగాడు “ఏవుంది ఆడపిల్ల కదా రేపో, మాపో ఈడేరుతుంది కదా అందుకే జాగర్తలు చెప్పి ఉంటారు. పేమ ఉండదా.. తను కూడా నాకంటే ఎక్కువగా పెంచింది కదా ఎక్కువ ఆలోచించక..పడుకో” అంది పోలమ్మ పుల్లిని తనకి మరింత దగ్గరగా పొదువుకుంటూ.

                                                   ++++++++++++++++++++++++

 

                                           ఎప్పుడు కునుకు పట్టేసిందో అన్నపూర్ణమ్మకి పడక గదిలో నేల మీద  చీర చెరుగేసుకొని, తన చెయ్యి దిండుమీద తలపెట్టి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. ఒక పదిరోజులుగా  రాత్రుళ్ళు నిద్రే లేని ఆమెకు గాఢ నిద్రపట్టేసింది. ఏదో దబ్బున పడ్డ చప్పుడుకి మెలకువ వచ్చింది అన్నపూర్ణమ్మకి ఉలిక్కి పడి  లేచింది. ఏదో గిన్నె నేల మీద పది టంగు..టంగు మని శబ్దం వస్తున్నది. పెరట్లో పశువుల పాకలోంచి వస్తున్నది అన్నపూర్ణమ్మ అటేపు పరుగందుకుంది .. లోపల దృశ్యం చూసి శిలలా నిలబడిపోయి , వెంటనే తేరుకుని  “ఏం చేస్తున్నావూ  వదులు  దాన్ని” అని రౌద్రంగా అరుస్తూ పుల్లి నోట్లో గుడ్డలు కుక్కి, దాని   చేతులు రెండూ మంచానికి కట్టేసి,  దాని మీదకు పశువులా ఒంగుతున్న  సుబ్బారావు వైపుకి  ఒక్కుదుటన పరిగెత్తి, అతన్ని పుల్లి మీద నుంచి తోసేయ్యాలని చూసింది అన్నపూర్ణమ్మ. గిల, గిలా కొట్టుకుంటున్న పుల్లి అన్నపూర్ణమ్మ ను చూసింది.. కన్నీళ్లు పొంగుతున్న  దాని కళ్ళల్లో ..అదాటున చిమ్మిన  మెరుపు.. కన్నీళ్లతో కలిసిపోయి, చెంపల మీదుగా జారిపోయాయి అమ్మ.. అమ్మ.. అంటుంది ముద్దగా నోట్లో గుడ్డలుండడం మూలాన్న  . వంటిమీద గవును గాని, లోవస్త్రం కానీ లేకండా ఉంది పిల్లది.. నీచుడు అన్నంత పనీ చేస్తున్నాడు.. అసలు తనకి కునుకెలా పట్టిందీ..అసలీ పుల్లి ఇక్కడికి ఎప్పుడొచ్చింది పోలమ్మేదీ.. ఏసోబేడీ .. ఈ దరిద్రుడు ఎప్పుడొచ్చాడు.. ఇంటోకి రాకండా పెరట్లో కెట్టా వెళ్ళాడు అన్నపూర్ణమ్మ ఆలోచిస్తూనే  సుబ్బారావును ఆపే ప్రయత్నం చేస్తున్నది  

అన్నపూర్ణమ్మ లేచేలోపు, ఏసోబు వచ్చేలోపు పని ముగించుకుందామనుకున్న  పంతులు అన్నపూర్ణమ్మ గొంతు విని గద్దలా మెడ పక్కకి తిప్పి చూసాడు.. ఆ క్షణంలో సుబ్బారావు చూపులు ఎలా ఉన్నాయంటే, కష్టపడి ఎత్తుకొచ్చిన తన ఆహారాన్ని తన్నుకెళ్లాడానికి వచ్చిన  పక్షి కేసి చూసే రాబందు చూపుల్లా క్రూరంగా ఉన్నాయి . “ఏం చేస్తున్నావూ..వదులు దాన్ని” అంటూ తనకేసి కోపంగా దూసుకొస్తున్న  అన్నపూర్ణమ్మను చూసి మొదట గతుక్కు మన్నాడు, ఆనక వెంటనే తేరుకుని,అన్నపూర్ణమ్మ వైపు ఆగ్రహంగా చూసాడు .. అసలే ఇందాక  సంత వీధిలో మొండడిపోయిన పిక్కాసుని { లోతుకు భూమిలో దిగబడిపోయిన చెట్లని పెళ్ళగించడానికి వాడే వ్యవసాయ పనిముట్టు. కర్రకు కింది వైపు, రెండువైపులా కోసుగా, కత్తుల్లా ఉండే ఇనుప పలకల్ని బిగించి, భూమిలోకి గుచ్చి మొక్కల్ని తీస్తారు }  సాన పట్టిస్తూ కనపడ్డాడు ఏసోబు. “ఒక్క పది నిముషాల్లో వచ్చేత్తాను అయ్యగోరు, పిక్కాసు మొండడిపోయి నేలన దిగడ్డం లేదయ్యగోరు.. పొలం గట్టుని విషపు మొక్కలు తీసేయ్యాలయ్యగోరు సూడండి ఎట్టా మొండడిందో ” అంటూ సగం దాకా కొనతేలిన పికాసను తన మొఖం దాకా తెచ్చాడు “ఆగాగోరేయ్ చచ్చేపోతాను గుచ్చుకుంటే” అంటూ  తను ఇంటికొచ్చేసాడు. ఇంట్లో  పెళ్ళాం  నిద్రపోతున్నది.  అసలిది తను చెప్పినట్లు పశువులపాక సిద్ధం చేసిందా లేదా.. ఇట్టా గొడ్డులాగు నిద్రపోతున్నది అనుకుంటూ పశువుల పాకలోకి వెళ్ళాడు పంతులు. అక్కడ మంచం మీద పుల్లి నిద్రపోతున్నది.. పక్కకి తిరిగి పడుకుందేమో నోట్లోంచి సొల్లు బుగ్గలకంటా కారిపోతున్నది .. చేతిలో అన్నపూర్ణమ్మ కొనిచ్చిన లక్కపిడతగట్టిగా పట్టుకొని ఉన్నది . సుబ్బారావు  ఆనందంతో పొంగిపోయాడు కాగల కార్యం గంధర్వులే తీర్చి నట్లున్నది , ఇది అదృష్టవు కాకపోతే మరెవిటీ..పెళ్ళాం నిద్రపోతున్నది, ఏసోబు సంతలో ఉన్నాడు.. ఇంకేం ఇంతకంటే అమోఘమైన ఘడియ ఇంకోహటి ఉందా ..పని కానిచ్చేసుకుంటే సరి..ఈ పుల్లి ముండ పెనుగులాటలో పశువుల దాణా పాత్ర కిందడిపోయి టణ..టణా  శబ్దం చేసి చచ్చింది , దెయ్యంలా ఇదొచ్చేసింది  … సుబ్బారావు ఒక్కుదుటన అన్నపూర్ణమ్మను విదిలించుకునే ప్రయత్నం చేసాడు అన్నపూర్ణమ్మ వెనకనుంచి అతని మెడ  మీద ఉన్న చొక్కా పట్టేసింది.. ముందు నుంచి సుబ్బరావుకి ఉరిపడ్డట్టే గొంతు నొక్కుకు పోయి , వూపిరాడక దగ్గుతూ..  “వదలవే జెష్ట ముండా.. నిన్ను చంపేస్తానీ రోజు” అంటూ తన రెండు చేతులూ వెనక్కి పెట్టి అన్నపూర్ణమ్మ చేతులు పట్టుకోవాలని చూస్తున్నాడు., అన్నపూర్ణమ్మ తన పట్టు వదలకుండానే, భయమూ, ఆందోళనతోటి పాక అవతలవైపుకి చూస్తూ “ఏసోబూ … ఒరేయ్ ఏసోబూ ఎక్కడున్నావురా చప్పున రారా” అంటూ అరుస్తున్నది.. ఆమె కళ్ళమ్మట ధారగా కన్నీళ్లు కారిపోతున్నాయి , మనిషి నిలువెల్లా కంపించి పోతున్నది. అప్పటికే పుల్లి చేతులు  కట్టేశాడేమో అది లేవలేక అవస్థపడుతూ  మంచం  మీద నుంచి బొక్క బోర్లా  కిందబడిపోయి , ఏడవటం  మొదలెట్టింది..పెనుగులాట లాటలో చేతి తాళ్ళు తెగిపోయాయి . దాని లక్కపిడత  బొమ్మ ఎటో పడిపోయింది . భర్తతో  పెనుగులాటలో అన్నపూర్ణమ్మ వెల్లకిల్లా కింద పడిపోయింది. ఆగ్రహంతో ఊగిపోతూ సుబ్బారావు  అన్నపూర్ణమ్మ మీదకి ఎగిరి, ఆమె పొట్టకి చెరో వైపు రెండుకాళ్ళేసి, పొట్టమీద కూర్చుని “ముండా మొగుడి కోసం సతీ సుమతుల్లాగా చచ్చిపోవడం చూసాను కానీ నీలాగా నమ్మక ద్రోహవు చేసేవాళ్ళని చూడలేదే” అంటూ అన్నపూర్ణమ్మ పీక నొక్క సాగాడు.. ఊపిరాడక గిజ,గిజ లాడుతున్న ఆమె మీదనుంచి లేచి ఆమె చెయ్యిపట్టుకొని ఈడ్చుకుంటూ పశువుల పాక అవతల పడేసాడు “చంపేస్తా ఇటోచ్చా వంటే”.. చూపుడు వేలితో బెదిరిస్తూ పాకకి అడ్డంగా తడికె వేసేసాడు . అన్నపూర్ణమ్మ చటుక్కున  లేచింది “తను చచ్చినా సరే” అనుకుంది వెంటనే తడికే తోసుకుని లోపలికి వెళ్ళింది పుల్లి మీదకు ఒంగుతున్న సుబ్బారావు మీద పడింది, అతన్ని లాగి పడేసింది తను పుల్లికి అడ్డంగా కమ్ముకుంది . సుబ్బారావు పిచ్చెక్కిన రాక్షసుడిమల్లే నిన్నిట్టా కాదు.. అంటూ, అటూ, ఇటూ చూసి కనిపించిన ములుగర్ర అందుకుని  అన్నపూర్ణమ్మను ఎడా, పెడా కొట్టసాగాడు అన్నపూర్ణమ్మ బాధ తట్టుకోలేక అరవసాగింది.. కొడుతూనే ఉన్నాడు రక్తాలు కారేలా ..వద్దు.. వదులు అంటున్న అన్నపూర్ణమ్మను చెంపలు వాయగొడ్తూ పుల్లిని  బలవంతంగా తన రెండు చేతులతోటి  అన్నపూర్ణమ్మ నుంచి విడదీసేందుకు లాగసాగాడు . అన్నపూర్ణమ్మ బలం సరిపోక పుల్లి సుబ్బారావు చేతుల్లోకి వెళ్ళిపోయింది. పుల్లితో సహా సుబ్బారావు గోడవైపుకి పడిపోయాడు పుల్లి అతని చేతుల్లోంచి జారి  పడిపోయింది అన్నపూర్ణమ్మ  పుల్లి వైపుకి పాకసాగింది.. సుబ్బారావు మళ్ళీ లేచి కర్ర అందుకున్నాడు.. అన్నపూర్ణమ్మకి పుల్లికి మధ్య నిలబడ్డాడు., అన్నపూర్ణమ్మ వొంటి మీద ములుకర్ర కనికరం లేకుండా ఝాడిస్తూ “వెళ్లిపో..నా చేతుల్లో చావకు” అంటూ  ఎడమ చెయ్యి తడిక వైపు చాపి  చూపుడువేలు చూపించాడు .  ఇంతలో అక్కడికి  ఏసోబు వచ్చాడు , వొంటి మీద బట్ట లేకండా , చేతులకి వేలాడబడిన తాళ్లతో, నోట్లో గుడ్డలతో ఉపిరాడకండా  ఏడుస్తూ పడి  వున్న పుల్లిని, పుల్లికి అడ్డంగా రక్తాలు కారుతూ ఉన్నా దెబ్బలు తింటున్న అన్నపూర్ణమ్మను చూసాడు. ఏసోబు చేతిలోని పిక్కాసు జారి, నేలన పడి టంగుమని శబ్దం చేసింది . సుబ్బారావు కొంచెం తగ్గి నాలుగడుగులు వెనక్కేసాడు.  శబ్దానికి తల  తిప్పి ఏసోబుని చూసిన అన్నపూర్ణమ్మకి తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి కోటి కాంతులతో ప్రత్యక్షం అయినట్లు అనిపించింది , ఒక్కసారి ఆనందం ముంచెత్తింది, వెంటనే దుఃఖం కూడా కమ్మేసింది ..  రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తున్నట్లు పెట్టి,“వచ్చావా ఏసోబూ” అంటూ   భోరుమని ఏడ్చింది, ఏడుస్తూనే లేచి నిలబడి పుల్లి దగ్గరికి పరిగెత్తి దాని నోట్లోని గుడ్డముక్కలు గబ, గబా తీసేసి, అలానే   ఎత్తుకుని  ఏసోబు చేతుల్లో పెట్టి, “తీసుకెళ్లిపోరా పుల్లిని ఈ రాక్షసుడినుంచి దూరాన” అంది ఏసోబు వైపు చూస్తూ..కాళ్ళూ, చేతులూ  కదల కుండా రాతి స్థంభంలా నిలబడ్డ ఏసోబుని బలవంతాన భుజం పట్టుకొని తడిక వైపుకి తోసుకుంటూ తీసుకెళ్లి తడికావతలకు తోసి, తను వెనక్కి తిరిగింది…

                                                     +++++++++++++++++++++

 

                         అన్నపూర్ణమ్మ ఎంగిలి  కంచం ఎత్తి  పాపాయమ్మకి ఇచ్చింది. పాపాయమ్మ అన్నగారి ఎంగిలి కంచం తీసుకెళ్లి పెరట్లో  అంట్లలో వేసి,.  వంటింట్లో రెండు కడిగిన కంచాలు తీసి, వడ్డనకు సిద్ధం చేసి, వదిన కోసం ఎదురు చూడసాగింది. అన్నపూర్ణమ్మ  తుండు గుడ్డతో సుబ్బారావు ఎడమ చెయ్యి తుడిచింది, బలహీనంగా వేలాడుతున్న కుడి చేతి మీద పడ్డ మెతుకులు దులిపింది . తరువాత ఎంతో శ్రద్ధగా అతని మూతి తుడిచింది.. అభిమానంతో  వంకర పోయి పక్కకు జారిన  నోటితో హు ..హు ..అని గద్దిస్తూ ..మొఖం పక్కల కంటా తిప్పేస్తున్న సుబ్బారావు గడ్డాన్ని తన ఎడమ చేతి చూపుడు వేలూ, బొటన వేళ్ళ మధ్య గట్టిగా..నొప్పెటేలా పట్టి నిలుపుతూ.. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ  హూ.. అని ఉరిమినట్లే అన్నది అన్నపూర్ణమ్మ. కొత్తగా ఆమె కళ్ళల్లోకి వచ్చి చేరిన శక్తిని సూటిగా చూడలేక సుబ్బారావు కుక్కిన పేనులా కళ్ళు దించుకున్నాడు . అతని ఎడమ చెయ్యిని తన భుజం చుట్టూ వేసుకొని, మెల్లిగా పడక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది అన్నపూర్ణమ్మ . ఆ తరువాత వదినా , ఆడ బిడ్డలిద్దరూ కలిసి అన్నం తినసాగారు. నిమ్మలంగా., తాపీగా అన్నం తింటున్న అన్నపూర్ణమ్మను చూస్తూ  “వదినా  అన్నయ్యకు పక్షవాతం ఎలా వచ్చిందో ఇప్పుడైనా చెవుతావా” ? అని అడిగింది అన్నపూర్ణమ్మ మొహంలోకి లోతుగా చూస్తూ .. వేడి, వేడి ఆవకాయ అన్నంలోకి నెయ్యి వంపుకుంటున్న అన్నపూర్ణమ్మ ఒక్క క్షణం ఆగింది.. ఆ తరువాత మెల్లిగా అన్నం వేడి అంటుకుంటున్న నాలుగు వేళ్ళను, బొటన వేలికి రుద్దుతూ, వేళ్ళు విదిలిస్తూ.. “సవాయి ముదిరిపోయిందిట..  కోలుకోటమూ.. కష్టమేనుట డాక్టరు గారు చెప్పారు ” అంటూ ఆవకాయ ముద్దను నోట్లో వేసుకోబోతూ ఆగి పాపాయమ్మ వైపు చూస్తూ  “ తినండి వదిన గారూ చల్లరిపోతుంది” అన్నది. “మరి ఏసోబుగాడు యావయ్యాడు.. కొత్త పాలికాపునెందుకు పెట్టావు నేను ఊర్లో ఉన్న మూడు మాసాల్లో ఇన్ని మార్పులేంటి వదినా అన్నయ్యావన్నా పుల్లిని …” అంటూ ఆగిపోయింది    పాపాయమ్మ . “మీకు తెలియంది ఏవుందీ మీ అన్నగారి గురించి చెప్పండి..  అయినా  పుల్లికి ఏవీ కానివ్వలేదులే .. ఇక ఏసోబు అంటావా , వాడికి అత్తారి ఊర్లో కౌలు పనేదో దొరికిందిట మన దగ్గరకంటే మంచి జీతంట.. పోతాన్నాడు పొమ్మన్నా” అంది అన్నపూర్ణమ్మ కంచంలోకి ఆనపకాయ పులుసొంచుకుంటూ. పాపాయమ్మ వదినని నమ్మశక్యం కానట్లు చూసింది.  వదినకు, ఏసోబుకి మధ్యన ఉన్న వ్యవహారం  పాపాయమ్మకు చూచాయిగా  తెలుసు మరి . 

                       ++++++++++++++++++++++++++++++++

                         వెన్నల తేటగా , చల్లగా పడకటింటి కిటికీ లోంచి మంచం మీద పడుకున్న అన్నపూర్ణమ్మ మీద పడుతున్నది.  కొద్ది దూరాన సుబ్బారావు మంచం మీద గుర్రు కొడుతూ నిద్రపోతున్నాడు. దూరాన చెరువు గట్టున ఎవరో పాలికాపు కాబోలు అరుస్తున్నాడు అన్నపూర్ణమ్మకు ఏసోబు గుర్తొచ్చి దుఃఖంతో కళ్ళు నిండుకున్నాయి. మౌనంగా కుంచెం సేపు వెచ్చటి కన్నీళ్ళల్లో సేద దీరింది .. తను అతగాడ్ని  తలుచుకున్నట్లు , అతను తన్ని తల్చుకుంటాడా అసలు .. “వెళ్లిపోరా  ఏసోబూ .. ఇక్కడ ఉండధ్ధు దూరాన వెళ్లిపో ..నా దగ్గరకు మళ్ళీ రాబాకు, వద్దు ఈ బతుకంటే   విసుగెత్తిందిరా ..మరి  ఒకళ్ళ తప్పు ఇంకొకరికి శాపమవటం ఏవిట్రా .. వెళ్లిపోరా .. వెళ్లిపో.. పుల్లి ..పుల్లి జాగర్త కనిపెట్టుకుని ఉండు లోకవంతా సవాయి సోకిన మగాళ్ళేనురా పోలమ్మకి చెప్పు దాన్ని పశువుల పాకల్లో వదలధ్ధని పన్లోకి పోయినప్పుడు వెంటట్టుకుని పొమ్మను” .. కన్నీళ్లు జల జలా రాలిపోతుంటే ఏసోబు చేతుల్లో వంద రూపాయలు, పోలమ్మకు ఇమ్మని నాలుగు చీరలు  పెట్టింది “ఎల్లను అమ్మగోరు.. మిమ్మల్నిడిసి ఉండలేనమ్మగోరు అట్టా పంపెయ్యబాకండి”  వల, వలా..ఏడుస్తూ కుప్పకూలిపోయాడు ఏసోబు..  “పుల్లికి ఆపతప్పిపోయింది కదమ్మగోరూ .. ఇక్కడే ఉండనివ్వండి దన్నవెడతాను”అంటూ  ఆ వెన్నెల రాత్రి తనకోసం చంటి పిల్లాడిలా ఏడుస్తున్న ఏసోబును గుండెలమీదకి తీసుకొని ఓదార్చాలనిపించింది.. అతని కన్నీళ్లు తుడిచి, నుదుటిపైన వీడ్కోలు ముద్దు ఇవ్వాలనిపించింది, ఉహూ.. వొద్దు, వద్దంటే వద్దు .. తను బలహీనం కాకూడదు.. “పుల్లికి ఆపతప్పిపోతే .. ఏవిటీ ? మనమిట్టా కొనసాగడవు నాకిష్టం లేదు ఏసోబూ.. అసలు పుల్లిని బలికోరే  సంబంధాలన్నీ .. అవి ఏవైనా.. ఎవరితో ఎవరికి అయినా .. నా మొగుడితో అయినా.. నీతో అయినా..సవాయి రోగం కంటే నీచంగా అనిపిస్తున్నాయిరా .. పుల్లిని రక్షించుకున్నాక ఈ దేహం, జీవితవూ  పునీతవైపోయాయిరా  ఇట్టాగే ఉండనీ..ఇక నీ మీద ప్రేమంటావా.. నా దేహం పుడకల్లో కాలిపోయేదాకా అదీ ఉంటుంది ఇక నువ్వు బయలుదేరు ,  తెల్లారితే నిన్నీ ఊర్లో చూసానా .. ఉరిపోసుకుని ఛస్తాను” అని చూపుడు వేలుతో బెదిరిస్తూ ..కారిపోతున్న కన్నీళ్లను చెంగుతో తుడిచేసుకుంటూ  గిరుక్కున తిరిగి, అతనికి వీపు చేసి ఇంటి పెద్ద తలుపుని  ధడాలున మూసేసింది . అలా పంపేసింది ఏసోబును.. తన జీవితం లోంచి వెళ్ళిపోయాక కూడా ఉన్నాడు వదలకండా.. నేలని తన చల్లని  వెన్నెలతో  తడిపే చంద్రుడిలా.. 

         

                               ఇక  “ అన్నయ్యకు ఉన్నట్లుండి పక్షవాతవెలా  వచ్చింది వదినా ఊర్లో వేరేగా చెప్పుకుంటున్నారు ” మూణ్ణెళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన ఆడపడుచు అడుగుతూనే ఉంది. అవును ఆ రోజు ఈయనకు పక్షవాతం ఎలా వచ్చిందీ?  ఏసోబుకి.. తీసుకెళ్లరా అంటూ పుల్లినిస్తుండగానే లోపలికి  వస్తున్న పోలమ్మ కనపడింది. తన వెంటే పాక లోపలికి వస్తున్న ఏసోబుని చూడలేదు తను తనకి కనపడిందల్లా పట్టలేనంత ఆక్రోశంతో తనమీదకు తోడేలులా  వస్తున్న మొగుడు కనపడ్డాడు .. వెంటనే తనకాలికి తగిలిన పిక్కాసుని అందుకుంది తను.. మీదకి రాకపోయినా అందుకునేదే ..అందుకుందా.. ఇక పిక్కాసుని కుడిచేత్తో లేపి, మొగుడి  కాళ్ళకి తగిలేలా ఒక్కటేసింది సుబ్బారావు బొక్క బోర్లా పడ్డాడా అరుస్తూ ..ఇంతలో ఏసోబు తనని పక్కకంటా జరిపి మొగుడి  దగ్గరికి వెళ్ళాడు, వొంగి  పిక్కాసు తీసుకున్నాడు ..ఆరడుగుల భారీ ఆకారం, ఎర్రబడ్డ కళ్ళతో  తనమీదకి పిక్కాసేత్తి  నిలబడ్డ ఏసోబును చూసి వణికిపోయాడు తన మొగుడు .. అతగాడి  కళ్ళల్లో మృత్యువుని చూసిన భయం చూసింది. పిక్కాసు తన మొగుడి మోకాలిలోకి దించేశాడు ఏసోబు , మోకాలు ఛిద్రం అయిపోయింది., రక్తం ధారగా కారింది .. తన మొగుడి  ఆర్తనాదంతో పాక వణికిపోయింది, పశువులు అల్లల్లాడాయి . భయంతో తన మొగుడికి ఆ క్షణాల్లోనే కుడి వైపు చచ్చుబడిపోయింది .. మాటా పడిపోయింది మూగ వాడయ్యాడు . అటక మీద నుంచి అనుకోకుండా పిక్కాసు పంతులు మీద పడిందనీ .. అసలు తలకాయ మీద పడాల్సింది, మోకాలి మీద పడిందనీ , అట్టా బతికిపోయాడనీ.. బతికినా ఏవి లాభం.. పక్షవాతం వచ్చి ఇక జీవితాంతవూ మంచాన్నే ఉండాలనీను , సుమతీ దేవి లాంటి భార్య చేసుకున్న  పుణ్యం వల్లే పంతులు ఆ మాత్రం అన్నా బతికాడనీ ఊరంతా అనుకున్నారు . వాళ్లన్నట్లే తాను.. తన మొగుడు ఎప్పుడూ కలవరించే  ఆ పతివ్రతా శిరోమణి సుమతీ దేవి కంటే కూడా ఎక్కువ సేవ చేసి తన మొగుడి పోయే ప్రాణాలు కాపాడుకోలా . బతికుండగా  తనకు ఏ  సుఖవూ లేక పోయినా చచ్చాకైనా  తనకి స్వర్గలోకం ప్రాప్తించదూ మరి …. అన్నపూర్ణమ్మ కిటికీ ఆవల తన మీదకి వెన్నెలని వొంచుతున్న చందమామని ప్రేమగా చూసింది.

ఆ చందమామలో అన్నపూర్ణమ్మకు ఏసోబు కనిపించాడు.

*

              

గీతాంజలి

80 comments

Leave a Reply to వెంకట్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇప్పుడు అంటే….ఇప్పుడు మాత్రమే, little difference ని చదివాక కలిగిన ఆందోళన, బాధ, అర్ధంకాని తనానికి ఉపశమనం దొరికినట్టుంది. S… There is a lot of difference this story brought about. ఒక కధని తిరగ రాయాలన్న ఆలోచన వెనక మహిళా లోకపు గళం ప్రతిధ్వని ఉంది. ఒక పాత్ర, తప్పయినా ఒప్పయినా, అలా ఎందుకు చేస్తుందో, పాఠకులకు పూర్తి అవగాహన వచ్చేలా ఆ పరిస్థితుల విశదీకరణ, మనస్థత్వాల చిత్రీకరణ ఉండాలి గానీ, మన ఇష్టం ప్రకారం గీసే అర్థం గీతలు కాకూడదు పాత్రలు. గీతాంజలి గారు చేసిన ఈ ప్రయత్నం సహేతుకమే కాదు, ఎంతో అవసరం కూడా!!

    • కథను సరైన తీరులో అర్థం చేసుకున్నందుకు థాంక్స్ రాజ్యాలక్మి గారూ…

      • This is really a well re-written story with a slap on the face to the original one that’s written with a view to selling the age old crooked ideas to attract certain section of people.

        Kudos to you Gitanjali garu.

  • మీ ప్రయత్నం అభినందనీయం. ఆ అసలు కథ నిజంగా చాలా బాధించింది. మనస్తాపం కలిగించింది. అన్నపూర్ణమ్మ పాత్రని తిరగరాయటం సంతోషించదగ్గదే. కానీ, మీ కథలోనూ కొన్ని ఎడిట్స్ ఉంటే బాగుండేది. ఏసోబు పట్ల అన్నపూర్ణమ్మ కి ఉన్న ప్రేమకి కారణం ఉండొచ్చునేమో కానీ, ఏసోబు తనకంటూ భార్య పోలమ్మ ఉండగా అన్నపూర్ణమ్మ పట్ల చూపే ఆరాధన కొంచెం అతిగా అనిపించింది. ఇది సవరించిన కథే కనుక సరే కానీ, మరీ వివరణలు, సాగదీతలు ఎక్కువగా ఉన్నాయి. అది మినహా అన్నపూర్ణమ్మ ని సగటు స్త్రీలా చూపినందుకు ధన్యవాదాలు.

    Oppressed లో ఇకపై బ్రాహ్మణ కులాన్నీ కలిపేస్తే బాగుండనీ అనిపించింది , సచేల స్నానం ఎవాయిడ్ చేసి ఉండొచ్చు. గాయత్రీ జపం చేస్తూ పాపభీతి పుష్కళంగా కలిగియుండే ఆ కులపోళ్ళూ సుబ్బారావు పాత్రని కూడా తిరగరాస్తే బాగుండు. ఏ దుర్మార్గాలకీ పాల్పడ్డ చరిత్ర తెలీదు కానీ, ఇంత పైశాచికంగా, దాష్టీకంగా బ్రాహ్మణ పురుషుడు ప్రవర్తించగలడాయనీ నాకు అనుమానమే. నేను చూసిన బ్రాహ్మణులు సౌమ్యులు. పురుషాహంకారం పుష్కళంగా ఉన్నవారూ, కొంచెం సంస్కారం లోపించి, పైత్యాలున్న వారు కూడా, ఇంత దాష్టీకానికి తెగబడే దుష్టులను చూసి లేను. వాళ్ళకే తెలియాలి మరి? అగ్రవర్ణాల దాష్టీకాలనగానే బ్రాహ్మణద్వేషమే గుప్పించటం తెలిసినదే కనుక, బ్రాహ్మణద్వేషం కొత్త ప్రోగ్రెస్సివ్ చిహ్నం కనుక ఈ విషయంలో ఇప్పట్లో చేసేదేమీ లేదు. వాళ్ళని కూడా “Oppressed” జాబితాలో వేసేవరకూ. ఇది ఇక్కడ ఉండాల్సిన కామెంటు కాదు, మీకు సంబంధంలేదు కానీ, ఎక్కడో చోట చెప్పాలనిపించి చెబుతున్నాను.

    ఏది ఏమైనప్పటికీ ఒక కథ బాలేదనిపించినప్పుడు, సంపాదకులు దానిని ప్రచురించకుండా రచయితతోనే తిరగరాయిస్తే మీకు ఈ బాధ తప్పేది. ఈ తిరగరాయించే పని సంపాదకులది. అదీ రచయితతోనే చేయించి ఉంటే బాగుండేది. ఒక అన్నివిధాలా చెత్తకథని ప్రచురించి, దానిపై విమర్శలని ఆహ్వానించటం, ఆపై ఇలా తిరగరాతలు ప్రచురించి, పూర్తి బాధ్యత రచయితకే అంటగట్టటం నా మటుకూ కొత్తగా తోస్తున్నది. అది మంచి కథ కాదనిపించిన పక్షంలో అక్కడే సరిచేసుండొచ్చు!

  • గొప్ప కథ! గీతాంజలి గారి introduction లో ఒరిజినల్ కథ ఆమెని ఎంతగా కలవరపరిచిందో అర్థం అవుతుంది. ఈ కథలో గీతాంజలి గారు అన్నపూర్ణమ్మ తరపున పడిన వేదన కంట తడి పెట్టించింది. అద్భుతమైన పాత్రను, ఆ పాత్రలోని మానవీయ సంఘర్షణను గొప్పగా మనముందుంచారు.

    I quickly breezed through the original story by Vivina Murthy after reading this one. In her book ‘Sexual Politics’, Kate Millet discusses the politics in sex and how patriarchy and power structure are displayed in several male writers’ works. His story is yet another classic example of what she discussed in that book. Vivina Murthy’s story shows annapurnamma’s character as animalistic, cold and shallow. There is no background, depth or purpose to her character other than being an object of sexual gratification directly or indirectly to the men in the story. All the female characters are portrayed as subordinate in one way or the other to the male characters. When there is no human emotion or story behind the characters, all that remains is a sleazy story bordering on porn. It cannot be any more disgusting and demeaning from women’s perspective or a human perspective.

    Kudos and love to Geetanjali garu for writing this! Keep up the good work!

  • గీతాంజలి గారూ మీకథ చాలా బాగుంది. భావజాలాను కనుగుణంగానే కాదు పాత్రల పట్ల ఆ భావజాలం ప్రపోజ్ చేసే రాగద్వేషాలకి స్వయంగా కథకులు తీవ్రంగా లోనైతే ఆ కథ పఠితల మనసులను తాకుతుంది. ఇందులో ఎటువంటి ధ్వనీ లేదు నమ్మండి. కాకపోతే కథ ఆరంభంలో మీరు రాసిన నోట్సుకి పరిమితమై నేను నిన్న రాత్రి నా అభిప్రాయాలు పంచుకుందామని రాసాను. పోస్టు చేదామని చూసేక ఇది వేరొక కథగా ఉండటం గమనించాను. రెండు కామెంట్లు కూడా చూసాను. వాటిలో ధోరణి నాకు నచ్చింది. మీకథని కేంద్రంగా చేసుకుని స్త్రీలంతా వర్ణ, వర్గ విచక్షణలకి అతీతంగా ఒకే గళంతో మాటాడితే వినాలని ఉంది. చాలాకాలంగా ఉన్న ఈ కోరిక తీరుతుందేమోనని ఆశ కలిగింది, అందుకు నాకధే కాకుండా నేను మాటలుపడ్డా దానికే నా ప్రాధాన్యత. మీకు కొంత ఆవేశం తగ్గాక నేను చెప్పదలుచుకున్నది చెపుతాను. అది నలుగురిలోనైనా సరే ప్రత్యేకంగా నైనా సరే మీ వీలుని బట్టి చెపుతాను. ప్రస్తుతానికి మీకథకి అనుకూల స్పందనలు రావాలని కోరుతున్నాను.

    • చాలా బ్యాలన్స్ డు గా రాశారు. మీ కథ వీరి కథ రెండూ ఇప్పుడే చదివాను. మీ కధా కాలం లో అలాంటి పాత్రలు ఉండే అవకాశం పూర్తిగా ఉంది. మీ కథ ఒక రచయిత్రి ని అంత డిస్టర్బ్ చేయడం మీ కథ విజయాన్ని సూచిస్తున్నట్టనిపిస్తోంది

  • madam, వివిన మూర్తి గారి కథ చదవలేదు గాని మీ విశ్లేషణను బట్టి అర్థమైంది. అన్నపూర్ణమ్మ పాత్రను మీరు చిత్రీకరించిన తీరు బాగుంది.

  • గీతాంజలి గారూ మీరు తిరగరాసిన కధ చాలాబాగుంది.
    కధకు ఇప్పుడు ఒక అర్ధం ఒక పర్పస్ సమకూరినట్లు అనిపిస్తుంది.

  • పితృస్వామ్య వ్వవస్థ కు స్త్రీ కూడా బానిసనే! అందుకు మినహాయింపు లేదు. కాకపోతే బానిస నిచ్చెన మెట్లమీద ఆమె పై స్థాయిలో ఉంటుంది
    . తాను బాధితురాలైనప్పటికి, తన భావజాలం మాత్రం పితృస్వామ్య వ్యవస్థ నిర్దిష్టపరిచిందే! ఏ విషయం లో నైనా! కాక పోతే బాధితురాలు కాబట్టి దాని వ్యతిరేకత కనిపిస్తుంది. ఒకే వస్తువు రెండు దృక్పథాల తో ఎలా ఉంటుందో చెప్పడం బాగుంది. వివిన మూర్తి గారి కథ సామాజిక వాస్తవికతకు అద్దం పడితే, గీతాంజలి గారి కథ పితృస్వామ్య ప్రతిఘటన లో భాగంగా , స్త్రీ ఒక ఆదర్శమూర్తిగా కనిపిస్తుంది. రెండు దృక్పథాలు ఒక దానికొకదానికి తీసిపోవు. కాకపోతే, గీతాంజలి గారి కథ వాస్తవాన్ని మరుగు పరుస్తుంది! దీన్ని వాస్తవికరించాలాంటే దృక్పథం మారితే చాలదు. వస్తువుకు తగినట్లుగా సంఘటనలు, పాత్రల వ్యక్తిత్వాలు కూడా మారాలి! పితృస్వామ్య వ్యవస్థలో, దానికి అంటిపెట్టుకుని ఉండే కులవ్యవస్థ దోపిడి ని వివిన మూర్తి గారు చూపాలనుకుంటే, గీతాంజలి గారు దాన్ని డైల్యూట్ చేసింది. వస్తువు యొక్క లక్ష్యాన్ని పట్టించుకోలేదు. కులవ్యవస్థ దోపిడీని స్త్రీ పురుషులిద్దరు సమానంగానే పంచుకోవాలని చూస్తే, ఆదోపిడి కేవలం పురుషుడిదే నని, దానికి స్త్రీ కి స్థానం లేదు అని చెపుతుంది గీతాంజలి గారి కధ. వస్తువుకు కీలకం : సవాయి వ్యాధి రావడం, దాన్ని పోగొట్టుకోవాలంటే మెచ్యూరిటీ ( శారీరకంగా) లేని వాలికను అనుభవిస్తే పోతుంది అన్న మూడ నమ్మకం! ఆ అందకారం ఎంత క్రూరమైనదో, దానికి పితృస్వామ్య వ్యవస్థ కింది వర్గ( వర్ణాలను) బలి తీసుకుందో మూర్తి గారు చెపితే, గీతాంజలి గారు దానికి ప్రాదాన్యతనివ్వలేదు. అసలు అది పితృస్వామ్య మైనదే గాని, స్త్రీ లకు అందులో బాగం లేదు అన్నారు గీతాంజలి గారు. నిజమే, కానీ, స్త్రీ భావజాలం మాత్రం పితృస్వామ్య మే! వాస్తవానికి అద్దం పట్టడం ఒక రకమైన సాహిత్య లక్ష్యం! ఆ వాస్తవాన్ని మరుగు పరిచి ఆదునిక స్త్రీ ఇలా ఉండాలి, కొన్ని పాత్రల వ్యక్తి త్వాలద్వారా చెప్పటం ఇంకో రకమైన సాహిత్య లక్ష్యం!

  • Lot of difference. “ఇలా రాయొచ్చు” అని చూపించినందుకు అభినందనలు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ ఖచ్చితంగా సానుభూతిని పొందగలుగుతుంది. ఒకే కథను రెండు భిన్న కోణాల నుంచి చదవడం బాగుంది.

  • Namaste Gitanjali garu. You have done a great job in rewriting the story. You have moulded Annapurna very well and Papayamma now makes sense. Thanks that Annapurna saves puli .

  • చరిత్రనే కాదు సాహిత్యంలో మహిళల పై జరుగుతున్న హింస, అవమానాలను ఎట్లా తిరగరాయాలో సవాల్ చేసి చూపిన కా.గీతాంజలి గారికి అభినందనలు. అన్నపూర్ణ స్వభావాన్ని అద్భుతంగా చిత్రించారు. వినిన మూర్తి గారు ఈ కథ చదివి ఆశ్చర్యానికి గురయి వుంటారు. రచయితకు స్పష్టంగా ఒక దృక్పథం కలిగి ఉండాలని, అదీ పీడితుల పట్ల నిలబడే విధంగా రచన ఉండాని సద్విమర్శ చేసిన గీతాంజలి గారు సృష్టించిన కథ అద్భుతమైనది. కథా విమర్శకులకు ఒక సమాధానంగా కథరాసి చూపించడం ఒక కొత్త దారిలో ఉంది. ఎదీ ఏమైనప్పటికీ అన్నపూర్ణమ్మకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. పుల్లిని సుబ్బారావు కామోన్మాదం నుండి చక్కగా కాపాడటం అభినందనీయం. వివినమూర్తి గారి కథ చదివి ఎంతో వేదనకు గురైతే తప్పా ఈ కథను రాయడం సాధ్యం కాదు. దారి తప్పిన కథను కొత్త తొవ్వలోకి నడిపించి మహిళల ఆత్మగౌరవం నిలిపిన డాక్టర్ గీతాంజలి గారికి ఉద్యమాభినందనలు…

  • గీతాంజలి గారూ నా వెనకటి వ్యాఖ్యలో అది నలుగురిలోనైనా సరే ప్రత్యేకంగా నైనా సరే మీ వీలుని బట్టి చెపుతాను అని రాసాను. దానికి మీనుంచి ఎటువంటి స్పందనా లేదు. కనక మీరు పబ్లికునే ఎంచుకున్నారని గత్యంతరం లేక నిర్ణయించుకున్నాను.
    దీనిని మీ కథకి వ్యాఖ్యగా చేరుస్తున్నాను. దీనికి మీకు మనవి చేయటమే కాక మరే ప్రయోజనమైనా ఉందని సారంగ సారధులు భావించి విడిగా దీనిని ప్రచురించాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు.
    గీతాంజలి గారూ
    నేను సర్వ సాధారణంగా స్త్రీలకు సమాధానం చెప్పేటపుడు తల్లీ, అమ్మా నాన్నా అంటూ సంబోధిస్తాను. ఇది నేను చేసుకున్న అలవాటు కాదు. అప్రయత్నంగా జరిగే విషయం. కాని మీకు రాసేటపుడు చాలా బలవంతంగా ఆ నా సహజ ప్రవర్తనని కాన్షస్ గా ఆపుకుని కృత్రిమంగా సంబోధించాను. దానికి కారణం మీకు నా కథ నచ్చకపోవటం కాదు. దాని ఫలితంగా మీపై కోపం రావటం వల్ల కాద ని చెప్పుకుంటున్నాను. నా ఈ మాట మీరు నమ్మే అవకాశం చాలా తక్కువ అనే అంచనా.
    నా సంబోధనలో తీసుకున్న జాగ్రత్తకీ, నా అంచనాకీ కారణమైన వాక్యాలు ఇవి.
    “అసలు పుల్లిని రేప్ చేసింది…సుబ్బారావు కాదు, చేయించిందీ అన్నపూర్ణమ్మ కూడా కాదు.. రచయితే చేసాడు అనిపిస్తుంది..,రచయత subconscious mind లో ఎక్కడో paedophilia పట్ల.,, (అంటే చిన్న పిల్లలతో శృంగారం చేయడాన్ని పీడోఫీలియా అంటారు.ఇదొక మనోలైంగిక సమస్య ) బలమైన ఆమోదం ఉంది అని అనిపిస్తుంది . సాహిత్యంలో రచయిత తను దేన్ని బలంగా కోరుకుంటాడో అదే రాస్తాడు.”
    ఈ వాక్యాలలో ఉన్నదాన్ని నేను ఖండించే ప్రయత్నం చెయ్యటం లేదు.
    నా వ్యాఖ్య సారంగ సాంకేతిక కారణాల వల్ల (నిడివి)ఇక్కడ ఉంచలేకపోతున్నాను. సారంగ అఫ్సర్ గారికి పంపాను. వారెం చేస్తారో మీరేం చేస్తారో మీమీ ఇష్టం. బై

    • స్థాయి. తక్కువ వ్యాఖ్య చేశారు గీతాంజలి.అభ్యంతరకరం

      • “అన్నపూర్ణమ్మ సవాయి భర్త చేతిలో బాధితురాలిగా, అతని కోసం పసిపిల్లలపై అత్యాచారాలు చేయించేదానిగా మారే పరిణామ క్రమాన్ని వివిన ఎస్టాబ్లిష్ చేసిన లోటుపాట్ల తీరు గీతాంజలికి నచ్చలేదు. అందుకే ఆమె అన్నపూర్ణమ్మకు, పుల్లికి అండగా నిలించింది. ఒక పాఠకురాలిగా, స్త్రీల సమస్యలపై విస్తృతంగా రాసిన రచయిత్రిగా తన వేదనను సద్యోజనితంగా, బాధ్యతగా పంచుకుంది. ఇందులో ఆమె నిజాయతీని శంకించాల్సిన అవసరం లేదు.” అని ఎఫ్‌బి లో మోహన్ గారు రాశారు . నేను కూడా అన్నపూర్ణ పుల్లి మీద భర్త అత్యాచారంచా లా చిరాకుఏ భావం తో ఏకీభవిస్తున్నాను . అది సరి అయిన అభిప్రాయమే. ఇప్పుడు విమర్శిస్తున్న
        అభ్యుదయవాదులకు ఈ విషయం తట్టక పోవడం నాకు బాధ కలిగించింది .

    • //రచయితే చేసాడు//

      // రచయిత తను దేన్ని బలంగా కోరుకుంటాడో అదే రాస్తాడు.”//

      పై వ్యాఖ్యలు Hilarious comedy గా అనిపించాయి.

      జీవితం సిద్ధాంతాలకు అనుగుణంగా నడవదు….. జీవితం జీవితం లాగె నడుస్తుంది.

      జీవితంలోని అన్ని వంకర్లని సిద్ధాంతాలలోకి వంచి సాపు చెయ్యాలనుకోవటం అజ్ఞానమే కాదు మూర్ఖత్వం కూడా….

      బొల్లోజు బాబా

      • బొల్లోజు బాబా hilariou comedy కాదు moral and intellectual bankruptcy. Sickeningly obscene .

  • మూర్తి గారి కథ నేను చదవలేదు. కానీ రచనలోని వస్తువును చూసి రచయితపై దుర్మార్గమైన ముద్రలు వేయడం అత్యంత దురదృష్టకరమైనది. మూర్తిగారి మీద వచ్చిన అలంటి నీచమైన విమర్శా ఒక ధర్మాగ్రహాన్ని నాకు కలిగించింది. మూర్తిగారూ మీరెంటో , మీ మూర్తిమత్వం ఏమిటో మాలాంటి అనేకమందికి తెలుసు.

  • కొన్ని ప్రశ్నలు

    ఇవి సారంగ నిర్వాహకులకు

    1. ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా రీరైట్ చేసే హక్కు ఇతర రచయితలకు ఉంటుందా?

    2. ఒక వేళ ఉన్నట్లయితే … ఆ కథకు ఇంట్రో వాక్యాలలో ఒరిజినల్ రచయిత గౌరవానికి భంగం కలిగించే విధంగా దూషించవచ్చా?

    3. పై రెండు ప్రశ్నలకు అవునని నమ్మితే – అలాంటి సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా?

    4. పై మూడు ప్రశ్నలకు సమాధానం సారంగ వద్ద లేకపోతే…. సారంగ నిర్వాహకులు నైతిక నియమావళి తప్పినట్లుగా, ఇది సాహిత్యద్రోహంగా భావించవలసి వస్తుంది.

    బొల్లోజు బాబా

    • దీన్ని విమర్శ పేరుతో చెలామణీ చేయించటం అనంగీకారం.

      ఎందుకంటే అవే పాత్రల పేర్లు, సంఘటనలతో సమాంతరంగా ఒక కథను నిర్మించటం ప్లాగియారిజం క్రింద వస్తుంది. విమర్శగా కాదు.

      పాత్రల పేర్లు మార్చి, సంఘటనలు మార్చి కథలు, నవలలు వ్రాయటం సాహిత్యంలో పరిపాటే. ఇది ఆ కోవకు చెందదు.

      • అవును. మీరు చెప్పేది అక్షరసత్యం. ఇది వక్రించిన ప్లాగియరిజం. సాహిత్య నిబద్ధత కంటే సారంగ వ్యక్తుల, ప్రెజర్ గ్రూపుల వత్తిడి కి గురవుతున్నట్లు కనిపిస్తోంది. సాహిత్యానికి క్రొత్త పరమార్ధాలు ఏర్పడిపోతాయేమో. పాతది ఏదో నశించి పోవాలి అన్న యావే తప్ప కొత్త సృష్టి పట్ల తపనా చచ్చిపోతోంది.

    • క్షమించాలి. ఇది ఎదో లపేరు తెచ్చేకోడానికో లేక వాణిజ్యపరంగా చేసింది కాదు. ఒక విస్తృత విమర్శ మాత్రమే. సాధారణంగా విమర్శించే వారు కధ లోని కొన్ని పేరాలను లేదా వాక్యాలను కోట్ చేస్తూ తమ విమర్శ తెలియచేస్తారు.
      గీతాంజలి గారు మరో అడుగు ముందుకు వేసి మొత్తం కథను పేరడీ గా రాశారు.
      పేరడీ ప్లాగారిజం అని నేను అనుకోవడం లేదు

  • కేశవరెడ్డి మునెమ్మ మీద కూడా ఇదే రకపు విమర్శలు వచ్చాయి. అప్పుడు గీతాంజలి గారు కేశవరెడ్డిని ఉద్దేశిస్తూ అనేక శాస్త్రీయమనోవైగ్నానిక పారిభాషక పదాలతో విమర్శించారు. కాత్యాయినిగారు ముందుగా విమర్శ రాసినట్టు గుర్తు. మనుషుల మధ్య ఐక్యత- ఘర్షణలు ఎలా ఎందుకు కొనసాగుతుంటాయో మామూలు మనుషులకు అర్థమయినట్టుగా రచయితలు, ఉద్యమకారులు అర్థం చేసుకోకపోవడం వాళ్ళ జన్మహక్కు.
    పాపం, వివినమూర్తి ఇంకా బాగా రాసి ఉండాల్సింది.

  • “బయట సమాజంలో ఎక్కడైనా సరే స్త్రీల మీద, పిల్లల మీద లైంగిక అత్యాచారాలు ఎవరైనా చేస్తే ఎట్లా న్యాయం, చట్టం, హక్కుల సంఘాల ఊరుకోవో, శిక్ష విధించి sexual abusers ని హెచ్చరిస్తాయో, అచ్చం అదే స్ఫూర్తితో సాహిత్యంలో కూడా పురుష రచయితలు స్త్రీల character assassination సహించలేని, ఊరుకోలేని సాహిత్య సభ్య సమాజ ప్రతినిధిగా డాక్టర్ గీతాంజలి గారు తిరగరాసిన ఈ కథ- తెలుగు సినిమా దర్శకులు ఇవీవీ సత్యన్నారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి లకి తీసిపోని త్యాగమయమైన… ఉదాత్తమైన స్త్రీల పాత్రచిత్రణతో, విరసం స్థాయికి ఏమాత్రం తగ్గని సృజనశీలతతో అలరారింది.

  • I am shocked with the intro to this story..it is a clear attempt to assassinate the charecter of a writer..I really wonder how such an attempt has passed the scrutiny of Saranga editors

  • వివినమూర్తి గారి కథలో అన్నపూర్ణమ్మ పాత్ర మీద సానుభూతి మాత్రమే ఎందుకు కలగాలి? స్త్రీలు బాధితులు కనుక పీడకులుగా వారిని చూపించడం వల్ల వారి స్థితి మరింత దిగజారుతుంది కనుక, స్త్రీలు బాధితులనే మెజారిటీ వాస్తవం పక్కదోవ పడుతుంది కనుక అనుకుందాం. కాబట్టి అన్నపూర్ణమ్మ వంటి ఎక్సెప్షనల్ (ఆ కాలానికి ఎక్సెప్షనల్ అవునో కాదో తెలీదు
    ) వాస్తవాన్ని టోన్ డౌన్ చేసుంటే బాగుండేదని మొదటిసారి చదివినప్పుడు నాకూ కొద్దిగా అనిపించింది. కానీ ఆమె పచ్చి వాస్తవానికి ప్రతీక. ఆమె క్రూరత్వమే కాదు, నిస్సహాయత, దాన్ని జయించే లౌక్యం, కుటుంబం, ఆస్తులు కాపాడుకోక తప్పని అవసరం, దానికోసం ఎంతకయినా తెగించే అమానవీయత… చదవగా చదవగా ‘పాడు పెళ్ళిళ్ళు! ఆస్తులు, కులాలు… ఒక మనిషిని ఎంత దుర్మార్గానికి మళ్లించాయన్న’ ఆవేదన కలిగింది. జీవితంలోనూ, సాహిత్యంలోనూ ‘ఆర్చిటైప్స్’కి అలవాటు పడినవాళ్లం అన్నపూర్ణమ్మని భరించగలమా! పెద్ద బొట్టు, పసిమిఛాయ, మడిచీరకట్టులు – ఒద్దికగా పాతివ్రత్యమో, పరిధులు మీరని ప్రేమలో నెరపాలి తప్ప ‘లాటాఫ్ డిఫరెన్స్’ తో ఉంటే తట్టుకోగలమా!

    మంచితనం, చెడ్డతనం ఏకకాలంలో ఉంటాయి, ఈ కథ, దాని ఇంట్రో అందుకు ఉదాహరణలు

    • మల్లీశ్వరి గారు. మీతో ఏకీభవిస్తున్నాను. వాచ్యంగా రాసి చివరికి ఒక predictable సందేశం ఇవ్వటం సాహిత్యం ఐయింది. మైక్రో రియాలిటీ గురించి రాస్తే ఎం .

  • ఇంత degenerate విమర్స్ నేను ఎక్కడ చదవలేదు. విమర్స్కులు మనోవిశ్లేషన చేస్తున్నారా సాహిత్య విమర్స్ చేస్తున్నారా ?
    ఈ విమర్స్ రాసిన వారి మానసిక sadism వల్ల ఇలా రాస్తున్నారు అని మరో విమర్స్ చేస్తే ఎలా ఉంటుంది ? కధ, కధనం గురించి విమర్స్ ఉండాలి కానీ ని కధ నేను రాసాను అలాగే నువ్వు రాయి అని చూపించడం అహంకారాం కంటే మించిన ఉన్మాదం.

    • గీతాంజలి రాసిన ముందుమాటల్ క్రౌర్యం మూందు మనమెంత కఠినంగా విమర్షించినా తక్కువే!

  • ”అసలు పుల్లిని రేప్ చేసింది…సుబ్బారావు కాదు, చేయించిందీ అన్నపూర్ణమ్మ కూడా కాదు.. రచయితే చేసాడు అనిపిస్తుంది..,రచయత subconscious mind లో ఎక్కడో paedophilia పట్ల.,, (అంటే చిన్న పిల్లలతో శృంగారం చేయడాన్ని పీడోఫీలియా అంటారు.ఇదొక మనోలైంగిక సమస్య ) బలమైన ఆమోదం ఉంది అని అనిపిస్తుంది . సాహిత్యంలో రచయిత తను దేన్ని బలంగా కోరుకుంటాడో అదే రాస్తాడు.”
    – మిక్కిలి అనుచితమైన, అన్యాయమైన అభియోగం. ‘Below the Belt’ దాడి. గతంలో ఓ సందర్భంలో శ్రీశ్రీకీ, రంగనాయకమ్మకీ వాదప్రతివాదాలు జరిగినప్పుడు శ్రీశ్రీ విషయాంతరంగా దిగజారి, మాట జారాడు. ఇప్పుడు వివినమూర్తి మీద గీతాంజలి అభియోగమూ అలాంటి విషయాంతరమైన అపనిందే! కథా వస్తువే పరమ దుర్మార్గమైన, జుగుప్సా కరమైన ఒకనాటి వాస్తవానికి సంబంధించినది. ఆ వాస్తవంపై ఏవగింపు కలిగించడానికో లేదా ఉన్నది ఉన్నట్టు రాయాలనో రచయిత రాసిన కథలో నీచత్వం రచయిత నైజమే అని తీర్మానించెయ్యడం అన్యాయం, దుందుడుకుతనం. ఇలాగైతే.. రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, గిరీశంలు గురజాడలోని నిబిడీకృత నైజానికి వేర్వేరు ప్రతినిధులు అనగలరేమో!

  • వివిన మూర్తి గారి కథ , దాని మీద జరుగుతున్న విమర్శలు చదివినప్పుడు వచ్చిన సందేహాలు ఇవి.

    కథలో నేర ప్రవృత్తి కలిగిన ఒక పురుషుడికి అతడి భార్య సహకరించటం – ఆమె ‘ స్త్రీ ‘ కావటం – అందువల్ల అదే అస్తిత్వం కలిగిన వారికి ఆగ్రహం కలగటం – అసలు సాహిత్యానికీ / విమర్శకీ సంబంధించిన మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది.

    సాహిత్యంలో నేర ప్రవృత్తి కలిగిన పాత్రలు ( సమాజంలో ) ఎదోక అస్తిత్వాన్ని కలిగి ఉండక తప్పదు. అప్పుడు ఆయా అస్తిత్వాల సమూహాలు ‘మే ఊరుకోం . మేం సహించం ‘ అంటే రచయితలు భయపడి రాయటం ఆపాలా? ఆపటం ప్రాధమిక హక్కులకు భంగం కాదా? ఆపేసినా సమాజంలో నేరాలు ఆగుతాయా? ఆపగలిగే సత్తా వీరికి ఉందా?

    అంత సత్తా ఉంటే తెలుగులో కనీసం వంద పుస్తకాలయినా కొనిపించి (లేదా ఆత్మీయంగా / ఆప్తంగా అని రాసి అంటగట్టి అయినా సరే) చదివించగలిగించే సత్తా రచయితలు , విమర్శకులూ ఎంతమంది?

    నేరాలూ ఘోరాలు చేసేవాళ్ళు ఫలానా కులం వర్గం లింగం కి సంబంధించిన వాళ్ళే అయి ఉండాలని / ఉండకూడదనీ సాహిత్యంలో నిబంధనలు ఉన్నాయా? రొజూ పత్రికల్లో వచ్చే వార్తలు కనీసం మన రచయితలు చదువుతున్నారా? సమాజంలో జరిగే నేరాల్లో ఏ అస్తిత్వాల వాళ్ళు ఎంత మందో దానికి సంబంధించిన డేటా ఉందా?

    ఎక్సెప్షనల్ మనుషులకి సాహిత్యంలో స్థానం లేదా? అన్ని పాత్రలూ తాము అమోదించే (మూస) పాత్రలే అయి ఉండాలా?

    ఒక పాత్రకు కలిగిన మనో వికారాలు ఆ రచయితకు ఉన్నట్టే అని ఇంత ధైర్యంగా రాసిన ఆరోపణలు చూస్తే…

    హత్యలనూ , దాడులనూ గ్లోరిఫై చేస్తూ వచ్చిన ‘ఉద్యమ సాహిత్య రచయితలకూ ‘ ఇది వర్తిస్తుందా? వాళ్ళకూ ఆ నేర వాంచ లోపల ఉన్నట్టేనా? నేరం చేసే ఉంటారా? అందుకు శిక్ష పడటం సరైందే అని పై విమర్శ జస్తిఫై చేస్తోంది (విచిత్రంగా బూర్జువా కోర్టులు ఎంతో కొంత నయం. కొన్ని సార్లయినా అభిప్రాయాలు కలిగి ఉండే హక్కుని గుర్తించాయి)

    కథా రచనలో రచయిత వేరూ, కథకుడు వేరూ, పాత్రలు వేరూ అనేది ఒక కనీస సూత్రం. ఇది తెలిసిన రచయితలు , విమర్శకులూ, పాఠకులూ తెలుగులో ఉన్నారా అని సందేహం వస్తుంది – రచయితను వ్యకిగతంగా నిందిస్తూ రాసిన అనేక వ్యాఖ్యలను చూస్తే.

    యజ్ఞం కథ రాసిన రచయితకు సొంత పిల్లల్ని నరికి చంపాలనే వాంచ ఉన్నట్టూ, అన్నా కెరైనినా రచయితకు స్త్రీలను రైలు కింద తోసి చంపాలన్న కోరిక ఉన్నట్టూ తెలిసిపోతోంది కదా?

    తెలుగు సాహిత్యం ఇంత దిక్కు మాలిన స్థితిలో ఉండటానికి కారణాన్ని అర్ధం చేయించటం ఒక్కటే ఈ విమర్శ ప్రపంచానికి చేసిన ఒకే ఒక మేలు .

    • అక్కడికేదో వివినమూర్తి గారు తెలుగు కధ మీద చేతబడి చేసినట్లు, దానికి అత్యంత వైజ్ఞానిక తరహాలో ప్రతికృతి చేపించినట్లు. దీన్ని అన్నిభాషల లోకి అనువదించి ప్రచురిస్తే రేపటికి దోపిడీ ప్రపంచం అభ్యుదయ క్రమంలోకి మారుబడి పోతుందన్నట్లు. క్రిటిక్ ఆఫ్ లిటిల్ సిగ్నిఫికెన్స్. ‘ఇది కధ కాదు’.

  • విమర్శ బాగుందనగానే వెంటనే స్పందించి కృతజ్నతలు చెప్పిన ఈ రచయత్రి /విమర్శకురాలు ఇన్ని విమర్శలకు కనీసం జవాబు ఇవ్వ కపోవడాన్ని మానసిక శాస్త్ర భాషలోనూ, నేరశాస్త్ర భాషల్లోనూ ఏమంటారో

  • నేర ప్రవృత్తి ,కుట్ర మనస్తత్వాలకు స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. అందరూ మనుషులే

    మానవ సహజ ప్రవృత్తులైన స్వార్థం, కుట్ర,అన్నపూర్ణమ్మ కి ఉండటంలో అసహజత్వం ఏమీ లేదు. కథ తిరగ రాయడం వల్ల, ఆమెను నిస్ సహాయురాలిగా గా చూపడం వల్ల ఒరిగే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. ఒక “పాత్ర”ను పాత్ర గా యాక్సెప్ట్ చేయలేక పోవడం ఈ మధ్య తరచు గా కనపడుతున్న విషయం. ఆ పాత్ర నచ్చక పోవడానికి కారణాలు విశ్లేషించవచ్చు గానీ,అసలు ఆ పాత్రే వేరేగా, మనకు నచ్చినట్టు ఉండాలనడం సబబా?

    ఒరిజినల్ కథలో అన్నపూర్ణమ్మ ఏసోబు తో వివాహేతర బంధం కల్గి ఉండటాన్ని రొమాంటిసైజ్ చేసి రాస్తే దాని అర్థం మారి పోదు

    ఒరిజినల్ కథ కి ఉమ నూతక్కి తన అభిప్రాయంలో రాసినట్టు అన్నపూర్ణమ్మ బాధితురాలి స్థానాన్ని కోల్పోయి పీడకురాలి గా మారింది. ఆ పాత్రను అలా దిద్దడం రచయిత స్వేచ్చ . లోకమంతటా వ్యాపించి ఉన్న క్రౌర్యానికి అన్నపూర్ణమ్మ అతీతం కాదు, కానక్కర్లేదు

    పాత్ర ఉద్దేశాలు, నేరాలు రచయితకు అంటగట్టడం ఆ మధ్య ట్రెండ్ గా మారినట్టుంది.

  • స్త్రీలు హింసలో పాల్గొనరని కాదు. స్త్రీలు అత్యాచారానికి సహకరించలేరనీ కాదు. స్త్రీలను ఎప్పుడూ మంచి పాత్రలుగానే చూపించాలనీ, కథలెప్పుడూ predicted గా ముగియాలనీ ఏమీ లేదు. తిరగరాసిన కథ నాకు నచ్చింది పైన కారణాల వల్ల కాదు. ఒక విధంగా తిరగరాసిన కథలో స్త్రీ పాత్రను positive గా మార్చి చూపించడం వల్ల original కథలో స్త్రీని negative గా చూపించడమే problem లాగా కనిపించవచ్చు.

    కానీ original కథలో రచయిత పాత్రలను dehumanize చేసి చూపించడం చాలా వెగటుగా ఉంది. ఒక పసిపిల్లను రేప్ చేయడం చాలా non-chalant గా చెప్పేస్తాడు రచయిత. సరే స్త్రీ పాత్ర నయానికో, భయానికో, చావబాదే మొగుడి కోసం ఇష్టంగా, ఎలాంటి inner struggle లేకుండా (I don’t know how this makes sense logically or emotionally) చిన్నపిల్లలను సమకూర్చి పెడుతుంది. ఏసోబు తన బిడ్డ చావుకి ఆమె కారణమని తెలిసి కూడా బిడ్డ చనిపోయిన నాలుగు రోజులకే ఆమెతో పడుకుంటాడు. (అంటే బిడ్డ కన్నా ఆమె చావుకు కారణమైన పరాయి స్త్రీతో పడుకోవడమే ఇష్టపడే తండ్రి అతను. Not sure how this makes sense either.) ఇది కేవలం కథ ఏమయినా sensible గా ఉందా లేదా అనే విషయం కాదు. రచయిత దృక్పథం (లేదా అది లేకపోవడం) గురించి మనకు చెబుతుంది. పాత్రల ఆలోచన, ప్రవర్తన ఏదయినా ఉండొచ్చు కానీ రచయిత దృక్పథం అనేది ఒకటి ఉంటుంది కదా.

    ప్రపంచంలో బూతు, హింస, perversions ఆడ, మగ అందరిలో ఉంటాయి. దానికొక దృక్పథం లేకుండా ‘అవి జరిగినయి జరిగినట్టు రాస్తాను’ అంటే అట్లాంటి పోర్న్ కథలకు ప్రపంచంలో కొదువ లేదు. ‘సాహిత్యం’ అని రాసినప్పుడు పాత్రలలో లేదా కథనంలో ఎమోషన్స్, character arcs ఉండాలి కదా. అవేమీ లేకుండా స్త్రీ పాత్రలను, దళిత పాత్రలను (ఏ పాత్రలనైనా) dehumanize చేసి, sexualize చేసి చూపిస్తే అది బూతు అవుతుంది. patriarchy లో నుండి వచ్చిన perversion అవుతుంది. ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక దళిత అమ్మాయి మీద చేసిన హింస అనే ముసుగులో చాలా perverted, vulgar ‘కథ’ అది. దానికి చెంపపెట్టులా తిరగరాసినందుకు నాకు కథ నచ్చింది, అంతే కాని సందేశాత్మకంగా రాసినందుకో, స్త్రీ పాత్రను ఉన్నతీకరించి రాసినందుకో కాదు.

    అసలు కథ తిరగరాయడం అవసరమా అనేది వేరే చర్చ. కాని గీతాంజలి గారి కథ ఉన్నా లేకున్నా మొదటి కథ మీద నా అభిప్రాయం అది.

    I agree that Geetanjali garu shouldn’t have made the personal comment on the writer. I think that was unnecessary and it only helped take the focus away from his sleazy ‘story’ to her comment.

    • చైతన్య గారు

      ఒక కథను ఎంతదూరమైనా విమర్శించవచ్చు. కానీ తిరగరాసే హక్కు ఇతరులకు ఉంటుందా….ఇది మంచిదోరణా అనేది ఆలోచించండి.

      అది వేరే చర్చ అని దాటవేయద్దు.

    • The story might be undeveloped . To call it sleazy is to participate in the same charecter assassination that is so despicable in the critic.

  • ఇవి సారంగ నిర్వాహకులకు నిన్న కొన్ని ప్రశ్నలు అడిగాను. ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. కనీసం ఇస్తానని రెస్పాండ్ కూడా కాలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని రీడర్ రెస్పాన్స్ థీరీ అనో, డీకనష్ట్రక్షన్ సిద్ధాంతమనో లాంటి జార్గన్ తో హడల గొట్టే ప్రయత్నం కూడా చేయలేదు.

    కనుక

    సారంగ నిర్వాహకులు నైతిక నియమాలు తప్పారని, సాహిత్యద్రోహం చేసారని భావించక తప్పటం లేదు.

    నేను అడిగిన ప్రశ్నలు

    1. ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా రీరైట్ చేసే హక్కు ఇతర రచయితలకు ఉంటుందా?

    2. ఒక వేళ ఉన్నట్లయితే … ఆ కథకు ఇంట్రో వాక్యాలలో ఒరిజినల్ రచయిత గౌరవానికి భంగం కలిగించే విధంగా దూషించవచ్చా?

    3. పై రెండు ప్రశ్నలకు అవునని నమ్మితే – అలాంటి సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా?

    4. పై మూడు ప్రశ్నలకు సమాధానం సారంగ వద్ద లేకపోతే…. సారంగ నిర్వాహకులు నైతిక నియమావళి తప్పినట్లుగా, ఇది సాహిత్యద్రోహంగా భావించవలసి వస్తుంది.

    బొల్లోజు బాబా

    • ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా రీరైట్ చేసే హక్కు ఇతర రచయితలకు ఉంటుందా?
      అలాంటి సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా?

      ఒక ఉదాహరణ :
      1. “స్వార్జితం”, శ్రీవల్లీరాధిక,  ఆంధ్రప్రభ వార పత్రిక,  16/10/1996
      2.”స్వానుభవం”, గుమ్మా నిత్యకళ్యాణమ్మ, ఆంధ్రప్రభ వార పత్రిక, 29/1/1997

      • విశాఖ గారు పై ఉదంతంలో రాధికగారు కథను తప్పుగా రాసారు అని వారిని నానామాటలతో దూషిస్తూ, దాన్ని నేను కరక్ట్ చేసి రాస్తున్నాను ఆ కథ ఇలా ఉండాలి అని కళ్యాణమ్మ గారు ప్రకటించారా?

      • ఒక ప్రశ్న అడిగారు. సరిపోయే ఉదాహరణ ఇచ్చాక ఇపుడు ప్రశ్న మారింది.
        దూషించారా? సరిగ్గా ఇలాగే దూషించారా? అచ్చగా ఇవే మాటలు వాడారా? అని ప్రశ్నలు కలుపుకుంటూ పోతే ఇక దానికి అంతముండదు.
        ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా ఇతర రచయితలు రీరైట్ చేసిన సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా? అన్న ప్రశ్నకు ఒక ఉదాహరణ స్వానుభవం కథ.
        మొదటి కథ స్వార్జితంలోని భావాలు సరైనవి కావన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చుతూ రెండవ కథ రాయబడింది.
        అవే పాత్రల పేర్లు, సంఘటనలు, సంభాషనలు వాడుకుంటూ రెండవ కథను గుమ్మా నిత్యకళ్యాణమ్మ అనే కలంపేరుతో రచయిత గుమ్మా ప్రసాదరావు రాశారు. ఆ కథను ఆంధ్రప్రభ ప్రచురించింది.

      • నేను అడిగింది ఒక ప్రశ్నకాదు. అది ఒక సముదాయం. ఒకదానికొకటి లింక్ అయి ఉన్న అంశాన్ని మీరు గమనించాలి….

        అన్నిటికీ వర్తించే చివరి సమాధానం ఏదైనా ఉంటే చెప్పండి.

        ఇక్కడ సమస్య క్లుప్తంగా ఇది

        “ఓయి వెర్రిపాఠకుల్లారా, ఆ దుష్ట రచయిత మిమ్మల్ని తప్పుదోవపట్టించాడు. ఆ కథ అలా రాయకూడదు. ఇదిగో నేను తిరిగి రాస్తున్నాను. This is final and corrected story. దీన్ని చదవండి పాతదానిని బొందలో పెట్టండి” అని విమర్శ పేరుతో ప్రకటించటం. ఇదేపాటి సాహిత్యసంస్కారమో చర్చించండి.

        ఒక కథను అర్ధం చేసుకోవటంలో భిన్న దృక్ఫథాలు, భిన్న కోణాలు ఉంటాయి. వాటిని వ్యక్తీకరించే హక్కు అందరికీ ఉంటుంది.

        నేను మాట్లాడుతున్నది ఫామ్ గురించి…. గమనించగలరు.

        ఆమె చేసిన దూషణలు ఆమె అల్పత్వాన్నేసూచిస్తాయి అనుకొంటాను. వాటిపట్ల ప్రత్యేకమైన గమనింపు చేయటం లేదు.

    • బల్లోజు బాబా గారు మీ కాకినాడ మిత్రుడి తరపున మీరు ఏదో మేధో అంశాలతో రచయిత్రిని భయపెట్టాలనో లేక ఇలాంటి ప్రక్రియలని ముందు ముందు ఎవరూ చెయకుండా నీయంత్రించాలనో ఒక పురుషాధిక్య సమాజ ప్రతినిధి గా మీరు అడుగుతున్న ప్రశ్నలు పనికి మాలినవి… మెధో పరంగానే కాదు చట్ట పరంగా కూడా… ఆ సంగతి తెలుస్కోండి..కాస్త విమర్శించేటప్పడికి అన్ ఫ్రెండ్ చేసుకునే కుసంస్కారులంతా ఈ సారంగలో నిండి ఉన్నారు (అఫ్సర్ ని ఉద్దేసించి రాస్తున్నా ..మీరు కూడా అంతే రెండు సార్లు నా గళం మీ మీద విప్పానని భయ పడ్డ మనుషులు మీరంతా మా ఖర్మ కాలి సాహిత్య లోకాన్ని ఏలుతారు) మీతో పోలిస్తే వివిన మూర్తి గారు నయ్యమే అని చెప్పాలి..కానీ పురుషాధిక్య సమాజ ప్రతినిధులే మీరంతా మీ భావ జాలంలో కడు స్పష్టం అది. తరువాత మీ ప్రశ్నలకి అమెరికా +భారత దేశ మేధో సంపదల సంస్థలలో ఉద్యోగం వెలగ బెడుతున్న నాకు మీకంటే అఫ్సర్ కంటే బాగా తెలుసననే నమ్మకం. ముందుగా ఆరోపణ చేసేటప్పుడు ఆధారాలు ఉండాలి..ఆ ఆధారాల ప్రకారం వివిన మూర్తిగారి అనుమతి స్పష్టంగా ఉంది పైన వాఖ్యలలో ..ఆయన అభ్యంతరం తెలపక పోతే… ఎటువంటి నష్టం లేదు…జయకుమార్ మరియూ రాం గోపాల్ వర్మ ఆఫీసర్ సినిమా కేసులో కోర్టులు స్పష్టమైన తీర్పు ఇంకా రాక పోయినా..వాయిదాలు వేసుకుంటున్న రాంగోపాల్ ఎంతో కాలం తప్పించుకోలేడు.. ఆ ప్రకారం గీతాంజలి గారు చేసినది తప్పే అయ్యినా…కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక మూర్తిగారికి ఉందని నేనను కోను..అప్పుడు స్త్రీ జాతిని కించ పరుస్తూ వాఖ్యలు చేసినందుకు… ఆయన కటకటాల వెనుక ఉంటారు. కాబట్టి అంత లోతుకి వెళ్ళకండి..ఇరుక్కునేది మన మిత్రుడే ఏ విధంగా చూసినా. ఆవిడ రాసింది కేవలం అభిప్రాయ వ్యక్తీకరణే.. దీని మూలంగా ఏమైనా ఆర్ధికంగా లాభ పడ్డారా అప్పుడు ఆ లాభం పొందినది ఎవరూ మేధో సంపదని కోల్పోయిన వారెవ్వరూ… ఇవి తెలాలి..చట్ట పరంగా. ఉచితంగా దొరికిన మాధ్యమాలలో అవాకులు చవాకులు రాసి పారేసే సజ్జుకి ఇలాంటి విష్యాల మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది..నిశీధి అనే అజ్ఞాత రచయిత్రి ని నేను మీరు జెరాక్స్ నుంచి మీరు విషయ సంగ్రహణ చేసి రాస్తున్నారు అని హెచ్చెరిస్తే..మహేబీన్ జబీన్ గారొచ్చి నా కవితలన్నీ ఆంగ్ల ప్రచురణ సంస్థలు ప్రచురించాయంటూ వివరణ ఇస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి గుమ్మిడి కాయ దొంగలు ఎవరూ లేరు ఇక్కడ… అంతా ప్రేరణ పొందే వారే లేదా పేరడీ రచనలు చేసే వారే..కాస్త అధిక రక్తపు పోటు తగ్గించుకునే మాత్ర లు వాడండి వీలయితే..ఇక్కడ అంత పెద్ద మేధో సంపదలు ఎవరివీ ఎవరూ దొంగిలించుకు పోవటం లేదు… ఉచితంగా దొరికితే కూడా చదవలేని దరిద్రాలే ఇవి… వీలయితే సరదాగా తీసుకొని నవ్వేయండి.. సాటి కామ్రెడ్ మీద చట్టాల కత్తి ఎత్తకుండా… ముందుగా మేధో సంపద మీద అవగాహన నేర్చుకోండి..

      • మీరు అడుగుతున్న ప్రశ్నలు పనికి మాలినవి….

        మీకు అలా అనిపించటం పట్ల నాకేమీ అభ్యంతరం లేదు.

        కాకినాడ మిత్రుడు – ఎవరో నాకు తెలియటం లేదు. సారీ.

        మన ఇద్దరి మధ్య ఇదివరకు ఏం జరిగిందో నాకు గుర్తులేదు.

        థాంక్యూ

        మీ వ్యాఖ్యకు.

  • ఈ విమర్శ చదివాక ఇకపై పురుష రచయిలలెవరైన స్త్రీ పాత్రలు లేని రచనలు చేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఒకవేళ రాసినా స్రీలందరూ ఆదర్శమూర్తులు,అభ్యుదయవాదులుగానే ఉండేవిధంగా రాయాలి తప్ప మరో విధంగారాయకూడదని కూడా తెలుసుకున్నాను,
    పొరాటున రాసినా మనోవిశ్లేషణ చేయగలిగిన ఏ మానసిక వైద్యనిపుణులకైనా చూపించి ప్రచురించటం ఉత్తమని అర్ధం చేసుకున్నాను.
    ఇన్ని మంచివిషయాలను తెలియజేసిన ఈ విమర్శ నాకు బాగానచ్చింది.

  • సారంగ బాధ్యులకు,

    రచయితలు తమకు తోచిన సబ్జక్టుతో కథలు రాస్తారు, అది వారి హక్కు. పాఠకులకు ఆ కథ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇది పాఠకుల హక్కు. కథా విమర్శలో వస్తువు, కధనం, శిల్పం, పాత్రల చిత్రీకరణ.. ఇలా అనేక dimensions తో కథను ఎంతైనా విమర్శించవచ్చు. ఈ విషయంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు మంచి రచనలు చేశారు.

    తన రచనలోని ఒక పాత్ర అవలక్షణాన్ని, నేర ప్రవృత్తిని కథారచయితకు అపాదించడం ఆ రచయితని వ్యక్తిగతంగా అవమానించడం తప్ప మరేదీ కాదు. ఈ అన్యాయమైన దుర్మార్గపు ఆరోపణను ప్రచురించడం వల్ల మీది కూడా ఇదే అభిప్రాయం అని అర్ధం అవుతుంది (లేనట్లయితే ఆ వ్యాఖ్యను ఎడిట్ చేసి వుండేవారు). మీ పత్రికలో రాసే రచయితల వ్యక్తిగత ప్రతిష్ఠ మీకు గడ్డిపోచతో సమానం అని కూడా అనిపిస్తుంది.

    రచయిత subconscious mind లో వున్న pedophilic thoughts ని express చేసుకునేందుకు ఈ రచన చేశారని ప్రతిపాదన చేసిన ఈ ‘తిరగమోత’ కథా రచయితకూ, సారంగ బాధ్యులకూ నా సానుభూతి.

    వివిన మూర్తి గారికి క్షమాపణలు.

    • This is like the slander and threats to Tamil writer Perumal Murugan. Only difference is that the abuse and smear is coming from a supposedly leftwing writer. Which makes it all the more despicable and heinous. Will Viarasam continue to be silent on this charecter assassination by its member or act now.

    • ఉమా కల్యాణి ఔను. కధలు అంటే కె. విశ్వనాధ్ సినిమా లాగా ఉండాలి. అంతకు మించి వాస్తవికత ఉంటే కష్టం.

  • వివిన మూర్తి గారి కథా సందర్భంగా – గీతాంజలి గారు వివిన మూర్తిని ఫీడోఫీలియా అని అంటుంటే, కాత్యాయినిగారు రచయిత, అన్నపూర్ణమ్మ వైపు పాఠకుల సానుభూతిని మళ్ళీంచేలా కథను, ఫూట్ నోట్ ని ఉపయోగిస్తున్నాడనీ అంటూన్నారు. ఇక్కడ కాత్యాయిని గారు గట్టిగా చెప్పవలసిన విషయాలు రెండున్నాయి. ౧. రచయిత ఉద్దేశం ( తప్పు చేస్తున్న)అన్నపూర్ణమ్మవైపు సానుభూతి కలిగేలా చేయడమా? ౨. అన్నపూర్ణమ్మని ఒక పాత్రగా చిత్రీకరిస్తూ, మొత్తంగా మనుషులు మనుషులుగా కాకపోవడంపై ఏమైనా రచయిత చెప్పదలుచుకున్నాడా? ఈ రెంటిలో ఏదో ఒకటి రచయిత ఉద్దేశమే అయితే ఆ పని చేయడంలో రచయిత తన రచన ద్వారా పాఠకులకు సవ్యంగా చేరగలిగాడా లేదా అన్నవైపు నుండి కూడా కథా విమర్శ జరగాలి. నా వ్యక్తిగతంగా , కథని చదివిన తర్వాత రచయిత పనిగట్టికొని అన్నపూర్ణమ్మ వైపు నిలబడినట్టూగా అనిపించలేదు. ఆయన దృష్టి ఇంకా పై స్థాయిలోనే ఉందని అయితే, అది పూర్తిగా, కళాత్మకంగా సరియైన వాతావరణంలో, వ్యక్తం కాని స్థితిలో ఉన్నదని అనుకుంటున్నాను.
    కాత్యాయిని గారు పదేపదే అన్నపూర్ణమ్మని ప్రస్తావిస్తూ రచయితని దోషిగా బోనెక్కించడంలో ఉత్సాహం చూపుతున్నారు. వీరి విమర్శ ద్వారా – రచయిత , అయితే ఫీడోఫీలియా అయినా కావాలి, లేకుంటే అన్నపూర్ణమ్మ చేసే పనులకు వత్తాసు దారైనా అయి ఉండాలి . కేశవరెడ్డి మునెమ్మ మీద కూడా ఇలాగే బిలో ద బెల్ట్ విమర్శని కాత్యయినీ, గీతాంజలిగార్లు ఒకరివెంట ఒకరు చేసారు. ఇది గీతాంజలిగారి వ్యక్తిగత విమర్శ కంటే దారుణమైనది. గీతాంజలి గారి విమర్శకు మందులుంటాయి. కానీ రచయిత అవగాహనని కించపరిచేలా ఉన్న ఈ విమర్శలు మరింత దారుణమైనవి.

    ఈ సందర్భంగా సృజనని గురించి ఒక మాట చెప్పాలనుకుంటూన్నాను. సృజన ఏక ముఖం కాదు. అది కూడా జీవితంలాగానే బహుముఖీనమై ఉంటుంది. ఐక్యతనీ ఘర్షణనీ జీవితంలోలాగానే అనుభవిస్తూ సాహిత్యంలో పాత్రలు పరిణామం చెందుతాయి. ఈ క్రమం రచనకు భూత వర్తమానంలతో పాటుగా బీజప్రాయంగానున్న భవిష్యత్తుని కూడా ఆపాదిస్తుంది. అన్నపూర్ణమ్మ కనీసం డెబ్బయేళ్ళ క్రితం ఉన్న బ్రాహ్మణ స్త్రీ. కుటుంబ ఆలంబనం తప్ప మరొకటీ ఆమె చైతన్యంలోకి రావడానికి వీలులేని ఒక వ్యక్తి. కాబట్టి కుటుంబంలోని సమస్త వైరుధ్యాలతో అక్కడే నిలబడి తేల్చుకోవలసిన స్థితి ఆమెది. అది ఆమెకు పరిమితులలోనే ఘర్షించేందుకు, తిరిగి ఐక్యతని పొందేందుకూ కారణమవుతుంది. అన్నపూర్ణమ్మ అలా రూపొందిన పాత్ర. పుల్లి పట్ల ఆమె దారుణ ప్రవర్తన ఆమె ప్రత్యేక సందర్భంలోనిదే. అంతే కానీ అన్నపూర్ణమ్మ ప్రవర్తన ద్వారా ఆ కాలపు స్త్రీలందరూ సవాయి రోగానికి ఈడేరని పిల్లతో సమాగమం మందుగా పని చేస్తుందని నమ్ముతున్నట్టుగా కానీ, మొగనికి పసికూనలని ఆహారమిస్తున్నట్టుగా కూడా ఆపాదించకూడదు. అన్నపూర్ణమ్మ ప్రత్యేక ప్రవర్తన పాఠకులకు ఖచ్చితంగా ఒక సవాల్ అయితీరుతుంది. ఎందుకంటే అది వెనువెంటనే భావజాల ప్రశ్నలని రేకెత్తిస్తున్నది కాబట్టి. అసంపూర్ణతనీ, సందిగ్దతనీ కలిగి ఉన్న రచనలకు ఈ పరిస్థితి చాలా సార్లు తప్పని సరి అవుతుంది. సరిగా ఇక్కడి నుండే అంటే ఈ సందిగ్దత, అసంపూర్ణతల వెలుగు నీడలలోనే నిలబడి, వాటిని దాపుగా చేసుకొని రచయితకు ప్రత్యేక ఉద్దేశాలు ఆపాదించే విమర్శకులూ తయారవుతారు.
    ఇలాంటి సందర్భాన్ని రచయిత ఊహించగలిగినట్లయితే, దాన్ని ఒక కాలపు వాస్తవంగా, -కనీసపు దాని పరిమితులతోనయినా- చెప్పడంలో, మరింత వివరంగా పాఠకులకు చేరడంలో జాగ్రత్తలు పాటించేవాడు. ఆ పనిని రచయిత జాగరూకతతో చేయలేకపోయాడనే ఇప్పుడు వస్తున్న స్పందనలని బట్టీ భావించకతప్పదు. అయితే స్పందనలు, విమర్శల తీవ్రతలని బట్టీ ఇంకో మాటని కూడా అనాల్సి వస్తుంది. మనకు బహుముఖీనమైన, అనేక పొరలతో కూడిన రచనా వ్యాసాంగం కానీ, వాటి తీరుతెన్నులపై చర్చ కానీ మనకు తక్కువ. పరస్పరం మోహరించి విమర్శలు గుప్పించుకొనే వివిధ పక్షాలు తమ సృజన, వ్యక్తీకరణలలో ఒకే పద్ధతిని పాటిస్తుంటాయి. అలవాటుగా మారిన ఈ మూస ధోరణులు కూడా రచనని సరిగా చదవడానికి, స్పందించడానికి వీలులేని ఆటంకాలవుతున్నాయి. ఈ పద్ధతి మారితే సృజన, విమర్శ బాగుపడతాయి

  • గీతాంజలి గారు తిరిగి రాసిన కధ వదిలేసి ఆవిడ ఉపోద్ఘాతం లో చేసిన ఒక అనవసరంగా ఆవేశం లో చేసిన అభియోగం మీద చర్చ. ఆవిడ చేసిన ఒక చిన్న తప్పు వల్ల అసలు కధ మీద , అన్నపూర్ణ పాత్రమిద కానీ , గీతాంజలి పాత్రకిత్రీకరణ తిరిగి చేయద గురించి కానీ చర్చ జరగటం లేదు.

  • సమాజంలో ని ఒక దోపిడి ని చిత్రించడం ఒక కథ లక్ష్యం అయితే, అహా! ఆ దోపిడి జరుగుతున్న ట్లు చూపించ కూడదు. సమాజంలో అందరూ సమానత్వం తొ బ్రతుకుతున్నారు. అని కథ వుండాలి. అలా ఉండకపోతే మనముండే సమాజాన్ని అవమాన పరిచినట్లు గా ఉంటుంది. మన వ్యక్తి త్వాలు సన్నగిళ్లుతాయి. ప్రజలు మూర్ఖలుగా, దుర్మార్గులు గా తయారు అవుతారు . సమ సమాజానికి పనికి వచ్చే వారుగా ఉండరు అనటం ఎంత వరకు సబబు. ఒరే బాబు ఈఈ కారణాలవల్ల సమాజం ఇలా ఉంది, దాన్ని మార్చుకోవడానికి మనమంతా కృషి చేద్దాం అని రచయిత చెప్ప కూడదా? ఇది విప్లవ సాహిత్యానికి దోహదం చేయదా? జరిగిన ఒక వార్తను ఒక న్యూస్ పేపరు అందిస్తే దాన్ని రేప్ గా చిత్రీకరించకూడదు. దాన్ని సాదారణ సంఘటన గానే చూడాలి అనడం లా వుంది గీతాంజలి గారి స్పందన.

    • I feel revulsion that Virasam can produce such sickening moral and intellectual bankruptcy in its members.

  • బహుశ ఇంత అల్టిమేట్ సృజన ఇక్కడ మాలో చాలామందికి ఉండి ఉండకపోవచ్చు, అలాగే ఇంత చర్చ ,వాటిలో వాడిన పదాలు చాలా వరకు మాలాంటి vivacious readers yet lazy bug writers కి తెలుగు లో ఇన్ని పదాలు ఉన్నాయా మనకి తెలియకుంానే అనుకునేలా చేశాయి .

    పరంతు వివిన మూర్తి గారి కథ mixed bag of capitalistic patriarchy and romantic patriarchy మోడ్ లో సాగితే ఇక్కడ గీతాంజలి గారి కథ సోషలిస్టిక్ ఫెమినిజం రెయిన్ బో మీద డాన్స్ చేస్తుంది అనిపించింది. ఇద్దరికీ సబ్జెక్ట్ పట్ల ఎంత అవగాహన ఉందో అంతే స్థాయి లో వ్యక్తి పర్సనల్ స్పేస్ పట్ల గౌరవం లేదు అనిపించింది . ఆ ఆలోచనకి మూర్తి గారి కథ బేస్ రూట్ అయిన romantic patriarchy idealogy తో పాటు మేడం గారి ప్రోలాగ్ కారణం.

    సృజన కి సంభందించిన విషయం కాబట్టి , కథా వస్తువు మీద జరగాల్సిన చర్చ , మేడం గారు పర్సనల్ ఎటాక్ తో మొదలు పెట్టడం ఎక్కడో ట్విట్టర్ వార్ గుర్తు చేస్తుంది. ఇహ నెక్స్ట్ సీన్ లో నాకు మూర్తి గారి వింగ్ వాళ్ళు ” మీ మమ్మీ ఫిలడెల్ఫియా , మీ పప్పా ఫిలడెల్ఫియా “అనగానే, మేడం గారీ వింగ్ వాళ్ళు ” బేటి బచావో బేటీ పడావో “అని మోడీ సర్ వాయిస్ లో చెప్తుంటే, ఫైనల్ కాల్ లో సర్ ఏకంగా అర్నవ్ “డ్రగ్స్ దో ముజే డైలాగ్ ని దో ము జే బచ్చి దో బానావో ముజ్కో ఫిలడెల్ఫియా” , అని అరుస్తున్న ట్లు ఒకటే కలలు ఇక్కడ. లోల్ లేకపోతే గీతాంజలి గారికి కథ పక్కన ఉంచి పర్సనల్ కామెంట్ చేసేంత ఇగో ఏమిటి ? మూర్తి గారు కథా వస్తువులో తన ఐడియా ఎక్కడ తప్పు అయింది ఆలోచించకుండా నే పోతా.. నే సచ్చిపోతా అంటూ ఆల్మోస్ట్ సూసైడ్ నోట్స్ ఏమిటో .

    మొత్తానికి రెండు కథల్లో పాప పై అత్యాచారానికి సానుభూతి క్రియేట్ చేసిన పాపానికి పోలేదు ఇద్దరు కూడా , దీని కంటే zee 5 OTT లో డబ్బింగ్ చెత్త గా కరోనా సమ్మర్ అలరించిన ఫిలడెల్ఫియా వెబ్ సిరిస్ చాలా బెటర్ సామి.
    ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన పద్దతి ఎలా ఉంది అంటే అస్తిత్వ వాదాల దెబ్బకి ఎవరి పొయ్యి లు వాళ్ళు పెట్టుకొని ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు వండుకునే కాలం కాబట్టి , మిగిలిన సబ్జెక్ట్స్ లో చెయ్యి పెడితే చితక్కొడతారు కాబట్టి బుద్దిగా నోరులేని పిల్లకాయల కలం గా మారాము అని గొప్ప చెప్పడానికి ఎత్తుకున్న ఎత్తుగడ గా అనిపిస్తుంది తప్ప నిజంగా కన్విక్షన్ లేదు.

    ఆడళ్ళలో సతీసహగమన రాణి పద్మావతులు 100కి కోటి శాతం పెరుగుతున్న ఈ కాలం లో అసలు అలాంటి వాళ్ళే లేరని నిర్ధారించుకుని రాస్తున్నట్లు రాసిన గీతాంజలి గారి రాత ఎంత LOL గా ఉందో Stockholm syndrome సీన్ క్రియేట్ చేయడానికి చూసిన మూర్తిగా రు కూడా పసి పిల్లల కథ ఇన్వాల్వ్ చేసి కంగాళీ చేయకుండా ఉండాల్సింది .Sir ,we love you by all means , plz don’t panic and write an other suicide note . We all strongly believe that you are not a Philadelphia 🙂 and we are with you lol .
    మేడం గారు కూడా ఎలాగూ పెద్ద నవల ఒకటి పక్కన పెట్టి ఈ భారం నెత్తిన వేసుకున్నారు కాబట్టి , ఇలాగే ఇంకొంత సమయం తీసుకొని ముందు అన్ని జాన్రా లలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో దడెల్ దాడెల్ మంటు మీద పడిపోతున్న కథలను వాటి రైటర్స్ కాస్త గుర్తించండి plz . మరీ బొత్తిగా మూడు కథలు ఏమిటండీ బాబు ఇప్పటికీ ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ చదివిన ఒక కథ చెప్పిన ముప్పై అవుతాయి .అన్యాయం సుమీ.

    ఫైనల్లీ ,కథలు మీరు భలే గా చెప్పాలి మేము దానిలోంచి నాలుగు ముక్కలు నేర్చుకోవాలి , అంతే . అంతకు మించి లేని మిరాకిల్స్ ఏవి మీ నుండి ( Both of you) మేము ఆశించడం లేదు.

    నిశీధి !!

    • మీరెవరో గానీ భలే నవ్వించారు! lol
      I want to be your friend!

    • అస్తిత్వ వాదాల దెబ్బకి ఎవరి పొయ్యి లు వాళ్ళు పెట్టుకొని ఎవరి ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు వండుకునే కాలం కాబట్టి—-కథలు మీరుచెప్పాలి మేము దానిలోంచి నాలుగు ముక్కలు నేర్చుకోవాలి , అంతే.మిరాకిల్స్ ఏవిఆశించడం లేదు.====🙏

  • “విప్లవ” సాహితీ ఆవిష్కరణ.

    రచయిత యుద్ద పిపాసీ (వార్ అండ్ పీస్).
    పిల్లల్ని చంపాలన్న కోరిక (యజ్ఞం)

    స్త్రీలు రైళ్ల కింద పడాలి (అన్నా కెరనినా).
    పనికిమాలిన వివాదం తో దొమ్మిలు జరగాలి (గోపాత్రుడు)
    కుక్కలు మాట్లాడాలి (వీర బొబ్బిలి)

    గద్దలు పంది పిల్లల్ని చంపాలి (అతడు ఆడివిని జయించాడు)

    రైతులు చావాలి (మూగవాని పిల్లనగ్రోవి)
    మనిషి తగలబడాలి (ఇన్క్రెడిబుల్ గోడేస్)
    మొగుళ్లు చావాలి, వేశ్యాలు వర్థిలాలి (కన్యాశుల్కం)

    స్త్రీల పై లైంగిక హింస జరగాలి (చిల్లర దేవుళ్ళు)
    రజాకార్ల లాగా చంపాలి ( మోదుగ పూలు)

    కొడుకు చావాలి (fathers అండ్ సన్స్)
    ఫాసిజం వర్థిలాలి (ఉక్కు పాదం)
    రైతులు రోడున్న పడాలి (థీ గ్రపెస్ ఆ రాత్)
    తండ్రిని చంపాలి ( ధి బ్రదర్స్ కరమజోఫ్)
    కార్మికులు యంత్రలో పడి చావాలి (థి జంగల్)
    తండ్రికి ద్రోహం చెయ్యాలి (ఆ లీఆర్ ఆఫ్ థి స్టెప్స్)
    గని కార్మికులు చావాలి (థి జెర్మినల్)
    మనిషులు గొంతు పిసుకుని చావాలి (అసమర్ధుని జీవ యాత్ర)
    సాటి కార్మికుని చంపాలి (ఆఫ్ మైస్ అండ్ మెన్)
    పోలీసులు లాగా హింసించాలి ( ఖాకి వనం)
    భార్య బిడ్డల్ని అమ్ముకోవాలి ( థి మేయర్ ఆప్ కాస్టర్ బ్రిడ్జి)
    ఇంటికి వచ్చిన అతిధిని చంపాలి (మకబెత్)…..
    …..

  • గీతాంజలి గారి రీ టెల్లింగ్ చాలా కృతకంగా, రచయిత గురించి ఆమె వ్యాఖ్యలు అతి అభ్యంతరకరంగానూ వున్నాయి. అసలు ఆ కథని విమర్శించటం కోసమే తిరిగి రాయాలనుకోవటం ఒక దుష్ట సాంప్రదాయం. చాలా చెడ్డ ఉదాహరణగానూ మిగిలిపోగలదు. ఏసోబుతో అనకున్న సుఖ సంతోష సంబంధాన్ని ఒక గిల్టీ కాంప్లెక్స్ ఆలోచనతో త్యాగం చేసి, అతని కుటుంబాన్ని దూరంగా పంపించేసి, తిరిగి పక్షవాత పీడితుడైన భర్త సేవకే జీవితాన్ని అంకితం చేయించటంగా మిగిలిపోయిన ఈ ప్రత్యామ్నాయ కథ ముగింపు మరీ ఘోరంగ, వెనకబాటుతనంతో నిండిపోయింది. ఏమిటిది అన్నపూర్ణమ్మకి చేయాల్సిన న్యాయమేనా? నాకైతే దాసరి నారాయణరావు సినిమా చూసినట్లుంది.

    మరో మాట ఈ ప్రత్యామ్నాయ కథలో సుబ్బారావు అన్నపూర్ణమ్మ మీద ప్రయోగించిన భౌతిక హింస నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. కానీ ఈ ప్రత్యామ్నాయ కథా రచయిత్రిలా ఆ హింసకి ఆమె మనసులో ఎక్కడో ఆమోదముద్ర వున్నదని అనబోను. అలా అనటం సరైనది కాదు కదా!

  • ‘రచయత subconscious mind లో ఎక్కడో paedophilia పట్ల.,, (అంటే చిన్న పిల్లలతో శృంగారం చేయడాన్ని పీడోఫీలియా అంటారు.ఇదొక మనోలైంగిక సమస్య ) బలమైన ఆమోదం ఉంది అని అనిపిస్తుంది . సాహిత్యంలో రచయిత తను దేన్ని బలంగా కోరుకుంటాడో అదే రాస్తాడు.’
    కధని వదిలేసి కధకునికి లేని పోనివి ఆపాదించడం ‘తప్పు.’

  • కొంచెం ఆలస్యంగా రెండు కథల్ని చదివాను. గీతాంజలి గారి కథ స్త్రీ కోణంలో ఆలోచించి ప్రగతిశీల భావంతో సరిదిద్ది రాసిన కథగా అనిపించింది. కథా సాహిత్యంలో తిరగ రాయడం కొత్త కాదు. ఖదీర్ బాబు రాసిన కథను ” అమ్మ వారి నవ్వు” పేరుతోకేతు విశ్వనాథ రెడ్డి గారు రాయడం మనకు తెలిసిందే . సమాధాన కథ ప్రచురించి చర్చను కొనసాగించే ఇష్టం సంపూర్ణంగా సంపాదకుడిదే. ఇందులో సందేహం లేదు. వివినమూర్తి గారి అన్నపూర్ణ తన లోపలి ఆకాంక్ష నెరవేర్చుకునే క్రమంలో సతీ సావిత్రి అవతారం ఎత్తింది. 75 ఏళ్ల నాటి ఒక శోత్రియ కుటుంబ వాతావరణంలోకథ రాస్తూ ఇంగ్లీష్ శీర్షికలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు.

    • అలాగే ఆ మధ్య వెంకట సిధారెడ్డి బహుమతి కథ మీద కస్తూరి మురళీకృష్ణ కథ రాసినట్టు గుర్తు . తమిళ కథాసాహిత్యం లో చాలా ఉదాహరణలున్నాయి, స్పందన కథలు రాయడంలో.

  • సారంగాలో ….A matter of little difference కథ మీద విమర్శనాత్మక మైన చర్చ జరుగుతున్న సందర్భంలో నేను కూడా విమర్శను వ్యాఖ్య, వ్యాస రూపం లో కాకుండా కథా రూపంలో తీసుకున్నాను . సరైన సాహిత్య విమర్శనా ధోరణుల పట్ల అవగాహన ఉన్నప్పటికీ.. భావోద్వేగాలకు లోనై, నేను చేసిన వ్యాఖ్య రచయిత మనస్తాపానికి కారణం అయ్యింది . నా మీద ఈ విమర్శను నేను స్వీకరిస్తూ., ఆత్మ విమర్శ చేసుకుంటున్నాను. నిజానికి రచయిత వ్యక్తిగతంగా నాకు తెలీదు., ఆయన కథలోని పాత్రలను మలచిన తీరు మీద తప్పితే.,ఆయన మీద నాకు ఏ వ్యతిరేకత లేదు
    నా ఇంట్రో లో రచయిత మీద చేసిన వ్యాఖ్యను విరమించుకుంటున్నాను.
    గీతాంజలి.

  • ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్…

    కథాపరంగా మనల్ని చాలాకాలం స్తబ్దతలోకి నెట్టేస్తుంది. యదార్ధం కాదని అనలేం. అటువంటి స్త్రీలు ఉండరంటూ తీర్మానాలవీ చెయ్యబోవడం కూడా తొందరపాటే.

    ఇక ఈడేరని పిల్లతో సంభోగం:

    ఫోరెన్సిక్ మెడిసిన్ పుస్తకం చదివితే ఈ ప్రపంచంలో ఎన్నిరకాల పర్వర్షన్స్ ఉన్నాయో బోధపడుతుంది. అదంతా ఒక శాస్త్రం. ఒళ్లు కొవ్వెక్కి చేసే పనులు కావవి. కొంతమందికి మంటల్ని చూస్తే కామవాంఛ కలుగుతుంది. ఇంకొందరు పీక్కి ఉరేసుకుని సంభోగం జరపాలని చూస్తారు. ఇవన్నీ చదివి ‘ఈలోకంలో ఇందరు పిచ్చనాకొడుకులున్నారా?’ అని తిట్టుకుంటోంటే మా ప్రొఫెసర్ చెప్పాడు: నాయనా, అవన్నీ మానసిక రోగాలు. వాటిని సాధ్యమైనంత సమయం తీసుకుని ఓపికగా తగ్గించే ప్రయత్నం చెయ్యాలిగానీ ఇలా అసహ్యంతోనో, ఛీత్కారంతోనో వారిని మరింత వేదనకు గురిచెయ్యకూడదు!’ అని.

    ఈ కథలో అటువంటి సమస్య ఉందా?:

    లేదు. అది మానసిక సమస్యగా ఎక్కడా కనబడదు. అదొక మూఢనమ్మకం. కేవలం కథాకాలానికి మాత్రమే చెందిన మూఢనమ్మకం అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డారు. ఈనాటికీ అనేకమంది ఆ విషయాన్ని విశ్వసిస్తున్నారు. అందుకే పసిబిడ్డల మీద అత్యాచారాలు విరివిగా జరుగుతున్నాయి. నేను మాతాశిశు వైద్యశాలలో పాతికేళ్లుగా పనిచేస్తున్నాను. ఎందరో పసిపిల్లల్ని రక్తస్రావంతో తీసుకొస్తూ ఉంటారు. మరీ ఎక్కువని అననుగానీ, కనీసం ఏడాదికి ముగ్గురు నలుగురైనా ఉంటారు. అదొక విషాదం. ఆరోజు మాకెవరికీ తిండీ సయించదు, నిద్రా పట్టదు. ఎంతసేపటికీ ఆ పసిమొహమే కనబడుతూ ఉంటుంది. ఏమడిగినా సరిగ్గా సమాధానం కూడా చెప్పలేని నిస్సహాయ బాలికలు. అందువల్ల ఈ మూఢనమ్మకం పురాతనమే కానీ నిత్యనూతనంగా ఇప్పటికీ జనసామాన్యంలో ఉగ్రవాదంలా దాగివుంది. దాన్ని కనిపెట్టడం మనతరం కాదు. ఎవడి మెదడు ఏ దెయ్యాలకు నెలవో మనకెలా తెలుస్తుంది?

    దీనికీ పిడోఫిలియాకీ సంబంధం లేదు. అదొక మానసిక రోగం. ఈ కథలోది మూఢనమ్మకం.

    ఇక మరొకరకం:

    మధుర్ భండార్కర్ తీసిన పేజ్ 3 చూసేవుంటారు మీరంతా. అందులో కొంకణా సేన్ శర్మ ఒక జర్నలిస్ట్. నిజాయితీగల ఒక పోలీసాఫీసర్ సాయంతో నగరంలో అపహరణకు గురైన కొందరు బాలల్ని వెదుకుతూ వెళ్లి ఒకానొక పేలెస్ ముందు ఆగుతుంది. అక్కడ కొందరే దొరుకుతారు. మిగతా పిల్లలందరూ లోపల ఒక కామన్ ఏరియాలో నగ్నంగా నిలబడి ఉంటారు. వారితో కొందరు అత్యంత సంపన్నులైన ఉన్నతోద్యోగులు, విదేశీయులు సంభోగం జరపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆ రాకెట్ చాలా పెద్ద దుమారమే లేపుతుందని నమ్ముతుంది. కానీ రాత్రికి రాత్రే అంతా తారుమారు చేసేసి, ఆ పిల్ల ఉద్యోగం సైతం ఊడగొట్టేస్తారు.

    పై కథ ఎందుకు చెప్పానంటే.. అది పర్వర్షన్. ఇంకా ఏదో ప్రత్యేకమైన సుఖం కావాలనే తపనలో, డబ్బుందన్న అహంకారంలో, ఏమీ చెయ్యలేరన్న ధైర్యంతో అటువంటి ఘాతుకాలకు పాల్పడతారు.

    ఈ కథలో రెండవ అంశం ఛాయలే ఎక్కువ. పసిపిల్ల. ఎదుర్కోలేదు. రోగం నయమవుతుందన్న ఆశ. మూర్ఖత్వం. నిజానికి సుబ్బారావు పంతులుకి ఆ సంభోగంలో ఆసక్తి ఏమీ ఉండకపోయినా సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడన్న భ్రమలో ఆ దారుణానికి ఒడిగడతాడు.

    పైకారణాల దృష్ట్యా చూస్తే ఈకథ సమకాలీనతను సంతరించుకుందనే చెప్పాలి.

    ఇక అన్నపూర్ణమ్మ సంగతి:

    ఆమె పట్ల పాఠకుడి దృష్టిలో చులకన భావాన్ని కలిగించడంలో రెండవ పేరాలోనే సఫలీకృతులయ్యారు రచయిత. ఆమెది శారీరక వాంఛో, బిడ్డలకోసం తపనో పక్కనబెడితే అటువంటి రహస్య సమావేశాల్ని ఆమోదించే స్థాయిలో పాఠకులు ఉండరు. ఉండనంత మాత్రాన అది వాస్తవం కాకపోదు. కొకు గారి కథల్లో ఇటువంటి యవ్వారాలు లచ్చోపలచ్చలు.

    కానీ ఎవరో చెప్పినట్లుగా అంత దగుల్బాజీ మొగుడు ఛస్తే పీడాపోతుందని అనుకుంటుందే తప్ప అతగాడి క్షేమం కోసం అంత దారుణానికి ఒడిగట్టడమనేది అసంబద్ధంగా ఉంది. అసంబద్ధంగా ఉన్నంతమాత్రాన వాస్తవం కాకపోదు. పైన చెప్పిన శాడిస్టిక్ మనోవ్యాధుల్లో ఆమెదీ ఒక రకమని మనం నమ్మాలి.

    కథ ఇలానే ఉండాలని శాసించే అధికారం మనకు లేదు. సంఘప్రయోజనం, సమాజోద్ధరణ, దళిత వ్యతిరేకత, ఇంగువ వాసన… ఇటువంటి మాటలన్నీ పక్కనబెడితే ఇదొక అరుదైన కథ.

    చదివిన వారం రోజులవరకూ నోరెత్తి మాటాడలేనంత తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది పాఠకులకు.

    ఎవరో అడిగారని తన పాత కథను కాలానుగుణంగా తిరగరాసినట్లు మూర్తిగారు చెప్పారు.

    ప్రయోజనం:

    శూన్యం. ఇదొక సంఘటనల సమాహారం. అంతే! వాడెందుకలా ఉన్నాడని, అదెందుకు నాలా ఆలోచించలేదని అనుకోవడం వృథా.

    శ్రీరామ్ రాఘవన్ తీసిన బద్లాపూర్, అంధాధున్ సినిమాల్లో కాస్త జాగ్రత్తగా గమనిస్తే హీరోలు, విలన్లూ అంటూ ఎవరూ కనబడరు. అందరిలోనూ స్వార్ధం, స్వప్రయోజనం, అవకాశవాదం కనబడుతూ ఉంటాయి. ఆ స్క్రీన్‌ప్లేయే విభిన్నం. వాళ్లంతా మనుషులంతే! పరిస్థితుల్నిబట్టి అలా ప్రవర్తిస్తూ ఉంటారు.

    అలాగే అన్నపూర్ణమ్మ లాంటి మహిళలు ఉండరని, ఇటువంటి సంఘటనలు జరగవని తీర్మానాలు అనవసరం.

    ఇందులో అల్పులు, అధికుల మధ్య స్థాయీ భేదం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అది బ్రాహ్మలా, దళితులా అన్నది రచయిత చెప్పరు. తిట్లు తినడం, తన్నించుకోవడం, శేషభుక్తం, అర్ధరాత్రి లేపితే చచ్చినట్లు సహకరించడం అనేవి అల్పుల లక్షణాలు. వాటినుంచి బయటపడాలని ప్రయత్నాలు చేసిందా అన్నపూర్ణమ్మ? లేదనే చెప్పాలి.

    తలెత్తకుండా తనపని తాను చేసుకుపోతూ, అన్నపూర్ణమ్మ కుట్రను గమనించలేని ఏసోబు భార్య అమాయకంగా పుల్లిని వదిలేసి వెళ్లింది. ఆమెకూడా అల్పురాలే!

    ఇంకా వారి బంధువుల్లోనే కటిక దరిద్రం అనుభవిస్తూ డబ్బుకి ఆశపడి పిల్లల్ని ఇవ్వడానికి సిద్ధపడతారంటూ చెప్పడం ద్వారా ఆ బ్రాహ్మణ పిల్లలు, ఆయా తల్లిదండ్రులు ఎంత అల్పులో చెప్పారు.

    ఇది అమానవీయంగా, అసహజంగా అల్లబడిన అసౌకర్యమైన కథ.

    అవాస్తవమైన కథ మాత్రం కాదు.

    ఇది నా అభిప్రాయం.

  • గమనిక: ఈ కథ మీద కామెంట్స్ ఇక ప్రచురించడం లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు