ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్

న్నపూర్ణమ్మ చెరువుకి వస్తుంటే ఊరు ఊరంతా ఒక పారవశ్యానికి లోనవుతుంది. పచ్చటి మేలిమి బంగారు ఛాయ. అయిదున్నర అడుగుల పొడవు. కళ్లు పెద్దవి కాని స్వేచ్ఛగా నవ్వగలిగితే చిన్నవవుతాయి. దానితో ముఖమంతా ఒక అందం అలముకుంటుంది. ‘ఏంటా విరగబాటు’ అంటూ ఎనిమిదో ఏడు నుంచి ఆ నవ్వు కత్తిరించబడి పూర్తిగా కనుమరుగయింది. దానిని భర్తీ చేస్తూ పసుపు మెత్తటంతో, ఎర్రటి కుంకుమతో పెద్దబొట్టు మొహాన చేరటంతో,  ఒక పవిత్రతతో కూడిన అందం చూపరులకి భక్తితో కూడిన పారవశ్యం కలిగిస్తుంది. సూర్యోదయంతో పాటు లేస్తుంది. రాగిబిందెతో చెరువు వైపు నడుస్తుంది. చింతపండుతో దానిని తోముతుంది. నాలుగు మునకలు వేస్తుంది. తడి వస్త్రాలతో నిండు బిందె భుజానికి ఎత్తుకుంటుంది. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి బయల్దేరుతుంది. చేలకి కాపలా కాసి ఇళ్లకి వచ్చేవారు, పొలాలకి పోయేవాళ్లు, చెంబు పట్టుకుని కాలవ ఒడ్డుకి పోయేవారు ఎదురయీవారు. సాక్షాత్తూ పార్వతీదేవే బ్రాహ్మణులకి కనిపించేది. ఆ దేవి ఇతర రూపాల గ్రామదేవతలు, కులదేవతలు, ఇష్టదేవతలూ ఇతరులకి కనిపించేవారు.

ఆరోజు కూడా ఆమె తడిసిన చీరతో, కాసిపోసిన కట్టుతో, పెరటివైపు సింహద్వారం తలుపు తోసుకుని వాకిలి లోకి అడుగు పెట్టింది. విశాలమైన ఆ వాకిలిలో రెండు బళ్లు, గొడ్లసావిడి ఒకవేపు ఉన్నాయి. మరోవైపు మామిడిచెట్టొకటి ఉంది. గాదె, గడ్డి కుప్పా ఆ వైపున్నాయి. మందారచెట్టు మొదట్లో  నాలుగు నీళ్లు చిలకరించింది. బిందెతో ఎత్తుగా ఉన్న అరుగు మీదకి మెట్లెక్కుతోంది. ఏదో అలికిడి వినిపించి వెనక్కి తిరిగింది. ఏసోబు అని అందరూ పిలిచే పెద్దపాలికాపు ఏసుపాదం వాకిట్లో నిలబడి ఉన్నాడు.

తినేస్తున్నట్టున్నాయి అతని చూపులు.

“చచ్చినోడా పగటిపూట అలా చూడొద్దన్నానా! మా దెయ్యం ఇంట్లోనే ఉందా?” అంటూ గాభరాగా లోపలికి చూసింది. విధవాడబడుచు పాపాయమ్మ అలికిడి లేదు.

లేరన్నట్టు సైగ చేసి తప్పయిందన్నట్టు దొంగ గుంజీలు మొదలెట్టాడు. ఆరడుగుల మనిషి. వెండి మొలతాడుతో పైన ఏ బట్టాలేకుండా గోచీతో ఉన్న ఆ మనిషి శ్రమతో తిరిగిన కండలతో, పెద్దపెద్దపిక్కలతో, చేటలంత ఉన్న పాదాలతో నందీశ్వరుడిలా ఉన్నాడు.

గోముగా చూస్తూ “చాల్లే వెధవ్వేషాలూ నువ్వూనూ రాత్రి తిన్నది అరగలేదా గుంజీలు వదలటం లేదూ”  అంది. దేవుడింట్లో తప్ప ఆ బిందె ఆమె దించదు. ఆమెను కష్టపెడుతున్నానని అతనికి కష్టంగానూ ఉంది. ఆ భంగిమలో ఆమెను చూడటం ఇష్టంగానూ ఉంది.

“మరండీ.. బెమ్మంగోరు రాజమండ్రి నుంచి దిగడ్డారండి.. బాబయ్యగోరు పదిగంటల కారుకి యర్రారంలో దిగుతారంటండి. బండి తోలుకు రమ్మని కవురెట్టారంటండి.”

ప్రాణం ఉసూరుమంది ఆవిడకి. ఐదడుగుల ఎత్తుతో పీలగా ఉండే ఆ మనిషికి అంత పిచ్చేంటి.. ఆ రోగాలేంటి?

“నీకూ మీబాబుగారికీ మధ్య నా బోడి పెత్తనమేంట్రా.. పెట్టిబండి ఉంది.. లాగటానికి మైసూరుగిత్తలున్నాయి. తోలటానికి నమ్మినబంటు నువ్వుండనే ఉన్నావు. నాతో మాట కలపాలని తయారైపోతావు చెరువునుంచి వచ్చేసరికి.. దిక్కుమాలినాడా” అంటూ ఓ నవ్వు నవ్వి లోపలికి నడిచింది.

2

పన్నెండు దాటింది. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. ఎండ పేల్చేస్తోంది. బండితో బాటు చెప్పులు లేకుండా నడుస్తున్న ఏసోబు చెమటలు కక్కుతుంటే, బండిలో కూచున్న సుబ్బారావు పంతులు జాపోస్తూ దిగాడు. పాపాయమ్మ గుమ్మం లోపలే నించుని విసనకర్రతో విసురుకుంటోంది. భుజాన తుండుగుడ్డతో గోలెం దగ్గర నిలబడి కాళ్లకు నీళ్లిచ్చేందుకు చెంబు పట్టుకు నిలబడింది అన్నపూర్ణమ్మ.

స్నానం చేసి, మధ్యాహ్న విధులు పూర్తిచేసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు పంతులు. వెండి పొన్నులు వేసిన పీటమీద కూర్చుంటే నెయ్యి వడ్డిస్తూ “ఎలా ఉందన్నయ్యా” అంది పాపాయమ్మ. అన్న రోగంలో ఉన్న రహస్యం తెలుసుకోవాలని ఆమె ప్రయత్నం. బండి దిగిన దగ్గర్నుంచీ వదిలిపెట్టకుండా చుట్టూ తచ్చాడుతోంది.  మఠం వేసుకుని కూర్చోటానికి నానా అవస్థలు పడుతున్న భర్తని చూసి ఓ వేపు నవ్వు, ఓ వేపు బాధా తన్నుకొస్తున్నాయి అన్నపూర్ణమ్మకి. మొగుడు, చెల్లి పలకరింపుకి జవాబు చెప్పకుండా, తనను ఉరిమినట్లు చూడటంతో అంది.

“వదిన గారూ మీరు వెళ్లి ఏసోబుగాడి వడ్డన సంగతి చూడండి” అంటూ పురమాయించింది అన్నపూర్ణమ్మ.

రాజమండ్రిలో కొట్టుకి బెల్లం వేస్తాడు పంతులు. రాజమండ్రి మెరకవీధిలోనూ, కాకినాడ బుడంపేటలోనూ బాగా పేరున్నవాడు. అంతకు ముందు నాటకాలు, ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలకూ మహరాజ పోషకుడు. తెల్లటి మల్లు చొక్కా చేతుల మడతలోంచి పది రూపాయలు కనపడేలా  కడతాడు. కొత్త రూపాయినోటులా తళతళలాడుతుండే సుబ్బారావు ఆరోజు సత్తురూపాయిలా కళాకాంతీ లేకుండా ఉన్నాడు. మెతుకులు గతుకుతున్నాడు గాని ముద్దలు చేసుకుని గబగబా తినటం లేదు. నడకలో తేడా తెలిసిపోతోంది. గజ్జల్లో బిళ్లల వాపు ఎక్కువగా ఉన్నట్టుంది. అడావుడిగా రాజమండ్రి పరుగెత్తాడు మూడు రోజుల క్రితం.

“చెపుతోందిగా వెళ్లి ఆపని చూడు” అంటూ కసిరాడు చెల్లిని. నెత్తిమీద గుడ్డని సవరించుకుంటూ విసుగ్గా, విసురుగా నడిచింది పాపాయమ్మ.

“అత్తారింటాళ్లు వదినా వదినా అంటూ నెత్తిన పెట్టుకుంటారు. ఈవిడగారు కదలరు. ఓ మాటాడుకోటానికి ఉండదు. మంతాడుకోటానికి ఉండదు” అంటూ అందుకోబోయింది అన్నపూర్ణమ్మ. మొగుడు గుడ్లురుముతూ చూసేసరికి మాట మింగేసింది. కూర వడ్డించి విసనకర్ర అందుకుంది.

“సవాయిట..”, అని మంచినీళ్లు తాగి, “తగ్గుతుందిట” అన్నాడు.

విసరటం ఆపి, నోటిమీద చెయ్యివేసుకుని నొక్కుకుంటూ అలా ఉండిపోయింది.

గాలి తగలకపోటంతో చటుక్కున ఆమెవైపు చూసి, “మొగుడు చచ్చినట్టు ఆ చూపేంటే ముండా! చచ్చాక చూడొచ్చులే” అన్నాడు.

అంటూనే కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు.

“అయ్యో అయ్యో అదేం పనండి” అంటూ లబలబలాడింది అన్నపూర్ణమ్మ. ఆమె భుజం మీది తుండుగుడ్డ తీసుకుని, చేతులు ఒత్తుకుని, దాన్ని ఆమె మీదకి విసిరేసి గదిలోకి నడిచాడు. చెరువుగాలి వచ్చేలా కిటికీనీ, దానికి జవాబుగా గుమ్మాన్నీ ఎదురెదురుగా కట్టిన ఆ గదిలో మంచంమీద నడుం వాల్చాడు. ఇచ్చిన మందులకి కాస్తంత నొప్పులైతే తగ్గాయి గాని జబ్బమీదిచ్చిన ఇండీషనుకి కదుం కట్టింది. చెయ్యి నొప్పిగా ఉంది. పట్నం డాక్టరుకి ఎటకారాలకి తక్కువేం లేదు. నొప్పి గురించి చెపితే ఓ బూతు సామెత చెప్పి పళ్లికిలించాడు. ఏమనలేక ఓ వెర్రినవ్వు దానిలో కలిపాడు సుబ్బారావు.

శేషభుక్తం సంప్రదాయం పక్కనపెట్టి వేరే కంచం పెట్టుకుంది అన్నపూర్ణమ్మ.

ఈలోగా పాపాయమ్మ వస్తూ “ఆకునిండా కుంభం పెట్టి వచ్చాను ఆయనగారికి” అంది. అన్నపూర్ణమ్మ కళ్లు వత్తుకుంటూండటంతో “ఏమయిందొదినా?” అంటూ తనూ ఓ కంచం పెట్టుకుని పక్కన కూర్చుంది.

3

రాత్రి ఎనిమిదవుతోంది. ఇంట్లో ప్రతిగదిలోనూ గోడకి తగిలించిన బుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. చెరువుగట్టు వారనే ఉన్న రావిచెట్టు ఆకులు గలగలమంటున్నాయి. గాలి కదలబారింది. దూరంగా చెక్కభజన వినిపిస్తోంది. చెరువుగట్టు మీద చెట్ల కింద వెన్నెల నీడా ఆడుకుంటున్న పిల్లల సవ్వడి.

సుబ్బారావు గదిలో హరికెన్ లాంతరు వెలుగుతోంది. వత్తి తగ్గించింది. పడుకున్న భర్త దగ్గరకు వచ్చింది. కాళ్లు పడుతూ పాదాలు నొక్కటం మొదలెట్టింది. ఆడపిల్ల పాదాల్లా చిన్నగా ఉన్నాయి. గుండెలో వెలపరాన్ని పైకి కనపడకుండా మింగేసింది.  వేళ్లు లాగుతుంటే, అందాకా బిగుసుకున్న మనిషి కాస్తంత వదులైనట్టు గ్రహించింది.

“సవాయి తగ్గటానికి ఓ చిట్కా ఉందిట” అంది అన్నపూర్ణమ్మ.

పడుతున్న కాలిని వదిలించుకుని ఓమారు జాడించాడు సుబ్బారావు. మెలకువగా ఉన్నాడనీ, విన్నాడనీ గ్రహించింది. మనసులో ఉన్నది చెప్పకుండా బిగబట్టుకుంది.

“ఏంటది” అన్నాడు

“ఈడేరని పిల్లతో పడుకోవాలిట” అంది మొహంలోకి పట్టిపట్టి చూస్తూ.

ఊహించినదాని కన్న ఉషారుగా లేచి కూర్చుని పంచె సవరించుకున్నాడు. “నిజమే నేనూ విన్నాను”. అన్నాడు. “మా శంకరం మామయ్యకి అలాగే నయమయిందిట”. అని జోడించాడు.

“ఏదీ ఆ రామవరం బాబయ్యగారేనా!?” అంది.

“అసలు వాడికి సవాయి ఎలా వచ్చిందో అదో కథ. సన్నగా ఉండేవాడు. పక్షిరోగం అనేవారు. బియ్యం తినటం అలవాటొకటి. వాడికి ఎవరో చెప్పారుట… సవాయున్నదాని దగ్గరకి పోతే లావవుతావని… పోయాడు. నిజంగానే వళ్లు చేసాడా తరవాత. పెళ్లయింది. పిల్ల కూడా పుట్టింది. పాపం.. సవాయి తిరగబెట్టింది. ఎవరో ఈమాటా చెప్పారు. ఏ పిల్లా దొరకలేనట్టుంది. పోయాడు.” అంటూ ముగించాడు. పెళ్లాంతో మాటాడితేనే లోకువైపోతామ న్నట్టుంటారు ఆయింట్లో వాళ్లు. సుబ్బారావు తల్లీదండ్రీ గోదావరి పుష్కరాలలో కొట్టుకు పోయారు. అప్పటి వరకూ పగలు భార్యాభర్తా చూసుకోటానికే వదిలేవారే కాదు. అలాంటి సుబ్బారావు అంతసేపు మాటలాడితే అన్నపూర్ణమ్మకి కొండెక్కినట్టయింది.

“అయ్యో పాపం మంచిమనిషి.. చెల్లెమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు” అంది. రోగాలతో తీసుకునే ఆ శంకరం అనే పెద్దమనిషి తినేసాలా చూడటం వెకిలిమాటలు మాటాడ్డం గుర్తు వచ్చి వళ్లు చీదర ఆనిపించింది ఆమెకి.

“మన యేసోబుగాడి కూతుర్ని చూసారుగదా.” అంది.

“చఛ.. పోయిపోయి అంటరానిదాన్నా? అంత గతి గడుక్కుపోయి లేను.” అన్నాడు.

“మీరెళ్లి ఆ పెద్దాపురం కొంపల్లో మునగొచ్చా?!” కోపాన్ని అణుచుకున్నా మాట విసురుగానే వచ్చింది.

“వాళ్లకేమే.. మహారాజులూ పండితులూ ఎక్కిదిగిన గుమ్మాలవి.. వాళ్లతో నిషిద్ధం కాదు.”

“అవును మరి ఇప్పుడా కొంపల్లో నానా రకాల వాళ్లూ ఉంటున్నారుట”

“నీకివన్నీ ఎలా తెలుసే!?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఎందుకు తెలవ్వు! మా ఆడాళ్లం అన్నీ మాటాడుకుంటూనే ఉంటాం.” మొగుడు స్వాధీనమవుతున్నాడన్న చిన్ని ఊహ ఆమెకి కించిత్తు ఆనందం కలిగించింది.

“తెలియని కళ్లన ఏం జరిగినా పాపంలోకి రాదే.” అన్నాడు సాలోచనగా.

“గుమ్మన్నని పెనాంలోకి తోసేసినపుడో..” అంది. పదేళ్ల క్రితం జరిగిందా సంఘటన. సుబ్బారావుకి కోపం వచ్చి గుమ్మన్న అనే మాదిగ కులస్తుడిని చెరుకులు దొంగిలించాడని కొట్టాడు. ఆ తోపులాటలో మరుగుతున్న బెల్లం పెనాంలో పడ్డాడు. ఊరు కలిసొచ్చింది. ఐనా ఎవడో లిటిగెంటు పోలీస్టేషన్లో ఊదేసాడు. తెల్లోళ్ల పాలనగదా.. కేసులూ గీసులూ.. అధికారులూ కలిసొచ్చారు. రెండెకరాలు హారతి కర్పూరం చేసి కేసు అవకుండా బయటపడ్డాడు.

“సచేలస్నానం చేసి జంధ్యం మార్చుకుని సహస్ర గాయత్రి చేసాను.”

“ఇప్పుడూ అదే చేయండి.. ఎవరొద్దన్నారూ.. ఏదో మీ బాగుకోరి చెప్పాను.. వెర్రిబాగులదాన్ని.. నన్నింట్లో వదిలేసి మీరు అడ్డమైన కొంపల్లోనూ దూరి రోగాలంటించుకు వచ్చి నాకూ అంటిస్తే నోరు విప్పానా..” అని నోరుజారింది.

ఎడమకాలికి దగ్గరగా ఉంది అన్నపూర్ణమ్మ. ఒక్క తాపు తన్నాడు. మంచం మీంచి దబ్బున పడింది. నడుం కలుక్కుమంది.

“పేనుకి పెత్తనమిస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. మా బాబయ్యా అమ్మా చెప్పనే చెప్పారు.. ఆడముండలకి మాటాడీ వీలివ్వకూడదని.. వందమందితో తిరుగుతాను. నోర్మూసుకు పడుకో”

“అంతేలెండి.. నాకిలాగే అవాలి.. సతీ సుమతి లాంటిదాన్ని”.. అంటూ ముక్కు చీదుకుంటూ లేచి వెళ్లి మధ్యగదిలో  కొంగు పరుచుకుని నేలమీదే పడుకుంది. పట్టరాని దుఃఖం ఆవహించింది. ‘చిన్ననాటను తల్లిదండ్రుల వద్ద పొందిన సుఖము కన్న వేరు సుఖము ఎరుగనన్నా’.. అంటూ మామ్మ పాడే పాట గుర్తు వచ్చింది. సేదదీర్చే మనిషి పశువుల శాలలో ఉన్నాడు. పెరటి వరండాలో పాము చెవుల పాపాయమ్మ పడుకునుంది. వీధిలోంచి వెళ్లవచ్చు.. కాని మొగుడి వాటం చూస్తే ఏ అద్దరాత్రో లేపేలాగున్నాడు. ఆమె గుర్రు వినగానే పాపాయమ్మ గుర్రు మొదలయింది.

ఏసోబు పద్దాటాక లేచి గూడెంలోకి వెళ్లిపోయాడు.

ఆమె అనుకున్నట్టే మూడోజాముకి సుబ్బారావు లేపాడు.

“చెప్పు ఎప్పుడో” అన్నాడు లోపలికి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని. కాస్సేపు గునిసింది. బతిమాలాడని పించాడతను. “ఇంకా కోపమేనా పిల్లా” అన్నాడు.

“ముందు మీ చెల్లిని పంపెయ్యండి” అంది.

“నీకళ్లెప్పుడూ దానిమీదే! దానికీ దీనికీ పూటా పెడతావేంటి?!” అన్నాడు విసుగ్గా

“అవునుమరి పెళ్లయిందగ్గరనుంచి నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నాను. కుళ్లుమాటలు పడుతున్నాను.” అని ఆగి, గొంతు మార్చి అంది. “ఆమాత్రం గ్రహించుకోకపోతే ఎలా?! ఆవిడుండగా మీపని అవుతుందా?! నేనంటే పతివ్రతా ధర్మం పాటిస్తాను ఆవిడ గారి పారా తప్పించగలనా?” అంది.

“అది సరే ఆ పిల్లని ఎలా ఒప్పిస్తావు” నసిగాడు.

“అదంతా నాకొదిలేయండి ఈ పని ముందు చూడండి.. ముందు మీకు ఓపిక రానీయండి” అంది ఆవులిస్తూ.

చెయ్యిపట్టుకున్నాడు అర్ధవంతంగా, అర్ధిస్తున్నట్టు.

“ఒళ్లారితే లేడిపిల్ల.. నేనెక్కడికి పోతాను మీరెక్కడికి పోతారు?” అంటూ లేచి, చెయ్యి వదిలించుకుని, మధ్యగదిలో మడతమంచం వాల్చుకుని దిండు పెట్టుకుని దుప్పటి బిగించింది.

అన్నపూర్ణమ్మకి పంజరం తలుపులు తీసినంత ఆనందం కలిగింది. పట్టు చిక్కినంత ఉషారు కలిగింది.

4

అంతా అనుకున్నట్టే నడిచింది.

“నేనేం గతిగడుక్కు పోయి లేను. దిక్కూ దిబాణం లేనిదాన్ని కాదు. మా మరుదులూ తోటికోడళ్లూ నెత్తిమీద పెట్టుకుంటారు. ఎవరికేం అవసరాలున్నాయో.. ఎవరి పాపాలకి నేనడ్డమయానో..” అంటూ తిడుతూనే ఉంది పాపాయమ్మ. అన్నగారు ఎదుటపడేసరికి కుక్కినపేను అయిపోయింది. బండెక్కింది. అన్నపూర్ణమ్మ ఆలోచన ప్రకారం సుబ్బారావు కూడా వెళ్లాడు. పాపాయమ్మ అత్తారింటి వాళ్లచేత బతిమాలించుకుని, నాలుగురోజులు అక్కడే తిష్ఠ వేసాడు. వాళ్లు జిల్లాబోర్డు మెంబరూ, పాతికెకరాల ఆసామీ అయిన పంతులుకి అగ్గగ్గలాడుతూ అన్నీ అమర్చారు. పేక.. ఎత్తుళ్లు ఆట మొదలయింది.

ఏసోబు భార్య పోలమ్మ రోజూ పొద్దుటే వచ్చి వాకిళ్లు ఊడుస్తుంది. కళ్లాపి జల్లుతుంది. పశువుల దగ్గర  కసువు తీసి పెంటగోతిలో వేస్తుంది. ఆ పెంట ఎరువు కోసం తోలతారు. పేడకళ్లు తీసి పిడకలు చరుస్తుంది. ఆమెతో బాటు కూతురు పుల్లి వెంట వస్తుంది. ఆ బిడ్డకి మూడవ ఏటనే పెళ్లయింది. మెడలో తాళి, నోట్లో వేలు, మానం మీద సిగ్గుబిళ్లతో బోసిగా తిరుగేది. దానికి గవున్లు కుట్టించింది ఈమధ్యనే అన్నపూర్ణమ్మ. తీసిపారేసేది. పోలమ్మ బాదిందొకరోజు. అన్నపూర్ణమ్మ కసిరింది. ‘నెమ్మదిగా అలవాటు చెయ్యాలి గాని కొడతావా’ అంది. పిల్ల చేతిలో ఓ బెల్లంముక్క ఎత్తిపడేసి ఊరుకోబెట్టింది. ఇప్పుడు ఆ పిల్ల ఏపుగా ఎదిగింది కాని తింగరిది. ‘ఇంకా ఆ వేలేంటే!’ అంటే తీసి, నవ్వుతుంది. ఎవరో కారం పూసిన గుడ్డ వేలికి చుట్టమన్నారు. పోలమ్మ ఆ పని చేసింది. పుల్లి ఓమారు ఏడ్చి మరోవేలు ప్రయత్నించింది. పోలమ్మ పడీపడీ నవ్వుతూ ఆ తంతంతా చెప్పింది.

అనుకున్నట్టే పశువులశాలలో ఏసోబు కోసమన్నట్టుగా అమర్చిన పాతమంచం కింద లక్కపిడతలు, బొమ్మలు పెట్టించింది అన్నపూర్ణమ్మ. (ఆ మంచం అక్కడ పెట్టించేందుకు అది సులువుగా కనిపించకుండా మినపబొత్తి కుప్ప పోసేందుకు ఆమె వేసిన ఎత్తులు ఓ పెద్దకథ.) పుల్లికి ఆడుకోడం, అక్కడే పడుకోడం, అలవాటయింది. పోలమ్మ ఇంటికి వెళ్లిపోయేది. ‘తల్తల్లీ అటూయిటూ పోకుండా చూసుకో అమ్మా’ అనీది పోలమ్మ. ‘నాపిల్లని కూడా తవరు సొంతం చేసుకుంటారేటండమ్మ గోరూ’ అని ఏసోబు ముసిముసి నవ్వులు నవ్వేవాడు. ఎవరూ లేనపుడు చూసి ‘నువ్వు పిల్లనిచ్చీ వరకూ నీపిల్ల నా సొంతం చచ్చినాడా’ అనేది అన్నపూర్ణమ్మ.

రెండు వారాల తర్వాత అదును చూసి పంతుల్ని మంచంమీద నిద్రపోతున్న పుల్లి దగ్గరకు పంపింది. కొంతసేపు గునిసి వెళ్లాడు.

అయిదు నిమషాల తర్వాత వాకిట్లోంచే పిలిచాడు సుబ్బారావు. దేవుడి గూడు ముందు కూర్చునుంది అన్నపూర్ణమ్మ. ‘ఈశ్వరా నా ఐదోతనం కాపాడుకుందుకూ, కాపురం చక్కబెట్టుకుందుకూ, కడుపు నిలబెట్టుకుందుకూ నాపాట్లు నేను పడుతున్నాను. ఆ మనిషికి ఇప్పుడైనా బుద్దొచ్చేట్టు చూడు’ అంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటోంది. మొగుడి పిలుపుకి దిగ్గుమన్న గుండెలతో లేచి పరుగెత్తింది.

“దానికి రక్తం వస్తోంది.” అనేసి నూతి దగ్గరకు వెళ్లాడు. అక్కడ వేడినీళ్లు తొరిపి తయారుగా ఉన్నాయి డేగిసాలో. స్నానం చేసాడు. బట్టలు తడిపి పిండాడు. జంధ్యం తీసేసి కొత్తది వేసుకున్నాడు. “ఇహ నువ్వెళ్లు దాని సంగతి చూడు. నేను గాయత్రి చేసుకుంటాను. నన్ను కదపకు.” అన్నాడు పెళ్లాంతో, తుండుగుడ్డ అందుకుని.

వెళ్తూవెళ్తూ ఓ అరిసె, పాత గుడ్డలూ తీసుకుని వెళ్లింది. పిల్లని మంచానికి కట్టేసాడు సుబ్బారావు. అది బెగిలిపోయుంది. రక్తం కారుతోంది. కట్లు విప్పింది. గుడ్డతో శుభ్రం చేసింది. గుడ్డలు వేసి గోచిలా కట్టింది. “ఏం జరిగింద”ని అడిగింది. అది తింగర తింగరగా చెప్పింది. విన్నవాళ్లు గ్రహించేపాటి చెప్పింది. దానికి అరిసె పెట్టింది. ఆన్నపూర్ణమ్మ ఆలోచించింది. దాన్ని భయపెట్టింది. ఒట్టేయించుకుంది. ఎవరికైనా చెపితే దేముడికి కోపం వస్తుందంది. మీ అమ్మను చంపేస్తాడంది. పుల్లికి పిచ్చి చూపులు వచ్చాయి. చేతిలో అరిసె అలాగే ఉంది.

పోలమ్మకి కబురంపింది. రాగానే గేటు దగ్గరకి తనే వెళ్లింది.

“నువ్వు అదృష్టవంతురాలివే పోలీ! నీ పుల్లి పెద్దమనిషి” అయింది. “కొందరికి ఎగిస్తుంది. కొందరికి దిగిస్తుంది. ఎనిమిదో ఏటనే ఇది ఈడేరింది. నా పిల్లే అనుకుని ముట్టుకుని మరీ నేను చేసేవన్నీ చేసాను. ఇంద ఈ ఐదు రూపాయలూ తీసుకుని కాస్త అడావుడి చెయ్యి. పిల్ల బలహీనం. జాగ్రత్తగా చూసుకో” అంటూ ముహం మీద ఇంత నవ్వు పులుముకుని అంది.

“నువ్వు మరిడీ మాలచ్చివమ్మా నీ బిడ్డలా సూసావు.” అంది పోలమ్మ ముహం ఇంత చేసుకుని.

“దానికేముందే నాకా పరమాత్ముడు తిన్నగా చూడలేదు. లేకపోతే ఇలాంటి బిడ్డకీ పాటికి పెళ్లి చేసేసేదాన్ని.” అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది.

తన కూతురిని భుజాన వేసుకుని చేతిలో ఐదు వెండిరూపాయలతో గుడెం వైపు నడిచింది పోలమ్మ.

“కొందరికి జొరం గిరం వచ్చినా వస్తాయి. ఇలాంటపుడు ఏగాలో ధూళో పట్టుకున్నా పట్టుకుంటాయి. జాగ్రత్త సుమా” అంటూ పొడి వేసింది తన ‘అనుభవాన్ని’ గుర్తు చేసుకుని.

5

ఇంక అక్కడ నుంచి ఏదీ అనుకున్నట్టు నడవలేదు.

ఆ రాత్రి పుల్లికి జ్వరం వచ్చింది. సంధి పేలాపన మొదలయింది. ఏసుపాదం ప్రభువుకి ప్రార్ధన చేసాడు. పోలమ్మ మరిడమ్మ తల్లికి మొక్కుకుంది. తోటివాళ్లు వచ్చారు. ‘పెద్దదైనపుడు ఇలాగవుతుందని అమ్మగారు చెప్పారన’గానే వాళ్లు ‘అవునే పోలీ సిన్నపుడు మా పెద్దాళ్లనీవోరు’ అంటూ కొందరు ముసిలమ్మలు అందుకున్నారు. ‘ఏటోలప్పా రోజులు తిరగబడిపోతన్నాయి’ అంటూ ఇంకొందరు ముసిలమ్మలు నోరు నొక్కుకున్నారు.

పొద్దుటే భార్యని తీసుకుని వచ్చాడు ఏసోబు.

“ఏం మాటాడుతుందో బోద పట్టం లేదమ్మగోరూ” అంటూ లబోదిబోమన్నారు.

“నేను చెప్పానుగదే ఏ గాలైనా వాలుతుందని. రంగనాయకులు దగ్గరకి వెళ్లండి. రక్ష ఇస్తాడు. కట్టించండి”. అంది.

“బాబయ్యగోరు లేరా అమ్మగోరూ” అడిగాడు ఏసుపాదం.

పట్టిపట్టి చూసింది అన్నపూర్ణమ్మ.

“విశాఖపట్నం మీద బాంబులేసారు గదరా.. జపాను వాళ్లు. కాకినాడ మీద కూడా వేస్తారుట. మా సాంబశివం మామయ్యగారు సాయానికి కబురంపారు. వాళ్లని తీసుకురాటానికి నిన్న పొద్దుటే వెళ్లారు.” అంది.

పోలమ్మని సింహద్వారం దాటించి, రంగనాయకులు దగ్గరకి పంపి, ఏసుపాదం తిరిగి వచ్చాడు.

అరుగు మీదకి ఎక్కి లోపలికి పోటానికి అనువుగా నించుంది అన్నపూర్ణమ్మ.

“ఎందుకండమ్మగోరూ అట్టా సుట్టుకుపోతన్నారూ” అన్నాడు వాకిట్లో అరుగు దాకా వచ్చి.

“భయంరా- పిల్లజూస్తే మా గొడ్లసావిట్లో ఈడేరింది. ఎవరేమాటంటారో ననేసి ఓ పక్కా.. అయ్యో బిడ్డకిలాగయిందే అని మరోపక్కా.” అంది.

“బాబయ్యగోరు లేరంటన్నారు గదండమ్మగోరూ” అంటూ మెట్టు దాకా వచ్చాడు.

“ఒరేయ్ సచ్చినోడా అక్కడే ఆగు. పొద్దుటే కుదర్దన్నానా” అంది గమ్మత్తుగా నవ్వుతూ, గొంతు తగ్గించి లోపలున్న సుబ్బారావుకి వినపడకుండా అంది. మనసు కాస్త తెరిపినపడింది.

ఏసోబు ఆగిపోయాడు.

“ఉండు ఇప్పుడే వస్తాను.” అంటూ లోపలికి వెళ్లింది.

సుబ్బారావు లోపలి గదిలోంచి ఏదో అనబోయాడు. నోటిమీద వేలువేసి మాటాడవద్దని సైగ చేసింది.

అయిదు రూపాయలూ, అడ్డెడు బియ్యం మూటా తెచ్చి అరుగు మీద పెట్టింది.

“ఇవి తీసుకెళ్లు. అన్నం వండి పెట్టండి. జొరం తగ్గుతుంది.” అంది. అతనికే వినిపించేలా “అలాంటి పిల్ల కావాలనే గదా నేను సిగ్గూశరం విడిచేసాను. దానికేమైనా అయితే నేనుండలేను”. అంది.

ఏసోబు ఆమె మాట పూర్తవకుండానే అక్కడనుంచి బయల్దేరాడు.

లోపలికి వెళ్లి మొగుడికి కాఫీ అందించింది.

“ఏమయిందే” అన్నాడు తడారిపోయిన గొంతుతో.

“నా శ్రాద్ధమయింది. వాడికి అనుమానం వచ్చినట్టుంది. ఆ పిల్ల కునికేస్తుందేమో.. మీరీపూట బైటకి వెళ్లకండి. రాత్రి సద్దు మణిగాక తోపుల్లోంచి పోయి బూరుగుపూడి రోడ్డెక్కెయ్యండి. నాల్రోజులు కాకినాడని ఉద్ధరించండి. బుడంపేటకి మాత్రం చావకండి” అంది.

మామూలుగా ఆమె అలా నోరు పారేసుకోదు. కొత్తగా వచ్చిన అధికారమేదో ఆమె మీద పనిచేసింది.

“కాలవకెళ్లాలే ఎలా?” అన్నాడు బిక్కచచ్చిన గొంతుతో.

వెర్రిదానిలా చూసి, “దొడ్డి తలుపులు వేసేస్తాను. కాపలా ఉంటాను. ఇంత దొడ్డి ఉంది. ఎక్కడోచోట కానివ్వండి” అంది.

6

పుల్లి ఆరోజు రాత్రే మట్టైపోయింది. రాత్రికి రాత్రి అత్తారింటి వాళ్లు వచ్చారు. పొద్దుటే పనైపోయింది.

మధ్యాహ్నానికే ఏసోబు, కాలవ కట్టటానికి, పొలానికి పోయాడు. పోలమ్మ వచ్చి, పనిచేసి వెళ్లింది. చిన్న పాలికాపులు, గొడ్ల దగ్గర కుర్రాళ్లూ తిరుగుతూనే ఉన్నారు. సాయంత్రం పొలం నుంచి వచ్చాడు ఏసోబు. సైగలు మొదలెట్టాడు. ముందు ఆశ్చర్యం కలిగింది. తరవాత భయం వేసింది.  ఏదో తేడాగా ఉన్నాడనిపించింది. నాలుగు రోజుల పాటు అతనికి కనపడకుండా తిరిగింది. రాత్రి వేళ పాలికాపొకడిని వాకిట్లో పడుకోమంది. మూడోరోజుకి ‘నాదంతా ఉత్తి అనుమానం. గుమ్మడికాయ దొంగలా భయంతో చస్తున్నాను.’ అనుకుంది.

నాలుగోరోజు రాత్రికి మంచం దగ్గరకు వచ్చింది.

“ఏడవకురా” అంటూ దగ్గరకు తీసుకుంది.

వారం పది రోజుల ఆకలి ఆమెను ఆవరించింది. అతనిని అల్లుకుపోయింది. అరగంట గడిచింది. కోపం ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా పురుషుడు చేసేపని అతను చేసాడు. హింసే మితిమీరిన ప్రేమగా ఆమె శరీరం స్వీకరించింది. ఆ మైమరుపులో ఆమె ఒక మాట అంది.

“ఇంత మగతనం ఉంచుకు నీకు పిల్లలకు కొదవేంట్రా!” అంది.

మరుక్షణమే-

“అమ్మ సచ్చినోడోయ్ చంటిపిల్లాడి ననుకుంటున్నావేంట్రా అలా కొరికేసావూ” అంటూ అతన్ని తోసేసింది. లేచి, పరుగెత్తింది.

“తప్పైపోయిందమ్మగోరూ తప్పైపోయిందమ్మగోరూ” అంటూన్న ఏసుపాదం, ఆమె కాస్త దూరమయిందనిపించగానే, “తప్పైపోయిందే లంజా” అన్నాడు గొణుక్కుంటున్నట్టు.

పరుగెత్తుకుంటూ వెళ్లి, చీర నూతి చప్టాలో పడేసింది. నాలుగు బాల్చీలు తోడుకుని నెత్తిమీద గుమ్మరించుకుంది. చల్లనీళ్లు తగలగానే మంట మరింత ఎక్కువయింది. అతని గొణుగుడు ఆమెని తరుముతూనే ఉంది. నగ్నంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. మండువా తలుపులు వేసేసింది. అడ్డగడియ పెట్టింది.

గొడ్లసావిట్లో నుంచే చూస్తూ నించుండి పోయిన ఏసుపాదం నోట్లోనున్న రక్తాన్ని ఉమ్ముతూ ‘ఛీ’ అన్నాడు.

వంటింట్లోకి వెళ్లి, ఇంత కాఫీగుండ తీసి గాయంమీద మెత్తుకుంది అన్నపూర్ణమ్మ.

7

వారం తిరిగాక జట్కాబండి కట్టించుకుని దిగబడ్డాడు సుబ్బారావు పంతులు.

గజ్జలలో బిళ్లలు పూర్తిగా తగ్గలేదు. కాపడం పెట్టింది. పిండికట్టు వేసింది. దుప్పటి కప్పి పడుకోబెట్టింది.

ఓరాత్రివేళ లేచాడు. పెళ్లాన్ని లేపాడు. “ఆడముండ మాట విన్నాను చూసావూ నన్ను నేను చెప్పుచ్చుకు కొట్టుకోవాలి. దరిద్రం మండా నీవల్లే నా రోగం ముదిరిపోయింది” అంటూ లంకించుకున్నాడు.

విస్తుపోయింది అన్నపూర్ణమ్మ. “నేనేం చేసానండీ” అంది నోరు పెకలించుకుని.

“మాలదాన్దగ్గరకు పంపావు అందుకే రోగం తిరగబెట్టింది” అన్నాడు. తిడుతూనే ఉన్నాడు.

అన్నపూర్ణమ్మ నిస్సత్తువగా కూలబడింది.

‘నువ్వు కాదూ.. నువ్వు కాదూ.. దీనికి కర్తవు. ఇదంతా చేసిందెవరూ.? మీబాబేం చేసాడు..?  పెద్దమనిషి నవటం అలస్యమయిందని మాచకమ్మనని నిందవేసాడు. మా అమ్మనీ, బాబునీ తిట్టాడు. ‘కాపరానికి పంపుతారా తెగతెంపులు చేసుకుంటారా’ అంటూ రంకెలు వేసాడు. మా పీనుగలు ఏం చేసారు..? ‘కాపరం పోతే దరిద్రం వదిలిపోతుందనుకున్నారా?’ లేదు. పీడా విరగడవుతుందని ఈడేరకుండానే పంపేసారు. మీఅమ్మేం చేసింది..? చిన్నిపిల్లనని చూడకుండా గదిలోకి పంపి తాళం వేసింది. రక్త కొల్లైపోయి అరుస్తుంటే అరిచేవంటే నోట్లో పొడుస్తానంది. నువ్వేం చేసావు..? బెల్లం అచ్చులు అమ్మేసి పెద్దాపురం దోవ పట్టావు. రోగాలు తగిలించుకున్నావు.  నిన్ను కట్టడి చెయ్యాలని మీ బాబూ అమ్మా నన్ను నీకప్పగించితే కనికరం లేకుండా గొడ్డుని బాదినట్టు బాది నీ రోగాలు నాకు తగిలించావు. నా అదృష్టం బాగుందో .. ఓగుందో.. నీ అమ్మాబాబూ పుష్కరాలకి వెళ్లి గోదాట్లో కొట్టుకు పోయారు. నీకు ఆ కాస్తపాటి అడ్డూ పోయింది. నీవల్ల కాదూ.. నీ వల్లకాదూ .. నాకు కడుపు నిలబడకపోటం.. కడుపు కోసమని నేనా అంటరానాడి పక్కలో దూరటం.. కడుపు నిలబడక పోయినా.. వాడికి మరుగడటం నీ నిర్వాకం వల్ల కాదూ.. నీ ముండ మోసిన చెల్లెలికి అరికాలు కింద మంటలు పెట్టి ఇంట్లోంచి తరిమేస్తూ ఉండటం.. నీ వల్ల కాదట్రా పాపిష్టోడా..’

ఆమె మనసు రోదిస్తోంది. మాట బైటకి రావటం లేదు.

తిట్టి తిట్టి అతను పడుకున్నాడు. ఏడ్చి ఏడ్చి ఆమె నడుం వాల్చింది. ఆలోచన తెమిలేటప్పటికి మూడోజాము అయింది. కన్ను మూతపడింది.

8

తెల్లారీసరికి పంతులుకి కాస్త నెమ్మదించింది. పదయీసరికి పథ్యం వంట చేసిపెట్టింది. మధ్యాహ్నం కాఫీతో బాటు జంతికలు పెట్టింది. అంతవరకూ ఎండ పేల్చేసి, అప్పుడే మబ్బు ముసురుకుంటోంది. వానగాలి చల్లగా విసురుగా తగులుతోంది.

“తెలివితక్కువ పీనుగని. సరిగ్గా ఆలోచించలేకపోయాను”. అంది.

సుబ్బారావు పెద్ద కంచుగ్లాసుతో కాఫీ తాగుతూ జంతికలు నవుల్తున్నాడు.

“మీరన్నది నిజమే.. ముట్టరాన్దాన్ని ముట్టించాను. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పైగా.. కర్మ కాకపోతే.. ఆ పిల్ల కునికేసింది… నేను నా మొగుడి కోసం చేసాను. తప్పో ఒప్పో పైనున్న పరమాత్ముడే చూసుకుంటాడు”. అంది.

సుబ్బారావు నవుల్తూనే ఉన్నాడు.

“మనోళ్లలోనే ఎంత మందున్నారూ.. పిల్లల్ని అమ్ముకునీ వాళ్లు.. సవాయికి అదొక్కటే మందుట” అంది.

“ఏంటైతే!?” అన్నాడు సుబ్బారావు కుతూహలంగా..

“ఓ పంజేద్దాం.. వెంటనే మీ చెల్లెల్ని తీసుకురండి.”

“పంపేసేదాకా చంపావు కదే ఇప్పుడెందుకే” అన్నాడు.

“అయ్యో మీ తెలివి తెల్లారినట్టే ఉంది. వాళ్లత్తారింట్లో దైద్రం ఓడుతూ ఉంటుంది. ప్రతివాళ్లకీ కుచేల సంతానం. ఎక్కడ జూసినా పిల్లలే. ఆవిడని మంచి మాటాడితే ఎవరో ఒకర్ని ఏర్పాటు చేస్తుంది.” అంది.

‘నాకూ కాపలాగా ఉంటుంది’ అనుకుంది లోపల్లోపల.

(గమనిక. 50-55 ఏళ్లక్రితం నాకు పందొమ్మిదీ ఇరవై ఏళ్ల వయసులో రాసిన కథ దీనికి ఆధారం. అప్పట్లో నేను ప్రచురణకి ప్రయత్నించేవాడిని కాదు. మిత్రులు పట్టుకెళ్లి సాఫు చేసి పంపేవారు. 2010లో కథానిలయం కథల జాపితా చేస్తున్నపుడు ఆనాటి ఇంకో కథ నా కలం పేరుతో దొరికింది. కనక ఇది ప్రచురితమో కాదో తెలీదు. ఇటీవల ఖదీర్ చిన్నపిల్లల మీద అత్యాచారం కథలు సూచించమన్నాడు. అప్పుడీ కథ గుర్తొచ్చింది. నాదగ్గర ఆ కథలేదు. తిరిగి ఇప్పుడు రాసాను. అప్పట్లో ఇలాంటి కథలకి ప్రేరణ వర్గదృష్టి. ఆనాటి తెలుగు సాహిత్యంలో వర్గదృష్టి అంటే పేదలూ ధనికులూ. ఇప్పుడు పరిస్థితి వేరు. అస్తిత్వాల స్పృహతో పేదలలోనూ, ధనికులలోనూ ఉండే సమూహాలను గుర్తించటం వారు చేసే చర్యలను పరిశీలించి చిత్రించటం. నా దృష్టిలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పు ఈకథలో అన్నపూర్ణమ్మ పాత్రను “స్త్రీ”గా(అంటే బాధితురాలిగా) చూడటంలో కనిపిస్తున్నదనిపిస్తోంది.)

*

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

46 comments

Leave a Reply to Thayamma karuna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏకబిగిన చదివించిన కథ . రచయితకు అనేక కృతజ్ఞతలు!

  • ఫాక్నర్ ని గుర్తుకు చేశారు. శ్రీపాదని గుర్తుకు చేశారు. కుటుంబరావుని, చలాన్ని గుర్తుకు చేశారు. వివిన మూర్తిని ఆవిష్కరించారు. ధన్యోస్మి.

  • చాలా గుండె చిక్కబెట్టుకుని చదవాల్సి వచ్చింంది .మొదటి పేరాలోనే కథ విభిన్నమని అర్థమవుతుంది .అన్నపూర్ణమ్మ విక్టిమ్ మాత్రమే కాదు ,తాను అనుభవించిన అదే నరకయాతన ఆ చిన్న మతిలేని పిల్ల మీద వేయడం ఎంత స్వార్థం .పవిత్రత చూసేవారి దృష్టిలో మాత్రమే ఉంది. చాలా మంచి కథ .

  • జిల్లాబోర్డు మెంబరూ, పాతికెకరాల ఆసామీ, సుఖవ్యాధి సవాయితో తీసుకుంటున్న సుబ్బారావు పంతులు 1942 నాటి పురుషాధిక్య సమాజం ప్రతీక ( జపాను వాళ్లు విశాఖపట్నం మీద బాంబులేసారు అన్న ప్రస్థావన ఉన్నది కాబట్టి… రెండో ప్రపంచ యుధ్ధ కాలం అయిన ఏప్రిల్ 6, 1942 కధా కాలం )

    సతీ సుమతి లాంటి భార్య అన్నపూర్ణమ్మని గొడ్డుని బాదినట్టు బాది తన రోగాలు తగిలించి కడుపు పండకుండా, నిలబడకుండా చేస్తూ…

    ముండ మోసిన చెల్లి పాపాయమ్మకి అరికాలు కింద మంటలు పెట్టి ఇంట్లోంచి తరిమేస్తూ…

    తన సవాయి సుఖరోగం తగ్గుతుందనే మూఢనమ్మకం ముసుగులో పెద్దపాలికాపు ఏసోబు భార్య పోలమ్మ మతిలేని చిన్న కూతురు పుల్లిని మంచానికి కట్టేసి రక్తం వచ్చేంతగా అత్యాచారం చేసి పుల్లి కునికేసేలా చేసి …

    కట్టుకున్న బట్టలు తడిపి, సచేలస్నానం చేసి జంధ్యం మార్చుకుని సహస్ర గాయత్రి జపం చేసుకుని శుద్ది పొందినట్లు భావించే సుబ్బారావు పంతులు మీద… రోగిష్టి సమాజం మీద… యీ నిస్సహాయ మహిళలు తిరుగుబాటు చెయ్యాలనుకున్నట్లుగా ప్రతీకగా చూపలేదు వివినమూర్తిగారూ ! మూడు వర్గాలకు చెందిన యీ బాధిత మహిళల జీవితంలో “ ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్ “ మార్పు కూడా రాలేదని అంటున్నారా వివినమూర్తి గారూ ?

    ” గోవులొస్తున్నాయి జాగ్రత్త ” అన్న రావిశాస్త్రి బాబుకి (రాచకొండ విశ్వనాథశాస్త్రి గారికి) వొగ్గేసారా ఆ బాధ్యతని ?!.

    శ్రీపాద, చలం, కొ.కు. నాయన, రావిశాస్త్రి, విప్లవ కవి శివసాగర్‌ ( ఆకాశంలో సగం మీరు / అనంత కోటి నక్షత్రాల్లో సగం మీరు, సగం మేము/ మనిద్దరం కలిసి ఉద్యమిస్తే ʹవిజయం ) ల తరాలనుండి నేటికీ విషాదమేవిటంటే నేటి సమాజంలో కూడా మహిళల పట్ల రాక్షస, వికృత నేరాలు జరుగుతూనే ఉన్నాయి వివినమూర్తి గారూ .

    పితృస్వామిక భావజాలం, వరకట్న దాహం, చలన చిత్ర, శ్రవణ మాధ్యమాల ప్రభావం, పోర్నోగ్రఫీ (అశ్లీల సాహిత్యం, దృశ్యాలు), నైతిక విలువల పతనం, మహిళా భద్రత చట్టం అమల్లో జాప్యం వంటి అనేక కారణాలవల్ల పెచ్చురిల్లుకున్న లైంగిక వేధింపులు, అమానవీయ రాక్షస నేరప్రవృత్తి అత్యాచారాలు నివారించబడటం లేదు.

    • ఇంకా ఊహాతీతమైన దారుణాలు పెరిగాయి రామయ్యగారూ

  • మీ ఇంట్లోనో మీ పక్కింట్లోనో మీరు విన్న సంగతి రాసినట్టుగా ఉంది..కాకినాడ బుడంపేట (లక్ష్మీ టాకీస్ పక్క సందు) పెద్దా పురం భోగం వారి ఇళ్ళు, ఇంత చక్కగా వర్ణించారు అంటే అర్ధం ఖచ్చితంగా కాకినాడ పక్కన ఏదో పల్లెటూరులో జరిగుండాలి…దానికి ఖదీర్ గారి సాడిజానికి సరి పోయేలా రాస్తే..అఫ్సర్ అంకుల్ ఏగేసుకుంటూ అచ్చ్హెయ్యడం, ఆహా ముగ్గురిని చేర్చాడు ముండా దేముడు అన్నంత సులభంగా పని కానిచ్చేసారు. కాకపోతే..ఎక్కడో ఒకటో అరో జరిగిన హింసని ప్రతీ ఇంట్లో ఇలాంటి భాగోతాలే అనేలా రాసి పారేసిన మీ రచనా శక్తికి మా జోహార్లు..ఇంక ఇలాంటి వాటికి ఆ తమ్మా రెడ్డి గారు తోడయితే..ఓ 1942 సామర్ల కోట జంక్షన్ అనే సినిమా తిసేవారు..మాస్టారు మందులు అనేవి 1941 వారికి తెలియవు అన్నట్టు రాయడమే వికృతంగా ఉంది. కాకినాడలో ఓ పెద్దాసుపత్రి ఉందనే ఉంది అనుకుంటున్నాను. ఇంకా తనికెళ్ళ భరణి గారి సినిమా పేరు గుర్తుకు రావడం లేదు అది చాలా బావుండి..నిజానికి దగ్గిరగా..అలాంటి మూఢ నమ్మకాలుండేవేమో కానీ ఇంత ఘోరంగా ఓ ఆడది కూతురి వయసు పిల్లని బలి తీసుకోవడం క్షమించ రాని నేరం.. అక్కడే కధనంలో మీలో దాగున్న సాడిస్ట్ కనిపించాడు..నాకు.. ఇది నిజంగా జరిగితే మీ ఇలాకాల్లో..మొగుడు ఏమన్నా పిల్ల మీద ..కన్నేసాడా అనుకోవచ్చు కానీ..ఓ ఆడది అలాంటి పని చేస్తుంది అనేది నమ్మ లేక పోతున్నా…
    అదే మీ కధలో ప్రధాన లోపం… లేక మొగుడు కొట్టి భార్య చేత ఒప్పించాడు అన్నా కుంచెం కధని నమ్మే వాడిని…కానీ…ఇది మీరు ఏదో విన్న దానికి మీరు చదివిన చండాలాలన్నిటిని కలిపి…రాసిన జుగుప్సాకరమైన చిత్రీకరణే..దానికి కారణం సారంగలోని సత్సాంగత్యపు గంజాయి తాగి తురకల సాంజాతములోనుంచి పుట్టుకొచ్చిన పిచ్చకి పరాకాష్ట లా ఉంది అనిపిస్తోంది.. క్షమించాలి కధ ఉన్నంత పచ్చిగానూ నా సూటి విమర్శ రాసాను..మానసిక నిపుణలతో కలిసి కూర్చుని ఆలోచించాకా వచ్చిన విమర్శ ఇది…

    • శ్రీనివాస్ గారూ
      ముందుగా నాకథ చదవి స్పందించినందుకు కృతజ్ఞతలు. మీరు హర్టయినట్టు అనిపించింది. బాగా కోపం కలిగిందని అర్ధమయింది. ఎందుకైనా సరే హర్టు చేసినందుకు సారీ.
      కాకపోతే మీకు కోపం తెప్పించిన దేమిటని పరిశీలనగా మీ వ్యాఖ్య చదివాను. సాహితీ కారణమా లేక సాహిత్యేతర సామాజిక కారణమా మీ కోపానికి లేదా బాధకి ప్రేరణ అన్నది తేలలేదు.
      సాహితీ కారణమైతే ఏమిటది?
      “కాకపోతే..ఎక్కడో ఒకటో అరో జరిగిన హింసని ప్రతీ ఇంట్లో ఇలాంటి భాగోతాలే అనేలా రాసి పారేసిన మీ రచనా శక్తికి మా జోహార్లు.” అన్న వాక్యం కొంత పట్టు చిక్కేట్టు చేసింది.
      దీనినుంచి నాకు అర్ధమైనదేంటంటే ఒక అరుదైన సంఘటన కథగా చెప్పకూడదు. చెపితే అది ప్రతీఇంట్లో జరిగే భాగోతమే అనిపిస్తుంది.
      నేనర్థం చేసుకున్నది సరైనదే అయితే మీ అభియోగం గురించి మాటలాడవలసిఉంది. ఒక అరుదైన సంఘటన అని మీరు ఒప్పుకున్నారు. అందుకు సంతోషం. అంటే జరగటానికి అవకాశం ఉన్న ఘటనగా మీకు అనిపింపజేసినందుకు రచయితగా నేనూ, కథ పట్ల కోపం వచ్చినా వాస్తవాన్ని అంగీకరించినందుకు పాఠకునిగా మీరూ ప్రశంసకి అర్హులం.
      అయితే అరుదైన ఘటన కథకి పనికిరాదా?
      నేను అర్థంచేసుకున్న కథా వ్యాకరణం మేరకు సాధారణం, విశేషం అనే విభజన ఉంది. కథలో ఘటన ఉంటుంది. అలాగే అది వ్యక్తం చేసే మౌలికాంశం ఒకటుంటుంది.
      ఘటన మౌలికాంశం రెండూ సాధారణమయే కథ ఒకకోవ.
      రెండూ విశేషమైనవైతే అది మరో కోవ.
      ఘటన అరుదైన లేదా విశేషమైనదైతే వ్యక్త మౌలికాంశం సాధారణమైనదైతే అది వేరోక కోవ.
      ఘటన సాధారణమైనదై వ్యక్త మౌలికాంశం విశేషమైనదైతే అది ఇంకో కోవ.
      నాకథ ఈ అవగాహన ప్రకారం మూడవ విభజనకి చెందినది.
      ఈ అరుదైన ఘటన ద్వారా రచయితనైన నేను వ్యక్తం చెయ్యటానికి ప్రయత్నించినదేమిటి
      1. మానవుని నిస్సహాయత. లేదా వ్యక్తి నిస్సహాయత. తనకున్న తెలివితేటల మేరకు అన్నపూర్ణమ్మ 80 ఏళ్ల క్రితం అలా చేసింది. తన భర్తని చేతిలో పెట్టుకోవాలనో కాస్తంత సామీప్యత సాధించుకోవాలనో చేసింది. అసలు అలా భర్తని సంపాదించుకోవాలనుకునే స్థితి ఆనాటి సమాజంలో లేదని మీరూ అనలేరు. అలా భర్తని సంపాదించుకోమని చెప్పే కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. ఆమాత్రం మొగుడిని కైవశం చేసుకోలేకపోయావా అంటూ ఆడదానినే తప్పుపట్టటం ఇప్పుడు కూడా మనం చూడగలం.
      2. వ్యక్తి దైహిక అవసరాలు కలిగించే నేరాలు. అన్నపూర్ణమ్మ దైహిక అవసరం ఈమధ్య వరకూ సాహిత్యంలో కూడా చర్చకి కూడా నోచుకోలేదు. ఇప్పటికీ ఆ అన్నపూర్ణమ్మల లేతభుజాల మీద బాల్యం నుంచీ.. కుటుంబం కులం వంశం ఇటీవల మతం వంటి వాటి గౌరవ భారం .. మగ దృష్టి మోపుతూనే ఉంది.
      ఇక ఆమె నేరం (మీరు అన్నట్లుగా) ఆమె భర్త కొడితే చేసినట్లైతే మీరు కాస్త అర్ధం చేసుకోగలనని రాసారు. అలా కథని చెప్పినా మరొకరు ఒప్పుకోకపోవచ్చు గదా..
      3. నా చిన్నతనంలో ఈ కథ రాయటంలో ఉన్న ప్రేరణ వర్గ దృష్టి. (అప్పటికి నాకు వర్గదృష్టి అంటే పేద ధనిక అనే ఆర్ధిక వ్యత్యాసం మాత్రమే). కాస్త చిలుము(పైసా) వదిలితే బ్రాహ్మణ పిల్లే దొరుకుతుందన్నది మా కుటుంబాలలో విన్న మాట. బ్రాహ్మణ పేద ఖరీదు రూపాయనుకుంటే అబ్రాహ్మణ పేద ఖరీదు అణా అని వారు ఖరీదు కట్టినట్టు నాకు అర్ధమయింది. ఇలాంటి పేరుతోనే మరో కథ రాసాను. ఎ మేటరాఫ్ స్మాల్ కాన్షస్నెస్ అని మరో కథ అది. కథలు అచ్చొత్తించటమనే నేరం 14 ఏళ్ల వరకూ చెయ్యలేదు. ఆ నేరం జరిగి పోయాక కమ్యూనిస్టు స్నేహితులు నా బ్రతుకులో ప్రవేశించారు. వారికి ఆకథ చూపిస్తే మీకన్నా ఎక్కువగా కొట్టింనత పనిచేసారు. దళిత మహిళ చైతన్యమంటే తిరగబడటమే అని నేను బ్రాహ్మణుడిని కావటం వల్ల ఆ విషయం పట్టుకోలేక పోయాననీ నాలోని అన్యవర్గ భావజాల ప్రభావాన్ని ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలనీ చెప్పారు. 50 ఏళ్ల క్రితమే నేనెటున్నా వాళ్లకి కావలసిన “సత్యాలు” మాత్రమే చెప్పాలని, నా అభిప్రాయాలు మాత్రం చెప్పరాదనే ఎరుక కలిగింది. కాని ఆ ఎరుక నాలో స్థిరంగా నిలవలేదు.
      4. ఇప్పుడు ఆ కథ ఏదో సందర్భవశాత్తూ గుర్తు వస్తే తిరిగి రాసాను. వర్గదృష్టితో బాటు అస్తిత్వం అనే కొత్త కోణం చేరటం నాకే వింతగా అనిపించింది.
      5. సాహిత్యకారణాలు ఆలోచించాక సామాజిక కారణాలు(మీ ఆగ్రహం వెనక) ఆలోచించాలని ప్రయత్నించాను.
      6. ఆకథని గుర్తు చేసిన ఖదీర్ దీన్ని దయతో అచ్చోసిన(నిజానికి ఇది అచ్చవలేదు) అఫ్సర్ అనే పేర్లని బట్టి వారు ఇస్లాం మతానికి చెందినవారు. “దానికి కారణం సారంగలోని సత్సాంగత్యపు గంజాయి తాగి తురకల సాంజాతములోనుంచి పుట్టుకొచ్చిన పిచ్చకి పరాకాష్ట లా ఉంది అనిపిస్తోంది..” అని మీరు అభిప్రాయపడ్డారు. దానిని బట్టి ఈ కథ రాయటంలోనూ దీనిని రాయించటంలోనూ దీనిని అచ్చోయించటంలోనూ ఖదీర్ అఫ్సర్ అనే వారు నాతో బాటు సమాన భాగస్తులని మీరు అంటున్నట్టు అర్ధమయింది. నాకథకి లేదా అందులో పిచ్చి ఉంటే దానికి నేను బాధ్యుడని. నేను హిందూమతంలో నా ప్రమేయం లేకుండా పుట్టినా హిందూమతం లెక్కల ప్రకారం నేను హిందువునే. (ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన మతాలన్నీ(నాస్తికత్వం, బౌద్ధం, జైనం, వైష్ణవం, శైవం) హిందూమతమే అనేది ఇటీవల స్థిరపరచిన లెక్క.) ఇస్లాం మతస్తులకి హిందూ మతం పట్ల తప్పనిసరి ద్వేషం ఉండాలన్న ఊహ వర్తమానంలో చలామణీలో ఉంది. కనక నా కథలోని లోపాలకు లేదా మీకు నచ్చని అంశాలకు అన్యమత భావజాలం కారణ మనే ఊహ మీకు కలిగి ఉండవచ్చు. దీనిని నేను సామాజిక కారణం అంటున్నాను.
      7. సామాజిక కారణాలు అనేవి గురజాడ నుంచి అచ్చులో సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యక్తి తనకు తెలిసిన జీవితం నుంచి తనకి నచ్చిన, నచ్చని అంశాలకు స్పందించి సాహిత్యరూపంలో చెపుతుండటం అనాదిగా మానవ జీవితంలో కూడా ఉంది. అలా తన కులం గురించో మతం గురించో వ్యక్తులు తమ అసమ్మతిని తెలియజేయటం నుంచే భక్తి, శ్రమణ, వైష్ణవం, వీరశైవం వంటివి పుట్టాయి. జనం వాటిని అక్కున చేర్చుకున్నారు. తన జీవితం నుంచి రాయటం ద్వారా తన కుల మతాలకి అవమానం అప్రదిష్ట అని కొందరు ఆవేశపడినా (దానికి ఇస్లాం, క్రైస్తవం మినహాయింపు కాదు) వ్యక్తి ఆలోచించకమానడు. రాయకమానడు.
      8. వ్యక్తిగతంగా నాలో అన్యవర్గ భావజాలాన్ని చూసిన మిత్రులూ ఉన్నారు. అన్యమత భావజాలాన్ని చూసిన మీవంటి మిత్రులూ ఉన్నారు. రచయితలు రాస్తారు. దానిని ఖండించవచ్చు. నిరాకరించవచ్చు. కాని మీబోటి వారికి(బహుశా) నచ్చని భావజాలం వారు చేసిన పద్ధతిలోనే మీరూ నాకథని వదిలి నన్నూ అంతకన్నా నా స్నేహితులనూ తప్పుపట్టటం సబబు కాదుగదా!?
      9. మీచేత ఆలోచింపజేయగలిగితే ఈ వయసులో ఇన్ని గంటలు ఈ రాతకి వెచ్చించిన ఒక సామాన్యమానవుని వేదనకి కాస్త గుర్తింపు లబించినట్లవుతుంది. దయచేసి వారి పట్ల మీ అభియోగాన్ని వెనక్కి తీసుకుని నన్ను దోషిని చేస్తే కృతజ్ఞుడిని.
      10. మన పిల్లాడు మంచాడే పక్కపిల్లల సాింగత్యమే కారణ మనేది చాలా మామూలుగా కలిగే ఆలోచన. కాస్త ఆలోచించితే అది సరైనది కాదని మనకే సులువుగా తెలుస్తుంది. కనక వారిని దోష విముక్తులని చేయండి.

      • మీరొక సారి రాసిన కధకు ఎలా అతుక్కుని కూర్చున్నారో నేను కూడా అంతే.. సంస్కారవంతమైన మీ సమాధానం నాకు నచ్చింది కానీ వివరణ మాత్రం తాటి చెట్టు ఎందుకు ఎక్కావు మిత్రమా అంటే దూడ గడ్డి కోసమే అనేది పాత నానుడే..సాధ్యాసాధ్యాలు మీద నా వివరణ ఇవ్వడం జరిగింది..మీ కధ అతుకుల బొంత లా ఉంది తప్పా నిజాయితీగా సూటిగా రాలేదు..ఉదాహరణ బుడంపెట్ కాకినాడలో వచ్చినది..ఎప్పటినుంచి..మీకు మరి కొద్ది మంది మిత్రులు కూడా సూచించారు కధా కాలాన్ని అంచనా వేసి. ఈ మధ్య కాలంలో సాహిత్యం ఓ దరిద్రపు గొట్టు ఒరవడి అందుకుంది..చలం రాజేశ్వరి మనోగతం వర్ణించేటప్పుడు సాహిత్యాభిమానులకు ప్రతీకల్లో ఆమె ఆలోచనల్లో ఉన్నతత్వం కనిపిస్తుంది.. బాధా అనాటి సమాజం ఎలా ఉండేది అనే వివరణ చాలా సున్నితంగా ఇస్తారు..ఆ రచనా శిల్పం మీలో లేదు..మీలో ఉన్నది కేవలం ఓ పరిపూర్ణమైన శూద్ర సంభాషణమే తప్ప రచనా శిల్పం కాదు..ఓ సాహిత్యాభిమాని సాహిత్యం నుంచి ఓ అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శిల్పాన్ని వెతుకుతాడే తప్పా నాలుగు ఐదు కధల అతుకుల బొంత వెతకడు…శరత్ రాస్తూ దేవదాస్ నవల చివర్న ఇలా అంటాడు ఇలాంటి అభాగ్యులు మీకు జీవితంలో ఎదురైతే వారి కోసం ఓ రెండు కన్నీటి చుక్కలు రాల్చండి. మీ కధలో పాత్రలు చెయ్యాల్సిన దరిద్రాలు చేసేసి దాలి గుంట కుక్క వైరాగ్యం కనబరిస్తే..జాలి కాదు కదా

        మీరు రాసిన కధలో ప్రధాన లోపం చాలా సమస్యలు ఒకే వ్యక్తిలోను చూపించడానికి చేసిన చిల్లర ప్రయత్నం.. అది కేవలం పాశ్చాత్య కధలని చూసి పెట్టుకున్న వాతలే.. అక్కడి సమాజం వేరు మన సమాజం వేరు..కిరాతకత్వం వేరు, స్త్రీని అణగదొక్కడం వేరు, మూఢ నమ్మకాలు వేరు…పిల్లల కోసం అక్రమ సంభంధాలు పెట్టుకోవడం వేరు…ఆ రోజుల్లో నిమ్న కులాలు మతాలు ఇంకా మారలేదు..మతాలు మారడం అనే దౌర్భాగ్యం ఇంకా తూర్పు గోదావారి జిల్లాలలోకి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాలేదు..మద్రాసు నుంచి విడిపోయాక వచ్చింది…

        ఇలా చెప్పుకుంటూ వెడితే ..చాలా అభూత కల్పనలు కనిపించాయి. మీరు చాలా విషయాలు ఒకే సారి ఒకే కధలో చెప్పడానికి ప్రయత్నించడం మీ ప్రధాన లోపం.

        ఇంక అఫ్సర్ కానీ ఖాదిర్ కానీ నైతికంగానే కాదు భావ పరంగా కూడా చాలా తక్కువ స్థాయి కధలు వివాదాస్పదం కావాడానికి తద్వారా మ కధలకి లేదా తమ సంపాదకత్వంలో వచే పుస్తకాలకి పత్రికకి ఒక వాణిజ్యపరమైన విజయమే కాకుండా విషపూరిత భావ జాలం హిందూ సమాజంలో అంతర్లీనం గా చొప్పించే కిరాతకత్వం తమ ఆత్మ న్యూనతతలోనుంచి పుట్టుకొచ్చిన దృగ్విషయమే తప్పా వేరు కాదు..వారికి వారి బ్రతుకు పై అసంతృప్తి..ఆ అసంతృప్తిని ఇలా రాసి అక్కసు తీర్చుకుంటారు..అంతే కాదు..ఎంచుకునే అంశాలే వారి స్థాయి ని తెలియ చేస్థాయి. ఇక పోతే మీ స్థాయి ముందు నుంచి అదేనని పత్రికా ముఖంగా ఒప్పుకున్నందుకు మీకు నా అభినందనలు..

        నిజమే నాలో కూడా ఓ అసంతృప్తి కోపం బాధ ఉందనే మీ మాట నిజమే ..నేను శ్రీ శ్రీ గారి 70 వ పుట్టిన రోజుల్లో ప్రముఖ సాహితీ పరులను అరడుగు దూరం నుంచి చూసి..సాహిత్యానికి దూరంగా తొలగి పోయాను.. ఇప్పటికీ అవే పోకడలు..మాధ్యమం మారింది తప్పా మనుషులు విలువలు పాతాళంలో ఉన్నాయి..వారిలోని అనైతికత్వం అందరికీ అంట గట్టడేఅ కాదు అసలు మన బ్రతుకులన్నీ అంతే అన్నట్టు సాహిత్యాన్ని మార్చి రాస్తున్నారు..అది చూసి చాలా దిగులుగా ఉంది..

        ఒక వయసులో గూఢ చారి పుస్తకాలు చదివే వాళ్ళం. బూతు పుస్తకాలలో ఆ వర్ణనలు చదివి ఏదో అసంతృప్తులకి గురి అయ్యేవాళ్ళం. కానీ మమ్మలని ఆ కాలంలో కాస్త మంచి దారిలో పెట్టినది గురువులు వారు నీయమంగా నిష్టగా నిబద్ధతతో మంచి విలువలు భోధించడం మూలంగా అవన్ని కొంత కాలమే అని నిజంగా జీవితంలో ఓ స్థాయి సంపాదించి కుటుంబ జీవితంలో సమాజంలో మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు తెచ్చుకో గూడదు అనే దృక్ఫధం మాలో పెంచి పోషించారు.. రాను రాను…గత 10 నుంచి 20 ఏళ్ళల్లో ..సాహిత్యం గుడ్డలూడ దీసుకుని నృత్యం సాగిస్తోంది… సాహిత్యమే కాదు మొత్తం సమాజం ..దానికి భాధ్యులు మీరంతా అని నా ప్రగాఢ నమ్మకం..

        ముందు మీలో ఉన్న అసంతృప్తులను సూటిగా మానసిక నిపుణులతో చర్చించండి.. అప్పుడు అఫ్సర్ ఎంత గొప్ప వాడో ఖధీర్ లో అసలు లోపం ఏమిటో.. ఎప్పుడైనా ఆలోచించారా..నాకు వీళ్ళే కాదు వేదాలు చదివేసి ప్రవచనాలు ఇచ్చే వారు కిచిత్ గర్వాన్ని కూడా జయించలేనంత అహంభావంలో కొట్టుకు పోయే కుడి వైపు వర్గం వారన్నా అంతే చులకన భావం..అవినీతి పరులతో అంట కాగుతూ..ప్రజలకి మాత్రం ప్రవచనాలు ఇచ్చేస్తే ఎలాంటి సందేసాలు వీరు సమాజానికి చేర వేస్తున్నారు అనేది పశ్నిస్తే వెలి వేసిన సందర్భాలే ఎక్కువ…
        అంతెందుకు మీ ఖదీర్ కి కానీ అఫ్సర్ కి కానీ వారి కవితలపై నా విమర్శని తట్టుకోగల ధైర్యం ఎప్పుడూ లేదూ.. మీరంతా అసంతృప్తులతో బ్రతుకుతూ రాతలో ఆ విషాన్ని కక్కేస్తూ..సాధించ దలుచుకున్న పరమార్ధం ఏమిటి..ఏ వెలుగులకు మీ ప్రస్థానాలు ?????? నాదే ఆఖరి వాక్యం కానక్కరలేదు. I know I may not get answer..but people are the best judges.. Let us see..

      • కధలెందుకు? విమర్శలెందుకు??

        వివినమూర్తి గారు చాలా సభ్యతగా ఒక రచయితలా నిజాయితీగా స్పందించినా, నాకెందుకో నచ్చలేదు..

        ఏదో వెంటనే సమాధానమిచ్చినా…. కొన్ని విషయాల మీద, నేను సరిగ్గా నా భావం వ్యక్తీకరించ లేదు అని నాకర్ధమయ్యింది ఆవేశం దిగాకా..!!

        ఇది కేవలం నా దృష్టి కోణం నుంచి మాత్రమే… ఈ సమాధానం అందరికీ నచ్చనక్కరలేదు..నా గోడ మీద నానా జాతి సమితి లాంటి మెధో మిత్రులు అన్ని వర్గాలు కులాలు మతాల నుంచి ఉన్నారు…

        ఓ రచయిత భావజాలాన్ని బట్టి ఆయన ఏ వర్గమో అంచనాకి రాగలము..అలాగే నేను కుల పరంగా స్పందించానా లేక వర్గ పరంగా స్పందించానా అంటే నాకున్న అవగాహన బట్టి స్పందించాను.. కాకపోతే నా స్పందన మీద మీరంతా నిర్ధాక్షిణ్యంగా దండెత్తండి..నేర్చుకుంటాను (నాకు నచ్చినది కనబడితే) నా ఆలోచనా ధోరణిలో లోపాలు సరిగ్గా చూపించ గలిగితే..తప్పకుండా.. నేర్చుకోవడం అనేది జీవితంలో అన్ని వేళలా మంచిదే..

        మూర్తి గారు:
        1) దీనినుంచి నాకు అర్ధమైనదేంటంటే ఒక అరుదైన సంఘటన కథగా చెప్పకూడదు. చెపితే అది ప్రతీఇంట్లో జరిగే భాగోతమే అనిపిస్తుంది.
        నా వివరణ:
        మీరు రాసిన విధానం బట్టి కృఇష్ణ వేణి చారి అనే రచయిత్రి తన గోడ మీద రాసిన విషయం ఆ రోజుల్లో బహుశా ఇది ప్రతీ పల్లెటూరులో జరిగే భాగోతమే కదా…
        అంటే ఒక పట్టణ వాసం లో పెరిగిన వ్యక్తి మీరు రాసిన కధలో సరి అయ్యిన అవగాహన కోసం ప్రయత్నించకుండా ఒక మూస ధోరణిలోకి వెళ్ళడం..నా కళ్ళ ముందు కనిపించిన నిజం… సాటి సాహితీ పరులనే విస్మయ పరిచి మూస ధోరణిలోకి నెట్టి వేసిన మీ కధా కధనం ఆక్షేపించడం అభియోగం కాదు అభిశంసించడమే..

        మూర్తిగారు
        2.నేనర్థం చేసుకున్నది సరైనదే అయితే మీ అభియోగం గురించి మాటలాడవలసిఉంది.
        అయితే అరుదైన ఘటన కథకి పనికిరాదా?
        వివరణ: రాసే విధానం బట్టి ఒక కాలంలో ఇలాగే జరిగేవి అని భావం నాటడం ఎంత వరకు సమంజసం దాని ద్వారా సమాజంలో ఎటువంటి అవగాహన చొప్పిస్తున్నారు అనేదే నా దృష్టి దృక్ఫధం..
        మూర్తి గారు:
        3 నేను అర్థంచేసుకున్న కథా వ్యాకరణం మేరకు సాధారణం, విశేషం అనే విభజన ఉంది. కథలో ఘటన ఉంటుంది. అలాగే అది వ్యక్తం చేసే మౌలికాంశం ఒకటుంటుంది.
        ఘటన మౌలికాంశం రెండూ సాధారణమయే కథ ఒకకోవ.
        రెండూ విశేషమైనవైతే అది మరో కోవ.
        ఘటన అరుదైన లేదా విశేషమైనదైతే వ్యక్త మౌలికాంశం సాధారణమైనదైతే అది వేరోక కోవ.
        ఘటన సాధారణమైనదై వ్యక్త మౌలికాంశం విశేషమైనదైతే అది ఇంకో కోవ.
        నాకథ ఈ అవగాహన ప్రకారం మూడవ విభజనకి చెందినది.
        వివరణ: నిజం చెప్పాలంటే మీరు మీ దృష్టిలోనుంచి వ్యక్తీకరిస్తున్నారు అంతే…రాం గోపాల్ వర్మలా…

        మూర్తి గారు:
        ఈ అరుదైన ఘటన ద్వారా రచయితనైన నేను వ్యక్తం చెయ్యటానికి ప్రయత్నించినదేమిటి
        1. మానవుని నిస్సహాయత. లేదా వ్యక్తి నిస్సహాయత. తనకున్న తెలివితేటల మేరకు అన్నపూర్ణమ్మ 80 ఏళ్ల క్రితం అలా చేసింది. తన భర్తని చేతిలో పెట్టుకోవాలనో కాస్తంత సామీప్యత సాధించుకోవాలనో చేసింది. అసలు అలా భర్తని సంపాదించుకోవాలనుకునే స్థితి ఆనాటి సమాజంలో లేదని మీరూ అనలేరు. అలా భర్తని సంపాదించుకోమని చెప్పే కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. ఆమాత్రం మొగుడిని కైవశం చేసుకోలేకపోయావా అంటూ ఆడదానినే తప్పుపట్టటం ఇప్పుడు కూడా మనం చూడగలం.

        వివరణ: అన్నపూర్ణమ్మ పాత్ర మీరు అలా వ్యక్తీకరించలేదు..మొదటి నుంచి చివరి దాకా. చివరికి ఏసోబు కూడా లంజా అనే విధంగానే చిత్రీకరించారు..అంటే..అక్కడే మీ మేధో తనం కాదు మీ దృష్టిలో అన్నపూర్ణమ్మ ఏమిటి అనేది..ప్రతీ వాక్యంలోనూ స్పష్టమే..ఆమె నెర జాణ..(బహు నేర్పరి..సతీ సుమతి తో పోల్చుకోని సమాధాన పడ గలదు..కానీ సతీ సుమతి పాలేర్లతోనో ఇతర మొగాళ్ళతోనో పడుకుందా అనేది మాత్రం చెప్పరు…మీ ఇష్టం వచ్చినట్టు పాత్రలని ఆడిస్తారు ఇది పూర్తిగా మీ అవగాహనే కానీ పాత్ర కానే కాదు కధ అయ్యితే.
        ఇక వాస్తవమైతే…అన్నపూర్ణమ్మ మనస్తత్వం చాలా ప్రతీకార స్వభావు రాలు కిరాతక మనస్తత్వమే..తప్పా జాలి పడ వలసిన పని లేదు అన్నట్టుగా చిత్రీకరించారు…లోపం మీదే..ఏ విధం గా చూసినా)..

        మూర్తి గారు:
        2. వ్యక్తి దైహిక అవసరాలు కలిగించే నేరాలు. అన్నపూర్ణమ్మ దైహిక అవసరం ఈమధ్య వరకూ సాహిత్యంలో కూడా చర్చకి కూడా నోచుకోలేదు. ఇప్పటికీ ఆ అన్నపూర్ణమ్మల లేతభుజాల మీద బాల్యం నుంచీ.. కుటుంబం కులం వంశం ఇటీవల మతం వంటి వాటి గౌరవ భారం .. మగ దృష్టి మోపుతూనే ఉంది.

        వివరణ:
        పచ్చి అబద్ధం. మీ కన్నా ఎంతో మంది ఎన్నో రకాలుగా చాలా చక్కటి రచనా శిల్పాలలో వ్యక్తీకరించారు ఎంతో సంస్కారవంతంగా…ఇంక మీరు అన్నపూర్ణమ్మ పాత్ర చిత్రీకరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది.. మీరు చూసిన అరుదైన సంఘటనలో ఆవిడ వ్యక్తిత్వం అదే అయ్యితే ఆవిడకి సమాజం మీద గౌవురవం లేదు..(ఉండక్కర్లేదు).. వాటిని అవసరానికి వాడుకుంటన్నట్టుగా చిత్రీకరించారు…అంటే ఇక్కడ అన్నపూర్ణమ్మ కాదు మీలో ఆడ వారికి దేహిక అవసరాలు ఉంటాయి కాబట్టి వారు జారత్వం జాణ తత్వం ప్రదర్శిస్తారు అన్నట్టుగా తేల్చి పారేసారు..అదేదో గొప్పగా చర్చినట్టుగా భావిస్తున్నారు కానీ మీరు చేసినది సుద్ధ దగుల్భాజీ భావ ప్రకటనే..ఆడ వారి సమస్యలని వాళ్ళనే రాయనివ్వండి అని ఒల్గా గారు అంటే అప్పుడు అర్ధం కాలేదు..కానీ మీలాంటి ఖదీర్ అఫ్సర్ లాంటి తీవ్ర వాద రచయితలని చూసాక..ఆవిడ చెప్పిన దానిలో అసలు విషయం అర్ధమయ్యింది..ఓల్గా గారూ జయప్రభగారు ముందు పాస్చాత్యులని చూసి వాత పెట్టుకున్న..తరువాత వారిలో నిజమైన స్త్రీ వాదం మేల్కొని అది ఒక జ్వాలగా మారి తెలుగు సాహిత్యాన్ని దహించింది అనే చెప్పాలి..కానీ ఆ జ్వాల మీది కాదు కాబట్టే మీ రచన అలా ఏడిసింది.. ఓ చవక బారు రచనలా..

        మూర్తిగారు:
        ఇక ఆమె నేరం (మీరు అన్నట్లుగా) ఆమె భర్త కొడితే చేసినట్లైతే మీరు కాస్త అర్ధం చేసుకోగలనని రాసారు. అలా కథని చెప్పినా మరొకరు ఒప్పుకోకపోవచ్చు గదా..
        వివరణ: సాధ్యా అసాధ్యాల మీద వివరణే తప్పా నా ఒప్పుకోలు మీద చర్చ కాదు.. అది మరిచిపోతున్నారు..

        మూర్తిగారు:
        3. నా చిన్నతనంలో ఈ కథ రాయటంలో ఉన్న ప్రేరణ వర్గ దృష్టి. (అప్పటికి నాకు వర్గదృష్టి అంటే పేద ధనిక అనే ఆర్ధిక వ్యత్యాసం మాత్రమే). కాస్త చిలుము(పైసా) వదిలితే బ్రాహ్మణ పిల్లే దొరుకుతుందన్నది మా కుటుంబాలలో విన్న మాట. బ్రాహ్మణ పేద ఖరీదు రూపాయనుకుంటే అబ్రాహ్మణ పేద ఖరీదు అణా అని వారు ఖరీదు కట్టినట్టు నాకు అర్ధమయింది. ఇలాంటి పేరుతోనే మరో కథ రాసాను. ఎ మేటరాఫ్ స్మాల్ కాన్షస్నెస్ అని మరో కథ అది.

        వివరణ: ఇలాంటి సంస్కారమున్న రచయితలనుంచి వచ్చే కధలు ఎలా ఉంటాయి అనేదే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.
        ఇక్కడ మీరు మీ కులానికి సంబంధించి వాడాను కాబట్టి తప్పులేదు అనుకుని స్వేచ్చగా వాడేస్తున్నారు కులాల పేర్లు..ఏ కులానికి చెందిన స్త్రీ కూడా ఒప్పుకోదు మీ భావ వ్యక్తీకరణ..ఇది పుర్షాధిపత్య భావజాలపు నికృష్ట రచన. అంతే కాదు ఇలా రాయడం ద్వారా మీ సంస్కారం మీ ఆలొచనా విధానం స్త్రీల మీద మీకున్న భావ వ్యక్తీకరణ..ఏ వర్గానికి చెందినా ఏదో ఒక ధరతో ఒప్పించ వచ్చును అనే భావం…చాలా హేయం ఘోరం…
        నేను కుంచెం అతిగా స్పందించానా అని అనుకున్నాను కానీ ఇది చదివాకా మీ భావ వ్యక్తీకరణ మీద ప్రజా కోర్టులోకి మిమ్మల్ని నిల బెట్టాలి..

        మూర్తిగారు:
        కథలు అచ్చొత్తించటమనే నేరం 14 ఏళ్ల వరకూ చెయ్యలేదు. ఆ నేరం జరిగి పోయాక కమ్యూనిస్టు స్నేహితులు నా బ్రతుకులో ప్రవేశించారు. వారికి ఆకథ చూపిస్తే మీకన్నా ఎక్కువగా కొట్టింనత పనిచేసారు. దళిత మహిళ చైతన్యమంటే తిరగబడటమే అని నేను బ్రాహ్మణుడిని కావటం వల్ల ఆ విషయం పట్టుకోలేక పోయాననీ నాలోని అన్యవర్గ భావజాల ప్రభావాన్ని ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలనీ చెప్పారు. 50 ఏళ్ల క్రితమే నేనెటున్నా వాళ్లకి కావలసిన “సత్యాలు” మాత్రమే చెప్పాలని, నా అభిప్రాయాలు మాత్రం చెప్పరాదనే ఎరుక కలిగింది. కాని ఆ ఎరుక నాలో స్థిరంగా నిలవలేదు.

        వివరణ: మీ మిత్రులు ఓ గుడ్డి భావజాలంలో కొట్టుకు పోతున్నారు ..మిమ్మల్ని కూడా లాగడానికి ప్రయత్నించారు మీరు ఏదో ప్రలోభాలకి పడ్డారు…
        అది మాకనవసరం. మీ అపరిపక్వ భావ వ్యక్తీకరణ సమాజానికి చేటు. అదే నా అభిప్రాయం మీ కధ చదివాకా..
        ఎందుకంటే మీరు రాసినది మీ సృష్టి తప్పా ఒక సంఘటనకి సాక్షిగా రాయలేదు..ఆమె మనసులోకి దూరారు..అదే మీ తప్పు…అక్కడే మీరు మాకు (విమర్శకులకు) దొరికిపోయారు..

        మూర్తిగారు:
        4. ఇప్పుడు ఆ కథ ఏదో సందర్భవశాత్తూ గుర్తు వస్తే తిరిగి రాసాను. వర్గదృష్టితో బాటు అస్తిత్వం అనే కొత్త కోణం చేరటం నాకే వింతగా అనిపించింది.

        వివరణ: మీ పైత్యాలని మా మీద రుద్ద కండి.. ముందు ఓ రామాయణమో భారతమో చదవండి ..ఒక రచనా శిల్పం సామాజిక భాద్యత అది యుగయుగాలుగా నిలబడే రచనగా రూపొందడానికి కారణం అర్ధమవుతాయి..
        అదే మీలోనూ మీ మిత్రులలోనూ లోపించిన వితరణ మరియూ విచక్షణ..

        మూర్తిగారు:

        5. సాహిత్యకారణాలు ఆలోచించాక సామాజిక కారణాలు(మీ ఆగ్రహం వెనక) ఆలోచించాలని ప్రయత్నించాను.
        6. ఆకథని గుర్తు చేసిన ఖదీర్ దీన్ని దయతో అచ్చోసిన(నిజానికి ఇది అచ్చవలేదు) అఫ్సర్ అనే పేర్లని బట్టి వారు ఇస్లాం మతానికి చెందినవారు. “దానికి కారణం సారంగలోని సత్సాంగత్యపు గంజాయి తాగి తురకల సాంజాతములోనుంచి పుట్టుకొచ్చిన పిచ్చకి పరాకాష్ట లా ఉంది అనిపిస్తోంది..” అని మీరు అభిప్రాయపడ్డారు. దానిని బట్టి ఈ కథ రాయటంలోనూ దీనిని రాయించటంలోనూ దీనిని అచ్చోయించటంలోనూ ఖదీర్ అఫ్సర్ అనే వారు నాతో బాటు సమాన భాగస్తులని మీరు అంటున్నట్టు అర్ధమయింది. నాకథకి లేదా అందులో పిచ్చి ఉంటే దానికి నేను బాధ్యుడని. నేను హిందూమతంలో నా ప్రమేయం లేకుండా పుట్టినా హిందూమతం లెక్కల ప్రకారం నేను హిందువునే. (ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన మతాలన్నీ(నాస్తికత్వం, బౌద్ధం, జైనం, వైష్ణవం, శైవం) హిందూమతమే అనేది ఇటీవల స్థిరపరచిన లెక్క.) ఇస్లాం మతస్తులకి హిందూ మతం పట్ల తప్పనిసరి ద్వేషం ఉండాలన్న ఊహ వర్తమానంలో చలామణీలో ఉంది. కనక నా కథలోని లోపాలకు లేదా మీకు నచ్చని అంశాలకు అన్యమత భావజాలం కారణ మనే ఊహ మీకు కలిగి ఉండవచ్చు. దీనిని నేను సామాజిక కారణం అంటున్నాను.

        వివరణ :
        మీరూ నేనూ కూడా హిందూవులం కాదు హిందూవుల గురించి మాట్లాడే అర్హత మనకి లేదు.. మనం సంకర జాతి (భవ జాలమే కాదు బ్రతికే విధానం కూడా) మనుషులం..అవసరాన్ని బట్టి ఆయా వేళలకి అనువైన ధర్మాన్ని న్యాయాన్ని మార్చుకుంటూ బ్రతుకుతాము..నిజమైన ఇస్లాం మతస్తులు కానీ క్రీస్తవ మతస్థులు కానీ మనని హేతు వాదులగా భావిస్తారు తప్పా హిందూవులుగా భావించరు.. మిగతా విషయాలు మీరు రాసినవి మీ కమ్యూనిస్టు మిత్రుల పైత్యాలు తప్పా నిజాలు కావు. మీదొక తీవ్ర భావ జాలము దానికి మీకు తెలుసున్న పదాలు అంటగడుతున్నారు తప్పా నిజాలు కావు..

        మూర్తి గారు:
        7. సామాజిక కారణాలు అనేవి గురజాడ నుంచి అచ్చులో సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యక్తి తనకు తెలిసిన జీవితం నుంచి తనకి నచ్చిన, నచ్చని అంశాలకు స్పందించి సాహిత్యరూపంలో చెపుతుండటం అనాదిగా మానవ జీవితంలో కూడా ఉంది.
        వివరణ;
        ఇదో వితండ వాదం.. గురజాడ గారే కాదు భారత దేశంలో రామయణ కాలం నుంచి ఉంది..వాల్మీకి ఓ బోయ వాడు నాగరీకుడయి..సమాజం మీద తనకున్న అవగాహన తాను చూసిన ఓ రాజు చరిత్ర..ఎంతో చక్కగా వివరించి యుగ యుగాలుగా మిగిలిపోయే రచన చేసాడు. అలాగే వేద వ్యాసుడు మత్స్య కన్య.కడుపున పుట్టిన అక్రమ సంబంధ సంతానం.. సంతానం లేక పోతే ఎదుటి వారితో సంపర్కం పెట్టుకోడం చరిత్రలో అందరూ అంగీకరించిన విధానమే… ప్రాతివత్యం వేరు, సంతానం కలిగించుకోవడం వేరు, భర్తతో ప్రేమగా జీవించడం వేరు అనేది .ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది..సాహిత్యంలో వాటిని పుక్కిట పురణాలుగా వ్యక్తీకరించే భావజాలం లో పుట్టిన కలుపు మొక్కలతో చేరి..మీరు మీ అస్తిత్వం కోల్పోయారు అనేది నా భావం..

        మూర్తిగారు …
        అలా తన కులం గురించో మతం గురించో వ్యక్తులు తమ అసమ్మతిని తెలియజేయటం నుంచే భక్తి, శ్రమణ, వైష్ణవం, వీరశైవం వంటివి పుట్టాయి. జనం వాటిని అక్కున చేర్చుకున్నారు. తన జీవితం నుంచి రాయటం ద్వారా తన కుల మతాలకి అవమానం అప్రదిష్ట అని కొందరు ఆవేశపడినా (దానికి ఇస్లాం, క్రైస్తవం మినహాయింపు కాదు) వ్యక్తి ఆలోచించకమానడు. రాయకమానడు.

        వివరణ: ఆలోచించే మనిషికి ఆలోచన ఆపుకున్న మనిషికి తేడా ఉంటుంది. నూటికి 10 శాతం తప్పా ఈ రోజుల్లో ఆలోచించే తీరిక లేదు..అనుకరించుకుంటూ బ్రతుకు బండి లాక్కోవడం తప్పా ఎవరికి తమ సంస్కృతిక మూలాలు నాగరికతల గురించి పూర్తి అవగాహన లేవు..అవన్ని కడుపునిండాకా ఆలోచిస్తారు.. అంత వరకు జన ప్రవాహంలో కొట్టుకు పోతూ బ్రతుకు ప్రయాణం సాగిస్తారు.. భౌతిక అవసరాలు తీరాకనే.. మిగతావి అనేది ఎల్ల కాలంలోనూ సత్యమే…కానీ నేటి యువతరం మీకన్నా తెలివైన వారే.. భౌతిక అవసరాలకే పరిమితమయ్యి పోతున్నారు..అదే ముఖ్యం అనుకునేలా రాం గోపాల్ వర్మ లాంటి వారు దోహద పడుతున్నారు… కానీ మనిషిలో ఉండే మౌలికమైన…స్వభావం ఆలోచించడం అది ఎప్పుడూ ఆగదు ఏదో ఒక నాటికి ప్రతీ వారు తాము చేసిన పనిని జీవించిన జీవితాన్ని ఒక సారి ఆలోచించుకుని భిన్నంగా బ్రతకడానికో లేదా మరింత ఉన్నతంగా (దీనికి కొలమానం లేదు ఇదివరకు కన్నా అంటే సరిపోతుంది సాపేక్షంగానే మిగిలిపోతుంది ఈ ఉన్నతం ఎప్పుడూ).. ఈ సంఘర్షణలలోనుంచి వివ్ధ కళా రూపాలు సంతరించుకుని భావ వ్యక్తీకరణ అస్తిత్వంతోనే మొదలవుతుంది విస్తరిస్తూ పోతూ ఉంటుంది..

        మూర్తి గారు:
        8. వ్యక్తిగతంగా నాలో అన్యవర్గ భావజాలాన్ని చూసిన మిత్రులూ ఉన్నారు. అన్యమత భావజాలాన్ని చూసిన మీవంటి మిత్రులూ ఉన్నారు. రచయితలు రాస్తారు. దానిని ఖండించవచ్చు. నిరాకరించవచ్చు. కాని మీబోటి వారికి(బహుశా) నచ్చని భావజాలం వారు చేసిన పద్ధతిలోనే మీరూ నాకథని వదిలి నన్నూ అంతకన్నా నా స్నేహితులనూ తప్పుపట్టటం సబబు కాదుగదా!?

        వివరణ: మీరు ఇచ్చిన వివరణ బట్టి వారే కారణం అని మరో సారి మీరే చెప్పారు..పైన చూసుకోండి..మీ వివరణ ఇంకో సారి.. వారిని తప్పు పట్టడం లేదు..వారి అవసరాలు వారివి.రచనా వ్యాసంగంలో మీరంతా చెరుక గడ పిప్పి లాంటి వారు తప్పా రసం కానే కారు… మంటలు మండించాడానికి పనికొచ్చే ఉపకరణాలు..తప్పా వంటలు వండడానికి పనికి రారు.. (చెరుకు పిప్పికి అంత నిలబడి కాలే సామర్ధ్యం ఉండదు కాని మంటలు రగిల్చే సమార్ధ్యం ఉంటుంది).

        మూర్తి గారు:
        9. మీచేత ఆలోచింపజేయగలిగితే ఈ వయసులో ఇన్ని గంటలు ఈ రాతకి వెచ్చించిన ఒక సామాన్యమానవుని వేదనకి కాస్త గుర్తింపు లబించినట్లవుతుంది. దయచేసి వారి పట్ల మీ అభియోగాన్ని వెనక్కి తీసుకుని నన్ను దోషిని చేస్తే కృతజ్ఞుడిని.

        వివరణ..: నేను ముఖ చిత్ర పుస్తకంలో గత నాలుగేళ్ళగా మీ మిత్రులతో పోరాటం చేస్తూనే ఉన్నాను..వారితోనే కాదు ఇటు పక్క కుడి వాదులతో కూడా పోరాటం చేస్తూ వెలివేయబడుతున్నాను కాబట్టి నేనే పీడిత వర్గానికి చెందిన వాడిని.. మీరు కానే కాదు..మీ అందరూ నా దృష్టిలో సామన్య మానవుని వేదనని ప్రతిఫలిచే కళా కారులు కాదు..మీ సాడిజంలోనుంచి పుట్టుకోచ్చే పీడితులు సమాజానికి పనికి రారు ఎందుకంటే మీ ఊహల కిరాతకత్వమే తప్పా..నిజమైన సమస్యలు విశ్లేషించి పరిష్కారం చూపించగలన రచనా సామర్ధ్యం మీ ఎవ్వరిలోనూ లేదు..(నాతో సహా)..

        మూర్తిగారు:
        10. మన పిల్లాడు మంచాడే పక్కపిల్లల సాింగత్యమే కారణ మనేది చాలా మామూలుగా కలిగే ఆలోచన. కాస్త ఆలోచించితే అది సరైనది కాదని మనకే సులువుగా తెలుస్తుంది. కనక వారిని దోష విముక్తులని చేయండి.

        వివరణ: ఈ పాటికి మీకర్ధమయ్యి ఉంటుంది.. మీరు మా పిల్లాడు కాదూ కాలేరు కాబోరు..మనకి ఆలోచనల్లో చాలా తేడా ఉంది..మీరు ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు ముందు మీరు నిలబడడానికి ఆధారం చూసుకోండి.. ఆ ఆధారం రచనా వ్యాసంగమైతే ..మిమ్మల్ని అభిమానించే వారికే మీరు ద్రోహం చేస్తున్నట్టు లెక్క…

  • శ్రీనివాస్ గారూ మీ 2వ తారీఖు వ్యాఖ్యకి నేరుగా సమాధానం ఇచ్చే వెసులుబాటు లేదు కనక ఇలా జవాబిస్తున్నాను. మీరు సాహిత్య పరమైన కారణాలతో వ్యాఖ్యానించారని నాకు అర్ధమైంది. సంతోషం. నా ఒక్కని కథ మీదనే కాక ఈనాటి తెలుగుసాహిత్యం మొత్తంపై మీకు అసంతృప్తి ఉందని మీ వ్యాఖ్య చెపుతోంది.మీరు మెచ్చిన చలం వంటివారే ఈనాటి తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులు. వారి సమకాలీనులు కూడా ఆయనని మీలాగే అన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావన్నారు. సరే మీరు కోరుకునే సాహిత్యంకి నా ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఏ అభిప్రాయానికైనా చోటు ఉండాలనుకునే తత్వం నాది. కాకపోతే అభిప్రాయాల మీద పెత్తనం కలంతో సాధించటం సబబు. కాని కర్రతోనో వెనకటిలా కులంతోనో పెత్తనం చేయాలనుకోటం నాకులాగే మీరు ఒప్పరని నేను నమ్ముతున్నాను. ఇంక ఖదీర్ అఫ్సర్ నాకథ విషయంలో వారి పాత్ర నామమాత్రం అనే నా మనవిని మీరు అంగీకరించారు. వారిపట్ల మీ అభిప్రాయాలు ఈకథ సాకుతో చెప్పవలసిన అగత్యంలేదు. వారూ మీరూ నేనూ అందరం ఒకే సమాజంలోంచి వచ్చినవాళ్లం. ఎప్పుడో ఒకప్పుడు మన తాతా వారి తాతా ఒకరే అయిఉండే అవకాశం ఉందని సైన్సు చెపుతోంది. అది నా ఎరుకని బలపరుస్తోంది. ఒకే భూమి నుంచి రకరకాల చెట్లు పుట్టినట్లే ఒకే కుదురు నుంచీ ఒకే సమాజం నుంచీ వచ్చిన వారూ మీరూ నేనూ రకరకాలుగా మన సమాజం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయటం సహజం సర్..
    ఇంక నాకథని నేను అంటిపెట్టుకునే తత్వం నాది కాదు. ఓ రచన వెలువడితే దానిపట్ల పఠితలు చర్చించుకోటం సరైన పద్దతని నేను అనుకుంటాను. మీ గతవ్యాఖ్యకి నేను స్పందించటానికి కారణం మన మిత్రులను నా కథకి బాధ్యులను చేయటం. నమస్కారం

    • శ్రీనివాస్ గారూ
      మీరు చాలా వివరంగా కథలెందుకు విమర్శలెందుకు అనే శీర్షికన రాసారు. ఆసాంతం చదవాను. ఒ కథ రాసిన నేనూ ఎంతో శ్రమపడి సవివరంగా విమర్శించిన మీరూ ఎంత సేపు మాటాడుకున్నా విషయం ఓ కొలిక్కి రాదు. కథపై మీ సాహితీ విమర్శకి రచయితగా నేను సమాధానం ఇవ్వటం నా దృష్టిలో సరికాదని ముందే చెప్పుకున్నాను. నా పాయింటల్లా అఫ్సర్ ఖదీర్ గార్లను ఇందులోకి లాగటం సరికాదన్నదే. మీతో బాటే ఈకథ చదివినవారంటూ ఉంటే వారే మీతో మాటలాడటం సబబు. ఇంతటితో ఈ సంభాషణ నావైపు నుంచి ముగిస్తున్నాను. దయచేసి అర్ధం చేసుకోగలరని నమ్ముతున్నాను.

    • ఈ శ్రీనివాస్ ఎవరో గానీ కొన్నేళ్ళ క్రితం ఈయన వాఖ్యలు చాలా నిక్కచ్చిగానూ హేతుబద్దంగానూ వున్నాయనుకునేవాన్ని. పైన రాసిన వాఖ్యలు మాత్రం తలతిక్కగా తాగి రాసినట్టుగా వున్నాయి.
      దానికి కారణం ఇన్నేళ్లలో అయన మారడమో, నేను మారడమో మరి.
      మీరింత ఓపిగగా ఆయంకు సమాధానాలివ్వడం ప్రయాస, అనవసరం.

      • సరిగ్గా చెప్పారు. “నేను ఇటు కయడి కాదు, అటు ఎడమా కాదు” అని చెప్పుకుంటూనే ఆయన ఎటువైపో చెప్పకనే చెప్పారు. ఆయన భావజాలానికి అనుగునంగా కథలు రాయలేదని బాధ అటుంచి, తమవాడైన మూర్తి గారు తమ సమాజంలో అన్నపూర్ణమ్మ ను సృష్టించడం ఏమాత్రం నచ్చలేదు. అందరూ ఇలా ఉంటే, మనం ఒక గురజాడను, కొకు, రావిశాస్త్రి లాంటి రచయిత లను మనం చదివి ఉండం! కులాలు, మతాలు మేము పాటించడం లేదంటారు. తమ అస్తిత్వం గూర్చి మాట్లాడిన వారిని ఏదో రంగు పూస్తారు. ఏమిటి ఈ ద్వఙద నీతి? రెండు వేల సంవత్సరాలుగా ఇంతేనా? వీళ్లు మారరా?

  • ఒక కథ… రచన… సినిమా… లేదా మరో గానం… లాసం… ఈ సమాజానికి, లేదా చదువరులకి, లేదా శ్రోతలకి, పోనీ వీక్షకులకి ఎంత మంచి ఒనగూరుస్తుంది, ఎటువంటి చెరుపు చేస్తుంది అనిగానీ; అది ఎంత ప్రాచుర్యంలోకి వచ్చింది, లేదా ఎలా నేలమాళిగలకి పరిమితమయ్యింది అని గానీ ఆలోచించను, ఆ సమాచారం నాకు పూర్తిగా అనవసరం. ఆ కథ… లేదా సినిమా… ఆ కళారూపం … నాకు ఏమి ఇస్తున్నాయి- నన్నెంత కదిలిస్తున్నాయి- అన్నంత వరకే నా పట్టింపు.
    (వివినమూర్తి గారి ఈ కథ- “ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్”- శీర్షిక నాకు నచ్చకపోయినా, శీర్షిక విషయంలో రచయిత ఒక self-referential వివరణ ఏదో ఇచ్చినట్టున్నారు కాబట్టి, దాని గురించి ఇక్కడ అప్రస్తుతం).
    మినపబొత్తి కుప్ప చాటున పశువులశాలలో లక్కపిడతలు, బొమ్మల సాక్షిగా పాతమంచం మీద కొనప్రాణంతో నెత్తుటి ముద్దయిన పసితల్లి పుల్లి, పవిత్ర సంసారంలో భాగంగా గర్భాదాన గదిలో ‘రక్తం కొల్లైపోయి..’ అరణ్యరోదనలు చేసిన అన్నపూర్ణమ్మ, పాపాయమ్మ అత్తగారింట కుచేల సంతానంలో పంతులు సవాయికి బలికాబోతున్న పసిబిడ్డలు… నా కళ్ల ముందు కదలాడి, నా గుండెలు బద్దలు చేసి, సమున్నతానుభవం కావల్సిన సంయోగం… సంభోగం – పరమ వికృత మృగ క్రీడగా మారిన దారుణంలో నా మగపుట్టుకల భాగమెంత అనే పరితాపాల, introspection ల అంతశ్శోధనలకి నన్ను పురిగొల్పడం – ఈ కథ సాధించిన విజయం.
    ఒక మగవాడిగా నాలో pedophiliac అంశం ఏదైనా ఉంటే (ఏ అంతఃచేతన.. అథోచేతనల చీకట్లలో ఆ అంశం ఉందేమో అన్న ఊహే వణికిస్తోంది నా చేతనని) – దాన్ని తుదికంటా తుడిచేయడం – ఈ కథ నాకు చేసిన మేలు.
    కథారచయిత వివినమూర్తికి నా కృతజ్ఞతలు

  • వివిన మూర్తి గారి కధ విషయం చెప్పడంలో ఘోరంగా విఫలమై ఓ పర్వర్టెడ్ expression లా మిగిలింది. శ్రీపాద, మల్లాది,చాసో ఇలాంటి కధలు రాసినప్పుడు ఆ పాత్రల మీద సానుభూతి వస్తే, ఇక్కడ అస్లీలం మాత్రమే మిగిలింది. నాకు సబజెక్టు మీద పేచీలేదు కానీ ఏదో లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

  • జీవితం ఏ ప్రక్రియనూ అనుసరించదు, అనుసరించరాదు కూడా. ప్రక్రియ ఏదైనా జీవితాన్ని – ఆ జీవితం ఉన్నది ఉన్నట్టుగా అనుసరించాలి. ఆ విశాలమైన ఖచ్చితమైన దృష్టితో చూసినప్పుడు ఇది మంచి కథ. తళుకుల్ని అద్దకుండానూ ముసుగుల్ని వేయకుండానూ రచయిత తనవైన భావాలూ మొగ్గులూ చొప్పించకుండానూ రాయడం అరుదు. ఆ లెక్కన వివిన మూర్తి గారికి హేట్సాఫ్.

  • “ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్” సారంగ లో ఈ కథ చదివాక నాకనిపించింది ఒక్కటే… “ఎ మేటరాఫ్ లిటిల్ డిఫరెన్స్” ఇది దశాబ్దాల అనుభవాన్ని ప్రోగుచేసుకున్న ఒక సీనియర్ రచయిత యొక్క ఉత్కృష్ట ప్రతిభకూ… తన అనుభవం రాయించిన కథకూ ఉన్న డిఫరెన్స్.
    రచయిత చెప్పిన దానిప్రకారం చిన్నపిల్లల మీద అత్యాచారానికి సంబంధించిన కథ ఇది. వివినమూర్తి గారి లాంటి రచయిత ఇలాంటి సబ్జెక్టు మీద కథ రాశారంటే ఆ కథ భవిష్యత్ లో ఈ సబ్జెక్ట్ మీద వచ్చే కథలకు ఒక రిఫరెన్స్ లా ఉండాలి… “మరి ఈ కథ అలా ఉందా?”. ఒక కథ ఇలా రాయాలి.. ఇలానే రాయాలి. అన్న ఫ్రేంస్ లో ఏ రచయితనీ నిర్భందించలేం. నాకైతే ఆ గ్రహింపు ఉంది. కానీ….
    ఎంపికచేసుకున్న సబ్జెక్ట్ కాలాతీతమైన సబ్జెక్ట్. రాసిన రచయితకి దశాబ్దాల అనుభవం. కాలానుగుణంగా సమాజంలో వచ్చిన ఎన్నో మార్పులని చూసి ఉంటారు. ఏ కథని ఎలా చెబితే పాఠకుల్ని ఆలోచింప చేస్తుందో అన్న సంగతి తనకన్నా గొప్పగా ఇంకొకరికి తెలియక పోవచ్చు కూడా… అయినా కూడా కథలో తాను చెప్పదలచుకున్న విషయం కంటే అన్నపూర్ణమ్మ యొక్క నడవడి ముఖ్యమైన విషయం గా మారిపోయింది.
    రచయిత కథ క్రింద గమనికలో అన్నపూర్ణమ్మ పాత్రని ఒక బాధితురాలిగా చెప్పడం జరిగింది. భర్త, అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిన ఆరళ్ళు తలచుకుని బాధితురాలిగా మనసులోనే రోదించిన అన్నపూర్ణమ్మ, ఈడేరకముందే కార్యం గదిలోకి పంపడం వల్ల రక్తకొల్లైపోయి భరించలేని బాధ పడ్డ తను 8 ఏళ్ళ పిల్ల మీద అత్యాచారం చేయమని తనకి తానుగా భర్తని ప్రోత్సహించడంతోనే బాధితురాలి స్థానాన్ని కోల్పోయింది. ఆ తరువాత అయినా ఆమెలో పశ్చాత్తాపం లేదు సరి కదా మరో సారి అదే పనికి భర్తని ప్రోత్సహించడం అంటే ఆమె క్యారెక్టర్ ని శాడిజానికి దగ్గరగా తీసుకుని వెళ్ళినట్లు అనిపించింది. రచయిత బాధితురాలు అని చెప్ప బట్టో, లేదా ఆ క్యారెక్టర్ తనలో తాను బాధితురాలిగా భావించబట్టో పాఠకులకు ఆమె క్యారెక్టర్ మీద సానుభూతి రాదు. బాదితురాలిగా అనిపించదు.
    ఎత్తుగడ నుండి చివరి వరకూ కథ మొత్తాన్నీ తను అనుకున్నట్లే తిప్పిన అన్నపూర్ణమ్మ, ఒక్కో మెట్టూ దిగుతూ, మనల్ని కూడా పై నుంచి లాకొచ్చి చివరి మెట్టు మీద కూలేసింది.
    . నిజంగా బాధితురాలిగా ఆమె మనకి తోచాలంటే ఆమెలో జరిగే అంతర్మధనం పాఠకులకు తెలియాలి. ఎనిమిదేళ్ళ అమాయకపు పిల్లని తన భర్తకోసం సిద్ధం చెయ్యడంలో తనలో తనకు జరుగుతున్న అంతర్యుద్ధం చదువరులకి తెలిసినప్పుడే ఆ పాత్రని రచయిత చూసిన కోణంలో చూడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్ప పాలికాపుతో కోరిక తీర్చుకోవడానికి వెంపర్లాడుతున్నట్లుగా తోచే సన్నివేశాలన్నవి కథ పొడుగూతా రావడం వల్ల పాఠకుల మీద కథ యొక్క ప్రభావపు రీతి రచయిత అనుకున్నదానికి దూరంగా జరగదా? భర్త ప్రేమ దొరకక ఏసోబుతో మానసిక అనుబంధం ఉందని… అందువల్లనే అతని దగ్గర సుఖం వెదుక్కుంటుందని అనుకుందాం అంటే, మానసికంగా అంత దగ్గరి మనిషి కూతురిని, తన భర్తని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎరగా వాడుకోవడం జరిగినప్పుడు ఆమె పాత్రని మనం ఏవిదం గా అర్ధం చేసుకుంటాం. బాధితురాలిగానా? తన సుఖం కోసం దేనికైనా తెగించగల స్త్రీ గానా?
    చివరి వాక్యంగా ‘నాకూ కాపలాగా ఉంటుంది’ అనుకుంది లోపల్లోపల అని ముగించడంలో అన్నపూర్ణమ్మ ఒక బాధితురాలిగా కాక ఐహిక సుఖం కోసం వెంపర్లాడే పాత్ర గా పాఠకుల మనస్సులో ముద్రించుకుపోతుంది. ముగింపుకి వచ్చేటప్పటికి ఆమె పాత్ర మీద పాఠకులకి కలిగే అభిప్రాయం చీత్కారమై ఉంటుంది తప్ప సానుభూతి కాదు.
    ఇందులో సుబ్బారావు పంతులు తనకి తానుగా పసిపిల్ల మీద కోరిక పెంచుకుని దాన్ని తీర్చుకోవడానికి అన్నపూర్ణమ్మని నయానో భయానో ఎరగా వాడుకుని తన కార్యం జరుపుకోవడం లాంటిది ఏమీ లేదు. అతనికి వచ్చిన సవాయి రోగాన్ని అడ్డం పెట్టుకుని అతనికి దగ్గర అవుదామని అన్నపూర్ణమ్మ చేసిన ప్రయత్నాలు ఆమెలోని స్వార్ధాన్నే ఎత్తి చూపాయి తప్ప ఆమె పడిన బాధల్ని కాదు.

    ఈ కథ బాలేదనో బాగుందనో కాదు నా అభిప్రాయం. కథ ఎలా ఉండాలి ఎలా నడపాలి అన్నది రచయిత ఇష్టం. మామూలు కథగా చూస్తే రచయిత తనకి అనిపించింది రాస్తారు. పాఠకులకి దానిలో నుండి తమకి నచ్చింది తీసుకుంటారు. ఆ విషయం లో నాకు ఎలాంటి కంప్లయింట్ లేదు కానీ కథ లో చెప్పిన విషయానికి దూరంగా రచయిత అన్నపూర్ణమ్మ పాత్ర గురించి కథ క్రింద రాశారు. ఒక బాధితురాలు ఇంకొందరు భాధితురాళ్ళని తయారు చేయడం అన్నది సత్య దూరం కాకపోవచ్చు కానీ రచయిత ఇచ్చిన ముక్తాయింపు కి కథ నడిపిన తీరుకి అన్వయింపు కుదర లేదు.

    • ఉమ గారూ…
      1. “దశాబ్దాల అనుభవాన్ని ప్రోగుచేసుకున్న ఒక సీనియర్ రచయిత యొక్క ఉత్కృష్ట ప్రతిభ…”
      – ఇలా మొదలెట్టారు మీరు. దశాబ్దాల అనుభవంతో ఒక సీనియర్ గుమస్తా కాగలం గానీ, రచయిత కాగలరా ఎవరైనా?
      2. “రచయిత చెప్పిన దానిప్రకారం చిన్నపిల్లల మీద అత్యాచారానికి సంబంధించిన కథ ఇది”-
      కథకి బయిట రచయిత చేసుకునే claims లేదా చెప్పుకునే confessions ఆధారంగా కథని ఎలా చూస్తారు? ‘భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచ ఆధునిక కథాసాహిత్యానికి నా కథ ఓ కలికితురాయి…’ అని రచయిత ప్రగల్భించినంత మాత్రాన ఆ కోణంలోనే ఆ రచనని చూస్తామా?
      3. “వివినమూర్తి గారి లాంటి రచయిత ఇలాంటి సబ్జెక్టు మీద కథ రాశారంటే ఆ కథ భవిష్యత్ లో ఈ సబ్జెక్ట్ మీద వచ్చే కథలకు ఒక రిఫరెన్స్ లా ఉండాలి” అని కూడా అన్నారు మీరు.
      – ఎవరీ వివినమూర్తి? లేదా గురజాడ… పోనీ పాలగుమ్మి… సబ్జెక్టుల మీద కథ రాయడం ఏమిటి? అది అంతిమ వాక్యంలానో… తుదితీర్పు లానో ఉండటమేమిటి?
      4. “ఏ కథని ఎలా చెబితే పాఠకుల్ని ఆలోచింప చేస్తుందో అన్న సంగతి తనకన్నా గొప్పగా ఇంకొకరికి తెలియక పోవచ్చు…”
      – ఈ statement- Leo Tolstoy విషయంలో కూడా అనకూడదు కదండీ. పాఠకుల్ని ఆలోచింపజేయడం- ఎంత కాలం చెల్లిన భావం!
      – ఇక కథ మీద మీ విమర్శ రచయిత కథకి బాహ్యంగా ఇచ్చిన వివరణ, కథకి కింద ఇచ్చిన గమనికల మీదే ఆధారపడింది కాబట్టి, దాని మీద వ్యాఖ్యానించడానికేమీ లేదు.

  • ధన్యవాదాలు ఉమా గారు. అన్నపూర్ణమ్మ పాత్ర ని బాధితురాలుగా పేర్కొన్న రచయిత/ పాఠకుల అభిప్రాయాలు చదివి, వాటిపై సరిగ్గా ఇదే అభిప్రాయం రాయబోతూ, ఏదో కారణంతో డైవర్ట్ అయ్యాను. అనుభవమున్న ప్రతీ రచయిత యొక్క ప్రతీ రచనా బాగుండాలని లేదు కానీ, ఎందుచేతో వివినమూర్తి గారి నుంచి ఈ కథ ఊహించలేదు. కామెంటు రాయాల్సి వస్తే ఇలా నిష్కర్షగా రాస్తానేమో, నొప్పిస్తానేమోనని మౌనంగా ఉన్నాను. కానీ, కొన్ని సార్లు అభిప్రాయం చెప్పటమూ బాధ్యతేనని చెబుతున్నాను. To me, Its narrated in poor and sadistic taste. Period.

  • ఉమ గారి అభిప్రాయంతో నా ఏకీభావం. నిజంగానే అన్నపూర్ణమ్మ పాత్ర బాధితురాలి స్థానాన్ని కోల్పోయి, దిగజారిపోయింది. పాఠకుల సానుభూతిని పొందలేకపోయింది. చిన్నపిల్లల పైన జరిగే అత్యాచారాలకు సామాజిక పరమైన కారణాలు, మూఢ నమ్మకాలు ఉండొచ్చేమో, కాదనలేం. అయితే ఇటీవల జరుగుతున్న అనేక అత్యాచారాలకు కారణం మాత్రం అణచిపెట్టి ఉంచాలనే ఆధిపత్యపు ధోరణి.

  • ప్రసిద్ఫులైన వివిన మూర్తిగారు ఈ కథనంలో ,విషయంలో విఫలమవటం విచారం తో కూడిన ఆశ్చర్యాన్ని కలిగించింది.
    శ్రీనివాస్ గారి స్పందన , విమర్శలతో కనపడిన కుదురు, పరిణతి ఆనందాన్ని కలిగించింది.

  • పరమచెత్త కథ. చెడును జుగుప్సాకరంగా చూపించడం తప్ప ఈ కథకు ఏ సార్థకతా లేదు. ఇలాంటి కథలు ద్వేషం, వ్యక్తిత్వ దోషాలకారణంగా పుడతాయి. కామెర్లవాడి తీరు..

  • >>>“నిజమే నేనూ విన్నాను”. అన్నాడు. “మా శంకరం మామయ్యకి అలాగే నయమయిందిట”. అని జోడించాడు<<>>సవాయి తిరగబెట్టింది. ఎవరో ఈమాటా చెప్పారు. ఏ పిల్లా దొరకలేనట్టుంది. పోయాడు.” అంటూ ముగించాడు.<<<

    ముగ్గురు విమర్శకులచే పరిశీలింపబడి, మొత్తం సారంగ బృందంతో ఆమోదముద్ర వేయించుకుందని చెప్పబడ్డ రచనలో ఒక పాత్ర విషయంలో కనిపించిన వైరుధ్యాలివి. ఇది వ్రాసింది రచనా శిల్పంలో అవకతవకలున్నాయని చెప్పడానికి కాదు. రచన, అందులోని విషయమే అవకతవకలుగా ఉన్నాయని, పెఇ విషయంలాగానే సంపాదక వర్గమ్ అందరూ కన్వీనియంట్ గా దానిని విస్మరించారని చెప్పడానికి.

    గంటసేపు జుగుప్సా భరితమైన పోర్న్ చూపించి చివరన "లోకంలో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ పాత్రలపై సానుభూతి చూపండి అని శుభం కార్డులో వేస్తే అది బూతు చిత్రం కాక మంచి సినిమా అయిపోదు. ఈ కథ అలాంటిదే. కథలో ఒక మానవీయ కోణం ఉండాలి. ఒక సమస్యకు పరిష్కారం ఉండాలి. కనీసం సమస్య పట్ల పాఠకుడికి సహానుభూతిని కలిగించాలి. అవేమీలేని ఈ రచనలో ఉన్నదొకటే రసం. జుగుప్స. అది రచనమీదా, రచయిత మీదా కూడా కలిగితే నా తప్పు కాదు. సాధారణంగా కథలు ఎక్కువగా చదవని నేను సంపాదకులపై నమ్మకంతో వారి ఫేస్బుక్ గోడపై చూసి దీనిని చదవడం జరిగింది. ఇంత అసహ్యాన్ని మూటగట్టుకోవలసి వస్తుందని ఊహించలేదు.

    సెలవు.

  • అవును పైన చెప్పిన వైరుధ్యాల లాంటివి కథలో చాలా ఉన్నాయి. వస్తువు, పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు దేనిమీదా శ్రద్ధ కనబడలేదు.
    సుబ్బారావు మొదట “శంకరం మావయ్య” అన్నవాడు మళ్ళీ తర్వాత “వాడికి” అంటాడు. మావయ్యనే వాడు అన్నాడనుకోవాలా?
    ఆవిడేమో “బాబయ్య గారా!” అని మళ్ళీ “చెల్లెమ్మా అని పిలిచేవాడు” అంటుంది.
    మొదటి పేరా అంతా ఈ కథకి పూర్తిగా అనవసరం.
    గుమ్మన్నని పెనాం లోకి తోసిన సంఘటనా అనవసరమే.
    శేషభుక్తం సంప్రదాయం పక్కన పెట్టి అన్నారు. ఆరోజు పక్కన పెట్టిందా? అసలెప్పుడూ ఆవిడకి ఆ అలవాటు లేదా? అసలెప్పుడూ లేకపోతే ఆ వాక్యం కథలో రాయల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పాటించి ఆరోజు పక్కన పెట్టిందా అంటే అన్నపూర్ణమ్మ అలాంటివి పాటించే మనిషిలా లేదు.
    మూడవ సన్నివేశం చివర “అన్నపూర్ణమ్మకి పంజరం తలుపులు తీసినంత ఆనందం కలిగింది. పట్టు చిక్కినంత ఉషారు కలిగింది”అని రాయడాన్ని అసలు ఎలా తీసుకోవాలో!
    ఇక “ఆ మంచం అక్కడ పెట్టించేందుకు…” అంటూ కొన్ని వాక్యాలు బ్రాకెట్లలో రాయడం లాంటివి. కొత్త రచయితలు కూడా చేయడం లేదేమో ఇప్పుడు ఇలా.
    కథా బాలేదు కథనమూ బాలేదు అనడం కంటే రచయిత ఆలోచనలలోని వక్రత్వాన్ని స్పష్టంగా తెలియచేసేంత అనియంత్రతతోను అపరిపక్వతతోను సాగింది కథ అనడం సబబు.

  • ఈకథ ఇంతలా డిస్టర్బ్ చేయడానికి కారణం ఇది అరుదైన మంచి కథ. మర్యాదస్తులైన తెలుగు సాహిత్య కారులకి నచ్చడం కష్టం

    • వివిన మూర్తి ఏ మేటర్ ఆఫ్ లిటిల్ డిఫరెన్స్ కథపై అగ్రవర్ణుల హాహాకారం, దళితుల మౌనం వల్ల తెలుగు సాహిత్యపు హిపోక్రసీ బయటపడి0ది.జీవితం అంతకన్నా బీభత్సంగా లేదా?

  • చెత్త కథలపై జరిగే చర్చలన్నీ చివరికి తీసుకునే మలుపు ఇదే కదా!
    “ఇంత చర్చ జరిగిందంటేనే ఇది మంచి కథ”, “మర్యాదస్తులకు ఇలాంటి కథలు నచ్చవు” అనుకుని తృప్తి పడడమే కదా!
    డిస్టర్బ్ చేసిన కథ మంచి కథ అనే నిర్వచనం ఏమిటో అసలు!
    డిస్టర్బ్ చేయడం ఏమిటి? నలుగురయిదుగురికి నచ్చింది, వాళ్ళు నచ్చిందని చెప్పారు. పదిమందికి నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదని చెప్పారు.
    అంతే. డిస్టర్బ్ చేయడం ఏమిటి మధ్యలో!
    అయినా సమాజం మీదా పాఠకుల మీదా కొంచెమైనా మర్యాదా గౌరవం కనబడకుండా రాసిన కథలు మర్యాదస్తులు వివేకవంతులు అయిన పాఠకులకు (వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళయినా సరే దళితులయినా సరే) నచ్చవు. అది మాత్రం నిజం.

    • వాస్తవాలు డిస్టర్బ్ చేస్తాయి మరి.
      చేదు మాత్రలు అవసరం, బాపు బొమ్మలు కాదు.

  • “స చ్చి నా డా…”
    అనే పదం కధ మొదట్లో ఆ పెరట్లో విన్నప్పుడే,
    ఈ మాట ఇక్కడిది కాదే… అనే అనుమానం వచ్చింది.
    వివరాల్లోకి వెళుతున్న క్రమంలో…
    వొక ‘ఫ్యూడల్’ కుటుంబ కధకు
    ఇంగువ అంటింది అని అర్ధమయింది.
    దీని రచయిత వివిన మూర్తి
    21 శతాబ్ది వొంటరి సంస్కర్త.
    ఈయన తరంలో…
    ఇంకా ఈయన వద్దే
    రాయడానికి విషయం వుంది,
    అంటేనే మనకు అర్ధం కావాలి!
    ఆయన చేస్తున్న ‘మైనింగ్’ ఎటువంటిదో…?
    ఈ కధలోనూ మూర్తి గారు అదే చేసాడు.
    ‘షెల్స్’ లోపలి నుంచి
    బయటకు తొంగి చూసినవారు,
    మునుపు చాలా మంది వున్నారు.
    కానీ కొంత కాలంగా మూర్తి గారు
    దాన్ని బద్దలు గొట్టడానికి
    పెనుగులాడుతున్నారు.
    సనాతన కుటుంబాలు భూముల జంజాటం వదిలించుకుని ఇంకా చదువుల వైపు వెళ్ళని దశలో, నైతిక ప్రవర్తన విషయంగా దిగజారుడులో శూద్ర…పంచమ… కుల లక్షణాలు ముగ్గురి మధ్య – ‘డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్’ తో ఎలా ‘రిఫ్లెక్ట్’ అయ్యాయో ఈ కధలో చూస్తాం.
    కధ ఆరంభంలో వొక పొద్దు పొడుపుగా కనిపించిన అన్నపూర్ణమ్మ పాత్ర ముగింపులో అస్తమించింది. అది – 1940 నాటికే కాదు… 2020 లో కూడా వర్తించే అంశం అని ఈ రచయిత బలంగా నమ్మడం వల్ల…
    ఇంకా రాయడానికి ఆయన వద్ద విషయం వుంది!

  • బాగుంది. అడగాలనుకున్నవేమో ఉన్నాయి గానీ ఈ చర్చ చూశాక అడగాలనిపించట్లేదు. ఆమోదం సంకెల తెంచుకోెవడం మీ లాంటి పండిపోయిన వారికి కూడా ఎంత కష్టమో అర్థమైంది.

  • వివినమూర్తి గారు ‘సారంగ’ పత్రికలో రాసిన ‘ఏ మాటర్ ఆఫ్ లిటిల్ డిఫరెన్సు’ కథ మొన్ననే చదివిన. ఆ కథపై విమర్శలు వచ్చినట్టు అఫ్సర్ గారి వివరణ ఫేస్ బుక్ లో చదివాక అర్థం అయ్యింది.

    దేనిగురించి అయినా ఎంతో మంది తమ అభిప్రాయాలను రాస్తున్నారు కదా. నేను రాయకపోతే ఏమి అనుకుంటాను నా మటుకు నేను.

    ఇప్పుడు ఈ విమర్శ రాయడానికి కారణం కథ చివర్లో “ఆనాటి తెలుగు సాహిత్యంలో వర్గదృష్టి అంటే పేదలూ ధనికులూ. ఇప్పుడు పరిస్థితి వేరు. అస్తిత్వాల స్పృహతో పేదలలోనూ, ధనికులలోనూ ఉండే సమూహాలను గుర్తించటం వారు చేసే చర్యలను పరిశీలించి చిత్రించటం. నా దృష్టిలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పు ఈకథలో అన్నపూర్ణమ్మ పాత్రను “స్త్రీ”గా(అంటే బాధితురాలిగా) చూడటంలో కనిపిస్తున్నదనిపిస్తోంది.)” రచయిత ఇచ్చిన ఈ వివరణ.

    ఇకపోతే కథ గురించి… బాధితురాలి వైపు నుంచి, అలాగే వర్గ దృక్పథంతో కథ రాశానని చెప్పారు రచయిత.

    ఈ రెండూ కథలో నాకు కనిపించలేదు.

    అన్నపూర్ణమ్మ భర్త తో బాధించబడుతుంది. సుఖ రోగ గ్రస్తుడు. భార్యకు ఏమాత్రం విలువ ఇవ్వడు అతడు.

    అట్లాంటి సవాయిరోగి భర్త బతకడం కోసం బాలిక మాలపిల్ల పుల్లిపై అత్యాచారానికి ఏర్పాట్లు చేస్తుంది. (అందువల్ల ఆ అమ్మాయి చనిపోయింది)

    ఈ అత్యాచార ఏర్పాట్ల కోసం…. భర్త చనిపోయి పుట్టిల్లు చేరిన ఆడపడుచు పాపాయమ్మ అడ్డంకి అని, ఆవిడను అత్తింటి దగ్గర దింపి రమ్మని భర్తను ఒప్పిస్తుంది. నిజానికి ఆ సమయంలో పాలేరుతో ఉండవచ్చు అనుకుంటది. (బాలిక పులి ఆ పాలేరు బిడ్డనే)

    ఆ స్త్రీ, ఆమె ఉన్న పరిస్థితిలో అట్లా ఆలోచిస్తుందా? రోగిష్టి భర్త, నిత్యం ఇబ్బందులు పెట్టె భర్త, చావబాదే భర్త… లేకుంటేనే బాగు అనుకుంటది కదా. వాడు చస్తే ఆ నరకము నుంచి విముక్తి దొరుకుతది అనుకుంటది కదా. భర్త చనిపోతే అడబిడ్డను అత్తింటికి పంపడానికి అడ్డేమీ ఉండదు. కేవలం తన పసుపు కుంకుమలు కాపాడుకోవడానికి , 10 రోజులు ఏ భయం లేకుండా పాలేరుతో గడపడానికి భర్తకు పసిపిల్లను బలి పెడతాదా? ఆ చంటిదాని ఉసురు తీసుకుంటదా?

    (“వీడు ఎప్పుడు చేస్తాడో, నాకు ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో” అని తమ భర్తల గురించి బహిరంగంగా మాట్లాడే మహిళల్ని చాలా మందిని చూసిన.)

    స్త్రీ మనస్తత్వం రచయిత పట్టుకోలేక పోయారు.

    కథ ఇక్కడ దెబ్బతినిపోయింది అనిపించింది.

    ఇక వర్గ దృక్పథం గురించి… ఒక బీదవాడు ఉన్నత వర్గపు స్త్రీతో సంబంధం పెట్టుకుని అంత అమానవీయంగా ఎలా ప్రవిర్తించ గలుగుతాడు.

    (కథ కాలం తప్పక గుర్తు పెట్టుకో దగినది)

    ఏ మాత్రం ప్రేమ లేకుండానే ఆమెతో కలిసాడా?

    ప్రేమతోనే కలిసినా తన కూతురు బలి అవ్వడానికి కారణం ఆమెనే అని అర్థం అవ్వడం వల్ల (ఇక్కడ ఇంటి యజమాని మంచివాడే. అతని భార్య మాత్రమే దుర్మార్గురాలు అనే విషయం కూడ మర్చిపోవద్దు) ఆమె పాలభాగాన్ని రక్తం కారేలా కోరుకుతాడా?

    నిజంగా అలాంటి స్థితిలో ఉన్న మగ బాధితుడు ఒక స్త్రీని (ఉన్నత వర్గానికి చెందినదే అయినప్పటికీ) అలా చేస్తాడా? ఆంగ్లేయుల కాలంలో, అందునా అంటరాని (మాల్) కులానికి చెందిన వ్యక్తి… ఆ కులంలో పుట్టడం వల్ల మనిషిగానే చూడబడని వ్యక్తి. బాధితుడు అయిన ఏసోబు అంత అమానవీయంగా స్త్రీ పట్ల – కేవలం… కేవలం… మగవాడుగా ప్రవర్తిస్తాడా? వర్గ దృష్టి అంటే స్త్రీని హింసించడమా? ఆ వర్గ దృష్టి పేర ఏసోబును కూడా అవమానించారు.

    ఈ అన్నపూర్ణమ్మ భర్త సుబ్బారావు పంతులు ప్రజలను పీడించి డబ్బు సంపాదించే వ్యక్తి కాదు (అంతకుముందు గుమ్మన్న చావుకు కారణమైనప్పటికీ). అగ్రవర్ణ అహంకార0 మెండుగా ఉన్నప్పటికీ అతడు భూస్వామి కాదు. బెల్లం వ్యాపారి. దనికవర్గం.

    భూస్వాములు పీడకులు. వారిపై వర్గ పోరాటం చేస్తారు.

    దనికులను కూడ విప్లవంలో భాగస్వాములను చేస్తుంది వర్గపోరాటం.

    ఇక ఈ దృష్ట్యా ఈ కథలో వర్గ దృక్పథం ఎక్కడ ఉన్నట్టు?

    ఏ విలువలు పాటించని దానిగా (ఏసోబుతో శారీరక సంబంధంలో ఉండి, అతని ద్వారా పిల్లలను కనాలనుకుని, ఆ ఏసుబు బిడ్డపై భర్తను ప్రేరేపించి అత్యాచారం చేయించే అన్నపూర్ణను బాధితురాలిగా చూపిందెక్కడా? పీడించబడేదానిగానే చూపారు. అస్తిత్వ స్పృహ అసలే కనిపించలేదు.

    తనకు తెలియని, పరిచయం లేని విషయాలను, పాత్రలను తీసుకున్నారు అనిపించింది.

    ఆ పాత్రల స్వభావాలకు భిన్నంగా కథ నడిపారూ.

    రచయిత చివరలో చెప్పిన అస్తిత్వ స్పుహ, వర్గ దృక్పథం…. ఈ రెండూ కథలో లేవు.

    నోట్: కాళీపట్నం రామారావు మాస్టారు కథలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన విషయాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు అనుకుంటున్న.

    “ఏ కథా వస్తువును ఎంచుకున్నా బాగా తెలిసిన పాత్రలకు మాత్రమే అన్వయించి రాయాలి.

    అలాగే తెలియని (పట్టులేని) కథా వస్తువును ఎన్నుకోవద్దు.”

    • కరుణ గారూ
      ఏసోబు ఎర్రజండా పట్టుకొని గద్దర్ పాట పాడుతూ తూర్పు దిక్కువైపు నడిచాడు అని ముగిస్తే ఎలా ఉండేదంటారు?
      గద్దర్ పాట అనాలా ,వంగపండు పాట అని రాయాలా ,ఏది బావుంటుంది?

  • Sir This is really excellent, but people may not understand the nostalgic period especially generation of these days.

    • ఖైర్లంజిలో అగ్రవర్ణ స్త్రీలు కూడా అతివికృత దుర్మార్గానికి తెగబడలేదా? బ్రాహ్మణ స్త్రీని ప్రధాన పాత్ర చేయడం వల్లే వివిన మూర్తిపై దాడి.

  • కథ చాలా బాగుంది. కథా వస్తువు, కధనం రెండు విభిన్నమైనవి . ఏకబిగిన చదివించిన కథ.
    కథకుడి morality మీద అసహనం కన్నా చర్చ మన చుట్టూ జరుగుతున్న ఆడపిల్లల మీద హింస ముఖ్యంగా సమాజ ఆమోదం తో కొనసాగుతున్న హింస మీద అసహనం వ్యక్తం అయితే కదా ఈ కథ మీద
    చర్చకు నిజమైన ప్రయోజనం. కథలో చూసిన అన్నపూర్ణ లు ఇప్పటికీ నేను రోజూ ఎక్కడో ఒక దెగ్గర చూస్తూనే వుంటాను , సత్యనారాయణ లు వుంటూనే వుంటారు. అన్నీ కులాలలోనూ వున్నారు. Irony is they are very much there in the castes that are standing on high moral ground

  • అద్భుతమైన కథ.
    స్కాక్హోం సిండ్రోమ్ కి ఇంతకంటే మంచి ఉదాహరణ మరోటి లేదేమో.
    బాధితురాలు పీడకుడు ఒకే విలువలు కలిగి ఉన్నపుడు..బాధితురాలెపుడూ పీడకుడి పీడనను గుర్తించడంలో విఫలమౌతూనే ఉంటుంది. పీడకుడి పీడనలో తాను భాగమౌతూనే ఉంటుంది. వర్గ సంబంధాలు ఎలా ఒకదానికొకటి స్వలాభాలకోసం కలిసి ఉంటాయో చక్కగా చూపించారు. ఏసోబు పీడితుడైనా అతడి స్వార్థం అతడిదే. అలాగే అన్నపూర్ణమ్మది. వర్గ చైతన్యం రాని, లేని సమాజాల్లో పీడనను పీడకులు పీడితులు ఎలా చేతిలో చేయి కలిపి ముందుకు తీసికెళ్తారో చూపించారు.

  • కధ బాలేదు. వర్గ దృష్టి తో అన్న మాట సత్యదూరం. ఆ దృష్టి కనబడలేదు. ప్రయోజనం శూన్యమైన కధ.

  • మీరు చెప్పాలనుకున్నది చాలా బలంగా చెప్పటమే మిగతా వారి సమస్య అని ఆ కామెంట్స్ అన్నీ చదివాక అర్ధం అయ్యింది. మీరు రాసింది ఒక 40 యేళ్ళ కింద మాటే అయ్యుండొచ్చు కానీ అవే పాత్రలు ఈరోజుకీ వున్నాయి అనీ, దాన్ని ఒప్పుకోలేని చేతకాని తనంలో, వాస్తవాన్ని పక్కన పెట్టేసి మరీ మీ వ్యక్తిత్వ హననానికి దిగటం లోనే ఈ సగటు విమర్శకుల స్థాయి కనిపిస్తుంది.

    ఈరోజున కూడా అలాంటి మనుషులు, అంత కన్నా హీనంగా సాటి మనుషుల పట్ల ప్రవర్తించే వారు దురదృష్టవశాత్తూ వుండటం, ఈ తతంగం అంతా మిగతా జనాలకీ తెలిసి పట్టించుకోని ఓక రకమైన నిస్పృహ నిండిన సమాజం లోనే ఇంకా మనం ఉన్నాం అని తెలిసినప్పుడు ఈ విమర్శకులకు ఎందుకీ దేవతా వస్త్రాల రెపరెపలు, కోడి గుడ్డు మీద ఈకలు పీకడాలు? reality మర్చిపోయి మరీ ఈ గంతులు? తెలుగు సాహిత్యం అనేది ఏమైనా ముందుకి పోవటం అంటూ వుంటే ఇలాంటి వ్యక్తుల మాటలు విసిరవతల పారేసి ముందుకి పొయ్యే రచయితలు వున్నారు కనుకనే ..!👏👏
    P.s. పాత్రలకు సరిగ్గా క్లారిటీ లేకపోవడం అనేది నావరకు సమస్యే కాదు. చెప్పాలనుకున్న విషయం (మూఢ నమ్మకాలు ఐనా, Stockholm syndrome behaviour ఐనా , పెద్దరికం అంతా పాత్ర వ్యక్తిత్వం కన్నా ఆపాత్రకు వుండే డబ్బు ఆస్తీ ని బట్టి వ్యవహరించే గురివింద గింజ లోకం తీరు (25 ఎకరాల భూమి , మంచి హోదా) ) చక్కగా రాసారు. రచయిత కు అభినందనలు , మరో సారి ధన్యవాదాలు కూడా 🙏🙏

    నాకు ఆ సవాయి వ్యాధి అంటే ఏంటో అర్ధం కాలేదు. Chlamydia or gonorrhoea?

    • సవాయి వ్యాధి అంటే “సిఫిలిస్.గనోరియాని సెగ వ్యాధి అంటారు.చాలామందిలో mixed ఇంఫెక్షన్లు ఉంటాయి.

  • Facebook లో జరుగుతున్న చర్చను చూసి ఈ కథను చదవడం జరిగింది.

    కథ, కథనం విషయంలో నాకు ఎలాంటి లోపమూ కనిపించలేదు. అన్నపూర్ణమ్మ లాంటి వాళ్ళు సమాజంలో ఎందరో!

    నాకు రెండు విషయాలు మాత్రమే నచ్చలేదు

    1. కథ పేరు… ఈ కథకు సూట్ కాలేదు అనిపించింది(లేదా … అంతరార్థం నాకు అర్థం కాలేదేమో)

    2. అన్నపూర్ణమ్మను బాధితురాలిగా రచయిత చూపడం(చెప్పడం) … అన్నపూర్ణమ్మ ఈ కథలో లౌక్యురాలు…

  • అద్భుతమయిన రచన. ఏన్నేళ్లయిందో యింత గొప్ప కథని చదివి!? మూర్తిగారికి అభినందనలు. నెనరులు.

  • Good one… very realistic n I am surprised y many comments are against writer … in fact real society even today is far more than told in the story…. sad for all the women in the story…

  • ఎంత ఆలోచించినా ఈ కథలో కొన్ని సాంకేతిక లోపాలు తప్ప పెద్ద ఆక్షేపణ చేయదగ తప్పులుంకనబడ లేదు. అలాంటి ఆడాళ్ళు వుంటారు, చాలా స్వల్పంగా నైనా. అలాంటి మొగాళ్ళు వుంటారు, చాలా లెక్కకై దొరికేలా. ఆయన చూసిన సంఘఠనలతో రాసినట్లు వుంది. తనకు తెలిసింది ప్రెసెంట్ చేశారు. After all ఇది ఒక కథ. డిగ్రీ సిలబస్ లో నేర్చి తీరాల్సిన పాఠం కాదు. నచ్చితే ఒక్. నచ్చకపోతే ఒకే. దానికి ఈ కొట్టుకు సచ్చిపొడాలు ఏమిటో, ఆ ప్రతిజ్ఞలు ఏవిటో. మజ్జీలో జత పచ్చి కొట్టేయడాలు . ఈ సోషల్ మీడియా సమాజం పిచ్చోళ్ళ ఆసుపత్రి మాదిరి తోస్తోంది.

  • గమనిక: ఈ కథ మీద కామెంట్స్ ఇక ప్రచురించడం లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు