శాంతి యుద్ధం

వాళ్లేం చేస్తారు..
వీపు మీద రక్తపువాతలు
తేల్చిన లాఠీకి
దయగా ఇంత అన్నం పెడతారు.
మేకులు దిగ్గొట్టిన రోడ్డునే
మెత్తగా నారుమడి చేస్తారు.
మేకుకు మేకుకు మధ్య
ఒక నవ్వుమొలక నాటుతారు.
ఇన్ని ప్రతికూలతల మధ్య
ఇనుప ముళ్లతీగల మధ్య
పూలపరిమళం వెదజల్లుతారు.
వాళ్లేం చేస్తారు..
ఖలిస్తాన్ పాకిస్తాన్ లు
కుట్రదారులు తీవ్రవాదులు
అభాండాలు అవాకులుచవాకులు
అన్నింటిని కుప్పపోసి
వెచ్చగా చలి కాచుకుంటారు.
నలుగురు కూడి నవ్వుకుంటూ
నాలుగువేళ్లు నోట్టో పెట్టుకునే వేళల
దేశ వెన్నుముక నవ్వుమొకం గుర్తొచ్చి
వెన్నుముక లేని దేశం దిగొచ్చి
చివరి చిరునవ్వు
పేలవంగానైనా నవ్విద్దేమోనని
గుడారాల కళ్లతో
మినుకుమినుకు ఆశాదీపాల్లా
పొగమంచులో వెలుగుతూనే వుంటారు.
వాళ్లేం చేస్తారు..
కలుపుమొక్కల్ని కూడా
కనికరంగా పీకుతారు.
పాలవెన్నుల మీద వున్న
కంకుల మీద వాలే పిట్టలని కూడా
సుతారంగా తోలతారు.
ధర పలకని కూరగాయల్ని
మండీల్లో కాదు
రోడ్డుమీద చెత్తకుండీల్లో
నిరసనగా కుమ్మరిస్తారు.
వాళ్లేం చేస్తారు..
రాజ్యం పీఠం కింద
నాలుగు కాళ్లు వణికేటట్టు
రాజధాని సరిహద్దుల చుట్టూ
భైటాయించి కూర్చుంటారు.
రైతు కాళ్లు నరికే
కొత్త రైతు చట్టాల కుత్తుక నరికే
సరికొత్త కలను కన్నీళ్లతో కంటారు.
కల సాకారమయ్యేదాక
ఒక్కొక్క పిడికిలి నేలకొరుగుతున్నా
అలా మొండిగా తెగబడి
శాంతంగా యుద్ధం చేస్తూనే వుంటారు.
*
అశాంత సంచారకులతో సంభాషణ

మీరు రాసిన మొదటి కవితా, దాని నేపథ్యం?

పిల్లలూదే సబ్బు నురగల నీటి బుడగల తేలే రంగురంగుల ప్రపంచమే ప్రపంచమని భ్రమసే యవ్వనారంభ కాలాన కనిపించే ప్రతి పువ్వుతోని, ఎదురయ్యే ప్రతి నవ్వుతోని ప్రేమలో పడే తన్మయస్థితిలో కొన్ని అల్లిబిల్లి ప్రేమకవితలు రాసుకున్న మాట నిజమే గానీ..నాకు కవిత్వ పరిచయం మాత్రం నా మిత్రుడు పరిచయం చేసిన హైకులే.
అప్పటి నా మానసిక స్థితి కి దగ్గరగా వుండి నా హృదయంలోకి అప్రయత్నంగా ప్రవేశించాయవి. కొన్ని మంచి హైకుల పఠనం నా ఆంతరంగిక ప్రపంచాన్ని మార్చివేసాయి. ప్రతి దృశ్యాన్ని ఆ నిమిషాన్ని అదే క్షణికమన్నట్టు స్వీకరించాను.అదే లోకంగా జీవించాను. ఒక రోజు ఇంటికి ఒంటరిగా వచ్చినప్పుడు నా చొక్కాపై ఒక చిన్ని పురుగు వుంది.హృదయంలో మెరుపులా అప్రయత్నంగా ఈ వాక్యాలు పలికాయి.

ఒంటరిననుకున్నా..
నా చొక్కాపై ఓ చిన్ని పురుగు
ఇంటి దాకా వచ్చింది.

ఇదే నా మొదటి కవిత్వ వ్యక్తీకరణ కావచ్చు.

 కవిత్వం ఎందుకు రాయాలి?

కవిత్వం ఆత్మఘోష. మానసిక ప్రపంచాన తల బాదుకునే విరిగిపడే ఆలోచనా అలలసముద్రం. ఢీకొని ఢీకొని అలసి ఓర్వలేక, లోపల ఓర్చలేక, మనకి మనం మనఃప్రపంచాన ఓదార్పు కోసం కాసిని అక్షరాల్ని ఆశ్రయించి.. శమించి.. విశ్రమించేందుకు..

ఆంతరిక లోకానికి..భౌతిక ప్రపంచానికి వేసే ఒక లంకె..కుదుర్చుకునే ఒక ఆత్మిక ఆలాపనని కొన్ని మనకి సరితూగే అశాంత సంచారకులతో చేసే సంభాషణ..దించుకునే మదిబరువు.. పంచుకునే లోన గొడవ..

 మీరు రాసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన కవిత? ఎందుకు?

కరోనా కాలాన వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరి..దారిలోనే ప్రాణాలు రాలిపోతుంటే..కలిగిన మానసిక క్లేశం నుంచి బయటపడ్డ నా ఆవేదన ‘పాదాలు..పాదాలు మాత్రమే..’ కవిత.

ఇది రాసి నేను విముక్తుడనయ్యాననుకున్నాను గానీ..ఆ మహా విషాదంలో మరింత కూరుకుపోయా..

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

4 comments

Leave a Reply to hari Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్న..శుభోదయం.. మీ కవిత… మీ హృదయావిష్కరణ చక్కగా ఉన్నాయి..శుభాకాంక్షలు అన్న..

  • కవిత్వం ఎందుకు అన్న ప్రశ్నకు మీ సమాధానం హృద్యంగా ఉంది. మీ ఇతర సమకాలీన కవితల్లాగే శాంతి యుద్ధం రైతు ఉద్యమ స్వరూప స్వభావాలను వాస్తవంగా చిత్రించింది. అభినందనలు శ్రీనివాస్ అన్న.

  • మొదటి కవితా నేపధ్యం బాగా చెప్పారు.
    అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు