పల్లె కంటికి రెప్పలు … ఈ అమ్మలు!

గ్రామాల్లో వాడకొక మైఖేల్ ఏంజిలో, డావెన్సీలు ఉంటారు. డేవిడ్ లాంటి కుదిమట్టంగా ఉండే బాహుబలులూ కనబడతారు.

1

దిమ సమాజాల లో నాగరిక భావన మొదలు కాని రోజుల్లో మనిషి స్థిరమైన ఆవాసం లేకుండా సంచరిస్తూ గుహలు పర్వతాలు అవాసలుగా బ్రతికాడు. ఉరుములు మెరుపులు మేఘాల రాపిడికి నిప్పు వస్తది అనీ, విత్తనం నాటితే మొలకలు వస్తాయి అని దానికీ ప్రకృతికీ ఋతువుకీ ఏదో సంబంధం ఉందని రాయికీ రాప్పకీ మొక్కాడు.

ప్రకృతినే దేవతగా భావించి తనకు తెలియని అతీంద్రియ శక్తులు ఏవో తనను నడిపిస్తున్నాయి అనీ  తెలియని శక్తికి దాసుడు అవడం మొదలు పెట్టాడు. అనాదిగా వాళ్ళ  ఆరాధ్య దైవం గ్రామ దేవతలు.

వేదకాలానికి పూర్వం ప్రజలు ప్రకృతి ఆరాధకులు. చెట్టు, పుట్ట,రాయి నీరు, నిప్పు తన చుట్టూ ఉన్న సమస్త  జీవజాలం లో దైవాన్ని చూసుకున్నారు.

ఆ కాలంలో  మాతృస్వామిక వ్యవస్థ ఉంది కనుక స్త్రీ ఆరాధ్య దైవం అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలవబడుతూ ఉంది. ఇదొక ఆచరణ దానికో దేశవాళీ క్రతువు ఉంది. పండిత క్రతువుకు సమాంతరంగా మరొక పరంపర ఉంది. ఉత్పత్తి కులాలకి అనుబందం గా ఆశ్రిత లేదా ఉప కుల నిర్మాణాలు ఆయా కులాల జీవితం లో పెళ్లి చావు లేదా మరోదో క్రతువు నిర్వహణ పూర్తిగా  ఆయా కుల పూజారుల ఆజమాయిషీ లోనే జరిగేది. వీళ్ళ జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు బాగం అయ్యాయి. ఇవి ఎన్నో పేర్లతో వ్యాపించి ఉన్నా అన్ని ప్రాంతాల లోనూ దళిత బహుజన కులాల కుల పెద్దలు, కుల గురువులు లేదా బైండ్ల.లేదా బవనీ లాంటి కులాల వాళ్ళు ఈ దేవతల పూజారులుగా చలామణిలో ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా శక్తి ఆరాధకులు ‘శాక్తేయ’ పరంపరను ఆచరించే  వైదిక క్రతువుకి బయట ఉన్న ఇది అతిసాధారణ పూజా విధానం నిరాడంబర గుడులు . మూలవాసుల నమ్మిక ఆచారం కల్లూ, సార, జంతుబలి, నైవేద్యం ఒక విశిష్టత. కొన్ని గ్రామాల లో బయట కాక ప్రతి ఇంట్లో తమ నమ్మకానికి అనుగుణంగా ఒక గుడి పూజా క్రతువు ఉంటుంది. వాస్తవానికి ఇవి గ్రామానికి రక్షణగా ఉన్న ఐతిహ్యాలు.

2

ఈ గ్రామ దేవతల ప్రస్తావన పురాణాలలో కనబడదు అయినా “విష్ణుపురాణం” లో జమదగ్ని కథలో ‘ఎల్లమ్మ’ లేదా ‘రేణుకా ఎల్లమ్మ’ ప్రస్తావన ఇలా ఉంది “ఋషి జమదగ్ని తన భార్య రేణుక ఏదో తప్పు చేసింది(తను భర్తను కాక పరాయి పురుషుణ్ణి అలోకన చేసుకుంది అనే అభియోగం) ఆమెను వదించమని తన కొడుకు పరుశురామున్ని ఆజ్ఞాపించగా భయపడిన రేణుక మాదిగ లందలో తల దాచుకున్నది పరుశ రాముడు తన తండ్రి మాట ప్రకారం రేణుక తల నరికి  తండ్రికి చూపిస్తాడు. కన్న తల్లిని నరికే అమానవీయ దుష్టాంతం ఇది.

మళ్ళీ తన భార్యను బ్రతికించే క్రమంలో తెగిన తల కోసం వెతకగా కేవలం మొండెం మాత్రమె దొరకగా ఒక మాదిగ స్త్రీ తలను నరికి రేణుక మొండానికి అతికించి ప్రాణం పోసాడు. అప్పటి నుండి రేణుక ఎల్లమ్మ గా పిలువ బడుతోంది అని ఐతిహ్యం.  అందుకే కింది కులాల లో ఇంటికొక  ఎల్లమ్మ ఉంటది.

ఎల్లమ్మ  అంటే ఎల్లలు లేని దేవత అని అర్ధం. ఆమె సోదరీమణులు అయిన మన గ్రామ దేవతలు ఈదమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, పోలేరమ్మ(పొలి అంటే పోలిమెర-సరిహద్దు), పోచమ్మ, అంకాలమ్మ, సవారు లచ్చమ్మ, పైడితల్లి, గంగానమ్మ, కోట మైసమ్మ, కట్ట మైసమ్మ బందం మైసమ్మ గా గ్రామ గ్రామాన అనేక పేర్లతో విస్తరించి ఉంది. ప్రతి ఇంట్లో తమ ఆడ బిడ్డలను ఆ రూపం లో గౌరవించుకుంటూ ఆ పేర్లు పెట్టుకుంటున్నారు. ఏది ఏమయినా ‘గ్రామ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన స్త్రీలనే దేవతలుగా భావించి గ్రామానికి రక్షణ కల్పిస్తున్నారు’ ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి

3

దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది.

ఆధిపత్య శిష్ట ధోరణులు ఈ గ్రామ దేవతలను కబలిస్తున్నాయి.ఆదిమ కాలం నుండీ అనుసరిస్తున్న పూజా విధానంలో వైదిక సనాతన క్రతువు తిష్ట వేసింది, ఇప్పుడు చిందు,డక్కలి,బవనీలు అలంకార ప్రాయం అయ్యారు. భత్యం   విదిల్చి గుడి చుట్టూ దాని సంపద చుట్టూ ఈగల్లా బెల్లం నాకేస్తున్నారు.

అసలు రాజ్యం కనుసన్నల్లో బోనాలు దానికి తోడు  వందిమాగదులు పొగయ్యారు. దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది.

సట్టిలో వండే సప్పిడి పులగాన్ని బంగారు గిన్నెలో వండినంత మాత్రాన దాని రుచి మారుద్డా ? శావణమాసం జోగినీ, బవనీ, పంబాల, బైండ్ల,శివసత్తులకి కాస్త గాసం దొరికే మాసం, రాత్రికి రాజులుగా పగలు యాచకులుగా ఆదిపత్య కుల పోరాటాల పైరవీకాల్ల పద ఘట్టనల మధ్య చీమల్లా నలుగుతూన్న అస్తిత్వం వీళ్ళది. ఈ క్రతువులో దేవదాసీలు, మాతంగులు ముందుంటారు. శాక్తేయ పరంపరలో జరిగే ఈ ఆరాధన లో కింది కులాల వారే  పూజారులుగా ఉంటారు. వీరి కేంద్రీకృతంగా జరిగే ఈ తంతు ఆదిమ సమాజాల నుండే ఉన్నప్పటికీ  మధ్య యుగాల్లో అది వికృత రూపం దాల్చింది

4

ఈ బోణాల పరంపరలో అమానవీయ సంస్కృతి రంగం. తరతరాలుగా మాతంగి  కుటుంబీకులు కత్తితో లగ్గం ఆడి రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తూ ఒక నమ్మకాన్ని విస్వాశాన్ని కొనసాగిస్తున్నారు. మూలవాసుల  విశ్వాసాల మీద  ఆధునిక హేతువుతో వేసే ప్రశ్నలు నిలబడవు.

కేవలం సప్పిడి పులగానికి బంగారు తెలంగాణ  తన బడాయిని వజ్రాల ముక్కుపుడకలు, బంగారు తాపడ బోనాలు సిద్ధం చేసి బ్రమకు బంగారు పూత పూస్తున్నారు . ఏటా పార్టీకి ఒక ,  ప్రవరకొక, పూటకొక పంచాంగం చెప్పే ఆధిపత్య కుల పూజారుల పంచాంగ విశ్వసనీయత ఈ గుడి ముందు ఎప్పుడూ దిగదుడుపే.

ఆదిమ కాల విశ్వాసాల్లోకి ఆధునికత ఎంత దూకుడుతో వచ్చినా అది బియ్యం లో వడ్ల గింజలా సంకరమే.

5

ఖమ్మం పట్టణానికి పక్కనే ఉన్న మా ఊరు(తల్లంపాడు)లో కొన్ని తరాలుగా గ్రామ రక్షణగా ఉన్న ‘మైసమ్మ’గుడి పునర్నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ క్రమం లో స్థానిక శిల్ప, అద్దక, తాపీ మేస్త్రీ విద్వత్ స్వయంగా చూసా. గ్రామాల్లో వాడకొక మైఖేల్ ఏంజిలో, డావెన్సీలు ఉంటారు. డేవిడ్ లాంటి కుదమట్టంగా ఉండే బాహుబలులూ కనబడతారు. ఆ క్రమం లో ఇటీవల మైసమ్మ గుడి నిర్మించారు. ఇది మా తమ్ముడు గుఱ్ఱం శ్రీనివాస్ కట్టాడు, ఇంకో తమ్ముడు రామకృష్ణ ఆ శిల్పాలు తయారు చేసాడు. ఇంకో మిత్రుడు వెంకటేశ్వర్లు  రంగులు అద్దాడు. వీళ్ళెక్కడో శిల్పశాస్త్ర విద్యలు నేర్వలేదు. ఆగమ శాస్త్ర, శస్త్ర,స్రష్టలూ కారు. బ్రతుకుల్లో అష్టవంకరలు ఉన్నా, నుదిటి మీద గీతలు సరి లేకున్నా చేతిలో మట్టి, సున్నం, సిమెంట్ ఒదిగి పోయింది. వివక్షను నుదుటి బొట్టులా ధరించిన కురూపి బొమ్మలు, వాళ్ళ కరుకు చేతుల సుకుమారానికి సిమెంటు, రాళ్ళు, ఇటుకలు వాళ్ళు వదగమన్న చోట వదిగాయి. ఆ చేతులు  ఇంద్రధనస్సు కు తాపడం పెట్టగలవు.

ఇది వెలివాడల

అంటరాని జీవితాల్లో దాగున్న  తుమ్మ పూలంత సౌందర్యం.

బీరపూవంత సుకుమారం

ఇవి కవెల కట్టెల్లో శిధిలమౌతూ ..

చరిత్రలో విస్మరణకు వెలివేతకూ లోనవుతూ…

ఒక విషాద గాధలా…

వీటిని వినేందుకూ రాసేందుకు నువ్వు మనిషిగా మళ్ళీ పుట్టాలి…

6

ఈ నెల  ఆగష్టు పదహారు నుండి పందొమ్మిది మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన తంతు మా ఊరిలో ఎప్పుడో నూటా యాభై ఏళ్ళ కింద లేదా అంతకు ముందు జరిగి ఉండొచ్చు అని అమ్మ అన్నది. అది చూసిన విన్న వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. పాత ఊరిలో శిధిలం అయిన ఆ గుడి పునర్నిర్మాణ పనులు నా చిన్నతనం నుండే కొత్తది కట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నా మా  తమ్ముడు మొదట పూనుకొని పని మొదలు పెట్టాడు. గుడి కట్టడం అంటే చిన్న పిచ్చుక గూడు కట్టినంత తేలిక కాదు. ఖర్చు ‘నిష్ట’తో కూడుకున్న వ్యవహారం. ఈ క్రతువులో అతి ముక్యమైనది జంతుబలి , బలి తర్వాత ఊరుచుట్టూ  బలి తిరగడం. అత్యంత బయోత్పాత మైన పని అది. ఆ తంతు చూడడానికి వేలాది మంది జమ కూడతారు. తినడానికి తిండి లేని జనాలకు ఇంటి మీద సరిగా కప్పు లేకున్నా ఊరి బయట ఉండే గుడి నిర్మాణం విషాదం లో విషాదం. మొత్తానికి ప్రజల్లో పెరుగుతున్న భక్తి అనుకోవాలో భయం అనుకోవాలో పెద్ద మొత్తం తో నిధులు సమకూరాయి.

నేను పదహారు అర్ధరాత్రి ఊరికి చేరా. కాలనీ మధ్య కాళీ స్థలంలో రెండు హోమ గుండాలు ఒక  చతురస్రాకారం లో మరొకటి గుండ్రంగా అందంగా మట్టితో అలికి ముగ్గులు పెడుతున్నారు. కింది కులాలలో ఈ హోమాలు ఉండవు ఏనాడు అయితే ఈ క్రతువు చుట్టూ డబ్బు పోగు అయ్యిందో సాంప్రదాయం పేరుతో కుల పూజారుల విశ్వసనీయత ప్రమాదం లో పడుద్ది. ఆరోజు ఎందుకో వేల ఏళ్ళుగా ఈ క్రతువు నడిపే ‘బవనీ’ ఉనికి అస్తిత్వం ప్రశ్నార్ధకం అయ్యింది. సాంప్రదాయంగా వస్తున్న ఒక క్రమానికి ఆధునికత పేరుతో జరిగే ఎక్కిరింత అది.  అక్కడ హోమాలు సాంప్రదాయ ముగ్గులు,కొబ్బరి,గుమ్మడి,ఇతరత్రా సామాగ్రి జమకూడింది. మొదటి రెండు రోజులు సంప్రదాయ కుల పూజారి అయిన బైండ్ల వెంకన్న మౌనంగా తన పరంపరలోకి దూసుకొని వచ్చిన సంస్కృత క్రతువు వెక్కిరింతల మధ్య గడిచింది. లీటర్ల కొద్దీ పాలు,నెయ్యి, హోమగుండంలో ఎండిన  తంగేడు,మోదుగు,సండ్ర సమిధలుగా పదహారు రోజులు ఆరకుండా ఆవిరి అయ్యాయి. పూజా,పుణ్యాహ వచన,పంచగన్య,ప్రవచన,అఖండదీపారాధన,అగ్నిహోమం,యాగశాల,మండపారాధన,నవగ్రహ, అష్టదిక్పాలక,  మంత్రం పుష్ప,తీర్ధ ప్రసాద, ధన, ఆర్ష, జల, పుష్పఅభిషేకాలు, యంత్ర లాంటి క్రతు లాంటి అర్ధం కాని సంస్కృత శ్లోకాల ఉక్కిరిబిక్కిరి మధ్య ‘సనాతన వైదిక’ పరంపర ముగిశాక మూడో రోజు బైండ్ల వెంకన్న తన ఆధీనం లోకి తీసుకున్నాడు.

అప్పటిదాకా జరిగిన క్రతువు వాళ్ళ జీవితం లో  ఏనాడూ లేనిది. బవనీ ప్రవేశంతో ఆ ప్రదేశానికి ఒక్క సారి జవసత్వాలు వచ్చాయి. మూడో రోజు శివసత్తుల డప్పు కేరింతలతో ఊరు ఊరంతా శిగం ఊగింది. రోజంతా  చిందాడిన శివసత్తులు తమ అలసట భారాన్ని మైసమ్మ గుడి ముందు మందు బీర్ బాటిల్స్ చీర్స్ కొట్టడం కల్లుపాక ఎల్లమ్మ గుడి ఎందుకు కలిసి ఉంటాయో అర్ధం అయ్యింది. ఆ రాత్రి మొత్తం  బైండ్ల ఎల్లమ్మ కథ లయల మధ్య చివరి రోజు జరిగే భయానక ఉద్వేగాల ఎదురు చూపులతో ఆ రాత్రి నిద్రోయింది.

7

చివరి రోజు అతి ముఖ్యమైన రోజు అనిపించింది. వేలాది మంది ఊరును జాతర  చేసారు. బలి నిర్వాహకుడికి  స్నానం చేయించి. బలి కోసం తయారు చేసిన కత్తికి పూజలు చేసి. కంకణం కట్టి, కులపెద్దకి గజ్జెలు కట్టి వీరపూజ చేసి కత్తికి నిమ్మకాయలు కుచ్చి, కత్తిని గడప గడపకూ సాకబోసిన ఉద్వేగాల నడుమ బొడ్రాయి దాకా ఊరేగింపుగా వెళ్ళారు. తిరిగి గుడి వైపు వచ్చేముందు గ్రామగవిడి ముందు బలమైన దున్న కుర్రకు   నాలుగు వైపులా తాళ్ళు కట్టి వొక్క వేటుతో తెగిన తల వేలాది మంది శిగం ఊగగా జరిగింది. రెండో దున్న గుడిముందు. మరో రెండు మేక పోటేల్లు కోసి పొట్ట చీల్చి పేగులు మేడలో వేసుకొని, దొబ్బను నోట్లో కరిసి, జొన్నలతో వండిన అన్నం లో కుంకుమ రక్తం కలిపి వాడ సరిహద్దుల చుట్టూ బలి తిరిగి అశ్శరభ శరభ ల మధ్య గ్రామం చిందాడింది. నాలుగు రోజులు నిరవధికంగా జరిగిన ఒక హోరు విశ్రమించింది. వందేళ్ళ తర్వాత  జరిగిన ఈ క్రతువు తరానికి తరానికి మారుతూ వస్తోంది. మల్లెప్పుడు జరుగుతదో తెలియదు.

ఈ క్రతువు ప్రత్యక్షంగా చూసిన నాకు ఎక్కడో ఆఫ్రికా ‘చీకటి’ ఖండం లో నోబెల్ గ్రహీత వోలె సోయింకా రాసిన “డెత్ అండ్ కింగ్స్ హార్స్ మాన్” అనే నోబెల్ పురస్కార రచన యాడికి వచ్చింది . నైజీరియా లో ఎరూబా తెగలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రాసిన నాటకం అది. “రాచ పీనుగ ఊకెనే పోదు” అనే సామెత ఎందుకు వచ్చిందో నాకు ఎరూబా తెగ రాజు ఆచారాలు చదివాక అర్ధం అయ్యాయి. స్థూలంగా నాటక కథ ఒక మారుమూల  తెగ ఆ  రాజు చనిపోతే ఆ తెగ అంతిమ క్రతువులో రాజు  గుఱ్ఱం, కుక్క తో బాటు ఆయన ప్రధాన అశ్వకుడు కూడా ఆత్మార్పణ చేసుకోవాలి. ఒక వేల ప్రధాన అశ్వకుడు చనిపోతే, లేక అనారోగ్యంగా ఉంటె ఆయన పెద్ద కొడుకు ఆ బాధ్యతను నెరవేర్చాలి.  వినడానికి భయంగా ఉన్నా డెబ్బై ఎనభై ఏళ్ళ కింద దాకా ఈ ఆచారం ఉంది.

బ్రిటన్ వలస పాలనలో ఉన్న కాలం అది నాడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్న ఒక తెల్ల దొర సైమన్ పికింగ్స్, ఆయన భార్య లండన్ లో మెడిసిన్ చదువుతునన్న  ఆ ప్రధాన అశ్వకుని కొడుకుని  ఒప్పించి ఎలా గయినా ఆ క్రతువు ఆపాలని చేసే ప్రయత్నం. అతను ఓడ లో బయలుదేరిన ఆ ఊరికి  వచ్చేదాకా జాగారం చేస్తూ  రకరకాల నివేదనలు చేస్తూ ఉంటుంది పల్లె.
అతని పేరు ఒలుండే. తమ తెగ మత విస్వాశాలకు అనుగుణంగా ప్రధాన ఆశ్వికుడు,ఆయన కొడుకు ఒలుండే తమ ప్రాణాలను అర్పిస్తారు.దీని అర్ధం ఆదిమ తెగలు తమ సాంస్కృతిక ఉనికి ప్రశ్నార్ధం అయినప్పుడు దానిని కాపాడు కోడానికి తనువు అర్పించడానికి వెనకాడరు.వలసపాలన తమ మూలవాసుల ఉనికిని అస్తిత్వాన్ని కబలిస్తున్నాయి అనీ,దానికోసం కొన్ని ప్రాణాంతకమైన పనులకూ వెనకాడరు. తరాలుగా నమ్మిన విస్వాశానికే ఒలుండే తలొగ్గడం ఈ నాటకం ముగింపు.”

నాడు జరిగిన సంవాదం లో “ఆధునికత పేరుతో మీరు తెచ్చిన విద్వంశం మా రక్త నాళాల్లో చేరి కలుషితం అయ్యింది. మీనుండి నేర్చుకునేంత దుస్థితి లో నా నాగరికత లేదు అని అంటాడు. ఎక్కడో మాఊరుకి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం లో జరిగిన ఒక సంఘటన ఒకే భావోద్వేగాలను కలిగి ఉండడం . ఒక మనిషి కోసం నమ్మిన విస్వాశం కోసం ఆత్మార్పణ చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయ ఆలోచనగా చూడాలి. “ఒలుండే” నుండి నర్మదా నదిలో దూకిన ప్రతాపరుద్రుని దాకా ఒక ప్రాంతీయ విముక్తి కోసం వేలాది మంది అమరులు అవడం. ఎక్కడయినా ఒకే ఉద్వేగాన్ని కలిగి ఉంటుంది అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆదిమ లేదా మూలవాసుల ఆచార వ్యవహార అలవాట్లు మధ్య కొనసాగుతున్న ఒరవడి నాటి నుండి నేటిదాకా కొనసాగడం వెనక నడిచిన రక్త నదిలో నమ్మిక,విస్వాశం వెనక భయోత్పాతం మూలాలు ఇంకా లోతుగా రాయాలి అనిపించింది.
ఎంతో ప్రజాదారణ పొందిన నైజీరియా ఒలుండే నిష్క్రమణ మాఊరు పక్కనే ఉంది అనిపించింది. మా ఊరిలో దున్న కుర్రను వేలాది మంది చూస్తుండగా వధించడం అందునా నరికిన వీర కత్తిని, నరికిన వాణ్ణీ పవిత్రంగా పూజించడం చూస్తే విభ్రమణ కలిగింది.

చూస్తే ఇదొక ఆటవిక అనాగరిక, హింసాత్మక చర్యలా అనిపించొచ్చు. నాస్తిక హేతువాదులు ఇందులో అనాగరికం వెతుక్కోవచ్చు. అయినా ఒకటి నిజం బలి ఆదిమ సమాజాల శిలాజం, వేట ప్రధాన వనరు అయినప్పుడు దొరికినదేదో ఒక ఉత్సవంలా వేడుకలా జరుపు కొనే ఒక సామూహిక వేడుక. ఈ సమాజం లో నూటికి తొంబై మంది తమవి కాని సాంస్కృతిక బరువులను మోస్తున్నారు. ఆధిపత్య ఐతిహ్యాలను ని దిక్కరించిన తమ వైన జ్ఞాపకాలను నాగరికతను కాపాడుకుంటున్ననిమ్న సాంస్కృతిక ఆలోచనలలో హేతువును వెతకగలమా? తమ తెగ రక్షణ కోసం పొలిమేర చుట్టూ బలి చల్లి ఏర్పరుచుకున్న హద్దులు వాటికి కాపలాగా గ్రామ గవిడిలో నీ ఆధునిక హేతువుకి అందని ఏదో ఒక నమ్మకం విశ్వాసం ఉండొచ్చు. దానికి గౌరవిస్తావా ఈసడిస్తావా అనేది నీ విచక్షణ మీద ఆధార పడి ఉంటది.

 

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

11 comments

Leave a Reply to Naryana Sharma Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వ్యాసం చాలా బాగుంది అనడం కంటే ఆలోచనలని ,అంతరంగ కల్లోలాన్ని ఏకకాలంలో రేపింది.
    అనేక ప్రశ్నలు మొలకెత్తాయి.ఆధునికతలో భాగంగా గ్రామదేవతల పూజావిధానం బ్రాహ్మణీకరించబడుతొంది.ప్రాచీన ఆచారాలు అనాగరికమైనవిగా భావించబడ్తున్నాయి.ముఖ్యంగా బలులు.క్రైస్తవ ప్రభావం బలుల పట్ల వ్యతిరేకతకు కారణంగా కనబడుతుంది.గురజాడ లాంటి బ్రాహ్మణ సంస్కర్తలే కాదు , జాషువా లాంటి దళిత కవి కూడా బలులని గ్రామదేవతల పూజా విధానాన్ని చిన్న చూపు చూసాడు.సనాతన బ్రాహ్మణులు ఎప్పుడూ ఇటువంటి వ్యతిరేకత వ్యక్తం చెయ్యలేదు.వారికి గ్రామదేవతల పట్ల చిన్నచూపు ఉండవచ్చు గాక.కానీ శుద్రుల సంస్కృతులని సంస్కరణ పేరుతొ రూపుమాపే ఆధునిక పాపానికి వొడికట్టలేదు.పైగా రామాయణం ‘ తదన్నాహ్ తస్య దేవతాః అని ఎవరి ఆచారాన్ని బట్టి వారు శాకాహారులు శాకాహారాన్ని,మా౦సాహారులు మాంసాన్ని వారి వారి దేవతలకి నైవేద్యం పెట్టాలని రామాయణ వాక్యాన్ని పండితులు ప్రమాణంగా భావిస్తారు. కానీ ఆధునికత శుద్ర సంస్కృతికి ముప్పుగా పరిణమించింది.గుర్రం సీతారాములు గారూ ఏమంటారు?

    • అవును సర్, గ్రామ సంస్కృతులు,అందునా శూద్ర కులాల ఆచార వ్యవహారాలు అలవాట్ల మీద ఏహ్యభావం తో వలసవాద క్రైస్తవం తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది , మీ భాషలో వైదిక భావన మీద ప్రచ్చన్న క్రైస్తవం కొనసాగింపుగా మారిన హైందవం లేదా హిందుత్వ దాడి. దానికి ఆధునికత పేరుతో వామపక్ష రాజాకీయాలు మరింత కీడు తలపెట్టాయి. వ్యక్తిగత ఆస్తి రద్దు భూమిక గా ఉండాల్సిన వామపక్ష రాజకీయాలు శూద్ర కులాల లో హేతు రాహిత్యాన్ని అవహేళన చేస్తూ వందల కోట్లు వెనకేసుకోవడం మరొక వింత. నా లక్ష్యం ఆదివాసీ దళిత బహుజన ఆచార అలవాట్ల లోకి శిష్ట పాండిత్య జోక్యం. దానివెనక ఉన్న పవర్ పాలిటిక్స్,

  • వ్యాసం చదివాక కొన్ని విషయాలను పంచుకోవాలనిపించింది సీతారాములు గారు.
    1.పూజా విధానాలు తాంత్రికాలు తాంత్రికేతరాలు(మంత్ర సంబంధమైనవి)రెండు రకాలు.మొదటిది సనాతనధర్మ పద్ధతికి వేరుగా జరిగేది.ప్రాకృత కాలానికి దివ్య కథ,మనుషీ కథ,దివ్య మానుషీ కథ అనేమూడు కథలు కనిపిస్తాయి.దివ్య మానుషీ అంటే తమవాళ్లతో ఉండి వాళ్లకోసం జీవితాన్ని ఫనంగా పెట్తినవాళ్ళు.బహుశః గ్రామ దేవతలు అలాంటివాళ్లే.. చాలా వరకు ఇలాంటివి మౌఖిక వాఙ్మయంలో ఎక్కువ.(కాలంలో మారుతున్నాయేమో కూడా)

    2.గ్రామ దేవతలకు వైదిక క్రతువులు అలవాటులో లేవు.నిజానికి రూపాలు కూడా.ఇప్పుడు విగ్రహాలు పెట్టడం ఎలా తయారౌతుందో.ప్రతిష్ఠాసంబంధమైన క్రతువులు కూడా లాగే కనిపిస్తున్నాయి.నాకు తెలిసి హైదరాబాదు నగరంలో బలులులను చేసే గ్రామదేవతల ఆలయాలు చాలా తక్కువ.ఈ మధ్య బోనాలలో ఈ నిషేధం బహిరంగంగా కూడా ప్రకటించారు.
    మార్పువస్తున్నది నిర్మించే వాళ్లలోనే..ఈ క్రతువుల పట్ల ఆరాధన పెరగడం వల్లనే అనేది గమనించాల్సిన విషయం.
    మా వూరికి దగ్గరలో నారసింహ స్వామి ఆలయం ఉండేది.(దేవుని పల్లె)అక్కడ ఇప్పటికీ జంతుబలులు చేస్తారు.ఇంకొన్ని చోట్ల మానేశారు.
    హైదరాబాదులో ఆశ్వియుజంలో చతుష్షష్టి పుజలు చేసే పెద్దమ్మ ఆలయాలనూ చూసాను.క్రతువుల మార్పును ప్రశ్నించాల్సింది ఎక్కడో మీకు తెలియంది కాదు.

    బలిగురించేమాట్లాడితే పూర్వం అన్నీటికి యూపదారువు,యూపం (బలి జంతువు-మేక)ఉండేది.కాల క్రమంలో మారింది.ఇప్పుడు గుమ్మడి కాయలు ఉపయోగిస్తున్నారు.పంచతంత్రం,హితోపదేశం లాంటి వాటిల్లో దేవ శర్మ లాంటివాళ్లు మేకలు కొనే కథలు చూసే ఉంటాం.బలి సామాజిక మార్పే కాని..ఆగమ శాస్త్రం కాదు.

    నామటుకు నేను అనుకోవటం. ఇప్పటి సనాతన ధర్మాల ,ఆచారాల కిందకూడా మానవ సంస్కృతికి,నాగరకతకు సంబంధించిన మూలాలే ఉన్నాయి.ఇవి భారి మార్పుకు వందల,వేల సంవత్సరాల క్రితమేలోనయ్యాయి.
    3.మీరన్నట్టు నమ్మకాలు,ఈసడింపులు “విచక్షణ”మీదే ఆధారపడి ఉంటాయి

  • ఇంకేం, ఇలాంటి “ఆధిపత్య ఐతిహ్యాలని ధిక్కరించి తమవైన జ్ఞాపకాలను నాగరికతను కాపాడుకుంటున్న నిమ్న సాంస్కృతిక ఆలోచనల” ను ఇప్పటికీ కొనసాగిస్తూన్న నేపాల్ వెళదాం. అక్కడ 2019 లో బరసా ిజిల్లాలోని బరియార్ పూర్ లోని ‘గాధీమాయీ’ దేవాలయంలో జరగబోయే ‘‘గాధీమాయీ’’ ఉత్సవంలో సింపుల్ గా ఓ యాభై వేల దున్నలని బలిద్దాం (ఐదేళ్ల కొకసారి జరిగే ఉత్సవం ఇది). అక్కడకి వలసవాద క్రైస్తవం ఇంకా ప్రవేశించలేదు గనక ఈ ఉత్సవంలో దున్నల బలులు ఆగే అవకాశమే లేదు. మాధేషీ ప్రజల నిమ్న సాంస్కృతిక ఆలోచనలను గొప్పగా ఈ విషయంలో పరిరక్షిస్తున్న నేపాల్ ప్రభుత్వానికి జైకొడదాం. దానిని ఆపడం విశ్వాసాల ఈసడింపుగా, వలస క్రైస్తవ హేతువాద సాంస్కృతిక దురాక్రమణగానే ప్రచారం చేద్దాం.

    • నేపాల్ దాకా ఎందుకు నీ పక్కనే నీ ఊరిలోనే రోజుకొక్క అమానుషం జరుగుతున్నా పట్టించు కోకుండా,ఇంట్లో మేక మాంసాన్ని ఆవుమాసం చేసి చంపేసే చోట, యాడాదికి ఒక రోజు అందునా నూటా యాభై ఏళ్ళ తర్వాత ఒక నమ్మకానికి ఒక జంతు బలి చేసారు . అది తప్పా ఒప్పా అనే చర్చ కన్నా ఆ క్రతువులో పెరుగుతున్న ఆధిపత్య ఆలోచనల మీద నిరసన కోసం రాసా. అదేదో మనం స్టార్ హోటల్ లో రకరకాల వన్యప్రాణి మంసాలను నంజుకోనట్టు,నోరే తిరగని పేర్లతో రకరకాల వేలాది జంతువులను కాఫీ టేబుల్ నియాన్ లైట్ వెలుగుల్లో హరిస్తూ ఉందాం.ఆ తర్వాత భూత దయ గురించి వలపోద్దాం. ఆధునికులు ఆదిమ సమాజాల నమ్మకాలను విస్వాశాలను ఏనాటికీ ఎప్పటికీ అర్ధం చేసుకోరు. ఈ ఆధునికతే వాడి పీక కోసేసింది. మాధేషీ ప్రజల నిమ్న సాంస్కృతిక ఆలోచనలను ఒక మాస్ హిస్టీరియా, మాల మాదిగ గూడేలలో యాడాదికి ఒక్కరోజు జరిగే అలవాటు వాళ్ళ జీవితం లో ఆహార అలవాట్ల లో భాగంగా జరిగేవి.రెంటికీ పొంతన లేదు. అందుకే సోయింకా ఆధునిక హేతువు జోక్యానికి నిరసనగా అవసరం అయితే ప్రాణాలు త్యాగం చేస్తారు.ఇది వాళ్ళ జీవితం లోకి ఆధునికత పేరుతో జరుగుతున్న జోక్యానికి నిరసన. కానీ సోయింకా అత్మాహుతి ని సమర్ధించాడు అని కాదు.అంతే కాకుండా ఈ పుస్తకం లోని తిరుగుబాటును నోబెల్ కమిటీ ప్రత్యేకంగా రాసింది. నాకేమీ నోబెల్ పురస్కారం మీద గౌరవం లేదు.మనం మాట్లాడుతున్నా ఆధునిక హేతువు ఈ ప్రపంచం లో అన్ని ఆదిమ వాసులను ఈ భూమి మీదనే లేకుండా చేసింది.ఆఫ్రికా,అమెరికా అబోరిజినల్స్,ఆస్ట్రేలియా మూలవాసులు,ఇక్కడి ఆదివాసులు.వాళ్ళు చేస్తున్న జంతు బలికి ఒక నియతి ఉంది. ప్రత్యుత్పత్తి ఉన్న జంతువును మాత్రమె వాడు వేటాడి తింటాడు.ఆధునికుడు అంతరించి పోతున్న కృష్ణ జింక,దుప్పి,కుందేలు,ఇంకా అరుదైన జాతిని విస్కీ సిప్ మధ్యలో నంజుకుంటూ.ఇదే ఆదివాసీకీ సో కాల్డ్ నాగరికునికీ మధ్య ఉన్న నియతి. ఈ వైరుధ్యం అర్ధం అయితే నా ఫీల్డ్ నోట్ లక్ష్యం నెరవేరినట్టే.

      • అదేదో నీ ఇంటిప్రక్కన జరిగినట్లు, నువ్వు చూసినట్లు వ్రాసావే. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యకు, మేకమాంసానికి, గోమాంసానికి ముడిపెట్టి బూటకపు ప్రచారం సాగించినప్పుడే మన లక్ష్యం విద్వేష ప్రచారం అని ప్రపంచానికి అర్థమయింది. ఆ క్రతువులో పెరిగేది ఆధునిక ఆలోచనల పట్ల నిరసనో, లేక మౌఢ్యాన్ని మళ్లీ తలెకెత్తుకోవాలి, అదే ఈ సాంస్కృతిక రక్షణ అనే అపరిపక్వ, రాజకీయ ప్రయోజన లక్ష్యమో ప్రజలే చదివి తేల్చుకుంటారు. వన్యప్రాణి మాంసాల దాకా పోనక్కరలేదు. ప్రపంచవ్యాప్తంగా రోజూ ఆబగా మేస్తున్న వంద రూపాయల, రెండు వందల రూపాయల కోట్లాది చికెన్ బిరియానీలవల్ల పర్యావరణం ఎంత ధ్వంసం అవుతుందో సైన్స్ ఇటీవలిి పరిశోధనలు చెబుతున్నాయి. వాటినెవడూ సమర్థించడంలేదు. మాధేషీల మాస్ హిస్టీరియా కూడా ఆ ఆదివాసీ అలవాటు నుండే పరిణామక్రమంలో పెల్లుబికిందన్న సత్యాన్ని మరచిపోతే ఏ నోట్ వల్లనా ఏ ఉపయోగమూ లేదు.

  • Better not to miss the focus of the narrative. This is certainly not about veganism which is gaining certain momentum at s global level. As far as I understand about the brahminist expansion into the ritualistic domain of other groups in an essential field of food offering and-sharing practices. But here Sri Narayana Sarma indicates that this is happening due to the voluntary participation of those people in those Brahninistic ritual and otherwise they will totally stay away from them. Somebody that has empirical evidences may throw some light on this.

    • కల్చరల్ టెర్రరిస్టులు గా అర్బన్ బ్రాహ్మిన్స్.
      స్థానిక సంస్కృతితో సంప్రదాయాలతో తెగతెంపులు చేసుకొని,ఆధునిక యూనివర్సల్ [పాస్చాత్య]హేతుబద్ధతని ఆరాధించే శిష్ట వర్గమే అర్బన్ బ్రాహ్మిన్స్. వీరు కోట్లాది దేవి దేవతల స్థానంలో , ఆచారాల క్రతువులు స్థానంలో వొకే మూస సంస్కృతిని వొకే జాతీయ దేవుడిని నిలపాలని చూస్తారు. అదే గుడి రాజకీయం. యీ రాజకీయానికి బానిస కార్యకర్తలు శుద్రులు,అతిసూద్రులూ.
      నిజానికి సనాతనులెవ్వరూ వొకే మూస పద్ధతిని అందరి నెత్తిమీద బలవంతంగా రుద్దలేదు.శాకాహారాన్ని ఎంతాగా సమర్థించే వాళ్ళు ఉండేవారో మాంసాహారాన్ని సమర్థించే వాళ్ళు కూడా ప్రాచీన భారతంలో అంటే కనబడతారు.నిజానికి చరకుడు మాంసాహారం కొన్ని రోగాల నివారణ కి అవసరమని భావించాడు. కొందరు జైనులు,బౌద్ధులు వైద్యంలో కూడా మాంసాహార నిషేధాన్ని సమర్థించారు.అశోకుడు లాంటి బౌద్ధరాజులు కొన్నిరోజులపాటు చేపలు పట్టడం నిషేధించడం వంటి చర్యలకి పూనుకొన్నారు.మాంసాహారం వే ట ల పట్ల చిన్నచూపు కొన్ని జాతుల పట్ల వివక్షకు కారణమైందని కొందరు మేధావులుఅంటారు.అంటే అహింసాత్మకమైన హింస అన్నమాట.
      ధర్మవ్యాధుడు మాంస విక్రయాన్ని తన ధర్మమని బ్రాహ్మడికే బోధించాడు.కాళిదాసు శాకుంతలంలో – ఒక జాలరి చేపలు పట్టే వృత్తి బ్రాహ్మణ యజ్ఞ బలి లాగే పవిత్రమంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటకలో బ్రాహ్మలు యజ్ఞం చేసి పశు బలి చేస్తే ఇటువంటి హేతువాదులు ఖండించారు. అప్పుడు ఒకదినపత్రికలో ఒక మేధావి నేను రాసిన లాస్ట్ బ్రాహ్మణ ని ఉదహరిస్తూ ,బలిని సమర్థించాడు.
      ప్రాచీనకాలం లో మధ్వాచార్యులు జంతు హింసని వ్యతిరేకించారు. ఆయనజన్మభూమి ఐన కర్ణాటకలోనే పై సంఘటన జరిగింది.కారణం ఆధునిక కాలం వరకు వొకే సంస్కృతి ఎవరి నెత్తి మీద రుద్ద బడలేదు. ఆధునిక హేతువే మూస ఆలోచనకి బీజం.
      ఆధునిక హేతువుని ఆరాధించే లెఫ్ట్ రైటులకి చెందిన అర్బన్ బ్రాహ్మిన్స్ లోకల్ కల్చర్ లకి శత్రువులు. వైట్ హెడ్ అనే క్రైస్తవ మిషనరీ గ్రామదేవతల బలులు లాంటి ఆచారాలు యూదుపాత నిబంధన ఆచారాలవలె వెనుక బాటుని సూచిస్తాయి అన్నాడు. అంతే కాదు బ్రాహ్మణ శిష్ట గుడి పూజలు ఆర్య పద్ధతులు అని పొగిడాడు. ప్రచ్ఛన్న క్రైస్తవులైన అర్బన్ బ్రాహ్మిన్స్ కి వైట్ హెడ్ గురువు.
      చిను ఆఛాబే,గూగి వంటి ఆఫ్రికన్ మేధావులని అవసరానికి ఆకాశానికెత్తే లెఫ్ట్ అర్బన్ బ్రాహ్మిన్స్ వారు చెప్పిన సాంస్కృతిక అంశాలని పట్టించుకోరు.ఎందుకంటే వారు కూడా యూనివర్సలిజం అనే ముసుగు ధరించిన పాస్చాత్య వలస స౦స్కృతి కి అది చాటే ఆధునిక హేతువుకి బానిసలు.[నేను చెప్పిన వాటికి పూర్తీ ఆధారాల కోసం నేను రచించిన లాస్ట్ బ్రాహ్మిన్, సనాతనం ఆధునికత గ్రంధాలు పరిశీలించండి.]
      యీ వ్యాసంపై దళిత లెఫ్ట్ థింకర్స్ మౌనానికి ఆధునిక హేతు బానిసత్వమే కారణమా?

      • “దళిత లెఫ్ట్ థింకర్స్ ” నా దృష్టిలో ఈ దేశానికే ‘థింకర్స్’అనే భావనే నప్పదు.
        ఇక ‘దళిత’ అవి సజ్జలు సర్, కాస్త కటువుగా ఉన్నా నిజం. ఇక్కడ దళిత మేధావులకు పుట్టిన ప్రాంతం నుండి అవ్వా అయ్యల నుండి యేవో వారసత్వ రాజకీయాలు వస్తాయి.కళాశాల,లేదా విశ్వవిద్యాలయం లో ఆవేశంలో తెలిసీ తెలియని వాదాలు తాత్విక చర్చలూ నడుస్తాయి.కొంత కాలం రైట్, ఆ తర్వాత లెఫ్ట్,అల్ట్రా లెఫ్ట్, దళిత్ లెఫ్ట్, పక్కల కులపు రాజకీయ నాయకుడో,ఐఏఎస్, ఐ పి ఎస్ ప్రాపకం ఎలాగూ ఉంటది. అన్నీ వదిలేశాక మూల,పక్కన,లెఫ్ట్ సెంటర్, అంటూ చిట్టచివరకు ఇంత మేధావిని వేలాది ప్రసంగాలు, వ్యాసాలూ రాసా కనీసం MLA కాలేనా అంటారు.
        వీళ్ళు గందరగోళం లో ఉన్నారు అని తెలిసే లోపు అంతా అయిపోతాది.
        ‘లెఫ్ట్ అర్బన్ బ్రాహ్మిన్స్’ అందునా ‘విప్లవ’ బాపనులు ఇంకా ‘నేను’ అనే అనే అల్పత్వాన్ని వదలలేదు.వొక్కడు అంటే వొక్కడు కూడా ‘నేను’అనే మాట లేకుండా ఒక్క సిద్దాంత లేదా మేధో లేదా వాక్యం రాయలేడు. అదొక మానసిక రోగం. మీరన్నట్టు “అర్బన్ బ్రాహ్మిన్స్ లోకల్ కల్చర్ లకి శత్రువులు.” గూగి అచిబి లాంటివాళ్ళు “వారు చెప్పిన సాంస్కృతిక అంశాలని పట్టించుకోరు” మొన్న గూగి హైదరాబాదు వచ్చినప్పుడు ఎంత నిర్లజ్జగా ఉన్నారో నిర్మాణాల లోఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు అక్కడ మీటింగ్ లోనె వ్యాఖ్యానించారు.
        గూగి,అచిబి మా ఇంటి పెరటి మొక్కలు అనగలరు కానీ వాళ్ళ మేధో స్థాయి,
        వాళ్ళ కాలిగోటికి కూడా సరిపోరు. పచ్చిగా మాట్లాడితే ఈ దేశం లో వామపక్ష రాజకీయాలు ” వైట్ హెడ్ అనే క్రైస్తవ మిషనరీ ” కొనసాగింపు.అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ప్రయోజనం ఉండదు.వీళ్ళకు ప్రజలు వాళ్ళ నమ్మకాలు ఆచారాలు అర్ధం కావు చేసుకోలేరు. సింపుల్ గా అవన్నీ ఉట్టి ‘పుక్కిటి పురాణాలు’ అని కొట్టేసి,బెడ్ రూమ్ లో పెళ్ళాల తాళి మీద పెత్తనం చేస్తారు అంతే.
        మహిళలకు క్షమాపణలతో

  • నేను పెరిగిందంతా పట్టణ వాతావరణం కావడం వల్ల.. కుల అసమానత గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. మా నాన్న పేరు పక్కనున్న తోక.. చెప్పగానే నన్ను బ్రాహ్మణ సమాజంలో కలిపేస్తారు(ఇప్పటికీ​ ఇది జరుగుతోంది).

    ఈ మధ్యే వీటి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. నాలాంటి ఔత్సాహికులకు ఇలాంటి వ్యాసాలు బాగా ఉపయోగపడతాయి. కేవలం ఊహలు కాకుండా, సీతారాములు అన్న తన జీవితంలో చూసిన, చూస్తున్న అంశాలను అక్షరీకరించారు. అవి అర్థం కావాలన్నా చాలా జ్ఞానం కావాలి. నిదానంగా ప్రయత్నిస్తున్నాను..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు