కొందరు స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి, కొత్త స్నేహితులని కలవడానికి, “హోరు పోయెట్స్ మీట్”కి హాజరు కావాలని నాకు అనిపించింది. దగ్గరలోనే ఉన్న పాయల మురళీకృష్ణతో బయలుదేరి ఎప్పుడో మాట్లాడిన అనిల్ డ్యానిని, పుప్పాల శ్రీరామ్ ని, అప్పుడప్పుడు మాట్లాడుతున్న సుంకర గోపాల్ ని కలుసుకోబోతున్నాననే ఆనందం ఈ కార్యక్రమానికి నేను వెళ్లడానికి ప్రధాన కారణం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది కవులు వచ్చారు. అలాగే వారితో అనేక అభిప్రాయాల్ని కలబోసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అందుకే ఈ కార్యక్రమం విజయవంతమయ్యింది.
పాయల మురళికృష్ణ, బాడాన శ్యామలరావు, నెట్టిమి రమణారావు, కలమట దాసుబాబు, నేను కలిసి శ్రీకాకుళం నుంచి పెద్దపరిమికి ప్రయాణం అయ్యాం. ఆ గ్రామం కొత్త రాజధాని గ్రామాలలో ఒకటి. సరదాగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సూర్యాస్తమయాన్ని తిలకించాం. కలిసి టీ తాగాం. విజయవాడ చేరువ ప్రాంతాల్లో చిరుజల్లులని ఆస్వాదించాం. తాడేపల్లి నుంచి పెదపరిమి మధ్యలో భీకరమైన వర్షాన్ని చూశాం. 9 గంటల ప్రయాణంలో రకరకాల అనుభూతులతో పెదపరిమి చేరుకున్నాం.
24వ తేదీ ఉదయం చల్లపల్లి స్వరూపారాణిగారు “కవిత్వంలో ప్రత్యామ్నాయ ధోరణులు” మీద చక్కని ఉపన్యాసం చేశారు. దళితులలో కూడా దళితుల చేత పీడించబడుతున్న వాళ్ళు ఆ పీడన నుంచి నిలదొక్కుకుని ఎంత చక్కటీ కవిత్వాన్ని రాస్తున్నారనే అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ కవిత్వ ధోరణిగా బౌద్ధాన్ని స్వీకరిస్తే బాగుంటుందనే ఆమె సూచన కవిత్వంలో నెలకొల్పడానికి బహుశా కొన్ని దశాబ్దాలు పట్టొచ్చేమో? అలాగే కవిత్వంలో భక్తిని ప్రశ్నించగలమా? అని ఆమె వేసిన ప్రశ్న ప్రస్తుత వాస్తవస్థితులకి అద్దం పట్టేదిగా అనిపించింది. పీడితులు ఎప్పుడూ ఆధిపత్య వర్గానికి ప్రతిపక్షంగా నిలవాలి తప్ప, ఆధిపత్య వర్గాలకు సహాయం చేస్తూ వెళ్ళకూడదు అని కలేకూరి ప్రసాద్ గారి మాటల్ని ఆమె గుర్తు చేయడం, అంబేద్కర్ ఎదుర్కొన్న పుస్తక ప్రచురణ సమస్యల గురించి, పితృ స్వామిక వ్యవస్థ ఎవరి వలన మన సమాజంలో ప్రవేశించింది? అన్న అంశాలను గురించి ఆమె చక్కని ఉపన్యాసం చేశారు బౌద్ధాన్ని రాజకీయ దృక్పథంతో దర్శించగలిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుందని ఆమె సూచించిన అంశం ఆలోచించదగినది.
అదే రోజు మధ్యాహ్నం రెంటాల శ్రీవెంకటేశ్వర రావు గారు ‘వచన కవిత్వంలో భాష – పరిశీలన’ అనే అంశం పై ప్రసంగించారు. పదజాలంలో కొన్ని ప్రయోగాలు ఒక అర్థంలో ప్రయోగించాల్సినవి వేరొక అర్థంలో ప్రయోగిస్తున్నారంటూ ఆయన ప్రసంగం కొనసాగింది. కొన్ని పదాలు అసలు భాషలోనే లేనివి ప్రయోగంలోకి వస్తున్నాయని ఆయన చెప్పిన మాటలు శ్రీశ్రీ అనంతంలో చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చాయి. నేను రాసిన కొన్ని సంస్కృత పదాలు అసలు ఆ భాషలోనే లేవు. కానీ నా కవిత్వ ప్రవాహంలో వాటిని ఎవరూ పట్టించుకోలేదంటాడు శ్రీశ్రీ.
బహుశా అదే ఈ కొత్త తరం కూడా అందిపుచ్చుకుందేమో అనిపించింది. వ్యాకరణ శృంఖలాలని తెంచుకొని ఆధునిక కవిత్వం విహంగంలా స్వేచ్ఛగా విహరించాలని ఈ తరంలోని కవుల అభిప్రాయం. అయితే దానిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కనీస భాషాజ్ఞానాన్ని విడవకూడదనేది ప్రసంగసారాంశం. ప్రతికవి తగినంత తనదైన పదజాలాన్ని కూడగట్టుకోవాలని, భావానికి తగినంత పదజాలం లేకపోతే పరిమితమైన భావమే వ్యక్తం అవుతుంది తప్ప భావ విస్తృతి అనేది సాధ్యపడదు అనేది అతని మాటల్లో వ్యక్తం అయింది. అలాగే యునెస్కో వారు చెప్పినట్టు ‘ఈచ్ వర్డ్ డైమండ్’ అనేటువంటి మాట, అసలు పదం అంటేనే ఒక కాన్సెప్ట్ అంటూ చెప్పిన వివరాలు కొన్ని మన మనసులోకి తీసుకోవలసినవే.
ఆరోజు సాయంత్రం కవులందరూ ఒకచోట చేరి వారి కవితల్ని వినిపించి, ఆ కవితల్ని కొంతమంది విశ్లేషణ చేస్తూ అందమైన సాయంకాలన్నీ తమ జ్ఞాపకాల్లో పొందుపరుచుకున్నారు. ఇలాంటి వాతావరణం సాధ్యపడింది బహుశా హోరు టీం వల్లనే కావచ్చు. సాహిత్యాన్ని చదువుకునే కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గుర్రం జాషువాని దూషించినట్టు, జాషువా విశ్వనాథ సత్యనారాయణకు తగిన సమాధానం ఇచ్చినట్లు, అలాగే శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ పరస్పరం మాటలతో ఒకరినొకరు తప్పు పట్టుకున్నట్లు ఇలాగా కవుల మధ్య స్నేహం లేని సందర్భాల్ని విన్నాం. కానీ ఇప్పటి కాలం స్నేహితుల్ని కవులుగా మారుస్తుందో, కవులందరినీ స్నేహితులుగా చేస్తోందో తెలియదు. అందరూ ఒకటై తమ ఆలోచనలు కలబోసుకునే విశాల దృక్పథం తర్వాత తరాలకి మార్గదర్శకమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరుసటి రోజు 25వ తేదీన ఉదయం గుంటూరు లక్ష్మీనరసయ్యగారి ఉపన్యాసం ‘వర్తమాన కవిత్వంలో వస్తు శిల్పాలు ఎదుర్కొంటున్న సవాళ్ల’ గురించి. శిల్పం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయన చెబుతూ ఊహల తడి తగ్గిపోతోందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. వర్తమాన కవిత్వంలో వస్తు, శిల్పాలు సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం యాంత్రికత అని, మధ్యతరగతి వర్గం అనేది తగ్గిపోతూ ధనిక వర్గంగా వారు మార్పు చెందడం కూడా ఒక కారణం అని, అదేవిధంగా వ్యక్తిగతమైన ప్రతిష్ట కోసం, వ్యక్తిగతమైన గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతుండడం కూడా దీనికి ఒక కారణమని ఆయన వివరించారు.
వీటితో పాటుగా సమాజాన్ని కవులు ముక్కలు ముక్కలుగా దర్శించడం కూడా ఒక కారణమని చెప్పారు. అన్ని ముక్కలని కలిపితే మొత్తంగా ఒక సమస్యగా కనిపిస్తుందని ఒక అంశానికి ఇంకొక అంశంతోని అంతర్లీనంగా ఉన్న సంబంధాన్ని కవులు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వర్తమాన కవిత్వంలో వస్తు శిల్పాల సవాళ్లను ఎదురుకోవడానికి ఆయనకు కొన్ని సూచనలు చేశారు. మొదటిది బుద్ధిజం, మార్క్సిజం, అంబేద్కరిజం మూడింటినీ అధ్యయనం చేయడం. రెండవది బహుజనుల్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధాంతాల్ని రూపొందించుకోవడం. మూడోది ప్రాంతీయ ఉద్యమాలు తప్పనిసరిగా జరగాలనుకోవడం. నాలుగవది వాస్తవాలను వ్యక్తీకరించే వారి కన్నా తాము చేస్తున్నదే వాస్తవం అనుకుని వాటిని వివిధ మాధ్యమాల ద్వారా వండి వార్చే వారిని పదునైన వ్యూహాలతో చీల్చగలగటం.
మధ్యాహ్నం ఉపన్యాసంలో ప్రొఫెసర్ ఖాసింగారు ‘కవిత్వం దృక్పథం’ గురించి ప్రస్తావిస్తూ అసలు దృక్పథం అంటే ఏమిటి అన్న నిర్వచనం దగ్గర నుంచి దృక్పథం పేరుతో వచ్చినటువంటి వివిధ రచనలు వివిధ దృక్పథాలు ఆ దృక్పథాల మధ్య ఉన్నటువంటి సైద్ధాంతిక వ్యత్యాసాలు వీటన్నింటి గురించి ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. అస్తిత్వం అంటే చైతన్యానికి మూలమని, కవిత్వాన్ని సాధ్యమైనంత వరకు అందరికీ చేరేలా సరళంగా రాయాలని సూచిస్తూ ఆయన చేసిన ప్రసంగం కొత్త లోకానికి తీసుకెళ్లింది.
మొత్తంగా హోరు టీం తొలిప్రయత్నమైన ఈ ‘పోయెట్స్ మీట్’ విజయవంతమైందని భావిస్తాను. ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి, అటు రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి కవులని ఒక చోటికి అనుకున్న సమయంలో చేర్చగలగటం, వారిని వర్తమాన సాహిత్యంలో చక్కని విమర్శకులతో సమయాన్ని గడిపేలా చేయగలగటం, వసతి విషయంలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోగలగటం వీటన్నింటి సమన్వయంతో పాటు వారి జ్ఞాపకంగా హోరు వారు కార్యక్రమానికి హాజరైన ప్రతి కవికి కొన్ని పుస్తకాల్ని బహూకరించడం ఈ కార్యక్రమం విజయాన్ని సంపూర్ణం చేసింది. ఇవి మరిన్ని జరగాలి.
*
ఇంత ఉత్తమ సాహితీ సమావేశం మా ఇంటికి దగ్గరే జరిగినా వినే అవకాశం కలగలేదు.