నాటా సాహిత్య సభల విశేషాలు ఇవి!

  • మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్, నాటా లిటరరీ కమిటీ చైర్మన్ అండ్ కో- చైర్,
  • కమిటి సభయయలు :ఆదినారాయణరావు రాయవరపు, శ్రీనివాస్ సోమవరపు
  • – కమిటి సలహదారులు:శరత్ వేట, తిరుపతి రెడ్డి

 

నాటా సభల సందర్భంగా జూలై 7, 8 రెండు రోజుల పాటు అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో సాహిత్య సమావేశాలు జరుగుతాయి. మొత్తం అయిదు సెషన్లలో ప్రాచీన సాహిత్యం నుంచి మీడియా సాహిత్యం వరకూ అటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, ఇటు అమెరికా, కెనడాలలోనూ ప్రసిద్ధులైన రచయితలూ, విమర్శకులూ పాల్గొంటున్నారు. ప్రతి సెషన్ మధ్యలో స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ,  చర్చలు వుంటాయి.

జులై 7 శనివారం నాడు రెండు సాహిత్య సెషన్లు జరుగుతాయి.  మొదటి సెషన్ మధ్యాన్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ప్రొఫెసర్ అఫ్సర్ అధ్యక్షతన “తెలుగు ప్రసార మాధ్యమాల సాహిత్య కృషి” అనే అంశంపైన జరుగుతుంది. అచ్చు పత్రికలూ, వెబ్ పత్రికలతో పాటు గత పదేళ్లుగా టీవీ, యౌట్యూబ్, సోషల్ మీడియా, సినిమా వంటివి తెలుగు సాహితంపైన గట్టి ప్రభావం చూపించాయి. నిజానికి కొత్త తరం సాహిత్యం వాటిలోంచే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా తెలుగు అచ్చు పత్రికలు- సాహిత్యం అనే అంశం మీద ప్రొఫెసర్ అఫ్సర్, అంతర్జాలంలో తెలుగు పత్రికల సాహిత్య కృషి గురించి ప్రముఖ కవి, విమర్శకులు, ఎడిటర్ రవి వీరెల్లి, ఎలక్ట్రానిక్ మీడియా: మన సాహిత్యం అనే అంశం గురించి డాక్టర్ నరసింహ రెడ్డి దొంతి రెడ్డి, తెలుగు సినిమా సాహిత్యం గురించి ప్రసిద్ధ సినిమా కవి వడ్డేపల్లి కృష్ణ మాట్లాడతారు. ఈ సెషన్ తరవాత స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ,  చర్చలు వుంటాయి.

రెండో సెషన్ ౩ గంటల నుంచి  5 గంటల వరకు “అమెరికా తెలుగు సాహిత్యం- కొత్త ధోరణులు” అనే అంశం మీద జరుగుతుంది. ప్రముఖ కవి, విమర్శకులు నారాయణ స్వామి వెంకట యోగి సభకి అధ్యక్షత వహిస్తారు. నారాయణ స్వామి “అమెరికా తెలుగు సాహిత్యం లో రూపం సారం” అనే అంశం గురించి మాట్లాడతారు. అమెరికాలో తెలుగు సాహిత్య సంఘాలు చేస్తున్న కృషి, కొత్త తరం సాహిత్య సృష్టిలో ఆ సంఘాల పాత్ర గురించి ప్రసిద్ధ రచయిత, వంగూరి ఫౌండేషన్ చైర్మన్ వంగూరి చిట్టెన్ రాజు ప్రసంగిస్తారు. అమెరికా  తెలుగు రచనల విశ్లేషణ అందిస్తారు కెనడా సాహిత్య ప్రముఖులు సరోజా కొమరవోలు. అమెరికాలో తెలుగు కథ: కొత్త ధోరణుల గురించి ప్రసిద్ధ కథకులు శివకుమార్ శర్మ తాడికొండ మాట్లాడతారు. ఈ సెషన్ తరవాత కూడా  స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ,  చర్చలు వుంటాయి.

జూలై 8 ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అవధాని సార్వభౌమ,  అవధాని  కంఠీరవ  శ్రీ నరాల రామారెడ్డి అవధానంతో రెండో రోజు సాహిత్య కార్యక్రమాలు మొదలవుతాయి.

మధ్యాన్నం వొంటి గంట నుంచి మూడు గంటల వరకు ఒక భిన్నమైన అంశం మీద ప్రసంగాలతో రెండో సమావేశం మొదలవుతుంది. కేవలం సాహిత్యం మాత్రమె కాకుండా, ఆ సాహిత్యానికి వెనక వెన్నెముక లాంటి భాష, సమాజాలతో సాహిత్యానికి వుండే సంబంధాల గురించి “భాష-సాహిత్యం- సమాజం” అనే ఈ సెషన్. ఇందులో సాహిత్యంలో శాస్త్రీయ విలువల గురించి ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య, భారతీయ సాహిత్యములో తెలుగు భాష స్థానం గురించి ప్రముఖ అనువాదకులు లక్ష్మి రెడ్డి, కేంద్రీయ సాహిత్య అకాడమీ తీరు తెన్నుల గురించి సాహిత్య అకాడెమీ పూర్వ అధ్యక్షులు, అనువాదకులు దుగ్గిరాల సుబ్బారావు, తమిళనాట తెలుగు ఉద్యమానికి అంకితమైన నంద్యాలరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఉద్యమ స్వభావాన్ని గురించి మాట్లాడతారు. ఈ సెషన్ తరవాత కూడా కూడా  స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ,  చర్చలు వుంటాయి.

ఇక నాటా సభల చివరి సెషన్ నిజంగా కొసమెరుపు లాంటి అంశమే! “వర్తమాన సాహిత్యం- భిన్న దృక్పథాలు” అనే ఈ సెషన్ లో రచయిత్రి కల్పనా రెంటాల “మన సాహిత్యం స్త్రీలూ పురుషులూ“ అనే అంశం మీద మాట్లాడతారు. ఇంగ్లీషులోకి  తెలుగు అనువాదాల గురించి ప్రముఖ విద్యావేత్త  సి. ఆర్. విశ్వేశ్వర రావు,, పుట్టపర్తి అభ్యుదయ వాదం గురించి మహాకవి పుట్టపర్తి కుమార్తె, ప్రముఖ విదుషి నాగపద్మిని పుట్టపర్తి మాట్లాడతారు. ఇదే సెషన్ లో ప్రముఖ విద్యావేత్త జే. ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడతారు. ఈ సెషన్ తరవాత కూడా కూడా  స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ,  చర్చలు వుంటాయి.

*

 

 

 

జయదేవ్ మెట్టుపల్లి

1 comment

Leave a Reply to మొయిద శ్రీనివాసరావు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు