దగ్ధాంతరంగ దర్శనం ‘దాపల’

వాగు, వరద, కరువు, పురుగు ఏదీ ఆపలేని నిరంతర పోరుబాట అతనిది. అతని కర్తవ్యనిష్ఠను మనం కళ్లకద్దుకోవాలి. అతని కాళ్ల పగుళ్లకు లేపనం పూయాలి.

దాదాపు రెండు దశాబ్దాల కిందట రెండుమూడు కవిసమ్మేళనాల పుణ్యమాని కోసూరి రవికుమార్ కవిత్వంతో అనుబంధం ఏర్పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 2008లో ‘పల్నాడు మహోత్సవం’ నిర్వహించిన సమయంలో ఆ బంధం బలపడింది. ఆ సమయంలో తన తొలి కవితాసంపుటి ‘‘బొడ్డుపేగు’’ను నాకు కానుకగా అందించాడు. చదవటం మొదలుబెట్టాక ఏదో ప్రవాహంలో చిక్కుకుపోయాను. కవిత నుంచి కవితకు ప్రయాణించటానికి ఒక ఉద్వేగాన్ని వెంటబెట్టుకొని కదిలేవాణ్ని. చదవటం పూర్తయ్యాక, ఆ పుస్తకంలో నోట్స్ రూపంలో రాసుకున్న నా అలజడిని అతనితో పంచుకున్నాను. పనిలో పనిగా అక్కడక్కడా నాకు కనిపించిన ఖాళీల గురించీ చర్చించాను. విమర్శను అంత ఆత్మీయంగా స్వీకరించే కవులుంటారని ఆ క్షణంలో నిరూపణ అయింది.

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ‘‘దాపల’’ పేరిట రెండో కవితాసంపుటిని వెలువరించాడు. సంధి కాలమంతా పోగుపడిన అనుభవాలన్నిటినీ గుదిగుచ్చి పుస్తకంలో ప్రదర్శనకు పెట్టాడు. వయసుతోపాటు లోచూపులో పెరిగిన పదును, పరిశీలనలో ఒదిగిన పరిణతి, వ్యక్తీకరణలో పొదిగిన సొబగు తాజా సంపుటాన్ని కొత్తగా వెలిగించాయి.

ముఖ్యంగా తాను పుట్టి, పెరిగిన నేల; అక్కడి వాతావరణం, చుట్టూతా పరిభ్రమించే మనుషులు, కాలానుగుణంగా వచ్చే మార్పులను తన కవిత్వంలో పొందుపరిచాడు. మనుషుల్ని రసహీనంగా మారుస్తున్న ఆధునిక ఆవిష్కరణలపై నిరసన వ్యక్తం చేశాడు. రాజకీయ అరాచకంపై కన్నెర్రజేశాడు. బతుకుపోరులో నిలదొక్కుకోటానికి సతమతమవుతున్న రైతుల దురవస్థను అక్షరచాళ్లు దున్ని మరీ చూపించాడు. దోపిడీకి గురవుతున్న నల్లమల గిరిపుత్రుల దైన్యాన్ని వర్ణించాడు. వెలిసిపోతున్న చేనేత బతుకుల వెతల్ని వైనంగా నేసే ప్రయత్నం చేశాడు. దాహంతో అల్లాడుతున్న ప్రాంతాల్ని ఎక్స్‌రే తీశాడు. పిల్లలు కోల్పోతున్న బాల్యం, మాయమవుతున్న సాంస్కృతిక చైతన్యం, మనుషులు కోల్పోతున్న పరిమళం, ఆడవారిపై పెచ్చుమీరుతున్న ఆగడం… ఇట్లా వైవిధ్యమైన వస్తువుల్ని ప్రతిభావంతంగా కవిత్వీకరించటంలో రవికుమార్ మరో అడుగు ముందుకేశాడు.

*****

ప్రకృతి కరుణించదు. ప్రభువు కనికరించడు. కనీస మద్దతు ధర వరం దక్కినా కష్టానికి కాస్తంత ప్రతిఫలం లభిస్తుంది. ముక్కలైన రెక్కలకు లేపనం అందుతుంది. నారుమడి అమ్మ ఒడిలా మారి ఆకలి తీరుస్తుంది. అసలు ఆసరా అనేదే లేకపోతే, నేలలో పాతిన పెట్టుబడి కూడా చేతికి రాకపోతే ఏం చెయ్యాలి? విత్తనం వేసే మౌలిక కర్తవ్యానికే సెలవు ప్రకటిస్తే? ‘పంటసెలవు’ ప్రకటించి భూమిని బీడుగా వదిలేస్తే? నష్టం ఎవరికి? రైతుకే! అయినా ఫర్లేదనుకున్నారు గోదావరి జిల్లాలోని కొందరు రైతులు. మట్టిలో దిగటం మానేసి, రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఆ సందర్బాన్ని ‘‘ఆన’’ శీర్షికతో మంచి కవితగా మలిచాడు కవి. ఆగ్రహం సంగతి పక్కనబెడితే, రైతు మనసులోని ఆ వెలితి అతన్ని ఎట్లా పట్టి కుదిపేస్తుందో అక్షరీకరించాడు…

‘‘బతికినంత కాలం

వొళ్లు పులిసేటట్టు మట్టి చిలికి

వెన్న తీసినట్టు అన్నంతీసిన చేతులు

తూము నోట్లో మట్టి కొట్టాలంటే కదిలి రావటం లేదు’’.

నొప్పి. చికిత్సలేని నొప్పి. మూలం అంతుబట్టని నొప్పి. దేశం నిండా పొలాల గుండా వ్యాపించిన నొప్పి. పంటి నొప్పి. పంట నొప్పి. నీటి నొప్పి. ఆకలి నొప్పి. ‘‘నేల మాట్లాడే రెండు మాటలూ… నొప్పి… నొప్పి’’. నొప్పులతో సతమతమవుతున్న బక్కజీవిని పట్టించుకునే నాథుడేడీ? నొప్పుల్ని మాయం చేసే శస్త్రచికిత్సల కోసం బల్లలు సిద్ధం చేసే ప్రజావైద్యుడేడీ? ఎవడో వస్తాడన్న ఆశల్ని భూమిలో పాతేసి, ఆయుధం అందుకోవటమే పరిష్కారమని కవి తేల్చి చెబుతాడు.

‘‘కొట్టిన పుల్లలు కట్టకు రావు

సాయంత్రాలన్నీ

నొప్పి సముద్రపు ఈతలే’’ (ఆకలికి అటూ… ఇటూ).

దారులన్నీ మూసుకుపోయాక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ బక్క గుండెల్లోంచి బడబాగ్నులు రగుల్తాయని కవి తీర్మానిస్తున్నాడు. అప్పుడు ‘పోరు’ అనివార్యమని చెబుతున్నాడు. పోరు ఆగితే, బతుకు ఆగినట్లేనని ప్రకటిస్తున్నాడు…

‘‘అతడి ధైర్యం ముందు

లక్షల క్యూసెక్కుల నీళ్లూ

బోర్లాపడి దండం పెట్టాల్సిందే’’.

‘‘ప్రాణాల్ని మడిమడికీ

పారించగల గొప్ప నైపుణ్యమున్న

నీటి పారుదల శాస్త్రవేత్త అతడు’’.

అతడిలోని ‘తల్లి గుండె’ పరమ సున్నితం. మొక్కలన్నీ అతని పిల్లలు. అదునుజూసి ఏవో పురుగులు ఆ పిల్లలతో స్నేహానికొస్తే కన్నెర్రజేసి పారదోలతాడు. పిల్లల ఆరోగ్యమే అతనికి మహా ఐశ్వర్యం. అందుకే ఇలా అంటాడు కవి…

‘‘అతను లేకపోతే

నేల అంగారకగ్రహమై పోదూ!’’.

వాగు, వరద, కరువు, పురుగు ఏదీ ఆపలేని నిరంతర పోరుబాట అతనిది. అతని కర్తవ్యనిష్ఠను మనం కళ్లకద్దుకోవాలి. అతని కాళ్ల పగుళ్లకు లేపనం పూయాలి. అతని బాధల పరిహారానికి మానవహారం నిర్మించాలి. లేకుంటే అతన్ని ఓటమి వెన్నాడుతుంది…

‘‘పోరులో అతడొరిగిపోతే

నేల మొత్తంగా/ పెద్ద శవపేటిక

పంటలన్నీ శిలాజాలే’’ (పోరు).

రోజురోజుకూ మట్టి అరుదైన ఖనిజంగా మారుతోంది. కాదు; మారుస్తున్నారు. విస్తరిస్తూ పోతున్న కాంక్రీటు వనాల నడుమ గుప్పెడు మట్టి కనిపించటం లేదు. బాల్కనీల్లో మొక్కలు పెంచుకోటానికి బొచ్చెడు మట్టి దొరకటం లేదు…

‘‘పంటకోసం మట్టిని చంపి, వానకోసం మబ్బుని చంపి

నీళ్లకోసం నేలను తవ్వి పోసి

నీడకోసం భూమినిండా సిమెంటు గూళ్లు కట్టి

ఇంకో గ్రహం కోసం వెంపర్లాడుతూ’’ (తెమ్మెర) ఏ తీరాలకు చేరాలని ఈ తపన!

‘‘కొన్ని మెతుకుల కోసమో కాస్తంత నీడ కోసమో

నిన్ను నువ్వే సమూహంలో పోగొట్టుకున్నాక’’ నిలువుగుడ్లు వేసుకుని నిలబడిపోవాలి. నీకు నువ్వు దొరకవు. నిన్ను నువ్వు పట్టుకోలేవు. కనీసం ఓ నాగలికర్రు ఆసరా తీసుకో… నీ తాలూకు ఉనికిని గుర్తించే మూలకం దొరికే అవకాశముందని కవి సంజీవనిలాంటి ఆయుధం ఆవశ్యకతను వివరిస్తున్నాడు.

వాగుడొంకలు, వెచ్చని సాయంత్రాలు, వెన్నెల రాత్రులు, చేలగట్లు, నారుమళ్లు, నీటికయ్యలు, చేనూచెలకా, అమ్మ ప్రేమ, నాన్న శ్రమ, దున్నకుర్ర, నైదిబ్బ, గుదెకొయ్య లాంటి సజీవ పదాలు రవి కవితల్లో జవజవలాడుతూ కనిపిస్తాయి.

రాహేలు, కత్రేణమ్మ బడుగుజీవులు. తల దాచుకునేందుకు నీడ, ఒళ్లు కప్పుకొనేందుకు గుడ్డ, కడుపు నింపుకొనేందుకు కబళం కూడా వారికి అందని ద్రాక్షే. ‘ఆదుకోటానికే ఈ అవతారం ధరించా’మన్నట్లుగా హామీలు కురిపించే అమాత్యులకు దరఖాస్తుల మీద దరఖాస్తులు సమర్పించుకున్నాక… వారి కరుణాకటాక్ష వీక్షణాలు ఈ బక్కజీవులపైకి ప్రసరించాక… పడావు భూములు పట్టాలు తగిలించుకుని ఆ నిర్భాగ్యుల ముందు మోకరిల్లుతాయి. ఆ తర్వాత…?

‘‘మునక్కముందే ముంపు పరిహారంలో ముంచేసి

మిగులు పంపిణీలో వూరివతలే మిగిల్చేసి

బతుకును ‘కూలీ’గానే మిగిల్చినోడి

కూట్లో బండ బడ

ఈడి ఎదుర్రొమ్ము మీద ఎగిరి తన్నాల’’ (రాహేలూ, కత్రేణమ్మ).

రెడీమేడ్ వస్త్రాలు వరదలెత్తి, వీధుల్ని ముంచేస్తున్నాయి. అనుకరణ సూత్రాలు మిల్లుల్లో పురుడు పోసుకొని, ఇళ్లల్లో ప్రత్యక్షమవుతున్నాయి. యంత్రాల కోరలు సాగీ సాగీ నేత కార్మికుడి మగ్గం చుట్టూ ఉరి బిగుస్తున్నాయి. చేతివేళ్ల కళాత్మక నైపుణ్యాన్ని నమ్ముకున్న కార్మికుడు ఆకలిపోగులు పేనుకుంటూ నిట్టూర్పు విడుస్తున్నాడు.

‘‘అప్పులకు ఆవిరైపోయిన అరవై ఏళ్ల రాట్నం

అమ్ముడుపోని ఆరుగజాల ఆకలంచుపోగు జరీ చీరకు

ఉరి పోసుకున్న ఐదేళ్ల దారపుకండే

ఏంచేస్తే తిరిగొస్తాయని నిలదీయటం గురించి’’ (ఆకలి అంచు జరీ చీర) కవి దుఃఖపు గొంతుతో వాపోతున్నాడు.

రెడీమేడ్ వ్యాపారం వీధివీధినా విస్తరించిన నేపథ్యంలో దర్జీలకూ పని తగ్గిపోతోంది. ఎన్ని హంగులద్దినా… టేపుతో కొలతలు తీసుకుని, ఏకాగ్రతతో బట్టలు కుట్టే దర్జీ పనితనానికి సాటిరాదు.

‘‘తెచ్చిచ్చిన అంబరాన్ని

అబ్బురమనిపించేలా కత్తిరించి

దేహాలపై అతడావిష్కరించకపోతే

నువ్వూ నేనూ

దిగంబరులమే కదూ’’ (దేహమున్నంతవరకూ).

*****

ఏ ఛానల్ మార్చినా ప్రజోపయోగ సమాచారం కన్నా ప్రాయోజిత కార్యక్రమాలే సమయం మింగేస్తుంటాయి. ప్రకటనల హోరును భరించలేక కళ్లూ చెవులూ విసుగ్గా నిట్టూరుస్తాయి. ఈ అడ్వర్టయిజ్‌మెంట్లకు రవికుమార్ ‘‘మాట్లాట’’ అంటూ వైవిధ్యమైన నామకరణం చేశాడు. పనికిమాలిన ప్రకటనలపై ఆగ్రహం ప్రకటించాడు.

‘‘ప్రత్యక్ష ప్రసారపు టైర్లకింద పడి నలిగిపో

మాటలు తప్ప మనసులసలు మొలవని సమాధి మీద

‘వాళ్లు వచ్చి’ నాలుగు గడ్డిపూలు చల్లి వెళ్తారులే’’ అంటూ వెక్కిరిస్తాడు.

బడి- కవికి అమ్మ ఒడి. వందలాది దేవుళ్ల గుడి. పిల్లలకు పాఠం చెప్పాలంటే ముందు తాను నేర్చుకోవాలంటాడు. ఆలయం లాంటి పాఠశాల ప్రాంగణంలో నిరంతరం మదిలో గంటలు మోగుతుంటాయంటాడు. ఆ పుణ్యస్థలి నుంచే తాను శ్వాసించటం మొదలు పెడతాడు. సమాజాన్ని ఆలకించటమూ, జ్ఞానం నేర్చుకోవటమూ, తన అంతరంగాన్ని ఆవిష్కరించటమూ అక్కడి నుంచే మొదలు పెడతాడు. ‘బడి నుంచే రాయటం ప్రారంభిస్తాను’ అంటాడు రవికుమార్.

‘బాల్యపు, ఆనందాల సందోహపు పూలమలుపు కదా బడి’. ‘బలపం చుట్టూ బచ్చలి తీగె అల్లుకున్నట్లు’ బాల్యం చుట్టూ పలక చిలక పచ్చటి దడి కడుతుంది.

‘‘నిజంగా పలక చిలకది ఒక గొప్ప మార్మిక స్పర్శ

ఎర్రటి సుతిమెత్తటి దొండపండు దాని పరిచయం

ఈ చిలక వాలని చెట్టు చివురించనే చివురించదు’’ (పలక చిలక)

‘‘ప్రపంచం విస్తుపోయేంత విష పదార్థానికి

విరుగుడు ప్రవేశపెట్టాలనుకో

బడికి రా’’ (బడినుంచి).

మౌలిక వసతుల కల్పనకు వందల కోట్లు వెచ్చిస్తున్నామంటూ వెలువడే ప్రకటనలు ఎండమావుల్తో పోటీ పడుతున్నాయి. స్వచ్ఛమైన మంచినీటికి సైతం నోచుకోని దేహాలు, దొరికిన జలాలతోనే దాహం తీర్చుకుంటున్నాయి. ఆ నీటిలోని అవాంఛనీయ అణువులు అవయవాల్ని కుంగదీస్తున్నాయి. మూలిగల్లోని శక్తికేంద్రకాలు బలహీనపడిపోయి, అకాల వృద్ధాప్యంతో అనేక మంది కునారిల్లుతున్నారు. వారి వెతల్ని స్థానీయత బలిమితో, స్థానిక వాక్కుతో అక్షరీకరిస్తున్నాడు…

‘‘గొంతులోకి కొరివి పెట్టినట్లున్నపుడు

బెట్టగొట్టిన పేగు మడతల్లోకి

కాసిని నీళ్లు వంపుకుందామంటే

ఒక్క జలయాజ్ఞికుడూ ఏ ఆనకట్టనైనా

ఈ అస్థినిమజ్జన వాటికలో కట్టడు’’ (మంచినీళ్ళు).

ఈ కవితలో ‘వంకర తిరిగిన ఎముకనొకదాన్ని పట్టుకొస్తా/ కాలువ తవ్వుదాం’ అంటూ అరుదైన శబ్దచిత్రాలు అల్లడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది.

సర్వసాధారణ విషయాల పరిధిని అతిక్రమించటంలోనే ఉంటుంది కవి నైపుణ్యం. సామాజిక చలనాన్ని రికార్డు చేయటంలో రవి శ్రద్ధ అభినందనీయం. రైల్లో భోగీలు శుభ్రం చేసి పొట్ట పోసుకునే అభాగ్యులు, బిచ్చమెత్తుకునే నిర్భాగ్యులు, వలసకూలీలు… వీళ్లంతా కవితా వస్తువులయ్యారు. కానీ, రైలు ప్రయాణం చేస్తున్న ఓ నిండు గర్భిణి రవికుమార్ కవిత్వంలో ‘దీపానికి చేతులు అడ్డం పెట్టినట్లు/ అతి జాగ్రత్తగా/ అరచేతుల్ని పొట్ట చుట్టూతా వేసుకుని’ సరికొత్తగా దర్శనమిస్తుంది…

‘‘అన్నీ బయటి మోతలే కదూ!

కానీ ఆవిడ మాత్రం/ లోపలినుంచి మోస్తోంది

వత్తిడి తగుల్తుందేమోనని

అత్తారుబత్తంగా/ కాటను చీరను కట్టుకుని మరీ మోస్తోంది’’ (మోయటం).

భావచిత్రాలను అక్షరాలతో అపురూపంగా అలంకరించేందుకు కవి ప్రత్యేక కసరత్తు చేస్తాడు.

‘‘ఎలా భరిస్తున్నావురా

ఈ కబ్జాకోరుని/ చెందురుడా’’ అంటూ వెన్నెలని అతిసున్నిత వ్యంగ్యంతో సిగ్గు పడేలా చేయటంలో రవి చాతుర్యం స్ఫురిస్తుంది. మచ్చుకు మరికొన్ని విన్యాసాలు:

‘‘పట్టాలు ఊడబెరికిన రైలువంతెన మీద

మొలిచిన చిన్న రావి మొలకా

చెలమలైపోయిన చెరువులో

గూడకొంగ ఎగిరినపుడు రాలిన పచ్చటి పూలతెట్టూ’’ (తెమ్మెర).

‘‘కువకువలాడే పిట్ట ఒకటి/ రెక్కలు కాలి

ఎడారిలో ఒక్క చెట్టు కోసం/ వెతుక్కోవటం

అక్షరాల్ని మోసుకెళ్లే/ ఒంటరి చీమ మీద

వాన విరుచుకు పడటం’’ (రెండు నమ్మకాల్ని రాయి).

*****

స్థానీయత ఆలంబనగా జవజీవాలు తొడుక్కున్న కవి… ఇప్పుడు అదే స్థానీయత బీటలు వారుతోందని వాపోతున్నాడు. మోరెత్తిన దున్న కుర్రకు గడ్డి దొరకని స్థితి. పురుగుల చెరలో చిక్కి శల్యమవుతున్న పత్తిపంట. పాడి చేసే చేతుల్లేక పాలకోసం కేంద్రాల వద్ద క్యూ లైన్లు. స్వచ్ఛమైన గాలిని కబళించివేస్తున్న సిమెంటు ఫ్యాక్టరీలు. ఈ మాయపొరల్ని మరింతగా మచ్చిక చేసుకుంటున్న రాజకీయాలు. తనకు పరిచయమున్న పల్నాడు మాయమైపోయిందని కవి దిగులు పడుతున్నాడు. ‘‘కొత్త పల్నాడు కోసం’’ పరితపిస్తున్నాడు.

‘‘రాళ్ల చాటునుంచి తొంగిచూచిన నేల

రాళ్లు మాయమై రూపాయిలైపోతున్న కాలం’’ అంటున్న రవి ఆక్రోశం వినగానే; అదే గడ్డపై తిరుగుతూ ‘చిన్న చిన్న రాళ్లు చిల్లరదేవుళ్లు’ అని వెక్కిరించిన శ్రీనాథుడు గుర్తుకొస్తాడు.

‘‘చేని మీద మంచుదుప్పటి మాయమైంది

ఊరి ఊపిరితిత్తుల్ని

సిమెంటు బూడిద కప్పేసింది’’ అంటున్న కవి వేదనలో ఫ్యాక్టరీల కాలుష్యం గర్జిస్తుంది.

అరసం గుంటూరు శాఖ ప్రచురించిన ఈ పుస్తకం ముఖపత్రాన్ని గిరిధర్ అరసవల్లి గారు అర్థవంతంగా అలంకరించారు.

దాపల అంటే ఎడమవైపు అని, కవిలో నిక్షిప్తమైన వామపక్ష భావాలు అతని కవిత్వంలో స్పష్టంగా ప్రతిఫలించాయంటూ అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ భిన్న కోణంలో రవికుమార్‌ను ఆవిష్కరించారు.

‘‘పచ్చపచ్చని పల్నాటి కవిత’’ శీర్షికన విలువైన ముందుమాట రాసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పాపినేని శివశంకర్ గారు సూచించినట్లు ‘అధ్యయనం, సాధనతో సమకూరే బిగువుతనం రవి కవిత్వాన్ని గాఢతరం’ చెయ్యగలవు.

ఇంతకీ రవికుమార్ కవిత్వం ఎట్లా రాస్తాడు?

తన ఊరినీ, తన వారినీ; తన నేలనీ, తన నీళ్లనీ తల్చుకుంటూ రాస్తాడు. వర్తమాన సామాజిక సన్నివేశాల లోతుపాతుల్ని ఆకళింపు చేసుకుంటూ రాస్తాడు. లోపలినుంచి పలవరింతలతో కళ్లను రాజేసుకుంటూ రాస్తాడు. ‘పచ్చగా బీరతీగ పూసినట్టు’ రాస్తాడు. ‘ఇంటెన్సివ్ కేర్‌లో తండ్రి సైగలతో తెలిపిన సంభాషణ’లా రాస్తాడు. ‘పత్తిచేను మీద పికిలిపిట్ట వాలినట్టు, మిరపతోటలోకి నర్సవ్వ గెనుంమీంచి చెంగున దుంకినట్టు’ రాస్తాడు. ‘జనం కళ్ల ముందకు పిల్లలతో తల్లికుక్క లగెత్తినట్టు’ రాస్తాడు. ‘బీడుపడ్డ గుండెలపైన మేడిపట్టి’ రాస్తాడు.

రాస్తాడు. మరింత లోచూపుతో, మరింత జ్వలనంతో కోసూరి రవికుమార్ (9491336488) మరిన్ని మంచి కవితలు రాస్తాడని నమ్మకంగా చెప్పగలను.

                                    —–0—–

ఎమ్వీ రామిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు