కరోనా మరగయా!

ప్రముఖ రచయిత బమ్మిడి జగదీశ్వర రావు చెప్తున్న కరోనా కహానీలు ప్రారంభం

కరోనా కుళ్ళి కుళ్ళి యేడుస్తోంది!

“బ్లీచింగు పౌడర్ చల్లితే చాలు”

ఒక శాస్త్రవేత్త మాటలు వింటూ ‘ఔనా చచ్చిపోతానా?’ అని గజగజ వణికింది కరోనా!

“పేరాసిటమాల్ గోలీ వేస్తే చాలు”

మరొక శాస్త్రవేత్త మాటలు వింటూ ‘నాకు యీ భూమ్మీద అప్పుడే నూకలు చెల్లిపోయాయా?’ అని వజవజ వణికింది కరోనా!

“ఏ తియ్… మాస్కేంది గీస్కేంది… మాస్కు కట్టుకోకపోతే మనమంతా చచ్చిపోతామా యేమి?”

ఆ శాస్త్రవేత్తే వెటకరిస్తూ నవ్వుతుంటే ‘వీడెవడో మహా ధైర్యంగా వున్నాడే’ అని అనుకొన్న కరోనాలో తొలిసారిగా పిరికితనం ప్రవేశించింది!

“క్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ కోవిడ్ కు పర్ఫెక్ట్ మందు”

పెద్ద శాస్త్రవేత్త దర్జాగా కోట్లో చేతులు పెట్టుకు చెపుతుంటే కరోనాకు నోట మాట రాక నీరుగారిపోయింది!

“లైసాల్ డిసిన్ఫెఫెక్టంట్ తాగితే చాలు”

తన మాటను తనే ఖండిస్తూ పెద్ద శాస్త్రవేత్త క్రాఫ్ విదిలించి చెయ్యి వూపేసరికి వులిక్కిపడిన కరోనాకి వూపిరాడలేదు!

“కరోనాకు వాక్సిన్ అవసరం లేదు”

పెద్ద శాస్త్రవేత్త మాటలకు కరోనాకు గుండె ఆగినంత పనయ్యింది!

“కరోనాకి భయపడాల్సిన అవసరం లేదు, వొక్క ప్రార్ధన చాలు”

తెల్ల దుస్తుల శాస్త్రవేత్తని చూసి తెల్లబోయింది కరోనా!

“చప్పట్లు కొట్టండి”

దేశీయ పెద్ద శాస్త్రవేత్త సెలవిచ్చారు. ఆ సమయంలో చంద్రుడు రేవతి అనే కొత్త నక్షత్రానికి వెలుతున్నాడని, చప్పట్లు యింకా గంటలు కొట్టడంవల్ల సంచిత కంపనం రక్త ప్రసరణని ప్రోత్సహిస్తుందని, పర్వతాలపై పాత శక్తి దేవాలయాలలోని వారు భారీ గాంగ్ లాంటి గంటలు కలిగి వుండడానికి కారణం యిదేనని- ఆయన సేవకశాస్త్రవేత్తలు సెలవిచ్చారు. ఒకేసారి నూటా ముప్పై కోట్లమంది చప్పట్లు కొట్టడంతో షాంక్, నాడా మొదలైనవి వైబ్రేషన్స్ సృష్టిస్తాయని అందువల్ల వైరస్ శక్తి కోల్పోతుందని కూడా చెప్పారు!

ఆ మాటలు వింటుంటే కరోనాకు నిజంగానే నీరసించింది… కాళ్ళూ చేతులూ ఆడలేదు!

“దీపాలు పెట్టండి”

అదే దేశీయ పెద్ద శాస్త్రవేత్త మళ్ళీ సెలవివ్వడంతో కరోనా కనుగుడ్లు తేలేసి ‘నాకా మీకా?’ అన్నట్టు చూసింది!

“పువ్వులు చల్లండి”

దేశీయ పెద్ద శాస్త్రవేత్తని కారోనా కన్నార్పకుండా చూస్తూ కలవరంతో అలాగే వుండిపోయింది!

“రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ సీరియళ్ళు చూడండి”

సహాయక శాస్త్రవేత్తల మాటలు విన్న కరోనా నేలకేసి తలకొట్టుకున్నా యేమీ అర్థం కాలేదు!

“నాటి కోరంకి నేటి కరోనా”

ఈశాన్య తూర్పున విషపుగాలులు పుట్టేనయా- అని ఆనాడే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారని సాంప్రదాయక శాస్త్రవేత్తలు చెప్పడంతో కరోనాకి కళ్ళు గిర్రున తిరిగాయి!

“మన వంట్లోనే ముప్పై అయిదు డిగ్రీల హీట్ వుంటుంది, అది మన వంట్లోకి వచ్చిందా చచ్చిందే”

మంత్రివర్యులుగా వున్న మరో మహా శాస్త్రవేత్త మాటలు విని ‘నేను యిన్నాళ్ళూ మీ వొంట్లో లేనా?’ అని నమ్మకం కోల్పోయినట్టు తనని తనే గిల్లుకుంది కరోనా!

“మన యెండలకు కరోనా బతికి బట్టకట్టదు”

ఆమాటతో కరోనాకి పై ప్రాణాలు పైనే పోయాయి!

“ఆవు మూత్రం తాగితే కరోనా రాదు”

దెబ్బకి కరోనా జడుసుకుంది!

“ఆవు పేడ విరుగుడు”

కాషాయ దుస్తుల శాస్త్రవేత్తలని వెర్రి చూపులు చూసింది కరోనా!

“పసుపు నీళ్ళు తాగితే కరోనా రాదు”

స్వయం ప్రకటిత శాస్త్రవేత్తలని చూడలేక ‘నాకేది దారి’ అనుకుని దిగులుపడిపోయి కళ్ళు మూసుకుంది కరోనా!

“పుదీనా లవంగం అల్లం వెల్లుల్లి తేనే కలిపి తీసుకుంటే…”

సామాన్య శాస్త్రవేత్తల మాటలు వినలేక నోట మాటరాక ‘ఆ’ అని తెరచుకున్న నోటిని మూసుకుంది కరోనా!

“తులసి తీర్థం తాగితే చాలు”

ఏ ఔషధం తనని బలి తీసుకుంటుందో తెలీక కరోనా తల్లడిల్లిపోయి ముక్కు మూసుకుంది!

“అసలు తీర్థం… లిక్కరు తాగితే కరోనా మటాష్”

తాగుబోతు శాస్త్రవేత్తల మాటలతో కరోనాకి జవజీవాలు ఆడలేదు!

శరపరంపరగా వస్తున్న శాస్త్రవేత్తల సాధనా సలహాలను విని తట్టుకోగల శక్తిని కోల్పోయింది కరోనా!

శాస్త్రవేత్తల పలుకులు వింటున్న కరోనాకు జీవితం మీద విరక్తి పుట్టింది! ఇంకెంత మాత్రమూ బతక గూడదని వొక నిర్ణయానికి వచ్చేసింది! లెంపలేసుకుంది!

శాస్త్రవేత్తలందరికీ వోసారి దండం పెట్టింది! ఆనక, కరోనా ఆవురావురుమంటూ ఆత్మహత్య చేసుకుంది!

*

బమ్మిడి జగదీశ్వరరావు

6 comments

Leave a Reply to రెడ్డి రామకృష్ణ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కరోనా ఆత్మహత్య చేసుకోలేదు.ఇంతమంది శాస్త్ర వేత్తలను చూసి భయపడి పారిపోతోంది ఒక మనిషి మీంచి మరో మనిషి మీదకి. పాపం కరోనా నడవలేదుగా, మనుషుల మీద నుంచి గెంతంకుంటూ పోతోంది.చివరికి మనిషేదొరికనప్పుడు ఏం చేస్తుంది.చచ్చినట్టు అదే చస్తుంది. శాస్త్ర వేత్తలా మజాకా

    • కథకి మీ కొత్త క్లయిమాక్స్ బాగుంది.

  • ఇంత మంది ‘తెలివితేటల్ని’ గమనించిన తరువాత కరోనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది ? అసలే చేసుకోదు ! పైగా అది హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది ! ఈ దేశంలో నాకిక ఢోకా లేదనుకుంటుంది ! చైనావాడి కట్టడికి జడిసి ఇతర దేశాలకు పారిపోయిన కరోనా మన చప్పట్లకు బమిసి ఇక ఇక్కడే తిష్ట వేసుకు కూర్చోవాలని నిశ్చయించుకొని వుంటుంది ! దాని ఫలితమే పెరుగుతున్న కరోనా కేసులు !!

    • మీరు చెప్పినట్టు కరోనాకి ఈ దేశం అనుకూలంగా వుంది.

      అయితే శాస్త్రవేత్తల మాటలు విని కరోనా కలవరం పడడం యెంత నిజమో ఆవురావురు మంటూ ఆత్మహత్య చేసుకోవడం అంతే నిజం.

  • మళ్లీ వీర విజృంభన చేసావోయ్ బమ్మిడి సూపర్బ్

  • ఎగసిపడే నిరసన జ్వాలలను పదునైన అక్షరంతో సంధిస్తున్న బజరా! చిట్కా వైద్యాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలందరికే కాదు… ” మనం మనుషులమనీ, జాలి, కరుణ, స్నేహం, సానుభూతి, సహకారం లాంటివి సాటి నిస్సహాయుల పట్ల ” చూపాలని మర్సిపోయిన పాలకులకీ కరోనా వోసారి దండం పెట్టి ఆత్మహత్య చేసుకుంది !!

    The nationwide lockdown in India, due to Coronavirus ( Covid-19 ) pandemic, has impacted the livelihoods of nearly 40 million internal migrant workers ( which make up 80 percent of India’s workforce ) as per the World Bank report.

    The Lockdown resulted into …. loss of employment & wages, loss of subsistence income for families back home, access to healthcare, housing, education and social distancing prompted a chaotic and painful situation to the Migrants.

    Millions of Migrant workers began fleeing the cities, with bags perched on their heads and children in their arms, walking down highways in a desperate attempt to return to their villages hundreds of miles away but have been stranded due to the suspension of transport services. Several people died in the process.

    The country’s infrastructure is built on the backs of these migrant workers. They construct malls, multiplexes, hospitals, apartment blocks, hotels. They work as factory hands, delivery boys, loaders, cooks, painters, rickshaw pullers. They stand the whole day by the side of the road selling fruits and vegetables and tea and flowers.

    They often come to cities to look for work, because they cannot make a living in their village. They are rarely part of a trade union and typically work without any contract or benefits.

    India has welfare measures for people below the poverty line, but migrant workers rarely have access to them.

    One critic said the mismanagement of the migrant crisis and the treatment of its poorest citizens during the pandemic could be India’s shame.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు