కంఠస్థం చేసుకోలేకపోయిన అనుభవకావ్యాలు!

ఇప్పుడంటే మెమరీని యంత్రస్థం చేసుకోవచ్చు, మరి అప్పుడెందుకు జ్ఞాపకాన్ని నిర్లక్ష్యం చేశాను?  

డిసెంబర్‌ నెల చిక్కటి చలిలో చీకటిపొద్దునే  కట్టెలపోయి మీద కాచిన వేడినీళ్లతో స్నానం చేసి, నాన్నతో కలసి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లిన రోజులెన్ని ఉంటాయి? మహా అయితే, రెండు ధనుర్మాసాలు! పూజార్లూ ఊళ్లో ఉన్న వైష్ణవులూ తిరుప్పావై చదువుతుంటే, మధ్యలో వచ్చి చేరినా అందుకుని పల్లాండు పల్లాండు అంటూ గొంతుకలిపే నాన్నను చూసి మొదటిసారి ఆశ్చర్యం వేసింది. అసలే, అది వేరే భాష, పైగా అందులోనూ మంత్రాలు (అట్లా అనుకునేవాడిని) ఎట్లా గుర్తుంటాయబ్బా అనిపించేది. సంస్కృతం  విషయంలో ఆ సందేహం వచ్చేది కాదు. ఆయనకు ప్రసిద్ధ సంస్కృత శ్లోకాలు, వ్యాకరణ సూత్రాలు, అలంకారిక శాస్త్ర విషయాలు, చాలా మట్టుకు గుర్తుండేవి. వాటికి తోడు, యాజ్ఙీకానికి, తతంగాలకీ, పూజలకీ సంబంధించిన మంత్రాలు!

చిన్నప్పుడు పిల్లవాడిని కాబట్టి, పెద్దయ్యాక, పెద్ద హేతువాదిని అనుకునేవాడిని కాబట్టి, ఆ మంత్రాల మీద నాకు పెద్ద ఇది లేకపోయింది కానీ, మా నాన్నకున్న ధారణ శక్తి మీద మాత్రం బాగా గౌరవం ఉండేది. స్కూల్‌లో తెలుగు వాచకంలో పద్యాలు బట్టీ పట్టవలసి వచ్చేది, పట్టేవాడిని కానీ, అవసరం తీరిందంటే అవి మరపులోకి జారుకునేవి. ఇప్పటికి కూడా వేమన పద్యాలు మాత్రమే కొన్ని తడుముకోకుండా చెప్పగలుగుతాను, అందుకు ఏదో గట్టి పునాది పడి ఉండాలి. కావ్యాల నుంచి ఇచ్చే పద్యభాగాలలో పద్యాలు ఇష్టంగానే ఉండేవి కానీ, ఇప్పుడైతే, గుర్తులేవు. ఉంటే గింటే, మొదటి మొదటి మూడునాలుగు మాటలో, మహా అయితే, మొదటి పాదం. అంతే.

నేను ఓరియంటల్‌ తెలుగు విద్యార్థిని కాబట్టి, నా జీవితంలోకి సంస్కృతం కూడా ప్రవేశించింది. శబ్దమంజరి అంతా కంఠతః వచ్చేది కానీ, ఇప్పుడు అదొక మసకబారిన జ్ఞాపకం. రామః, రామౌ, రామాః, ఈ ఒక్క శబ్దం , విభక్తి వచ్చు. కొడంగల్‌ ఓరియంటల్‌ కాలేజీలో ఎంట్రన్‌ తరగతిలో ఉన్నప్పుడు, హైదరాబాద్‌ లో సంస్కృత శ్లోకాల అంత్యాక్షరి పెట్టారు, మా కాలేజీ నుంచి నన్ను, మరొకరిని పంపించారు. అందుకోసం ఒక పదిహేనురోజుల పాటు శ్లోకాల బట్టీయం నడిచింది. శ్లోకాలు, అది కూడా అంత్యాక్షరికి పనికివచ్చే శ్లోకాలు (హల్లులతో మొదలయ్యే శ్లోకాలు కావాలి), ఒక రెండువందల శ్లోకాలు నోటికి వచ్చేట్టు సాధన చేశాము. పోటీలో మొదటి రౌండులోనే నేను డక్‌ అవుట్‌ అయ్యాను. ఆ అక్షరం మీద పది పదిహేను శ్లోకాలు వల్లె వేసిన గుర్తు. కానీ, ఆ సమయానికి ఒక్కటీ గుర్తు రాలేదు. స్ఫురణ కోసం తడుముకుంటుంటే, ఖణేల్‌మని ఇనుపగోడ తగలడమే కానీ, అంబ పలకలేదు. ధారణ శక్తిలో నేను సున్నా అని నిర్ధారణ అయ్యి, చాలా నిరుత్సాహం కలిగింది.

మా తండ్రి తరానికీ నాకూ విద్యావిధానంలో ఉన్న తేడా వల్ల కొంత, నాకు ఏకాగ్రత సమస్యలు ఉండడం వల్ల మరికొంత, నాకు పద్యాలు, శ్లోకాలు అందీ అందని చేలాంచలములే అయ్యాయి. భావం వెంట మాత్రమే నా కళ్లు పరుగెత్తేవేమో, పదాలను వాటి భౌతికస్వరూపాన్ని మనసులో బలంగా ప్రతిష్ఠించుకోలేదేమో? రెంటిని జమిలిగా లోలోపలికి ఇంకించుకుంటే భిన్నంగా ఉండేదేమో? ఇప్పుడంటే మెమరీని యంత్రస్థం చేసుకోవచ్చు, మరి అప్పుడెందుకు జ్ఞాపకాన్ని నిర్లక్ష్యం చేశాను?

తెలుగు చదువులో మాకు ప్రబంధాలు చెప్పినవారిలో నాయని కోటీశ్వరి ముఖ్యులు. ఆమె విజయవిలాసం చెప్పేవారు. అందులో పద్యాలు చాలా బాగుంటాయి. ఎంపిక చేసిన పద్యాలను గుర్తుండేట్టు మననం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆమె చెప్పినవే కాక, బంధుమిత్రుల దగ్గర విద్యాప్రదర్శన కోసం కాబోలు, ఎక్కువ సంస్కృత సమాసభూయిష్ఠంగా ఉండేవి, ప్రత్యేకమైన నడకతో లయబద్ధంగా ఉండేవి కొన్ని పద్యాలు మేం అదనంగా నేర్చుకున్నాం. ‘సునాసీర సూనుండు జూచె నిమ్మజ్జజ్జనౌఘోతత్పంక శంకాకరాత్మోర్మి…’ ఇట్లా చదివితే కలిగే మజావేరు. ఇక పంచచామరాలు, దండకాలు వాటిలో బాణీలు, వాటికి మా పేరడీలు, వాటన్నిటిలోనూ సాహిత్యోత్సాహం పొంగిపొర్లేది. ఇప్పటికీ వాటిలో కొన్ని పద్యాలు నోటికి వచ్చు, తప్పుల్లేకుండా కాదు, తడుముకోకుండానూ కాదు. ఆధునిక కవిత్వంలో ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానంలోనివి అనేక ఖండికలు ఒకప్పుడు నోటికి వచ్చేవి. ఇప్పుడూ వస్తాయి కానీ, ఎవరన్నా అందిస్తూ ఉండాలి.

82 లోనో 83 లోనో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ కోసం దరఖాస్తు చేశాను. ఎంచుకున్నఅంశం, ఆధునిక తెలుగుకవిత్వంలో నగరజీవిత చిత్రణ-కుందుర్తి ‘నగరంలో వాన’.  అందుకోసం ఒక వ్యాసం కూడా రాశాను.   తెలిసినవాళ్లకు  తెలిసినవాళ్లున్నారని ఆంధ్రభూమిలో ఒకరికి ఇస్తే, ఆయన ఎందుకో వేయలేదు. ఇంటర్వ్యూకు నిరాయుధుడిగా, ఆశారాహిత్యంతోనే వెళ్లాను. కొత్తపల్లి వీరభద్రరావుగారు బోర్డులో ఉన్నారు. ‘ టాపిక్‌ బాగుందయ్యా, ఏదీ ‘నగరంలో వాన’ నుంచి ఓ ఆసక్తికరమైన భాగం ఏదైనా చెప్పు’ అన్నారాయన. ‘వచన కవిత్వం ధారణ చేయలేము కదండీ’ అన్నాను అతి తెలివిగా. జీవీ సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు అక్కడ. ఆయన కల్పించుకుని, నన్ను వీరభద్రరావు గారు కోప్పడకుండా, నేను నొచ్చుకోకుండా,  ఏయే కవులు నగరజీవితం మీద రాశారు వంటి జనరల్‌ ప్రశ్నలు వేసి పంపించారు. ఫలితం ఊహించిందే, హైదరాబాద్‌ యూనివర్సిటీకి నా విద్యార్థిత్వం లభించలేదు.

బాగా నచ్చిన పుస్తకం చదివినప్పుడు, అందులోని కొన్ని వాక్యాలు బాగా ఎక్కువగా ఆకట్టుకోవడం సహజమే. చెంఘిజ్‌ ఖాన్‌ మొదటి సారి చదివినప్పుడు (అంటే మొదటి రోజున చదివిన రెండు సార్లలో మొదటిసారి అన్నమాట) మొదటి వాక్యం, ఆ తరువాతి రెండుమూడు వాక్యాలూ పదే పదే మననం చేసుకున్నాను. ఒక నవల  ఎత్తుగడ అంటే ఇట్లా ఉండాలి కదా అనుకున్నాను. చాలా కాలం యథాతథంగా గుర్తు పెట్టుకోగలిగాను, ఈ మధ్య దాకా ఆ జ్ఞాపకం అరిగిపోలేదనే అనుకుంటూ వస్తున్నా. అసందర్భంగా ఈ మధ్య అనేక సందర్భాలలో ‘ నెగళ్లు జాజ్వల్యమానంగా మండుతున్నాయ్‌’ అని ఉటంకిస్తూ తెన్నేటి సూరిని పొగుడుతూ వచ్చాను. ఈమధ్య తారసపడిన పుస్తకాన్ని తిరగేసి చూద్దును కదా, అది ‘జాజ్వల్యమానంగా నెగళ్లు మండుతున్నాయ్‌’. జ్ఞాపకం కూడా వాచకాన్ని తిరగరాస్తుందా?  ఇట్లా ఈ మధ్య ఎన్ని ప్రసిద్ధ ఉటంకింపులకు నా జ్ఞాపకంలో పాఠాంతరాలు ఏర్పడ్డాయో తెలియదు. ‘చలం’ ఆత్మకథ మొదటి వాక్యం నాకు చాలా ఇష్టం. అది నా ప్రస్తావనల్లో అరిగిపోయి, అరిగిపోయి చివరకు ‘ సృష్టికైన అనాది చలనంలో నేనూ అవ్యక్తంగా జన్మించాను’- అని మారిపోయింది.  చలం రాసినదాన్ని  నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగరాసుకుని, కుప్తం చేసుకుని గుర్తుపెట్టుకున్నానని ఈ మధ్యనే గుర్తించాను. భావం చెడిపోకున్నా ‘మిస్‌ కోటేశ్వరరావు’ కావడం ఎందుకు?  అందుకే, ఈ మధ్య, నా స్మరణశక్తి మీద నమ్మకం లేక, కోట్‌ చేసినప్పుడు, తేదీలు వేసినప్పుడు తప్పనిసరిగా సరిచూసుకోవడం అలవాటు చేసుకుని, పబ్లిక్‌ హుమిలియేషన్‌ నుంచి తప్పించుకుంటున్నాను. కానీ, ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఉన్నదున్నట్టు అప్పజెప్పలేకపోవచ్చును కానీ, తప్పుడుగా మాత్రం చెప్పను. అదే అర్థంలో మాటలు కాస్త అటూ ఇటూగా.

ఒక అంశం గురించి అవగాహన కల్పించుకోవడం సులభమనిపిస్తుంది. ఆ అంశంలోని నిర్దిష్ట సమాచారం ఏదైనా యథాతథంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలంటే  చిరాకు. ఒక్కోసారి, ఇచ్చిన నాలుగు సమాధానాల్లో ఒకటి ఎంచుకోవడం ఎంతో కష్టం అనిపిస్తుంది. తారీఖులు దస్తావేజులు చరిత్ర సారం కాదని శ్రీశ్రీ అన్నాడు కానీ, ఏ సబ్జెక్టుకు అయినా తేదీలూ అంకెలూ స్థలాలూ అవీ ముఖ్యం కాదేమోనని నా రహస్యాభిప్రాయం. కొందరు మిత్రులు టకటకా పద్యాలూ కవిత్వాలూ ఉటంకిస్తూ, ఉపన్యాసాలు  చేస్తుంటే నాకు కొంచెం అసూయగా ఉంటుంది.  పేజీలు మడతపెట్టో, బుక్‌ మార్కర్‌లు పెట్టో, నోట్స్‌ తీసుకునో తప్ప కోట్‌ చేస్తూ మాట్లాడలేనేమోనని నాకు అర్థమయింది. పూర్వపు తరం పండితుల కోవలో నడిచే కొందరు సమకాలీనులు, అయితే గియితే రాజకీయాల్లోనో సామాజిక అవగాహనలోనో కొంచెం వెనుకబడి ఉంటారేమో కానీ, వారి క్రమశిక్షణ, ధారణ, స్ఫురణ శక్తి ఆశ్చర్యమే కలిగిస్తాయి. జాక్‌ ఆఫ్‌ ఆల్‌ కాబోయి, మాస్టర్‌ ఆఫ్‌ నన్‌ అయిపోయి పొరపాటు చేశానేమో, భాషాశాస్త్రం మీదో లఘుసిద్ధాంత కౌముది మీదో పనిచేసి ఉంటే, ఏదో ఒకరంగం ఉండేది, విశాలమైన పరిజ్ఞానం కాక, లోతైన జ్ఞానం అబ్బి ఉండేది.

ప్రపంచపు లెక్కలో మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, కనీసం ఒక పది పద్యాలు, ఓ పాతిక పాటలు ఆమెకు నోటికి వచ్చేవి. సందర్భానికి తగినట్టుగా పద్యాలను చదవడం ఆమె ఎప్పుడూ చేయగలిగేది. నాకు అప్పుడెప్పుడో ఒక కష్టం వచ్చి, దాని నుంచి గట్టెక్కితే, ఆమె, ‘ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు బూసెజ్జపై’ అనే ఏనుగు లక్ష్మణకవి (భర్తృహరి) పద్యాన్ని చదివి బుజం తట్టింది. అనేక మార్లు ఆమె ఆ పద్యాన్ని ఇతరులకు కూడా సందర్భోచితంగా ప్రస్తావించింది. చివరిరోజుల విస్మరణలోనూ ఆ పద్యం మరచిపోలేదు. ఆనాటి జీవితాలు చిన్నవేమో, వాటిలో కలిగే కష్టసుఖాలన్నిటినీ వ్యాఖ్యానించగల శక్తి ఆ పద్యాలకున్నదేమో? అనుభవాలను కాచివడబోసిన జ్ఞానానికి ఎటువంటి ధారణశక్తీ ప్రత్యేకంగా అక్కరలేదేమో?

*

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక పూర్వ సంపాదకులు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు