స్వేచ్చ కి సారంగ నివాళి

మొదటి కవిత స్కూల్ లో ఉన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు రాసుకున్నాను కానీ చిన్నప్పటి కవితలన్నీ రాసుకున్న డైరీ పోగొట్టుకున్నాను. కాబట్టి మొదటి కవిత గుర్తు లేదు. కానీ 8వ తరగతికి వచ్చిన తర్వాత మా క్లాస్లో ఉండే అమ్మాయి చదువు మానేసింది. వాళ్ళ అమ్మ స్కూల్ పక్కనే మార్కెట్ లో కూరగాయలు అమ్ముతుండే..వెళ్లి అడిగితే..తనకి పెళ్లి చేసినట్టు చెప్పింది. వాళ్ళ అక్కకి పిల్లలు పుట్టట్లేదని అక్క భర్తతో తనకు పెళ్లయింది. బాల్యవివాహమే.. బాధనిపించి అంతా కథ రాసి..అప్పట్లో “చూపు” పత్రికకు పంపితే ఇదేదో పెద్దవాళ్ళు రాసినట్టుంది అని పబ్లిష్ చేయలేదు..ఆ తరవాత 2008 ,మార్చ్ లో..మిణుగురు అనే కవిత రాసాను..

~~~
అమావాస్య చీకట్లో
మిణుకు మిణుకుమంటూ
ఆడుతూ పాడుతూ
నన్ను మించింది
ఈ ప్రపంచంలోనే లేదన్నంత పొగరుతో
మనం
గంపకింద కమ్మిన కోడిపిల్లలను
ఆడుకోడానికి రమ్మని
బయటికి పిలుస్తున్న
ప్రతి చుక్క ఉడుకుతనం, దుడుకుతనం
నీ రెప్పపాటుకి తెలుసుకదా…
~~~
ఈ కవిత రాసుకున్నప్పుడు మా పెద్ద మేనమామ వాళ్ళ ఊరు..తెలంగాణలో జగిత్యాల జిల్లా, మెట్ పల్లి దగ్గర రామలచ్చక్క పల్లె లో ఉన్నప్పుడు ..రాత్రిపూట ఇంటిబయట నులకమంచం మీద పడుకొని ఆకాశాన్ని చూస్తూన్న సందర్భం..అర్థరాత్రి కావస్తుంటే కూడా నా మంచం పక్కన కమ్మిన కోడిపిల్లలు లేచి గంపని కదుపుతున్నాయి.. అప్పుడనిపించింది రాసుకున్నా..

2.

నేను రాసిన కవితల్లో నాకు బాగా నచ్చిన కవిత “నేను”. ఇది నా కవితా సంకలనం “మట్టిపూల గాలి” లో మొదటి కవిత.
~~~
నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసినప్పుడు
మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే
పసిచివురును పొత్తిళ్లలో పొదుముకున్నంతలోనే వేరుతెగినప్పుడు
నేలలోకి కుంగి మళ్ళీ మొలకెత్తింది నేనే
ఇప్పుడు లోయా లేదు,తుఫానూ లేదు
అంతా మైదానమే..
భూమిపైన కనుచూపుమేరా..
మైదానపుకుదుళ్ల చివరా..
అంతా నేనే

ప్రతిరోజూ.. కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరీ ఎగిరీ
అలసిపోయినట్లై
ఒక్కసారి
ఏదైనా చెట్టుకింద సేదతీరాలనిపించింది.
నా పిచ్చిగానీ..
మళ్ళీ గుర్తొచ్చి నవ్వొచ్చింది.
ఆ చెట్టూ నేనే అని…

~~~
ఇది 2016 జూన్ లో సాహితీమిత్రులు – కవిత పత్రిక 37వ సంచిక లో పబ్లిష్ అయింది.ఎన్నిసార్లు చదువుకున్నా..చదివిన ప్రతిసారీ..నా మీద నాకు, జీవితం మీద నాకు ఒక భరోసా, నమ్మకం, ఆత్మతృప్తి ఇస్తుంది.ప్రతి  మనిషి individuality ని, ఆత్మగౌరవాన్ని మొదటి ప్రయారిటీ లో పెట్టుకోవాలని నమ్మే వ్యక్తిని నేను. మనకంటూ ఒక అస్తిత్వం ఉన్నప్పుడే..దాని వెంట మనిషి జీవితం కొనసాగుతుంది. అసలు ఆస్తిత్వమే లేనప్పుడు , వ్యక్తిత్వానికి గుర్తింపు లేనప్పుడు..అలాంటి చోట నిమిషం కూడా ఉండకూడదు. ఆ చోటు ఏదైనా కావొచ్చు..ఎవరి దగ్గరైనా కావొచ్చు..నీకు నువ్వుగా ఉండటమే జీవితం..అలా నాకు నేను మిగులుతూ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు నేను రాసుకున్న ఈ మాటలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్నిస్తాయి..అందుకే ఎన్ని కవితలు రాసినా ఇది నా ఆల్ టైం favorite poem.

3.

కవిత్వమే ఎందుకు రాయాలి అంటే చెప్పలేను. చిన్నప్పటి నుంచీ చదివింది కథలనే.. కుప్పలు కుప్పలుగా పుస్తకాలన్నీ చదివేసేదాన్ని..పిల్లల పత్రికలు, సోవియట్ పబ్లికేషన్స్ పుస్తకాలు, నవలలు..విపరీతంగా చదివాను..మాస్ కమ్యూనికేషన్ లో పీజీ చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత కెరీర్, కొత్త జీవితం.. ఇవన్నీ కొనసాగుతున్న క్రమంలో మనసుకి తోచింది వ్యక్తికరించడానికి కవిత్వం స్ట్రాంగ్ మీడియం లా అనిపించింది..రాసుకున్న నాలుగు పదాలో, వాక్యాలో.. మనసులోని భావనని మొత్తంగా నింపుకుంటే అంతకంటే ఇంకేం కావాలి.

15 జనవరి 2021 

*

 

మరికొన్ని కవితలు 

1

యుద్ధం అంటే అనేకం…

 

యుద్ధమంటే ఏకవచనం కాకపోవచ్చు.
కొన్ని లోపలి యుద్ధాలు..కొన్ని బయటి యుద్ధాలు..

అన్నీ కలగలిసి ప్రాణం తీయొచ్చు..లేదా..
ఒక్కొక్కటీ ఒక్కొక్కసారి చంపేయనూ వచ్చు.

ఊపిరి తీసుకోవడం..ఊపిరి తీసేయడం..
వేరువేరు యుద్ధాలు కావచ్చు..కాకపోనూ వచ్చు.

పసితనం..ముసలితనం..
ఒకేలాంటి యుద్ధం చేస్తుండొచ్చు.

రక్తపు మరకలో కాలిన ఎముకలో
ఒంటరవడం..యుద్ధం కావొచ్చు.

అమాయకత్వం.. భయంతో మాంసపు ముద్దలైనప్పుడు
యుద్ధం ప్రసవించి ఉండొచ్చు.

సమాధానాలు వెతుక్కోలేని సమాధులు కూడా
యుద్ధంలో మరణించి ఉండొచ్చు.

భూమ్మీద నీటితో పోటీ పడుతున్న
కన్నీటి శాతమే ఇప్పుడు యుద్ధం అయుండొచ్చు.

*

అలల తత్వమై

 

నీటి మీది రాతలేనా..
గడిచిన ప్రతి క్షణమూ చెరిగిపోయేదే..
వదులుకున్న ప్రతి క్షణమూ మాయమయ్యేదే.

అయినా..
నీటి మీద అలలుండగా రాతలెందుకు?
నిండుగా కావలించుకున్న ప్రవాహంలో..
మెరుపుల వెలుగుల్లో.. నిశి నీడల్లో..
ఎప్పటికప్పుడు జీవం పోసుకుంటూ..
అలల తత్వమై బతికేద్దామా..

అప్పుడప్పుడు ఆకాశంలోకెగిరి..
నక్షత్ర ధూళిలో కలిసిపోయి..
ఈ విశ్వానికి ప్రేమనిద్దామా..
జీవించడమే కదా జీవితమంటే..

1 ఆగస్టు 2024

*

తెల్లమద్ది వెన్నెల

అటు తిరిగి
ఇటు తిరిగి
నీ వైపు, నా వైపు ఒరిగి
చేతికందకుండా ఎగిరే
రెక్కలక్కర్లేని
ఓ చందామామా..నను కాదని
కొంతదూరమైనా
పోగలవేమో చూడు..నల్లమలలో తెల్లమద్దినై
ఒంటినిండా
నీ వెన్నెలని పూసుకున్నా..ఇక నీ రాత్రులు, పగళ్లు.
అన్నీ నేనే..2.

కదిలించొద్దు

ఎండిపోయిన ఆకులను
కదిలించొద్దు.తమను తాము
కోల్పోలేకపోయిన
భగ్న హృదయాలు అవి.
జీవి విడిచిపోయినా
ప్రాణం మిగిలే ఉన్న దేహాలవి..ఎన్నో ప్రేమలను చిగురించిన
గాలుల గానాలవి.. 

కాలాలన్నింటినీ జీవించిన
కదపకూడని జ్ఞాపకాలవి..

మళ్లీ ఏ వానో కురిసినప్పుడు
చినుకులని పట్టుకొని
ఒక్కసారి భోరున ఏడ్చేసి
కొత్త జీవితాన్ని మొదలుపెడతాయేమో..

అందుకే..
మనం
ఎండిపోయిన ఆకులను
కదిలించొద్దు.

15 మార్చి 2022

*
యే మేరే వతన్ కే లోగో…

వాళ్ళిప్పుడు గొంతెత్తగలరు
ఒక అడుగు ముందుకేసి పాడనూగలరు

దేశభక్తి పొంగిపొర్లుతుంటే
ఆ భారాన్ని
గుండెల మీద మోయలేని
సున్నిత మనస్కులు..

వాళ్ళిప్పుడు మాట్లాడగలరు
సల్వాజుడుం పేరుతో
అడవిబిడ్డల జీవితాలు
క్యాంపుల్లో బందీలయినప్పుడు..
తల్లీబిడ్డలు వేరుచేయబడి
బాలింతలు సైన్యంతో చెరచబడ్డప్పుడు..
నేలతల్లిని వదలలేని గూడెపోళ్ళు
గుడిసెల్లోనే తగలబెట్టబడినప్పుడు..
తల్లి కడుపులో ఉన్న ఐదు నెలల పిండం
గర్భం చీల్చి పెకలించబడి
మంటల్లో కాల్చబడినప్పుడు..
అయ్యో పాపం అని కూడా అనుకోలేనివాళ్ళు
ఇప్పుడు మాట్లాడగలరు..

పుట్టించిన అమ్మానాన్నలే
కులం ముఖ్యమైపోయి
ఒకరు కాళ్లు పట్టుకొని
ఇంకొకరు గొంతు నులిమేసి
ప్రాణాలు తీసినప్పుడు..
మధుకర్ లు, ప్రణయ్ లు
శవాలుగా మిగల్చబడ్డప్పుడు
కిక్కురుమమనివాళ్ళు..

పసిపిల్లల జననాంగాలను
కన్నతండ్రులే రక్తమోడ్చినప్పుడు..
మదమెక్కిన పురుషాంగాలు
యోనులతో పాటు గుండెలనూ చీల్చితే
దళిత ఆడబిడ్డలు
అడవుల్లో, చెరువుల్లో,
ఊరిచివరో, ఉరివేయబడో
మనుషులుగా ఛిద్రమైపోయినప్పుడు
కన్నెత్తయినా చూడలేనివాళ్ళు
ఇప్పుడు స్పందించగలరు..

పాలిచ్చే తల్లి శవమైపోయిందని తెలియక
రొమ్మును పిలుస్తున్న పసిబిడ్డను చూసినప్పుడు..
అగ్రరాజ్య అహంకారం బుసల్లో
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన
పసిపిల్లల మృతదేహాలు కంటపడినప్పుడు..
అడుగడుగునా అభద్రతలో
అమాయకత్వాన్ని కోల్పోవలసొచ్చి
మరణప్రాయమయిన బాల్యమంతా
మృతదేహాల కుప్పలయినప్పుడు..
కనికరమయినా కలగనివాళ్ళు
ఇప్పుడు వెక్కి వెక్కి ఏడవగలరు..

ఆడదనిపిస్తే చాలు కామించేవాళ్ళు
మేలిముసుగులేసుకొని వేధించేవాళ్ళు
బ్రాహ్మణులకు మాత్రమే- అద్దె బోర్డులు పెట్టె వాళ్ళు
పశువుల మాంసం, చర్మం విదేశాలకు అమ్ముకుంటూ
పెద్దకూర తింటారంటూ దాడులు చేసేవాళ్ళు..
లాగులు విప్పించి సున్తీ అయిందేమో చూసి
కత్తులతో నరికేసేవాళ్ళు
దేవుడి పేరుతో విగ్రహాలు పెట్టి
వాటి ముందు తాగి దొర్లి అల్లరి చేసి
భక్తిని చాటుకొనే మహానుభావులు
ఇవాళ దేశ రక్షకులు కాగలరు..

మూఢనమ్మకాల్లో మురిగిపోయేవాళ్ళు
మానవత్వాన్ని మరిచినవాళ్ళు
అణిచివేయడానికి ముందుండేవాళ్ళు
హక్కులంటే భయపడేవాళ్ళు
తమ మీద తమకే నమ్మకం లేనివాళ్ళు..
యే మేరే వతన్ కే లోగో…అంటూ
నాటకానికి తెరలేపగలరు..

ఎందుకంటే ఇక్కడ
వతన్ ఒక హిందుత్వం
వతన్ ఒక అగ్ర కులం
వతన్ ఒక అహంకారం
వతన్ ఒక బ్రహ్మణిజం
వతన్ ఒక నిరంకుశత్వం..
వతన్ ఒక అణిచివేత
వతన్ ఒక దుర్మార్గం
వతన్ ఒక ఆధిపత్యం..

వీటన్నింటినీ జారిపోకుండా కాపాడుకోటానికి
దేశభక్తిని పొంగించుకుంటూ
వాళ్ళిప్పుడు గొంతెత్తగలరు
ఒక అడుగు ముందుకేసి పాడనూగలరు..

యే మేరే వతన్ కే లోగో…

1 మార్చి 2019 

*

వానలు

1
ప్పుడొకసారి
సాయంత్రాన్ని మూసివేయాల్సొచ్చింది
అంతే..
దడదడా రంగుల యుద్ధం..
విరహం
మట్టి వాసనయింది
రాలిపడినా ప్రవహించడం
ఇప్పుడు ఉనికి..
నీకోసం
నా ఎదురుచూపుల్లో పుట్టినవే
వానలంటే..
___________________________________________________
2

నీకు

రాయిని తొలుస్తున్నా
నీకో సముద్రాన్నివ్వటానికి..
అంతరాళంలో సుడులు
పొమ్మని విసిరి కొడుతున్నాయి..
అప్పుడో అలసిన క్షణంలో
అలనై ఎగిరిపడుతున్నా..
కెరటాన్ని చీల్చుకొనొచ్చి
ఒడ్డున గాయపరచబడుతూ..
రాయిని తొలుస్తున్నా
నీకో సముద్రాన్నివ్వటానికి..
పెయింటింగ్:  సత్యా  బిరుదరాజు
_______________________________________________________
3
పిల్ల
పిల్ల
సముద్రం నుంచి నీళ్ళు,ఇసుక తోడుకొస్తుంది
పాదముద్రలతో
 సముద్రానికి దారి చూపిస్తుంది..
అలల నేత
 ఒడ్డు వరకు మాత్రమే ఓ విఫలయత్నం
రాలేని సముద్రం…పోలేని తీరం..
ఎంతటి హోరైనా చీకట్లో కేవలం వినిపించగలదు
ఈ పిల్ల మళ్ళీ సముద్రంలోకెళ్ళింది
ఒడ్డుకిప్పుడు దారి తెలిసి నిశ్శబ్దంగా ఏడ్చింది
సముద్రపు పిట్ట రాతిరి వేటాడుతుంటే
నా నీడ మీద మట్టి పోసుకుంటున్నా..
15 డిసెంబర్ 2018 
*

స్వేచ్ఛ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు