తోడు లేని వంతెనపై తను!

“నిర్జన వారధి”ని పరిచయం చేసినపుడు చాలాసార్లు నా గొంతు మూగబోయింది.

“మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని మొదటిసారి చూసినపుడు ఆ పేరు చాలా  ఆకర్షణీయంగా అనిపించింది. చరిత్ర నిండా రాజులు, రాణులు, యుద్దాలు, గెలిచిన భూభాగాలు, చంపబడ్డ సైనికులు ఇవే ఉంటాయి. సాధారణంగా చరిత్ర నిండా పురుషులు వారి వీర గాథలు ఉంటాయి. చరిత్ర పాఠాలు చదువుతున్నపుడు ఆయా కాలాల్లో స్త్రీలు ఏమయ్యారు?  ఏం చేసేవారు? చరిత్రలో వారెందుకు కనబడరు అనే ప్రశ్నలు రావడం సహజం. “స్త్రీశక్తి సంఘటన” అనే ఫెమినిస్ట్ గ్రూప్ “మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని తెచ్చేవరకు చరిత్రలో స్త్రీలెక్కడున్నారు? ఏం చేసారు? అనే ప్రశ్నలు ఎవ్వరూ లేవనెత్తినట్లు లేదు.

అంతకు ముందు వందేళ్ళ క్రితమే భండారు అచ్చమాంబ “అబలా సచ్ఛరిత్ర రత్నమాల” పేరుతో స్త్రీల చరిత్రను రాసింది. ఆమె అకాల మరణం వల్ల ఆమె తలపెట్టిన స్త్రీల సమగ్ర చరిత్ర రచన అసంపూర్ణంగా మిగిలిపోయింది. అయితే “స్త్రీశక్తి సంఘటన” తెలంగాణా సాయుధపోరాటంలో స్త్రీల పాత్రకు సంబంధించి సమగ్రమైన చరిత్రని ప్రచురించిన తర్వాతనే చరిత్ర పట్ల అప్పటి వరకు ఉన్న పురుషకోణం పక్కకి తొలగి స్త్రీల కోణం ఆవిష్కృతమైంది. స్త్రీవాద చరిత్రకు సంబంధించి “మనకు తెలియని మన చరిత్ర” పుస్తకం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి.

కొండపల్లి కోటేశ్వరమ్మ గారి గురించి రాయడానికీ ఈ ఉపోధ్ఘాతానికి సంబంధం ఏమిటి అనిపించొచ్చు చదువుతున్న వాళ్ళకి. సంబంధం ఉంది. ఆ పుస్తకంతో నా అనుబంధం పెరగడానికి కారణం ఆ పుస్తకం నిండా ఉన్న స్ఫూర్తిదాతలైన మహిళా మూర్తులు. ఈ పుస్తకం వచ్చేవరకు వారి గురించి, వారి పోరాటాల గురించి బయటి ప్రపంచానికి తెలియకపోవడం. తెలంగాణా సాయుధ పోరాటంలో పాటకట్టి, గన్నుపట్టి త్యాగాలెన్నో చేసిన పోరాట యోధురాండ్ర గురించి తొలిసారి చదివినపుడు ఉద్వేగంతో మనసు ఉప్పొంగింది. కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లు స్వరాజ్యం, ఐలమ్మ, మోటరు ఉదయం లాంటి నాయకురాళ్ళను కలవాలని మనసు ఉవ్విళ్ళూరేది. ఎంతమంది జీవించి ఉన్నారో తెలియదు.

“మనకు తెలియని మన చరిత్ర”లో తమ జీవితాల గురించి విప్పిచెప్పిన వారిలో కొంతమందిని కలిసే అవకాశం నాకు కలిగింది. మల్లు స్వరాజ్యం, కోటేశ్వరమ్మ, సుగుణ గార్లతో మంచి అనుబంధం కూడా ఏర్పడింది. కొండపల్లి కోటేశ్వరమ్మ గారిని నేను 2002 లో తొలిసారి కలిశాను. అంటే పదహారేళ్ళ క్రితం కోటేశ్వరమ్మ గారి గురించి, ఆవిడ పోరాటం గురించి “మనకు తెలియని మన చరిత్ర”లో చదివి ఉన్నాను. అబ్బూరి ఛాయాదేవి గారనుకుంటాను కోటేశ్వరమ్మ గారు విజయవాడ నుంచి వచ్చేసి చండ్ర రాజేశ్వర్రావ్ ఓల్డేజ్ హోం లో ఉంటున్నారని చెప్పారు. ఆమెని కలవాలనిపించింది. భూమిక పత్రికలో రెగ్యులర్ గా వేసే “జీవితానుభవాలు” కాలమ్  కి ఆమెతో ఇంటర్యూ తీసుకోవాలనుకున్నాను.

2001 డిశంబరులో నేను, నా ఫ్రెండ్ గీత కలిసి కొండాపూర్ వెళ్లాం. నేను అదే మొదటిసారి సి.ఆర్. ఫౌండేషన్ ఓల్డేజ్ హోం కి వెళ్ళడం. ఆమె తన రూం లో ఒక్కరే ఉన్నారు. అప్పటికే ఆవిడకి 70-80 మధ్య వయస్సు ఉంది. రూంలోకెళ్ళగానే నవ్వుతూ పలకరించారు. నన్ను పరిచయం చేసుకుంటూ భూమిక పత్రిక చేతిలో పెట్టాను. “భూమిక” గురించి విన్నానుగానీ చదివినట్టు గుర్తులేదన్నారు. “భూమిక”లో “జీవితానుభవాలు” పేరుతో ఒక శీర్షిక ఉందండి. స్ఫూర్తిదాతలైన స్త్రీల ఇంటర్వ్యూలు వేస్తుంటాం. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చామండి.” చల్లగా నవ్వారు. “కొత్తగా ఏముందమ్మా! చెప్పడానికి. స్త్రీశక్తి సంఘటన వాళ్ళ పుస్తకంలో వచ్చింది కదా!” అన్నారు. “అవునండి. వచ్చింది. నేను చదివాను. ఆ ఇంటర్వ్యూ చదివాకే మీతో మాట్లాడాలనిపించింది. మీ జీవితానుభవాలు “భూమిక”లో వెయ్యాలనిపించింది. భూమిక గ్రామీణ స్థాయి కార్యకర్తలకు కూడా వెళ్తుంది. ముఖ్యంగా వాళ్లు చదవాలని మా ప్రయత్నం.” అన్నాను. “సరేనమ్మా” అన్నారు.

కోటేశ్వరమ్మ గారు ఒక చలించని స్థితిలో తన అనుభవాలను చెప్పుకుంటూ వెళ్ళారు. మధ్యలో మేము ఎక్కువ ప్రశ్నలు వెయ్యలేదు. ఆవిడనే చెప్పుకుంటూ వెళ్ళనిచ్చాం. కూతురు డాక్టర్ కరుణ మరణం గురించి చెబుతున్నపుడు ఆమె కళ్ళలో సన్నటి నీటిపొర. చందూ మరణం గురించి చెప్పినపుడు ఉద్వేగానికి గురయ్యారు. ఇన్ని సంవత్సరాలైనా ఆ విషయాలు నా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నాయి. 2002లో ” ఈ జీవితమే ఒక పోరాటం” పేరుతో కోటేశ్వరమ్మగారి ఇంటర్వ్యూ భూమికలో ప్రచురించాం. అప్పటి నుండి తనతో ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. రెండు, మూడుసార్లు హోంలో కలిసాను.

తాపీ ధర్మారావుగారి కోడలు తాపీ రాజమ్మ గారి గురించి ఒక సమావేశంలో కోటేశ్వరమ్మగారు మాట్లాడుతున్నారని తెలిసి సి.ఆర్. హోం కి వెళ్ళాను. “ఉద్యమ కేదారంలో పూసిన మందారం రాజమ్మ” అంటూ చాలా ఉద్వేగపూరితమైన ఉపన్యాసం చేసారు. రాజమ్మ గారితో తన అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ “విజయవాడ ప్రతి సెంటర్లోనూ తిరుగుతూ ప్రజాశక్తి పత్రికనమ్ముతూ, స్త్రీల వెంటబడే రౌడీలను లెక్క చేయకుండా, ఎక్కువ ప్రతులు అమ్ముడుబోవడానికి “పాలపేజీ లాంటిది ప్రజాశక్తి” అంటూ పాడుతూ పత్రికలను అమ్మింది” అంటూ తాపీ రాజమ్మగారి గురించి ఎంతో ఆర్ద్రతతోనూ, ఆత్మీయతతోనూ ఆ రోజు మీటింగ్‌లో కోటేశ్వరమ్మగారు మాట్లాడినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మీటింగ్ తర్వాత ఆమెతో చాలాసేపు మాట్లాడాను. ఆమెతో కలిసి హోం లో భోజనం చేసాను.

ఆ తర్వాత చాలాకాలం కోటేశ్వరమ్మ గారిని కలవలేదు. 2010లో ఆవిడ హోం విడిచిపెట్టి వైజాగ్ వెళ్ళిపోయారు. అబ్బూరి ఛాయాదేవిగారు సి.ఆర్. ఫౌండేషన్ హోంలో చేరిన తర్వాత చాలాసార్లు ఆ హోంకి వెళ్ళాను. అప్పటికే కోటేశ్వరమ్మ గారు వెళ్ళిపోయారు గానీ ఆ హోంకి వెళ్ళినప్పుడల్లా ఆవిడ గుర్తొస్తారు.

2012లో కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ “నిర్జన వారథి” ఆవిష్కరణ సభ హైదరాబాద్ లో జరిగినపుడు కోటేశ్వరమ్మగారు విశాఖపట్నం నుంచి వస్తారని అనుకున్నాం.కానీ ఆవిడ ప్రయాణం చేయలేరని, మీటింగ్‌కి రారని తెలిసినపుడు చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఒక పెద్ద స్క్రీన్ పెట్టి వైజాగ్‌లో ఉన్న ఆవిడను స్క్రీన్ మీద ఫోకస్ చేసారు. ఆరోజు పుస్తకావిష్కరణలో ఆవిడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మాట్లాడారు. తన పుస్తకానికి “నిర్జన వారధి” అన్న పేరెందుకు పెట్టారో వివరించారు. అటునించి కొందరు, యిటునుంచి కొందరు వంతెన దిగి వెళ్ళిపోయారని వంతెన నిర్జనమైందని, తాను ఒక్కతే అక్కడ నిలబడిపోయానని చెప్పినపుడు ఆ పేరు సూచిస్తోన్న విషాదం, ఆవిడ జీవితంలో ఎదురైన దుఃఖ సమయాలు సభికుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి. ఆరోజు ఆవిష్కరణ సభలో అబ్బూరి ఛాయాదేవిగారు. చేరా, ఎబికె ప్రసాద్, ఓల్గా, మల్లు స్వరాజ్యం గార్లందరూ ఉన్నారు. ఆ సభ చాలా ఉద్వేగభరితంగా జరిగింది.

“నిర్జన వారధి” పుస్తకం చదివాక నాకు బలంగా అనిపించింది ఎమిటంటే, 2002లో నేను చేసిన ఇంటర్యూలో ఆవిడ చాలా విషయాలు చెప్పలేకపోయారని, తన లోపలున్న గాయాలను ఆవిడ తన పుస్తకంలో చాలా లోతుగా తడుముకున్నారని అనిపించింది. అందుకే ఇంటర్వ్యూ చేసినపుడు కలగని దుఃఖం పుస్తకం చదివేటపుడు చాలాసార్లు అనుభవంలోకి వచ్చింది. 10 టివి అక్షరం కర్యక్రమంలో “నిర్జన వారధి”ని పరిచయం చేసినపుడు చాలాసార్లు నాగొంతు మూగబోయింది.

అధ్భుతమైన పోరాటయోధులుగా పరిణామం చెందిన కొండపల్లి కోటేశ్వరమ్మ, నంబూరి పరిపూర్ణ లాంటి వీరవనితల వ్యక్తిగత జీవితాల్లోని సంఘర్షణలను గమనించినప్పుడు మన కుటుంబ, వివాహ వ్యవస్థల్లోని బోలుతనం, అణచివేత, పితృస్వామ్య భావజాలం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. విప్లవపార్టీల సారధులనుకునేవారి ఆచరణలోని పితృస్వామ్య భావజాలం షాక్ లా తగులుతుంది. స్త్రీ పట్ల, తమ జీవన సహచరుల పట్ల వారు ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం “తమ బలహీనతల” ముసుగులో దాచుకోవడం ఏవిధంగా చూసినా ఆమోదయోగ్యం కాదు.

కోటేశ్వరమ్మగారి “నిర్జన వారధి”, నంబూరి పరిపూర్ణగారి “వెలుతురు దారుల్లో” పుస్తకాలు చదివాక నాకు కలిగిన అభిప్రాయం ఒక్కటే. విప్లవంకోసం సమాజంలో పెను మార్పులకోసం అడవుల్లో పోరాటాలు నిర్మించిన నాయకులు తమ వ్యక్తిగత జీవితాల్లో ఆ విప్లవభావాలను ఎందుకు ఒప్పుకోలేకపోయారో!!! విప్లవం అంటేనే స్త్రీ పురుషుల్ని విముక్తుల్ని చేసేది. మరి తమ జీవితాల్లోని స్త్రీలపట్ల వారెందుకంత కాఠిన్యం వహించారా అనిపించింది. నిర్జనవారధి చదివాక కోటేశ్వరమ్మగారి మీద ప్రేమతో నా మనసు నిండిపోయింది.

కోటేశ్వరమ్మగారు వైజాగ్ వెళ్ళిపోయాక చాలాసార్లు కలవాలనిపించేది. క్రితం సంవత్సరం వెళ్ళినపుడు ఎలాగైనా కలవాలని ఫోన్ నంబరు సంపాదించి ఇంటికెళ్ళాను. వయసు మీదపడ్డంతో నిలువెత్తు మనిషి పిట్టలాగా అయిపోయారు. అయితే అది శరీరంలో వచ్చిన మార్పు మాత్రమే. మనసు మహా చైతన్యంగా చురుకుగా ఉంది. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం. సి.ఆర్. ఫౌండేషన్ లో తానిచ్చిన ఇంటర్వ్యూ కూడా ఆవిడకి బాగా గుర్తుంది. “నిర్జనవారధి” అనేక భాషల్లోకి తర్జుమా అయిన విషయం కూడా చెప్పారు. ఆవిడని చూడడం, మాట్లాడటం అధ్భుతంగా అనిపించింది. ఆ మూర్తి, ఆ జ్ఞాపకాలు మనసులో అలాగే ముద్రపడిపోయాయి.

ఓ నెలరోజుల క్రితం హెచ్.బి.టి. గీతారామస్వామి ఒక మీటింగ్‌లో కలిసినపుడు హఠాత్తుగా “కోటేశ్వరమ్మగారు ఈ సంవత్సరం వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. వందేళ్ళ పండుగ జరుపుదామా” అన్నారు. “వావ్!, గ్రేట్ ఐడియా గీతా!, తప్పక చేద్దాం.” అన్నాను. కొండెక్కినంత సంబరమైంది నాకు. “నువ్వు, నేను, వాళ్ల కుటుంబ సభ్యులు కలిసి చేద్దాం. ఏమంటావ్?” అంది. ఏమంటాను? దానికి రెండోమాట ఏముంటుంది. “యెస్ డియర్, నేను రెడి”అన్నాను. “అయితే అహ్వానం కోసం ఒక నోట్ రాయి”అంది. తప్పకుండా అని ఒప్పుకున్నానుగానీ రాయలేకపోయాను పనుల ఒత్తిడివల్ల. ఉమా నూతక్కిని అడిగాను. కోటేశ్వరమ్మగారి మీద చిన్న రైటప్ రాసి పంపిస్తావా? అని. అలాగే వందేళ్ల పండగ జరపడానికి సరిపడిన హాలు కూడా చూడమని ఉమకి చెప్పాను. నేను చిన్న వ్యాసం రాసానుగానీ ఉమ రాసింది చాలా బాగుంది. దాన్ని గీతకి, కోటేశ్వరమ్మగారి మనవరాలు అనురాధకి పంపించాను. వాళ్ళిద్దరూ దానిని ఆమోదించారు. అయితే కొంచెం నిడివి తగ్గించి ఆహ్వాన పత్రికలాగా తయారు చెయ్యాలనుకున్నాం. ఆ పని అనురాధ, గీత పూర్తి చేసారు.

నేను ఈ వ్యాసం రాసేనాటికే అందరికీ ఆహ్వానం అంది ఉంటుంది. ఆగస్టు 5వతేదీన, సముద్రతీరాన, చల్లని సాయం సమయాన కోటేశ్వరమ్మగారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, మితృలందరం కలిసి పెద్దయెత్తున ఒక పోరాటయోధురాలి పుట్టినరోజు పండుగను జరుపుకోబోతున్నందుకు నాకు గొప్ప సంతోషంగా ఉంది. సముద్ర కెరటాల సంగీత కచేరి వినిపించేలా ” హవామహల్” అనే అందమైన హాలును అనురాధ గుర్తించి నిర్ణయించారు. సో.. ఫ్రెండ్స్..ఆగస్టు 5న అందమైన విశాఖ సాగర తీరాన కొండపల్లి కోటేశ్వరమ్మగారి వందేళ్ళ పుట్టినరోజును సంబరంలాగా జరుపుకుందాం. మీరంతా తప్పక వస్తారనే ఆశిస్తూ.. కోటేశ్వరమ్మకి జై.. జయహో కొండపల్లి కోటేశ్వరమ్మ.

*

(ఈ వ్యాసాన్ని టైప్ చేసి సహకరించిన కవి మిత్రుడు నవీన్ కుమార్ కి కృతజ్ఞతలు)

కొండవీటి సత్యవతి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు