ఆమె చూపిన వెలుగు దారుల్లో …

చాలామందికి లాగానే నంబూరి  పరిపూర్ణ గారి గురించి నాకు ఆమె ఆత్మకథ ‘వెలుగు దారులలో…’ చదివే వరకు పెద్దగా యేం  తెలీదు.  అంతకుముందు అనిల్ అట్లూరి దాసరి శిరీష నిర్వహించే ‘వేదిక (సాహిత్యంతో మనలో మనం)’ కార్యక్రమాల్లో వొకట్రెండు సార్లు ఆమెను చూశాను. ఎనభై అయిదేళ్ల కంచు కంఠంతో ఆమె పాడగా విన్నాను. మాటల్లో ఆమె వాగ్ధాటికి ఆశ్చర్యపోయాను. అప్పటికే ఆమె వొక నవలిక కొన్ని కథలు మరెన్నో సామాజిక వ్యాసాలు రాసి వున్నారని సైతం నాకు తెలియదు. వేదిక మీటింగులకు అప్పుడప్పుడూ హాజరయ్యే క్రమంలో శిరీష గారి ఆత్మీయమైన స్నేహం లభించింది. ఆమె నడిపే ‘ఆలంబన’ పరిచయమైంది.  ఆమె వొక రోజున వేదిక మీటింగ్ తర్వాత ‘కథాపరిపూర్ణం’ అనే వారి కుటుంబ (ఒక తల్లీ ముగ్గురు పిల్లలు) కథలు పుస్తకం  ఇచ్చారు.  అందులో పరిపూర్ణ గారి మాకు రావు సూర్యోదయం (నవలికగా ఈ పెద్ద కథ 1985 లోనే వెలువడిందనీ దాని ద్వారా పరిపూర్ణ గారు మంచి రచయితగా గుర్తింపు పొందారు అనీ తర్వాత తెలిసింది), శీనుగాడి తత్వమీమాంస, ఎర్ర లచ్చుప్ప కథలు నన్ను ఆకట్టుకున్నాయి. కానీ ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకోడానికి గానీ జీవితాన్ని అధ్యయనం  చేయడానికి గానీ  ఆత్మకథే సరైన ఆకరం.

పరిపూర్ణ వంటి వ్యక్తి జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే నాల్గు తరాల సాంఘిక చరిత్రని స్థూలంగా అధ్యయనం చేయడమే అని అర్థమైంది. కులం కారణంగా జెండర్ కారణంగా అనేక వివక్షల్ని  యెదుర్కొంటూ, యెదురైన కష్టాలకు తల వంచక గుండె నిబ్బరం కోల్పోక సామాజిక ఆచరణలో వున్న ఆమె జీవితానికి చెందిన భిన్న పార్శ్వాలని లోతుగా తరిచి చూడడం ద్వారా దాదాపు నూరేళ్ళ సమాజ చలనాన్ని అంచనాకట్టొచ్చు. కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.

సాంస్కృతికంగా వైష్ణవీకరణకు గురైన  మాల దాసరి కుటుంబంలో పుట్టిన  పరిపూర్ణ బయటి నుంచి సవర్ణుల  వివక్షని యెదుర్కొంటూనే  కులం లోపలి బ్రాహ్మణీయ పితృస్వామ్య ఆధిపత్యంపై  సైతం  పోరాడింది.  ఆ విధంగా   మరాఠీ దళిత మహిళా రచయితలు బేబీ కాంబ్లే (Jina Amucha – Our Life), శాంతా  బాయి కాంబ్లే  (Mazhya Jalmachi Chittarkatha – The Kaleidoscopic Story of My Life), ఊర్మిళా పవార్ (Aaidan – The Weave of My Life: A Dalit Woman’s Memoirs) ఆత్మకథలతో   కొంతవరకు ఆమె ఆత్మకథని పోల్చవచ్చు.

వాస్తవానికి తెలంగాణాకు చెందిన టి యన్  సదాలక్ష్మి బతుకు కథ ‘నేనే బలాన్ని’ (గోగు శ్యామల) –  పరిపూర్ణ ఆత్మ కథ ‘వెలుగు దారుల్లో’ – యీ రెండింటినీ తులనాత్మకంగా పరిశీలించాలి.  అప్పుడు బ్రిటిష్ – నైజాం పాలనల్లోని   రెండు ప్రాంతాల సామాజిక చరిత్రలో కనిపించే వైవిధ్యం,  కొత్త కోణాలు వెలికి వస్తాయి. ఇద్దరూ సమకాలీకులే  అయినప్పటికీ వొకరు కాంగ్రెసు రాజకీయాల్లోకి మరొకరు కమ్యూనిస్టు వుద్యమంలోకి పయనించడానికి కారణమైన స్థానిక రాజకీయ సామాజిక నేపథ్యాల్ని అర్థంచేసుకోవచ్చు.

సృజనాత్మక రచనా రంగంలోకి పరిపూర్ణ చాలా ఆలస్యంగా ప్రవేశించారు. ‘వెలుగు దారుల్లో …’ వెలువడకుంటే నంబూరి పరిపూర్ణ జీవితం కూడా ఆమె ఇతర కుటుంబ సభ్యుల అస్తిత్వంలా చరిత్రలో అనామకంగానో అజ్ఞాతంగానో మిగిలిపోయేదేమో!  పరిపూర్ణ తోడబుట్టిన సహోదరులు ముగ్గురూ సామాజిక రాజకీయ రంగాల్లో ప్రముఖులే.  ఒక అన్న నంబూరి శ్రీనివాస రావు చిన్న వయస్సులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకొని జైలు జీవితం అనుభవించినవాడు. పూర్తికాలం కమ్యూనిష్టు కార్యకర్త. ఆయనకి గదర్  విప్లవ వీరుడు దర్శి చెంచెయ్య దగ్గర్నుంచీ రాజ్యాంగ నిర్మాత  బాబా సాహెబ్ అంబెడ్కర్ వరకు ప్రముఖ నేతలెందరితోనో ప్రత్యక్ష  అనుబంధం వుంది (చిన్నతనంలో మద్రాసులో చెంచెయ్య గారి యింట్లో వుండి పరిపూర్ణ కొన్నాళ్లు చదువుకున్నారు). శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యాడు. మరో అన్న దూర్వాస మహర్షి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ – గౌరవ డాక్టరేట్ పొంది అక్కినేని నాగేశ్వరరావుతో కాలికి గండపెండేరం తొడిగించుకున్న మహాకవి (ఇదే వొక సవర్ణుడైతే అతని చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించేవారు). తమ్ముడు జనార్దన్ కూడా వామపక్ష రాజకీయాల్లో తలమునకలైనవాడే (చూ. నంబూరి సోదరుల గురించి కాత్యాయనీ విద్మహే ‘కొలిమి’ (జనవరి 2022)లో రాసిన వ్యాసం).  ఎందుకో మన పరిశోధకులు భాగ్యరెడ్డి వర్మ కుసుమ ధర్మన్న గుర్రం జాషువా బోయి భీమన్నల దగ్గరే ఆగిపోయారు.  దళిత సాహిత్య చరిత్రలో  పూరించాల్సిన యిటువంటి ఖాళీలని  పూరించడానికి  పరిపూర్ణ జీవితం గురించిన అధ్యయనం ద్వారాలు తెరుస్తుందని నా నమ్మకం.

***

సినిమా, నాటకం, సంగీతం, సాహిత్యం, (కాల్పనిక, కాల్పనికేతర) రేడియో ప్రసంగాలు, టెలీ ఫిల్మ్స్, కమ్యూనిస్టు ఉద్యమ ప్రచారం, ప్రభుత్వ ఉద్యోగం, సామాజిక సేవ … ఇంత విస్తృతి వైవిధ్యం వున్న వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. ఎనిమిది దశాబ్దాల పాటు క్రియాశీలంగా వుండటం మరింత అబ్బురం. తొంబై ఏళ్ల తర్వాతి వయస్సులో పరిపూర్ణ రాసిన నవల ‘ఆలంబన’ యిటీవలే వెలువడింది. ఆ పుస్తకం హైదరాబాద్ ఆవిష్కరణ సభలో దాన్ని నేను రివ్యూ చేస్తూ చూపిన విమర్శనాత్మకమైన సూచనలు అమరేంద్ర ద్వారా పరిపూర్ణ తెలుసుకుని గొప్ప సహృదయతతో  మలి ముద్రణలో సవరించుకుటానని చెప్పారు. ఆమె నా ముందు అలా ప్రకటించినప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను. ఆ వయస్సులో ఆమె ప్రదర్శించిన  స్పోర్టివ్ నెస్ ని సంస్కారాన్ని  యివ్వాళ్టి  రచయితలు ఆదర్శంగా గ్రహించాలి. కమ్యూనిస్టు నేపథ్యమే  ఆమెకు ఆ పరిణతిని అందించి వుండొచ్చు. ఎదుటి వాళ్ళతో సైద్ధాంతికంగా విభేదించే సందర్భాల్లో ఆమె చాలా ఖరాకండిగా వ్యవహరించేవారు. మనుషుల వ్యక్తిగత విలువల గురించి  సామాజిక నీతి గురించి ఆమెకు ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి. వాటిని తన బలమైన గొంతుతో అంతే  నిక్కచ్చిగా ఆమె ప్రకటించేవారు. అభిప్రాయ ప్రకటనలో ఆమె ఆర్టిక్యులేషన్ కూదా యెంతో గంభీరంగా స్పష్టంగా వుండేది. ఆమె రాసిన వ్యాసాల్లో ఆమె రాసిన వచనంలోని తీక్ష్ణత అనుభూతమౌతుంది. జీవితానుభావమ్మీద సానబెట్టిన వాక్యాలు ఆమెవి.

ఆమె పాట ఎంత మధురమో మాట అంత పదును. కమ్యూనిస్టుల ఆదర్శాల గురించి త్యాగాల గురించి యెవరైనా పొరపాటున వొక్క పొల్లు మాట అన్నారంటే వూరుకునేవారు కాదు‌. ధాటిగా సమాధానం యిచ్చేవారు. చివరి వరకూ  ఆమె తన చిన్నప్పుడు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన నాటి ఆచరణను,  సైద్ధాంతిక అవగాహనను నిలుపుకునే వున్నారు.

పరిపూర్ణ జీవితం దాసరి నాగభూషణరావుతోనే   కొనసాగి ఉంటే… ఆమెకు  యింటికి వచ్చిన పార్టీ నాయకులకీ కార్యకర్తలకీ  వండి  వార్చడంతోనే సరిపోయేదేమో అని మనవరాలు అపర్ణ చేసిన వ్యాఖ్యతో నేను యేకీభవించను. అటువంటి జీవితంతో ఆమె యెట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి వుండేవారు కాదని నా విశ్వాసం. జీవితాన్ని ఆమె యెదుర్కొన్న విధానమే అందుకు రుజువు.  తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో,  సాంస్కృతిక చైతన్యంతో,  చొరవతో కుటుంబం వరకే  పరిమితం కాకుండా వొక వైపు సాహిత్య సాంస్కృతిక రంగాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ మరో కె ఆర్ గౌరీ అమ్మలాగానో బృందా కారాత్ లాగానో యెదిగేవారేమో!

పరిపూర్ణ గారిది స్వతంత్ర వ్యక్తిత్వం. ఎవరి అదుపుకూ లొంగనిది. ఆధిపత్యాలను సహించనిది. ఆత్మ గౌరవమే ఆమె ఆస్తి. దానికి భంగం కలిగించే దేన్నీ ఆమె జీవితంలో ఆమోదించలేదు.

***

ఈ మధ్యే దాసరి శిరీష జ్ఞాపికగా ‘జక్కికు’ నవలని ప్రచురించి ఎండపల్లి భారతికి అందించడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు అపర్ణ దగ్గర పరిపూర్ణ రెండు మూడు వారాలు గడిపారు(అదే చివరి కలయిక అవుతుందని ఊహించలేదు). అప్పుడు ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో తమ చిన్నప్పుడు మాలదాసరులు తక్కిన మాల కులస్తుల కంటే తమను పవిత్రంగా అధికులుగా భావించే వారనీ  తమ ఇంట్లోకి కూడా వారిని రానిచ్చే వారం కామని  చెప్పి బాధపడ్డారు. దేశంలో ఊడలు తన్ని పాతుకుపోయిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోని  ఆధిక్య న్యూనతల గురించి స్పష్టమైన విమర్శనాత్మకమైన యెరుక ఆమెకు  వుంది అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఆమె రచనల్లో సైతం సందర్భానుగుణంగా పాత్రల ముఖతా కుల మత వర్గ జెండర్ ఆధిపత్యాల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

శిరీష గారికి నివాళిగా ‘శిరీష కోమలం’ సంస్మరణ సంచిక తెచ్చిన తర్వాత ‘అమ్మ బతికి ఉన్నప్పుడే ఆమె సాహిత్య సాంస్కృతిక జీవితం గురించి మూల్యాంకనం చేస్తూ సావనీర్ చేస్తే బాగుంటుంది’ అని అమరేంద్రకి వేమూరి సత్యం గారు సూచించారు. శిరీష  సంస్మరణ సంచిక తయారు చేసే క్రమంలోనే నన్ను వాళ్ళ కుటుంబంలో కలిపేసుకున్నారు. బెజవాడ ఏలూరు కాకినాడ చిత్తూరు హైదరాబాద్.. శిరీష బంధుమిత్రులు అందరూ ముఖ్యంగా పరిపూర్ణ గారి చిన్న కొడుకు శైలేంద్ర మేనకోడళ్లు శైలజ మనోజ మాధవి (ఆశ్చర్యంగా అందరూ సాహిత్య జీవులే) యెన్నడూ ముక్కూ మొహం చూడని నన్ను తమవాడిగా ఆమోదించారు. అపర్ణ ప్రాణానికి మరో మామయ్య దాపురించాడు. అయితే పరిపూర్ణ పుస్తకం దగ్గరికి వచ్చేసరికి ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సిన యెన్నో అంశాలను అది నా  ముందు కుప్పవోసింది. పరిపూర్ణ సాహిత్యపు లోతుల్ని తవ్విపోసింది. అందులో తలమునకలయ్యాను. సాహిత్య విద్యార్థిగా మరిచిపోలేని అనుభవాన్ని ఆ గ్రంథ సంపాదకత్వం నాకు అందించింది. వూరూ పేరూ తెలియని నన్ను వ్యక్తిగతంగా ఆమెకు సన్నిహితం చేసింది.

ఎంతగా అంటే –

‘నేను నీ పుత్రికను’ అన్నారామె.  ‘ఒక దీపం వేయి వెలుగులు’ పేరుతో ఆమె జీవిత సాహిత్య వ్యక్తిత్వాల్ని  అంచనా వేస్తూ నూరు మందికి పైగా రచయితల రచనలతో సావనీర్  తెచ్చి ఆమెకు పునర్జన్మ యిచ్చానట;  అందుకు ఆమె స్పందన అది.

ఆమెను నేను తల్లిగా సంభావిస్తే ఆమె నన్ను నాయనగా సంబోధించడం గమ్మత్తుగా లేదూ! అచ్చం అమ్మ తన బిడ్డ  కడుపున/ వొడిలో మళ్ళీ పుట్టినట్టు. నాకు కొత్త బట్టలు కొనివ్వమని అపర్ణని శతపోరింది. అమ్మలందరూ అంతే అంటాడు అమరేంద్ర.

మరో ముచ్చట యేమంటే – పరిపూర్ణ గారి తల్లిగారిది  బండారు గూడెం మా ఊరు వీరవల్లికి (ఒకప్పటి గన్నవరం తాలూకా) వొక దిక్కున శివారు గ్రామమే. ఆమె పుట్టిన బొమ్ములూరు మరో దిక్కున కూతవేటు దూరాన వుంటుంది. ‘ఎర్ర లచ్చుప్ప’ కథలోని సిరివాడ (వేలూరు శివరామశాస్త్రి గారి సొంతూరు) కరణం గారి పొలం మా పొలం పక్కపక్కనే. ఈ విషయాలు పంచుకున్నప్పుడు ఆమె ముఖం యెంత వెలిగిపోయిందో! ‘మనం ఎంత దగ్గర వారం’ అని మురిసిపోయింది. ఇద్దరం వొకే గడ్డపై వూపిరి పోసుకున్నందుకు, బాల్యపు వొంటికి  వొకే మట్టిని  పూసుకున్నందుకు, వొకే నీరు తాగినందుకు, వొకే నేలపై  వొకే కాలంలో వొకే విధమైన ఆలోచనలతో జీవించినందుకు  నాకు గర్వంగా అనిపించింది.

***

జీవితంలో వచ్చిన కష్టాలన్నీటినీ పరిపూర్ణ ఛాలెంజ్ గా తీసుకొని యెదుర్కొన్నారు. తనలోని సృజన శీలతను కాపాడుకున్నారు. అదే ఆమె బతుకుని నవ నవోన్మేషంగా వుంచుకోటానికి తోడ్పడి వుంటుంది. జీవన పరిమలాన్ని పదుగురికీ పంచడానికి దోహదం చేసి వుంటుంది. ఆమె పరిపూర్ణమైన జీవితంలో యెప్పుడూ యెక్కడా రాజీపడలేదు.  తుది శ్వాస వరకూ సమాజం పట్ల సడలని నిబద్ధత, సాహిత్యం పట్ల చెదరని మోహం, మంచి పట్ల విడవని విశ్వాసం, మనిషి పట్ల చెరగని ప్రేమ ఆమె కోల్పోలేదు. ఆమె జీవితమే వొక  నేర్చుకోవాల్సిన పాఠ్యం.  తాను తిరుగాడిన కంటకావృత సీమల్ని  ఆమె పూల తోటలుగా తీర్చిదిద్దుకుంది. రాళ్ళూరప్పలతో నిండిన యిరుకు దారుల్ని రాచబాటగా పరచుకుని జయించింది. వడగాడ్పుల్ని మలయ మారుతాలుగా మలచుకుని ముందుకే నడిచింది. తన జీవితాన్ని వెలిగించుకుని మరెందరికో మార్గదర్శనం చేసింది.  ఆమె చూపిన వెలుగుదారుల్లో నడవటమే ఆమెకు మనం యివ్వగల నిజమైన నివాళి.

పి. యస్ : శిరీష బతికి వున్న రోజుల్లో పరిపూర్ణ శిరీష అపర్ణలను వొకచోట చేర్చి మూడు తరాల సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాల్ని వారి మాటల్లోనే తెలుసుకోవాలని నాకెంతగానో వుండింది. ఆ కోరిక తీరకుండానే శిరీష పరిపూర్ణ గార్లు వొకరి తర్వాత వొకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా ముచ్చట్లన్నీ అపర్ణతోనే.  

*

ఏ.కె. ప్రభాకర్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక రచన, ఒక స్మరణ ఎంత ఆత్మీయంగా ఉండాలో, ఒక తరానికి మరో తరం ఎంత ఘనంగా నివాళి సమర్పించాలో అంత గొప్పది ఉంది ఈ వ్యాసం. ప్రభాకర్ గారికి జేజేలు

  • ఆమెని నేను వ్యక్తిగతంగా చూసి మాట్లాడినా మీరు రాసిన వివరాలు ఏవీ నాకు తెలియవు..ఒక్కొక్కరి వెనుక తెలుసుకోలేక పోయిన ఎంత చరిత్ర ఉంటుందో కదా అని ఆశ్చర్యపోయాను .. అనేక ధన్యవాదాలు ప్రభాకర్ గారికి

    ముకుంద రామారావు

  • చాలా సమగ్రంగా, ఆత్మీయంగా చెప్పారు ప్రభాకర్ గారు. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు