ఆడవాళ్లూ ! ముందు మీరు మారండి!

శోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది. కాలానుగతంగా అది ‘జొన్నగిరి’ అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.

కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా గుత్తికి దగ్గర్లో ఉన్న ఈ జొన్నగిరికి చేయి దూరంలో ఎఱ్ఱగుడి రాతి బండల మీద అశోకుడు చెక్కించిన కొన్ని ధర్మలిపులు.. సుమారు రెండువేల రెండు వందల ఏళ్లపాటు ఎండకు, వానకు తడుస్తూ ఉండిపోయినవి.. భూగర్భ శాస్తజ్ఞుడు ఎస్. ఘోష్ ఖనిజాల వేటలో ఉండగా కాకతాళీయంగా బైటపడ్డాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులు (దయారాం సహానీ, హరప్రసాద్ శాస్త్రి) ధృవపర్చిన మీదట 1929, జూన్ , 11 వ తేదీ నాటి పత్రికలలో అధికారికంగా ప్రకటింపబడ్డాయి. ప్రముఖ తెలుగు చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరు వేంకట రమణయ్యల పుణ్యమా అని అవి ఎస్టాంపేజ్ పత్రాల రూపంలో గుట్టు చప్పుడుకాకుండా చెన్నపట్నం చేరడం, 1929, సెప్టెంబర్ నాటి భారతిలో దొరికిన రెండు లఘురూపాలు, పథ్నాలుగు పెద్ద సైజు ధర్మశాసనాల వివరాలు లోకం విశదంగా తెలుసుకోవడం సాధ్యమయింది.

ఆ శాసనాల మూలకంగా అశోకుడి కాలం నాటి రాజకీయ వ్యవస్థకు ఇప్పటి మన రాజకీయ వ్యవస్థకు మధ్య కొన్ని పోలికలున్నట్లు అర్థమవుతుంది. పాటలీపుత్రం ప్రధాన రాజధానిగా ఉన్నప్పటికీ అశోకుడికీ నాలుగు ప్రాంతీయ రాజధానులు విడివిడిగా ఉండడం, రాజధానిలోని రాచరిక వ్యవస్థ తీరునే ఉన్నట్లే, ఉపరాజధానుల్లోనూ ఉపరాచకీయ వ్యవస్థ ఉండటం గమనార్హం. ఉపరాజులు రాజుకు తోబుట్టువులయి ఉండాలనేది, తతిమ్మా పరిపాలనాంగాలు సైతం రాజబంధువుల కనుసైగలలో మాత్రమే నడవాలనే నియమమూ ఉన్నట్లనిపిస్తోంది. ఈ ఉపరాజు కుటుంబీకులంతా రాష్ట్రీయులుగా ప్రసిద్ధులని శాసనాలు తెలియచేస్తున్నాయ్.

రాజధాని దారిలోనే ఉపరాజధానిలోనూ న్యాయవ్యవస్థ ఒకటి రజ్జుకులు, మహామాత్రలు, అంత మహామాత్రలు, ఉపమాత్రల ఆధ్వర్యంలో నడవడం గమనార్హం. ఇప్పటి మహిళా కమీషన్ తరహాలోనే అశోకుడి కాలంలో కూడా స్త్రీల కొరకు స్త్రీల చేత మాత్రమే నిర్వహింప బడే మహామాత్రలు ఉండటం చెప్పుకోదగ్గ మరో గొప్ప విశేషం.

అశోకుని ధర్మలిపుల వల్ల రెండువేల రెండు వందల ఏళ్ల కిందట ఆంధ్రదేశంలోని స్త్రీల జీవన స్థితిగతులు ఏ విధంగా సాగాయో రేఖామాత్రంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పదమూడో శిలా శాననం చెప్పిన విధంగా ‘ఏదో ఒక మతమును అనుసరించని జనముండు దేశమే లేదు’. అన్న తీరులోనే నేటికీ లోకతంత్రం నడుస్తున్నది కదా!

శాసనాల వల్ల నాటికాలం సమాచారం ఆనవాలు పట్టడం సులభమవుతుంది. ఈ పై అనుశాసనాల వల్ల ఆ కాలంలో జంతుబలులు, జాతర్లు జరిగేవన్న విషయం సుస్పష్టం. తెలుగు సాహిత్యం కూడా ఇదే విషయాన్నే నొక్కిచెబుతుంది. ‘అంబోధరము క్రింద నసిమాడు/నైరావతియు బోలె సిడి ప్రేలె దెఱవయోర్తు’ అంటూ తెనాలి రామకృష్ణకవి పాండురంగ మహాత్యం మూడో అశ్వాసం, డెబ్భైఏడో పద్యంలో గంగజాతర్లలో స్త్రీలు పడే హింసాకాండ సమస్తాన్ని వళ్లు గగుర్పొడిచే రీతిలో వర్ణిస్తాడు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిణ హిందూ దేశంలో పర్యటించిన పోర్చుగీసు చరిత్ర కారుడు బర్బోసా కూడా గ్రామదేవతల కొలువులలో జరిగే హింసను విశదంగా వర్ణిస్తూ ‘ఈ దేశంలోని స్త్రీలు దైవారాధన దగ్గర ఎంతటి ఆత్మహింసకైనా తెగించడం విచిత్రం’ అని రాసుకొచ్చాడు. తాను ఇష్టపడ్డ ప్రియుడు తననూ ఇష్టపడే విధంగా మనసు మార్చే శక్తి స్త్రీ దేవతలకు ఉంటుందన్న నమ్మకం .. స్త్రీలను ఈ తరహా దుస్సాహసాలకు పురిగొల్పుతుదన్నది మనస్తత్వవేత్తల సిద్ధాంతం.

చిన్న ముల్లు వంట్లో దిగినా ఓపలేని సుకుమారి సైతం సిడి ఉత్సవాల నెపంతో వంటి రక్తాన్ని సిడి మాను(పెద్ద స్తంభం)కి కట్టిన ఏతం లాంటి వాసం ఇనుప కొక్కెం గాలాన్ని వీపుకు తగిలించుకుని గాలిలో గుండ్రంగా తిరగుతూ గొప్ప ఆత్మానుభూతి పొందడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఈ విధమైన హింసాకాండకు ఆ కాలంలో   అమితాదరణ ఉండబట్టే అహింసా మూర్తి అశోక చక్రవర్తి మొదటి శిలాశాసనంలోనే ‘ఇచ్చట ఏ సజీవ ప్రాణిని బలి ఇవ్వకూడదు’

‘ఇచ్చట ఏ విధమయిన వేడుక సమూహము కూడా నిషేదిద్ధము’

‘అట్టి సమావేశము వలన హాని కలుగునని దేవానాం ప్రియుని అభిప్రాయం’ అంటూ మూడు ఆదేశాలు జారీచేసివుంటాడు .

శాసించిన మాత్రాన జనం పాటించేదుంటే పరిస్థితులు ఇప్పటంత అర్థ్వాన్నంగా ఎందుకుంటాయి? జాతి తన పాటికి తాను తన ఆచారవ్యవహారాలను కొనసాగిస్తూనే ఉంటుంది. నోములూ, వ్రతాలూ చేసుకోవడం, ఇంట్లో అనారోగ్యాలు కలిగితే మొక్కుకోవడం, కోరిన కోరికలు తీర్చమని ఇష్టదైవాలకు మొక్కుబళ్లతో ఆశపెట్టడం వంటివన్నీ మానసిక భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు. ఎంత మహాచక్రవర్తయినా  మనసులను అదుపు చేయలేడు. కాబట్టే అశోకుని 9వ శిలాశానసంలో

  1. దేవానాం ప్రియుడు ఈ విధముగా దెల్పెను.
  2. జనులు అనారోగ్యముగా ఉన్నప్పుడు, గృహములందు వివాహాది శుభకార్యములు జరుగుచున్నప్పుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు.
  3. ఆయా సందర్భాలలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా కలదు.
  4. అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుటయు కలదు.
  5. శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసినదే.
  6. కానీ సాధారణముగ మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకరములు కావు.’ అని చెప్పడం జరిగింది.

అశోకుడు రెండున్నర సహస్రాబ్దాల కిందట చెప్పిన మాటలు అక్షరాలా ఇప్పటికీ వర్తిస్తాయి. అశోకుడి కాలమేం ఖర్మ, అధర్వణకాలంలోనూ ఈ మంత్ర తంత్రాలు, యజ్ఞయాగాదులు దండిగా ఉన్నాయి. ఆ వేదానికి అనుబంధంగా ఉండే సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం.. వగైరాలు మనిషిలోని భయాలను, ఎదుర్కొనే ప్రమాదాలను, వాటికి తగిన విరుగుళ్లను తెలియచేస్తాయి. జ్వరం, వరుస జ్వరం, పసరికలు, అజీర్ణం, జలోచరం, కుష్టు, వ్రణాలు, పురుగులు పడడం, పశురోగాలు, విషప్రయోగాలు.. ఇత్యాదుల నివారణకు అధర్వణ వేదంలో మంత్రాలు కనపడ్డమే ఇందుకు ఉదాహరణ.

ఆరోగ్యం నిర్లక్ష్యం చేసే అంశం కాదన్న మాట అక్షరాల వేదం చెప్పే పన్నాకి సమానమైన సుభాషితమే. రోగ నిరోధానికి, వస్తే.. గిస్తే నిదానికి, శాశ్వత నివారణకు ఏ తంత్రమో, మంత్రమో శాస్త్రీయంగా(ప్రయోగ ఫలితం మీద) ఆచరించి తీరవలసిందే. ఔషధాల మీద నిషేధాలను ఎవరూ కోరుకోరు. పెళ్లిళ్లు, పురుళ్లు వంటి శుభకార్యాలకు ఉత్సవాలు వద్దనడాన్ని ససేమిరా ఒప్పుకోరు. అయితే, అన్నీ పద్ధతి ప్రకారం చేసుకోవాలనుకుంటే, ఏడాది మొత్తం ప్రతీ రోజూ   ఓ వ్రతం నిర్వహించుకునే విధంగా మన సంప్రదాయాలలో ఏదో ఒక ఏర్పాటు చేసిపెట్టారు మన పూర్వీకులు. అవన్నీ తు.చ తప్పకుండా ఆచరించడం ఈ కలికాలం, కరవుకాలం, ఏ రోజుకారోజు కడుపు నింపుకునేందుకు బతుకు తెరువు కోసం వెదుకులాడుకునే కాలంలో ఎంత వరకు ఆచరణ సాధ్యం?!

సంప్రదాయం మీద వీరాభిమానానికి తోడు, హేతువుకు అందని ఆలోచనలు సహజంగానే అధికంగా ఉండే స్గ్త్రీల చిత్త ప్రవృత్తి వల్ల సమయం అధికంగా నిరుపయగమవుతుందనేదే ఆనాటి అశోకుడి నుంచి నేటి అభ్యుదయవాది వరకు అందరి అసలైన ప్రధాన బాధ,

వీరేశలింగంగారి మాటలే మరో సారి మననం చేసుకోదగ్గ మంచి సందర్భం ఇది. ‘ఆ కాలమందెల్లవారికిని దయ్యములయందలి విశ్వాసములు అధికముగా నుండెను. స్త్రీలలో నొకప్పుడును దయ్యము పట్టని వారెక్కడనో గాని లేక యుండిరి. ఎవ్వరికే వ్యాధి వచ్చినను వైద్యుని ఇంటికి మారుగా ముందుగా భూతవైద్యుని ఇంటికో, సోది చెప్పువాని ఇంటికో పరుగెత్తుచుండిరి’

అధర్వణవేదం కాలంలో కానీయండి, అశోకుని కాలంలో కానీయండి, తెనాలి రామకృష్ణకవి కాలంలో కానీయండి, వీరేశలింగంపంతులుగారి కాలంలో కానీయండి.. స్త్రీలందరూ ఒకే విధంగా ఉన్నారా? అధునాతున కాలం ఇదని గొప్పలు పోతున్నాం.. పోనీ ఇప్పుడైనా వందకు వంద శాతం స్త్రీలు మార్పు చెందారా?మారారంటున్న ఆ కొందరిలో అయినా నూటికి నూరు శాతం మార్పు వచ్చిందా?

నాటి  తెలుగునగరం సువర్ణగిరి దగ్గర రెండువేల రెండు వందల సంవత్సరాల కిందట ‘స్త్రీలు నిరుపయోగకరమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుట కలదు’ అని అశోకుడు వేయించిన శిలాశాసనంలో అక్షరాలే శిలాశాసనాలై మిగులుతాయా’అన్న ప్రశ్న వచ్చినప్పుడు..

వ్యవస్థ మారితే తప్ప స్త్రీల దురవస్థ మారదు. స్త్రీలు మారి, పురుషులను మారిస్తే తప్ప వ్యవస్థ అవస్థలో ఏ మంచి మార్పూ రాదు.. అని సమాధానం చెప్పుకోక తప్పదు .. ఎవరెంత నొచ్చుకున్నప్పటికీ!

***

కర్లపాలెం హనుమంతరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు