సీమ తొలినవలపై తెగని చర్చ.!

రేనాటి వీరుడు నవలలో రాయలసీమ ప్రాంతంలో ఆనాటి ఆచార వ్యవహారాలు, బ్రిటీష్‌వారు విభజించి పాలించే పద్దతులు, యుద్దతంత్రాలు, ముఠాకక్షలు, ఫ్యాక్షన్‌ తాలుకు ఆనవాలు, అంటే చిన్నచిన్న విషయాలకే ఈ ప్రాంతంలో పగలు, ప్రతీకారాలతో దాడులు చేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం వంటివన్నీ ఉన్నాయి.

టీవల రాయలసీమ నవలాసాహిత్యంలో తవ్యేకొద్ది చారిత్రక ఆధారాలు బయటపడుతున్నాయి. ‘తొలి తెలుగు నవల ఏది’ అనే విషయంలో సాహిత్యకారుల్లోనూ, చరిత్రకారుల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తొలితెలుగు నవలాకారుడు కందుకూరి వీరేశలింగం అని, కాదు కాదు.. కొక్కొండ వేంకటరత్నంఅని ఆయన రాసిన మహశ్వేత అనేది మొదటి నవల అని మరికొందరు భిన్నమైన అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ సందర్భంలో సాహిత్య శకలాల కింద అనేక నిజాలు మరుగున పడుతున్నాయన్నది సుస్పష్టం. అయితే రాయలసీమ ప్రాంతంలో నవలావికాసంపై సాహిత్యలోకంలో ఉన్న చర్చల్ని పరిశీలిద్దాం.

1878లో కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖరచరిత్ర కంటే ముందు రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ప్యాపిలి డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన నరహరి గోపాలకృష్ణమశెట్టి 1872లో ‘శ్రీరంగరాజుచరిత్ర’ రాశాడనే విషయం ఇప్పటివరకు సాహిత్యలోకంలో పెద్దగా ప్రచారం కాలేదు. సుగాలీల సాంఫీుక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల. శ్రీరంగరాజుచరిత్ర నవలలో నవలాలక్షణాలు లేవనే చర్చ కూడా ఉంది.ఈ క్రమంలో అనేక పరిశోధనలవల్ల 1874లో అనంతపురం జిల్లాకు చెందిన గడియారం రామాశాస్త్రులు ‘పేటికాంతరశవం’ అనే తొలి అపరాధ పరిశోధక నవల వెలువరించినట్లు తెలుస్తున్నది. డిటెక్టివ్‌ నవలలు కొత్త రచయితలను ఆనాడు ఆకర్షించడం ఒక పరిణామం.

ఈ యేడాది జనవరిలో రాయలసీమ నుండి 1917లో ప్రచురితమైన చతురిక అనే నవల వెలుగులోకి వచ్చింది. ఈ నవల సాహితీస్రవంతి కర్నూలు వారు తెలకపల్లి రవి సేకరణగా ముద్రించారు. ఈ నవలా రచయిత ఉ.రామచంద్రారావు. డిటెక్టివ్‌ సాహిత్యంలో అగ్రగణ్యుడు షెర్లాక్‌ హోమ్స్‌, డిటెక్టివ్‌ కథలతో బెంగాలీలో పాంచ్కడీదేవ్‌ వంటివారు అగ్రగణ్యులు. తెలుగుసాహిత్యంలో చెరగనిముద్ర వేసిన మహాకవి శ్రీశ్రీ కూడా మొదట పాంచ్కడీదేవ్‌ నవలల ప్రభావం గురించే మాట్లాడతారు. చతురిక నవలా రచయిత ఉ.రామచంద్రరావు నేరుగా షెర్లాక్‌ హోమ్స్‌ అనుసరణ (అడాప్టేషన్‌) అని స్పష్టంగా చెప్పి స్వేచ్చ తీసుకున్నారు.

ఈ చిన్న నవల మొత్తంలో అనుకరణ కన్నా, దేశీయతనే అత్యధికంగా కనిపిస్తుంది. కథనానికి అనుసరించిన శిల్పంలో కూడా కృత్రిమత్వానికి చోటివ్వలేదు. భాష పరంగా గ్రాంధికం కావడం వల్ల, అప్పటకీ, ఇప్పటికీ పదాల వినియోగంలో వచ్చిన మార్పువల్ల కొంత ఆలోచించాల్సిన అగత్యమేర్పడుతుంది. అదే సమయంలో ఇంగ్లీషు పదాల ప్రభావాన్ని, పోకడలను కూడా కొంత చెప్పడానికి ఈ రచయిత ప్రయత్నించారు. ఈ రెండు కారణాలు కొంతసమస్యగా కనిపించినా అప్పటి పరిస్థితులు మన కళ్లను కట్టిపడేస్తాయి. దీన్ని వ్యవహారభాషలో మార్చాలని సూచన వచ్చినా అప్పటి ఆలోచనలు తెలియాలనే చరిత్ర కోణంతో ఆ పనిచేయలేదని చెప్పాల్సి వుంది.

ప్యాపిలి డిప్యూటీి కలెక్టర్‌గా పనిచేస్తూ సోనాబాయి చరిత్రను శ్రీరంగరాజు చరిత్రగా నరహరిగోపాలకృష్ణమశెట్టి నవలీకరించాడు. ఆ సందర్భంలో బెంగాల్‌ గెజిట్‌లో ఒక ప్రకటన వెలువడిరది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను వచన ప్రబంధ ప్రక్రియలో రచన గావించిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని బెంగాల్‌ గవర్నర్‌ లార్డ్‌ మెయో ప్రకటించారు. 1872లో పరశీలనార్థం శ్రీరంగరాజ చరిత్రను ఆయన పంపారు. నవల ఉపోద్ఘాతంలో ‘తెలుగువారి జీవనసంస్కృతికి ప్రతిబింబం ఈ నవీనప్రబంధం’ అని రాశాడు. ఈ నవలలో కులాచారాలు, వర్ణభేధాలు, మూఢాచారాలు విశ్లేషిస్తూ విమర్శించారు. ఈ నవలను లార్డ్‌ మెయోకి అంకితం ఇచ్చారు. దీన్ని తొలి తెలుగు నవలగా గజిటేరియర్‌లో ప్రకటించారు. మచిలీపట్నం నుండి వెలువడుతున్న పరుషార్థప్రదాయిని మాసపత్రికలో Rangarajacharittra by N.Gopala Krishnama chettygaru is a Novel in a Sweet easy gramatical and ideamatic telugu prose అని రాశారు.

ఇక చతురిక నవలా విషయానికొస్తే చతురికలో కేవలం గూఢచర్యమే కాకుండా పోటాపోటీ గూఢచర్యం (కౌంటర్‌ ఎస్పినోజ్‌) ఆసక్తి అదనపు ఆకర్షణగా నిలిచింది. అయితే అది కొసమెరుపులా, చివరి వరకూ అర్థం కాదు. రాజుల కాలం అయినా కోర్టులు,పోలీసులు, దావాలు, విందు వినోదాలు వంటి ఆధునిక నగరజీవిత లక్షణాలు ఇందులో కనబడ్తాయి. ఒకరిని గురించి మరొకరు ఎలా ఆలోచించాలి.? ఎలా పసిగట్టాలి? తమ ప్రయోజనాలను గట్టిగా ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ నవీనకాలానికి ఏమాత్రం తీసిపోని రీతిలో నవలలో నడుస్తాయి.

నవల శీర్షిక చతురిక అన్నట్టే ఆమె చాతుర్యంతో పాటు, వ్యక్తిత్వం గల మహిళ అనీ తెలుస్తుంది. ఇది చదివాక కొంతవరకూ తెలుగు వారికి మధురవాణి గుర్తుకు వస్తుంది. కాకుంటే ఇది చిన్న నవలిక. పెద్ద విస్తరణకు అవకాశం లేకపోయింది. అంత పరిధీ లేదు. పాత కాలపు రచనల్లో కీలక పాత్రధారిణులు వేశ్యలు కావడం యాదృచ్చికమేమీ కాదు. ఆనాటికి ఆ మాత్రం తెగువ చొరవకు అవకాశముండేది వారికేనని చెప్పనవసరం లేదు.’’ అంటూ రాసుకొచ్చారు.ఈ నవల నాటకీయశైలిలో సాగుతుంది. 5 అధ్యాయాలుగల ఈ చిన్న నవల మొదటి అధ్యాయం మినహయిస్తే, మిగతా నాల్గు అధ్యాయాలు నాటకీయశైలిలోనే సాగుతాయి. 13వ శతాబ్ధానికి చెందిన తిక్కన భారాతాన్ని నాటకీయశైలిలో రాశారు. అంతేకాకుండా ఏ పరభాషా పదానికి చోటివ్వకుండా అచ్చతెలుగులోనే రాశారు. ఈ చతురిక నవలలో ఉ.రామచంద్రరావు ఆయన శైలినే అనుసరించాడు.ఈ నవల చదివాక ఆనాటి దేశకాల పరిస్థితులు తెలుస్తాయి. మరీముఖ్యంగా 1917నాటికే కర్నూలులో యస్‌వి రాఘవయ్య అనే వ్యక్తి శ్రీచంద్రమౌళీశ్వర ముద్రాక్షరాలయం ఉన్నట్లు అర్థమౌతుంది.

ఇక 1925లో కడపజిల్లా జమ్మలమడుగుకు చెందిన కలవటాల జయరామారావు రేనాటి వీరుడు అనే నవల రాశారు. రాయలసీమ పాళెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ నవల వచ్చింది. ఈ నవలా రచయిత ‘‘తగిన చారిత్రాత్మక వియషములకై మిక్కిలి శ్రమపడి సంపాదించి’’ ఈ నవలను రాసినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రసిద్దరచయిత విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఈ నవలగూర్చి అనేక విషయాలు సాహిత్యసమాజానికి అందించారు.

రేనాటి వీరుడు నవలలో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కోయిలకుంట్ల ఖజానాను దోచుకోవడంతో మొదలై 1847 ఫిబ్రవరి 22న కడపజిల్లా కలెక్టర్‌ కాక్రెన్‌ అతనికి ఉరిశిక్ష తీర్పు ఇచ్చి అమలు చేయడంతో ముగుస్తుందని రాశారు. అయితే ఈ రేనాటి వీరుడు నవలలో రాయలసీమ ప్రాంతంలో ఆనాటి ఆచార వ్యవహారాలు, బ్రిటీష్‌వారు విభజించి పాలించే పద్దతులు, యుద్దతంత్రాలు, ముఠాకక్షలు, ఫ్యాక్షన్‌ తాలుకు ఆనవాలు, అంటే చిన్నచిన్న విషయాలకే ఈ ప్రాంతంలో పగలు, ప్రతీకారాలతో దాడులు చేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం వంటివన్నీ ఉన్నాయి. అంతేకాక నీళ్ళకోసం అర్రులు చాచే నీటి దారిద్య్రం, కరవు కాటకాలకు సంబంధించిన అనేక హృదయవిదారక దృశ్యాలు ఈ నవలలో ఉన్నాయి. ఇలా రాయలసీమ ప్రాంతంలో నవలల పరిణామం సాగింది.

మరింత పరిశోధిస్తే రాయలసీమ ప్రాంతంలో వచ్చిన అనేక సాహిత్యసంపదను వెలికితీయవచ్చు.

*

కెంగార మోహన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి సమాచారం ఇచ్చారు మోహన్ జీ !
    అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు