సాహిత్య సృజన వల్ల కాసులు మృగ్యమన్నది తెలుసు. కానీ కోర్టుకేసులు కొని తెచ్చుకున్న వాళ్లు అరుదు. అట్లాంటి అరుదైన కవి వద్ది తాతయ్య. రాముడి తనయుడు లవకుమారుని చరిత్రను తాను తెలుగులో ఒక అర్థంలో రాస్తే కవికి లేని ఉద్దేశాన్ని ఆపాదిస్తూ ఆ పదాన్ని ఉర్దూలో వ్యాఖ్యానించి కొందరు బ్రాహ్మణ పండితులు కోర్టులో కేసు దాఖలు చేసిండ్రు. లేని వివాదాన్నిసృష్టించారు. ఈ కేసులో తాను గెలిస్తే శివకేశవులను స్తుతిస్తూ శతకాలు రాస్తానని మొక్కుకున్నాడు. చివరికి ఆ మొక్కు చెల్లించుకున్నాడు. శతకాలే కాదు నాటకాలు, యక్షగానాలు, చాటు పద్యాలు రాసిన కవి వద్ది తాతయ్య. వెంకమ్మ, భూపతి దంపతులకు పద్మశాలి కులంలో 1842లో ఎర్నగూడెం తాలూకా వనపురములో పుట్టిండు. పశ్చిమగోదావరి జిల్లా కోనాలలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. 1917 లో చనిపోయిండు.
ఈయన తాత ముత్తాతల గురించి ఈతని కుటుంబం, నివాసం గురించి యక్షగాన వాఙ్మయ చరిత్రలో యస్.వి.జోగారావు ఇట్లా రాసిండు. ‘‘గోదావరి తీరస్థిత కోనాల గ్రామ కాపరస్తుడు. తద్గ్రామ రిజల్టు స్కూలుపాధ్యాయుడు. ఇతని ప్రపితామహులు అయ్యన్న, నూకమాంబ. పితామహులు భూపతి, సీతమాంబ. తల్లిదండ్రులు భూపతి వెంకమాంబ. స్వస్థలము ఎర్నగూడెం తాలూకా వనపురము. ‘‘పద్మగర్భునుని పాదభవుడు’’ ఆపస్తంబ సూత్రుడు. మార్కండేయస గోత్రుఁడు. వంగిపురి వెంకటాచార్యుల శిష్యుడు.’’ అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఆయన బ్రాహ్మణుడు అని పాఠకులు పొరబడే అవకాశమున్నది. ఇన్ని చెప్పిండు గానీ ఆయన కులాన్ని గురించి జోగారావు ఎక్కడా చెప్పలేదు. తెలుగు అకాడెమీ సాహిత్య కోశములోనూ కులం విషయం ప్రస్తావన లేదు. నిజానికి ఈయన పద్మశాలి మహనీయుల్లో ఒకరని పెండెం వెంకట్రాములు 1939లో వెలువరించిన ఒక పుస్తకం వల్ల తేటతెల్లమవుతున్నది.
కోనాలలో తన 20వ యేట 1862లో రిజల్టు స్కూల్ని ప్రయివేటుగా ఏర్పాటు చేసిండు. ఆ స్కూల్ మేనేజరుగా, గణిత ఉపాధ్యాయుడిగా, కవిగా రాణించాడు. 150 ఏండ్ల క్రితం ప్రయివేటుగా స్కూల్ నడిపించాలని ఆలోచించడమే విప్లవాత్మకమైన చర్య. అట్లా జ్ఞానాన్ని పంచేందుకు పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపు 50 ఏండ్ల పాటు నిరాటంకంగా నడిపించాడు.
తన రచనల గురించి రుక్మిణీ కళ్యాణము నాటకములో ఇలా పేర్కొన్నాడు. ‘‘నానార్థ పంచవింశతి, సీసావళి, కపోత వాక్యము, లవకుమార శతకము రచియించి యచ్చొంతింప నందు లవకుమార శతకమునకు గేసు వచ్చినది. ఆ కేసు తొలగించిన శివకేశవుల పేర శతకము వ్రాసెదనని దలంచగా తొలగించి రంతట, కోనాల వేణుగోపాల శతకమనియు, కోనాల సోమలింగేశ్వర శతకమనియు నామంబులుంచి రచించి యచ్చు నొత్తించితి. తదంనతరము శశిరేఖా పరిణయము నాటకము రచించితిని.’ అంటే ఈయన రచనలు మొత్తం తొమ్మిది కనబడుతున్నాయి.
‘‘రుక్మిణీ కళ్యాణం యక్షగాన నాటకం, పెంటపాడు వేణుగోపాలునికి అంకితంగా ఉంది. శశిరేఖా పరిణయం పెంటపాడులోని గోపాలునికి అంకితంగా ఉంది. వీరి నాటకాలన్నీ యక్షగాన నాటకాలు. వాడుక భాషలో ప్రజాసామాన్యానికి అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. వీరు పూరించిన సమస్యా పూరణ పద్యాలు, నానార్థ పంచవింశతి సీసాలు పండితుల మెప్పు పొందాయి’’ అని తెలుగు సాహిత్య కోశంలో పేర్కొన్నారు.
భక్తి మెండుగా గల వద్ది తాతయ్యపై కేసు ఎందుకు వేశారనేది ‘విచారిం’చాల్సిన విషయం. ఈయన 1900 ఆ ప్రాంతంలో ‘లవకుమార శతకం’ ను ‘చూతుమె లవుడా’ అనే మకుటంతో అదే మారు పేరుగా పెట్టి రాసి ప్రచురించిండు. దీనికి రాజమండ్రికి చెందిన కొందరు కవి, పండితులు వీటిని ఉర్దూ అర్థంలో వాడుతూ బూతు అని కోర్టులో కేసు వేసిండ్రు. ‘లవుడా’ అనేది అశ్లీలార్థాన్ని సూచిస్తుంది కానీ బూతు కాదు అని కోర్టు విచారణ చేసి తేల్చి చెప్పింది. దీంతో మొక్కుకున్నట్టు కోనాల వేణుగోపాల, కోనాల సోమలింగేశ్వర శతకాలు రాసిండు. ఇవి రెండూ 1910లో వెలువడ్డాయి. అంటే కేసు దాదాపు ఏడెనిమిదేండ్లు నడిచినట్లు అర్థమయితున్నది. శ్రీరాముని ఇద్దరు కుమారుల్లో కుశుడు లవకుమారునితో చెప్పిన ఏక ప్రాస కంద పద్యాలివి. రామాయణార్థంగా మొత్తం 122 పద్యాలు ఈ శతకములో ఉన్నాయి.
లవకుమార శతకం
ఈ శతకం ఆరంభంలోనే డిస్క్లెయిమర్ ఇస్తూ ‘ఈ శతకము శ్రీరాముని పుత్రుడగు లవుని పేర్కొని వ్రాయబడినది’ అని స్వయంగా కవి పేర్కొన్నాడు. అయినప్పటికీ ఆయనపై కేసు వేసిండ్రు. అయితే రచయిత ఉద్దేశ్యమేమిటో ‘తెలుగు సాహిత్యంలో రామకథ’ అనే పరిశోధక గ్రంథంలో పండా శమంతకమణి ఇలా రాశారు. ‘‘భగవంతుని లీలామానుష విగ్రహంను, అవతార విశేషములను ‘‘నాడుండినచో చూతమె’’ అనగా దర్శించి యుందుము గదా’’ అను భావమున లవుని పేర్కొని కవి యిద్దానిని వెలయించెను.’’ అని రాశారు.
ఈ లవకుమార శతకము దశరథ పుత్రకామేష్టితో కథ ప్రారంభమై, సోమకాసురుని వధ, శ్రీమన్నారాయణుని లీలా విలాసములు, రామావతారం, లంక ముట్టడి, రావణుడు తన గురువుతో యుద్ధ సమయాన చేసిన సమాలోచన, కుంభకర్ణుని నిద్రాభంగం, హనుమంతుడు లంకకేగు, రావణ వధ, సీత అగ్ని ప్రవేశమము, లవుడి వివరణలు ఇందులో పేర్కొన్నాడు కవి. ఇందులోని కొన్ని పద్యాలు ఇలా ఉన్నాయి.
కం. శతకం నామమె బూతని
మతిమంతులు గాంచి చదువ మానెదరేమో
క్షితిపతియగు శ్రీరాముని
సుతు గూర్చున శబ్దములివి సొంపుగ గనుడీ
అని శతక మకుటం బూతుగా భావించి పుస్తకం చదువక పొయ్యేరు, ఇది శ్రీరాముని చరిత్ర మీరు చదవాలి అని ప్రారంభ పద్యాలో వేడుకొన్నాడు.
కం. ధరలోపల దశరథునకు
చిరకాలము సుతులు లేక జింతిల మఱియ
త్తరి క్రతువు చేసినాడట
సురుచిరముగ నప్పుడుంటె చూతుమె లవుడా
కం. దురమున రాముని గెల్చుట
తరమా దశకంఠ యనఁగఁ దమ్మునిఁదన్నెన్
వఱణనుచు రాముఁ గనెనట
సురుచిరముగ నప్పుడుంటె చూతుమె లవుడా
చివరి పద్యాలు
కం. మురియుచు రాము కయోధ్యా
పురమునుఁ బట్టణముఁ గట్ట భూసుతతా న
త్తరి సంతసిల్లి నారట
సురుచిరముగ నప్పుడుంటె చూతుమె లవుడా
కం. దరణిలో వద్ది కులాంబుధి
వరచంద్రుడు భూపతికిని వైభవ సుతుడీ
చరితంబు వ్రాయు ననిరట
సురుచిరముగ నప్పుడుంటె చూతుమె లవుడా
కం. సురలును మౌనులు మిక్కిలి
కరుణను తాతయ్యదాసు కవి యగు నని య
త్తరుణమున జెప్పుకొనిరట
సురుచిరముగ నప్పుడుంటె చూతుమె లవుడా
శతకాంత గద్యలో ‘‘మార్కండేయ గోత్ర ఆపస్తంబ సూత్ర వద్దికుల కలశ జలనిధి కుముద.. శ్రీభూపతి వర్య పుత్ర… తాతయ్య నామధేయ ప్రణీతంబైన చూతమె లవుడా’’ శతకమను ప్రబంధము నేకాశ్వాసము’’ అని పేర్కొన్నాడు.
కోనాల వేణుగోపాల శతకము
సీ. శ్రీమన్మహారాజ శేఖరుడైనట్టి
శ్రీరామ నీదు శృంగారమైన
పాద పద్మములకు భక్తి తోడుత వద్ది
తాతయాఖ్యుండు సంప్రీతితోడ
సాష్టాంగ దండములు సల్పి వ్రాసిన యర్జి
విన్నపంబును మారు వినుడు నేడు
నీ కుమారుని పేర నేర్పుగా శతకము
జెప్పగా కేసయ్యేఁ దప్పకుండా
గాన నాయందు మిక్కిలి కరుణ నుంచి
కేసు దొలగించి నన్నేలు భాసురాంగ
బుధజనోల్లాస కోనాల పురనివాస
వేణుగోపాల ఇందిరా ప్రాణలోల
సీ. శ్రీరామచంద్ర నీ చిన్నిపుత్రుని పేర
శతకము జెప్పి సమ్మతముగాను
యచ్చొత్తువారల కిచ్చి యెత్తించితి
ధరణి రాజనరేంద్ర పురమునందు
వారు పైసల వెలకమ్ముచునుండ పో
లిసు వారలు గాంచి కేసు జేసి
భూతలమందిట్టి బూతుల వ్రాయుట కేమి
కారణమని సర్కారువారు
నీసుతు నామంబు నిఖిల లోకములకు
భావనమంచు నిప్పగిది వేడ్క
నేరచించితి గాని యే నేరమెరుగ
గాన నాకేసునుఁ దొలగించి కరుణనేలు
బుధజనోల్లాస కోనాల పురనివాస
వేణుగోపాల ఇందిరా ప్రాణలోల
బహుముఖాలుగా రచనలు చేసిన వద్ది తాతయ్య గురించి గానీ, ఇలాంటి ఒక కాంట్రవర్సి చరిత్రలో చోటు చేసుకున్నదని చెప్పే సాహిత్య చరిత్ర మనకు లేదు. ఇప్పటికైనా ఇట్లాంటి అన్ని విషయాలు చరిత్ర కెక్కాల్సిన అవసరమున్నది. బీసీలు రాసిన సాహిత్యము వాసికెక్కినదని చెప్పాల్సిన తరుణమిది.
(ఈ పుస్తక రచనకు ప్రధానంగా ఉపయోగ పడ్డ రచన, పెండెం వెంకట్రాములు 1939లో రాసి, ప్రచురించిన పద్మశాలి మహనీయులు గ్రంథం.)
వద్ది తాతయ్య గారిని గూర్చి పరిశోధనాత్మకంగా కృషిచేసి ఒక మంచి సమాచారాన్ని అందించిన సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు .శుభాభినందనలు