నిజానికి ఈయనే హరికథా పితామహుడు!

లక్ష్మణదాసు మనవడిగా, కేశవరామయ్య, అన్నమాంబల పుత్రుడిగా, సంగీతజ్ఞుడు బాల ప్రసాద్‌ తమ్ముడిగా చరిత్రకెక్కిన బాలాజీ దాసు, హరికథా పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన ఆదిభట్ల నారాయణదాసు కన్నా ముందే రచనలు చేసిండు.

విద్య సమాజంలోని కొన్ని ఆధిపత్య వర్గాలవారికే పరిమితమైన దశలో బహుజన కులాల నుంచి చదువుకొని, హరికథలు రాసి, భాగవతార్‌గా వాటిని ప్రదర్శించి, ఆంగ్లాంధ్ర, హిందీ భాషల్లో కవిత్వం, కీర్తనలు చెప్పిన వారు చాలా అరుదు. ఆ అరుదైన హరికథా రచయిత విశాఖపట్టణం జిల్లా అనకాపల్లికి చెందిన బి.బాలాజీదాసు. బొందిలి కులస్తుడు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ నుంచి కొన్ని వందల ఏండ్ల క్రితం వచ్చి తెలుగునాట స్థిరపడ్డ కుటుంబానికి చెందిన వాడు.
లక్ష్మణదాసు మనవడిగా, కేశవరామయ్య, అన్నమాంబల పుత్రుడిగా, సంగీతజ్ఞుడు బాల ప్రసాద్‌ తమ్ముడిగా చరిత్రకెక్కిన బాలాజీ దాసు, హరికథా పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన ఆదిభట్ల నారాయణదాసు కన్నా ముందే రచనలు చేసిండు. నిజానికి ఈయనే హరికథా పితామహుడు. ‘హరికథల’ మీద విశేషమైన పరిశోధన చేసి ‘హరికథా సర్వస్వము’ వెలువరించిన తూమాటి దొణప్ప పుస్తకంలో ఈయన గురించి కొంత సమాచారం దొరుకుతుంది. అయితే నేను సేకరించిన బాలాజీదాసు రచనల్లో ఎక్కడా కూడా ఆయన పుట్టిన తేదీని పేర్కొనలేదు. దొణప్ప కూడా ఆయన జీవన్మరణ వివరాలను పేర్కొనలేదు.
ఎప్పుడో యాభై ఏండ్ల క్రిందటే సమాచారం అలభ్యంగా ఉంటే ఇప్పుడా సమాచారం సేకరించడమంటే చాలా కష్టసాధ్యమైన పని. తెలుగు అకాడెమీ 1986లో ప్రచురించిన ఆధునిక తెలుగు సాహిత్య కోశం గ్రంథంలో బాలాజీదాసు రచనలు 50కి పైగా ఉన్నాయని పేర్కొన్నారు. కాశీనాథుని నాగేశ్వరరావు 1927 వరకు తెలుగులో ప్రచురితమైన ‘ఆంధ్ర వాఙ్మయ సూచి’ని సంకలనంచేసి 1929లో ప్రచురించారు. ఇందులో బాలాజీ దాసు రాసిన 18 రచనలను పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా దాసు బ్రతికి ఉన్నాడని భావించాలి. ఎందుకంటే 1939లో ప్రచురితమైన బాలాజీదాసు రచన ‘రుక్మాంగద చరిత్రము’ గ్రంథము చివర్లో ‘సంపూర్ణ రామాయణము’ అచ్చులో యున్నది. అని పేర్కొన్నారు. దీన్ని బట్టి 1939 వరకు బాలాజీ దాసు బ్రతికి ఉన్నట్టు భావించాలి. బహుశా ఆయన 1860 ఆ ప్రాంతంలో జన్మించి 1950 వరకు జీవించి ఉండే అవకాశమున్నది. సంస్కరణ దృష్టితో రచనలు చేయడమే గాకుండా హరికథలు చెబుతూ చెబుతూ మధ్యమధ్యలో సామాజిక అంశాలను ప్రస్తావించి ప్రజలను జాగరూకులను చేసిన కవి, సంస్కర్త బాలాజీదాసు.
తన రచనలన్నింటిలో గురువు, తల్లిదండ్రులకు విధిగా నమస్సులు అర్పించుకున్నారు. తొలిదశ మొదలు తుదిదశ వరకూ ఆయన అన్ని పుస్తకాల్లో ఒకే విధంగా స్తుతి పద్యాలను జోడిరచాడు. ఆ స్తుతిలో తన తల్లిదండ్రుల గురించి ఇట్లా చెప్పుకున్నాడు.
సీ. ఫలసస్యవృద్ధిసద్వ్యాపారముల చేత
మను అన్కపల్లి గ్రామనిలయుండ
గురు భరద్వాజసగోత్ర ప్రపావన
ప్రభుడు లక్ష్మణదాస పౌత్రకుండ
రహిమీర కేశవరామాఖ్యునకు గన్న
మాంబకు నే ద్వితీయాత్మజుండ
విశ్రుతగాన ప్రవీణుడౌ బాలాప్ర
సాదు గారికి నే సహోదరుండ
గీ. శైలజాహృదయాబ్జ భాస్కర కటాక్ష
వీక్షణప్రాప్తగాన కవిత్వయుతుడ
శ్రీరమేశ కథాబోధనారతుండ
నరయ బాలాజిదాస నామాకితుండ॥
బాలాజీ దాసు గురుస్తుతి
తన కవితా గురువు పొట్నూరు వెంకటస్వామిని గురించి ఇట్లా చెప్పుకున్నాడు.
కం. తగనాంధ్ర భాషగరపిన
తగవరి పొట్నూరు కుల సుధావార్థి విధుం
డగు వెంకటసామి మదీ
య గురుని మదిలో దలంతు ననవరతంబున్‌
మనకు లభ్యమవుతున్న వివరాల మేరకు ఈయన రచనల పట్టిక ఇలా ఉన్నది. ఇందులో దాదాపు అన్నీ పౌరాణికాలకు సంబంధించిన హరికథలే. అవి ఇలా ఉన్నాయి. 1. సంగ్రహ రామాయణము, 2. కుశలవ విజయం, 3. గయోపాఖ్యానము, 4. జయప్రద లేక పురూరవ, 5. త్రైశంకు విజయం, 6. నలచరిత్ర, 7. సీతాకళ్యాణం, 8. రుక్మాంగద చరిత్రము, 9. ద్రౌపదీ మానసంరక్షణము, 10. దయాకర విజయం, 11. సూరదాసు చరిత్ర, 12. పురందరదాసు చరిత్ర, 13. కర్ణానందదాయిని (పద్యములు), 14. హరికథేతి హాసమంజరి `1, 15. హరికథేతి హాసమంజరి `2 (కీర్తనలు), 16. కుచేలోపాఖ్యానము, 17. శశిరేఖా పరిణయము, 18. భద్రాచల రామదాసు చరిత్రము (1919), 19.అంగద సందేశము, 20. పూర్వహరిశ్చంద్ర చరిత్ర తదితరాలున్నాయి.
బాలాజీదాసు మంచి సంగీతజ్ఞుడు కూడా. ఆయన తన రచనల్లో వివిధ తాళ, జతుల, రాగాలను వివరంగా పేర్కొని వాటిని వేదిక మీద ప్రదర్శించినప్పుడు అన్ని ప్రాంతాల వారు ఒకే విధంగా పాడుకునే విధంగా వాటిని రచించిండు. అన్ని విధాలైన పద్యాలే గాకుండా సావేరి, బేహాగ్‌, కమాచి, కేదారము, కైకవసి, నవరోజు, ఆనంద భైరవి, రaంరaాటి తదితర భిన్నమైన రాగాలలో మధురమైన కీర్తనలు రాసిండు. తోహరాలు, శ్లోకాలు, వచనాలు, పద్యాలు, కీర్తనలు ఇట్లా అనేక ప్రక్రియల్లో రచనలు చేసి తన ప్రతిభను ప్రదర్శించినాడు. తాను హరికథా ప్రదర్శన ఇస్తున్న సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అప్పటికప్పుడు పద్యాలు కైగట్టి ఆలపించి అలరించేవాడు. ప్రాంతానికి తగ్గట్టుగా అక్కడి వారి ఆహార్యం, అలవాట్లు అన్నింటినీ ఈ పద్యాల ద్వారా ప్రచారంలో పెట్టేవాడు. యక్షగానాల మాదిరిగా రాసిన హరికథల కన్నా ఈ పద్యాలకు ఎక్కువ మంది అభిమానులుండేవారు. వారి డిమాండ్‌ మేరకు ఈ పద్యాలను పుస్తకంగా కూడా ప్రచురించాడు. ఇందులో సువ్వి పాటలు, రైలు, పొగచుట్ట ఇట్లా అనేక సామాజిక అంశాలపై కీర్తనలు, పాటలు ఉన్నాయి.
ఈ పౌరాణిక హరికథలకు తెలుగుదేశమంతటా ఎక్కువగా గిరాకీ ఉండేది. ఆయన రచనలు ప్రచురణ కాకముందే ఎక్కువగా ప్రచారం జరిగేవి. వీటిని బెజవాడలోని కరుకూరి సుబ్బారావు అండ్‌ సన్‌, రాజమండ్రికి చెందిన కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్‌, అనకాపల్లిలో వెంకటరమణ విలాస ముద్రారంగ సంస్థ తదితరులు విరివిగా ప్రచురించేవారు. వీటిలో ఒక్కొక్క రచన 15, 20 సార్లు, కొన్ని కొన్ని సార్లు ఒకే సంవత్సరం రెండు మార్లు కూడా ముద్రితమయ్యాయి. ఈయన అప్పటి ఆంధ్రదేశమంతటా తిరిగి హరికథా ప్రదర్శనలిచ్చేవారు. అందుకే ఆయన రచనలకు ఎక్కువ ప్రాశస్తి ఉండిరది. ఈయన గురించి దొణప్ప గారు ఇట్లా రాసిండ్రు. ‘‘ఇతడు నారాయణదాసు ననుసరించి హరికథలు రచించినట్లు పలువురు పూర్వ విమర్శకుల కథనం. ఇతని హరికథలలో ప్రచుర వ్యాప్తిని పొందిన నలచరిత్ర 1881లో (అచ్చయ్యింది). నారాయణదాసు హరికథకుడుగా అవతరించడానికి రెండేళ్ల ముందు ముద్రితమయినట్లు ముఖపత్రాన్ని బట్టి తెలుస్తున్నది. అది ఒప్పో. అచ్చుతప్పో తెలియదు.
కాని 1949 నాటికి ఈ నలచరిత్ర పద్దెనిమిది ముద్రణలు పొందింది. బాలాజీదాసు కాల విషయం ఇంకా సుపరీక్షితం కావాలసి ఉంది.’’ అని నారాయణదాసు కన్నా రెండేళ్ల ముందే బాలాజీదాసు రచనలు చేసిండని రాసిండు. అంటే దొణప్ప గారు 1978లో ప్రచురితమైన ‘తెలుగు హరికథా సర్వస్వం’లో కాల నిర్ణయం చేయలేక పోయిండు. ఈ 47 ఏండ్ల కాలంలో ఏ విశ్వవిద్యాలయములోనూ బాలాజీ దాసు మీద పరిశోధన జరగలేదు. ఒక్క కవితా సంపుటి వెలువరించిన వారిపైన కూడా విస్తృతంగా పరిశోధనలు జరిగినాయి గానీ పాతికకు పైగా రచనలు చేసిన బాలాజీదాసు పై ఎలాంటి పరిశోధన జరగలేదు.
హరికథకుల్లో ఆనాడు బాలాజీదాసును మించిన కథకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన విశిష్టతను గురించి ప్రచురణ కర్తలు ఇట్లా ప్రచారం చేసిండ్రు. ‘‘ఆంధ్రదేశము నందంతటను సుప్రసిద్ధములగు హరికథలను రచించుట యందును, జన ప్రీతికరముగ హరికథలను చెప్పుటయందును సత్కీర్తిని గణించిన శ్రీ బాలాజీదాసుగారి హరికథల యుత్కృష్టత నెఱుంగని వారుండరు. చక్కని భావశుద్ధి, అపూర్వమైన గానము రసబంధురములగు పద్యములు, కడుపుబ్బ నవ్వించు సందర్భోచిత హాస్యకథలు గల్గిన వీరి హరికథలు సర్వత్ర విశేష ప్రచారముం గాంచి యున్నవి. ఇది యొక్కొక్కటి పది మొదలు యిరువది కూర్పులవరకును ముద్రింపబడినవని చెప్పినచో వీని ప్రచారము బోధపడగలదు. వీరి యెక్క సంపూర్ణమైన కాపీరైటు హక్కులను మేము గైకొని ముద్రించి అమ్మకమునకు సిద్ధముగ నుంచితిమి. కొలది ప్రతులు మాత్రమే కలవు. ఆలసించి ఆశాభంగమున కెడమీయకుందురని తెలియజేయుచున్నాము.’’ (కరుకూరి సుబ్బారావు సన్‌, కరుకూరి స్వరాజ్య వెంకట సత్యనారాయణరావు, ప్రొప్రయిటు సరస్వతీ బుక్‌ డిపో, విజయవాడ, 1949.)
‘‘బాలాజీదాసు సకల దోష నివారణార్థము కొరకు నలచరిత్రను హరికథగా వ్రాసినట్లు అవతారికలో చెప్పుకొన్నాడు. ఛాయాపుత్రనకు ఈ కృతి అర్పింపబడినది. భారతారణ్య పర్వ నలోపాఖ్యానము ఈ నలచరిత్రకు మూలము. హరికథానుగుణముగ వివిధ కల్పనలు సంగీత దరువులు ఇందు కల్పింపబడినవి. వర్ణన సుదీర్ఘముగా సీసమాలిక నందిట్లు వివరింపబడినది.
‘‘ధర్మ మార్గంబు వదలి నీచవృత్తుల నాచరించెడి విప్రులచట లేరు
గౌరవింబిడక సగౌరవప్రాప్తులౌ యవనీధ వాదము లచట లేరు
బేరసారము దీయు వేలణ బద్ధంబు లాడెడు కోమటులచట లేరు
మద్యపానమున ప్రమత్తులై దుర్వృత్తి నాచరించెడి శూద్రులచట లేరు
హరికథల్వినుచు టైమైనదాయన గడియారముల్చూచు వారచట లేరు
తప్పు సాశ్యములు చెప్పి పత్రంబులు రచియించు కరణంబు లచట లేరు
హస్తంబుపై వేసి యప్రమాణము చేసి వ్యవహరించెడి వేశ్యలచట లేరు
బేస్తుపై నిగుదేళ్ళుబెట్టి యెట్టులనిడి యాడెడు జూదగాండ్రచట లేరు
దుర్జనుల మానసములకు దోమరమ్ము
అఖిల సుఖదమ్ము సిరులకు నాలయమ్ము
ధీజనుల సొమ్ము విద్యా విరాజితమ్ము
చూరుల కిమ్ముఘన నిషధాపురమ్ము’’
‘‘తిండి మగనికి ముందుగ దినెడివారు
అత్తమామల నెత్తిపై మొత్తువారు
ముంగురుల గత్తిరించుక మురియువారు
లేరు విషధాపురంబున ధారుణీశ’’
నలుని సత్యసంధతను నిరూపించు ఈ నిషధాపుర వర్ణన ఇంత విస్తృతముగా మూలమున గానరాదు.
సుదేవుడను విప్రుడు దమయంతికి స్వయం పరాగతులను గూర్చి ఇట్లు తెలిపినాడు.
‘‘బంగాళ ధూపాలుండగ నాగను మీత
డంగదేశ నృపాలు పుంగవుండు
మత్స్యరాజాతండు మాళవ భూపాలు
డీతండు కాశ్మీరనేత జుమ్ము
టెంకణ ఘూర్జర కొంకటన కర్ణాట
బాహ్లిక ప్రభువు లీవరుసవారు
చోళ సౌరాష్ట్ర నేపాళ బర్బరమద్ర
మగధ కోసల పతుల్మగువ వీరు
లాటకురుధరాకాంతులిచ్చోటి వారు
కుకుర భోగవతీ నివాసకులు వీరు
గాన మీమదికెంపైన వాని నరసి
పూలమాలిక నడవమ్మ ముద్దుగుమ్మ’’ ఇది బాలాజీ దాసు కవితా పాటవమును తెల్పుచున్నది. అట్లాగే నలుని పాక విశేషములను గురించి కవి యిట్లు చిత్రించిండు.
‘‘అతని పాకపౌష్టవ మయరె నుతింపగ నేరిశక్యమౌ
సూత జలంబు లూరు గతిమ్యానము లేకయె రిక్తకీ..ండమం
దాతఱి నీరు పుట్టెదృణమాపోయి నుంచ గృశానుడిరధన
వ్రాతము లేక నుండు నగరంబున బక్యపదార్థ వాసన
ల్ఖ్యతములై పెనంగె నవలగ్న వినిందత ముత్తవేసరీ’’.సస
బాలాజీదాసు రాసిన సువ్వి పాట
సువ్విరార సుందరాంగ సువ్విధీర సుగుణసాంద్ర
సువ్వి సీతారామచంద్ర సువ్విలాలీ॥సువ్వి॥
సంసారమనునట్టి సాగరంబులోన బెట్టి
హింసబెట్ట తగదు నీకు కంసమర్దనా॥సువ్వి॥
ఆసించి యున్నాను వాసుదేవా! బాలాజీ
దాసపోష దోషనాశ దశవేషా॥సువ్వి॥
దంపుళ్ల పాట:
హుం హుం హుం హుం హుం హుం
వల్లభుడిలుసొచ్చి వేడి నీళుÊళ బెట్టు లచ్చీ యన
నీళ్లకేమీ ముందు నా కాళ్లు బట్టు మందు॥హుం॥
అత్తనన్ను దిట్టినట్టు లైన బీటవట్టి
నెత్తిమీద గొడుదు వట్టి నిందలు పైబెడుదు॥హుం॥
అతిథి వచ్చి భిక్షమిమ్మని యడిగనఁ దత్క్షణ
మాతని వెడదరుముదు రక్షిత బాలాజీ స్థిరము॥హుం॥
రెయిలు పాట
హిం.తోడి ` మిశ్రగతి
బండిరా రెయిలు బండిరా సామి
బండిరాఁషడ్చక్రములతో నుండురా యిరుతట్ల దివ్వెలు
రెండురా నడనెత్తి వెలుగొక టుండు నాపోజ్యోతిరీతిగ
ఒక్క అఱలో చల్లనీళ్ళుండు సరసి చూడగ మఱి
నొక్క అఱలో వేడి నీళ్లుండు తన్మధ్య ననలుడు
దుక్కగమితో బొగ్గుతో మండు నడనెత్తి పైపొగ
మిక్కుటంబుగ బైకెగయుచుండు
పక్కపక్కలకు బోకుండ నక్కడక్కడ నీరుద్రావుచు
నొక్కపూటకు నూరుకోసులు పక్కివలె పరుగిడుచునుండు
రొక్కమిడి టిక్కట్లు గొనకుండ నెవ్వారినైన
నెక్కనీయరు వారుగనకుండ యెక్కిననే వారిని
చెక్చుజేసి పైకమును నిండ దీసికొని వారు
బుక్కులో జూపింత్రు విడకుండ నెవరైన నీయక
చిక్కు బెట్టిన నట్టివారి నెక్కడికి బోనీయకుండ
నక్కడే పోలీసు వారికి నప్పగింతురు తక్షణంబు
1881 నుంచి 1940 మధ్యన అంటే 60 ఏండ్ల పాటు వివిధ హరికథలు రాసిన బాలాజీ దాసు గురించి కొంత పరిశోధన తూమాటి దొణప్పగారు చేసిండ్రు. ఆయన తర్వాత ఎవ్వరూ కూడా ఇందుకు సాహసించలేదు. నేను ఎప్పటి నుంచో ఆంధ్ర వాఙ్మయ సూచిక (కాశీనాథుని నాగేశ్వరరావు)లో బాలాజీ దాసు పేరుని చూసి ఎవరీయన? అని వెతికితే తెలుగు సాహిత్య కోశంలో కొంత సమాచారం దొరికింది.
అయితే ఈయన గురించి ఏ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన జరగక పోవడానికి బహుశా ఆయన బహుజన కులమే కారణం  కావొచ్చును. ఇప్పటికైనా ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యాపకులు పూనుకొని ఆయనపై ఒక సదస్సుని నిర్వహించడమే గాకుండా పరిశోధన చేయించినట్లయితే తొలితరం హరికథలు, మాన్యుడైన హరికథకుడి గురించి అందరికీ తెలియ వస్తుంది. వాటి కన్నా ముందు హరికథలన్నింటినీ సేకరించి పునర్ముద్రణ చేసినట్లయితే బాగుంటుంది. ఈ పనిని ఉత్తరాంధ్ర మిత్రులు చేయాలని కోరుకుంటూ..
*

సంగిశెట్టి శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు