నలుగురు కలిసే వేళా విశేషం

కొన్ని సభలు మనసులో నిలిచిపోతాయి, మరికొన్ని మాత్రం జ్ఞాపకాల నుంచి జారిపోతాయి. ఎందుకు అంటే—-?!

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, నేరుగా మనుషులతో కలుసుకోవడం, మాట్లాడుకోవడం అనే అనుభవాన్ని ఏదీ భర్తీ చేయలేదని నేను నమ్ముతాను. అందుకే “మీకు సాహిత్య సభలు నచ్చుతాయా?” అని అడిగితే, నా సమాధానం సందేహం లేకుండా “అవును” అనే ఉంటుంది. ఊహించండి—రోజువారీ పనుల నుండి కొంత దూరంగా, మీలాంటి అభిరుచి ఉన్నవారితో సమయం గడపగల అవకాశం వస్తే, దానిని ఎవరు వదులుకుంటారు? పాత మిత్రులను కలవడం, కొత్త పరిచయాలు, చురకలు, మధ్య మధ్యలో కొంత గాసిప్—ఇవన్నీ ఆ సందర్భానికి ప్రత్యేకమైన హుషారు నింపుతాయి.

ఇలాంటి సభల్లో నేను ప్రేక్షకుడిగా, వక్తగా, నిర్వాహకుడిగా అనేక పాత్రలు పోషించాను. సభకు హాజరయ్యే ప్రతీసారి నాకు కొన్ని అంచనాలు ఉంటాయి—కొత్త అంశం వినడం, నిండుగా అనిపించే ప్రసంగం, వేడిగా సాగే సజీవ చర్చలు, లోతైన ఆలోచనలు పంచే రచయిత మాటలు, సమన్వయకర్తల చెమక్కులు. ప్రతి విషయం నచ్చాల్సిన అవసరం లేదని తెలుసు, కానీ మనం ఏదైనా నింపుకుని వెళుతున్నామా అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉంటుంది.

కొన్ని సభలు మనసులో నిలిచిపోతాయి, మరికొన్ని మాత్రం జ్ఞాపకాల నుంచి జారిపోతాయి. ఎందుకు అంటే—గందరగోళంగా నిండిన ప్రోగ్రామ్ ప్లాన్, ప్రేక్షకులను పక్కన పెట్టే అంశాలు, విరామం లేకుండా బిగుసుకున్న షెడ్యూల్, పాత విషయాల పునరావృతం, జీడిపాకంలా సాగిపోతున్న ఉపన్యాసాలు, ఎడతెగని సన్మానాలు, పుస్తకావిష్కరణల వరస—ఇవన్నీ ఆసక్తిని తగ్గిస్తాయి. కానీ గుర్తుండిపోయే సభల్లో మాత్రం స్పష్టమైన అజెండా, కొత్త విషయాలపై సిద్ధమైన వక్తలు, చక్కగా చెప్పిన ప్రసంగాలు, ఆలోచింపజేసే చర్చలు తప్పక కనిపిస్తాయి.

సభను విమర్శించడం సులభం, కానీ నిర్వహించడం అంత తేలిక కాదు. ప్రతి నిర్వాహకుడికి ఒక దృక్పథం ఉంటుంది; అది అందరి అంచనాలకు సరిపోకపోవచ్చు. అయినప్పటికీ వారు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, సాహిత్యంపై దృష్టి పెట్టి, అందరినీ ఒక వేదికపైకి తేవడానికి శ్రమిస్తారు. పరిమితులు, లోపాలు తప్పవు; వాటిని కేవలం భూతద్దంలో చూడటం కన్నా, మెరుగుదలకు అవకాశాలుగా పరిగణించడం మంచిది. నిర్వాహకులు సంప్రదాయాన్ని కాపాడుతూ, సమకాలీనతను కలిపి, అందరికీ ఆకర్షణీయంగా ఉండే విధంగా సభలను రూపకల్పన చేయాలి.

ప్రస్తుత కాలంలో సాహిత్య సదస్సులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి—యువతలో పాల్గొనడంపై ఆసక్తి తగ్గడం, నిధుల కొరత, డిజిటల్ వేదికల పోటీ, కొత్తదనం లోపం. వీటిని అధిగమించేందుకు ప్యానెల్ డిబేట్‌లు, వర్క్‌షాప్‌లు, ఓపెన్ మైక్ వంటి ఇంటరాక్టివ్‌ ఫార్మాట్లు; ఉపన్యాసాలకు సమయ పరిమితి; డిజిటల్ సాహిత్యం, ఆడియోబుక్స్, సైన్స్ ఫిక్షన్, సోషల్ మీడియా సాహిత్య ప్రభావం వంటి సమకాలీన అంశాల చేర్పు అవసరం.

తెలుగు సాహిత్య సదస్సుల భవిష్యత్తులోనూ కొనసాగాలి. యువతను ఆకర్షించే విధంగా రూపకల్పన చేసి, సారాంశభరితమైన కార్యక్రమాలను అందిస్తే, ఈ వేదికలు మరింత ప్రాధాన్యం సంతరించుకుని భాషకు, సాహిత్యానికి ప్రేరణగా నిలుస్తాయని నా నమ్మకం.

*

చిత్రం: సృజన్ రాజ్ 

మధు పెమ్మరాజు

మధు పెమ్మరాజు నివాసం హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి రచనలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు