అప్పుడు…
నా మొదటి కథ గురించి చెప్పాలంటే ముందుగా అప్పటి రాజకీయ నేపథ్యం, ఉద్యమాల ప్రభావం, ఊరు, మార్పులు ఇవన్నీ చెప్పాలి. అప్పుడు పాత సిరిసిల్ల ప్రాంతం మానేరు బెల్టుగా పిలవబడి కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడింది. జనశక్తి పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండి గ్రామాల్లో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా సమాంతర రాజకీయాలు నడిచాయి. ఒక్క వాల్ పోస్టర్ గ్రామాలను శాసించేది. దొరలు భూస్వాములు గ్రామాలనుంచి తరిమివేయబడ్డారు. వరుస కరువులతో రైతులు, ఉపాది లేక కూళీలు, పోలీసుల భయంతో యువకులు ఎక్కువగా అరబ్ దేశాలకు వలస వెళ్లేవారు. ఒక్కొక్క గ్రామంలోనైతే యువకులు కూడా ఉండేవారు కాదు.
నేను…
అనారోగ్య కారణాల వల్ల నేను హైస్కూలు చదవలేదు. ప్రైవేట్ లో ఫీజు కట్టి పది పాస్ అయ్యాను. వచ్చిన మార్కులకు ఎక్కడ సీటు దొరకలేదు. కొత్తగా వచ్చిన గంభీరావుపేట జూనియర్ కాలేజీలో చేరాను. అప్పుడే నాకు పి డి ఎస్ యు తో పరిచయం ఏర్పడ్డది. మా ఊర్లో కూడా జనశక్తి ప్రభావము ఉత్తేజము బలంగా ఉండేది. అట్లా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. రచయితగా అప్పుడే నాలో బీజం పడింది. విజృంభణ, సృజన పత్రికలకి చిన్న చిన్న కవితలు రాసేవాన్ని కానీ అవి ఎక్కడ అచ్చుకాలేదు. ఉద్యమ రాజకీయాలు, నిర్బంధాలు పెరగడం వల్ల 1992 నుంచి 1996 వరకు ఊరికి దూరంగా ఉన్నాను. 96లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చి మనకు ఒక ఐడెంటిటీ వచ్చి సొంత ఊరికి వచ్చాను. ఊరు పక్కన ఉన్న కోరుట్ల పేట గ్రామంలో టీచర్ గా పోస్టింగ్.
సంది కాలం…
నేను వెళ్లేటప్పుడు ఉన్న ఊరు, ఆ పచ్చదనం, ఆ చక్కదనం తిరిగి వచ్చేటప్పటికి లేదు. ఎన్నో మార్పులు జరిగాయి. చెరువులు ఎండిపోయాయి. ఊరు ఊరంతా వలస పోయింది. ఎక్కడో ఎడారిలో ఉన్న కొడుకుల కోసం దీనంగా తల్లులు, భర్త ఎడారిలో ఉంటే ఎప్పుడే వార్త వినాల్సి వస్తుందో అని భరువుగా భార్యలు కళ్ళ నీళ్ళు తీస్తున్నారు. మొరం దేలిన వాకిళ్ళు, నెర్రెలు బారిన వరి చేన్లు స్వాగతం పలుకుతుంటే పులుకు పులుకున చూస్తూ ఆ సంధి కాలంలో నేను ఊర్లోకి అడుగుపెట్టాను.
అక్కడ ఉత్తరాలు చదివేది రాసేది నేనే. మొదటగా నన్ను కలిసి వేసిన అంశం వలస. అదిగో అప్పుడే మొదటి కథ రాసాను. నా మొదటి కథ ‘కన్నతల్లి’ వలస మీద రాసింది. కానీ అచ్చైన మొదటి‘ కథ ఆశ నిరాశ ఆశ ’. ఇది ఇంతవరకు ఏ కథ సంకలనంలో చోటు చేసుకోలేదు. కన్నతల్లి కథ ‘వలస బతుకులు’ కథా సంకలనంలో వచ్చింది. ఇది వాస్తవంగా జరిగిన కథ. మా ఇంటి పక్కనే నర్సింలు ఉండేవాడు. వాడు నా ఈడు వాడే. బతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ కూడా మోసపోయి ఆజాద్ వీజాతో దాక్కుని దాక్కుని తిరిగాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలై పుట్టెడు అప్పులతో ఇల్లు చేరాడు. వాడు పడ్డ కష్టాన్ని వాళ్ళ అమ్మ చెపుతుంటే నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. బతుకుదెరువు లేదని అప్పులు చేసి గల్ఫ్ వెళ్లాలని ప్రయత్నం చేస్తే మధ్యలో ఉన్న ఏజెంట్లు మోసం చేసి మరింత అప్పుల పాలు చేస్తే ఇంటికి రాలేక వాడు బొంబాయిలో రెండు గజాల జోపుడాలో తలదాచుకున్న తీరు చెప్తుంటే ఏడుపొచ్చింది. అలాంటి వాళ్ళు ఊరిలో చాలా మంది ఉన్నారు. కలిసివేసిన ఆ సంఘటననే నేను మొదటి కథగా రాసాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అవి వరుసగా వలస బతుకులు కథల్లో రాసాను.
కథలో సారం
ఊర్లో ఉండే పరిస్థితులు అప్పులు కరువు ఈ నేపథ్యంలో బెంగటిల్లిన కొడుకు ఉన్న భూమిని అమ్ముకొని గల్ఫ్ వెళ్లి మోసపోయి ఊరికి ఏ ముఖంతో తిరిగి రావాలి అని బాధపడుతుంటే ఉన్న పొలాన్ని అమ్మినప్పుడు వలవల ఏడ్చిన తల్లి నిస్సహాయంగా తిరిగి వచ్చిన కొడుకుకు ధైర్యాన్ని నింపడం నన్ను కదిలించింది. కథలతో గొప్ప గొప్ప సందేశం ఇవ్వాలనే ఆవేశం పట్టుదల ఉండే వయసు అది. ఆ ఆవేశం ఈ కథలో కనిపిస్తుంది. భర్తను పోగొట్టుకుని, బతుకే ఒక ఉద్యమంగా బండిని నడుపుకొస్తున్న తల్లి బండెడు బాధను ఎలా తట్టుకుందనేది అంతర్లీనంగా కథలో ప్రవహిస్తుంది. అప్పుడు కథలు ఎక్కువ మందే చదివేవారు. ఉత్తరాలు కూడా రాసేవారు. అలా ఈ కథమీద వచ్చిన ఉత్తరాలు రచయితగా నాకు ఊపిరి పోసాయి.1999 లో రాసిన ఈ కథ ప్రజా శక్తిలో అచ్చయింది. ఇప్ఫుడు చదివినా అయ్యో మొన్నటి ఫలానా ఎల్లవ్వ కథనే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ సంఘటనలు ఊరిలో జరుగుతూనే ఉన్నాయి. ఊరు ఇప్పటికీ దుఃఖ సముద్రమే.
*
Add comment