ట్రోల్ అనే వేట ఎంతకాలం?!

సాంఘీక మాధ్యమాలు మన జీవితంలో అతి ముఖ్య భాగం అయినప్పటికి అవి ఇచ్చే చైతన్యం   కన్నా  సృష్టించే పరిమితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇంటర్నెట్ ప్రపంచాన్ని చిన్న గ్రామంగా మార్చిందని మనం అనుకున్నామేమో కానీ, వాస్తవానికి అది మనల్ని క్రమంగా విడదీసింది. నేటి సామాజిక మాధ్యమాలు విశాల ప్రపంచాన్ని చూపిస్తున్నాయి అన్న భ్రమలో నూతిలో కప్ప, గూడులో గొంగళి వ్యవహరాన్ని సృష్టిస్తున్నాయి.

మనిషికి, మనిషి చేష్టలకి అర్థాలు మారిపోతున్నాయి. ఎలా అంటే, నెగటివ్ ఇంకా సెన్సేషనల్ కంటెంట్ కి మాత్రమే ఆధరణ లభిస్తోంది. సాంఘీక మాధ్యమాలు ఇచ్చిన స్వేచ్చ, ఆర్ధిక వనరులు కూడా నెగటివ్ లేదా సెన్సేషనల్ కంటెంట్ ని వృద్ధి చేస్తోంది. ఒక చక్కని నాట్యం ఎవరి దృష్టిని ఆకర్షించదు. అదే వచ్చినా, రాకపోయినా ఏదో ఒకటి చేసి ప్రేక్షకుల  మొహాన పడే స్తే  తిట్టుకుంటూ దాని చుట్టూతా ఈగల్లా చేరుతున్నారు. అక్కడ ఎవరికి వారు తాము ఉత్తములు అని చూపించుకోవాలన్న మానవ తపన చాలా కనిపిస్తుంది.

ఇది అంతా  కూడా మానవ మనస్తత్వశాస్త్రం, సోషల్ మీడియా అల్గారిథమ్‌లకు ఆపాదించబడుతుంది. దీన్నే ‘నెగటివ్ బయాస్’  అంటారు.’  ఇలాంటి కంటెంట్   పెట్టే వాళ్ళు, చూడమని ఎవరు చెప్పారు, ఇష్టం లేకపోతే బ్లాక్ చేయండి అని దబాయిస్తారు. చూసి బాగోలేదు అని అనుకోవటానికే కాకుండా, వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు బయట పెట్టుకోడానికి, ఇంకా చురుకుగా ఎంగేజ్ అవటానికి ఆస్కారం దక్కుతుంది.

ఇలా మనుషులు నెగటివ్ లేదా సెన్సేషనల్ సమాచారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ఇష్టపడతారు. సోషల్ మీడియా అల్గారిథమ్‌లు కూడా భావోద్వేగాలను ప్రభావితం చేసే కంటెంట్‌ను పెంచుతాయి.  ఇలా మంచి కంటెంట్ మరుగున పడిపోతుంది. నేటి డిజిటల్ పౌరులుగా, మనం ఎక్కువగా మన అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న సమాచారాన్ని మాత్రమే చూస్తున్నాము.

ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు అల్గారిథమ్‌ల ద్వారా మనకు నచ్చినవాటిని మాత్రమే చూపిస్తున్నాయి. మనం ప్రతిస్పందించే, లైక్ చేసే, షేర్ చేసే విషయాలకు ప్రాధాన్యత ఇస్తాయి. దీని మూలంగా  మనం ప్రత్యామ్నాయ దృక్కోణాలను అరుదుగా చూస్తున్నాము. మనకు భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న సంస్కృతులు, వేరే రాజకీయ భావాలు ఉన్న వారితో సంభాషణలు తగ్గిపోయాయి. ఇలా సామాజిక విభజనలు పెరుగుతున్నాయి.

అందరూ తమదైన చిన్న ప్రపంచాల్లో నివసిస్తూ, ఇతరుల భావాలు, సమస్యలు అర్థం చేసుకోవడం తగ్గిపోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ విధమైన పరిమిత సమాచారం విపరీత ధోరణులకి దారి తీస్తున్నది.

ఉదాహరణకు, 2006 నుండి 2007 వరకు ట్విటర్‌లో షేర్ చేయబడిన వార్తా కథనాలపై జరిగిన ఒక అధ్యయనం, తప్పుడు సమాచారం సత్యం కంటే “దూరంగా, వేగంగా మరియు లోతుగా” వ్యాపిస్తుందని తెలిపింది. ముఖ్యంగా రాజకీయ వార్తల విషయంలో ఈ ప్రభావం మరింత ప్రముఖంగా కనిపిస్తుంది. ఇంటర్నెట్ ఉద్దేశ్యం ఒక సార్వజనిక మండలిగా పనిచేయడమే. మనందరికీ సమాన అవకాశాలను అందించి, భిన్నమైన అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఉండాలి. కాని ఇప్పుడు, ఉమ్మడి సంభాషణలు మరియు అనుభవాలు లేకపోవడం వల్ల, సమాజం సామూహికంగా సామాజిక సమస్యలను పరిష్కరించలేకపోతోంది. అవగాహన పెంపొందించే మరియు రాజీలకు మార్గం సుగమం చేసే సంభాషణలకు బదులుగా, మనం విభజనాత్మక సమాచార భ్రమలో చిక్కుకుని వున్నాం.

ఇక మెయిన్ స్ట్రీం మీడియా విషయానికి వస్తే , సామాజిక మాధ్యమాలతో పోటీ  పడలేకున్నది. ఇంతకు ముందులాగా ప్రజా చర్చను రూపొందించే స్థానాన్ని కోల్పోయింది, వార్తల నాణ్యత మరింత క్షీణించింది. ప్రకటనలు క్రమంగా ఆన్‌లైన్‌కు మారడంతో వాటి నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. దర్యాప్తు రిపోర్టింగ్, స్థానిక వార్తలు మరియు ఇతర నాణ్యమైన జర్నలిజం కోసం చెల్లించడానికి అవసరమైన ఆదాయ వనరులు తగ్గిపోయినాయి. మొత్తంగా నాణ్యమైన సమాచారం మనిషికి అందటం ఆగిపోయింది.

ప్రముఖ ఆన్‌లైన్ వేదికలు ఎన్నికల్లో పోషించే పాత్రకు సంబంధించిన అదనపు ఆందోళనలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో జరిగే సంభాషణలను నియంత్రించడం లేదా నియంత్రించడంలో విఫలమవ్వడం ద్వారా ప్రజాభిప్రాయం మరియు ఓటర్ల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఆన్‌లైన్ వేదికల కంటెంట్-నియంత్రణ నిర్ణయాలు ఏ రకమైన సందేశాలకు ఓటర్లు గురవుతారో ప్రభావితం చేస్తాయి. ఈ వేదికలు రాజకీయ పక్షపాతాన్ని కలిగి ఉంటే, వారి అల్గారిథమ్‌ల ద్వారా ఏ రకమైన సందేశాలు ఓటర్లను చేరుకుంటాయో లేదా చేరుకోవో నిర్ణయిస్తూ ఎన్నికల ఎన్నికల గతిని దిశని మార్చగలవు.

ట్విటర్,  ఫేస్‌బుక్ రెండూ కూడా కన్జర్వేటివ్ అభిప్రాయాలను ప్రతిబింబించే ప్రసంగాలను తగ్గించి, లిబరల్ సందేశాలను ఉన్నతం చేస్తున్నాయని ఆరోపించబడ్డాయి, ఇటీవలి పరిశోధన అటువంటి లిబరల్ పక్షపాతానికి ఎటువంటి ఆధారాలు లేవని కనుగొన్నప్పటికీ జరుగుతున్నది అదే.

సాంఘీక మాధ్యమాలు మన జీవితంలో అతి ముఖ్య భాగం అయినప్పటికి అవి ఇచ్చే చైతన్యం   కన్నా  సృష్టించే పరిమితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి  విభిన్న దృక్కోణాలను వెతకడానికి, మన సొంత అభిప్రాయాలను సవాలు చేయడానికి, ఆలోచన ప్రేరేపించే సంభాషణలలో పాల్గొనడానికి మనం ప్రయత్నించాలి.

మన డిజిటల్ ప్రపంచం ఒక నిజమైన సార్వజనిక రంగంగా మారాలంటే, మనం మన సమాచార వినియోగాన్ని సచేతనంగా ఉంచుకోవాలి, భిన్నమైన దృక్కోణాలను ట్రోల్ చేసి వేటాడకుండా గౌరవించాలి. అప్పుడే మనం సామాజిక సమస్యలను సామూహికంగా పరిష్కరించగలం. మన డిజిటల్ భవిష్యత్తును మెరుగుపరచగలం.

*

విజయ నాదెళ్ళ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు