చేను మేసిపోతే…

“మెరుపు కథ” శీర్షికకి మరీ మరీ చిన్న కథలకు స్వాగతం editor@saarangabooks.com

 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వెలువడ్డాయి.

రంగంపేట ఎమ్మెల్యేగా రంగస్వామి ఎంపికయ్యాడు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అపోజిషన్ అభ్యర్థి  పైన అరవై ఆరు  ఓట్లతో గెలుపు దక్కించుకున్నాడు. హెవన్ రిసార్ట్స్ లో ‘విక్టరీ విందు’ ఏర్పాటు చేశాడు.

పార్టీ జాతీయ, రాష్ట్రీయ నాయకులతో పాటు పార్టీ పోషకులు, మహాపోషకులు, రాజపోషకులను కూడా విందుకు పిలిచాడు. నియోజక వర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ వైట్అండ్ వైట్ డ్రెస్సులు వేయడం వల్ల చూడటానికి చూపరులకు ‘పాల సముద్రంలా’ తోచింది.

పనిలో పనిగా  డిల్లీ నాయకుల సమక్షంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. బూత్ ల వారీగా, పార్టీకి పడ్డ ఓట్ల సరళిని పరిశీలించారు. డబ్బు తీసుకున్న ఓటర్ల  బూత్ లలో తమ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో ఆరా తీశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఓట్ల  సరళిని ‘రీ విజిట్’ చేయాలనుకున్నారు. అలాగే పార్టీ బలహీనంగా ఉన్న చోట ‘రివిజన్ సర్జరీ’ లాంటిది చేయాలని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గంలోని పార్టీకి చెందిన అన్ని మండలాల నాయకులను ఒక్కొక్కరిగా పిలిచి స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి వారు చేసిన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తక్కువ పోలింగ్ జరిగిన పల్లెల్లో ఎందుకలా జరిగింది, దానికి కారణాలేమిటని విశ్లేషించారు.

ముండ్లపూడి నాయకుడు మొలగమూడి మునిరామయ్యను కూడా క్లోజప్ లో, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశారు. ఆల్కహాలిక్ కాని, వర్క్ హాలిక్ అయిన ముక్కుసూటి మునిరామయ్య, నాయకులు అడిగిన ప్రశ్నలకు టకీటకీమని సమాధానాలిచ్చాడు.

ముండ్లపూడి మండలంలోనే తమకు ఓట్లు తక్కువ వచ్చాయని… అపోజిషనోళ్లకి ఎక్కువ ఓట్లు వచ్చాయని… మండల ఓటర్లు తనని మోసం చేశారని… ఎమ్మెల్యే రంగస్వామి కారాలు మిరియాలు నూరాడు.

‘గోడకి కొట్టిన సున్నం, శ్మశానానికి పోయిన శవం తిరిగిరాదు’ అని తెలిసి కూడా ఓటర్లకు పోలింగ్ రోజు ఉదయం నాలుగు గంటలకే అయిదు వందలు పంచినాము కదప్పా… ఇట్లా చేస్తిరి ఏమప్పా…’ అని ఎగిరి దూకాడు.

‘హెవన్ రిసార్ట్స్ లో స్వర్గం చూడాలని వస్తే నరకం చూపిస్తా ఉండారేమి దేవుడా…’ అనుకున్నాడు మునిరామయ్య. అయినా ‘నాయకులకి నిజం చెబితే నక్సలైటు, లేదంటే ఆల్ రైటు’ అంటారని నేలమీది రాజస్థాన్ మార్బల్ రాళ్ళ వైపే చూడసాగాడు.

డిల్లీ నాయకులు వచ్చింది పొలిటికల్ పోస్ట్ మార్టంకి కదా, అందుకని మునిరామయ్యని గుచ్చిగుచ్చి అడిగారు. గుట్టు విప్పమన్నారు. ‘నాయకులకు నిజాలు నిదానంగా అయినా తెలిసిపోతాయి కదా’ అనుకొని నోరు విప్పాడు.

“సార్! మనం ఓటుకి అయిదు వందల లెక్కన ఓటర్లందరికీ ఉదయం నాలుగు గంటలకే పంచినాము. అయితే అపోజిషన్ వాళ్ళు విషయం తెలుసుకుని, ఆరు గంటలకు వచ్చి… ఒక్కొక్కరికి ఆరు వందలు ఇచ్చి వెళ్ళారు సార్. అందుకని జనాలు వారి వైపు వె(మ)ళ్ళారు” అని చేయి నోటికి అడ్డం పెట్టుకుని చిన్నచిన్నగా చెప్పాడు.

అగ్గి తొక్కినోడి లెక్కన ఎగిరి దూకాడు ఎమ్మెల్యే రంగస్వామి. “నీతి నియమాలు లేవప్పా, మీ వాళ్ళకి. పైసలు మొదట ఇచ్చినోడికే కదా, వాళ్ళు విశ్వాసం చూపించాల్సింది. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపుకి దుమికేస్తారా ఏమి? మంచీ చెడ్డా లేదా? వాళ్ళు చేసింది అనైతికం కాదా?” అని కసురుకున్నాడు.

“సార్.! మనం పైసలివ్వడమే అనైతికం. మనం అనైతిక పనులు చేసి ఎదుటి వారిలో నైతికత ఆశిస్తే ఎలా సార్? మీరు ఏమీ అనుకోకపోతే ఒక విషయం చెబుతాను. జనాలు తమ అవసరాలకు దేవుళ్ళనే మార్చేస్తున్నారు సార్. తమ కోరికలను దేవుడి ముందర ఉంచి అవి తీర్చకపోతే మరో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. అలా దేవుళ్ళనే మారుస్తున్న వారికి పార్టీ మార్చేది ఒక లెక్కా?” అని అడిగాడు మునిరామయ్య.

పార్టీ పరిశీలకులు కొందరు నోళ్ళు తెరిచారు. మరి కొందరు ముక్కు మీద వేలేసుకున్నారు. గుమస్తాకి ఏ.సి.ని పెంచమని చెప్పారు.

ముళ్ళ కంప తొక్కినోడి లెక్కన మళ్ళీ కస్సున లేచినాడు ఎమ్మెల్యే రంగస్వామి. పార్టీ పెద్దలు గట్టిగా వారిస్తున్నా వినక “మరి నేను కనబడితే వాళ్ళందరూ నవ్వుతారు, పలకరిస్తారు. పడీపడీ దండాలు… పొర్లే దండాలు  పెడ్తారు కదప్పా. అంతా డ్రామాలేనా…?” అని ప్రశ్నించాడు.

“ఎప్పుడు ఎవరితో పని ఉంటుందోనని వారి భయం సార్. వాళ్ళు మీకు దండాలే కాదు, మిమ్మల్ని ‘దేవుడమ్మ దేవుడు’ అని కూడా ఊరేగిస్తారు. మీకు జేజేలు చెబుతారు.

అన్నీ తెలిసిన మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. కళ్ళకు కనిపించిన దేవుళ్ళ ఫోటోలన్నిటికీ వాళ్ళు దండాలు పెడ్తారు, దండలేస్తారు. అందుబాటులో ఉన్న  గుళ్ళకన్నిటికీ వెళ్తారు. పడీపడీ  పూజలు చేస్తారు. గ్రామ దేవతలను సైతం ఆశ్రయిస్తారు. ‘ఏదో ఒక దేవుడు మనల్ని రక్షించక పోతాడా…’ అని వారి ఆశ. ‘ఏ దేవుణ్ణి పక్కన పెడితే ఏం జరుగుతుందోనని…’ వాళ్ళ భయం. అలాగే రాజకీయ నాయకులందరితో మంచిగా ఉంటారు. అయితే చివరిగా వాళ్ళ ఆలోచనల్నే వారు అమలు చేస్తారు” అని చెప్పాడు మునిరామయ్య.

కోపం కట్టలు తెంచుకుంది ఎమ్మెల్యేకి. పళ్ళు పటపటా కొరుకుతూ పైకి లేచాడు.

పరిస్థితి చేయిదాటిపోతోందని గమనించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేతో “జరిగిందేదో జరిగిపోయింది. అంత సీరియస్ కాకూడదు రంగస్వామి! అరటి ఆకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద అరటి ఆకు పడ్డా అరటి ఆకుకే నష్టం. ఓటర్లందరికీ మనతో పనిలేకపోయినా రాజకీయాల్లో ఉన్న మనకి ఓటర్లందరితోనూ పని ఉంటుంది. బి.పి., తెచ్చుకోవద్దు…” అని సర్ది చెప్పి కూర్చోబెట్టారు.

ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదని గుర్తించాడు మునిరామయ్య.

డైనింగ్ హాల్లోకి వెళ్లి, తిన్నామంటే తిన్నామన్నట్లుగా నాలుగు మెతుకులు నోట్లో వేసుకున్నాడు.

జీపులో అనుయాయులతో కలిసి తమ మండలానికి బయలు దేరాడు. దారిలో ‘కుయ్ కుయ్’ అని మొబైల్ కి మెసేజి వచ్చింది.

“ముండ్లపూడి మండల పార్టీ కొత్త నాయకునిగా మురళి మొదలియార్ నియామకం…” అని పార్టీ అధిష్టాన వర్గం నుంచి  మెసేజి వచ్చింది.

మెసేజి చూసిన మునిరామయ్య అనుయాయులు ‘అడవి పంది చేను మేసి పోతే, ఊర పంది చెవులు కోసిన సామెత మాదిరి ఉండాది కదప్పా వ్యవహారం’ అనుకున్నారు.

*

ఆర్. సి. కృష్ణ స్వామి రాజు

పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కేంద్రమైన రాసపల్లి. పొట్ట కూటి కోసం తిరుపతిలో నివాసం. ముప్ఫై ఏళ్ల ముందు మూడేళ్ళ పాటు ఈనాడులో విలేఖరి ఉద్యోగం. గత ముప్ఫై ఏళ్లుగా ఎల్ ఐ సి లో డెవలప్ మెంట్ ఆఫీసర్ కొలువు. మూడు వందల పై చిలుకు చిన్నా పెద్దా కథలు ప్రముఖ పత్రికలలో తొంగి చూశాయి.
ఇప్పటి దాకా వెలుగులోకి వచ్చిన పుస్తకాలు ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల కథా సంపుటిలు. చిత్తూరు జిల్లా మాండలికంలో రాసిన ముగ్గురాళ్ళ మిట్టకు మక్కెన రామసుబ్బయ్య పురస్కారం, సల్లో సల్లకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి.ఇవి కాక ప్రస్తుతానికి రాజు గారి కథలు[ముప్పై బాలల బొమ్మల కథలు], పకోడి పొట్లం[అరవై కార్డు కథలు] పుస్తకాలుగా వచ్చి ఉన్నాయి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు