ఇదొక జన గానం. భారతదేశ విముక్తి మార్గం కోసం స్వేచ్ఛగా చేసిన స్వర చాలనం . యుద్ధజాలంతో పాటకూడా ప్రవహిస్తుంది. తెలుగునాట పాటకు విప్లవకర స్వభావమున్నది. ఈ వెలుగు ఏ తీరానిదో అందరికీ తెలిసిందే. పాట భావనా ప్రపంచంలో ఒక సజీవ కళారూపం. ఈ జీవజల నుండి ఆగని ప్రవాహగానమైంది. జలపాతం జీవనదిగా ఎలా రూపొందింది?
గానం గొంతు నుండి ఉబికి వస్తున్నప్పుడు ఒకేసారి ఆకలి, అవమానం, అసమానత ఎలా రూపు కడుతుంది. పాట ఏమలుపు దగ్గర ఏ పోరాటరూపం తీసుకుంది? పాట , నిత్య గాయాల నేల రాపిడిలో గొంతులో ‘జీర ‘ నిర్మితమైంది. గొంతులోని ధిక్కారానికి ఎక్కడో ఒకచోట అంతస్సూత్రం వుంది. దశాబ్దాల పోరాటగీతం నక్సల్బరి నుంచి తెలంగాణ అస్తిత్వం వరకు తనని తాను వాయిద్య పరికరంగా మార్చుకుంది. ఆశ్చర్యకరమైన అనుభవాలు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఒక గొంతు వెనుక పద్మశ్రీలు, భారతరత్నలు, ఇంకొన్ని అవార్డులు లేవు. అశేష ప్రజలున్నారు. గానానికి సరిపడా ప్రజాకళల కొనసాగింపు వుంది.
సంధ్య తెలుగునాట ఈ పేరు సర్వవ్యాపితం. వెలుగుకి పర్యాయపదం. సంధ్య అనేపేరు ముందట అనేక పోరాట రూపాల అస్తిత్వం ఉంది. ముందు, వెనుక తేజోవలయం ఉంది ఇప్పటి సంధ్య “మాభూమి సంధ్య” గా ఎలా పరివర్తన చెందారు?
ఐదు దశాబ్దాలుగా ఆమె గొంతులోని పాట సమాజ చలనంతో కలగలిసి పోరాట రూపమైంది. సమాజ చలనంలో పాట సజీవ కళ గా మారింది. ఆసజీవతకు మనుషులు ,ఉద్యమాలు వాహికగా నిలిచాయి. మాభూమి సంధ్య ఆపాటల తీరం దగ్గర నిలబడింది. పాట చేసిన రక్తచలనంతో ఆమె గొంతును అన్వేషించాలి .
ఆర్ట్స్ లవర్స్ ప్రజాపాటకు పునాది. ఈ సంస్థ వెనుక బి. నర్సింగరావు మిత్ర బృందం ఉన్నప్పటికీ, తెలుగునాట ఆ ఆర్ట్స్ లవర్స్ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ప్రధానంగా పాట కేంద్రంగా చేసిన కృషి ఆతర్వాత జన నాట్యమండలి ఏర్పాటుకు చోదకశక్తి అయింది. మా భూమి సంధ్య గాయకురాలుగా తననితాను సాన పెట్టుకుంటున్నప్పుడు నర్సింగరావు సంధ్యను ఆర్ట్స్ లవర్స్ లో భాగం చేశారు. మనుషులు పూర్తిగా కళారంగానికి అంకితమై పనిచేస్తున్న కాలమది. సకల జీవన ఉద్వేగాలు పాట దగ్గర సేద తీరుతున్నకాలం. ఆసమయంలో సంధ్య తన గొంతును సంగీత పరికరంగా మార్చుకున్నారు. ఆమె గొంతులోపలికే తరంగం, జీర కళావాస్తవీకరణకు దగ్గరగా ఉంటుంది . ఆమె గాత్రం సామాన్య ప్రజలకు కనెక్ట్ అయింది. తెలుగు నాట విప్లవోద్యమ భావజాలం కళాత్మకతో ముడి పడింది. కళాకారుల సమూహాన్ని తయారు చేసింది. మాభూమి సంధ్య ఇక్కడ తనకు తెలిసిన కళాత్మక దారిని మరింత విశాలం చేశారు.
సాంస్కృతిక రంగంలో ప్రధానంగా గుమ్మడి విఠల్ (గద్దర్) అనే ప్రజాగాయకుడు లేకుంటే మన పాట వాణిజ్యవిఫణి దగ్గర ఆగి వుండేది. రెండు ప్రధాన స్రవంతుల ప్రయాణంలో వాణిజ్య కళారూపంగా మారింది. అదే సమయంలో పాట ప్రజాపక్షం వహించింది. సమాజం పెనుగులాటలో పిడికెడు మంది మనుషులే కావచ్చు- పాటను జనబాట వైపు మళ్లించారు. వెనుకబడిన అనేక ప్రాంతాల ఆర్తిని పాట పూరించింది. అదే సమయానికి అనేక రాజకీయ ,సాంస్కృతిక, పోరాటాలను పాట సొంతం చేసుకుంది. పాటకు రక్త మాంసాలు అద్ది ప్రజాపక్షం చేసినవారిలో మాభూమి సంధ్య ఒకరు.
ఆర్ట్స్ లవర్స్, జననాట్యమండలిగా పరిణామం చెందింది. సంధ్య మాభూమి సంధ్య అయింది. ఐదుదశాబ్ధాల కాలం దాటిన పాటల ప్రవాహంలో తను నమ్మిన రాజకీయ విశ్వాసాల మధ్య దృఢంగా నిలబడింది. విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలుగా పాట ద్వారా ప్రవేశించారు. సంధ్య ప్రజల పాటల గొంతుకగా మారడానికి ఆమెకు అనేకమంది సహకారం వుంది. ఆర్ట్స్ లవర్స్ నుండి జన నాట్య మండలి వరకు ఆమె పాటల ప్రయాణం విస్తృతమైంది. . గద్దర్, సంధ్య గొంతులోని మార్థవాన్ని విప్లవకరంగా మార్చారు. తన చుట్టూ ఉన్న పోరాటారూపాల నుండి సంధ్య తననితాను రూపొందించుకున్నారు.
గద్దర్ పరిచయాలలోకి 1970వ దశకం వెళ్లారు. 1974 నుండి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నారు. వివాహం, పిల్లలు ,జీవితం ఇవన్నీ వ్యక్తిగతమైనవి . వీటి నుండి సంధ్య పాటను విడదీశారు. మాభూమి సినిమా అనంతరం మాభూమి సంధ్యగా మారారు. సంధ్యలో అనేక విశేషణాలు ఉన్నాయి. బెనకని కంఠస్వరం. ఆస్వరంలో సున్నితత్వం మాత్రమే కాదు. ఏభై ఏళ్ల భారత సమాజ తండ్లాట వున్నది. వీటన్నిటి కంటే , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో పాటది ఆగ్ర భాగం. కవిత్వం , పాట జమిలిగా తెలంగాణ సాకారంలో వాహికయినాయి..
విప్లవ రచయితల సంఘంలో మూడుతరాల రచయితలతో సహచరత్వం ఉంది. నిరాడంబరంగా ప్రజాగాయనిగా ఎదిగిన క్రమంలో నిర్బంథం, కేసులు సహజమే. నిర్బంధ అల్లికలోనూ తన కంఠస్వరాన్ని విడువలేదు. మాభూమి సంధ్య పాటలోని మాధుర్యం ఇక్కడ స్థిరీకరించబడింది. మానవ ప్రవృత్తిలోని సహజ లక్షణాలు ఆవేశం, క్రోధం, ఒంటరితనం వీటి ఆవల ప్రజా ఆకాంక్షల జీవితం ఉన్నది. పాటకు వారధి కేవలం గొంతు మాత్రమే కాదు. పాటచుట్టూ అలుముకున్న భౌతికావరణ. సంధ్య ఆ పోరాటరూపాన్ని ఈనాటికీ నిలుపుకున్నారు జననాట్యమండలి ఆడ బిడ్డను. తమ వివాహం జన నాట్య మండలి చేసింది అని చెబుతారు. గద్దరన్న చీర కొనుక్కోమని నలభై రూపాయిలు ఇచ్చారు. ఆనాటి రోజులలో ముడిపడిన వ్యక్తిగత జీవితం పాటల చలనంలో భాగమైంది. ఈ ఎరుకతో సంధ్య ఉన్నారు.
స్థిరమైన ప్రజాఉద్యమాల పరంపరలో పాట విస్తృతికి వారధి అయినారు. అనేక అవాంతరాలను పాట ద్వారా అధిగమించారు. తెలంగాణ సమాజంలో పాటల వెల్లువ నైజాం వ్యతిరేక పోరాటాల దశ నుండి భారత విప్లవోద్యమం వరకు కొనసాగింది. తెలంగాణ అనేక దశల అస్తిత్వ పోరాటంలో పాట తన వెలుగును ప్రసరించింది. పాటల శ్వాస తన తర్వాత తరాలను ఒడిసి పట్టుకుంది. సంధ్య గొంతులో సజీవతకు అనేక కారణాలు ఉండవచ్చు. ఈకారణాల రసాయనక క్రియ తెలంగాణ సమాజం అంతటా విస్తరించి ఉంది.
కాలం, పరిస్థితులు, మానవజీవితం అనేక మలుపుల ద్వారా, కొత్త రూపం తీసుకోవచ్చు. ఒకానొక ఆశయం వెనుక జీవార్తిని కళారంగం పూరిస్తుంది. ఆపూరణకు నిమగ్నత కలిగిన వ్యక్తులు కావాలి .కచ్చితంగా మా భూమి సంధ్య ఈ అంతఃకరణలో ఒదిగిపోతారు. ఏదో సమయాన తనపాటల పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని గతంలోకి ఏభై ఏళ్ల జీవనక్రమణికలోకి తొంగి చూస్తారు. అనేక అమరత్వాలు, ఎదురు కాల్పులు వీటన్నిటి మధ్య పాట నడిచింది. ఆ గానానికి భౌతిక రూపం సంధ్య.
*
మనుషులు పూర్తిగా కళారంగానికి అంకితమై పనిచేస్తున్న కాలమది.