మహాశ్వేతా దేవి మహాభారత యుద్ధానంతర ఘటనలని అణగారిన ప్రజలు – స్త్రీలు, ఆదివాసులు, దళితుల కోణంనుండి మూడు పదునైన కథల రూపంలో చిత్రించింది.
కుంతీ, నిషాద స్త్రీ – రచనా కాలం 1999
పాండవులు పట్టాభిషక్తులు అయ్యాక, ధృతరాష్ట్రుడు, గాంధారి వానప్రస్థానికి బయలుదేరుతారు. అవసాన దశలో వాళ్లకి సపర్యలు చేయడానికి అడవిలో కుటీరంలో కుంతి వాళ్ళకి తోడుగా ఉంటుంది. రోజూ వంట కోసం కట్టెపుల్లలు పోగుచేయడానికి కుంతి అడవిలోకి వెళ్ళేది. మధ్యాహ్నం అడవిలోకి వెళ్ళి, ఎండుకట్టెలు పోగుజేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని, గడ్డితో పూనిన తాడు వాటికి చుట్టి, కుటీరానికి లాక్కు వచ్చేది. ఒక రోజు మధ్యాహ్నం కుంతి నడివయసు నిషాద స్త్రీలని చూస్తుంది. వాళ్ళవి బలమైన చేతులు, భుజాలు. ఎండు కట్టెలని పోగుజేసి, అడవి తీగలతో మోపులుగా కట్టి తలకెత్తుకునే వాళ్ళు. రాళ్ళతో నిప్పురాజేసి, కట్టెల కాగడాలు ధరించి పాటలు పాడుతూ వెళ్లిపోయేవాళ్ళు. వాళ్ళ భాష ఏమిటో తెలుసుకోవాలని కుంతి ఎన్నడూ అనుకోలేదు. అడవిలోకి వెళ్ళినప్పుడు మనసులో భారమంతా దిగిపోయేలా తన జీవితం గురించీ, ఆలోచనల గురించీ తనతో తానే మాట్లాడుకునేది.
నిషాద స్త్రీలు దగ్గరలోనే తిరుగాడుతున్నా వాళ్ళని ఎన్నడూ పట్టించుకోలేదు. కర్ణుడి గురించీ, ఇతర సంతానం గురించీ, చేసిన, చేయని పనులగురించీ పశ్చాత్తాపాన్ని ప్రకటించేది. ‘గాంధారి లాంటి సత్యసంధత నాకు లేదు, కృష్ణుడి సమక్షంలో గాంధారి విలపించింది కేవలం తన కొడుకులు, మనుమలు గురించి మాత్రమే కాదు, అభిమన్యుడి తలను తన ఒడిలో పెట్టుకుని గాంధారి విలపించినప్పుడు నాకా విషయం అర్ధమయ్యింది. గాంధారి కృష్ణునికి ఇచ్చిన శాపం లోకంలోని స్త్రీలందరి తరపునా ఇచ్చిన శాపం‘. గాంధారిని ప్రత్యేకంగా నిలిపేది అదే. ఇది అధికారం కోసం, రాజ్యం కోసం జరిగిన యుద్ధం. వైరిపక్షాన్ని నిర్మూలించి రాజ్యాన్ని సాధించాడనికి సాగిన యుద్ధం. ఇందులో ధర్మం గెలిచిందా, అధర్మం ఓడిపోయిందా? ఛిన్నాభిన్నమై, రక్తసిక్తమై మాంసపు ముద్దలుగా మారిన కళేబరాలని చూసి కన్నీరు మున్నీరుగా విలపించే హృదయవిదారకమైన రోదనలు యుద్ధం అనే పదానికే విసిరిన శాపం.’ భూమాతని కుంతి క్షమించమని మాటలలో వేడుకుంది. అంతలో తలెత్తిన కుంతికి అత్యంత సమీపంలో నిషాద స్త్రీలు కనిపించారు. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుని పకపకా నవ్వుకున్నారు.
కుంతికి ఒక్క క్షణం భయం వేసింది. వాళ్ళు మరింత దగ్గరకు వస్తే, వాళ్ళ నీడపడితే, కట్టెలు మైలపడి పనికిరాకుండా పోతాయేమోనని భయపడింది. తనలో తాను మాట్లాడుకోవడంతో కుంతికి కొంత సాంత్వన కలిగింది. నిషాద స్త్రీలు విన్నా తనకి పట్టింపు లేదు. తన భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష తనకి తెలియదు. రోజూ భూమాతతో తన పాపాల గురించి మాట్లాడుతూ ఉండడంతో మనసులో భారం తగ్గిపోసాగింది. ఒకరోజు అలాగే భూమితో మాట్లాడి తలెత్తి చూసే సరికి నిషాద స్త్రీ తన కళ్ళలోకి సూటిగా చూస్తున్నట్లనిపించింది. ఆ కళ్ళు జాలి పడుతున్నట్టున్నాయి.
ఒకరోజు మధ్యాహ్నం, కుంతి అడవిలో చెట్టుకింద ఒక రాతి మీద కూర్చుంది. గాలిలో ఏదో అశాంతి. కుంతి జాగ్రత్తగా గమనించింది. అడవి ఆరోజు మామూలుగా లేదు. పక్షులు గాభరాగా ఎగురుతున్నాయి. కోతులు చెట్లపై నుండి దూకుతూ అడవిలోపలికి వెళ్ళిపోతున్నాయి. జంతువులూ పరుగులు తీస్తున్నాయి. నిషాద స్త్రీలు, పురుషులు తమ పెంపుడు కుక్కలతో సహా తరలి పోతున్నారు. వెళితే, వెళ్ళనివ్వు. నా నేరమేమిటో, నన్ను నేను ఎప్పటికి క్షమించుకోగలనో ఆ భూమాతను అడుగుతాను అనుకుంది కుంతి.
ఒక నీడ తనని సమీపించింది. ఎదురుగా ఒక వృద్ధ నిషాద స్త్రీ. ‘ఈ రోజు పశ్చాత్తాప ప్రకటనలు ఏవీ లేవా?’
కుంతి ఆశ్చర్యపోయింది.
‘రోజూ నీ పశ్చాత్తాప ప్రకటనలని వింటూనే ఉన్నాను. ఏరోజైనా నువు చేసిన మహా పాపాన్ని గుర్తుచేసుకుని, ఒప్పుకుంటావా’ అని.
‘మా భాష నీకు తెలుసా?’
‘తెలుసు, నేను అర్ధం చేసుకోగలను, మాట్లాడగలను. మీరు మమ్మల్ని ఏనాడూ మనుషులుగా చూడలేదు కదా’
‘ఈరోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాము కుంతీ’
నీకు నా పేరు తెలుసా’
నిషాదిని నవ్వింది. ‘బాధగా ఉందా? ఒక నిషాద స్త్రీ నిన్ను పేరు పెట్టి పిలవడం’
‘ఏం కావాలి నీకు?’
‘నువ్వు చేసిన మహా పాపం నువ్వు ఇంకా ఒప్పుకోనేలేదు’
కుంతికి ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు.
అప్పుడు ఆ నిషాద స్త్రీ కుంతికి గుర్తుచేస్తుంది పాండవులు వారణావతంలో దుర్యోధనుని మాయోపాయం నుండి బయటపడడానికి లక్క ఇంటిలో ఆరుగురు నిషాదులను బలిపెడతారు. లక్క తగలబడినప్పుడు పాండవులు చనిపోయారని నమ్మకం కలిగించడం కోసం, ఒక నిషాద స్త్రీ, ఆమె ఐదుగురు కొడుకులని పాండవులు విందుకని ఆహ్వానించి కడుపునిండా తిండి పెట్టి, మధువు అందిస్తారు. మత్తులో ఉన్న ఆరుగురిని అలాగే వదిలేసి, రహస్య సొరంగ మార్గంలో పాండవులు తప్పించుకుంటారు. లక్కయింటిలో నిషాద స్త్రీతో పాటు, ఆమె ఐదుగురు కొడుకులూ చనిపోతారు. చనిపోయిన నిషాద స్త్రీకి పెద్ద కోడలే ఇప్పటి ఈమె. మిగతా స్త్రీలు, చనిపోయిన ఇతరుల భార్యలు. కుంతి నివ్వెరపోతుంది.
‘ఏం చేయాలి ఇప్పుడు?’
‘నీకు నీవు చేసిన మహాపాపమే గుర్తు రాలేదు. ఆరుగురిని సజీవ దహనం చేయడం నీ దృష్టిలో నేరమే కాదు. మీరందరూ దోషులే. ప్రక్రుతి మాట నియమం ప్రకారం మీరు దోషులు. ఇప్పుడీ అడవికి నిప్పంటునుకుంది. అందరమూ తరలిపోతున్నాం. మీ ముగ్గురిలో ఒకరు పుట్టు గ్రుడ్డి, రెండవ మనిషి గ్రుడ్డితనాన్ని ఎంచుకున్నది. అందరికంటే ఎక్కువ గుడ్డిదానివి నీవు.. మీరు ఇప్పుడు ఎటూ తప్పించుకు పోలేరు.’
‘నిషాదినీ నన్ను క్షమించలేవా?’
‘క్షమాపణ అడగడం రాజరికపు లక్షణం.’
‘మరి అడవిలోని దావానలం?
‘ దావానలం తన పని తానూ చేసుకుపోతుంది. వర్షం మంటలను చల్లారుస్తుంది. తగలబడిన భూమి మళ్ళీ పచ్చగా చిగురిస్తుంది.’
కుంతి చావుకు స్వాగతం పలుకుతుంది. మంటలలో సజీవ దహనం అవుతూ, కుంతి ఆ చనిపోయిన నిషాద స్త్రీని క్షమాపణ అడుగుతుందా?
అమాయకులను చంపినందుకు రాజులు క్షమాపణ అడుగుతారా?
కుంతికి ఆ విషయం తెలియదు.
(మహాభారత కథలో కుంతీ, ధృతరాష్ట్రుడు, గాంధారి అడవిలో మంటలలో చనిపోతారు)
సౌవలి – రచనా కాలం 2000
మహాభార కథ ప్రకారం, గాంధారి గర్భంలో ఉన్నప్పుడు, ధృతరాష్ట్రుని సేవలో ఉన్న ఒక వైశ్యురాలికి జన్మించిన కొడుకు పేరు యుయుత్సుడు. మహాభారతంలో ప్రత్యక్షంగా పేరు ప్రస్తావనకు రాని ఆ తల్లిపేరు సౌవలియని ఇతర గాథలనుంచి తెలుస్తున్నది.
కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ చనిపోయాక, మిగిలి ఉన్న ఒకే ఒక ధృతరాష్ట్రుని కొడుకుగా యుయుత్సుడి (సౌవలి తనయుడు గనుక సౌవల్యుడని కూడా అంటారు)పై పితృ తర్పణల బాధ్యత పడుతుంది. మహా తర్పణల అనంతరం సౌవల్యుడి తల్లిదగ్గరకు వస్తాడు. బ్రతికి ఉండగా తండ్రీ అని ఏనాడూ పిలిచి ఎరగని సౌవల్యుడు ధృతరాష్ట్రునికి తర్పణలు విడిచాడు. తనని ఏనాడూ కౌరవులతో ఒకడిగా చూడలేదు. దాసీ పుత్రునిగానే చూశారు, అలాగే పిలిచారు. కుంతి గానీ, గాంధారి గానీ ఎన్నడూ తనని కౌరవులలో ఒకడిగా చూడలేదు.
అందుకే, తాను ధృతరాష్ట్రునికొక్కడికే తర్పణ చేశాననీ, గాంధారికి గానీ, కుంతికి గానీ తర్పణ చేయలేదని సౌవల్యుడు చెబుతాడు. తల్లి సౌవలి, తనకు అటువంటి బాధ్యతలు ఏవీ లేవనీ, వైశ్య కుటుంబంలో పుట్టిన తనని చిన్నతనంలోనే దాసీగా పంపించారని చెబుతుంది. గాంధారి గర్భంతో ఉన్నప్పుడు, సౌవల్యుడు కడుపునపడ్డాడు. పిల్లవానిని తన దగ్గర ఉంచినంత వరకే అంతఃపురంలోనే ఉండి, ఆ తర్వాత ఆమె బయటకు వచ్చేసింది. సౌవల్యుడిని మొదట వేరే గురువుల దగ్గరకు పంపించి, ఆ తర్వాత, కౌరవులకు సహాయకుడిగా వారు చదివే గురువుల దగ్గరే చదివిస్తారు. తల్లి వదిలేసి వెళ్లిపోయిందని తన పట్ల వ్యతిరేకతను పెంచుకున్న సౌవల్యుడు, తల్లి తన గురించి ఎంతగా ఆలోచించిందో తెలిశాక, తనని అమ్మా అని నోరారా పిలుస్తాడు.
సౌవల్యుడు వివక్షను తిరస్కారాన్ని తట్టుకోలేక భారత యుద్ధ సమయంలో పాండవుల పక్షాన చేరతాడు. పితృ తర్పణలు విడిచిన విషయం తల్లికి తెలియజేయమని ధర్మరాజు చెప్పడంతో సౌవల్యుడు ఆ పూట తల్లి ఇంటికి వచ్చాడు. మళ్ళీ తెల్లవారే వెళ్ళిపోతాడు. సౌవలికి సహాయకురాలిగా ఉన్న చంద్ర వచ్చి, కర్మకాండల విషయంలో ఏమైనా సహాయం కావాలా అని అడుగుతుంది.
‘చంద్రా, వెళ్లి పడుకో.. కర్మకాండలు ఏమిటి? ధృతరాష్ట్రుడు నాకేమౌతాడు?’
‘అదేమిటి, అతను నీ..‘
‘ అతను నా బిడ్డకు తండ్రి మాత్రమే. కొడుకుగా నా బిడ్డ తన బాధ్యతను నిర్వర్తించాడు.‘
‘కానీ.. ‘
‘నేను కేవలం దాసీని. నేనతనికి పెళ్ళాడిన భార్యనా కర్మకాండలు పాటించడానికి. రాజుల ఇళ్ళలో దాసీజనాలు ఎందరో వస్తారు, పోతారు. పిల్లలకి తల్లులౌతారు… కానీ అశౌచం, మైల పాటించాల్సిందేముంది? ఎందుకు తర్పణ విడవాలి? తెల్లబట్టలు ఎందుకు తొడగాలి, ఉపవాసాలు ఎందుకు ఉండాలి? ఎందుకు ఇవన్నీ?’
సౌవలి కళ్ళు మెరిసిపోతున్నాయి. నేను సుష్టుగా విందు భోజనం చేస్తాను. కడుపునిండా తిని ప్రశాంతంగా నా కొడుకు చేతులను దగ్గరకు తీసుకుని నిద్రపోతానీ రాత్రి.‘
సౌవలికి ఇప్పుడు హాయిగా వుంది. చనిపోయిన ధృతరాష్ట్రుని ధిక్కరించడం సంతోషంగా ఉంది.. ఈ పని చేసినందుకు సౌవలి నరకానికి వెళుతుందా, స్వర్గానికి వెళుతుందా?.. సౌవలి సంతోషంగా చేతులు ముఖం కడుక్కుంది. కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఈ ధర్మ యుద్ధం గురించి రాస్తాడట.. రాస్తే రాయనీ, అందులో సౌవలి పేరు ప్రస్తావన కూడా ఉండాలని కోరుకోవడం లేదు.‘
‘సౌవలి తినడం మొదలు పెట్టింది. భోజనం ఎప్పుడూ ఇంత రుచిగా లేదు. సౌవల్యుడికి ఎప్పుడు అర్ధమౌతుంది? పాండవులు కూడా అప్పటికీ తనని తమలో ఒకడిగా అంగీకరించబోరని..‘
పంచ కన్య (ఐదుగురు కన్యలు) – రచనా కాలం 2000
ఇది ఐదుగురు ఆదివాసి మహిళలు – గోధుము, గోమతి, యమున, వితత్స, విపశల కథ. మహాభారత యుద్ధం ముగిశాక అంతఃపురం అంతటా వైధవ్యం అలముకుంది. ద్రౌపది, సుభద్రలు కొడుకులను కోల్పోయారు. సుభద్ర కుమారుడు, అభిమన్యుడు చనిపోయేనాటికి అతని భార్య ఉత్తర గర్భం ధరించి ఉంది. విషాదంలో మునిగి ఉన్న రాకుమారి ఉత్తరకు సహాయంగా, చెలికత్తెలుగా ఉండేందుకు ఈ ఐదుగురు మహిళలు అంతఃపురానికి వస్తారు. తాము దాసీలుగా ఉండబోమని ఐదుగురూ ముందే ఖచ్చితంగా చెబుతారు. ఉత్తరకు పరిచర్యలు చేస్తూ ఐదుగురూ ఆమెకు దగ్గరౌతారు.
పొడుపు కథలు, మాటలతో ఉత్తర మనసును తేలికపరిచేవారు. తోటలోకి తీసుకుపోయేవారు. ఎప్పుడూ తనకి తోడుగా ఉండేవారు. కాన్పు తేలికగా జరుగుతుందని చెప్పి తనతో చిన్న చిన్న పనులు చేయించే వారు. వాళ్ళు ఐదుగురూ విడిగా ఉన్నప్పుడు ఏవో పాటలు పాడేవాళ్లు. ఉత్తరకు అవి అర్ధమయ్యేవి కాదు. తర్వాత సుభద్ర ద్వారా వాళ్ళ గురించీ, వాళ్ళ పాటల గురించీ ఉత్తరకు తెలుస్తుంది. వాళ్ళ భర్తలు కూడా మహాభారత యుద్ధంలోనే చనిపోయారు. వాళ్ళు రైతులు, పంటపొలాల గురించీ, తమ పల్లెల గురించీ పాడే పాటలు అవి.
వాళ్ళ ఆచారాలు రాజరికానికీ, అంతఃపురానికీ చాలా భిన్నమైనవి. పంటపొలాలకు స్త్రీలు, పురుషులు కాపలా కాస్తారు. బల్లెం పురుషుల ఆయుధం మాత్రమే కాదు, ఆ ఆదివాసీ మహిళల ఆయుధం కూడా. వాళ్ళు ఉత్తర కోసం బంకమన్నుతో బొమ్మలు తయారు చేసి, వాటిని కాల్చి, రంగులు అద్దేవాళ్ళు. పంటపొలాల మీదకి వచ్చే జింకలని వేటాడుతారంటే, ఉత్తర ఆశ్చర్య పోయి, బాధపడుతుంది. రాజుల కోటలలో రోజూ వండే మాంసం ఎక్కడిదని, పాదరక్షలు, బొంతలు తయారుచేసే జింకల చర్మాలు ఎక్కడివనీ ఉత్తరకు వాళ్ళు సమాధానం చెబుతారు. ఒకరోజు చాతకపక్షి అరుస్తుంది. వర్షాలు రాబోతున్నాయి.
అంత్యక్రియలు, శవదహనాలతో వేడెక్కిన భూమి చల్లబడనుంది. ఐదుగురూ వెనక్కి ఊరిలోకి వెళ్ళిపోతామని సుభద్రకు చెబుతారు. ఊళ్లోకి వెనక్కి వెళ్ళి ఏం చేస్తారని అడిగితే, మళ్ళీ పెళ్ళి చేసుకుంటామని, వ్యవసాయం చేస్తామనీ వాళ్ళు చెప్పిన సమాధానంతో అంతఃపురంలో ద్రౌపదీ, సుభద్రా అవాక్కవుతారు. ‘మేం వెనక్కి వెళ్ళక పోతే మా పొలాలు బీడుబారిపోతాయి. పశువులని చూసుకునేవారుండరు. అందరం ఊరికి చేరాక చనిపోయిన అందరికీ అంత్యక్రియలు జరుపుతాము. పెద్దలు మాకు మళ్ళీ పెళ్ళి చేస్తారు. మాకు భర్తలు కావాలి, పిల్లలు కావాలి. పల్లెలలో మాటలు, నవ్వులు వినబడాలి. మేం.. జీవితాన్ని సృష్టిస్తాం. ప్రక్రుతి మాకు నేర్పింది ఇదే. … ఆర్య సుభద్రా, జీవితానికి అది కూడా కావాలి. జీవితం ఉన్నంతవరకూ కోరికలు తీరాలి. మాలో భర్త చనిపోయినవాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు. కుటుంబాలు వాళ్ళని గౌరవిస్తాయి. భర్తలతో పాటు వాళ్ళు పనిచేస్తారు, పంటల్ని కాపాడతారు, ధాన్యాన్ని నిల్వజేస్తారు. అస్తిత్వమే లేని నీడలుగా, మేలి ముసుగుధరించిన నిశ్శబ్దంగా మిగిలిపోవడానికి వాళ్ళు జీవితాన్ని నిరాకరించరు. మాకు ఒకప్పుడు భర్తలు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. మేము ఏడ్చి శోకాలు పెడితే వాళ్ళు తిరిగిరారు. మా భర్తలు రాజులకు యుద్ధంలో చనిపోయారు. వాళ్ళకు ఎలాంటి దివ్యలోకాలూ లేవు, అవన్నీ రాజులకే.. ధర్మయుద్ధంలో చనిపోయినవాళ్ళకి స్వర్గంలో అప్సరసలు ఉంటారు. ఇది మాయా ధర్మయుద్ధం కానేకాదు. అన్నదమ్ములు, పినతండ్రులు, పెదతండ్రులు, మేనమామలు, కొడుకులు, మేనల్లుళ్లు అందరూ ఒకరిని ఒకరు చంపుకుని చచ్చారు. ఇది మీ ధర్మయుద్ధం కావచ్చు, మాది కానే కాదు‘ అని సమాధానమిస్తారు ఆ ఐదుగురూ. వితత్స అందమైన బొమ్మలని ఉత్తరకి బహుమానంగా ఇస్తుంది. ఐదుగురూ బయలుదేరుతారు. ద్రౌపది వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ఐదుగురూ వెళ్ళిపోతారు. ఉత్తర బొమ్మల బుట్టని చేతిలోకి తీసుకుంటుంది. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని తలచుకుంటుంది.
IV
కువెంపు నాటకంలో యుద్ధ విధ్వంసాన్నీ, వినాశనాన్నీ చిత్రించడానికి కురుక్షేత్ర యుద్ధరంగాన్ని క్షేత్రంగా ఎంచుకున్నాడు. మహాశ్వేతా దేవి కథలలో మూడు కథలకీ రంగం వేరు వేరు స్థలాలు. కుంతి, నిషాద స్త్రీ కథా స్థలం, అడవి. సౌవలి నివసించే స్థలం పేదప్రజలు నివసించే నగరపు శివారు ప్రాంతం. పంచకన్య కథాస్థలం అంతఃపురం. పంచకన్య కథలో స్త్రీలు యుద్ధ బాధితులు, ఆదివాసీ రైతాంగ మహిళలు. సౌవలి వైశ్య వర్ణపు దాసి, ఆ తర్వాత అంతఃపురాన్ని విడిచిపెట్టి స్వతంత్రంగా బ్రతుకుతున్న మహిళ. పాండవుల పన్నాగంలో సజీవదహనమైన నిషాదుల భార్యలు, అడవిలో నివసించేవారు.
యుద్ధం పట్ల, జీవితం పట్ల ఈ మహిళల దృక్పథమే వేరు. అంతఃపుర స్త్రీల ఆలోచనలకీ, ఈ బాధిత, స్వతంత్ర మహిళల ఆలోచనలకీ పోలిక లేదు. వాళ్ళ దృష్టిలో ఇది తమ యుద్ధం కాదు. అంతఃపుర స్త్రీలతో ఐదుగురి సంభాషణలలో, రాజమాత కుంతితో నిషాద స్త్రీ సంభాషణలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం పట్ల అందరికీ ‘ఒకే వైఖరి’ ఉండదు. యుద్ధ బాధితులలోనూ వర్గ, వర్ణ, కుల, లింగ అంతరాలు ఉంటాయి. ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? మహాశ్వేతా దేవి కథలకీ మరొక తేడాని మనం గమనించవచ్చు. మహాశ్వేతా దేవి కథలకి మరొక విశిష్టత ఉంది. ఈ కథలలోని పాత్రలు మహాభారత కథలో ‘గుర్తింపు’ పొందినవి కావు. పేరు ప్రస్తావనకు నోచుకోని అధోజ్ఞాపికలు, నీడల జాడలు. అట్టడుగు నుంచి లేవనెత్తే ప్రశ్నలతో మహాభారత యుద్ధాన్ని మరొకవైపునుంచి చూసేలా చేస్తాయి.
కువెంపు నాటకానికీ, మహాశ్వేతా దేవి కథలకీ నేపథ్యం యుద్ధం, దాని విధ్వంసం. అందులో యుద్ధాన్నీ, యుద్ధానంతర దృశ్యాలనీ అవలోకించే ఆధునిక సామాజిక దృక్పథం ప్రత్యేకించి ఎన్నదగినది.
*
మహాశ్వేత దేవి కధలను బాగావిశ్లేషించారు. ఇలాగే 1084 ని కూడా పరిచయం చేయండి. ఇది మంచి నాటకం చేశారు . మంచి సినిమా కూదాచేశారు.మీరు సరిగ్గా చెప్పినట్టు “మహాశ్వేతా దేవి కథలకి మరొక విశిష్టత ఉంది. ఈ కథలలోని పాత్రలు మహాభారత కథలో ‘గుర్తింపు’ పొందినవి కావు. పేరు ప్రస్తావనకు నోచుకోని అధోజ్ఞాపికలు, నీడల జాడలు. అట్టడుగు నుంచి లేవనెత్తే ప్రశ్నలతో మహాభారత యుద్ధాన్ని మరొకవైపునుంచి చూసేలా చేస్తాయి.
తెలుగు లో ఓల్గా గారు ఆవిడలా రామాయణం లోని సన్నివేశాలు తీసుకొని మన ఆదివాసుల మనమందరమూ కలగ చేస్తున్న ఇబ్బందుల గురించి రాస్తున్నారు