సుహాసిని
ముద్దులొలికే ఆ పసిపాపని చూస్తే ఎవరైనా పలకరిస్తారు. ఎవరైనా పలకరించగానే ఆ పాప బోసి నవ్వు నవ్వుతుంది. నవ్విన వెంటనే ఎత్తుకున్న వాళ్లమ్మ సుహాసిని మెడలో ముఖం పెట్టుకోని సిగ్గుపడిపోతుంది. పాపం వాళ్లమ్మ మెడలో తాళిబొట్టు లేదు. నిజం చెప్పాలంటే ఆమె తాళి కట్టించుకోనే లేదు. అంటే పెళ్లి చేసుకోలేదని కాదు. ఒకరకంగా చేసుకున్నట్లే. ఆమె, రూబెన్ కలిసే వుంటారు. లివిన్ రిలేషన్ అన్న మాట. ఇప్పటికి ఏడు సంవత్సరాలైంది. ఇద్దరూ ఒకే కంపెనీలో వున్నప్పుడు పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో… అది ఇల్లు అని చెప్పడానికి లేదు. పట్నంలో వుండే అన్ని ఇళ్లలాగే ఇది కూడా గాల్లో లేచిన మేడ. ముఫై రెండు అంతస్థుల బిల్డింగ్లో ఇరవై ఏడొవ అంతస్తులో వాళ్ల ఇల్లు
చాలా చక్కగా కట్టిన ఇల్లు. కానీ ఇప్పుడు ఆ ఇంటి నిండా మనకి కనిపించేవి చిందరవందరగా పడేసున్న మాసిన బట్టలు, బీర్ బాటిల్స్, పార్సిల్ ఫుడ్ తో వచ్చిన కవర్లు, షాపింగ్ బ్యాగులు, ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్, వాటి ఛార్జర్స్. ఇద్దరూ ఉద్యోగస్తులు కదా! వారమంతా ఉద్యోగం. వారాంతంలో కాస్త షాపింగ్. కూతురు పుట్టకముందు స్వేఛ్చా విహంగాల్లా వున్న వాళ్ల జీవితాలు కూతురు పుట్టిన తరువాత బందీల జీవితాలలా సాగుతున్నాయి. వాళ్లు ఇక్కడే కాదు తమ ఆఫీసులో క్యాబిన్లలో కూడా బందీలే. తొమ్మిదిన్నరకి ఆ జైలులో అడుగుపెడితే ఆరున్నరకి విడుదల. అలా అని చెప్తారు కానీ రాత్రి తొమ్మిదిన్నరకో పదిన్నరకో బయటపడతారు.
ఒకటిన్నర సంవత్సరం క్రితం సుహాసిని ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది.
“మనకున్న కమిట్మెంట్స్, జాబ్ స్ట్రెస్లో పిల్లల్ని కనడం అవసరమా” అని అడిగింది అప్పుడు. ఎలాగో తెలియదు కానీ రూబెన్ ఆమెని ఒప్పించగలిగాడు. ఫలితం ఈ పసిపాప.
అయితే వాళ్ల జీవితం అతిపెద్ద సమస్య అది కాదు. ఆ పాప కడుపులో పడ్డప్పుడు వాళ్లు ఎదుర్కున్న సమస్య అన్నింటికన్నా పెద్దది. మెటర్నిటీ లీవ్. ఆఫీస్ రికార్డ్స్ ప్రకారం విద్యకి పెళ్లి కాలేదు కాబట్టి ఆమెకి లీవ్ ఇవ్వము అని చెప్పేసింది HR డిపార్ట్మెంట్. సుహాసిని ఆ విషయాన్ని HR Head వరకు తీసుకెళ్లింది. ఆఖరుకి సీయీవోకి కూడా మెయిల్ రాసింది. ఎలాంటి సమాధానం రాలేదు. మెటర్నిటీ లీవ్ లేకపోతే లాస్ ఆఫ్ పే పెట్టుకోవాలి. ఖర్చులు పెరిగాయి. జీతం వుండదు. ముఖ్యంగా డెలివరీకి వెళ్లినప్పుడు మెడికల్ రీయంబర్స్మెంట్ వుండదు.
ఉత్తమకథకి ఉండాల్సిన నాలుగు లక్షణాలని వివరిస్తారు వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు ఆయన పుస్తకం కథా శిల్పంలో. ఆ నాలుగు లక్షణాలు క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణసౌష్టవం. ఇందులో అనుభూతి ఐక్యత గురించి మనం కొంత చర్చించాం. గతభాగంలో నేను ఇచ్చిన కథని ఆధారం చేసుకోని క్లుప్తత, నిర్మాణసౌష్టవంలో కొంత భాగం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
గతభాగంలో ఇచ్చిన కథ చదివిన ప్రతి ఒక్కరికీ అనిపించే విషయం – అసలు ఈ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అని. తల ఎక్కడో తోక ఎక్కడో వున్న కథ అది. పసిపాప నవ్వులతో మొదలుపెట్టి మెటర్నిటీ లీవ్ దాకా మధ్యలో ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తూ కథని నడిపాడు రచయిత. “మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకూ కథ, కథాంశం అన్న తీగమీదే నడవాలి.” అంటారు వెంకటసుబ్బయ్యగారు. ప్రముఖ రచయిత ఎచ్.జి.వెల్స్ “ఒక పులి తరుముతుంటే చెట్టు ఎక్కడానికి ఎలా మనిషి పరుగెడతాడో అలా రచయత తన కథాంశం వైపు పరుగెత్తాలి” అంటారు.
Know your ending అనే అంశం కూడా మనం మాట్లాడుకోవచ్చు. ముగింపు ఏమిటో రచయితకి ముందే తెలిసి వుండాలి. అప్పుడే కథ పరుగు ముగింపు వైపుకి సూటిగా సాగుతుంది. ముగింపు కన్నా ముఖ్యంగా రచయిత తన రచన ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడో తెలిసివుండాలి. పైన ఉన్న కథ ద్వారా రచయిత, లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండే కష్టాసుఖాలు చెప్పచ్చు, ఆధునిక సమాజంలో మహిళ పడుతున్న కష్టం అన్న దిశగా కథని నడపచ్చు, ఇద్దరూ ఉద్యోగస్థులైన తల్లిదండ్రులున్న పిల్లల ఇబ్బంది రాయచ్చు, నియమాలను మాత్రమే పాటిస్తూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే కార్పొరేట్ వ్యవస్థని నిందిస్తూ రాయచ్చు. వీటిలో రచయిత రాయదల్చుకున్నది ఏది? ఈ విషయం తెలియకుండా రచయిత కథ మొదలుపెట్టడం వల్ల అవన్నీ కథలోకి వస్తున్నాయి. “పసిపాప నవ్వులు” అన్నాడు, “పాపం బొట్టులేదు” అన్నాడు “ఇద్దరూ ఉద్యోగస్తులు కదా” అంటూ నిరసన ప్రకటించాడు. “ఇల్లంటే ఇల్లు కాదు” అంటూ మోడ్రన్ లైఫ్ మీద కామెంట్ వేశాడు, “ఉద్యోగం బందిఖానా” అన్నాడు, ఆ తరువాత ఎప్పుడో కార్పొరేట్ సంస్థల ఎచ్.ఆర్ పాలసీ మీద పడ్డాడు. ఇన్ని విషయాలు ఒకే కథలో చెప్పాలని ప్రయత్నించడం చాలా పెద్ద పొరపాటు. రచయిత తనకి తెలిసినవన్నీ చెప్పాలి, తన అభిప్రాయాలన్నీ పాఠకుడికి చెప్పేయ్యాలి అన్న వీక్నెస్ నుంచి బయటపడాలి.
అదేమిటండీ? ఒక కథలో అనేక అంశాలు చెప్పకూడదా? అని అడుగుతున్నారా? కథలో అయితే చాలా కష్టం. నవలో సినిమానో అయితే చెప్పచ్చు. కానీ చెప్పాలనుకున్నదంతా ఒకే చోట కుమ్మరించడం కూడా సరికాదు. ఒక వేళ రచయిత తన అభిప్రాయాన్ని కొన్ని వాక్యాలుగా వదిలినా, నేను కూడా నా రచనలో సమాజాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక మాట వేశాను అనుకోకూడదు.
ఒకోసారి ఒకటికి రెండు విషయాలను చెప్పిన మంచి కథలు కూడా వున్నాయి. కానీ కథ నిడివిని అనుసరించి అవకాశం వుంటే రెండు లేదా మూడు విషయాలని ఒక కథలో చెప్పటం బాగానే వుంటుంది. దీనికి కొంత చాకచక్యం, రచనా శిల్పం మీద పట్టు కావాలి. ఒక సబ్జెక్ట్ ని స్పష్టంగా చెప్తూ మరో విషయాన్ని అంతర్లీనంగా చెప్పడం ఒక మంచి పద్ధతి. రైతు సమస్య మీద కథ రాస్తూ అందులో అంతర్లీనంగా రైతు భార్య పడే ఇబ్బందిని కూడా కథలో భాగంగా అంతర్లీనంగా ప్రస్తావించడం బాగుంటుంది. అలా కాకుండా ఏదో చెప్పడం మొదలుపెట్టి ఇంకేదో విషయాన్ని వ్యాఖ్యానించడం సరైన పద్దతి కాదు. పైన చెప్పిన కథ లివ్ఇన్ రిలేషన్ గురించి అయితే కార్పరేట్ పాలసీల మీద వ్యాఖ్యానించ కూడదు. కార్పరేట్ పాలసీల మీద కథ అయితే ఆ జంట ఉండే ఇంటిని ఇల్లే కాదు అనకూడదు.
ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే రాయడం ఎంత ముఖ్యమో రాసినది కొట్టేయడం కూడా కథా రచనలో అంతే ముఖ్యమైనది. రుడ్యార్డ్ కిప్లింగ్ అనే రచయిత ఏళ్ల తరబడి తన కథని ఎడిట్ చేస్తూ వాటిని చిన్నవి, మరింత చిన్నవిగా మార్చి, కథలో అనవసరమైన వాక్యం ఒక్కటి కూడా లేదు అని నిర్థారించుకున్న తరువాతే ప్రచురణకి పంపేవాడట. ఎచ్.ఇ. బేట్స్ అనే రచయిత కథా రచనను అగ్గిపుల్లలతో కట్టిన ఇల్లు అన్నాడు. ఒక్క పుల్ల ఎక్కువ వేస్తే మొత్తం కూలిపోతుంది. ఒక్క అనవసరపు వాక్యం కథని కూల్చేస్తుంది.
ఇంతకు ముందు మనం రచయిత తాను సేకరించిన సమాచారమంతా, లేదా తనకి తెలిసిన జ్ఞానాన్నంతా కథలో ఒలకబోయడం గురించి మాట్లాడుకున్నాం. దానికన్నా ప్రమాదకరమైనది రచయితకి ఉన్న అభిప్రాయాలన్నీ కథలో చొప్పించే ప్రయత్నం చెయ్యడం. మీరు మళ్లీ ఒకసారి పైన ఉన్న కథ చదివి చూడండి. ఆ తరువాత ఒక్క నిముషం ఆగి ఈ కథ రాసిన రచయిత గురించి చెప్పండి. ఆయన ఎలాంటి వాడు (ఆమె కూడా అయ్యుండచ్చు)? ఎంత వయసు వుండచ్చు? ఈ రచయితకి ఏమైనా నిర్దుష్టమైన అభిప్రాయాలు వున్నాయా? ఏమిటవి? ప్రపంచీకరణ (Globalization) గురించి ఆయన/ఆమె అభిప్రాయం ఏమైవుండచ్చు? పురుషుడు స్త్రీ సమానమే అన్న జెండర్ స్పృహ ఈ రచయితకి వుందా లేదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించి తరువాత ముందుకెళ్లండి.
కథ చదివారా? దయచేసి పైన ఉన్న కథ మళ్లీ చదవకుండా, నేను పైన కోరినట్లు రచయిత గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లకండి. ఎందుకంటే ఇప్పుడు నేను అడగబోతున్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్తేనే ఆ తరువాత నేను చెప్పెబోయేది మీకు అర్థమౌతుంది.
పైన ఇచ్చిన కథని సూక్ష్మంగా పరిశీలించినట్లైతే మీకు ఆ రచయిత గురించి ఒక అవగాహన వచ్చే ఉంటుంది. అది వంద శాతం కరెక్ట్ అనుకోక్కర్లేదు. రచయిత వయసు నిజానికి ఇరవై అయితే మీరు డెబ్భై అని అనుకుని ఉండచ్చు. ఫర్వాలేదు. మీ విశ్లేషణ తప్పా ఒప్పా అని కాదు. తప్పైనా ఒప్పైనా అది మీరు ఎలా తెలుసుకోగలిగారు అనేది ముఖ్యం. ఇదే నేను అడగాలనుకున్న ప్రశ్న – మీరు పైన ఉన్న కథా రచయిత గురించి ఏమైనా చెప్పగలిగితే అది ఎలా తెలుసుకోగలిగారు? తెలుగు వాచకంలో ఇచ్చినట్లు ఇక్కడ రచయిత పరిచయం ఇవ్వలేదు కదా. అయినా ఎలా కనుక్కోగలిగారు?
జెండర్ స్పృహ ఈ రచయితకి ఉంది అని మీరు అనుకుంటే, అది ఎలా తెలిసింది? గ్లోబలైజేషన్ గురించి ఆయన/ఆమెకు నిరసన భావం ఉంది అనిపిస్తే, ఎందుకు అలా అనిపించింది? కేవలం కథ చదివి రచయిత గురించి ఎలా చెప్పగలుగుతున్నారు?
రండి ఇంకొంచెం లోతుగా చూద్దాం –
కథలో ఉన్న రెండు, మూడు వాక్యాలు తీసుకోని వాటి లోతుల్లోకి వెళ్దాం.
పాపం వాళ్లమ్మ మెడలో తాళిబొట్టు లేదు.
కథలో ప్రధాన పాత్ర సుహాసిని గురించి చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి మెడలో తాలిబొట్టు లేదు అని చెప్పచ్చు. కానీ దానికి ముందు “పాపం” అనే పదం ఎందుకు వచ్చింది? మెడలో తాళిబొట్టు లేని తల్లిని వర్ణించడానికి రచయిత నొచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? సుహాసిని అంటే హిందూ స్త్రీ అని ఎవరు చెప్పారు? భర్త పేరు రూబెన్ అని కూడా రచయితే చెప్పాడు కదా? ఒకవేళ ఆమె క్రిస్టియన్ అయ్యుంటే? తాళి లేకపోవడంలో “పాపం” అనాల్సిన అవసరమేముంది? కాదు ఆ అమ్మాయి హిందువే, కులాంతర, మతాంతర వివాహం చేసుకుంది అనుకుందాం. అయితే మాత్రం తాళి లేకపోతే నొచ్చుకుంటారా? ఇలా ఆలోచిస్తే రచయిత గురించి ఏం అర్థమౌతోంది?
ఈ రచయిత మనసులో ఎక్కడో ‘పెళ్ళైన ప్రతి స్త్రీ మెడలో తాళిబొట్టు ఉండాలి, అది మన సంస్కృతి, సాంప్రదాయం’ అనే అభిప్రాయం ఉంది అనిపిస్తుంది. అవునా? దీని ఆధారంగా రచయిత వయసు చెప్పచ్చు, జండర్ సృహ ఉందా లేదా చెప్పచ్చు, హిందూ సంప్రదాయం పట్ల ఉన్న అభిప్రాయాలు (అందులో నిర్దుష్టంగా, బలంగా ఉన్నవి) కనిపెట్టి చెప్పచ్చు.
ఇంకో రెండు వాక్యాలు చూద్దాం.
అది ఇల్లు అని చెప్పడానికి లేదు. పట్నంలో వుండే అన్ని ఇళ్లలాగే ఇది కూడా గాల్లో లేచిన మేడ.
అపార్ట్మెంట్లో ఫ్లాట్ని ఇల్లు అని చెప్పడానికి లేదని రచయిత అభిప్రాయం. బహుశా ఈ రచయిత బాల్యమంతా ఒక పల్లెటూరిలో, ఇండివిడ్యువల్ ఇంటిలో గడిచి ఉండచ్చు. పట్నానికి వలస (రిటర్మెంట్ తరువాత?) వచ్చి ఉండచ్చు. ఇంటి పెరట్లో ఉన్న కర్వేపాకు చెట్టు రెమ్మ దూసి నేరుగా తాళింపులో వేసే అలవాటున్న రచయిత, ఫ్రిజ్లో వారం క్రితం పెట్టిన కర్వేపాకు తీసి తాళింపులో వేస్తూ – “ఇదేమి ఇల్లు, ఇదేమి సంసారం, ఇదేమి జీవితం” అని బాధపడుతున్నట్లు వినిపించట్లేదూ?
మీరు మరీ చెప్తారండీ. కథ చదివి రచయిత జాతకం చెప్పేస్తారా? అని మీరు అడగచ్చు. అందరివీ కాదు. కానీ చాలా మంది రచయితల గురించి కథ చదివి చెప్పచ్చు. ఒక వాక్యం చూసి చెప్పలేకపోవచ్చు. ఒక కథలో అక్కడక్కడా ఉండే రెండు మూడు వాక్యాలు కలిపి చూస్తే రచయిత సాక్షాత్కారం జరుగుతుంది. పట్నం జీవన శైలి మీద ఉన్న నిరసన పైన చెప్పిన “అది ఇల్లు అని చెప్పడానికి లేదు” అనే వాక్యంలోనే కాదు – “తొమ్మిదిన్నరకి ఆ జైలులో అడుగుపెడితే ఆరున్నరకి విడుదల” అని ఆఫీస్ గురించి అన్నప్పుడు, ఇంటినిండా చిందరవందరగా బీరు బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పినప్పుడు రచయిత మనసులో ఏముందో తెలుస్తుంది.
దయచేసి మనం మరీ ఈకలు పీకుతున్నామని అనుకోకండి. ఏ పాఠకుడూ ఇలా వాక్యాలని విరిచి, పదాలను చీల్చి అందులో అర్థాలను వెతకడు అని అంటారేమో. నిజమే, ఇదంతా ఇంత పని కట్టుకోని ఎవరూ చెయ్యరు. కానీ మన మెదడు తన పని తాను చేస్తుంటుంది కదా? Impression అనే మాట ఒకటుంది. ఇంత విశ్లేషణ ప్రత్యేకంగా చెయ్యకపోయినా, చదువుతూ వెళ్తుంటే, అభిప్రాయం దానంతట అదే రూపొందుతూ ఉంటుంది.
సరే పాఠకులు రచన చదివి రచయిత గురించి తెలుసుకోగలిగారు అనుకుందాం. దాందేముంది? దాని వల్ల రచనకి వచ్చే నష్టం ఏమిటి? చెప్తాను కానీ ఇంకొక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి.
ఈ కథ లివిన్ రిలేషన్ గురించి అయితే, కథ ముగింపు ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తోంది. ఈ రచయితకి మనం పైన చెప్పుకున్న అభిప్రాయాలు/భావజాలం మనం అనుకున్నట్లుగానే ఉంటే, ముగింపు వాక్యాలు ఎలా రాస్తాడు/రాస్తుంది? ఇదే కథని ఇదే రచయిత కొనసాగిస్తే ముగింపు ఇలా ఉండబోతోందని నాకు అనిపిస్తోంది. -“నన్ను క్షమించు సుహాసిని. అతున్నతమైన మన భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించకుండా, కుటుంబం విలువని తెలుసుకోకుండా ప్రవర్తించాను. ఎండమావిలాంటి పాశ్చాత్య సంస్కృతి వైపు నేను పరుగెత్తడమే కాకుండా, నిన్ను కూడా పరుగెత్తించాను. నేను ఓడిపోయాను. అందుకు శిక్షగా నిన్ను శాస్త్రీయంగా తాళికట్టి పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాను.” అన్నాడు రూబెన్.
మీకూ అలాగే అనిపిస్తోందా? ఇదెలా సాధ్యమైంది? కథ నడుస్తున్నప్పుడు ఆ నడకని చూసి, అందులో ఉన్న వాక్యాల ద్వారా, పదాల ఎంపిక ద్వారా రచయిత గురించి ఒక అవగాహ తెచ్చుకోని కథ ఏ దిశలో వెళ్లబోతోందో, ఏ ముగింపుకి చేరుకుంటుందో కనుక్కోవచ్చన్నమాట. రచయిత భావజాలాన్ని అనుసరించి కథ నడుస్తోంది కాబట్టి ఆ రచయిత తన భావజాలాన్ని సమర్థించుకునే ముగింపే ఇస్తాడని సులభంగా ఊహించవచ్చు. ముగింపు తెలిసిపోవడం కన్నా కథకి జరిగే అన్యాయం ఇంకొకటి ఉండదు.
ఇదీ అనవసరపు వ్యాఖ్యానం, అనవసరపు వాక్యం తెచ్చిపెట్టే తంటా.
ఇలా రచయిత అదుపు చేసుకోలేని అభిప్రాయం, వ్యాఖ్యానం చెయ్యకుండా ఉండలేనితనం కథలో ఉండే టోన్ని చంపేస్తుంది. పెళ్ళి చేసుకోకుండా కేవలం లివిన్ రిలేషన్లో ఉండి గర్భిణి అయిన సుహాసిని కథ చెప్పాలంటే ఎలా చెప్పాలి. ఆ కథ ఆ అమ్మాయి సమస్యని చూపించి, ఆమె బాధని అర్థం చేసుకునేలా చెప్పాలంటే ఆ కథలో ఆర్ద్రత ఉండాలి. అలాంటి కథ మధలో ఈ తరం గురించో, అపార్ట్మెంట్ సంస్కృతి గురించో, కార్పొరేట్ సంస్థల గురించో ఉండబట్టలేక చేసిన వ్యంగ్య వ్యాఖ్య కథలో ఉండాల్సిన ఆర్ద్రతని పల్చన చేస్తుంది. కథ పాఠకులలో కల్పించాల్సిన భావనే పల్చన అయితే, కథ ఎలా నిలబడుతుంది?
అసలు కథే వ్యంగ్యా రాస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు పని చెయ్యచ్చు కానీ సంబంధం లేని విషయం గురించి కేవలం రచయిత తన కోపాన్నో, నిరసననో ప్రకటించడానికి ఆ కథని వాడుకుంటే అది ఆ కథకి నప్పదు.
రచయిత టోన్ అని కొత్త విషయం ఒకటి లేవనెత్తాను కదా. దాని గురించి అర్థం చేసుకోడానికి వీలుగా కింద ఒక కథలో భాగం ఇస్తున్నాను.
రెండు రంగులు
రాబర్ట్ గొప్ప చిత్రకారుడు. కుంచెని రంగులో ముంచి, ఒక కాన్వాస్ మీద ఎంతో లాఘవంగా చేతిని కదిలించాడంటే ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అతనికి కళ మీద తప్ప సంపాదన మీద ధ్యాస వుండదు. ఒకోసారి రాత్రీ పగలు బొమ్మలు వేస్తూ తిండి కూడా తినని వాడికి సంపాదన మీద ధ్యాస వుండకపోవటంలో వింతేముంది? తినకపోవడానికి కారణం కళారాధనే కారణం కాకపోవచ్చు. డబ్బులు లేకపోవటం కూడా కావచ్చు. ఎంత డబ్బు వుంది ఎంత డబ్బు లేదు అనేది అతని ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు. సంపాదన అనే పదం అతను మర్చిపోయి కొన్ని ఏళ్లైంది.
సంపాదన మీద ఏ మాత్రం ధ్యాస లేని వారు ఇంకొకరున్నారు. ఆయన పేరు నివాస్. మాటలు రాని పసివాణ్ణి పిలిచి అడిగినా నేను “నివాస్ అభిమానిని” అని చెప్తాడు. సినిమా స్టార్ అంటారు. కానీ అది ప్రజలకు మాత్రమే. ఆయన మాత్రం చాలా సాదా సీదాగా వుంటారు. పని కోసం భోజనం మానేసిన సందర్భాలు ఆయన జీవితంలో కూడా చాలా వున్నాయి. ఒక సినిమా కోసం కండలు పెంచాలని అన్నం, గోధుమలు మానేసి ప్రోటీన్ కోసం పధ్నాలుగున్నర రోజులు చికెన్ మాత్రమే తిన్నారు. ఆ అర రోజు కూడా వుండేవారే. హీరోయిన్ సమీర ప్రేమగా పెట్టిన ఇటాలియన్ రైస్ డిష్ కాదని ఆమెని బాధపెట్టలేక తిన్నారాయన. షూటింగ్లో వున్నప్పుడు కూడా తినాల్సి వస్తే అందరితో కలిసే తింటారు. కాకపోతే టైట్ ప్యాంట్ వేసుకుంటారు కాబట్టి మిగిలినవాళ్లు కింద కూర్చుంటే ఆయన మాత్రం కుర్చీలో కూర్చుని, అలా కూర్చోవాల్సి వచ్చిందన్న బాధలో కాస్త ఎక్కువ తింటారు.
రచయిత ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడని మీకు ఈ పాటికే తెలిసిపోయి వుంటుంది. ఈ కథలో మీకు ఏమైనా లోపం కనిపించిందా? ఇలా రాయకుండా ఉండాల్సింది అని ఏక్కడైనా అనిపించిందా?
అదనంగా మరో ప్రశ్న – ఈ రెండు పాత్రల గురించి మీకు రచయిత నేరుగా చెప్పనిది ఏమైనా తెలిస్తే అది చెప్పండి.
*
చాలా చోట్ల ఈ విమర్శ అసంబద్దంగా అని పించింది. నిర్మాణ శైలి మారిస్తే పాపతో మొదలు పెట్టకుండా వుంటే చాలా విషయాలు పరిష్కారమవుతాయి.
అసలు అన్నటి కన్నా ముఖ్యం పెళ్లి అవలేదని మెటర్నిటీ లీవు ఇవ్వక పోవడం పూర్తిగా తప్పు. అది ఒక స్త్రీ ప్రాథమిక హక్కు. కర్పొరేట్ సెక్టర్ లో స్త్రీలకు వుద్యోగాలివ్వరేమో శలవలు పెడ్తారని కానీ మెటర్నిటీ లీవు ఇవ్వకపోతే కోర్టు కెళ్లచ్చు. ఏమతమైనా పెళ్లి అయినా కాకపోయినా రూల్స అందరికి ఒక్కటే.
ఈ ఒక్క పాయింట్ మీద ఈ కథ ని రిజెక్ట్ చెయ్యాలి. మిగతావన్నీ ఈ పాయింట్ కే లింక్ అయివున్నాయి.
కథ చదివి రచయిత జాతకం…ఇంటి పెరట్లో ఉన్న కర్వేపాకు చెట్టు రెమ్మ దూసి నేరుగా తాళింపులో వేసే అలవాటున్న రచయిత…వామ్మో, జాగర్తగుండాలి.