ఉత్తరాంధ్ర వలస బతుకుల దస్తావేజు …

ఆటా బహుమతి పొందిన నవల

టు ప్రపంచాన్నీ, ఇటు భారతదేశాన్నీ 1940-50ల నాటి దశాబ్దం అతలాకుతలం చేసింది. ఆ దశాబ్దంలోనే – లెనిన్‌గ్రాడ్ దిగ్బంధం, మాస్కోలో ఎర్రసైన్యాల ఎదురుదాడి, స్టాలిన్‌గ్రాడ్ విజయం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయి. అమెరికన్ల నాయకత్వంలో ఫ్రాన్సు విముక్తి జరిగింది. బెర్లిన్‌లో ఎర్రజెండా ఎగిరింది. నాజీ జర్మనీ ఘోరంగా ఓడిపోయింది. జపాన్‌మీద అమెరికా అణుబాంబులను ప్రయోగించింది.

మన దేశంలో – బ్రిటిష్, భారతీయ సేనలు ఇంఫాల్ వద్ద జపాన్ సైన్యాన్ని నిలువరించాయి. బర్మానుండి లక్షలాది భారతీయులు కట్టుబట్టలతో, కాలినడకన దేశానికి తిరిగివచ్చారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం భారత దేశాన్ని కుదిపివేసింది. సుభాష్‌చంద్ర బోస్, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు పక్కలో బల్లెం అయ్యాడు. బెంగాల్ కరువు ముప్ఫై లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ‘నావికుల తిరుగుబాటు’ విషాదాంతంగా ముగిసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందిగానీ, దేశవిభజన శాశ్వత విషాదాన్ని రగిలించింది. గాంధీజీని మతోన్మాదులు హత్యచేశారు.

యుద్ధానంతర కాలంలో – ఫాసిస్టుల అకృత్యాలు, జననష్టం వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ ఆధిపత్యం అంతరించింది. సోషలిజం, కమ్యూనిజం ఆశాజ్యోతులుగా వెలిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్‌లు అగ్రరాజ్యాలుగా అవతరించాయి; ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.

పై పరిణామాలు భారతీయులందరిపైనా ఏదో ఒకమేరకు తన ప్రభావాన్ని చూపాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, బర్మా కాందిశీకుల అనుభవాలకు సాహిత్యంలో, సామాజికశాస్త్ర పరిశోధనలలో తగిన స్థానం,   ప్రాచుర్యం లభించలేదు. ఆ దశాబ్దపు సంక్షోభాన్ని ఆధారంగా చేసుకొని బర్మా విషాదంపై నవలను వ్రాయాలనే ప్రగాఢమైన కోరిక ఈ రచనకు దారితీసింది.

-ooo-

ప్రపంచవ్యాప్తంగా – సామ్రాజ్యవాద దేశాలకు వ్యవసాయ కూలీలు, శ్రామికులు అవసరం అయ్యారు. వరి, గోధుమ పంటలకే కాకుండా ప్రత్తి, చెరుకు, టేకు, వెదురు, రబ్బరు, కాఫీ, టీ, ద్రాక్ష, పండ్లు, కూరగాయలు – ఈ తోటల్లో వారి సేవలు అత్యవసరం అయ్యాయి. అప్పటికే బానిసవ్యవస్థ రద్దయింది. వ్యావసాయక నిపుణత కలిగిన భారతీయ శ్రామికుల్ని పెద్ద ఎత్తున ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి చెయ్యడానికి ‘కూలీ ఓడలు’ వినియోగింపబడ్డాయి.

కూలీ వ్యవస్థ (indentured labour) నిషేధించబడే నాటికి (1920) సుమారు 13 లక్షల మంది భారతీయ వ్యవసాయ కూలీలు వలస దేశాలకు ‘ఎగుమతి’ అయ్యారు. ఆ తరువాతి ప్రవాసాలన్నీ ఉపాధి కోసం చేసిన స్వచ్ఛంద ప్రయాణాలే. వ్యవస్థ ఏదైనప్పటికీ, ఆ శ్రమజీవులకు చదువు లేదు. వీసాలు, కాంట్రాక్టులు, హక్కులు, కనీస భద్రత లేవు.

ఆ కోవకి చెందిన వ్యవసాయ కూలీలను అందించిన ప్రాంతం, ఆర్థికంగా వెనుకబడిన, వర్షాధార ప్రాంతమైన కళింగాంధ్ర; ముఖ్యంగా – ఇచ్ఛాపురం, టెక్కలి పట్టణాల మధ్య ఉన్న తీర, మైదాన ప్రాంతమైన ఉద్దానం. (ఉద్యానం నుండి ఉద్దానం అనే పదం పుట్టిందంటారు).

-ooo-

రెండు దశాబ్దాలబాటు (1920-1940) సుందర స్వప్నంగా నిలిచిన బర్మాదేశం, రెండవ ప్రపంచ యుద్ధంతో  పీడకలగా మారి, విషాద వృత్తాంతంగా మిగిలిపోయింది. అసంఖ్యాకులైన సామాన్యుల ప్రాణాలను బలిగొన్న బాటల వెంట, ఆనవాళ్లు లేకుండా చెదరిపోయిన వారి పాదముద్రలకై మొదలుపెట్టిన అన్వేషణ ఈ ప్రయత్నం.

అయితే గతాన్ని తలచి వగచుట ఈ నవల లక్ష్యంకాదు. రెండవ ప్రపంచ యుద్ధంతో మానవ సమాజం త్వరితగతిన మారిపోయిందనీ, ఈ మార్పులను కొన్నిశక్తులు నడిపిస్తున్నాయనీ, వాటిపట్ల జాగరూకతను కలిగి ఉండాలనీ హెచ్చరించడం దీని ముఖ్యోద్దేశ్యం.

*

నవల నుంచి…

“నల్లదారి బాగా ఉత్తరానికి పోతుంది. దట్టమైన అడవి, నిట్టనిలువుగా ఉండే ఎత్తైన కొండలు దాటుకుంటూ వెళ్లాలి. పెద్ద నదులేవీ తగల్లేదు; వాగులు, గెడ్డలూ చాలానే దాటాం. కాలిబాటలు అక్కడక్కడ కనిపిస్తాయిగానీ, రోడ్డంటూ లేదు. ఆ దారిన వెళ్లినవాళ్లెవరూ ఉండరు; అందరికీ కొత్తే. ఎప్పుడైనా స్థానికులు కనబడితే వాళ్లని అడగడమే. మన భాష వాళ్లకి రాదు; వాళ్ల భాష మనకి తెలీదు.”

తెల్లదారిలో ఏనుగుల గుంపుతో తాము చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకుటూ, రాంబాబు – “ఆ దారి వెంట నడవాలని మీకెలా తెలిసింది? మ్యాపులున్నాయా? దారి తెలిసిన వాళ్లెవరైనా వెంట ఉన్నారా?” అని అడిగాడు.
“మ్యాపులా, పాడా? అందరితో బాటు నడవడమే. మనం నాలుగడుగులు గబగబా వేస్తే మన సహచరులు మారిపోతారు. వెనకబడ్డామంటే మరో గ్రూపులో కలిసిపోతాం. అంతులేని తీర్థ ప్రజ. దారిపొడుగునా మా నెత్తిన, ఆకాశమార్గాన విహరించే రాబందుల గుంపులు. అవే మనకు దారిని సూచిస్తాయి.”
“మొదట మ్యిట్‌క్యినా అనే ఊరు చేరుకోవాలి. అది మాండలేకి బాగా ఉత్తరాన ఉంటుంది. రోడ్డు బాగా చెడిపోయింది. ఆర్మీ వాహనాలకు తప్ప వేరెవరికీ అనుమతి లేదు. ఎడ్ల బళ్లు, నడక – ఏదో విధంగా చేరుకున్నాం. బస్సులో అయితే ఒక రోజులో చేరుకొనే వాళ్లం. మాకు వారం రోజులు పట్టింది. అప్పుడు మొదలయ్యాయి మా కష్టాలు. మొదట హుకాంగ్ లోయని దాటి మళ్లీ కొండలెక్కాలి. పాంగ్‌సౌ కనుమ గుండా ఇండియాలో ప్రవేశిస్తాం. అక్కడినుండి అస్సాంలో ప్రయాణించే దారులు ఉంటాయి. ట్రక్కులో, బస్సులో – ఏవో ఒకటి దొరికిపోతాయి. తీన్‌సుకియా స్టేషన్ చేరుకొని, ట్రెయిన్ పట్టుకున్నాను. కలకత్తా చేరుకున్నాను. మొత్తం అన్ని మైళ్లూ నడిచామని కాదు; ఎడ్ల బళ్లూ, ట్రక్కులూ, గూడ్సు రైళ్లూ, పడవలూ – ఏవి దొరికితే అవి వాడుకుంటూ వెళ్లాం – అడవిని, కొండల్ని చేరుకొనేంతవరకూ. ఆ తరవాత నడకే, ఇండియా బోర్డర్‌ చేరే వరకూ. ఇదీ నా ప్రయాణం. చెప్పుకుంటే ఇంతే. ఇది పెద్ద విచిత్రమేమీ కాదు, కానీ ఆ దారిలో మాకెదురైన అనుభవాలు?!…ఒకటా, రెండా?”
“మాండలే నుంచి సుమారు 800 మైళ్లు. మూడువారాలు అనుకున్నది రెండు నెలలు పట్టింది. దూరం కన్నా కొండలూ, లోయలూ, అడవులూ, రోగాలూ, తిండీ తిప్పలూ, దారి దొంగలూ – ఇవే అసలు సమస్యలు. చెబితే ఇంతే. అప్పుడుపడ్డ అవస్థలూ, చూసిన ఘటనలూ వివరించడం కష్టం; నరకయాతన అంటే అదే.”
“దారిదొంగలు కూడానా?” ఆశ్చర్యపోయాడు రాంబాబు.
“బర్మావదిలి వెళుతూన్న భారతీయులందరి వద్దా ఎంతో కొంత బంగారం ఉంటుందని అధికారులకే కాదు, దొంగలకు కూడా తెలుసు. ఆ బంగారం కోసం లెక్కలేనన్ని దోపిడీలూ, హత్యలూ జరిగాయి. తిండిలేకో, జబ్బుపడో మరణించినవారి శవాల బట్టలూడదీసి, బంగారం కోసం గాలించడం సర్వసాధారణం అయిపోయింది. నగ్నంగా పడిఉన్న శవాల జోలికి దొంగలు కూడా పోయేవారుకాదు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చేశారని వాళ్లకి తెలుసు. ఎవరెవరు ఏవిధంగా మరణించారో, వాటిల్లో హత్యలెన్నో – ఈ వివరాలు సేకరించేందుకు అధికారులకు ఆసక్తీ లేదు, అంత వ్యవధీ లేదు. లేచే శక్తి లేక, కొనప్రాణంతో మూలుగుతూ పడి ఉన్నవాళ్లని నాలుగు దెబ్బలు కొట్టిమరీ దోచుకున్నారు. బాగా దట్టమైన అడవుల్లోకి వెళ్లాక దొంగలభయం  తగ్గిపోయింది. ఊళ్లకి దగ్గరలో ఉన్నప్పుడే దొంగల రాకపోకలు ఎక్కువ. మనవాళ్లెవరూ దోపిడీలు చెయ్యలేదని నేను చెప్పగలను.”
“అంతలా దోపిడీలు అవుతూంటే అడ్డుకొనేవాళ్లే లేరా? ఆ దారి వెంట ఎక్కడా పోలీసు స్టేషన్‌లు లేవా?” రాంబాబుకి సందేహం కలిగింది.
“అసలక్కడ పోలీసు వ్యవస్థగానీ, ఆ మాటకొస్తే ప్రభుత్వానికి సంబంధించిన ఏ యంత్రాంగమూ లేదు. ఆసుపత్రులూ, డాక్టర్లూ, నర్సులూ, మందులూ మర్చిపో. అక్కడక్కడ అధికారులం అని చెప్పుకుంటూ, మమ్మల్ని అడ్డుకుంటూ లంచాలు గుంజుకొనే వాళ్లు మాత్రం చాలామందే తగిలారు.”

“తెల్లదారిలో వస్తూ రాత్రిపూట మంటలు వేసుకొనేవాళ్లం. జంతుభయంతో,” అన్నాడు, రాంబాబు.

*

ఉణుదుర్తి సుధాకర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు