రోజూ చూస్తున్న కన్నీళ్లే ఈ అక్షరాలు

“తన ప్రాంతం ప్రజలు సమూహాలు మాట్లాడుకునే భాషా ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలుగా మొదలై అనంతరం రాజకీయ ఉద్యమాలుగా రూపాంతరం చెందుతాయి.”

జూకంటి జగన్నాథం గత ఐదు దశాబ్దాలుగా కవిత్వ సృజన చేస్తున్నారు. ఈ 20 జూన్ నాటికి డెబ్భై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. పాతాళ గరిగె (1993) తో మొదలుకొని ఇప్పటి వరకు 18 కవితా సంపుటాలు, ఒక కథల సంపుటి, ఒక వ్యాస సంపుటి ప్రచురించారు. అను నిత్యం స్పందిస్తూ సామాజిక రాజకీయ ఆర్ధిక చలనాలను పసిగట్టి లోచూపునిస్తున్నారు. జూకంటితో  బూర్ల వేంకటేశ్వర్లు చేసిన ముఖాముఖి…

  1. కవిత్వ సృజన పట్ల మీకు ప్రేరణ కలిగించిన అంశాలు పరిస్థితులు ఏమిటి?

#కవిత్వ  సృజనలో నాకు సిరిసిల్ల పౌర గ్రంథాలయంలోని పుస్తకాలు, వెంకటరాజం సార్ తెప్పించి చదువుకొమ్మని ఇచ్చిన మాస, వార పత్రికలు ప్రాథమికంగా నాలోని సాహిత్య కారునికి జీవగంజి పోశాయి. అయితే, ఇప్పుడు ఏడుపదుల వయస్సులో  తిరిగి లోతుగా వెనక్కి చూసుకుంటే చదివిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అయితే, మరో ఎత్తుగా సమాజం ప్రజలు నాకు మిక్కిలి ప్రేరణ కలిగించిన అంశాలుగా అనిపిస్తున్నాయి.

2.వస్తువు కవిత్వంగా మారే క్రమంలో జూకంటి వాడే ప్రతీకలు భావ చిత్రాల కుదుళ్లను సారవంతం చేసే      అంశాలు ఏమిటి?  ప్రాంతీయ భాష, ప్రామాణిక భాష, శాస్త్ర పరిభాషలను కవిత్వ భాషలోకి ఎట్లా మలుస్తారు?

#నాకే కాదు, ఏ కవికైనా తమ అధ్యయనం, అనుభవం, దృక్పథం ద్వారా ఒక సున్నితమైన లోచూపు ఏర్పడుతుంది. తను చూసిన, గమనించిన, పరిశీలించిన కవిత్వ వస్తువులను ఎన్నిక చేసుకొని తన అనుభవం, దృక్పథం ఏర్పరచుకున్న వాతావరణం నుంచి తన ప్రజలు అనుభవిస్తున్న ఆటుపోట్ల నుంచి జనం మాట్లాడుతున్న భాష నుంచి ఆ వస్తువు అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించినట్టుగానే కంసాలి  ఆభరణంలో రంగురంగుల రాళ్లను ఒదిగించినట్టుగా ఆ భావ చిత్రాలతో వస్తువు సారభూతం చెందుతుంది.

  1. ‘డిక్షన్’ నిత్య నవీనంగా రూపొందడానికి జూకంటి చేస్తున్న కృషి ఏమిటి?

#మన ఆలోచనలను భావనలను వ్యక్తీకరించే క్రమంలో భాషను ఆశ్రయిస్తాం. దాన్ని ‘డిక్షన్’ అని ఆంగ్లంలో అంటున్నారు. డిక్షన్ నిత్య నూతనంగా ఉండడానికి కారణం మన చుట్టూ ఉన్న  ప్రజలు మాట్లాడుకుంటున్న మాటల్లో చేరుతున్న కొత్త పద జాలం నుంచే నేను కవిత్వంలోకి వొంపుకుంటాను. అత్యాధునిక కాలంలో ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న సమాజంలోకి మనుషులలోకి కొత్త కొత్త పదాలు వచ్చి నివాసం ఏర్పరచుకుంటాయి. వాటిని గ్రహించే శక్తి తన సృజన కవిత్వంలోకి సహజంగానే డిక్షన్  లోకి వచ్చి ఎప్పటికి నిత్య నవీనంగా ఉంటుంది. అయితే, డిక్షన్  అనేది అడిక్షన్, నాకే కాదు ఏ కవికైనా కాకూడదు.

  1. ప్రజల మీద ప్రపంచీకరణ పరిణామాల ప్రభావం ఏమిటి, దానికి విరుగుడు ఏమిటి? అభివృద్ధి విధ్వంస కోణాల వైరుధ్య భావనల గురించి మీ అభిప్రాయం ఏమిటి?

#1990 తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాల కారణంగా స్వేచ్ఛ మార్కెట్కు తలుపులు తెరిచినారు. సామ్రాజ్యవాదం మరో రూపం ప్రపంచీకరణ పేరును మార్చుకొని ఆయా దేశాల ప్రజల మూలుగులను పీల్చే  విఫణిని విస్తరించారు. ఆయుధాలు అమ్మకం ద్వారా ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచి అగ్రరాజ్యాలు ఆయుధాల అమ్మకం చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రపంచీకరణకు విరుగుడుగా నిలబడేది కలెబడేది అంతిమంగా ప్రాంతీయతనే. సకల కళారూపాలు ఇటీవల కాలంలో ప్రాంతీయ అస్తిత్వంతో విలసిల్లుతున్నాయి.

  1. అస్తిత్వ ఉద్యమాలు అవి సాగుతున్న తీరు, సాధించిన ప్రయోజనాలు, నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏమిటి?

#అస్తిత్వ ఉద్యమాల పుట్టుక, మనుగడ, కొనసాగింపులు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మున్ముందుకు పోతాయి. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో భాషా సాహిత్యాలపై చిన్న చూపు ఒక శక్తివంతమైన కారణం ముందుకు తెచ్చింది. నాటి పత్రికలు, ప్రచార సాధనాలు, తెలంగాణ భాషా సాహిత్యాలకు అవకాశం ఇచ్చేవి కాదు. అస్తిత్వ ఉద్యమాల కారణంగా ఈరోజు తెలంగాణ భాష లేని వ్యక్తీకరణలు  లేకుండా ఉండే అవకాశం లేదు. వారి ఆశయాలను ఆస్తిత్వ ఉద్యమం సాధించింది అని చెప్పాలి. తన ప్రాంతం ప్రజలు సమూహాలు మాట్లాడుకునే భాషా ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలుగా మొదలై అనంతరం రాజకీయ ఉద్యమాలుగా రూపాంతరం చెందుతాయి. తన ప్రయోజనాలను నెరవేర్చుకునే దిశగా బాధ్యతాయుతంగా పనిచేసే అస్తిత్వ ఉద్యమాలు సఫలీకృతమవుతాయి.

  1. జూకంటి ప్రాంతీయ కవా? ప్రపంచీకరణ కవా? ధిక్కారకవా?

#నేను ప్రాంతీయ కవినా లేక ప్రపంచీకరణ కవినా ,  ధిక్కార కవినా అని ఆలోచించుకొని నేనెప్పుడూ నా కవితా యాత్రను కొనసాగించలేదు. నేను 1975 తర్వాత నుంచి రాస్తున్నప్పటికీ 1986 నుండి వివిధ పత్రికలలో వచ్చిన కవిత్వాన్ని కలిపి 1993వ సంవత్సరం “పాతాళ గరిగె “పేరుతో కవితా సంకలనం తీసుకువచ్చాను. అందులో ప్రధానంగా కోల్పోతున్న విలువలు పతనం అవుతున్న మనిషి చుట్టూ ధ్వంసం అవుతున్న సమాజం గురించిన అంశాలతో ఆ సంకలనం తీసుకువచ్చాను.

అనంతరం దేశంలో 1990లో వచ్చిన నూతన ఆర్థిక విధానాల స్వేచ్ఛ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ల (ఎల్ .పి.జి.) ప్రభావం వలన, గ్రామాలు వ్యవసాయం విధ్వంసం  కానున్నదనే హెచ్చరికతో “ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” అనే కవిత సంకలనాన్ని తీసుకువచ్చాను. అప్పుడు నన్ను  ప్రాంతీయ కవిగా ప్రపంచీకరణ కవిగా ఏవేవో పేర్లను తగిలించి నాకు ఆపాదించారు.

తెలంగాణకు ముందు, ఏర్పడిన అనంతరం నేను ప్రజల వైపు నుంచి కవిత్వం రాస్తే నన్ను ధిక్కార కవి అన్నారు. ఏది ఏమైనా నేను మాత్రం ప్రజల నుంచి కవిగా నా కవిత్వాన్ని వినిపిస్తాను, వినిపిస్తూనే ఉంటాను. అది ప్రజలకు వ్యతిరేకమైతే ఆధిపత్య వ్యవస్థ మొత్తాన్ని వ్యతిరేకిస్తాను. కొందరు వారి బతుకుతెరువు కోసం నన్ను ప్రభుత్వ వ్యతిరేక కవి అని కూడా అన్నారు.  ఇప్పటివరకు, ప్రతి సందర్భంలో ఒక ప్రత్యేకమైన  విషయంతో కవితా సంకలనాల్ని తీసుకువచ్చాను. ప్రజల బాధను చూసి అదిలిపోయి, ఏమి చేయలేని దశలో ప్రజలు కళ్ళు నీళ్లు పట్టుకుంటే నేను కదిలిపోయి కవిత్వాన్ని రాస్తూ వస్తున్నాను.

*

బూర్ల వెంకటేశ్వర్లు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు