బావరి, బుద్ధుడు, అంబేడ్కర్: గతంనుండి వర్తమానంలోకి

‘A’ – చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథా సంకలనం

సంకలనంలోని ‘బావరి’ కథ ఆధారంగా బౌద్ధానికిగల సమకాలీనతపై దృష్టిని సారించడం ఈ వ్యాస లక్ష్యం. ‘బావరి’ బుద్ధుడి జీవితకాలంనాటి కథ; బౌద్ధం తొలి దశనాటి కథ. పైగా చారిత్రక రచన. చారిత్రక రచనలను బేరీజు వేయడానికి నేను మూడు గీటురాళ్లను ఎంచుకుంటాను. మొదట కథాంశాన్ని చారిత్రక గతితార్కిక శక్తుల చర్య, ప్రతి చర్యల ఆధారంగా చూస్తాను. రెండవది – ఆ రచనలో ప్రస్తావించిన గతాన్ని ఏ మేరకు వర్తమానంతో అన్వయించగలం? అని ప్రశ్నించుకుంటాను. ఇక మూడవది – ఆ రచనలో పాత్రలు, ఏ మేరకు చరిత్ర చేతిలో పనిముట్లుగా ఉన్నాయి? ఏ మేరకు చరిత్ర గతిని మార్చే దిశలో సాగాయి? అని చూస్తాను. విషయసేకరణ, పరిశోధన, చారిత్రక వాస్తవాలు – ఇవి కనీస లక్షణాలు. ఇవి లోపిస్తే ఆ రచనను పట్టించుకోను. ఇవాళ మతోన్మాదులు చరిత్రని వక్రీకరిస్తున్నారు. వాటిని విశ్లేషించడం వృధాప్రయాస.

‘మహాప్రస్థానం’లోని ‘దేశచరిత్రలు’ గేయంలో శ్రీశ్రీ, ‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను,’ అంటాడు.   మన దేశంలో కొన్ని వేల ఏళ్లుగా కొనసాగుతూన్న సంఘర్షణ ఒకటి ఉన్నది. అది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా కులవ్యవస్థకు వ్యతిరేకంగా నడుస్తూన్న సంఘర్షణ. ఈ సంఘర్షణకు ఆద్యుడు, మూల పురుషుడు బుద్ధుడైతే, దాని ఆధునిక యోధుడు బాబాసాహెబ్ అంబేడ్కర్. అటు బుద్ధుడుగాని, ఇటు అంబేడ్కర్‌గాని ఆయుధాలతో కాకుండా, శాంతియుతంగా, హేతుబద్ధంగా, క్రియాశీలంగా పోరాడారు.

ఒక సంఘర్షణను రెండువేల ఐదువందల ఏళ్లకుపైగా కొనసాగించాల్సిన అగత్యం అనేదే భారతీయ సమాజానికి శాపం. భారతదేశాన్ని కులవ్యవస్థ అనే జాడ్యం, ఎంత తీవ్రంగా పట్టిపీడిస్తున్నదో ఇందుమూలంగా మనకు తెలుస్తోంది. అదే సమయంలో ఆ దీర్ఘకాలిక పోరాటం, మన దేశ చరిత్రకి, సంస్కృతికి మొత్తం ప్రపంచానికి అందించిన మహోన్నతమైన ప్రేరణ. ఆ పోరాటం నేటికీ కొనసాగుతున్నదని ఒకే ఒక్క ఉదాహరణ ద్వారా చెప్పుకోవచ్చు.

ముస్లిం పాలకులు నిర్మించిన మన హైదరాబాదులో హుస్సేన్ సాగర్ ఉంది. కొంత కాలం క్రితం హుస్సేన్ సాగర్ మధ్య బుద్ధుడి విగ్రహం వెలిసింది. నిన్నగాక మొన్న, తెలంగాణా సెక్రెటేరియట్ భవనం ముంగట, అదే హుస్సేన్ సాగర్‌ని ఆనుకొని, ‘భారతదేశ చరిత్ర యావత్తూ, బౌద్ధానికి, హిందూ ధర్మానికీ జరుగుతూ వస్తూన్న సంఘర్షణ మాత్రమే,’ అని ప్రకటించిన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వెలిసింది. ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడని మనకు తెలుసు. ఆ ప్రేరణతో లక్షలాదిమంది – ముఖ్యంగా మహారాష్ట్రలో – బౌద్ధంవైపు మళ్లారు.

విగ్రహాలు ప్రతీకలే కావచ్చు; రాజకీయ ప్రయోజనాలకోసం నిర్మించినవే కావచ్చు. అయితే వాటికి ఒక ప్రాసంగికత, సమకాలీనత ఉన్నాయని పాలక వర్గాలతో సహా ప్రతీ ఒక్కరూ నేడు గుర్తిస్తున్నారు. రాజకీయ ప్రాధాన్యత ఏర్పడ్డాక, భారతీయ సమాజంలో విగ్రహాలు, దేవాలయ నిర్మాణాలకు, ప్రాణప్రతిష్టలకు ప్రభుత్వ సహకారం మొదలవుతుంది. వీటిల్లో రాజ్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుంది. తక్షణ రాజకీయాలే ప్రాచీనతకు సమకాలీనతను ఏర్పరుస్తాయి.

బౌద్ధ ధర్మం ప్రాచీన చారిత్రక విశేషం మాత్రమే కాదు. బౌద్ధానికి, బౌద్ధగాథలకు సమకాలీనత ఉన్నది. గతానికీ, వర్తమానానికీ బౌద్ధం సంధిస్తూన్న బంధం ఉన్నది. ఆ బంధం రోజురోజుకీ మరింత బలపడుతూన్నది. ‘చరిత్ర అనేది, గతానికీ, వర్తమానానికీ నిరంతరంగా జరిగే సంభాషణ,’ అంటాడు, ఈ.ఎచ్. కార్. మన వర్తమాన అవగాహనే మన చరిత్రను నిర్దేశిస్తుంది అని కూడా అంటాడు. మీ అస్తిత్వాన్ని బట్టి, మీ అవగాహనను బట్టి మీ చరిత్ర ఉంటుంది. అందుచేత ఎవరి చరిత్ర వారికి ఉంటుంది. ఇక ఈ కథ విషయానికి వద్దాం.

బౌద్ధంలో ఎన్నో గాథలు, కథలు ఉన్నాయని మనకు తెలుసు. అవన్నీ కూడా అద్భుతమైనవే. సత్యదర్శనం చేయించేవే. బౌద్ధం ఒక ధర్మంగా ఏర్పడ్డ తొలిదశలో, అంటే బుద్ధుడి జీవితకాలంనాటి అత్యంత ప్రాచీనమైన గాథల్లో బావరి కథ ఒకటి.  బావరి అనే మునీశ్వరుడు, లేదా గురువుగారి కథకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది అది బుద్ధుడి కాలంనాటి ఉదంతం కావడం; ఇక రెండవది ఆ సంఘటనలో ప్రస్తావించబడ్డ బావరి, అతని శిష్యులూ తెలుగు ప్రాంతానికి – నిజానికి నేటి తెలంగాణా ప్రాంతానికి, గోదావరీ తీరానికి చెందిన వ్యక్తులు కావడం. ఈ రెండు కారణాల చేతా బావరి గాథ ప్రాచీనమైనదే కాకుండా, మన ప్రాంతానికి చెందినది. తెలుగువారికి ఆత్మీయమైనది.

బావరి శిష్యులు పదహారుమంది గురువుగారి ఆదేశం మేరకు, ఆనాటి పరిస్థితుల్లో, అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఉత్తర భారతదేశానికి వెళ్లి బుద్ధుడిని దర్శించుకున్నారనీ, ఆయన్ను ప్రశ్నించి తమ సందేహ నివృత్తి గావించుకున్నారనీ మనకు బౌద్ధ ఆధారాలు తెలుపుతున్నాయి. అలా వెళ్లినవాళ్లల్లో ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారనీ, మిగతా పధ్నాలుగు మందీ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి, ఉత్తరదేశంలోనే ఉండిపోయారనీ మనకు తెలుస్తున్నది. అలా వచ్చిన శిష్యుల పేర్లూ, వారడిగిన ప్రశ్నలకు బుద్ధుడు ఇచ్చిన సమాధానాలూ ‘సుత్త పిటక’లోని ‘సుత్తనిపాత’లో నమోదయ్యాయి.

ఈ విశేషాలన్నిటినీ జోడిస్తూ శర్మగారు వ్రాసిన ఈ కథ ఎంతో విశిష్టమైనది. బౌద్ధచరితలో భాగమైన ఆనాటి సంఘటనలను, ఎంతో పరిశోధనచేసి, పఠనీయంగా, కథారూపంలో మనకు అందజేసిన శర్మగారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.

బుద్ధుని జీవిత కాలంనాటి గణరాజ్యాలలో ప్రజస్వామ్యం, భిన్నాభిప్రాయాలు, నూతన పోకడలు వెల్లి విరిసాయి. కొత్త ఆలోచనలకు, తాత్విక ధోరణులకు, ప్రజలు స్వాగతం పలికారు. అది ఎంత గొప్ప కాలం?! నిత్య సంచారులైన సాధువులను సామాన్య ప్రజలు, వ్యాపారులు, రాజవంశీకులు అత్యంత గౌరవంగా సేవించిన కాలం. చిన్న రాజ్యాలు ఫెడరల్ స్ఫూర్తితో స్వయం ప్రతిపత్తిని చేరుకున్నాయి. అదే కాలంలో వ్యవసాయం, వాణిజ్యం వృద్ధి చెందాయి. క్రతువులు, తంతులు – వీటితో ప్రజలు విసుగెత్తిపోయారు. కొత్త దారులకై అన్వేషణ మొదలైంది.

బావరి స్నాతకోత్సవం సందర్భంగా వేదపండితులతో బాటుగా జైనులు, బౌద్ధులు, అజీవకులు, లోకాయుతులు, క్రియావాదినులు, అక్రియావాదినులు…వీరంతా వేంచేసారని రచయిత మనకు తెలియజేస్తాడు. తరువాతి దశలో బుద్ధుడి ప్రధాన శిష్యులుగా అవతరించిన శారిపుత్రుడు, మౌగ్గల్యాయనుడు కూడా వస్తారని చెప్పినప్పుడు మనకొక గగుర్పాటు కలుగుతుంది. ఇది ఆనాటి భిన్నత్వానికి, సహనానికి సూచన. అలాగే యుక్తవయస్కుడైన బావరి సభ ముగిసేసరికి ‘ఏది విద్య, ఏది అవిద్య?’ గందరగోళానికి గురి అవుతాడు. అప్పుడు చార్వాకులకు ఆద్యుడైన అజితకేశ కంబళుడు స్వయంగా వచ్చి, తర్కమే సంశయ నిర్మూలన చేస్తుందని చెబుతాడు. పాఠకులకు మరో గగుర్పాటు!

బావరి భార్య స్వయంగా పూనుకొని, భర్తను తన మూలాలను అన్వేషించమని ప్రోత్సహిస్తుంది. ఆమె పట్టుబట్టకపోతే బావరి దక్షిణదిశలో ప్రయాణించే అవకాశమేలేదు. బావరిని కన్న తల్లిదండ్రులు ఆంధ్రపథంలోని పోతలి ప్రాంతం వారని ఆమె నోటనే తెలుసుకుంటాడు. ఈ కథలోని మరో విశేషం ఏమిటంటే, బుద్ధుని జీవితగాథను నేపథ్య సంగీతంలా ధ్వనింపజేయడం. అది ఎన్నిమార్లు విన్నా పులకింపజేసే గాథ. రచయిత చేసిన ఈ అతిసుందరమైన అల్లిక – మనల్ని ముగ్ధుల్ని చేస్తూనే, బావరి కథను ముందుకి నడిపిస్తుంది.

ఙ్ఞానోదయం అయ్యాక బింబిసారుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకొనేందుకై బుద్ధుడు రాజధానికి వెళ్తాడు. కొంతమంది బ్రాహ్మణులు రాజుని వారిస్తారు; బుద్ధుడితో సమావేశాన్ని బహిష్కరిస్తారు. కొంతమంది మాత్రం బింబిసారుని వెంటవెళ్లి తథాగతుడిని కలుసుకుంటారు; అతడి బోధనలు వింటారు. ‘అసలైన బ్రాహ్మణుడెవరు?’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఇవన్నీ బౌద్ధ గాథల్లో ఉన్నవే. బావరి గురువైన సోనానందుడు ఆ బ్రాహ్మణుల్లో ఉండడం ఈ కథలోని విశేషం. బుద్ధుని బోధనలను అంగీకరించిన బ్రాహ్మణులను కూడా అహం పూర్తిగా వీడలేదని రచయిత సూచిస్తాడు. కులవ్యవస్థ సమూలంగా మారడమనేది ఎంత దుర్లభమో మనకి తెలియజేస్తాడు. బుద్ధం, ధర్మం – ఇవి మాత్రమే కాకుండా సంఘం కూడా ప్రత్యామ్నాయంగా, సజీవంగా ఎదగాలని మనకు తోస్తుంది.

ఒక బ్రాహ్మణుడి ఆగ్రహానికి గురై, శాపగ్రస్తుడైన బావరి ఆ శాపపు అంతరార్థాన్ని తెలుసుకొమ్మని తన శిష్యులు పదహారు మందిని తథాగతుని వద్దకు పంపుతాడు. వారితోబాటు పాఠకులూ ప్రయాణిస్తారు. నదీనదాలూ, ఆనాటి పట్టణాలూ, నగరాలూ – ఒకటా, రెండా? – అన్నిటినీ దాటుకుంటూ, బుద్ధ చరితలో వాటి ప్రశస్తినీ, అనుబంధ గాథలనూ మననం చేసుకుంటూ రాజగృహలో బుద్ధుడు నివసించిన గంధకుటిని చేరుకుంటాం. ఆ ప్రయాణమే ఒక గొప్ప అనుభవం; అదొక పుణ్యక్షేత్ర పర్యటన, ఎట్టకేలకు శాక్యముని దర్శనం! ఎంతమందికి ఆ మహాభాగ్యం దక్కుతుంది?

భౌగోళిక వివరాలను, ఆనాటి జీవనాన్ని, వివిధ వృత్తులను రచయిత ఉటంకించిన తీరు మనల్ని ఆ కాలంలోకి లాక్కుపోతుంది. ఏది వాస్తవమో, ఏది రచయిత కల్పనో తెలియకుండా కలగలసిపోతాయి. ఏ చారిత్రక రచనకైన ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇది. అంతేకాదు, అలనాటి గణరాజ్యాలనూ, ప్రదేశాలనూ గుర్తించే భౌగోళిక చిత్రపటాన్ని కూడా కథలో పొందుపరచారు!

బుద్ధుడిని దర్శించడానికై ఉత్తరదేశానికి పయనం కట్టిన పదహారుమంది శిష్యులలో ఇద్దరు మాత్రమే తిరిగివస్తారు. మిగతా పధ్నాలుగు మందీ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి అక్కడే ఉండిపోతారు. నాలుగు పరమ సత్యాలను, అష్టాంగ మార్గాన్ని శ్లాఘిస్తూ బావరి తనువు చాలించడంతో కథ ముగుస్తుంది.

బౌద్ధం తొలి దశనాటి సంఘర్షణ భిన్నమైనది. అది భావజాల ప్రధానమైనది. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే, మొదట ఉపరితలంలో వచ్చిన సంఘర్షణ. అది పునాదిని చేరుకున్నప్పుడే సంక్షోభంగా మారింది. నిజానికి బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య కాంక్ష, ప్రధానంగా విద్యావంతులైన, అగ్రవర్ణ, ఉన్నత, మధ్యతరగతి వ్యక్తుల ద్వారానే మనదేశంలో వ్యాప్తి చెందింది. మార్క్సిజం కూడా అదే దారిలో ప్రవేశించింది. ఎప్పుడైతే తిరుగుబాట్లను ప్రోత్సహించే భావజాలాలు, మేధావర్గానికి పరిమితంకాకుండా సామాన్య ప్రజలను చేరుకుంటాయో, రాజ్యాధికారానికి పక్కలో బల్లెంగా మారతాయో,  అప్పుడే రాజ్యం ఆ శక్తులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుంది. భిన్న భావజాలాలు మర్యాదస్తుల వేదికలలో చర్చలుగా, వనరుల పంపిణీలలో బేరసారాలుగా, లావాదేవీలుగా కొనసాగవు. బౌద్ధం విషయంలో కూడా ఇదే జరిగింది.

విచిత్రం ఏమిటంటే బుద్ధుడిపట్ల ఏర్పడ్డ సర్వవ్యాపితమైన ఆరాధనాభావంలోగానీ, అంతర్జాతీయ స్థాయి కలిగిన అంబేడ్కర్‌ని కనీసం జాతీయ నాయకుడిగానైనా కాకుండా, కేవలం బహుజన-దళిత నాయకుడిగానే గుర్తించడంలోగానీ – ఆ ఇరువురి బోధనలని పూర్తిగా ప్రక్కన పెట్టి, వారి విగ్రహాలను ఆవిష్కరించేందుకు మాత్రమే పాలకులు ఉత్సాహం చూపుతున్నారు.

అసమ్మతి సమాజపు అట్టడుగు పొరలనుండి, మార్పు ఎగువ నుండి (రాజ్యాధికారంలో ప్రమేయం ద్వారా) వస్తుందంటారు. బుద్ధుడుగానీ, అంబేడ్కర్‌గానీ, అప్పటికే పేరుకొని పోయిఉన్న అసమ్మతికి తమ చైతన్యాన్ని జోడించారు. బౌద్ధం కొంతకాలంపాటు రాజాశ్రయాన్ని పొందింది గానీ, అంబేడ్కర్ ఉద్దేశించిన సమూహాలు ఇంకా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఎప్పటికప్పుడు, కంటి తుడుపు చర్యల ద్వారా పాలకవర్గాలు ఆ సమూహాలను అడ్డుకుంటున్నవి.

గణరాజ్యాలు ప్రోత్సహించిన భిన్నత్వపు తొలిదశలో బౌద్ధాన్ని స్వీకరించిన వ్యక్తులు అప్పటికే సర్వస్వాన్ని త్యజించిన మునులు, సాధువులు, అన్వేషకులు – అలాగే పండితులు, పాలకులు, రాజవంశీకులు, రాజవంశ స్త్రీలు. వీళ్లంతా ధర్మశాస్త్రాలతో, తాత్విక ధోరణులతో అనుబంధం కలిగి ఉన్నవాళ్లు. కొద్ది మినహాయింపులతో, ఈ కథాకాలం నాటికి బౌద్ధం వృత్తికారులనూ, సామాన్యులనూ, పామరులనూ పూర్తిగా చేరుకోలేదు. గణరాజ్యాలు అంతమైన తరువాత ఏర్పడ్డ మొదటి మహా సామ్రాజ్యం మౌర్యులది. అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధానికి విశేషమైన ఆదరణ, వ్యాప్తి లభించడంతో బౌద్ధం సర్వవ్యాపితమైంది; సరిహద్దులను దాటింది.

అశోకుని కాలంలో – అంటే ఎప్పుడైతై సామాన్య జనం పెద్ద సంఖ్యలో బౌద్ధం వైపుగా మళ్లసాగారో, అప్పుడే బ్రాహ్మణవాదులు రానున్న ప్రమాదాన్ని పసిగట్టారు. మౌర్య పాలనని అంతంచేసి, శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్ర  శుంగుడు బ్రాహ్మణుడు. బౌద్ధం మీద కత్తిగట్టాడు. బౌద్ధ క్షేత్రాలపై దాడులు చేశాడు. వేలాదిమంది భిక్షువులను చంపించాడు. అదేకాలంలో మనువాదం పుట్టుకొచ్చింది; పూర్తిస్థాయి సంఘర్షణ మొదలైంది. మనుస్మృతి, పాలకుల భావజాలానికి ప్రాతినిధ్య గ్రంథంగా నిలదొక్కుకుంది. అంబేడ్కర్ మనుస్మృతిని తగులబెట్టాడని మనకు తెలుసు.

బౌద్ధ ధర్మ వ్యాప్తికై ఒక్క యుద్ధంకూడా జరగలేదు గానీ, మనువాద పాలకుల చొరవతో బౌద్ధుల ఊచకోత జరిగింది. శంకరాచార్యుడి నేతృత్వంలో బౌద్ధంపై వ్యవస్థీకృతమైన ఎదురుదాడి జరిగింది. బౌద్ధం పుట్టిన దేశంలోనే అది నశించిపోయింది. వీటన్నింటినీ ఈ కథలో చర్చించే అవకాశంలేదు. బౌద్ధానికి, బౌద్ధగాథలకు గల ప్రాసంగికత, సమకాలీనతలను గుర్తుచేసుకోవడానికే ఈ ప్రస్తావన.

మనదేశానికి సంబంధించి బౌద్ధాన్ని, మరుగున పడిపోయిన బౌద్ధక్షేత్రాలను, పునరుద్ధరించుకోవాల్సిన కాలంలో మనం ఉన్నాం. బౌద్ధాన్ని ఒక ప్రత్యామ్నాయంగా నిలబెట్టుకోవాల్సిన కాలం. డాక్టర్ అంబేద్కర్, బౌద్ధాన్ని స్వీకరించిన కాలం. ఆయన స్ఫూర్తితో లక్షలాదిమంది బౌద్ధ ధర్మం వైపుగా ప్రయాణించిన,  ప్రయాణిస్తున్న కాలం. అందుచేత బౌద్ధాన్ని చర్చకుపెట్టే రచనలకు ప్రాముఖ్యత ఉన్నది. ఇటువంటి రచనలను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.

బౌద్ధాన్ని చర్చకు పెట్టడం అంటే – బౌద్ధ ధర్మాన్ని మనువాద సనాతన ధర్మానికి ఒక ప్రత్యామ్నాయ తాత్విక ఆలోచనగా ప్రవేశపెట్టడం; బౌద్ధ చరిత్రను వాస్తవికతగా చూపించే రచనలను చెయ్యడం; ముఖ్యంగా బౌద్ధాన్ని మొత్తంగా నేటి వర్తమానానికి అన్వయించడం; భవిష్యత్తుకు మార్గదర్శకంగా గుర్తించడం. ఇదీ ఈ కథకుగల సమకాలీనత.

బౌద్ధపు మలిదశనీ, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ ధర్మం వెల్లివిరిసిన యుగాన్నీ, అది నశించి, కనుమరుగైపోయిన ఉదంతాల్నీ, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటూన్న సందర్భాన్నీ లెక్కలేనన్ని కథలుగా, నవలలుగా, నాటకాలుగా మలచవచ్చు. అటువంటి సాహసం చెయ్యగల శక్తి కలిగినవాడుగా శర్మగారు ‘బావరి’ కథ ద్వారా నిరూపించుకున్నారు. అందుకు వారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు!

‘A’ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు. అజు పబ్లికేషన్స్. 208 పేజీలు. వెల రూ. 250/-. ప్రతులకు: అమెజాన్.

*

ఉణుదుర్తి సుధాకర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు