ఎవరి మెప్పుకోసమో కాక మన ప్రమాణాలతో రాయాలన్నాడు కలేకూరి. చాలా గొప్ప మాట. ఏ సందర్భంలో ఆ మాట చెప్పినప్పటికీ ఒక సృజనకారుడికి తాను విశ్వసించిన విషయం పట్ల గల నిజాయితీ గురించిన మాట అది. ఎందుకంటే ప్రమాణాలు ఊరికే గాల్లోంచి పుట్టవు. ఆయా కాలాల్లోంచి, మనుషుల్లోంచి వారి వారి వ్యక్తిత్వాల్లోంచి ఆచరణల్లోంచి పుడతాయి.
అందరూ చెప్పినవన్నీ చేసేయలేరు. చేసినవాళ్ళని చరిత్ర మర్చిపోదు. పేర్ల ఉటంకింపు అనవసరం గానీ తెలుగు సాహిత్యంలో కొత్త రక్తానికెప్పుడూ కొదువ లేదు. నా ఈ మాట ఇప్పటికీ చెల్లించుకుందుకు ‘తిమ్మిరి బిళ్ళలు, తొడపాశాలు’ పుస్తకమే సాక్ష్యం. దీన్ని నేను కవిత్వ సంపుటి అంటే అచ్చేసిన మిత్రులే ఒప్పుకోరు. కనుక నేను సైతం దీన్ని ‘జువ్వల కట్ట’ అనాల్సి రావచ్చు. జువ్వలంటే తారాజువ్వలే. ఏదన్నా ఫంక్షన్లప్పుడు ముందొకతను కొబ్బరి పుల్ల అంచుకు మందుగుండు సామాగ్రి కూర్చిన టపాసును ఒక చేతిలో అగరుబత్తీతో వెలిగించి మరో చేత్తో గాల్లోకి విసురుతాడు. అది ఆకాశంలోకి దూసుకుపోయి ఠాప్ మని పేలుతుంది. కొన్ని సుయ్య్ మని కిందపడిపోతాయ్.
ఈ జువ్వలకి ఒక నియమం అంటూ ఏమీ లేదు. హైకూకి ఉన్నట్టు అక్షర సంఖ్య గానీ పాద నియమం గానీ లేదు. నానీకున్న భావాంశ భేదం లేదు. చమత్కారికలు, అబీబాలు, రెక్కలు, నానోలు, ఏకవాక్య కవితలు ఇలా రూప వైవిధ్యం గల అనేక వచన కవిత్వ విశేషాంశాలు తెలుగు కవిత్వంలో ఉన్నాయి. కనుక ఈ పుస్తకం రాసినవాళ్ళేం పేరు పెట్టినా వీటిని వచన కవితలుగానే భావించాలి. రూప పరంగా ‘మినీ కవిత్వం’ అంటే సరిగ్గా సరిపోవచ్చు. గరిష్టంగా రెండు మూడు కవితలు 7-10 లైన్లున్నాయి తప్ప చాలా వరకూ 4-5 లైన్ల కవితలే ఇందులో ఎక్కువ కనబడతాయి. మినీ కవిత అని ఎందుకన్నానంటే వీటిలో స్పష్టత, క్లుప్తత, వ్యంగ్యం చక్కగా ఇమిడిపోయాయి. ఇవి చదువుతోంటే అలిశెట్టి, కాళోజీ, రావి రంగారావు, ఆసు రాజేంద్ర, జింబో, దేవీప్రియ వంటివారు గుర్తొస్తారు. క్లుప్తంగా చెప్పినప్పుడే పరిమాణం నిర్ణయమవుతుందా ?
గుంటూరు (కమ్మ) కు చెందిన శరత్, గోదావరి (కాపు) కు చెందిన మెట్ల అనే ఇద్దరు యువకవులు ఈ కవితలు రాశారు. ఒకరు కాలి చెప్పుని (శరత్), ఇంకొకరు కళ్ళద్దాల్ని (మెట్ల), సింబాలిక్ గా, సిగ్నేచర్ గా స్వీకరించడం బాగుంది. అంటే ప్రతీ పేజీ కింద ఎవరు ఆ కవిత రాశారో తెలుసుకోవాలంటే ముందు ఈ బొమ్మల్ని మనసులో ముద్రించుకోవాలి. ఎర్ర రంగులో అడ్డంగా కొట్టేసినా వెనుక కవర్ మీద కవుల కుల ప్రస్తావన అనవసరం. ఎందుకంటే కులాన్ని వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తున్న విషయం వాళ్ళ కవిత్వంలో చక్కగా ప్రతిఫలించింది. కులం ఒక్కటే కాదు, పితృస్వామ్యం పైన, స్త్రీత్వం, మతం, మానవ సంబంధాలు, మానవోద్వేగాలు, కాస్తంత వైజ్ఞానికత, ఇంకొంత సామాజిక సిద్దాంతాన్వయం వంటి విషయాలు – ఇలా ఈ పుస్తకం నిండా ఈ ఇద్దరు కవులకున్న సాహిత్య దృక్పధాన్ని మనకు పట్టిస్తాయి. వీళ్ళిద్దరిలో కొంత ఏకసూత్రత ఉంది. అలాగే మరికొంత వైరుధ్యం ఉంది.
ఏకసూత్రత ఏమంటే జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలించడం. వైరుధ్యం ఏమిటంటే ఆ జీవన వాస్తవికతని భిన్నంగా చిత్రించడం. కనుకనే ఈ పుస్తకానికి కొంత విలువ చేకూరింది. శరత్ లో వస్తువుకి అభిముఖంగా నడవగల నేర్పు చాలా గొప్పగా ఉంది. శషబిషలు లేకుండా ఉన్నది ఉన్నట్టు కటువుగా చెప్పడానిక్కూడా వెనుకాడనితనం ఉంది. ‘బలికి పోతును పెంచినట్టు, పందానికి పుంజును పెంచినట్టు ఆడపిల్లను’ అన్నప్పుడో ‘మా వాచ్మెన్ పేరు సుబ్బారావ్ చాలా మర్యాదస్తుడు నిద్ర కూడా చేతులు కట్టుకుని పోతాడు’ లాంటివి రాసినపుడో ఈ కవి కాల్పనికత కన్నా వాస్తవికతకి ప్రాధాన్యం ఇస్తున్నాడని తెలిసిపోతుంది. అలాగే ఇంకొక విషయం.
శరత్ కవిత్వం అర్థం కావాలంటే చరణ్ బొమ్మలు తప్పనిసరి. ఆ బలవంతం మెట్లలో తక్కువ ఉంది. ఎందుకంటే శరత్ కన్నా మెట్ల కవిత్వీకరణ రహస్యం తెలుసుకున్నాడు. ఎలా చెప్పామన్నదానిపై మెట్ల శ్రద్ద అద్వితీయం. ఏం చెప్పామన్న ఎరుక శరత్ సొంతం. కానీ ఇద్దరిలో ఉన్న సెన్సిబిలిటీస్ పాఠకుల్ని తప్పక గిలిగింతలు పెడతాయి. మెట్ల అంటాడు కదా – మురళి కాలేని వెదురు కూడా అంతే గొప్ప అని. శరత్ తోపుడు బండి సాదిక్ ని గుర్తు చేస్తూ – అరడజను అరవై అన్నాడు నవ్వితే నలభై చేస్చ్చాడు అని రాస్తాడు. ఇవి చదివినపుడే వీళ్ళిద్దర్నీ ప్రేమార కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఇద్దరి కవుల్లో శరత్ వస్తువుల్ని అధిక్షేపానికి గురిచేసినంతగా మెట్ల చేయడు. మెట్లది కొంత సౌందర్యతత్వం. సంజీవ్ దేవ్ చెప్పినట్టు మెట్ల వస్తువులో లయ (rhythm) భారస్వామ్యం (balance), అంగసౌష్టవం (proportion) అతనిలో సౌందర్య వివేచనకి కారణమవుతుంది. కనుకనే ఇద్దరి కవిత్వాస్తిత్వాలని వైరుధ్యం కలవి అనగలిగాను.
కుందుర్తిగారు ఆధునిక కవిత్వంలో ఇటీవలి పోకడలు అన్న వ్యాసంలో ‘ప్రయోగానికి విశ్వశ్రేయోదాయక చరమ గమ్యం అంటూ ఉండాలి. ఆ మార్గంలో పోతే ఆ గమ్యం చేరగలమనే విశ్వాసం కవికి ఉండాలి. అయన ప్రజల్లో దాన్ని కలిగించాలి కూడా’ అంటారు (కుందుర్తి వ్యాసాలు). ఈ పుస్తక రచన, ప్రచురణ రెండింటిలోనూ మహ గొప్ప ప్రయోగవాద లక్షణం దాగి ఉంది. ప్రచురణ, లోపలి సారాంశంపై ఖచ్చితంగా అనవసర ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖచిత్రం, లోపలి బొమ్మలు పాఠకుణ్ణి కావల్సినదానికన్నా వేగంగా ఆకర్షిస్తాయి. చరణ్ బొమ్మలు కూడా చాలా బాగుంటాయి. కవిత్వానికి ఆ స్పురద్రూపం ఉండాలన్నది నా ముఖ్యమైన పరిశీలన. కనుక కానీ వాటి సంఖ్య తగ్గించవచ్చు. అయితే కొన్ని బొమ్మల్లేకపోతే కొన్ని కవితల్లేనేలేవు. ఆ కారణం చేత కవి ఆశించదలిచిన ఫలితం రాదు. దీన్ని పరిమితిగానే చూడవలసి ఉంటుంది. ఇక టైటిల్ వెర్సో పేజీని గమనిస్తే అసలు వెర్రి వేయి విధాలని ఎందుకంటారో బోధపడే ఛాన్సు దొరుకుతుంది. Copies : 999+1 ( సిద్దాంతి ఇలాగే రాయమన్నాడు) అని ప్రచురించారు.
ఇలాంటివే మరికొన్ని వ్యాఖ్యలు. బహుశా ఇవి పుస్తకం లోపలికి తీసుకెళ్ళే సరదా ప్రయత్నాలు కావచ్చు. కవర్ మీది అంబేద్కర్, మార్క్సు, చాప్లిన్ బొమ్మలు, కవర్ వెనుకటి ‘రచన ఓ పెద్ద రాజకీయ చర్య’ అన్న మాట ఈ కుర్రాళ్ళ నిబద్దతని వీళ్ళ ప్రయోగవాదాన్ని దాటి చూడనిస్తుంది. సీరియస్ పాఠకుడెవరైనా అదే చూస్తాడు. వీళ్ళ ప్రయోగశీలతలో శక్తిహీనత లేదు. సంచలన తత్వం లేదు. ఆ మేరకు వీళ్ళను అభినందించాలి. దీనికంతటికీ శరత్ మెట్ల కారణం అయి ఉండరు. అంతా మన సిద్దూ చేసి ఉంటాడు. ప్రచురణకర్తగా మొదటి పుస్తకం కదా, ఆ మాత్రం. (అతి) శ్రద్ద తప్పదు. సిద్దూ తెలుగు వాక్యం పట్ల స్పష్టత ఉన్న కుర్రాడు. అందుకే ‘అక్షర దోషాలు, అన్వయదోషాలూ లేని నిఖార్సైన పుస్తకాన్ని చేతిలో పెడతాం’ అన్నాడు మనలో మన మాటగా. ప్రేమగా తొడపాశం పెట్టాలనిపిస్తోంది. పుస్తకం మేకింగ్ అద్భుతం.
ఇక్కడొక మాట చెప్పాలి. తెలుగు కవిత్వంలో వస్తురూప పరిణామాలు నిరంతం జరిగేవే. వాటినెవ్వడూ ఆపజాలడు. ఆచాయ జీవీ సుబ్రమణ్యం గారు ‘మినీ కవిత తన హ్రస్వత్వం చేత కాదు ఆకర్షించింది. ఒక భావాన్ని బలంగా చెప్పడానికి ఒక క్రొత్త వాహికగా అవతరించడం చేతనే ఇంత ఆదరణ పొందింది’ అంటారు. కవిత్వంలో విస్తృతి విసుగు కాదు. అడపా దడపా వాచ్యమూ నేరం కాదు. కవి దర్శించిన విషయం కవితగా కళారూపం పొందే ప్రయాణంలో ఒక విలువను సంపాదించుకుంటుంది. దానికి అతని పోరాట, సాంస్కృతిక నేపథ్యాలు కారణమవుతాయి. అప్పటివరకూ చేసిన అధ్యయనం దోహదకారి అవుతుంది. ఇవన్నీ ఒక దృక్పధాన్ని సూచిస్తాయి. సామాజిక జీవన వ్యూహంలో ఈ కవులు కవిత్వం పట్ల వాళ్ళకున్న ప్రేమ చేత తమని తాము అందుకు తగ్గట్టు తీర్చిదిద్దుకుంటారు. అందుకు వాళ్ళకి కవిత్వ రూపం, సహాయమే చేస్తుంది కానీ అడ్డు రాదని విశ్వాసం.
తిమ్మిరిబిళ్ళలు తొడపాశాలు (కవిత్వం) : శరత్ & మెట్ల, పేజీలు: సంఖ్య వేయలేదు, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
*
Add comment