‘ఆ చెట్టు మీద దెయ్యాలుంటాయి’ అన్నాడు ఆబోతు రమణ.
‘ నీకెలా తెలుసు అన్నాడు నానిబాబు ‘
‘ మాదీ వూరే కదేటి’
‘ ఎన్నుంటాయి ?’
‘ అది నాను సెప్పలేను , ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లో సచ్చినోళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళు అందరూ ఆ ఊడలమర్రి మీదే వుంటారు ‘ అన్నాడు ఆబోతు.
‘ మరిప్పుడేం చేయాలి ?’
‘ మనం మారు మాట్లాడకుండా రన్నింగ్ చేసుకుంటూ ఆ ఊడలమర్రి దాటీయాలి ‘
‘సరే అలాక్కానీ’ అన్నాడు నానిబాబు.
అలా పొద్దున్న ఆ శీతాకాలం చిక్కటి పొగ మంచులో చినముషిడివాడ దాటి పెందుర్తి జంక్షను వరకు చిన్నగా జాగిం గు చేసుకుని వొచ్చేసరికి తెల్లగా తెల్లారింది.
ఈ లోగా దేవరపల్లి వెళుతోన్న ఎడ్లబండ్లు జాయిగా రోడ్డుకి ఎడం ప్రక్కగా ఎలిపోతున్నాయి. వాటి యజమాని ఎడ్లబండి రెండు చక్రాల మధ్య తాళ్లతో చేసిన ఉయ్యాల్లో పడుకొని వున్నాడు,
పురుషోత్తపురం నుంచి కొంచెం కిందకు వెళితే ఎడమవైపు రెయ్యలకంపెనీ వస్తుంది (అబ్భా.. ఒకటే కంపు బే ..) దానికి కొంచెం ముందుకు వెళితే అతి పెద్ద ఊడలమర్రి ఉంటుంది. దాని పక్కనే కొండలమీద నుంచి వొచ్చే గెడ్డ స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తుంది. సింగల్ రోడ్డే కాబట్టి అక్కడ మదుం దిమ్మల మీద కూర్చొని సేదతీరొచ్చు, లేదా దమ్ము కొట్టొచ్చు.
అలాంటి ఊడలమర్రులు గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకు ఉంటానే ఉంటాయి, వాటికి అటూ ఇటూ జొన్న, సజ్జ, రాగి కంకుల పొలాలు.
* * *
రెండో రోజు …
ఆబోతు, నాని బాబు పొద్దున్న నాలుగింటికి జాగింగు మొదలు పెట్టారు పెందుర్తి వరకు.
అలసట వొచ్చి ఆ పాపయ్య రాజు పాలేనికి పురుషోత్తపురానికి మధ్యలో వున్న మదుం మీద కూర్చున్నారు. రోడ్డు మీద నరమానవుడు లేడు. కొంచెంగా పొగ మంచు, జనవరి, ఫిబ్రవరి మాసంలో మామిడి పూత మొదలయ్యే సరికి వొచ్చేస్తాది.
గాలిలో మామిడి పూతతో కూడిన మత్తయిన వాసన.
ఇంతలో ఒక తెల్లటి మంచు ఆకారమున్న దెయ్యం వొచ్చింది. అది అచ్చం చందమామ కథలో వున్నట్లే పొడుగు తోకతో వుంది,
చారడేసి కళ్ళతో అందంగా వుంది, మనుషులకు వున్నట్లే చెవులున్నాయి. ముక్కుంది, నోరుంది, చేతులున్నాయి, కానీ కాళ్ళు ఉండాల్సిన చోట ఒక పొడుగు తోకలా వుంది. అయితే దాని నెత్తి మీద నుంచి ఊడల ఆకారంలో ఊడలు వేలాడుతున్నాయి.
దాన్ని చూసిన ఆబోతు, నానిబాబు బిర్ర బిగుసుకు పోయారు.
‘ ఓస్ .. భయపడకండర్రా, నానేటి సేయను , ఏటీ సేయలేను, మీ పానాలు అసలు తీయలేను, నానే ఊసురో దేవుడా అని ఆ మర్రి సెట్టు, తుమ్మ సెట్టు, పట్టుకోని ఏలాడతన్నాను, నానేటి సేత్తాను, వొల్లకుండా కూకోండి ‘ అంది.
‘ అయినా సరే మా భయాలు మాకుంతాయి కదా ‘ అన్నాడు ఆబోతు రమణ.
‘మీ భయాలు పోవాలంటే మా వియ్యపురాళ్లను పిలుస్తానుండండి ‘ అని అనేసి చటుక్కున మాయమై చిటుక్కున అరడజను దెయ్యాలతో దిగింది.
అమ్మ దీనెన్కమ్మా ఇన్నోటున్నాయా.. రోజూ ఈ దారమ్మటే ఎల్తాము, నిజంగా వీటికి ప్రాణాలు తీసే శక్తి ఉండుంటే ఈ పాటికి మా పీకలు పిసికెయ్యాలి కదా, మెడ జీవాలు కొరికేసి రకతం తాగీయాలి కదా అని ఆలోచిస్తన్నాడు నానిబాబు.
అయితే ఇది చెప్పింది నిజమే అయ్యుంటుంది ఏమీ చెయ్యలేవోమేలే అని నిమ్మళంగా కూర్చున్నాడు.
‘ ఓసోస్ .. అయితే ఇదంతా మీ బంధుగణం అన్నమాట మీ గోలేటో సెప్పండి అన్నాడు ‘ నానిబాబు. అతనికి సిరాకు, తొందర.
ఆబోతు మాత్రం ప్రశాంతంగా వున్నాడు.
అవ్వన్నీ ఆబోతు వైపు చూసి ‘ ఈ బాబు చాలా నిమ్మళంగా, నింపాదిగా వున్నాడు. ఇతనికి చెబుదాం ‘ అన్నాయి మూకుమ్మడిగా.
ఆ సింగల్ రోడ్డు మీద ఏమీ వెళ్ళటం లేదు, చలికాలం వల్ల, పొగమంచు వల్ల ఊర్లు ఇంకా అలికిడి లేదు. రోడ్డుకు ఎడమవైపు రాగులు, సజ్జల, జొన్న చేలున్నాయి. గాలికి ఆ కంకులు అందంగా ఊగుతున్నాయి. ఆ పొగమంచుతో వాటి అందం చెప్పనలవికానంత ఇదిగా వుంది.
‘ మావు భవిశ్యతు నుంచి వొచ్చాము , అంటే భవిశ్యతులో సావబోయే వాటిమన్నమాట, అలాగని మావు మనుసులం కాము’ అంది అందులో ఒక దెయ్యం. దాని నెత్తి మీద చిన్న తాటాకు ఆకారం వుంది.
‘ మీరు మనుషులు కాదని మాకు తెలస్తన్నది గానీ, వివరంగా చెప్పండి ‘ అన్నాడు నానిబాబు చిరాగ్గా.
‘ అదే.. అదే.. రోజూ ఈ దారమ్మట ఎలతన్నారు కాబట్టి, సూడ్డానికి మంచోళ్ళలాగున్నారు కాబట్టి మీకు మా సరిత్ర చెప్పాలనిపించింది బిడ్డల్లారా ‘ ఆందో దెయ్యం, దాని నెత్తి మీద నుంచి చిన్ని ఫౌంటెన్ లాగ నీళ్లు కారుతూ దాని వీపు మీదనుంచి మాయమైపోతున్నాయి.
‘నేను పొలం దెయ్యాన్ని ఇక్కడున్న పొలాలన్నీ హాంఫట్ అయిపోతాయన్నమాట’ అందొకటి దాని చెవులపక్క నుంచి రెండు కంకులు, నాలుగు ఆకులు వేలాడుతున్నాయి.
‘మరి నువ్వో’ అన్నాడు మొహం గంటు పెట్టుకొని చిరాగ్గా వున్న ఒక దెయ్యాన్ని.
‘నేను కమ్మూనిస్టు దెయ్యాన్ని’ అంది అది.
‘బత్తాయిలు, ఆనపకాయలు కమ్యూనిస్టులనే దెయ్యాలనుకొని రానీయటం లేదు కాబట్టి నీ గొడవేంటో చెప్పు ‘ అన్నాడు నానిబాబు .
‘నేను పూర్తిగా చావను, నన్ను ఎప్పటికప్పుడు చంపుతుంటారు.. బతుకుతుంటారు నా పేరు చెప్పుకొని, నాయకులు గా, హోల్ టైమర్లు గా కాలక్షేపం చేస్తుంటారు’ అంది కళ్ళజోడు సవరించుకుని ఒక పుస్తకం చేత్తో పట్టుకొని.
‘హ్మ్మ్..’ అన్నాడు నాని బాబు.
‘ఒకటి రెండు కుటుంబాలు తప్ప ఇక్కడెవరూ కమ్యూనిస్టులు లేరే ?’ అన్నాడు ఆబోతు.
‘రెండు కుటుంబాలు చాలవేటి? వేల జనాన్ని పోగేస్తారు. యూనియన్లు పెడతారు, జనానికి ఇల్లు కట్టుకోడానికి భూములిప్పిస్తారు’ అంది కళ్ళజోడు ఒక చేత్తో కిందకు తీసుకొని.
‘ మనూరంటేనే రౌడీయిజం, ఇక్కడికొచ్చి ఆళ్ళు ఎలా నెగ్గుతారు మాయ్యా ‘ అన్నాడు నానిబాబు ఆబోతుతో.
‘ అన్నీ ఎదుర్కొంటారు, కాకపోతే.. ‘అని ఒక దీర్ఘ నిత్తూర్పు విడిచింది దెయ్యం.
‘హా కాకపోతే ..’అన్నారు ఇద్దరూ.
‘ శ్రామిక జనాలకే పెట్టుబడి దారీ దృక్పధం వొచ్చేస్తది ముందు..ముందు.., జనం ఈళ్లిప్పి చ్చిన భూముల్లో ఇల్లు కట్టుకొని ఎలెక్షన్లలో వీల్లకే వెన్నుపోటు పొడిచి పారేస్తారు.. ఒక ఇంటి స్థలంతో సరిపెట్టుకోక బామ్మర్దికి, ముండగత్తెకి అని బినామీ స్థలాలు సంపాదించి అమ్ముకొని కాలక్షేపం చేస్తారు. ‘
‘అంటే..’ అన్నారు మరోసారి ఇద్దరూ.
కళ్లజోడు కళ్ళకు తగిలించి పుస్తకం మడత పెట్టి ‘ ఏవుంది .. జనాలు కూడా సాటివాడ్ని దోపిడీ చేయడం మొదలెడతారు, అటువంటి ఊరుగా మారుతుంది ఇది ‘ అంది.
ఇంకా ఎక్కువ సేపు ఈ దెయ్యంతో మాట్లాడితే మెంటలొచ్చేలాగుందని ఇంకెవరైనా పరిచయమవ్వాలా అని చూస్తున్నారు ఇద్దరూ.
పరిచయమయినవి కాక మరో మూడు దెయ్యాలు మిగిలిపోయి వున్నాయి.
అయినా సరే కమ్యూనిస్టు దెయ్యం కల్పించుకొని ‘ ప్రభుత్వ వుద్యోగం చేసుకుంటూ భద్రత గా విప్లవం చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడకొస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వైపు,వీళ్ళొక వైపు వుంటారు, బూర్జువా, ఫ్యూడళ్ మత భావాలను ఎలా దైనందిన జీవితంతో సమన్వయం చేసు కోవాలో తెలీక రెంటికీ చెడ్డ రేవడి అవుతారు, ఆ కుటుంబాలన్నీ మెల్లగా సంక్షోభంలో పడిపోతాయి ‘ అని చెప్పి వీళ్ళ వంక తీక్షణంగా చూసింది.
అది చెప్పిన దాంట్లో భాష, భావం, పూర్తిగా అర్ధం కాక వీళ్ళిద్దరూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు ఇలాక్కూడా మాట్లాడతారా అని.
వీళ్ళిలా కొట్టుమిట్టాడుతుంటే ‘విప్లవాన్ని అడ్డుపెట్టుకొని బాగుపడిన వాళ్ళు బాగుపడతారు, కాలక్షేపం చేస్తారు అదే పెందుర్తి కథ’ అని చటుక్కున పాపయ్యరాజు పాలెం ఎదురుగ్గా వున్న చెరువు వైపు మాయమయ్యి పోయింది.
ఇంతలో పోర్టు నుంచి కార్మికులను తీసుకొస్తున్న చుట్ల బస్సు లైట్లు పడటంతో దెయ్యాలన్నీ ఆ వెలుగుకి అక్కడనుంచి జంపయిపోయాయి.
కీచ్.. మని బస్సు ఆగగానే ఖాకీ చొక్కా నిక్కరేసుకొని చుట్టతో, మూడు కప్పుల కారేజీ వున్న వైరు బాగుతో నాయుడొకాయన ఆ జంక్షన్లో దిగి పోగా ఆ బస్సు సబ్బవరం వైపు వెళ్లిపోయింది.
‘మాయ్యా.. మనం కూడా చేసిన జాగింగు చాలు, బాక్సింగు ప్రాక్టీసుకు పురుషోత్తపురం వెళ్ళిపోదాం పదా ‘అని నానిబాబు అనడంతో ఇద్దరూ వెనక్కి వెళ్లిపోయారు.
* * *
మూడో రోజు
అర్ధరాత్రి సింహాచలం కొండలకింద విజనగిరిపాలెం నుంచి కిందకు వున్న మామిడి, జీ డి తోటల్లో బ్యాటరీ లైటు పెట్టుకొని కుందేళ్ళ వేట చేస్తున్నారు ఆ తాటిచెట్లపాలెం నుంచి వొచ్చిన చెంచులు.
దూరం నుంచి చూసిన వాళ్ళకి లైటు మాత్రమే నడుస్తున్నట్టు కనిపిస్తుంది.
ఎక్కడో రాత్రంతా జరుగుతోన్న పరస లోంచి గరివిడి లక్ష్మి పాట మెల్లగా వినిపిస్తోంది.
‘మందలోడా ..మాయలోడా…
అమ్మ తూరుపు ఎల్లాడు, తొంగేరు తెచ్చాడు
ఉత్తరాని కెళ్ళాడు వూరికేమి తెచ్చాడు…
అన్నీ తెచ్చాడు, గుండా కొట్టాడు, గుండా నూరాడు.. డబ్బా కెత్తాడు
మందుమవ్వానే పాట సాగినాడా…. మందలోడా ..మాయలోడా…’
చిత్రమైన గొంతుతో వున్నఆ పాట అలా గాలికి తూరుపు కొండల గాలిలోంచి ఆగి ఆగీ మెల్లగా వినిపిస్తుండగా ..
‘ మాయ్యా..మాయ్యా నాకు నిద్రపట్టడం లేదు మాయ్యా .. ఆ మిగతా దెయ్యాలు కూడా యేటి చెపుతాయో తెలుసుకోవాలనుంది’ వెల్దాము అన్నాడు.
అబోతు రమణ కి అర్ధమైపోయింది నానిబాబుని వొద్దంటే.. ఇంక ఆడు తిరం పరం లేని మనిషిలా అయిపోతాడని తెలిసి ‘ సరే ఉండ్రా ‘ అని ట్రాక్ ప్యాంటు, షూ వేసుకొని బయలుదేరాడు.
అలా ఇద్దరూ పురుషోత్తపురం దాటి పాపయ్యరాజు పాలెం మర్రి చెట్టు దగ్గరకు వొచ్చారు కానీ అక్కడ ఎంతసేపు వెతికినా పొగమంచు దెయ్యాల జాడేమి కనపడలేదు.
‘మాయ్యా మొన్న మనతో ఆఖరున మాటాడిన దెయ్యం ఆ చెరువు వైపు వెళ్ళింది, అక్కడకు వెల్దారేటి’ అన్నాడు.
ఇద్దరూ అక్కడకు చేరుకునేసరికి దెయ్యాలన్నీ చెరువులో తోకలు తడుపుకుంటున్నాయి ఒడ్డునున్న గట్టుమీద కూర్చొని.
‘మాయ్యా మూడు దెయ్యాలు పరిచయమై పోయాయి, నాటి గోడు జె ప్పీసాయి ..ఆ మిగతా మూడింటి సంగతేటో తెలుసుకుంటే గాని నాకు ఉబ్బరం తీరదు ‘ అన్నాడు.
‘నీ సంగతి నాకు తెల్సు కదరా, అందుకే అర్ధరాత్రి కాడ ఈ పితలాటకం’ అన్నాడు ఆబోతు.
‘ రండర్రా గుంటలూ అలా కూకోండి ‘ అందులోది ఒకటి.
ఇవి మొన్నటిలా బాధగా లేవు, ఇవి పూటకో రకంగా ఉంటాయా మా పురుషోత్తపురమోళ్ల లాగ అనుకున్నాడు ఆబోతు.
‘సరే ఆ మిగతా వాటి సంగతి కూడా చెప్పేస్తే మా గుంటడు ప్రశాంతంగా ఉంటాడు ‘ అన్నాడు.
ఐదో దెయ్యం చెప్పడం మొదలు పెట్టింది దాని మొహం నిండా గెడ్డం, కళ్ళజోడు,బట్టతల వున్నాయి అంతవరకు బానే వున్న అది, విషాదంగా ముఖాన్ని మార్చి, గొంతు సవరదీసుకొని, ఒకసారి అందరివైపు చూసి ‘ నేను సమాజ సేవ దెయ్యాన్ని .. నేను కూడా భవిష్యత్తులో సచ్చిపోతాను, నాకు నలుగురు జనాన్ని సూడగానే పూనకం వొచ్చేస్తది, పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అని ప్రతి మీటింగులో నాకు తెలిసిందే, చెప్పిందే.. చెపుతాను, కొత్తవి నేర్చుకోను.. నాదంతా నటన.. నిజానికి నాక్కావల్సింది డబ్బు, అమ్మాయిలు, అవార్డులు. పైకి ఏమీ లేనట్టు ఒద్దన్నట్టు నటిస్తాను, కానీ నాకు అన్నీ కావాలి ఊరకే దొబ్బి తినీడానికి దుప్పిమాంసంతో సహా ‘ అంది.
‘ నువ్వో అపరిచితుడివి అన్నమాట ‘ అన్నాడు నానిబాబు వెటకారంగా.
‘నేను సమాజం కోసం పుట్టాను, సమాజం కోసం బతుకుతాను, సమాజం కోసం సచ్చిపోతాను’ అంది అది కొంచెం మొఖం మాడ్చుకొని.
‘అందుకే ఈ సమాజం నిన్ను సంపేస్తాదా?’ అన్నాడు నానిబాబు.
‘ సమాజం సంపదు… మాకు మేమే చంపుకుంటాము, మాలో మాకే కుళ్ళుమో త్తనము, పనిచేసినట్టు నటిస్తాము, ఒకరికి ఒకరం వెన్నుపోట్లు పొడుచుకొని సచ్చిపోతాము, అప్పటికి జనానికి, గవర్నమెంటుకి మాతో అవసరం కూడా వుండదనుకో.. ఏదో మేమే దే క్కోవాలి ‘ అంది నీరస స్వరంతో.
‘నువ్వెవలు తల్లే ‘ అన్నాడు మొఖమంతా అక్షరాలు వున్న దెయ్యాన్ని పట్టుకొని.
‘నేను ఫోర్త్ ఎస్టేట్ ‘ అంది దెయ్యం కాలు మీద కాలేసుకుని.
‘అంటే? ‘ ‘ అదేనయ్యా .. పత్రికా రంగం’ అందది చిరాగ్గా.
‘ ఏంటి నువ్వు కూడా చచ్చిపోతావా ? మా వేపగుంట లో నిజాయితీ అయిన రిపోర్టర్ వున్నాడు కదా , ఎవరిదైనా వార్త రాస్తే ఒక కిళ్లీ,ఒక యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటాడు ‘ అన్నాడు ఆశ్చర్యంగా.
‘ అవి ఇప్పటి రోజులు నాయనా .. టీలకు, సిగరెట్లకు వార్తలు రాసే రోజులు పోతాయి, భూములు కావాలని తిరుగుతాము, రేషన్ షాపోళ్ళను పరేషాన్ చేస్తాము, మమ్మల్ని చూసి ఇల్లు కట్టుకునే బిల్డర్లు, జనాలు బెంబేలెత్తిపోతారు,ఇప్పుడు నలుగురైదుగురున్న మేము వందమందిమి అవుతాము, పొద్దున్న లెగిసి పిశాచాలు వేటకెళ్లినట్లు వెళతాము. అయితే ఇందులో బతకలేనోళ్ళు తొంబై మంది ఉంటే .. దీన్ని అడ్డుపెట్టుకొని కోటీశ్వరులైనవోల్లు ఇద్దరు ముగ్గురుంటారు , వాళ్ళను చూసి వీళ్ళు అలా అవుదామనుకుంటారు , అలా ఎప్పటికీ అవలేమని తెలుసుకునేలోగా గుండెపోటో, కిడ్నీ జబ్బో వొచ్చి అర్ధాంతరంగా సచ్చిపోతారు ‘ అంది.
‘అయ్యో పాపం ‘ అన్నారిద్దరూ ఒకసారి.
‘ పాపమేముంది ..పాపం.. అప్పటి సమాజం నుంచి వొచ్చిన వికృత శాపం ‘ అందది.
‘ కవిత బాగుంది ‘ అన్నాడు నానిబాబు.
‘థాంక్స్ ‘ అంది ఫోర్త్ ఎస్టేట్ దెయ్యం.
చిట్ట చివరి దెయ్యం ప్రశాంతంగా వుంది.
‘ నేను మానవ సంబంధాల దెయ్యాన్ని అందది ‘
‘ అలాంటివి కూడా ఉంటాయా ?’ అన్నాడు నానిబాబు.
‘ అలాంటివే ఉంటాయి.. ‘ అన్నాడు ఆబోతు రమణ.
‘ నువ్వు చెప్పమ్మా.. నీ సంగతి కూడా వినేస్తే ఇంటికెళ్లి పడుకుంతాను, చలో పక్క దొబ్బేస్తుంది’ అన్నాడు అతను రెండు చేతులు రుద్దుకొని జేబీలో పెట్టుకొని.
‘ చెప్పడానికేమంటాది బిడ్డల్లారా .. నా గోల, నా గోస, నా వేదన. మిరప, టమాటా, సజ్జులు, రాగులు పండే పొలాలు మాయమయిపోయాక, కొండలమీదనుంచి వొచ్చే గెడ్డలు ఆవిరైపోయాక, కొంగలు, పీతి గోరలు, గోరువంకలు, కొండ పావురాలు, చిలకలు, సీతాకోక చిలుకలు, బాపన తూనీగలు అంతరించిపోయాక, రోడ్డు పక్కనున్న తాటితోపులు కిందపడిపోయాక, చెరువులు కప్పెట్టి ఇల్లు కట్టాక ఆ చెరువులే అంతరించి పోయాక,మర్రి చెట్లు నిలువెల్లా కూలిపోయాక, ఇక మనుషుల మధ్య మమతలు, ప్రేమలు కూడా గుడ్డ గుడిసి పోతాయి ‘ అందది.
దాని మాటలకు కాసేపు అక్కడ భయంకరమైన నిశ్శబ్దం.
భవిష్యత్తు తలుచుకొని నానిబాబు నోరెళ్లబెట్టాడు.
ఎవరూ ఏమీ మాటాడకపోవడంతో ‘ మరిక సెలవు కొడకల్లారా, మా బాధ మీకు చెప్పుకున్నాం, మీరు జాగర్త ‘ అని పొగమంచు దెయ్యాలు ఆరూ అడవివరం కొండలవైపు మాయమైపోగా. కమ్యూనిస్టు దెయ్యమొకటి మాత్రం టవును వైపు ఎగురుతూ వెళ్ళిపోయింది.
అవెళ్లి పోయాక నాని బాబు, ఆబోతు రమణ అక్కడే అలా కూర్చుండి పోయారు.
దూరంగా గ్రామ పరస నుంచి ‘ మావో.. కాలిపోతున్నాది .. ఆ.. కాలిపోతున్నాది మావో …. కాలిపోతున్నాది ..’పాట వినిపిస్తోంది.
*
Satirical story
పాపరాజుపాలెం లో పొగమంచు దెయ్యాలు కధ చదివింపజేసింది. దెయ్యాలు గురించి వినటమే కాని,ఎప్పుడు కనలేదు. ఈ కధ చదవటం వల్ల దెయ్యాలు కళ్ళు ముందు కదలాడాయి.