“ఈ దశాబ్దం నాది” అన్న మహాకవి శ్రీశ్రీ కవితా వస్తువులగురించి రాస్తూ “ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం” అన్నారు.
కవిత్వం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఆని ఆలోచిస్తే పుట్టిన బిడ్డ ఏడుపు ఆపేందుకు భాష పుట్టకముందు తల్లి వేసిన వెర్రికేకే మొదటి కవిత్వమై బిడ్డను స్వాంతన పరిచి ఉండాలి. ఆ విధంగా చూస్తే కవిత్వం భాష కంటే ముందే పుట్టింది. అదికవి తల్లి కవితకు మొదటి శ్రోత నవజాత శిశువు.
పురాతన మెసపుటేమియా దక్షణ రాజ్యమైన బాబిలోనియా నగరంలో మట్టి పలకలపై దొరికిన గిల్గమిష్ గాధను మొదటి లిఖిత కవిత్వం గా ప్రపంచం గుర్తించింది. గిల్గమిష్ గాధ కవిత్వరూపంలో నిక్షిప్తం చేయబడింది.
జీవితంపై ప్రేమా, మరణాన్ని జయించే సంకల్పం వస్తువులుగా ఉన్న గిల్గమిష్ గాధ మొదటి లభ్య లిఖిత కవిత్వం. ఇది మొదటిసారి తెలుసుకున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. భావావేశం నుండి వెలువడిన తల్లి వెర్రికేక మొదటి కవిత అయితే మానవజాతి ఆకాంక్షలు మూటగట్టుకున్న గిల్గమిష్ గాధ మొదటి లిఖిత కవితగా మనకు దొరికింది. శ్రీశ్రీ కవిత ‘జయభేరి’ లోని మానవ పరిణామం కళ్ళముందు మెదిలింది.
కవిత్వం రెండు రకాలుగా మనకు కనబడుతోంది. ఒకటి ఆత్మాశ్రయమైతే ఇంకో రకం వస్త్వాశ్రయం. ఈ రెండూ కూడా ఆధునిక మానవ పరిణామ క్రమంలోనే పుట్టాయి.
పాశ్చాత్య లిఖిత సంప్రదాయంలోనూ మనదేశ మౌఖిక సంప్రదాయంలోనూ ఈ రెండు కవితా ధారలూ మనకు కనబడతాయి.
ఆత్మాశ్రయ కవిత్వాన్ని భావ కవిత్వం గానూ వస్త్వాశ్రయ కవిత్వాన్ని భౌతిక వర్ణనల కవిత్వంగా స్థూలంగా చెప్పుకున్నప్పటికీ వస్త్వాశ్రయ కవిత్వం లో కూడా మనం చూసిన వస్తువుల వ్యక్తుల సంఘటనలపట్ల మన ప్రతిస్పందన కూడా అంతర్లీనమై ఉంటుంది.
అందువల్లే మునపటి భాగంలో మనం చెప్పుకున్న Wordsworth అన్నట్టు ‘Emotions reflected in tranquility’ కవిత్వానికి సరి అయిన నిర్వచనం.
లిఖిత కవిత్వం పరిణామ క్రమంలో భాషా బంధాలను తెంచుకుని రాజుల ఆస్థానాలనుండి బయటపడి ప్రజల భాషలోకి వచ్చిన తర్వాత కవిత్వ విస్తృతి పెరిగింది.
తెలుగులో ఆధునిక వస్త్వాశ్రయ కవిత్వం ఇబ్బడిముబ్బడిగా వచ్చినా కవిత్వపు నిడివి మాత్రం చాలామటుకు తక్కువగానే ఉంది. విశ్వంభర, కొయ్యగుర్రం, లాల్ బనో గులామీ ఛోడో, హిందూమహాసముద్రం, రాతి చెయ్యి లాంటి దీర్ఘకవితలు అరుదుగా వచ్చాయి.
తెలుగు ఆధునిక కవితా ప్రస్థానం అంతా ఉద్యమాల ఆలంబనగానే జరిగింది. బాహ్య ప్రపంచపు ప్రకటనకు కవితా రూపాలలో వచ్చిన ప్రతిఫలనాలు కూడా శ్రోతలలో పాఠకులలో గొప్ప అనుభూతులను కలిగించినప్పటికీ వాటిమీద ఉద్యమాల ప్రభావమే బహుళంగా కనబడుతుంది.
తెలుగు గడ్డపై వచ్చిన అనేక ఉద్యమాలు తెలుగు ఆధునిక కవితపై తమ ప్రభావం చూపాయికానీ తెలుగు మహిళా కవులనుండి గత దశాబ్దాలలో వచ్చిన స్త్రీవాద కవిత్వం ఇక్కడి స్త్రీవాద ఉద్యమాలపై చూపిన ప్రభావం అసామాన్యం. తెలుగు సాహిత్యలోకంలోనే కాక వ్యావహారిక భాషా ప్రపంచంలోనూ స్త్రీవాద కవిత్వపు ముద్ర బలంగా ఉంది. వ్యావహారిక భాషలోనూ సాహిత్య భాషలోనూ అసభ్యతకు తావులేని ఒక ప్రజాస్వామిక ప్రభావాన్ని స్త్రీవాద కవిత్వం తేగలిగింది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని కొందరు మహిళా కవులూ రచయితలూ కలిసి ప్రజాస్వామిక వేదికలను ఏర్పాటు చేసుకుని సాహిత్య రంగంలో చేస్తున్న కృషిని మనం చూస్తూనే ఉన్నాం.
ఉదార భావాల వ్యాప్తీ, మహిళలు సామాజిక భాగస్వామ్య దిశలో ముందుకు సాగడం అనేక రంగాలలో స్త్రీల పురోగతీ మనమిప్పుడు చూడగలుగుతున్నాం. దీనికి సహకరించే సాధనాలు ఏమైనప్పటికీ నేడు సాహిత్యంలోనే కాక సామాజిక అభివృద్ధిలోనూ స్త్రీలు భాగాస్వాములవుతున్నారు.
అంత మాత్రాన స్త్రీలపై ఉన్న అణచివేతా, వివిధ రూపాల్లో వివక్షా హింసా తగ్గాయని చెప్పలేం. అవి తమ రూపు మార్చుకున్నాయి అంతే. అయితే మునపటి కన్నా ఇప్పుడు మహిళా స్వరం బలంగా వినిపిస్తోంది. వివిధ స్థాయిల్లో వివిధ రూపాలలో అమలవుతూ ఉన్న వివక్షనూ అణచివేతనూ వాటి మూలాలనూ మరింత స్పష్టంగా చూడగలుగుతున్నారు మహిళా కవులు. వైరుధ్యాలలో తేడాలనూ గుర్తించగలుగుతున్నారు.
ఇటీవల ప్రచురితమైన ఒక కవయిత్రి కవితాసంపుటిలోని ఒక కవితను చూడండి.
“ఆశ్రిత కాదు అపరిచిత కాలేదు
అడుగు తడబడిన ఆలోచన
తటాలున చినుకు
ఒక జ్ఞాపకం తెర తీస్తుంది
తూనీగ రెక్కల్లో దాగిన రహస్యం
రెమ్మరెమ్మకో సందేశం మోస్తుంది
నిన్నటి నిజంలా తెగిన రెక్క
చాచిన చెయ్యిని నిరాశ పరుస్తుంది
జీవితం ఎప్పుడూ ఆకలిగొన్న దాహమే
ద్వజ స్థంబంపై రాలిన పిట్టలా
పైకెగిరిన గుడిగంట యోజనాల
దూరంలో రాలిపోతుంది.
అంగుళం అంగుళం విప్పారిన జలపుష్పం
అత్తిపత్తి సందుల్లో చిక్కుకుపోతుంది
ఒకేసారి పుణ్యవచనం ఆచరించిన చీకటి రహస్యం
నెలవంకను ప్రసవిస్తుందా
అమలిన దేహచాలనంలో
మెరుపుల మరకలు తొంగి చూస్తాయా
పై కవిత మహిళ మనసులోని ద్వైతాన్ని ఆవిష్కరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. తమకు సమాన స్థానం లేని ఒక స్థితిలో స్త్రీలైనా, దళితులైనా, బానిసలైనా ప్రవాసులైనా అనుభవించే స్థితి ఒక్కటే. ఈ కవితలోని చిన్ని చిన్ని దృశ్యాలు అనేకం పరాయితనపు వ్యధను ఆవిష్కరించడం కవి సాధించిన విజయం.
ద్వైతం జీవితంలో భాగమే కానీ బాధ్యులెవరు అనే స్పృహ కవిలో ఉన్నట్లే కవితలోనూ కనబడుతుంది. ఒక ఆరోపణ లేదు నిందా లేదు ఉన్నదల్లా స్థితి పట్ల జాగరూకత మాత్రమే.
(కవిత: అనాశ్రిత. కవి ఊర్మిళ గారి అంగార స్వప్నం సంపుటి నుండి)
*
Add comment