స్వాతంత్య్రానికి పూర్వం వరకు చదువు-సంధ్య అనే నానుడి ఎక్కువ ప్రచారంలో ఉండేది. (ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తూ ఉంటది) తద్వారా విద్య కేవలం బ్రాహ్మణుల సొత్తు అనే అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు తగ్గట్టుగానే మెజారిటీ సమాజం కూడా విద్య బ్రాహ్మణులకు సంబంధించిన అంశంగానే చూసింది. సృజనాత్మక రంగంలోనూ వారిదే పైచేయిగా ఉండింది.
పునర్వికాసోద్యమాలకు పునాదులైన పత్రికారంగం, గ్రంథాలయోద్యమం, గ్రంథమాలలు, సాహిత్య సంస్థల ఏర్పాటు, రచన, ప్రచురణ, పరిష్కరణ, పరిశోధన మొదలు అన్ని స్థాయీల్లో పాఠ్యాంశాల ఎంపిక నుంచి బోధన వరకూ అన్నింటిలోనూ బ్రాహ్మణీయ భావజాలమే ప్రతిఫలించేది. అప్పట్లో చదువుకున్న వారిలో బ్రాహ్మణులు అధికంగా ఉండడంతో ఈ పనులన్నింటిలో వారి ఆధిపత్యమే సాగింది. అట్లా సాహిత్య చరిత్రలన్నీ ఏకధాటిగా వారి ఘనతనే చాటుతూ వచ్చాయి.
ఇట్లాంటి సందర్భంలో 1947కు ముందు బ్రాహ్మణాధిపత్యాన్ని నిలువరిస్తూ ప్రతిభావంతంగా సాహితీ సృజన చేసిన బహుజనులను వెతికి వెలుగు లోకి తీసుకురావాల్సిన అవసరమున్నది. బలహీనంగానే అయినా గొంతు విప్పిన వారిని గుర్తించాలి. ఆధిపత్యాలను ధిక్కరించిన ధీశాలురను గుర్తించి గౌరవించాలి. ఇన్నేండ్లూ ఎలాంటి గౌరవం, గుర్తింపుకు, కనీస ఉటంకింపుకు నోచుకోకుండా పోయిన రచనలను, వాటి ప్రాధాన్యతను, విశిష్టతను వివేచనతో విశ్లేషించి విమర్శ రాసి సాహిత్య చరిత్రలో వాటిని భాగం చేయాలి. సాహిత్యంలో బ్రాహ్మణ గుత్తాధిపత్యాన్ని నిలువరించిన బీసీలూ ఉన్నారని సాక్ష్యాధారాలతో చెప్పుకోవాలి.
నిజానికి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 1950లో వెలువరించిన ‘ఆంధ్ర రచయితలు’ (96మంది రచయితల చరిత్ర), మంత్రిప్రగడ భుజంగరావు 1916లో ప్రచురించిన ‘ఆధునిక కవి జీవితములు’ (232 మంది కవుల చరిత్ర), 1827-1942 మధ్య కాలంలోని సాహిత్య చరిత్రను ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ పేరిట రాసిన కురుగంటి సీతారామభట్టాచార్యులు తదితరులు రాసిన చరిత్రల్లో, ఆ తర్వాత రాయబడ్డ సాహిత్య చరిత్రల్లోనూ బీసీలకు న్యాయమైన స్థానం దక్కలేదు. ఇట్లా కొంత ఉద్దేశ పూర్వకంగా మరికొంత సమాచార రాహిత్యం వల్ల విస్మరణకు గురైన రచయితలను ఇప్పటికైనా వెతికి, వెలుగులోకి తేవాలి. స్మరించుకోవాలి. పరిచయం చేసుకోవాలి. చరిత్రలో వారికి న్యాయంగా దక్కాల్సిన స్థానాన్ని ఖరారు చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఎదురైన సాహితీ సంపన్నుడు, ఆధునిక దృక్పథంతో రచనలు చేసిన మేటి అయ్యనకోట పార్థసారథి శెట్టి.
నెల్లూరు నుంచి మదరాసుకు వలసబోయిన కవయిత్రి కుమ్మరి కులానికి చెందిన మొల్లమాంబ వంశంలో లక్ష్మమ్మ, తిరుమలశెట్టి దంపతులకు 1864లో జన్మించిన అయ్యనకోట పార్థసారథి శెట్టి ఆధునిక కాలంలో అచ్చతెనుగు భాషలో, నిర్వచనంగా ‘సత్యవిజయము’ పేరిట ‘శుద్ధాంధ్ర నిర్వచన హరిశ్చంద్రోపాఖ్యానము’ అనే ఐదాశ్వాసాల కావ్యాన్ని1896లో రాసి 1897లో వెలువరించిండు. బాల బాలికలకు చదువు విలువను బోధిస్తూ ‘కుమారా’ మకుటంతో శతకాలు రాసి ప్రచురించిండు. దీనితో పాటు పదికిపైగా పుస్తకాలు ఆయన కలం నుంచి జాలువారాయి. తొలిదశలో తాను ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తూనే సాహితీ సృజన చేసిండు. ఇంతటి ప్రసిద్ధుడైన కవి గురించి పైన పేర్కొన్న సాహిత్య చరిత్ర గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావన కూడా లేదు. ఒకరిద్దరు ప్రస్తావన చేసి ప్రతిభను విస్మరించిండ్రు.
మదరాసు పెరంబూరుకు దగ్గరలోని రామలింగాపురంలో జన్మించిన అయ్యనకోట పార్థసారథి శెట్టి అక్కడే చదువుకొన్నాడు. మదరాసులో వైద్యవిద్య నభ్యసించి డాక్టర్గా నియమితులయ్యారు. డాక్టర్గా మొదట గోదావరి జిల్లాల్లో పనిచేసిండు. అనంతరం అనంతపురం జిల్లా పెనుగొండలో పనిచేస్తున్న కాలంలో అంటే 1897లో ‘సత్య విజయము’ పేరిట అచ్చతెనుగు కావ్యాన్ని వెలువరించిండు. ఈ పుస్తకాన్ని బళ్ళారిలో డి.వి.కృష్ణన్ అండ్ కంపెనీ వారి రమావిలాస ప్రెస్లో ముద్రిపించారు. ఆ తర్వాత 1968లో మరుపూరు కోదండరామిరెడ్డి ఈ గ్రంథాన్ని పునర్ముద్రించారు. ఈ కావ్యంలోని తొలి పద్యాల్లో నన్నయ, తిక్కన, సోమన, మొల్ల తదితర పూర్వకవులతో పాటు తన కాలపు కందుకూరి వీరేశలింగం మొదలు తన గురువులైన నందిరాజు వీరరాజులను తలుచుకున్నాడు. ఇందులో తన ఇంటిపేరు మొదట గొర్నెపాటి నుంచి వట్టివేళ్ళగా మారిందని చెప్పుకున్నాడు. వట్టివేళ్ళ ఆ తర్వాత తమ పూర్వీకులు బ్రిటీషువారి వద్ద ‘విలాయతి’ ఉద్యోగం కనిగిరి తాలూకాలోని అయ్యనకోట ఊరిలో చేయడంతో తమ ఇంటిపేరు ‘అయ్యనకోట’గా మారినట్లు సత్యవిజయములో చెప్పిండు. తమ తాత ముత్తాతల గురించి, నెల్లూరుతో తమకున్న సంబంధాన్ని కూడా ఇందులో రాసిండు.
1904 ఆ ప్రాంతంలో మదరాసు విశ్వవిద్యాలయం బి.ఎ. విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించినటువంటి ‘సత్య విజయము’ గురించి ఏ సాహిత్య చరిత్రలోనూ సమగ్రంగా రికార్డు చేయలేదు. అంతెందుకు ఆయన రాసిన ఇతర రచనల గురించి కూడా ప్రత్యేకంగా ఎక్కడా పరిశోధనగానీ, పరిశీలన గానీ జరగలేదు. బహుశా ఆయన కులమే ఇందుకు కారణం కావచ్చు. ఆయన స్థానంలో ఏ ఆధిపత్య కులానికి చెందినవారున్నా ఆయనకు చరిత్రలో చిరస్థాయిలో గౌరవం దక్కేది.
నిర్వచనంగా రాసిన ‘సత్య విజయము’లో పేర్కొన్న కొన్ని పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను. ఇవి ఆయన ప్రతిభను, ఆనాటి సాంఘిక విషయాలను తెలుసుకోవడానికి తోడ్పడతాయి.
క. నిద్దంపు టెఱుకఁగను ప
న్నిద్దఱనాళ్వార్లఁగొలిచి నెగడెడియలమా
యద్దంకి తాతాయార్యులఁ
దద్దయుఁ జెన్నారు బత్తిఁదవిలితలంత్మున్
ఉ. కోరికలూడ్పి లోపగఱఁగూల్చి గొనంబులఁదోర్పి నిచ్చలే
పారవెలుంగు పేరెఱుక హాళి మదిన్ నెఱిఁజేర్పి తానయై
పేరిమి మీఱి తన్దలఁచి పేర్కొను వారికిఁ గోర్కె లేయనె
ల్లూరఁ జెలంగు నాతబిసియుక్కరిఁ గొల్చెదషిన్కి సాహెబున్
ఆ. కొలువు మీఁదఁదొల్లి గోదావరి కడనే
లూరనుండ వేడ్కలూరనాకుఁ
గయితలక్కసంబుఁగఱపిన యలనంది
రాజు వీరరాజు రహిందలంతు
క. మున్ను దెనుంగుఁగయీ సరి
మిన్నలనన్నయ నెఱన్న మేటిల్లిన తి
క్కన్నను సోమనఁదెలగన
నన్నువ మొల్లమ్మఁదిదమ్మయన్ మదిఁదలఁతున్
తే. ఇప్పటిక యీ సరుల మఱి మెప్పుఁగన
కందుకూరి వీరేశలింగమున కెరఁగి
పార్వతీశ్వరశాస్త్రికి బత్తి సలిపి
మదిని వేంకటరత్న శర్మను దలంతు
కం. చేరి పెనుగొండబడియయ
వారైనాక యితదిద్ది వఱలించినయా
వారణవరమిలు పేరిటి
కూరత్తాళ్వార్ల మదినిఁగోరి తలంతునన్
క. తెనుఁగు మఱి వేల్పు బాసయుఁ
బెనఁగొనఁగబ్బంబుఁజెప్పఁబేర్కొనుటగునా?
తెనుఁగున్ గయితగ,
నచ్చపుఁదెనుఁగునఁగూర్చినను గాకతీయనిడుడులన్
చ. ఇదివఱకెందరో కయితలేర్పడఁబూని త్రిశంకు పట్టియొ
ప్పిదమగు సుద్దిఁబల్వగల వేలుపు బాస పెనంగఁదెల్గునన్
గుదురుగఁజెప్పి రేనిపుడు కూర్చెదనచ్చ తెనుంగులోనని
బ్బదిగల యావజీరుకతఁ బన్నిన నెన్నినఁ బున్నెమేకదా
గీ. కబ్బ మొనరింపు నేర్పు నాకడను లేమి
తెలిసి తెలిసియు దొరకొంటిదీని నేను
దొరహరిశ్చంద్రు నిజము నిబ్బరముఁగూర్చి
తవులు మదియుబ్బురంబుబ్బి తార్పఁదార్ప
క. లలి‘‘వట్టివేళ్ళ’’యిలువడి
బలుకొనఁదొలిఁగొర్నెపాటి వారన మాపె
ద్దలు వెలయఁగఁగొన్ని తరం
బులు సననటఁగొందఱందుఁబొదలిన బలిమిన్
చ. అలవుననంపవివ్దె మెఱయన్ గడు నేరిచియెందుఁబేరువెం
పులును గరంబు మేటిలిన ప్రోలగు నయ్యనోటఁజొచ్చియ
మ్ముల యలవ వ్విలాతిదొరమ్రోలను జూపిన నాఁటగోలెసే
రలవడనింటి పేరు బిరుదందిరి ‘‘యయ్యనకోట’’ వారనన్
తే. ఆయయనకోట కొలమున నలరఁబాల
కడలిఁబుట్టిన రేవల్గు కరణిఁబైఁడి
వలువదాలుపు కూరిమిల వలనఁబొడమి
తనరఁరెదిరుమలసెట్టి యాతనికి నంత
తే. పుట్టి పెంపొందె నరసింహసెట్టి యతడు
కూర్మి మంగమ బెండ్లిjైు కొలమునెగడఁ
జేయు చెన్నయ్య మఱి నారసింహుఁగాంచి
యంత జక్కినిగాగాఁగ మంగమ్మ చనిన
సీ. చెలఁగి యానరసింహ సెట్టి యచ్చమనంతఁ జేసికొని తిరుమల సెట్టి మఱియు
వేంకటసెట్టి వెనుక వీరాసామి సెట్టినిఁ గాంచ నా దిట్టలందుఁ
దొలుతటి వాఁడయి యలరిన తిరుమల సెట్టి లక్ష్మమ్మను జెట్టిబట్టి
పెరుమాళ్ల సెట్టినప్పిదప రామస్వామి సెట్టిఁబదంపడిఁజెలువు మెఱయ
పార్థసారధి సెట్టి నాఁబరఁగునగునన్నుఁ
బడగయఁగా నేను మును జెన్నపట్టణమునఁ
బుట్టియును వెన్క నెల్లూరబుద్ది తెలిసి
తెనుఁగుఁజదివి యింగ్లీషునఁదేఱి కొంత
తే. పిదప దొరతనపున్ వారి వెజ్జుబడినిఁ
జదివియట వెజ్జనై కొల్వుకుదిరితడవుఁ
దెనుఁగువడనాట నెల్లను దిరిగి యిపుడు
కృష్ణరాయల పెనుగొండ నెసఁగువాడ
సీ. ఏ వేల్పుతుద మొదలెట్టి విన్నాణుల కైన నిట్టట్టననలవికాదు
ఏమేటి బొజ్జలోనిజ్జంగబులు వుట్టి పొనరి మాయును నీటి బుగ్గలట్లు
ఏదంటఁగూర్చిలోనిచ్ఛలూడిచి మేయి దాల్పరుల్ తబుసుమైఁదగుదు రొరిమ
ఏదిట్టతఱిఁబేర నెడమునఁదలఁపునఁగొనమునఁజిక్కక కొఱలు సతము
ఎజ్జగా ప్రోడగిఱికొని యిజ్జగంబు
తానైయే వెండియెల్ల చెయ్దంబులకును
సాకిరిగ మీఱి మాఱుపులేక యెపుడు
వెలయునో యట్టి నిజమైన వేలుపునకు
క. తలఁపూనిపసిఁడి కడుపున్
వలఁతిన్బుట్టించి తొంటిపలుకులనెల్లన్
దెలియంగఁగఱ పిజగములఁ
గలిగింపఁగ నాననిడినకఱి వేల్పునకున్
అయ్యనకోట రాసిన ‘సత్యవిజయము’ పుస్తకాన్ని ఆనాటి పత్రికలు ఆంధ్రప్రకాశిక, శ్రీయాంధ్ర భాషాసంజీవని, శ్రీ అముద్రిత గ్రంథ చింతామణి, ప్రభావతి, శశిలేఖ, వైజయంతి, సత్వసాధని, సన్మార్గబోధిని పత్రికలు, రొద్దం హనుమంతరావు, పంచాంగం దేవరాజ పెరుమాళ్, వేదము వేంకటరాయశాస్త్రి, మచ్చ వెంకటకవి, కోలాచలం శ్రీనివాసరావు, వావిలికొలను సుబ్బారావు, పి.ఎస్.చార్యులు తదితర పండితులు విమర్శ రాసిండ్రు. గ్రంథ నిపుణతను గురించి విమర్శ చేసిండ్రు. (సత్యవిజయము:1897).
1909లో మొదటిసారిగా ప్రచురితమైన నీతిబోధాత్మక ‘కుమార శతకము’ను వావిళ్ల ప్రచురణ సంస్థ 1928లో తమ నీతి శతక సంపుటిలో పునర్ముద్రించింది. దీని గురించి వేదము వేంకటకృష్ణశర్మ ఇట్లా రాసిండు. ‘‘ఇందలి యొక్కొక్క పద్య మొక్కొక్క రత్నమన జెల్లును. పసితనమునఁ బిల్లవాడ్రలవఱచు కొనవలసిన సుగుణములఁ గూర్చియు, విసర్జింవలసిన దుర్గుణములఁగూర్చియు ఈ కవి 83 పద్యములలో వివరించెను. తక్కినవానిలో విద్యను గూర్చి 10, కాలమును గూర్చి 3, వినయమును గూర్చి 3, సత్యము, భూతదయను గూర్చి 1, కర విద్యలను గూర్చి 3, బ్రతుకు తెఱఁగును గూర్చి1, భగవంతుని గూర్చి 3, సర్వజన సమత్వమును గూర్చి 1, రాజుఉ గూర్చి 3, స్వ విసయము గూర్చి 1 కలవు’’ (శతకవాఙ్మయ సర్వస్వము: వేదము వెంకటకృష్ణశర్మ, 1954, పేజి. 408). అందులోని కొన్ని నీతి పద్యాలిలా ఉన్నాయి.
‘‘మిద్దెలపైఁబరుగెత్తకు
మొద్దులు గుఱ్ఱములు బండ్లు నేఁతేర గడున్
సద్దుగలచోట్ల నాడకు
గ్రద్దన నెపుడేని హాని గులుగుఁ గుమారా
కొట్టకు తొండల వెతలం
బెట్టకు పిల్లులను గుక్క పిల్లల నెపుడున్
బట్టకు తూనిగలను నుసి
గొట్టకు కుక్కలను గీగు గూడుఁ గుమారా
సరియీడు పిల్లవాండ్రకు బెంచున్
మరియాదతోడఁ బిలువఁగవలె న
ట్లరియక ‘‘యొరీతురే’’ యని
గరువంబునఁ బిలుచు టురపుగాదు కుమారా
కాలము గడచిన మగుడదు
కాలముకంటెను ధనంబు గలుగదు ధాత్రిన్
ఆల మమూల్యపదార్థము
కాలము గడుపకుము వ్యర్థగతిని కుమారా
వలయములుఁబోగు
లుంగరములు మొదలగు నగల నేల ? మోఁతకుఁగద
సిలఁజేయ నేరవని నిను
వెలలేని విభూషణంబు విద్య కుమారా
దొరలేని దొంగలేనియు
హరియింపఁగలేరు విద్య నది యితరులకున్
విరివిగ నిచ్చినఁదఱుఁగదు
ధర విద్యకు సాటిరాదు ధనము కుమారా
ధనవంతుఁడు తనయింటన్ ఘనతం
గను రాజు వీటఁగాంచును వినుతిన్
సునితుఁడయి యెందు విరివిగఁ
గనుగొనుఁ బండితుండు కీర్తిఁ గలిమి కుమారా
కుమార శతకము ప్రాథమిక స్థాయి విద్యార్థులనుద్దేశించి రాసిండు. దీనికి ఆదరణ బాగా ఉండడంతో ప్రాథిమికోన్నత స్థాయి విద్యార్థుల నుద్దేశించి ప్రత్యేకంగా ‘కుమార నీతి రత్నావళి’ అనే శతకాన్ని రాసిండు. ఇందులో సామాజిక అంతరాలను, సమాజంలో విద్యయొక్క ఆవశ్యకత గురించి రాసిండు. ఇవి రెండూ కంద పద్యాల్లో రాసినవే! ఇందులో తల్లిదండ్రులు, గురువు, దైవము, విద్య, కుమారుడు, స్నేహము, గుణము, సజ్జనుడు, దుర్జనుడు, కోపము, భూతదయ, పశ్చాత్తాపము, మితము, తృప్తి, వినయము, ఉద్యోగము, ధనము, జీవనము, దాతృత్వము, కాలము, సుఖదుఃఖాలు, మతము, స్వాభిమానము తదితర అంశాలపై 212 పద్యాలున్నాయి. 1909 నవంబర్ 27 నాడు ఆ పుస్తకానికి ఇంగ్లీషులో రచయిత రాసుకున్న ముందుమాట ఇలా ఉన్నది.
“The first part of ‘Kumara Sathakam’ published some months age, having been recognised as the suited for infants in the Primary classes, a second part of it for Secondary Classes entitled “Kumara Neethi Rathnavali,” is now published with anticipation of the same kind of indulgement reception now so readily and widely accorded to the first part.
Most of the verses are fully illustrated with apt similes from nature so that the morals contained in them may be well impressed on the minds of the young readers.
Many verses included which speak very disparagingly of mis-directed charity, caste distinction, orthodoxy sectarian animosities conceited Priesthood, and the like which are pre-eminently responsible fot the preset social degeneration of the country and of which the fiery patriot on the platform is quite oblivious in his perforations for a larger share in the administration of the country.”
ఈ నీతి రత్నావళిలో విద్యయొక్క ప్రాధాన్యత గురించి ఇట్లా రాసిండు.
దొరకదు దొంగకుఁజిక్కదు
దరణీపతి కెరియదగ్నిఁ దడియదు నీటన్
బరికింప ద్రవ్యమెదియేన్
ధర విద్యకు సాటి చెప్పఁదగునె? కుమారా
కనకమణీ భూషాదులు
ధనమున్నన్ గలుగు ధనముదలఁగినఁదొలఁగున్
దనువున్నఁదనుక విద్యా
ఘనభూషణ యలంకరించుఁ గాదె? కుమారా
నేరిచిన విద్య నొరులకు
నేరుప నది తేటగిల్లి నెగడున్ గద ప్రా
నీరును దోఁడు కొలదింకిఁ
జేరును గ్రొన్నీరు తేఱి చెలమఁ గుమారా
కులములు మానవ కృతములు
కులభేదములెల్ల వృత్తి గుణసూచకముల్
కుల హైన్య గౌరవంబులఁ
దలఁపక గుణమే గ్రహింపఁదగును గుమారా
జూదంబాడకు మఱి మ
ద్యాదుల రుచిగొనకు వీనియలవున విద్యా
మేదు రధీఘను లెందఱొ
మూదలఁబెంపాఱి చెడిరి ముందు కుమారా
ధర మతములెల్లఁబరమే
శ్వర దివ్య మహాగుణానుభవ దర్శకముల్
పారినిదిలొచ్చది హెచ్చని
యరయక నీమతము విడకు మనుఁగుఁ గుమారా
కలవు మతవిధులు పెక్కులు
సలుపుము సలుపకుము వాని సత్యాహింసా
దిల సద్గుణముల నిడువకు
మిల నెందును బూజ్యతరములివ్వి కుమారా
ఆనాటి పండితవర్గాలతో ఈయనకు ఆత్మీయమైన సంబంధాలుండేవి. పూండ్ల రామకృష్ణయ్య వెలువరించిన ‘అముద్రిత గ్రంథచింతామణి’ పత్రికను అయ్యనకోట ఆర్థికంగా ఆదుకున్నాడు. ఆనారోగ్యం కారణంగా 1908లోనే డాక్టరు ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిండ్రు. పదవీ విరమణ తర్వాత నెల్లూరులోనే మకాం వేసి సాహిత్య సేవలో నిమగ్నులయ్యారు. 1913లో నెల్లూరులో ఉన్న కాలంలోనే తన ఇంటి మేడపైన కిరాయికి ఉంటున్న విశాఖపట్టణం పండితుడు పూడిపెద్ది లింగమూర్తికి అరుదైన ‘హరిహర శతశ్లోకి’ గ్రంథమిచ్చి దానిని ఆయన తెలుగులోకి తర్జుమా చేసి పద్యాలుగా రాసే విధంగా ప్రోత్సహించాడు. ఈ గ్రంథం వెంకటగిరి సంస్థానాధీశులు ప్రచురించారు. పత్రికా సంపాదకులైన కైప సుబ్రహ్మణ్యశర్మ, నెల్లూరులో అప్పుడు అటవీశాఖలో పనిచేస్తున్న దర్భా సుబ్రహ్మణ్య శర్మలతో కలిసి అయ్యనకోట గృహంలో నిత్యం సాహితీ గోష్ఠి జరుగుతూ ఉండేది.
పార్థసారథి పూర్వీకులు విలువిద్యలో శూరులు. అయ్యనకోట అలోపతి వైద్యంలోనే గాదు, ఆయుర్వేద వైద్యంలోనూ దిట్ట. తాను స్వయంగా చర్మరోగ నివారిణి, జ్వరహరిణి, నేత్రఘృతము, కఫకాసహారిణి, శిశు సంజీవని మొదలైన మందులు తయారు చేసి రోగులకు ఇచ్చేవారు. (వాసా ప్రభావతి: తెలుగుసాహిత్యం హరిశ్చంద్రోపాఖ్యానము).
1909లో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు నీతిబోధ చేసే ఉద్దేశ్యంతో ‘కుమార శతకము’ రాసి సొంతంగా ప్రచురించాడు. దీనికి అపారమైన ఆదరణ లభించడంతో ఇదే రీతిలో ప్రాథమికోన్నత విద్యార్థులకు బోధన చేసేందుకు ‘కుమార నీతి రత్నావళి’ పేరిట శతకాన్ని రాసిండు. వెలువరించిండు. దీనితో పాటుగా తనపై తమిళ ప్రభావం అధికంగా ఉండడముతో ‘నమ్మాళ్వారు వైభవము’ గ్రంథాన్ని వచనములో 1910లో వెలువరించాడు. ఇవే గాకుండా ప్రసన్న జన శిరోభూషణము, శ్రీమన్నాద మునీంద్ర చరిత్ర, యమునాచార్య ప్రభావము, రామానుజ విజయము, పుత్రీహితచేడిది అనే గ్రంథాలను రాసి ప్రచురించారు. భారతము (ద్విపద` ఆది, సభా, విరాట,ఉద్యోగ పర్వాలు), పోణిమి మొదలైనవి ఈయన రచనలు. ఈ 11 గ్రంథాలూ ప్రచురితమైనట్టుగా తెలుగు అకాడెమీ ప్రచురించిన ‘ఆధునిక తెలుగు సాహిత్యకోశము’ (1986)లో పేర్కొన్నారు. అయితే ఇవి ఇప్పుడు అందుబాటులో లేవు.
అందరూ ముఖ్యంగా అణగారిన కులాల వారు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని నీతి బోధ చేసిండు. చదువు యొక్క విలువను సామాన్యులు సైతం తెలుసుకునేలా శతకాలు రాసిండు. ఈయన మృతికి ఆంధ్రపత్రిక ఇట్లా నివాళి అర్పించింది.
‘‘ఉపకార వేతన మందిన తర్వాత భారత ప్రబంధమును ద్విపదగా రచింపబూని విరాటపర్వంమంతయు ముగించి ముండిరి. ఇప్పటికి గొన్ని సంత్సరములుగా వీరికి బార్శ్వావాయువు సంభవించుటచే గవితా ప్రయత్నము వదలి విశ్రాంతులై యుండి యీ జూలై మాసారాంభమునందు వారి జన్మస్థానమగు రామలింగాపురముననే పరమపదించిరని వినుట కెంతయు చింతిల్లు చున్నాము.’’ (ఆంధ్రపత్రిక, జూలై, 1918)
జూలై 10, 1918లో తాను పుట్టినూరు చెన్నయ్కి దగ్గరలోని రామలింగాపురంలో తుదిశ్వాస విడిచాడు. కావ్యాలు,శతకాలు, వచన రచనలతో తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన డాక్టర్ అయ్యనకోట పార్థసారథి. ఇప్పటికైనా ఆయన రచనలన్నింటిని సేకరించి ప్రచురించాల్సిన అవసరమున్నది. అరుదైన పుస్తకాలు అచ్చులో అందుబాటులో ఉన్నట్లయితే వాటిని పాఠ్యాంశాలుగా బోధించాలని విశ్వవిద్యాలయ అధ్యాపకుల మీద వత్తిడి తీసుకు రావొచ్చు.
ఒక కుమ్మరి సామాజిక వర్గం నుంచి వచ్చి చదువు పట్ల 150 ఏండ్ల కిందనే శ్రద్ధ చూపించి డాక్టర్గా ఎదగడమంటే గొప్ప అచీవ్మెంట్. డాక్టర్గానే గాకుండా సాహిత్యంలోనూ సమానమైన ప్రతిభతో అచ్చతెనుగులో, నిర్వచనంగా ‘సత్యవిజయము’ పేరిట హరిశ్చంద్రుని కథను రాసిండు. ఇంతటి ప్రతిభావంతుడి గురించి ఇప్పటికైనా తెలుగు సమాజం పట్టించుకొని పీఠంపై కూర్చొబెట్టాల్సిన అవసరమున్నది.
*
గొప్ప పరిశోధన అన్న బీసీ సాహిత్య కారులు ఎందరో విస్మరించబడ్డారు వారందరూ తెలుగు సాహిత్య చరిత్రలోకి ఎక్కవలసిన అవసరం ఉంది మీకు అభినందనలు ధన్యవాదాలు అన్న