తులశ్రీనివాస్ ‘చింతల తొవ్వ’ కవిత్వంతో పలుకుబడుల రారాజుగా దేదీప్య మానంగా వెలుగులీనుతున్న తెలంగాణ కవి. కరోనాకాలంలో కవిగా జన్మించిన శ్రీనివాస్ కు తన కవిత్వమే ఒక యాంటీబయోటిక్. కవిత్వమంటే.. ముఖ్యంగా తెలంగాణ కవిత్వమంటే కేవలం మాండలికమేనా? అనే చర్చ నడుస్తుంది. ప్రపంచంలో ప్రతీభాష సుత మాండలికమేనని గుర్తించాలి. సాహిత్యం ‘భాష’గా గుర్తింపు తెస్తుంది. సంస్కృతి, ఆచారవ్యవహారాలు ‘భాష అభివృద్ధికి పునాదిగా నిలుస్తయి. కొందరు కవులు దుక్కమే రాసి తెలంగాణ కవిత్వమని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో తుల శ్రీనివాస్ కవిత్వంలోని భావోద్వేగ తీవ్రతను కొలిచే ప్రయత్నం చేస్తే ‘వాక్యం రసాత్మకమ్ కావ్యమ్’ లోని కరుణరసం ఎలా కవిత్వమైతదో, అందుకు ఇతర రసాల అనుబంధపు కూర్పు కవితను ఎలా నిలబెట్టగలదో తెలుసుకోవచ్చు.
*
కడుపు తీపి
~
నోట్ల తడి లేనోళ్ళం ఎవరేమన్నా మనకు తగలదు బిడ్డా!
మాసిన నీ లాగుకు
ముసి ముసి నవ్వుల మాసికేస్తరు
కడుపు సించుకుంటే
కాళ్ళ మీద బడేటోళ్ళం ఎవరిమీద కచ్చె మనకెందుకు బిడ్డా!
సాటుంగ సలిబువ్వ గతికినా.. ఎచ్చిర్కాల పాటలయ్యే
గంజి సొక్కాలెన్నో వుంటయి పడ్డాడెప్పుడూ సెద్దోడు కాదు బిడ్డా!
యాడగింత పతార లేనోళ్ళం ఎంత తెలిసినా కుతిక దెర్వకు మన మాటల ఇసమెత్తెనా పలుకుండదు.
ఆశకో… ఆకలికో..
చిన్న పొరపాటు కూడా సేయకు
ఊరకుక్కలన్నీ పీక్కతింటయి మనద్దుల్ల మనముండాలి బిడ్డా!
పోరాని తావుకు పోయి ఇనరానియ్యిన్నప్పుడో, కనరాని కన్నప్పుడో.. గుడ్డగాల్చి మీదేస్తరు
ఒంటి ఊపిరోడివి ఎక్కువెగపొయ్యకు బిడ్డ పేదోడి కోపం పెదవిదాటితే చేటు
నీ ఎదురొమ్ము ఎగపోసినా తలపైకి లేసినా
ఐదువేళ్లు ముడుసుకున్నా
నా మీదొట్టు..
ఆళ్ళ నాయం నాశినం గాను నువ్వు కడుపులున్నప్పుడే
నీ అయ్యను బలిజల్లిండ్రు
కడుపు గాలే పరిస్థితి కన్నా కాట్లెగాల్తనే బాగుంటది బిడ్డా..
ఎన్ని నాగులు ఎంత విషంగక్కినా
ఎరగనట్టే మసలుకో..
ఆళ్ళు మన రాళ్ళెంతగొట్టుకున్నా కడుపులిసం లేనోళ్ళం ఊకున్నా సాలు
ఉసురన్నా సాలు..
*
కేవలం దుక్కం మాత్రమే తెలంగాణ కవిత్వం ఎందుకయ్యింది? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఇక్కడి నేలపై దుక్కాన్ని మాత్రమే పండిస్తున్న చరిత్రను నిలదీయాల్సి ఉంటది. కవి ఎంచుకున్న ‘వస్తువు’ మాత్రమే భావోద్వేగ స్థాయిని నిర్ణయిస్తది. పాఠకుల గుండెతడిని తడిమే ఒకే ఒక్క ఆయుధం – కరుణ రసాత్మక వాక్యం. కవిత్వంలోని ఏయే పాదాలు ఏయే భావోద్వేగాలతో నిండి వున్నాయో ‘టోన్ (Tone) నిర్ణయిస్తది.
I. A రిచర్డ్స్ అనే పాశ్చాత్య విమర్శకుడు రాసిన “Practical criticism” (1929) అనే పుస్తకంలోని ‘The Analysis of a poem ‘ లో టోన్ గురించి చెప్పబడింది. “Four kinds of Meaning’ లో టోన్ అనేది పోయెట్రీ యొక్క నాలుగు అర్థాలలో ఒకటిగా గుర్తించబడింది.
” Tone is the reflection of the poet’s attitude towards his subject, audience and even towards himself. It is the emotional colouring that gives life to the words”
”కడుపుతీపి’ కవితలో తుల శ్రీనివాస్ వాడిన ‘టోన్’ (tone) రకాలు కవిత్వ వాతావరణాన్ని, స్థితిని తెలియజేస్తయి. ” నోట్ల తడిలేనోళ్ళం / ఎవరేమన్నా మనకు తగలదు బిడ్డా!” అన్నప్పుడు బిడ్డా! అనే స్వరంలోని లోగొంతుక ‘సానుభూతి’ని కోరుకుంటది. ‘నోట్ల తడి’ సానుభూతికి కారణమైన పేదరికాన్ని చూపిస్తది. “మాసిన నీలాగుకు / ముసిముసినవ్వుల మాసికేస్తరు” అనే వాక్యంలోని వ్యంగ్యం వెక్కిరింపు ధోరణిని పట్టిస్తది. ఎత్తుగడలోని వాక్యాలు పాఠకులకు ‘వస్తువు’ యొక్క పరిసరాల్ని, జీవితాన్ని పరిచయంచేసి, కవితకు ట్యూన్ అయ్యేట్టు ఒక మూడ్ (mood) ను క్రియేట్ చేయడానికి తోడ్పడుతయి. కడుపు సించుకుంటే కాళ్ళమీద బడటం, పడ్డోడెప్పుడూ సెడ్డోడు కాదు, గుడ్డకాల్చి మీదేసుడు, పేదోడి కోపం పెదవి దాటిదే చేటు వంటివి జన వ్యవహారంలో బాగా నలిగిపోయిన, అరిగిపోయిన పదబంధాలే అయినప్పటికీ జీవిత సారాన్ని ‘జాతీయాలు, సామెతలు, పొడపు కథలు’ రూపంలో ఒక వాక్యంలో సంక్షిప్తీకరించి భావవ్యక్తీకరణకు, భావోద్వేగ తీవ్రతకు మార్గాల్ని సులువు చేసాయని చెప్పొచ్చు.
పలుకబడుల కవులెవరైనా ప్రాథమిక దశలో వీటిని దాటి బైటికి విస్తరించలేరు. అలాంటప్పుడు ‘పదాలు పేర్చు కుంట పోతే కవిత్వం అవ్వదు’ అనుకుంటే జీవితసారాన్ని పొదివి పట్టిన తేనెపట్టు లాంటి పదబంధాల్లో ఇముడ్సుకున్న కవిత్వం – పేర్చిన పదాల మాండలిక వాక్యాల్ని కవిత్వంగా నిలబెడుతయి. ఈ నిలబెట్టే క్రమంలో కవితలో వ్యక్త పరచబడే Tones (టోన్స్) అందుకు ఊపిరి ఊదుతయి. ‘కడుపుతీపి’ కవితలో జరిగిందదే !
కవితను నిర్మించేటప్పుడు సాధారణీకరించటమో, నిర్దిష్టంగా చెప్పటమో ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే సందిగ్ధతకు దారితియ్యదు. రకరకాల భావోద్వేగాల సంయమనం, పరిస్థితుల్ని బట్టి ఎలా నడుచుకోవాలో, ఏవి వ్యక్త పరచాలో, ఏవి అణిచిపెట్టాలో యుద్ధతంత్రాల్ని పిల్లలకు నేర్పిస్తున్నట్లుగా కొనసాగటం గమనించవచ్చు.
‘నువ్వు కడుపులున్నప్పుడే/నీ అయ్యను బలి జల్లిండ్రు” అనేది విచారాన్ని వ్యక్తపరిచే నిర్దిష్టవాక్యం. పాఠకులు ఈ ‘నిర్థిష్ట వాక్యం’ దగ్గర ఆగి మళ్ళీ ఎత్తుగడ నుంచి చదువుకుంటరు. ఫలానా ఇతివృత్తాన్ని ఇతమిద్ధంగా చెప్పకుండా కవితను సాధారణంగా (General) నడిపిస్తున్న క్రమంలో సామూహిక అన్యాయం, హింస అనేవి నిర్థిష్ట వాక్య ప్రస్తావనతో వైయక్తికంగా, నిర్దిష్టంగా (Specific మారింది. బిడ్డా! అనే సంభోదన వైయక్తికమో, సామూహికమో పాఠకులు నిర్ణయించుకుంటరు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ‘గీతాసారం” మదిలోకి రావచ్చు. ఉపదేశించే వాక్యం యథాతథంగానూ, పూరకంగానూ ఎలాగైనా నడిపించే అవకాశం వుంటది.
అంటే కవిత్వంలో వ్యక్తమయ్యే టోన్ (tone) productivity కి బాటలు పర్చవచ్చు. న్యూటన్ మూడోగమన నియమం ప్రకారం ‘చర్యకు ఒక ప్రతిచర్య’ నిజమైతే ఎప్పుడు బద్ధలయితదో తెల్వని అగ్నిపర్వతపు భావోద్వేగం మాగ్మాలా లోలోపలే మసులుతూ వుండొచ్చు. ‘కడపు తీపి’ కవిత అంతర్గతంగా పేలబోయే ‘లావా’ ఉపద్రవపు పరిణామాల్ని అంచనా వేయగల్గుతది. మామూలు వాక్యాల్లో కవితను నిర్మించినప్పటికీ కవితలోని టోన్ (tone) వల్ల అది నిర్మాణాత్మక పట్టితను సమకూర్చుకోగలిగింది. కవి తుల శ్రీనివాస్ మరిన్ని కవిత్వ సంపుటులతో తెలుగు కవిత్వాన్ని సంపద్వంతం చేస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు.
*
తులా శ్రీనివాస్ కవిత్వం లోని తడిని దుఃఖాన్ని వ్యక్తపరిచిన తీరులోనే కవిత్వం ఉందని చెప్పిన మీ విశ్లేషణకు శణార్థుల కవి తులా శ్రీనివాస్ గారికి అభినందనలు
Thank you Anna
Thank you Anna 💞💞
నా ఆత్మను ఆవిష్కరిస్తూనే, కవిత్వం కళగా ఎలా మారుతుందో చెప్పిన విధానం అద్భుతంగా చెప్పావు తమ్ముడూ..
ధన్యవాదాలు తమ్ముడూ.. లవ్ యు సో మచ్..