చూసీ చూడనట్టు, విని విననట్టు నటిస్తారు: కరీముల్లా

తెలుగు మైనారిటీ కవిత్వంలో ఇస్లాంవాద సాహిత్య ఆవిష్కర్తగా,”సాయిబు”దీర్ఘకవిత కావ్యకర్తగా కరీముల్లా సుప్రసిద్ధులు.ముస్లిం  ఉద్యమాన్ని తనదైన కోణం నుండి నడిపిస్తూ పేద ముస్లింల జీవితాలను అక్షరీకరించిన కవి. ముస్లింలపై సాగే పీడన,అణచివేతలపై నిరసన విల్లంబు ఎక్కుపెట్టిన కవి.ప్రఖ్యాత కవి శివసాగర్ చెప్పినట్లు కరీముల్లా కవిత్వం ఓ నిషిద్ధ గీతం.ఈ దేశ కల్లోల సంద్రంలో కరీముల్లా కవిత్వం పోరాడే యుద్ధనౌక.గుంటూరు జిల్లా వినుకొండలో పుట్టి మహాకవి గుర్రం జాషువా సాహిత్య వారసుడిగా,ఈతరం కవిగా తెలుగు కవిత్వంలో ఓ చెరగని సంతకమైన కవి.

మీ కవిత్వ ప్రయాణం ఎలా మొదలైందో చెప్తారా?
–విద్యార్థి దశలోనే కవిత్వం రాసేవాడ్ని.వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో నాయకత్వం వహిస్తూ విస్త్రతంగా పాల్గొంటున్న సందర్భమది.నేను తొలి నుండి పేద,పీడితవర్గాల పక్షపాతిని.ఈ ఆవేదనే కవిత్వమై చిప్పిల్లింది.మా అమ్మ షంషున్నిసా,నాన్న మహబూబ్ గార్ల తోడ్పాటు, పట్టుదల నన్ను విద్యావంతుడ్ని చేసాయి.కాలేజిలో తరుచూ జరిగే డిబేట్స్,సిద్ధాంత చర్చలు నాతో పాటు ఎలా నడిచాయో నా కవిత్వం నాతోపాటు అలానే నడిచింది.
ముస్లిం కవిత్వం వైపు ఎందుకు మరలారో వివరిస్తారా?
–బాబ్రీ మసీదు కూల్చివేత ఒక్కటే నన్ను ముస్లింల గురించి ఆలోచించేలా చేసిందంటే అది పూర్తి నిజం కాదు. పుట్టిన మతం కారణంగా జీవితంలో నేను ఎదుర్కొన్న అనేక చేదు అనుభవాలు,వివక్షతలు,గుజరాత్ మారణకాండ,ముస్లింల చుట్టూ అల్లుకుంటున్న విద్వేష ప్రచారాలు నన్ను ముస్లింల గురించి ఆలోచించేలా చేసాయి.చదువుకున్నోళ్లమే కొద్దిమందిమి.అందులోనూ రాసేవాళ్లం గుప్పెడుమందిమి.మేం కూడా మా సమాజం పడ్తున్న కష్టాలను పట్టించుకోకుండా గోడ మీది పిల్లుల్లా సర్దుకుని బతకడం తప్పనిపించింది.మా మూలాల్ని,కన్నీళ్ళను మేం నిర్వచించుకోవాల్సిందే.అస్థిత్వ వాదులంటారో,మతవాదులంటారో ఏమైనా అనుకోనివ్వండి.మా చుట్టూ అల్లుకుంటున్న కుతంత్రాల చిట్టా విప్పాల్సిందేనని నిర్ణయించుకున్నా.
ఇస్లాంవాదం ఆవిష్కరించడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?మతవాదమని అనేవారికి మీ సమాధానం ఏమిటి?
–ఇస్లాంవాదం మతవాదం కాదు.మేమేమీ ఇస్లాం మతరాజ్యం కోరుకోవటం లేదు.ఈ ఆధునిక యుగంలో మతరాజ్యం అనేది అవివేకుల కల మాత్రమే.భిన్న కులాలు,మతాలు,సంస్క్రుతులకు నిలయమైన దేశం మనది.అన్ని విశ్వాసాల లౌకిక ధనుస్సు ఆవిష్కరించబడ్డ విశాలాకాశం మనది.అభ్యుదయ,విప్లవ సాహిత్యానికి మార్క్సిజం, బహుజన సాహిత్యానికి అంబేడ్కరిజం ఎలా సైద్ధాంతిక, తాత్విక భూమికనిస్తాయో మొత్తం ముస్లిం సాహిత్యానికి ఇస్లాం సైద్ధాంతిక, తాత్విక భూమికగా ఉంటుంది.ఇస్లాంవాద సాహిత్యానికి కేంద్రబిందువు మతం కాదు మనిషే.యూరప్ కేపిటలిజం సృష్టించిన విలయాలైన ప్రపంచీకరణ,సామ్రాజ్యవాదాలను ప్రతిఘటిస్తుంది ఇప్పుడు ముస్లింలు మాత్రమే.దానికి కారణం అల్లాహ్ కు తప్ప మరే బలీయమైన శక్తికి తలవంచరాదన్న మౌలిక విశ్వాసం.ఈ సాంస్కృతిక స్పూర్తిని ఇస్లాంవాదం అందివ్వగలదు.అలాగే ఇస్లాంను దుర్వినియోగం చేసే మతఛాందసుల,మత తీవ్రవాదుల పెత్తనాన్ని అడ్డుకుని ప్రగతిశీల విలువలకు ప్రతీకలుగా ముస్లింలను నిలబెట్టుకోవడం మా సాహిత్య లక్ష్యాలలో భాగమే.నిత్యం ముస్లిం సంస్కృతి ని పరిహసిస్తూ ముస్లింలను చైతన్యవంతుల్ని చేయగలమనే భ్రమల్లో మేం లేం.ఏది సంస్కరణో,ఏది కాదో తెల్సు.పెత్తందారీ శక్తులు ఇస్లాం ఉగ్రవాదమని,ముస్లింలు హింసావాదులని ప్రచారం చేస్తున్నాయి.కానేకాదు ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుందని,ముస్లింలు శాంతి కాముకులని మేం చెప్తున్నాం.ఇది మతవాదమౌతుందా?
మీ సాహిత్య కృషిని గురించి వివరిస్తారా?
–నేనిప్పటివరకూ 22పుస్తకాలు రాసాను.అందులో 14 ముద్రిత పుస్తకాలైతే అందులో రెండుకవితాసంకలనాలు.నా పుస్తకాలు ఆయుధాలు మొలుస్తున్నాయ్,థూ…,గాయసముద్రం,నా రక్తం కారుచౌక,సాయిబు,ఈద్ ముబారక్, ఎదురుమతం,కవిత్వ పుస్తకాలు కాగా కొలిమి సాహిత్య వ్యాసాలు.ఖిబ్లా,కవాతు సంకలనాలు..బదర్(నూతన వచన కవితా ప్రక్రియ,అబాబీలు)పేరుతో వెలువరించాను.Indian Muslim సాయిబు దీర్ఘకవిత ఆంగ్లానువాదం డా.పి రమేష్ నారాయణ చేసారు.సాయిబు,బదర్,ఎదుమతం కన్నడంలో రాబోతున్నాయి.సాయిబు ఉర్దూ అనువాద ప్రయత్నాలు మొదలయ్యాయి.
తెలుగు సాహిత్యంలో ఇస్లామోఫోబియా ఉందని అన్నారు.అదెలాగో చెప్పండి?
–ఇస్లాంవాదం ప్రతిపాదించిన ప్రజాస్వామిక,ప్రగతిశీల విలువలను సాధించిన విజయాలను చర్చించడంలో తెలుగు సాహిత్యలోకం విఫలమయ్యింది.ప్రజాస్వామ్యం, ప్రగతిశీలత పడిగట్టు పదాలుగా మారిపోయాయి.ఇస్లాంవాద సాహిత్యం పట్ల వివక్షత ప్రదర్శించారు. ఇస్లామియా సంస్క్రతీ,సంప్రదాయాలను విమర్శించడమే వీరి దృష్టిలో నిజమైన ముస్లిం కవిత్వం. మేం కూర్చున్న చెట్టుకొమ్మను మా చేతే నరికించే కుతంత్రమిది.మా వేలుతో మా కళ్లనే కుళ్లబొడిపించే నయా చాణుక్యులకు తెలుగు సాహిత్యంలో కొదువే లేదు.మాసాహిత్యం తిరోగమనమని చెప్పేవారు అదేమిటో చర్చించాలి కదా! మా సాహిత్యాన్ని చూసీ చూడనట్టు,విని విననట్టు నటిస్తారు. కొందరి హృదయాలకు సీలు వేయబడిందంతే.ఎవరేమనుకున్నా ఇస్లామోఫోబియాను బద్ధలు చేసే తీరుతాం.
మీ “సాయిబు “దీర్ఘకవిత సంచలనం సృష్టించిన పుస్తకం. దీని గురించి వివరిస్తారా?
–సాయిబు దీర్ఘకవిత అనేకానేక సమున్నత లక్ష్యాలతో రాసాను.అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనాంశంగా ఉంది.ఎంఏ తెలుగు పాఠ్యాంశంగా కొనసాగింది.ఈ దీర్ఘకవితలో ముస్లింల మూలాలు,పేదరికం, ఫాసిజం,అంతర్జాతీయ సామ్రాజ్యవాదం వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించాను.అంతర్గత సంస్కరణల అవసరాన్ని వివరించాను.విశ్వమానవ సౌభ్రాతృత్వంతో ముగించాను.నా సాహిత్య జీవితానికి సంబంధించి సాయిబు దీర్ఘకవిత ఓ గొప్ప మలుపు.నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన కావ్యం.
*

అందుగులపాటి శ్రీనివాసరావు

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కరీముల్లా కవిత్వం చాలా స్పష్టంగా ఉంటుంది. చెప్పాల్సిన విషయం దాపరికం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెపుతారు. చదువుతుంటే ఉతేజం కలుగుతుంది.

  • Thank you Saranga especially my beloved poet and brother AFSAR BHAI
    for publishing my friend and great poet Karimulla sir’s interview.
    He himself declares as a Muslim poet. Every letter of his poetry comes out from his agony about the social economic backwardness of Muslim community.
    He studied Marx and Ambedkar idealogies. He is a true , honest and
    Pride follower of Islam. He is always against the people who uses religion for extremism.
    His pen declared war against fascism and imperialism ,manuvadam and victimization of Muslim community.

    Recently he made an experiment in telugu poetry with his book ” బదర్” .

    ” మతం ఈ గడ్డలో
    రక్త క్షేత్రాన్ని సాగుచేస్తున్న వెర్రిగోడ్డు
    సాకుతోనో , అధికారం వాపుతోనో
    కరీము!
    ముంగిట్లో ముళ్ళున్నాయి. చూసి నడువ్ !

    2. పువ్వుల కోసం ఏడ్చే వాళ్ళున్నారు
    పూత రీకుల కోసం ఏడ్చేవారున్నరు
    నీ కోసం మాట్లాడే వాళ్ళే రి?
    కరీము
    ఎవరి యుద్ధం వారిదే

    The above lines reflects his anguish about victimization of Muslim community.

    But Kavi Karimulla is against religious fundamentalism.
    He is a constitutional personality.
    He is loved by all.

    Thanks to ANDUGULAPATI SRINIVASA RAO garu for his excellent presentation of interview.

  • కరీం భాయ్
    అభినందనలు
    ఎవరు చూసినా చూడకపోయినా
    ఎవరువిన్నా వినకపోయినా
    నిన్ను నువ్వు
    ప్రకటిస్తూనే వుంటావు
    అలానే వుండు

  • “ఈ ఆధునిక యుగంలో మత రాజ్యం అనేది అవివేకుల కల మాత్రమే”! కచ్చితంగా. బాగా చెప్పారు కరీముల్లా భాయ్. ఈ విషయాన్ని విస్తృత జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళ గలిగేది మీవంటి విద్యావంతులే. ప్రగతిశీల శక్తులతో కలిసి ఇందుకు మీ నిరంతర కృషి కొనసాగాలని ఆకాంక్ష.

  • వ్యక్తిగతాంశాలు ఎక్కువ చర్చించిన ముఖాముఖీ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు