పేదలు పెన్షన్లతో సోమరిపోతులవుతున్నారా!

మధ్య వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఏం చేయడు- నెలకు మూడువేలు నిరుద్యోగ భృతి వస్తుంది. కాలుమీద కాలువేసుకుని సమోసాలు తింటూ టీలు సిగరెట్లూ తాగుతూ గడిపేస్తా ఉంటాడు. అమ్మాయికి డ్వాక్రా రుణం వస్తుంది. అమ్మకి వృధ్యాప్య పించను వస్తుంది. ఇట్లా ఒక లిస్టు ఉంటుంది. ఇవి అందుకునే వారు కులాసాగా దిలాసాగా తడిగుడ్డేసుకుని పడుకుని ఉన్నారని ఆక్రోశం ఇందులో ఉంటుంది. అక్రోశం కూడా కరెక్టు పదం కాకపోవచ్చు. అక్కసు అంటే కరెస్టు. అక్కసు బలహీనుడితై అర్థం చేసుకోవచ్చు. ఇది బలహీనుల మీద బలవంతుల అక్కసు. బలవంతుడి ఏడుపు అసహ్యంగా ఉంటది.

వీటి వెనుక ఉన్నదేమిటి?ఉన్నదెవరు?

సమాజం ఒక దశనుంచి మరో దశకు ప్రయాణించి స్థిరపడుతున్న కొద్దీ మధ్యతరగతి పెరిగిపోతా ఉంది. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ప్రయత్నాలు పెరుగుతున్నాయి. నాన్ ఫార్మల్ రంగాలను ఫార్మల్ లోకి తేవడానికి ప్రభుత్వాలు నానా తిప్పలూ పడుతున్నాయి. ఆస్తిపరులకు దెబ్బతగలకుండా ఫార్మలైజ్ చేయడం ఎట్లా అనే తిప్పలు తప్పితే ఇతరత్రా ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. శాలరీడ్ క్లాస్ పెరిగిపోతా ఉంది. నికరంగా టాక్స్ కట్టే సమూహం ఇది. వాస్తవానికి ప్రభుత్వం నడిచేది మా పన్నుల తోనే అని శాలరీడ్ క్లాస్లో కొంత మంది భావిస్తా ఉంటారు. నికరంగా కట్టేది నిజమే కానీ మా పన్నులతోనే అనేది మాత్రం భూతద్దంలోని నిజం. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయమొచ్చేది ఉద్యోగులనుంచి కాదు. ప్రధానమైనది ద్రవాదాయం. అది పెట్రోల్ అయితే ప్రధానంగా కేంద్రం(రాష్ర్ఠం కూడా తనవంతు చిలక్కొట్టుడు కొడుతుంది). మద్యం అయితే ప్రధానంగా రాష్ర్టం. ఏది ఏమయినా వ్యక్తిగతంగా పన్నులు నికరంగా చెల్లించేది మాత్రం ఉద్యోగవర్గమే. సందేహమక్కర్లేదు.  ఈ సమూహంలో అన్ రెస్ట్ కనిపిస్తా ఉంటది. మన పన్నులన్నీ ఎక్కడికెక్కడికో పోతున్నాయి అని. పైగా ప్రభుత్వం పన్నుల శ్లాబ్స్ తగ్గిస్తుందేమో అని కనీసం బేస్ శ్లాబ్ ఎమౌంట్ మారుస్తుందేమో అని కళ్లు కాయలు కాచేట్టు ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. మిగిలిన ప్రధాన పన్నుల్లాగే ఇందులోనూ ఏ మాత్రం తగ్గడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది స్పిల్ ఓవర్ అయిపోయి పేదలమీద కడుపుమంటగా మారుతుంది. హూమన్ డీసెన్సీ లోపించిన చోట వెటకారంగా మారుతుంది.

ఆడికేందిరా ఎయ్యి కాళ్ల జెర్రి అనే మాటకు ఆడికేందిరా దేవుని బిడ్డ అనే మాటకు తేడా ఉంటది. అధికారంపై వెటకారంలో నిస్సహాయత ఉంటుంది. లేదంటే రెబల్ నేచరుంటుంది. నిస్సహాయుల మీద బలహీనుల మీద వెటకారంలో అహంకారముంటుంది. అక్కసుంటుంది. ఆ లాజిక్కుల్లో కొన్ని సార్లు ధర్మముండొచ్చేమో కానీ న్యాయముండదు. ధర్మం ఆధిపత్యంలో ఉన్నవారు స్థిరీకరించిన విలువ. న్యాయం ఆధునిక ప్రజాస్వామ్య విలువ. సానుభూతి సహానుభూతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సేవకులు కూడా మనుషులే, వారిని మంచిగా చూసుకోవాలి అనేది ధర్మం. గాంధీగారి తరహా మాట(గాంధీగారు నాటి స్థితిలో ఆ స్టాండ్ తీసుకోవడానికి ఆయన  స్ర్టాటజికల్ కారణాలు ఆయనకు ఉండొచ్చేమో) సంపద అంటేనే శ్రమ ఫలితం. శ్రామికులకు న్యాయమైన హక్కు ఉంటుంది అనేది మార్క్స్ తరహా మాట. మనదేశంలో కొన్ని సందర్భాల్లో అంబేద్కర్ తరహా మాట కూడా. మొదటిది పైనుంచి కిందికి చూసేది. రెండోది పక్కననుంచొని చూసేది. వాట్స్ అప్ మెసేజ్లకు దీనికి సంబంధమేంటనే ప్రశ్న రావచ్చును. ఉన్నది. పేదలపైన రైతు కూలీలపైనా సానుభూతి ఉన్నవారు కూడా ఇలాంటి మెసేజ్లు పంపిస్తున్నారు. ఇతరత్రా ఆరోగ్యకరంగా కనిపించేవారికి కూడా ఇది సరదాగానే కనిపిస్తున్నదంటే కాస్త లోతుగా చూడాల్సిన విషయమే కదా!

ఈ చౌక బియ్యాలు, పెన్షన్లు, అందుకునే వారు ఎక్కువలో ఎక్కువ పేదలు, పేదల పిల్లలు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో వారు తాగితందనాలాడుతున్నారనేది ఇపుడు వినిపిస్తున్న ఫిర్యాదు. వెయ్యి పదిహేను వందల రూపాయలతో తాగి తందనాలాడేంత చౌకగా జీవితం ఉంటే వేతనజీవులు జీతాలు పెంచమని పదే పదే గొడవపడ్డం దేనికి! కుటుంబంతో ఒక్క సినిమా చూడ్డానికి అంత ఖర్చుపెట్టే క్లాస్ కూడా పేదలపై ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉంటది. ఇంకోవైపున కూడా ఈ వెటకారం ఉంటది. మేమంటే మట్టి పిసుక్కునే వాళ్లం, ఆడికేంది సార్, నౌకరీ. తెల్లచొక్కా ఏసుకుని కుర్చీలో కూర్చునే ఉద్యోగం అని వినిపిస్తా ఉంటది. ఇది కూడా న్యాయమైనదేమీ కాదు. అందరూ ఏదో ఒక ఉత్పత్తిలో పాలుపంచుకుంటారు. పంచుకోవాలి. ఏదీ ఉత్పత్తి చేయకుండా అనుభవించే హక్కు మాత్రం ఎక్కడినుంచి వస్తుంది. మనమేమీ ఆదిమ కాలంలో అడవుల్లో లేము కదా ఆకులు అలుములు కోసుకు తింటానికి. ఒకరి ఉత్పత్తి గొప్పదై పోయి మరొకరి ఉత్పత్తి తక్కువదై పోదు.

పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు పరిష్కారమా, కాదా అనేది వేరే సమస్య. పరిష్కారం కాదు గానీ ఏదో ఒక ఉపశమనం అయితే అవ్వక పోదు కదా! ఆ ఉపశమనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలకు వాటి కారణాలేవో వాటికి ఉంటాయి. హరిత విప్లవం కోస్తాలో తెచ్చిన బియ్యం మిగులు ఉత్పత్తి ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టడానికి ఉపయోగపడింది. ఒక్క దెబ్బతో ఎన్టీఆర్ అటు రైతాంగాన్ని ఇటు పేదలను ఇద్దరినీ లక్ష్యంగా చేసుకుని ఒక్క దెబ్బకు రెండు ప్రయోజనాలు అన్నట్టు వాళ్లనీ వీళ్లనీ ఆకట్టుకోగలిగారు. ప్రధానంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే అనే వాదన ఉండొచ్చును. ఉద్దేశ్యమేదయినా అప్పటిదాకా దేవుని బువ్వ అని ఎక్స్క్లూజివ్ లక్షణంతో సంపన్నులకే పరిమితమైన తెల్లన్నాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఘనతైతే ఆయన కోటాలోకి రాకుండా పోదు. అలాగే ఫీజు రీయెంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అన్నీ ప్రైవేట్ మయమైపోతూ పేద బతుకు విద్య, వైద్యం అనే రెండు బండి చక్రాల కింద నలిగిపోతున్న తరుణంలో ముందుకు వచ్చిన పథకాలివి .ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిన ఇంజనీరింగు కాలేజీలను ఆస్పత్రులను ప్రభుత్వ డబ్బుతో బలపర్చడం అనే లక్ష్యం కూడా ఉండవచ్చును. కానీ అది పేద బిడ్డల కలల వైశాల్యాన్ని పెంచడం అనే పాజిటివ్ ముద్రను వైఎస్ఆర్ నుంచి తీసేయలేదు. హైదరాబాద్ సృష్టిస్తున్న రెవిన్యూ ఎంతో కొంత సంక్షేమం వైపు మళ్లించడానికి కెసిఆర్కు ఇవాళ వెసులుబాటు కల్పిస్తున్నది.

నా పన్నులెక్కడికి పోతున్నాయి?

ఇపుడు ఈ ఇష్యూని ఇంకో కోణంలోంచి చూద్దాం. సమాజంలో మధ్యతరగతి పెరిగే కొద్దీ బలహీనులకిచ్చే సంక్షేమంపై చూపు పెరుగుతూ ఉంటది. ఇవాళ ఇవి వాట్సాప్ ల రూపంలోనే ఉండొచ్చుగానీ కొంతకాలానికి ఇవి బలపడి స్టేట్ మీద ఒత్తిడి తెచ్చేంతగా పెద్దదవుతాయి. ఇప్పటికే ఐనీడ్ టు పే మై బిల్స్ లోకి అందరూ వచ్చేశారు. పల్లె లేదు, పట్నమూ లేదు. బిల్స్ మన జీవితాల్లోకి రంగుల బొమ్మల్లా మెత్తగా చొచ్చుకొచ్చేశాయి. నా పన్నులెక్కడికి పోతున్నాయో నాకు చెప్పాలి అనే పరిభాష ఇపుడిపుడే ఊపిరిపోసుకుంటున్నది. దానికది నేరమేమీ కాదుగానీ తొలి చూపు బలహీనుల మీదే పడతది. అది సులభం. ఇది బలపడబోతున్నది. సంకేతాలు కనిపిస్తున్నాయి.

పశ్చిమ దేశాల్లొ ఇది ఇప్పటికే ఒకస్థాయికి చేరింది. కాకపోతే అక్కడ పాయింటెడ్గా ఉంటది.  సోషల్ సెక్యూరిటీ పెన్షన్లుపొందేవారి మీద నిరంతరం నిఘా ఉంటుంది. యుకెలో సెలబ్రిటీ న్యూస్ వండి వార్చే డెయిలీ మెయిల్ లాంటి రైట్ వింగ్ టాబ్లాయిడ్లు దీనికోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే పెట్టినట్టు అనిపిస్తుంది  ఏఏ పెన్షనర్లు ఎక్కడెక్కడ రిసార్టుల్లో సేద తీరుతున్నారో ఇన్వెస్టిగేట్ చేసి ఫోటోలతో పబ్లిష్ చేస్తా ఉంటది. ఆ పేరుతో మొత్తంగానే సోషల్ సెక్యూరిటీ సిస్టమ్కు వ్యతిరేకమైన వాతావరణం ఏర్పర్చడానికి ప్రయత్నిస్తారు-మనమీడియా గవర్నమెంట్ హాస్పటల్స్ మీద ప్రచారంచేసినట్టు. నిజమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం చేసేవాళ్లున్నారు. కానీ పెన్షన్లతో ఎవరూ పెద్దోళ్లు కాలేరు. వాస్తవానికి సర్కారుసొమ్ముతో బలిసిపోవడం అనేది తొలినించీ ఈ దేశంలో బలవంతులు అవలంబిస్తున్న పద్ధతి. మన దేశ పారిశ్రామిక వర్గం ఎదుగుదల చూసుకున్నా అది స్పష్టంగా తేటతెల్లం అవుతూ ఉంటుంది. ప్రభుత్వాలు తెలిసే ప్రజాధనాన్ని వారి బొక్కసాలకు చేరుస్తా ఉంటాయి. ఇవాళ సంక్షేమం సొమ్మును కూడా అలాగే కాజేయడానికి వారి పన్నాగాలు వారు పన్నుతూనే ఉంటారు. ఎలాగూ రైతాంగ లోన్లు మాఫీ చేస్తారు కాబట్ట ఆ పేరుతో ఈ పేరుతో లక్షలకొద్దీ లోన్లు తీసుకుని మింగేసే తిమింగలాలు ఉన్నాయి. ఫీజు రీ ఎంబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కాలేజీలున్నాయి. వాటిని విమర్శించడం వేరు. మొత్తంగా పేదల మీద సంక్షేమ పథకాల మీద అక్కసు వెళ్లగక్కడం వేరు.

ఈ అక్కసు వెళ్లగక్కేవాళ్లలో ఎక్కువమంది తెలివిగా రైతుబంధు ను మాత్రం పక్కనబెట్టి మిగిలిన విషయాలే మాట్లాడుతుంటరు. ఎందుకంటే వీళ్లలో ఎక్కువమంది రైతాంగ కులాల నుంచి వచ్చినవారే ఉంటారు. ఫస్ట్ జనరేషన్ ఉద్యోగులు కూడా ఉంటారు. సెకెండ్ థర్డ్ జనరేషన్ వస్తే కానీ భూమితో ఎంతో కొంత లంకె తెగిపోదు. తమ తండ్రులో తాతలో ఇంకా వ్యవసాయంలో ఉన్నారు కాబట్టి తొందరపడి అనలేరు. వారిని అనేవారి సంఖ్య  తక్కువ. ఎందుకంటే థర్డ్ జనరేషన్ దాకా ఎదిగిన వాళ్ల సంఖ్య తక్కువ కాబట్టి. నాలుగైదేళ్లలో మరో జనరేషన్ కూడా వచ్చే అవకాశముంది కాబట్టి, మధ్యతరగతి వేతన తరగతి ఇంకా పెరిగే అవకాశముంది కాబట్టి ఇంకా ఈ సంక్షేమ వ్యతిరేకత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేంతగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే  పాపులిస్ట్ స్కీంస్ అని ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ఒక వాదన గొంతు పెంచుకుంటోంది. అది గొంతుచించుకునే రోజు ఎక్కువ దూరంలో లేదు.

పాలకులు ఆస్తిపరులవైపు ఉంటారనేది వాస్తవమే కానీ అది పాతకాలంలో మాదిరి బండగా ఉండదు. ఉండలేదు. కారణాలేమైనా మనం ఎలా అన్వయించుకున్నా ఎన్నికలు కూడా ఒక ఒత్తిడిరూపంగా మారాయనుకున్నా అనుకోకున్నా ప్రభుత్వాలైతే పేదలకు ఎంతో కొంత వెసులుబాటు కల్పించక తప్పని స్థితి నెలకొన్నది.

‘పాతదే కథ’ లో రావిశాస్ర్తిగారు కామందుల నోట ఏం పలికించారు?

‘‘మనం బాగుపడాలంటే కూలివాండ్రు చావనూ చావకూడదు. బతకనూ బతకకూడదు. వారు చస్తే మనకి ఎట్టి లాభమూ సంపాదించే అవకాశము ఉండదు కనుక మన లాభములకు కొంత నష్టము కలిగిననూ వారిని మనం కొంతవరకు కొనవూపిరితో ఉంచవలెను. నూరు రూకల లాభమునకు ఒక రూక ఖర్చయిన మన సొమ్మేమి పోయినది? అందుచేత నేటినుండి వారికి మీరు మనిషికి ఇంత ఎండుగడ్డి, ఇంత(ఉప్పు బద్ద కలిపిన) మంచినీరూ, అని నిర్ణయించి ఇచ్చి వారు చావకుండా చూసుకొనండి! కానీ ఒక్కమాట! ఎప్పుడైనా తప్పనపుడు మరికొంత గడ్డి వేస్తే వెయ్యండి గాని, వారికి ఓనమాలు మాత్రం చెప్పించకండి. ఆది శంకరుడు ఏమి చెప్పెను? గ్నానమార్గమే అసలు మార్గమని అనలేదా అతడు? అందుచేత కూలి జనులకు గ్నానమార్గములన్నీ బందుచేయండి. సెక్సు సినిమాలు చూపించండి. సురాపానము చేయించండి. మరొక రెండు పరకలు పడవేయండి. కానీ గ్నాన దీపాలు వారు వెలిగించుకోకుండా మాత్రం మీరు బహు పరాగ్గా ఉండండి.’’

ఇప్పటికీ అదే, కాకపోతే చిన్న చిన్న మార్పులతో. రావిశాస్ర్తి  రాసింది 1969లో. అప్పటికి కొత్త వ్యవస్థ ఇంతగా బలపడి లేదు. గ్నానము సంగతేమో కానీ కొత్త వ్యవస్థలో కూలీలకు చదువు చెప్పించడం కూడా అవసరమే. వారి జేబులో తగుమేర డబ్బులు ఉండడం కూడా అవసరమే. అవసరం అనే పదం విస్రృతిని పెంచుతూ వారిని గానుగెద్దులు చేసి ఆడించడమూ అవసరమే. కాబట్టి  అది పూర్తిగా పేదలు మాడి మసైపోవాలని అనుకోదు. ఆధునిక వ్యవస్థలో వాళ్లు వినియోగ చట్రంలోకి రాకపోతే మొత్తం కూలిపోద్ది. కానీ ట్రికిల్ డౌన్ పద్ధతి కానివ్వండి. ఎన్నికల కోసం కానివ్వండి ఎంతో కొంత డిస్ట్రిబ్యూట్ చేయక అయితే తప్పదు. సమానత్వం అనకపోతే చాలు, అది మా హక్కు అనకపోతే చాలు, ఇంకాస్త ఇంకాస్త ఇవ్వడానికి వాళ్లకేమీ ఇబ్బంది లేదు.  కాకపోతే అది న్యాయమైన వాటాకాకుండా పరిష్కారమార్గం కాకుండా కేవలం ఉపశమనం రూపంలో మాత్రమే ఉంటుంది. పరిష్కారం వారికి వారు కనుక్కునే లోపు ఉపశమనాలు అందాల్సిందే. అది భిక్షం కాదు. వారి హక్కు. ప్రివిలేజ్ సెక్షన్స్తో పోటీపడే స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మేర ఉపశమనాలు ఉంటే పేదలు తమ బిడ్డల్ని చదివించుకుని కుటుంబాలను నిలపగలుగుతారు. ఈ లోపు ఈ సైంధవ ధ్వనులను గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ వెయ్యి పది హేనొందల పెన్షన్లలో పేదలు దిలాసాగా కులాసాగా కాళ్లుచాపుకుని కూర్చునే సోమరిపోతులయ్యారని రాజ్యం వారిని మేపుతున్నదని వినిపించే ధ్వనులలో సత్యం సున్నా. అది వందశాతం అక్కసే.

క్యాస్ట్ టు క్లాస్

ఈ అక్కసు పూర్తిగా కొత్తదేమీ కాదు. హాస్టళ్లలో ఉండి చదువుకునే వాళ్లను ముఖ్యంగా దళితులను వాళ్లకేంరా దేవుని బిడ్డలు అని ఆడిపోసుకోవడం చూసున్నాం. మండల్ కమిషన్ టైంలో చాలా చర్చే నడిచింది. కాకపోతే అపుడంతా కొన్ని కులాలపై కొన్ని కులాల అక్కసు లాగా ఉండేది. ఇపుడు అది క్లాస్ రూపం తీసుకుంటోంది. మొన్నటిదాకా రిజర్వేషన్లను ఆడిపోసుకున్నకులాలు దేశవ్యాప్తంగా ఇవాళ అదే రిజర్వేషన్ల కోసం రోడ్డున పడడం ఒక సంకేతం. కులం దానికదిగా ప్రివిలేజ్ ఇచ్చే లక్షణం బలహీనమవుతున్నది అనేది అదిచ్చే సంకేతం. దీనర్థం కులం ప్రాధాన్యం పోయిందని కాదు. కేవలం కులంతోనే ఆధిక్యం చూపించే ప్రివిలేజ్ ఏరియా తరిగిపోతున్నది. కింది కులాలు చదువుల వల్ల ఉద్యోగాల వల్ల పైకి చేరి సవాల్ చేసే స్థాయికి చేరుకుంటున్నందున ప్రివిలేజ్ పొజిషన్ ను కోల్పోతున్న పాత కామందులు చేస్తున్న గొడవ దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నది. దక్షిణాదితో పోల్చినపుడు ఆధిపత్య కులాలు ఫిజికల్ లేబర్లో ఎక్కువగా ఉన్న ఉత్తరాదిన ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవస్థ మన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా కదలబారుతున్నది.

ఇవాళ వాట్సాప్లో ప్రచారమవుతున్న అక్కసు పూర్తిగా కూలీలపై మిడిల్ క్లాస్ వేతనవర్గంలోని కొందరి అక్కసు. అది కేవలం కులపరమైన అక్కసు కాదు. ఈ మార్పును అర్థం చేసుకోవడం అవసరం. ఇది ఇక్కడ ఆగేది కాదు. వర్కింగ్ క్లాస్లో ఒక చిన్న సెక్షన్ను ఆస్తిపరులుగా మార్చిన ప్రభుత్వాలు వారు ఆస్తిలేని వారిమీద ఎగబడుతుంటే వినోదం చూడబోతాయి. మనం మరింత సంక్లిష్ట సన్నివేశాలను చూడబోతున్నాం. కంగాళీ వాతావరణాన్ని చూడబోతున్నాం.

జీ.ఎస్. రామ్మోహన్

2 comments

Leave a Reply to Johnson Choragudi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • టైమ్లీ ఎటెంప్ట్!
    పనిలో పనిగా
    ‘నరేగా’ ను కూడా స్టోరీలో
    రోపిన్ చేసి ఉండాల్సింది.
    దాని మీద మరొకటి
    రాయండి.

  • శ్రామికుల న్యాయమైన హక్కు, సోషల్ సెక్యూరిటీ, పేదల సంక్షేమ పథకాలు పరిష్కారమా , వ్యవస్థ లోని ఆధిపత్య వర్గం, మొన్నటిదాకా రిజర్వేషన్లను ఆడిపోసుకున్నకులాలు దేశవ్యాప్తంగా ఇవాళ అదే రిజర్వేషన్ల కోసం రోడ్డున పడడం, బలహీనుల మీద బలవంతుల అక్కసు – – – అంటూ గళం విప్పిన ప్రియమైన శ్రీ జి ఎస్ రామ్మోహన్ గారు! మీ అభ్యుదయ గళం సారంగలో మళ్లీ ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూస్తున్న మేము మీకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము.

    G.S. Rammohan garu! Nobel Laureate Prof. Amartya Sen ( Professor of Economics and Philosophy at Harvard University ) said this in one of his interviews which is relevant to this topic :

    “ India is the only country in the world which is trying to become a global economic power with an uneducated and unhealthy labour force. It’s never been done before, and never will be done in the future either. There is a reason why Europe went for universal education, and so did America. Japan, after the Meiji restoration in 1868, wanted to get full literate in 40 years and they did. So did South Korea after the war, and Taiwan, Hong Kong, Singapore and China.

    The whole idea that you could somehow separate out the process of economic growth from the quality of the labour force is a mistake against which Adam Smith warned in 1776. It’s an ancient danger, and he might have been right to think that the British government at the time did not pay sufficient interest in basic education for all. Unfortunately that applies today to government of India as well. It doesn’t acknowledge the relevance of the quality of human labour.

    There was a reason why someone as intensely keen on the market economy as Adam Smith ( Nobel Prize winner Angus Deaton ) thought the government has to make the country fully literate, this is something the government can do.

    India is trying to be different from America, Europe, Japan, Korea, Hong Kong, Singapore, Taiwan, Singapore, China – all of them. This is not good way of thinking of economics.

    But you have to recognise that if the Chinese decide that things are going wrong they can make changes quickly. In 1979 they privatised the agriculture with enormous success. China in the 1980s grew faster in agriculture than any country has ever grown. And they privatised quite a lot of other industries with great success. But they also eliminated universal health insurance for all, by simply abolishing the thing, and the Chinese health progress faltered. In fact between 1979 and 2004 India steadily reduced the gap between itself and China in terms of life expectancy.

    The Chinese recognised the issue around 2002. By 2004 they had changed it. By 2009 they could bring in a scheme of universal healthcare and by 2012 they are well in the 90s in terms of percentage coverage of health insurance. China is able to do that if ten people at the top are persuaded.

    So if there is a famine threatening, India could stop it straight away. If there is the threat that a cyclone in the Bay of Bengal would kill a million people, they can move two million people away from the coast because all the Indian apparatus comes into force. But if you want to change the system, spend more money in state schools, state hospitals, provide health coverage for all, that requires convincing the people. The rhetoric has been so badly distorted in India that most vocal Indians – which tend to be upper classes – don’t even recognise how bad the healthcare is for the bulk of the Indian population.

    So I have never wavered my faith in democracy as the most stable way of doing things, on the other hand – are there big changes in which the non-democratic system of China can bring about much more quickly? Yes.

    Look at Kerala’s policy for universal education and universal healthcare. The Communist Party first come into office in 1957, they declared their policy in 1960. Kerala was the third poorest state in India then. How could they afford it? I said it is feasible because you need far less money than you would need in, say, Britain to provide that level of healthcare and education. This argument is not very sophisticated but on the other hand it could make a dramatic difference between life and death.

    The welfare scheme policies would also stimulate economic growth and development. In the latest round of national sample survey, if you put the urban and rural together, Kerala has now the highest per capita income in the whole of India.

    But the fact that a people-friendly education and health policy could make a difference, not only to their lives – which happened immediately, life expectancy shot up in Kerala straight away – but also ultimately on economic growth “

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు