ఉత్తరాది కన్నా  దక్షిణాది మెరుగ్గా వుందా?

ఇలాంటి  పుస్తకాలను ప్రచురించి, చదివించడం చేయడం ద్వారానే  అధిక సంఖ్యాకులయిన ప్రజానీకాన్ని  మన  రాజ్యాంగం, హక్కులు,  ప్రభుత్వ  విభాగాలు, వాటి బాధ్యతలు, ప్రజల బాధ్యతలు లాంటి విషయాల్లో నేరుగా చర్చలో పాల్గొనేలా చేయగలం.  

ఇద్దరు పిల్లల్ని పోల్చండి, ఒకరు ఉత్తరాదిన పుట్టిన పిల్ల, రెండవది దక్షిణాదిన పుట్టిన పిల్ల.

దక్షిణాదిన పుట్టిన పాప తన మొదటి సంవత్సరంలోనే చనిపోయే అవకాశం తక్కువ. ప్రసవ సమయంలో తన తల్లిని కోల్పోయే అవకాశం కూడా తక్కువ.  మెరుగయిన పోషకాలు ఆ పాపకి దొరికే అవకాశం ఎక్కువ.

ఆ దక్షిణాది పిల్ల బడికి వెళ్ళే అవకాశం, అక్కడ కాస్త ఎక్కువకాలం చదువుకునే అవకాశం ఉంది. బహుశా కాలేజీకి వెళ్ళవచ్చు.  ఉత్తరాదిన పుట్టిన పిల్లలతో పోలిస్తే ఈ పిల్లకి వ్యవసాయం లాంటి పనిలో కూడా అవకాశం దొరకవచ్చు.  కాస్త మెరుగయిన సంపాదనే దొరికే ఏదో ఒక ఉద్యోగం కూడా తను ఆశించవచ్చు.

ఈ దక్షిణాది పిల్ల పెద్దదయ్యాక తక్కువ మంది పిల్లల్ని కనే అవకాశం ఎక్కువ.  మళ్లీ ఆమె పిల్లలు తనకంటే మరింత ఆరోగ్యంగానూ, మరింత చదువుకున్న వాళ్ళుగానూ తయారవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే, దక్షిణాదిన పుట్టిన పిల్ల ఉత్తరాదిన పుట్టిన పిల్ల కన్నా మరింత ఆరోగ్యంగా, మరింత ఆర్థిక స్తోమతతో, మరింత భద్ర జీవితం  గడుపుతుంది.

ఎందుకు ఉత్తరాది కన్నా  దక్షిణాది ఇంత మెరుగ్గా ఉంది? ఈ  అంతరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

తన వాదనా పటిమతో డేటా సైంటిస్ట్ శ్రీ నీలకంఠన్ ఆర్.ఎస్  దక్షిణాది రాష్ట్రాలు, దేశంలోని ఇతర  రాష్ట్రాల కన్నా ఇంత మెరుగయిన స్థితికి ఎలా, ఎందుకు చేరుకున్నాయో   సొదాహరణంగా వివరించారు ఈ పుస్తకంలో.  ఈ స్థితిలో ఉన్న దేశం,  రోజు రోజుకీ కేంద్రీకృతమవుతున్న భారత వ్యవస్థ కారణంగా ఎలాంటి పరిణామాలని ఎదుర్కుంటున్నదో, ఎదుర్కోబోతున్నదో కూడా ఆయన ఈ పుస్తకంలో వివరించారు.

విద్యా, వైద్య, ఆర్థిక రంగాలలో  ఆ రాష్ట్రాలు సాధించిన విజయాలు ఏవిధంగా పాలకుల విధాన పరమయిన నిర్ణయాల కారణంగా ప్రతిబంధకాలవుతున్నాయో వివరించారు. ఆరకంగా  దక్షిణాది రాష్ట్రాలు ఎలాంటి సంక్లిష్టమయిన  సమస్యల్ని  ఎదుర్కుంటున్నాయో మనకి తెలుస్తుంది.  ఉదాహరణకి,   దక్షిణాది రాష్ట్రాలు, అవి  సాధించిన జనాభా నియంత్రణ కారణంగా తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కొంత కోల్పోవాల్సి రావచ్చు.  ఈ ప్రాంతం ఇలాంటి అన్యాయాలని ఎలా తట్టుకోగలదు?

ఈ రోజున భారతదేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలుని అర్థం చేసుకోవాలంటే, విస్మయం కలిగించే, ఇబ్బంది పెట్టే  సమాచారంతో నిండి ఉన్న ఈ పుస్తకం ‘ఉత్తర దక్షిణాలు’ తప్పని సరిగా చదవవలసిందే.

తెలుగులో నాన్-ఫిక్షన్ రచనలు తక్కువ.  ఉన్నవి కూడా చాలా వరకు ఆత్మకథలు లేదా జీవిత కథలు.  కొన్ని వ్యక్తిత్వ వికాస రచనలూ, భక్తి రచనలూ కూడా చూస్తాం. రాజకీయ పార్టీల సిద్ధాంత రచనలు కూడా ఉంటాయి.  వెతికి చూస్తే మరికొన్ని విభాగాలు కూడా కనపడవచ్చు.

కానీ సాంకేతిక, సామాజిక, వ్యవస్థల మీద సమాచారం (డేటా)  ఆధారంగా తెలుగులో వచ్చే రచనలు తక్కువ.   ఎందుకంటే కాలేజీలో భాష కాకుండా మరే  సబ్జెక్ట్  అయినా ఈరోజున చదువుకునేది ఇంగ్లీషు మీడియంలోనే.   అలాగని కాలేజీ పుస్తకాలు కాకుండా సాధారణ విషయాలకి సంబంధించిన పుస్తకాలు ఆంగ్లంలో చదవగల సామర్థ్యం ఎంతమంది  పట్టాభద్రుల్లో ఉన్నదనేది సందేహాస్పదమే.  అందుకే సామాజిక విషయ పరిజ్ఞానానికి  ఇప్పుడు కొందరు చదువుకున్న వాళ్ళు యుట్యూబ్ లో తెలుగులో చేస్తున్న వీడియోలే ప్రధాన వనరు అయింది.   ఆ శూన్యతని భర్తీ చేయాలంటే తెలుగులో అన్ని విభాగాలకీ చెందిన పుస్తకాలు రావడం అవసరం.

ఈ పుస్తకాలలో వాడే (వాడాల్సిన) భాషకూడా కొద్దిగా బిన్నంగా ఉంటుంది.  మెల్లి, మెల్లిగా ఈలాంటి  పుస్తకాలను ప్రచురించి, చదివించడం చేయడం ద్వారానే  అధిక సంఖ్యాకులయిన ప్రజానీకాన్ని  మన  రాజ్యాంగం, హక్కులు,  ప్రభుత్వ  విభాగాలు, వాటి బాధ్యతలు, ప్రజల బాధ్యతలు లాంటి విషయాల్లో నేరుగా చర్చలో పాల్గొనేలా చేయగలం.

ఓ వ్యక్తి,  కులం, ప్రాంతం ఆధారంగా మాత్రమే నడుస్తున రాజకీయ వ్యాఖ్యానాలని  విధాన పరమయిన చర్చలుగా మార్చాలంటే ఇది తప్పనిసరి అనే నమ్మకంతో అనువదించి ప్రచురించిన సాహసం ఈ పుస్తకం.

*

అక్కిరాజు భట్టిప్రోలు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.